మునుపటి నా మాట
అను - అనే ఉపసర్గ పోలిక, సామీప్యము, సహార్థము, తరువాత అనే అర్థాలు సూచిస్తుంది. అనుకరణము- అనువాదము, అనుసరణము –ఇలా ఒక్కొక్క పదం ముందుగా ఉన్న ‘అసలు’ అనే మూల పదార్ధానికి తరువాత వచ్చే ‘నకలు’ అనే భావమే వ్యక్తం చేస్తుంది. మండే వేసవిలో కొమ్మల చాటునుండే కోయిల రెండే సెకండ్లు ‘కూ కూ’ అనగానే ఎక్కడ లేని ఉత్సాహంతో మనం కూడా ‘ కూ కూ’ అని బదులు పలుకుతాం. అలా అనుకరణ ప్రారంభమౌతుంది. కవిగా దేవులపల్లి వారు షెల్లీ, కీట్స్ వంటి మహాను ‘భావ’ కవిత్వాన్ని తేట తేట తెలుగు మాటలతో తన దైన శైలితో మనకు పరిచయం చేయడమే మనకు తెలుసు. ఆయన కవిత్వాన్నే కాక ఆయనకుండే గిరజాల జుట్టును కూడా అనుసరించి అనుకరించిన కవులుండే వారట ఆ రోజుల్లో. నచ్చే ‘అసలు’ ఉన్న చోట మెచ్చే ‘నకళ్ళు’రావడం నిజం. అసలు-ఏక వచనం. నకలు-నిత్య బహు వచనం. జల సూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి తనకు నచ్చిన ప్రతి తెలుగు పద్యానికి‘పేరడీ’ అద్భుతంగా రాసి ‘పేరడీ శాస్త్రి’ గా పేరు పొందారు. ఆయన చూపించిన బాటలో ఈనాడు కూడా సినీ గీతాలకి ‘పేరడీలు’ తయారవుతున్నాయి. ‘నన్ను వదలి నీవు పోలేవులే’ అనే పాటకి ‘గుండు మీద పిలక ఉంటుందిలే’ అన్న రాయచోటి (ముంబై ) వారి పేరడీ చక్కగా కుదిరింది.
అనువాదాల విషయానికొస్తే - రవీంద్రుని ‘గీతాంజలి’ గేయ కావ్యాన్ని, ఒమర్ ఖయ్యాం రుబాయీలని తెలుగులో అనువదించి గుడిపాటి వెంకటాచలం (చెలం గారు) ఆ ఇద్దరూ తెలుగువారేనేమో అనే భ్రమ కలిగించారు. చక్రపాణి బెంగాలీ మేధావి శరచ్చంద్ర ఛటోపాధ్యాయ రచనలని తేట తెలుగులో తిరగ రాసి ఇప్పటి భాషలో చెప్పాలంటే ‘ఇరగ దీసారు’. ఏ రంగంలో ఉన్న వారికైనా సరే అనుకరణ, అనుసరణ అనేది తప్పనిసరి అనండీ లేదా కంపల్సరీ అనండీ ఒక ప్రతి-క్రియ. ఎటొచ్చీ అందర్నీ అలరించేదీ ఆహ్లాద పరిచేది సినిమా రంగమే కనుక వెంటనే అందరి దృష్టీ దాని పైన పడుతుంది. తెరమీద నటుడి లేక నటి హావాభావాలు, కదలికలు ఎక్కడో ఎవరివో చూసినట్టే అనిపించడం సహజం. భానుమతిస్వయంగా చెప్పుకున్నారు- తను‘స్వర్గ సీమ’ చిత్రం (1945) లో వేయవలసి వచ్చిన ఒక విభిన్నమైన పాత్రకి రీటా హేవర్త్ నటననే పరిశీలించడం జరిగిందనీ. పద్మశ్రీ నాగయ్య గారిని ఇటాలియన్ పాల్ ముని తో పోలుస్తారు. నటుడు చలం కదలికలు హిందీ దిలీప్ కుమార్ ని పోలి ఉండేవి. అందుకే ఆయన్ని