మునుపటి నా మాట
బాణీ భ్రమణం : భాగం 2 (కొనసాగింపు) రాగం ఒకటే అయినప్పటికీ పాట నడిపిన తీరు లో తేడా ఉండడమే ఒక్కొక్క సంగీత దర్శకుడి బాణీ ఇదీ అని ప్రత్యేకించి చెప్పగలుగుతాం. అలా కాకుండా ఒకదానినొకటి పోలి ఉంటే ఒక్కోసారి ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న నానుడి నిజం చేస్తూ ఒరిజినల్ కన్నా అనుసరించిన పాటే పెద్ద హిట్ కావొచ్చు. అనుక(స)రణో పాఖ్యానం లో ‘బాణీ భ్రమణం’ అనే కొత్త మాట ప్రయోగించి అందులో నాలుగు దశలు ఉన్నట్టు ప్రస్తావించాను. రెండో దశలో స్వర కర్త తన స్వంతబాణీ తో పాటు పర బాణీ మిళితం చేయడం గురించి ఒక మూడు తరాల ఉదాహరణ చెప్పాను. ఇందులో చేర్చ దగినవి మరి కొన్ని పాటలు ఉన్నాయి. తమిళం బిట్ హిందీలోకి, తెలుగు బిట్ కన్నడంలోకి, తెలుగు బిట్ తెలుగు లోకి, హిందీ బిట్ హిందీ లోకి అతి సునాయాసంగా చేరిపోవడం ఈ దశ లోని ప్రత్యేకత. అయితే ఇది ఆయా ‘బిట్స్’ పట్ల సంగీత దర్శకులకో, నిర్మాతలకో ఉన్న ‘ఇష్టం’ వల్ల సంభవించి ఉండవచ్చు. లేదా అలా మలిస్తేనే తమ పాట ఇంకా బాగా రాణిస్తుందని అనిపించడం వల్ల కావొచ్చు. ‘బిట్స్’ అంటే ఇక్కడ Better Improvisation Through Segments (BITS) అనే అర్థం చెప్పుకుంటే బావుంటుందేమో. మొత్తానికి అనుకరించే వారూ, అనుసరించేవారు మూల స్వర కర్తలకి ఇలా ‘బిట్స్’ ద్వారా ఋణపడిన వారు గానే గుర్తించాలి. మూల భాషల బట్టీ ఈ ఋణానుబంధం ఈ విధంగా ఉంటుందని ఉదాహరించవచ్చు: తెలుగు-తెలుగు ఋణానుబంధం
పాటకు పల్లవి ప్రాణం . కాదనం. అయితే ‘ఉయ్యాల జంపాల లూగ రావయ్యా’ అని చక్రపాణి (1954, సంగీతం: రాజేశ్వర రావు, భానుమతి ) చిత్రం పాడిస్తే చిత్రంగా ‘తల్లి తండ్రులు (1970)’ వచ్చి ‘ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు’ (సంగీతం: ఘంటసాల) అని అదే ధోరణిలో అంటుంటే ఒక పాటతో మరో పాటకి ఏమిటో ఈ అనుబంధం అనిపిస్తుంది. భీమ్ పలాస్ రాగం లో కోదండపాణి స్వర పరిచిన ‘ఓ నిండు చందమామా నిగనిగల భామా’ (బంగారు తిమ్మరాజు, 1964- గానం: యేసుదాస్) అనే పాట స్పూర్తి తో ఇంచుమించు అదే పోకడలో ఘంటసాల మాస్టారు ‘భలే మంచి రోజు పసందైన రోజు’ (జరిగిన కథ,1969-గానం: ఘంటసాల) అనే పాట కూర్చారు. రెండు పాటల్లోనూ ‘చందమామ’ ప్రసక్తి రావడం కాకతాళీయ పోలిక. ఇదే భీమ్ పలాస్ రాగం లో మళ్ళీ కోదండపాణి ‘పేదరాశి పెద్దమ్మ కథ (1968)’ కోసం ‘ఒహోహో ఓ నెలరాజా వెన్నెల రాజా’ డ్యూయట్ స్వర పరచి స్వర జానకి తో లేత బాలు గళం పోటీ పడేలా పాడించేరు. ఈ పాట స్వర మెట్లు రాజన్-నాగేంద్ర లకి నచ్చినట్టున్నాయి. కొంచెం అచ్చు గుద్దినట్టు అవే ‘బిట్స్’ ఉంచేశారు తమ ‘మల్లెలు పూచే వెన్నెల కాసే’(ఇంటింటి రామాయణం, 1979-గానం: బాలు) పాట ముంగిట్లో. విశేషం ఏమిటంటే ఈ తరం లోనూ ఏ ఆర్ రెహ్మాన్ తొలి పాటల్లో అతి పెద్ద హిట్ అయిన బాంబే సిన్మా లోని థీంలో ఇదివరకు మెలోడీ సత్యం కార్తీక దీపం (1979) కోసం చేసిన ‘చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది చిరు నవ్వు చిందించవే నీ మేని శృంగార మొలికించవే ’ అనే పాట పల్లవిలోని ఆ అండర్ లైన్ డ్ ‘బిట్’ ను అనుసరించినట్టు అనిపించలేదూ? తెలుగు-కన్నడ ఋణానుబంధం ‘అవళ హెజ్జె’ లో ‘నెరళను (నీడను) కాణద లతె యంతె’ పాట పల్లవి- ‘ఆత్మబలం’ తో మామ మహదేవన్ కురిపించిన ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’, అక్కడ ఉన్న తెలుగు ‘చెట్టు నీడ’ గుర్తుకొచ్చి లోలోన అంతరాత్మ కన్నడ నీడ జాడ వెతకడమెలా అని రాజన్-నాగేంద్ర లిద్దరినీ కలవరపరుస్తుంటే చివరకి అదే పల్లవిలోని ‘బిట్’ వారిని కనికరించడం విశేషం. కన్నడ-తెలుగు ఋణానుబంధం ఉపేంద్రుడు- హొస (కొత్త) హిట్ - డాక్టర్ రాజ్ కుమార్ కుమారుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ హీరో గా చేసిన ‘నంజుండి కల్యాణ’కి ఉపేంద్రకుమార్ సంగీతమందిచేరు. అందులో ఆయన చక్కని యమన్ కళ్యాణి రాగ స్వరాలతో ‘హొస ప్రేమ దలి’ పాట స్వర పరిచారు. అదే తెలుగులో ‘ఒక రామ కథ.. ’ గా వచ్చింది. సాధారణంగా రాజన్ –నాగేంద్ర లు ముందు కన్నడంలో స్వర పరిచి తరువాత తెలుగులోకి తెచ్చేవారు. పూజలు చేయ పూలు తెచ్చాను, సిరిమల్లె నీవే విరిజల్లు కావే, నీకోసం జీవితమంతా వేచాను, నాగ మల్లివో తీగ మల్లివో, మల్లెతీగ వాడిపోగ ఇలా ఎన్నో రస గుళికలు అటునుంచి ఇటు వారు విసిరినవే. ఉపేంద్రకుమార్ అలా ఒక ‘హొస’ (కొత్త) బాట వేసారు. ఈయన ఒరిస్సాలో గంజాం జిల్లాలో బరంపురం దగ్గర అస్కా అనే ప్రాంతానికి చెందిన వాడు కావడం, ఎక్కువగా కన్నడ చిత్రాలకు, అదీ మహానుభావుడు రాజ్ చిత్రాలకు చేయడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తమిళ-తెలుగు ఋణానుబంధం ఇదివరకెవ్వరూ చెయ్యలేనంత అద్భుతంగా దర్బారీ కానడా రాగంలో ‘శివ శంకరి’ పాట చేసిన పెండ్యాల చిరస్మరణీయులు. ఇప్పటి భాషలో చెప్పాలంటే అప్పుడది ‘దుమ్ము లేపింది’. అయితే ఆ ధూళి కణాల వల్ల కాబోలు అంతటి మహానుభావుడు తాత్కాలిక మబ్బు చాటున అంటే తమిళం లో ఎం.ఎస్. విశ్వనాథన్ దర్బారీ ఛాయల్లో చేసిన ‘ముత్తుక్కళో కంగై’ అన్న పాట (చిత్రం: నెన్జిరుక్కుం వరై ) మాటున దాక్కొని ‘విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా’ (చిత్రం: బందిపోటు దొంగలు) అని అనుకరించాల్సి వచ్చింది ( ఆ తమిళం పాట ‘ కనులు మూసినా పాటే’ లో వినండి). తెలుగు సినిమాలో వేరే ఒక పాటలో హీరో గుర్రం మీద కూర్చునీ పాడినట్టు గుర్తు. అదే పెండ్యాల వారూ గుర్తుపెట్టుకునీ ఈ పాటలో గుర్రపు డెక్కల ‘ఎఫెక్ట్’ తీసుకొచ్చేరు. పాట ముందు, సీను తరువాత తయారవుతాయి కనుక సినిమాలో హీరో, బృందావనం లో గుర్రాలు ‘నాట్ అలౌడ్’ అన్నారో ఏమో , మామూలుగానే పరిగెట్టేరు. మరాఠీ-తెలుగు ఋణానుబంధం ఆది నారాయణ-విప్ర నారాయణ-ఉదిత్ నారాయణ ‘అంతా నారాయణీయం’- భక్త తుకారాం (1973) మరాఠా మహా వ్యక్తి కనుక ఆయన పాడే తెలుగు పాట ‘ఘనా ఘనా సుందరా కరుణా రస మందిరా’ అనేది సహజంగానే మరాఠీ గీతం ‘ఘనా శ్యామ సుందరా శ్రీధరా (చిత్రం: అమర్ భూపాలి)’ మీద ఆధార పడాల్సిందే కదా అని ఆద్యంతం నవ్వుకున్నారు ఆదినారాయణ రావు. ‘విప్రనారాయణ(1954)’ లోని జయదేవ అష్టపది ‘సా విరహే తవ దీనా’ మరాఠీ లోని ‘నామ జపన్ ---‘అనే గీతాన్ని అనుసరించినదే (భానుమతి తన ‘నాలోనేను’ ఆత్మ కథలో చెప్పక పొతే ఇవేవి తెలిసేవి కావు). మణిశర్మ బాణీ కాస్సేపు వినాలని ఉంది అనేముందు ‘చూడాలని ఉంది’ అనాలి. ఎందుకంటే ‘రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మ’ అంటూ బెంగాలీ సందులో గజ్జెల గోల వినిపించినా అది మరాఠీ జానపదమే (ఆలా గ బాయీ) సంస్కృతం-తెలుగు ఋణానుబంధం రాజేశ్వరరావు ‘మల్లీశ్వరి (1951)’ చిత్రంలో మనోహరంగా స్వర పరిచిన –పల్లవి రిపీట్ కాని పాట- ‘మనసున మల్లెల మాలలూగెనే’ సంస్కృత బాణీని అనుసరించినదే. వింజమూరి అనసూయ గారు పాడిన గ్రామ ఫోన్ గీతమైన జయదేవ అష్టపది ‘ధీర సమీరే యమునా తీరే’నుంచి ప్రేరణ పొందినట్టు ఒక సందర్భంలో దర్శకులు బి.ఎన్.రెడ్డి చెప్పారు. తెలుగు-హిందీ ఋణానుబంధం మాస్టర్ వేణు జానపద శైలిలో అద్భుతంగా స్వర పరిచిన ‘ఏరువాక సాగారో రన్నో చిన్నన్న’ (రోజులు మారాయి, 1955) అన్న పాట విని, ఎస్.డీ. బర్మన్ ‘దేఖ్ నే మే భోలా హై ---బంబై సే ఆయ హై బాబూ చిన్నన్న’ అనే పాటకి పల్లవి కోసం కొన్ని ‘బిట్స్’ ఉపయోగించడం తెలుగు వారిని ‘మద్రాసీ’ మార్కు నుంచి ‘ఆంధ్ర్రాస్’ అనే ఖ్యాతికి తీసుకు వెళ్లేందుకు నాంది పలికింది. భీమ్ పలాస్ రాగం లో కోదండపాణి ‘పేదరాశి పెద్దమ్మ కథ (1968)’ కోసం ‘ఒహోహో ఓ నెలరాజా వెన్నెల రాజా’ పాటలోని పల్లవి హిందీ సీమ లోకి ఎలా వెళ్ళిందో ఏమో గానీ, రవీంద్ర జైన్ ‘చిత్ చోర్’ కోసం రాసి స్వర పరిచిన ‘గోరీ తేరా గా(వ్ బడా ప్యారా’ అనే పాట చరణంలో ‘కుహు కుహు గాయే కోయలియా(‘ కి ఆ ‘బిట్’ సరిగ్గా సరిపోయింది. చిత్ చోర్ – అనగా మనసు దోచువాడు కనుక ఏమో పాణి పంక్తి జైనుల వారి మనసు దోచిందేమో. ర’సాలూరు’ రాజేశ్వరుడు ఉలి ఉపయోగించి నట్టే భ్రమ కలిగించి చేసిన ‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో’ అనే ‘అమర శిల్పి జక్కన (1964)’ పాటలో ‘పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి’ అనే లైన్, ఆ పైన వచ్చే నేపధ్య వాయిద్యం ఇష్టపడని వారెవరైనా ఉండగలరా ఈ భూ ప్రపంచంలో? అందుకే ఈ ‘బహుదూరములో నున్నవి’ అనే వరస రోషన్ కుమారుడైన రాజేష్ రోషన్ మనసులో బాగా దగ్గరి కొచ్చి ‘కోయి మిల్ గయా’ లో జాదూ పాట కోసం ‘అచ్ఛా హువా మిల్ గయా’ అనేలా అతుక్కు పోయింది. తమిళం వరస తెలుగులో ‘వెన్నెల కేల నాపై కోపం’ అన్న పల్లవితో పాటగా వస్తే , అందులోని చరణం లోవచ్చే ‘నిను కోరిన బావను’ అనే ‘బిట్’ తీసుకునీ ‘ఆవారా పన్ బంజారా పన్ ‘ అనే పాట తయారు చేశారు కీరవాణి. ఆయనే ‘సిరి మల్లె నీవే’ పల్లవి ‘బిట్’ తీసుకునీ ‘తుమ్ యహా( హమ్ యహా( దిల్ జవా( ఓ సమా’ అనే మరో పాట లో మాటా, వాద్యం రెండూ చక్కాగా కూర్చారు. హిందీ-తెలుగు ఋణానుబంధం భీంపలాస్ రాగంలో మదన మోహన్ స్వర పరిచిన ‘నైనో మే( బద్ రా ఛాయా’ (మేరా సాయా ) , అదే రాగంలో పెండ్యాల స్వర పరిచిన - ‘నీలి మేఘాలలో గాలికెరటాలలో (బావా మరదళ్ళు, 1961) ’ ఒకేలా ధ్వనించినా, పోలిక లేదని కొట్టి పారేయడానికి ఆ రోజుల్లో కవి ఆరుద్ర కష్టపడ్డారట. మేరా సాయా అనగా నా నీడ అని మదనుడంటే ఏమో ఆ నీడను పెండ్యాల నాగేశ్వరులు అనుసరించారేమో, బావ మరదలుని అనుసరించినట్టు. పెండ్యాల చాణక్య-చంద్రగుప్త (1977 ) చిత్రంలో ‘చిరునవ్వుల తొలకరిలో’అనే డ్యూయట్ కురిపించినా అది కళ్యాణ్ జీ-ఆనంద్ జీ లు ట్యూనించిన ‘క్యా ఖూబ్ లగ్ తీ హో బడీ సుందర్ దిఖ్ తీ హో’ (ధర్మాత్మా) అనే అందమైన పాట మబ్బు తునక ధర్మమే. ‘ఆజ్ కి రాత్ ఏ కైసే రాత్ ’ అన్న పాట భాగ్యమేమిటో గాని ‘మగాడంటే మజా ఉన్నా అదో లాంటి భయం’(మహాబలుడు ,1969 , కోదండపాణి), ‘ఇదేపాట ప్రతీ చోట ఇలాగే పాడుకుంటాను’ (పుట్టినిల్లు-మెట్టినిల్లు,1973,సత్యం), ‘బిడియమేలా ఓ చెలీ’ (ఆదర్శ కుటుంబం, 1969, రాజేశ్వరరావు ) అంటూ ఎన్నో వెర్షన్స్ పుట్టేయి. హిందీ పాటలో ‘రాత్రి’ ప్రస్తావన ఉంటే ఒక్క ఈ మూడో పాటలోనే ‘రేయి’ అంటూ వినిపిస్తుంది. అనుసరించినా ‘న్యాయం’గా ఉండాలన్నది బహుశా రాజేశ్వర రావు తత్త్వం కాబోలు. రాజేశ్వరరావు అద్భుత సంగీత సృష్టి ‘మల్లీశ్వరి ‘ లో ‘నెలరాజ వెన్నెల రాజా’ పాట ముందు వచ్చే సాకీ ‘ఎవ్వరేమని విందురో’ అన్నది నూర్జహాన్ ఆలపించిన ‘ఆజా మేరి బర్ బాద్-ఇ-ముహబ్బత్’ ను తీసుకునీ తానే స్వర పరిచినట్టు భానుమతి చెప్పారు ‘నాలో నేను’ ఆత్మ కథలో. చెళ్ళపిళ్ళ సత్యం ‘మెలోడీ సత్యం’ గా పేరు పొందినా ఆయన స్వర పరిచే ప్రతి పాటలో సుందరమైన అంతర్వాహినిగా శివమెత్తిన హిందీ స్వర ప్రవాహం ఉండనే ఉంటుందన్నది సత్యం. ‘జీవన్ కి బగియా మెహ్ కేగీ ’ అనే పాటకి దగ్గరగా తెస్తూ ‘మాట చాలదా మనసు చాలదా’ అనే పల్లవిలో కాక – దిక్కులు వినగా చుక్కలు కనగా నీ- పక్కనె పలికే మక్కువ ఒలికే’ అనే అనుపల్లవిలోనూ, చరణాల చివర వచ్చే ‘ఒదిగీ దాగే మధుర రహస్యం’ అనే చోట ఎంత చాకచక్యంగా ఆ ‘ఆయేగా – బచ్ పన్ హమారా’ ‘బిట్స్’ వాడి ఎంత ఏమార్చారో కదా. అలాగే ‘గైడ్’ లోని హిట్ డ్యూయట్ ‘గాతా రహే మేరా దిల్’ అనేది ‘నవ్వవే నా చెలీ’ అని తెలుగులోకి మోహనంగా పరివర్తనం కావించడానికి ఏయే ‘బిట్స్’ పనికొస్తాయో చెప్పే బెస్ట్ గైడ్ ఆయనే. ఈ రెండు పాటలు ఎలా వచ్చినా ‘అంతా మన మంచికే‘(1972) అని ఉంటారు భానుమతి. పెండ్యాల ‘పాప కోసం (1968)’ సినిమా లో ‘కొండలపైన కొనలలోన గోగులు పూచే జాబిలీ’ అన్న పహాడీ పాటలో వినిపించిన ఆలాపన , ‘వక్త్’ చిత్రంలోని ‘ఆగే భీ జానే న తూ –పీఛేభీ జానే న తూ’ అనే పల్లవితో జట్టు కట్టింది. ఆ ‘వక్త్’ (సమయం) ఈ ‘పాప కోసం’ అని తెలుసుకొండర్రా అని అనే ఉంటారు పెండ్యాల. మరి అంతకు ముందు వచ్చిన ‘ఉయ్యాల జంపాల, 1965’ మాటేమిటి సార్, ‘కొండగాలి తిరిగింది’ వంటి సూపర్బ్ ఒరిజినల్ మలయ మారుతం తో పాటూ ‘దాచిన దాగదు వలపు’ ఇచ్చారే, అది ‘చాహె కోయీ ముఝే జంగ్లీ కహే’ ని అనుకరించినదే కదా. దాచిన దాగదు కదండీ హిందీ లయ. మహదేవన్ అంతస్తులు (1965) ఎక్కుతూ ‘వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్నా’ అని భానుమతి నోట పలికించిన వేదం విద్యలోని చరణాలు ‘షికారీ’ హిందీ సినిమాలోని ‘ఓ తుమ్ కో పియా దిల్ దియా’ చరణాలను వేటాడి పట్టుకున్నవే. రాజేశ్వరరావు ‘జోరుగా హుషారుగా షికారు పోదామా’ (భార్యా భర్తలు, 1961) అన్నా, మాస్టర్ వేణు ‘రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో’ (ప్రతిజ్ఞా పాలన, 1965) అన్నా అవి కిశోర్ పాడిన, మధ్యలో ఎవరో ఈల వేసిన ‘హమ్ హై రాహి ప్యార్ కే ---జో భి ప్యార్ సే మిలా ‘ అన్న హుషారు పాట మార్గంలో కొంత వరకు నడిచినవే (జోరుగా లో జో, జో భి ప్యార్ లో జో ఉండడం చూసి రెండూ జోల పాటలనుకునేరు.. కాదు. ఈల పాటలు). చక్రవర్తి ‘అనురాగ శిఖరాల ఆలయం’ అనే పాట పల్లవి కూర్చడానికి కళ్యాణ్ జీ- ఆనంద్ జీ లు ‘ముఝ్ కో ఇస్ రాత్ కి ' అనే ముకేష్ గీతం ప్రారంభంలో వినిపించిన నేపధ్య సంగీతమే ఆధారమైంది. ఎం.ఎస్. విశ్వనాథన్ ‘ఆకలి రాజ్యం(1981)’ లో ‘కన్నెపిల్లవని కన్నులున్నవని’ తననాలతో చేసిన పాట లో ఒక చోట ‘స్వరము నీవై’ అనిపించారు. ఇది సచిన్ దేవ్ బర్మన్ దా ‘గైడ్’ చిత్రంలో స్వయంగా పాడిన ‘వహా( కౌన్ హై తేరా’ పాటలోని చరణ ప్రారంభంను పోలి ఉంటుంది. ఎటువంటి రాజ్యమైనా సచిన్ ‘దేవు’డు లాంటి ‘గైడ్’ ఉంటేనే ఆటలో మజా. పౌరాణికంలో హిందీ వరస రాణిస్తుందని ఓ కంట కనిపెట్టిన బాపు ‘శ్రీ రామాంజనేయ యుద్ధం (1975)’ లో ‘శరణు శరణయా--- సాకేత సార్వభౌమా’ అంటూ ఆంజనేయుడు తెలుగులో కంట తడిపెడుతూ పాడే పాట (ఈ బ్లాగ్ లోనే వీడియో archives లో ‘బాపు’ అనే చోట క్లిక్ చేసి చూడవచ్చు) కి ‘దోస్త్’ లోని ‘చాహుంగా మై తుఝే సాంజ్ సవేరే ’ అనే హిందీలో కన్నీరు తెప్పించిన పాట పల్లవినే ఎంచుకున్నారు. హిందీ-హిందీ ఋణానుబంధం నదీమ్- శ్రవణ్ ‘తుమ్ దిల్ కీ ధడ్ కన్‘ (ధడ్ కన్ ) అని కుమార్ సనూ చేత పాడిస్తే చేస్తే ఆహా అన లేదూ , అది వారి స్వంతమా? శంకర్ -జైకిషన్లు ‘ముఝే తుమ్ మిల్ గయే హమ్ దమ్( Love in Tokyo) అనే పాట చేయబట్టీ , అది వీరికి దొరికింది కాబట్టీ కుదిరింది. ‘రాజా హిందుస్తానీ’ చిత్రం టైటిల్స్ నేపధ్యంలో ఇదే ట్యూన్ వినపడడం వీరు చూపించిన మరో విడ్డూరం. తమిళ-హిందీ ఋణానుబంధం ఏ.వి.ఎం. వారు తమిళంలోనూ, తెలుగు లోనూ, హిందీ లోనూ ఒకే సారి సినిమాలు తీసేవారు. తమిళం చిత్రంలోని ‘అమ్మావుమ్ నీయె అప్పావుమ్ నీయె’ అనే పిల్లల భజన గీతం పల్లవి మాత్రమె హిందీ (మై చుప్ రహూంగీ ) లో చిత్రగుప్త సంగీతంలో ‘తుమీ హో మాతా పితా తుమీ హో’ గా వచ్చింది. తమిళంలో పాటకి బాల కమల హాసన్ నటించడం విశేషం. ఇవీ మచ్చుకు కొన్ని ఉదాహరణలు బాణీ భ్రమణం రెండో దశకు సరిపోయేవి. బాణీ భ్రమణం : భాగం 3 ఇందులో అనుకరణకైనా అనుసరణకైనా కనిపించేది ‘సోదర ప్రేమ’. అంటే ‘భారతీయత’ అనే రక్త సంబంధం. పూర్తి తెలుగు పాటకి పూర్తి తమిళం, పూర్తి హిందీ, లేదా మరో పూర్తి పొరుగు భాష ఆధారం లేక స్పూర్తి. ఇది ఎటువంటిదంటే భూగ్రహం తనకు దగ్గర్లో ఉన్న గ్రహం చెంతకు ఆప్యాయంగా రావడంగా అభివర్ణించవచ్చు. ఏవీఎం వారి లాగే జెమినీ వారు కూడా వెనకటి రోజుల్లో సినిమాలు తీస్తే తమిళం, తెలుగు, హిందీ ఈ మూడు భాషల్లో ఒకే సారి తీసే వారు. ఆ సంప్రదాయం కొంత వరకు సురేష్ రామానాయుడు గారు, జగపతి వి బి రాజేంద్రప్రసాద్ గారు పాటించారు. ఎల్ వీ ప్రసాద్ మంచి తమిళ్,తెలుగు సినిమాలు ముందొస్తే వాటిని వెంటనే హిందీ లోకి మార్చేవారు. ఆదుర్తి సుబ్బారావు హిందీలో ‘డైరెక్ట్’ చేశారు కూడా. కాబట్టి వారి వారి సినిమా పాటలు ‘మాతృక’ భాష బట్టే ఉండేవి. తెలుగులో కొన్ని వందల పాటలు ఇలా వచ్చినవే. పైన చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా అదొక ఋణానుబంధమే అని గుర్తించాలి. తెలుగు/తమిళ -హిందీ ఋణానుబంధం నిర్మాత ఒకరే కావడం వల్ల ఒక భాష లోని పాట మరో భాషలోకి మార్పిడి చేయడం సులభమౌతుంది. ఏవీఎం వారు ‘లేతమనసులు (1966)’ (తమిళం ఆధారం అని కూడా అనవచ్చు) సినిమాని హిందీ లో ‘దో కలియా(‘ గా తీసినా దో కలియా( లోని ‘ తుమ్హారీ నజర్ యూ( కఫా హో గయీ‘ అన్న యుగళ గీతాన్ని వారి ‘మూగ నోము(1969)’ లో ‘ఈ వేళ నాలో ఎందుకో ఆశలు’ గా మలుచుకున్నారు. చిత్ర గుప్త ‘చిన్నారి పొన్నారి పువ్వు’ (ఏ.వి.ఏం వారి ‘నాదీ ఆడ జన్మే’, 1965) ట్యూన్ ను అలాగే హిందీ (మై( భీ లడకీ హు( )లో ఉంచి పి.బి.శ్రీనివాస్, లతా ల ‘న భూతో న భవిష్యతి’ డ్యూయట్ ‘చందా సే హోగా వో ప్యారా’ కూర్చి చరిత్రకెక్కించారు (పాట ఆడియో ‘కనులు మూసినా పాటే’ లో వినండి). రాజేశ్వరరావు విజయా వారి ‘మిస్సమ్మ(1955)’ కోసం చేసిన ‘బృందావనమది అందరిది’ కాబట్టి హిందీ వారూ , సంగీత దర్శకుడు హేమంత కుమార్ ఒప్పుకునీ అదే ట్యూన్ యథాతథంగా ‘మిస్ మేరీ’ సినిమాలో ‘బృందావన్ కా కృష్ణ్ కన్హయ్యా’ గానే వినిపించారు. చంద్రలేఖ వంటి చిత్ర గీతాల్ని ఎంతో గొప్పగా తమిళం, హిందీ భాషల్లో పలికించిన రాజేశ్వరులకే మిస్ మేరీ హిందీ చిత్రం మిస్ అవడం, మిస్సమ్మ లో సావిత్రి పాత్రను భానుమతి చేస్తూ మధ్యలో విరమించుకోవడం వల్ల ఆమె అంత మంచి పాత్రను ‘మిస్’ అవడం – ఇవన్నీ ‘మిస్’ టేకులండీ బాబూ. భానుమతి పేరులోనే ఉంది చండ ప్రచండ తేజం. మరి ఆమె ‘చండీరాణి ( 1953)’ లా మూడు భాషల్లో మాటాడితే అంతటా ప్రకాశమే. ‘ఓ తారకా –‘ వెర్షన్ హిందీలోనూ ఆమె మధుర గళాన (తలత్ గళం తో పాటూ) ఓహో అనిపించాలంటే ‘కనులు మూసినా పాటే’ లో వినాల్సిందే. ఆర్ డీ బర్మన్ ‘ముత్తు కోడి కవ్వారి హడా’ అనే తమిళం పాట లోని తొలి పంక్తిని అలానే ఉంచి హిందీ పాట చేశారు. హిందీ-తెలుగు ఋణానుబంధం పెండ్యాల వారి భాగ్య రేఖ బలమేమిటో గానీ ఆయన ‘ఒరిజినల్’ పాటలు చేయడంలో ఎంత దిట్టో హిందీ లేదా ఇతర భాషల నుంచి ‘డిట్టో’ చేయడంలోనూ అంతే ఘనులు. ‘భాగ్య రేఖ, 1957’ లో ‘మనసూగే సఖ తనువూగే ప్రియ – మదిలో సుఖాల డోల లూగే’ అన్న దేవులపల్లి వారి సుందర రచనకి మూలం ‘మన్ డోలే మేరా తన డోలే’ అని వేరే చెప్పనవసరం లేదు. కృష్ణశాస్త్రి గారు తన ముద్ర విషయంలో రాజీ పడరు. అందుకే మాతృకల కన్నా ఈ డూప్లికలే బావున్నట్టనిపిస్తాయి. ‘శ్రీ కృష్ణ తులాభారం (1966)’ వంటి పౌరాణిక చిత్రంలో సత్య అలుక తీర్చే గోపీ కృష్ణుడు ఓపీ నయ్యరు హిందీ వరస ‘ ఆ—ముఝే దేఖ్ కర్ ఆప్ కా’ (ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా) తీసుకునీ ‘ఓ చెలీ కోపమా అంతలోనే తాపమా’ అంటూ పాడితే, పాడించిన పెండ్యాల తో పాటూ ఎవరేనా తప్పన్నారా? అంతకు ముందే పెండ్యాల వారు ‘శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963)’ లో భాగేశ్రీ రాగంలో ‘అలిగితివా సఖీ ప్రియా కలత మానవా’ అని తెలుగులో అలుక తీర్చడం వల్ల ఇలా జరిగింది కదా. తరువాత జాగర్త పడి పెండ్యాల మరో సినిమాలో ‘అలుక మానవే చిలుకల కొలికిరో’ అనే జానపదంతో సరి పెట్టుకున్నారు. గాయని భానుమతి మరో ప్రముఖ గాయని లత పాడిన ‘నా బోలె నా బోలె నా బోలేరే—‘ అన్న రాధ పాటను ‘రావోయి రావోయి ఓ మాధవా’ గా అతికినట్టు పాడేస్తారని ఆనాడు కలగన్నారా? సరళమైన స్వరాల సుసర్ల వారు 'సంతోషమేలా సంగీతమేలా’ ( వీడియో చూడండి) అనేది 'గయా అంధేరా హువా ఉజారా' పాటను అనుకరిస్తూ చేసినా అది కోదండపాణి లోని గాయకుడికి తొలి బోణీ అయింది. ఈ సంతోష సంగీతాలెందుకు? అని సంతానం(1955) చిత్రంలో ప్రశ్నించినందుకు అదే యేడాది చిత్రంగా ‘సంతోషం’ అనే సినిమా రావడం చిత్ర విచిత్రాల్లో ఒకటి. అల్బేలా చిత్రంలో ‘ధీరేసే ఆజారే అఖియన్ మే(' అన్న పాట ఆధారంగా మొదట ఓగిరాల రామచంద్ర రావు ‘నీ మీద ప్రాణాలు నిలిపింది రాధ’ అనే పాటను స్వర పరిస్తే అల్బేలా తెలుగు వెర్షన్ నాటకాల రాయుడు(1969) లో ‘నీలాల కన్నుల్లో మెల మెల్లగా నిదురా రావమ్మా రావే నెమ్మదిగా రావే’ అని మూలం లోని జోల తనం కాపాడేరు జి.కె.వెంకటేష్. అయితే రెండు వెర్షన్స్ 'నీ' తో ప్రారంభం కావడం నిషేధం కాదు కానీ 'నిషాదం' అయి ఉండ వచ్చు. పుణేలో (2005 లో) మేమొక పాట కచేరీ పెట్టినపుడు నా వ్యాఖ్యానంలో ‘పూలు గుస గుస ‘లాడెన్’అనీ ఉష్ , బుష్ (పొద)కి అది ఈ రోజే తెలిసినట్టుంది’ అన్నాను. జి.కె.వెంకటేష్ స్వర కర్త అయిన ఈ బాలు పాటకి (చిత్రం:శ్రీవారు మావారు, 1973), ఆర్ డీ బర్మన్ కూర్చిన ఆశా భోసలే పాడిన కార(వా చిత్రం లోని ‘దయ్య యే మై(కహా( ఫసీ’ పాట ప్రేరణ. అన్నట్టు జి.