ఆంధ్రా దిలీప్అనేవారు (సంతానం -1955- చిత్రంలోని సంగీతమేలా సంతోష మేలా పాట లో గమనించండి) . రామ్మోహన్(తేనెమనసులు-1965, కన్నె మనసులు-1966, ప్రైవేటు మాస్టార్-1967) జుట్టూ, నవ్వూ దేవానంద్ ని పోలి ఉండేవి. ఆయన్ని ఆంధ్రా దేవానంద్ అన్నారు. జమున సురయ్యలా, సావిత్రి మీనా కుమారిలా కనిపించినా ఎవరికి వారే సాటి అనిపించుకున్నారు. హాస్యం విషయంలో రాజ్ కపూర్ చార్లీ చాప్లిన్ నడకను అనుసరించేవారు. ఆయనలాగే హాస్యంతో బాటూ విషాదమూ ఒలికించేవారు. లారెల్, హార్డీ హాస్య జంటలా మనకి రమణారెడ్డి,రేలంగి ఉండేవారు. అంతస్తులు(1965)సినిమాలో అలానే నటించారు కూడా. ఇక బ్రహ్మానందం ‘చిత్రం భళారే విచిత్రం’(1991) లో అలనాటి నాగభూషణంమాట తీరును చక్కగా అనుకరించారు. తులాభారం (1974) చిత్రంలో పద్మనాభం సంగీత దర్శకులు రాజేశ్వర రావు గారి ‘నాసల్ టోన్’ బాగానే పట్టుకున్నారు. ఇక సంగీత రంగానికొస్తే నౌషాద్ లాగ రాజేశ్వరరావు, ఎస్ డీ బర్మన్ లాగ ఎం ఎస్ విశ్వనాథన్, రోషన్ లాగ పెండ్యాల, మదన్ మోహన్ లాగ కోదండపాణి, ఇలా కొందరిని కొందరితో పోల్చవచ్చు. పాడే వారి విషయంలోనూ అంతే. అక్కడ లతా దీదీ, ఆశా తాయి ఉన్నట్టే ఇక్కడ సుశీల, జానకి ఉన్నారంటారు. గొంతుల్లో పూర్తిగా తేడా ఉండీ ఎవరికి వారే ఘనులైన వారు అక్కడ రఫీ, ఇక్కడ ఘంటసాల. రచయితల విషయంలో కొంచెం ఇబ్బందే. అక్కడ హిందీలో ఎందరో మహానుభావులున్నట్టే ఇక్కడ తెలుగులో ఉన్న అందరికీ వందనాలు. అయితే మన ఆత్రేయ గారిని తమిళ సుప్రసిద్ధ కవి కన్నదాసన్ గారితో పోలుస్తారు. మనకి గురజాడ అప్పారావు గారు ఎలాగో తమిళంలో సుబ్రహ్మణ్య భారతి ‘అవర్ గళ్’ అలాగా. ఇది రూపురేఖలకి సంబందించిన పోలిక కాదు. రచనా శైలి అటువంటిది. అనుకరణ ఒక విద్య గా మారేకా మిమిక్రీ, వెంట్రిలాక్విజం వంటివి కోర్సులయ్యాయి. ఒకరి మాట తీరు, ఆంగికాభినయం, ఒక శబ్దాన్ని తిరిగి నోటి ద్వారా అనగలగడం వీటి ప్రత్యేకత. నేరెళ్ళ వేణు మాధవ్ గారు (ఈ బ్లాగులో ఒక చోట ఆయన కామెడీ ఉంది గమనించారా?) ఎందరి గొంతులనో అనుకరిస్తే నోరెళ్ళ బెట్టే వారు ఒకానొక రోజుల్లో. ఆయన దీనితో ఒక సిలబస్ సృష్టించేశారు కూడా. గాయని జానకి మామగారైన ‘ఫన్’ చంద్రశేఖర్ గారు రక రకాల వేష ధారణతో నెహ్రూ, జాకిర్ హుస్సేన్ వంటి పెద్దల రూపు రేఖలు అనుకరించేరు. స్వర్గీయ భరాగో(ప్రముఖ రచయిత, పాత్రికేయులు- భమిడిపాటి రామ గోపాలం) గాయనీ గాయకుల శైలిని అనుకరించి ఆ పద్ధతికి'మ్యూజిక్రీ' అని పేరు పెట్టేరు. మనిషి మనిషికీ మధ్య మాటల్లో దొర్లే ఊత పదాలే ఈ అనుకరణా‘మయులకి’ సభల్లో ఆయువుపట్లు. కవుల రచనల్లో ఊత పదాలు దొర్లడం అంటూ ఉంటుంది. ఊత పదం అనుకోకపోతే అదృష్ట సంఖ్య లాగ అదృష్ట పదం అనుకుందాం. ఆరుద్ర 'కోటి' ( కరోడ్ పతి ఆరుద్ర- అనే నా రచన 'రచన' మాస పత్రికలో అచ్చయింది) ,సి.నా.రె 'ఎగసి'/'ఎగిసి', కృష్ణశాస్త్రి 'ప్రతి' , 'ఔనా/ఔనే' అనే పదాలు, పింగళి 'గా' అనే దీర్ఘాంతం తరచుగా ప్రయోగించేవారు. వీరిని అనుకరించ బోతే ఈ పదాలే రక్షిస్తాయి. అయితే ఒక కవి తొలిసారిగా తానే ఒక పదజాలం ప్రయోగిస్తే అది నచ్చి వేరే సందర్భంలో తమకు అవకాశమొస్తే అదే పద జాలం ప్రయోగించిన కవులూ ఉన్నారు. ఇది ప్రేమానుకరణ. కృష్ణశాస్త్రి 'ఆకాశ వీధి' (మల్లీశ్వరి, 1951)ని తొలిసారిగా ప్రయోగిస్తే శ్రీశ్రీ కూడా 'ఆకాశ వీధిలో' (మాంగల్య బలం, 1959) అనలేదూ? అదే కృష్ణశాస్త్రి 'మేఘమాల' (మల్లీశ్వరి)అంటే సదాశివబ్రహ్మం 'ఓహో మేఘమేలా' (భలే రాముడు, 1956) అన్నారు కదా. ఇక కృష్ణశాస్త్రి ప్రయోగించిన 'నెల రాజా, వెన్నెల రాజా'(మల్లీశ్వరి) ఎన్ని పాటల్లో చోటుచేసుకుందో కదా (ఇటువంటివి కొన్ని మీకోసం 'పాట=తిరుగు టపా'లో ఉంచాను. తీరిగ్గా చదవొచ్చు మీరు). అందుకే అంటారు కృష్ణశాస్త్రి కవులకి కవి అని. అనుకరణకి సాధ్యం కానివి ఒకటి రెండు మూడు ఉన్నాయి . ఒకటి –ఈల. ఈలపాట రఘు రామయ్య వేసే ఈల ఆయన నోటి సొంతం. శివ ప్రసాద్ ఈల కీర్తన ఆయన సొంతం. ఎవరి ఈల వారిదే. రెండోది- నాట్యం. అది శాస్త్రీయం కనుక ఎవరు చేసినా దానికో పధ్ధతి ఉంటుంది. శోభానాయుడు గారిని కలిసి ‘అచ్చం హేమమాలిని లాగ చేశారు, భేష్’ అని పొగిడితే ఆమె మన అజ్ఞానానికి నవ్వుకుంటారు. మూడోది- నాదం. వీణ చిట్టిబాబు, గాయత్రి వీణ, ఈమని వీణ, జాకిర్ హుస్సేన్ తబలా, అల్లా రఖా తబలా, అమ్జాద్ ఆలీ ఖాన్ సరోద్, జనార్ధన్ సితార, హరిప్రసాద్ వేణువు ......ఇలా ఆయా పండితుల, ఉస్తాదుల పేర్లతో ఆయా వాయిద్యాలు ఎందుకు పిలవబడుతున్నాయి? అవి అనితర సాధ్యం కనుక. ‘కొమ్మలో కోయిల కూ యంటదే’ అన్న నండూరి వారి కొత్త ఎంకి పాట చిట్టిబాబు వారి గోటి మీటుల కనువాదమై వీణా నాదమై చిరస్మరణీయమైపోయింది కదా. అను- అనే ఉపసర్గ కన్నా ‘కాపీ’ అనడం సులువు కదా అంటారు కొందరు. అలా అంటే ఉలిక్కి పడే వారు‘ప్రేరణ’ (inspiration) అని ఎందుకనుకోరూ అని దబాయిస్తారు. ఒక ప్రముఖ కవి ‘కాపీ కొట్టేయడం’ అనే తేలిక మాటలకి బరువైన నిర్వచనమిచ్చేరు- ఏమిటంటే- ‘దొరికి పోకుండా దొంగిలించే గుణం’ అనీ. అది నిజమే. కానీ కొందరుంటారు- నిలదీసి అడిగినప్పుడే ఒప్పుకుంటారు, లేదంటే సుళువుగా తప్పుకుంటారు. అందుకే పాట అనేది ఒక సాకితోనో, పల్లవితోనూ ప్రారంభమై మధ్యలో చరణాలు కలిగి ఉంటాయన్న సంప్రదాయాన్ని మనకు మొట్ట మొదట తాళ్ళపాక అన్నమాచార్యుల వారే పరిచయం చేస్తూ ‘నకలు’ రాకుండా ఉండాలంటే ఒక ‘identification mark’ఉండాలర్రా అని ఆచరించి చూపించేరు. ఆయన ఎక్కడా తన పేరు చెప్పలేదు, ‘వెంకటేశ’ అనుకున్నారు. ఆ కారణం చేత ఇప్పటికి 603 ఏళ్ళయినా ఆయన పద సంకీర్తనలు ‘సంపద’ కీర్తనలై తిరుమలని రక్షిస్తున్నాయి. సినీ సంగీత పరంగా చెప్పాలంటే నాలుగు చెరగులా సినీ గీతం వినిపించాలని ఆశిస్తే మటుకు నాలుగు దశలలోఏదో ఒక దశ ఎన్నుకోవాలి. మొదటి దశ: భూమి తనలో తాను తిరుగుతున్నట్టు స్వర కర్త తన బాణీని తానే పదే పదే అనుసరించడం ఈ దశలో కనబడుతుంది. దీనివల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఒక స్పష్టత ఉంటుంది- ఇది నా తీరు అని చెప్పుకో గలరు. 'ఈ వసంత యామినిలో' ‘నీవేనా నను తలచినది', 'ఒక పిలుపుతో పిలిచితే పలుకుతావట', వినిపించని రాగాలే', 'హాయిగా రగిలెను తీయని జ్వాల'- ఇవన్నీ రంజుగా చెబుతుంటే మీకు రాజేశ్వరరావు గుర్తుకు రావాలి. అదీ అతని బాణీ. 'పాతాళ గంగమ్మా రారారా ఉరికురికి ఉబికుబికి రారారా', 'కాపురం కొత్త కాపురం ఆలు మగలు కట్టుకున్న అనురాగ గోపురం', 'శ్రీ రస్తు శుభమస్తు ' ఇవన్నీ మనసారా పాడుకుంటే మీకు మహదేవన్ స్ఫురించాలి. అదీ అతని బాణీ. పెద్ద పెద్ద వాక్యాలున్న పల్లవిని తమలపాకు చుట్టిచ్చినట్టు ఇవ్వగల సమర్ధుడు. పల్లవి పదే పదే వినగానే చరణాలతో పనిలేక పాట హిట్ అయిపోవడం ఆయనకే చెల్లు. 'నీ కళ్ళకు జత ఉంది' అనే పల్లవి తరువాత చరణాలేమిటీ, అసలా సినిమా ఏమిటీ ఇవేవీ అక్కర్లేకుండానే పాట గుర్తుండిపోతుంది. కోదండపాణి దగ్గర సంగతులు సరిగా అనకపోతే ‘ఇంతే సంగతులు’ అనే వారు. సుశీల, జానకి ఆయన బాణీకి తగినట్లే పాడేవారు. తబలా బీట్, హార్మోనియం కదలిక ఆయన ప్రత్యేకత. చలపతి రావు పాట నేపధ్యంలో సన్నాయి, క్లారినెట్ బాగా ఉపయోగించేవారు. అదీ అతని బాణీ. ‘అంతగా నను చూడకు’,’మనసే పొంగెను ఈ వేళ’,’విన్నవించుకోనా చిన్న కోరిక’, ‘అందానికి అందానివై ఏ నాటికి నా దానివై’ వంటి పాటలు అందుకు మచ్చు తునకలు. టీ వీ రాజు పాట పల్లవికి ముందు వినిపించే నేపధ్య సంగీతం ఆహ్లాదకరంగా ఉండేది. ‘నీ చరణ కమలాల నీడయే చాలు’,’ఎన్నాళ్ళకు నా నోము పండింది’, ‘కనులీవేళ చిలిపిగ నవ్వెను’, ‘ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి’- ఇవన్నీ టీవీ వారి ఠీవికి తీపి గురుతులు. ‘వేణుగానమ్ము వినిపించేనే’‘కలలో ఒక అందగాడు కన్ను కలిపి నవ్వేనే’- ఇవి అనుకుంటే అవి మాస్టర్ వేణు వని ప్రతి శిష్యుడూ చెబుతాడు. వీటన్నిటినీ అనుకరించడం అనితర సాధ్యం. పుడితే వారే మళ్ళీ స్వర కర్తలై పుట్టాలి. రెండవ దశ: భూమి తనలో తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు స్వర కర్త తన బాణీయే సుమా అని నమ్మించేస్తూ పరుల బాణీని అనుసరించడం. మహదేవన్ బాణీని మక్కువతో ఎక్కువగా తన వాణిగా మలచుకునీ ఆయన లేని లోటుని తీర్చేరు ఇప్పటికీరవాణి గారు. 'నన్ను వదలి నీవు పోలేవులే' (మంచి మనసులు, 1962) అని మహదేవన్ ఈయన గురించే పాట కట్టి ఉంటారు. 'మరపు రాని తిరిగి రాని గురుతులండి ---అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి' (వుయ్ ఆల్ మిస్ ద ఫన్ ) అని కీరవాణి కొన్నాళ్ళు రాజీ పడ్డారు. ‘అమ్మ తోడు అబ్బ తోడు నాతోడు నీ తోడు’ అది అడవిరాముడు ఇస్తే గంగోత్రి వైపు ‘వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా’ అని కీరవాణి పిట్ట ఎగిరొచ్చింది. 'సిరివెన్నెల' లో కురిసిన 'చినుకు చినుకు' అనే చిన్న అమృత వర్షిణి 'గల గల గంగోత్రి' గా మారింది. కొన్ని దశాబ్దాలు వెనక్కి పోతే- ‘మంచి కుటుంబం’(1967) అనే సినిమాకి మూలం తమిళంలోని ‘మోటార్ సుందరం పిళ్ళై’ అని చెప్పుకున్నాం కదా ఈ బ్లాగులోనే. అందులో మనసు ‘మురుగన్’ నెమలి వాహనం అని భక్తి పారవశ్యంతో కదిలితే తెలుగులో ‘మనసే అందాల బృందావనం- వేణు మాధవుడి పేరే మధురామృతం’ అని ఒలకబోసింది. మూలంలో ఉన్న మరో పాట ‘తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు’గా మారింది. కానీ మూలం లో లేని ఒక యుగళ గీతం స్వర కర్త కోదండపాణి ఏ శుభ ముహూర్తాన స్వర పరిచారో గానీ ఆ పాటకి రెండు ‘అనుసరణలు’ వచ్చేయి. ఆ పాట డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు రాసిన ‘నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది'. ఈ పాట మొత్తం వీడియో చూసి కాస్సేపాగి ఆడియో వైపు రండి. 1977 లో ‘ఆలు మగలు’ అనే సినిమా కోసం తాతినేని చలపతిరావు గారు ‘ఒక్కరిద్దరుగ మారేది ముచ్చటగా ముగ్గురవ్వాలని’ అని ఒక యుగళ గీతం స్వర పరిచేరు. ఆ పాట వినండి. ఇందులోనూ అంతే- ‘నీలో ఏముందో ఏమో’ పాట ఛాయలు కనిపిస్తాయి. విన్నారుగా, ఇక మళ్ళీ వీడియో వైపు రండి. 1997 లో వచ్చిన ‘ఆహ్వానం’ చిత్రంలోని ‘దేవతలారా రండి –మీ దీవెనలందించండి’ అన్న పాట సన్నివేశం చూడండి. చరణాలు వింటూ ఉంటే ‘నీలో ఏముందో’ లోని చరణాలు స్ఫురణకొస్తాయి. వచ్చాయి కదా. చిత్రానికి సంగీత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గారు. ఈ మూడింటి ‘కామన్’ విశేషం మూడు భాగాలు –మొదటిది - ‘కృష్ణ’,‘రమ్యకృష్ణ’ ,‘రామకృష్ణ’–అంతా ‘కృష్ణార్పణం’. రెండవది- పాట విడుదల పరంగా చూస్తే మొదటి దాంట్లోఘంటసాల వారి గళం, రెండోదాంట్లో రామకృష్ణ వారి గొంతు కాగా మూడోది పాడటం బాల సుబ్రహ్మణ్యం గారి వంతు అయ్యింది (గురువు గారి పాట వరస తాను పాడగలగడం బాలు గారు తన భాగ్యం గానే అనుకొనీ ఉంటారు. ఒక్కోసారి ‘కాపీ’ తాపీ గా మేలే చేస్తుంది). మూడవది- విడుదలైన సంవత్సరాలు 1967,1977,1997అనీ 7 అంకె తోనే ఆఖరయ్యాయి. కొంపదీసి 1987 లో మనం మరచిపోయిన మరో పాట ఇదే ‘బాణీ’ తో వచ్చిందో ఏమో? వస్తే గనుక గిన్నీస్ వారిని పిలవాల్సిందే. మొత్తానికి కోదండపాణీ నీ (బాణీ)లో ఏముందో ఏమో గానీ నీ పాట నుంచి పాట వెంట పాట పుట్టుకొచ్చాయి. కొద్ది రోజుల్లో ఇంకో ఉదాహరణ –అదీ కోదండ ‘బాణీ’యే. నాలుగు బాణీ అనుకరణ దశల్ని కలిపి ‘బాణీ భ్రమణం’అనడం సబబు. మిగతా రెండు దశలు త్వరలోనే గమనిద్దాం. అందాకా అన్నమయ్య 603 వ జయంతి సందర్భంగా ‘అన్నమయ్య’ సంకీర్తనలు ‘అ నుంచి హ’వరకు ఒక్కొక్క ఉదాహరణగా చెప్పగలరా? ‘భ్రమణం’ కాదుగానీ తల తిరిగేట్టు ఏమిటా ప్రశ్న అని చివాట్లు పెడుతున్నారా? పాటను నిర్వచించి మంచి పలుకు బళ్ళతో ఒక్కొక్క పాట ఒక సంకీర్తనగా శ్రీ వేంకటేశుని కంకితం చేసిన ఆ మహానుభావునికి తల వంచి నమస్కరిద్దాం. అందుకోసం కొంచెం తల ఇటు ‘తిరగాల్సిందే’. -డాక్టర్ తాతిరాజు వేణుగోపాల్, 16 మే 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|