కె. వెంకటేష్ ‘విజిల్’ బాగా వేసే వారు – విజిల్ పాటలు వినిపించే రోజు తీరిగ్గా విందాం. సినారె ‘పూలు గుసగుస లాడెన్ అని’ ఆనాడు అనుకోకుండా ఒక్క సారే ‘లాడెన్’ అన్నారు. ఈయనే అంతకుముందు ‘పగడాల జాబిలి చూడు’ పాట (మూగ నోము) లో ‘మనసూ మనసూ గుసగుసలాడెను’ ‘పెదవీ పెదవీ కువ కువ లాడెను’ అని రెండు సార్లు ‘లాడెన్’ అన్నారు. ఈయనకన్నా ముందు ఆరుద్ర నకారాంతం లేకుండా ‘ఊహలు గుస గుస లాడే’, నా హృదయము ఊగిస లాడే’ ( బందిపోటు) అనడం వల్ల ‘లాడెన్’ శబ్దం తొలిసారి వినిపించిన క్రెడిట్ పోగుట్టుకున్నారు. అయితేనేం, ఆ పాట ఘంటసాల వారి చేతిలో పడి ఒక అరుదైన రాగంలో కూర్చబడిన పాట గా ‘రికార్డ్’ పొందింది. అలాంటిది ఘంటసాల వారే ‘శాంతి నివాసం,1960’ సినిమాలో తన ఒరిజినల్స్ మధ్య రెండు వేరే హిందీ వరసలు (రాధ రావే రాణీ రావే, కం కం కం కంగారు నీకేలనే) ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తెలియక ఆనాడే కాదు ఈనాడూ ప్రతి తెలుగు గుండె ‘దడ దడ లాడెన్’. అయితే ఆ సినిమాకి మాతృక హిందీ చిత్రమే. అలాగనీ ఆ హిందీ వరసలన్నీ తీసుకోక రెండు యుగళ గీతాలకి వేరే హిందీ చిత్రాల పాటలు ఎన్నుకోవడం ‘చిత్ర విచిత్రం’ అనుకోవాలి. వేణు కూర్చిన ‘ఆకాశ వీధిలో అందాల జాబిలీ’ (మాంగల్య బలం, ఘంటసాల కూర్చిన ‘కల కల విరిసీ జగాలే పులకించెలే’ (శభాష్ రాముడు, రెండూ ఒకే హిందీ (చిత్రం: బడా భాయ్ , పాట: చోరి చోరి దిల్ కా లగానా’) బాణీ రేవు మీద నడిచినవే. విచిత్రం ఏమిటంటే ఈ రెండు నావల్లో పాట రాయడం ‘నా వల్లే’ జరుగును అని శ్రీశ్రీ అన్నారేమో. చలపతిరావు ‘పాఠాలు నేర్పేటి పంతులమ్మ’ (దేవుడు చేసిన పెళ్లి, 1975) కి అనుకరణ విధానం అంటే గుప్తంగా దాచేయడం అనేలా బోధించి ‘ఆజారే పర్ దేశీ’ (మధుమతి. సలీల్ చౌదరి) లో చరణం ముందు వచ్చే నేపధ్య వాయిద్యాన్ని మొహమాట పడకుండా అనుకరించేరు. ఇసై జ్ఞాని ఇళయరాజా చేసిన ‘ఓ ప్రియా ప్రియా’, ‘అమ్మ నీ కమ్మని దెబ్బ’ పాటలు హిందీ లోకి దూకి ఆయన పేరిట కాక వేరే వారి పేరిట చెలామణి అయిపోయాయి. జి.కె. వెంకటేష్ దగ్గర ‘అసిస్టెంట్ గా ఉన్న రాజా తరువాతి కాలంలో ఓ ప్రభంజనంలా విరుచుకు పడి తన సత్తాని హిందీలోనూ చూపించేరు. ‘నీలే నీలే అంబర్ పర్ చాంద్ జబ్’, ‘సురు మయి అఖియో( మే, ‘సాథియా తూనే క్యా కియా’ – ఉదాహరిస్తే ఎన్నో. కొన్ని హిందీ సినిమాలు వెంట వెంటనే కాక కొన్నేళ్ళ తరువాత తిరిగి తెలుగు లో ముస్తాబు చేసుకుంటాయి. ఆ కోవలో ఆరాధన (గీత్), భలే తమ్ముడు (చైనా టౌన్ ), అన్నదమ్ముల అనుబంధం (యాదోంకి బారాత్), మాదైవం (దో ఆంఖే బారా హాత్), ఎదురీత(అమానుష్), మగాడు (దీవార్), లాయర్ విశ్వనాథ్, అనురాగ దేవత వంటి ఎన్టీఆర్ చిత్రాలే ఎక్కువగా వచ్చాయి. వీటిలో యథాతథంగా అన్నిటినో లేక కొన్నిటినో హిందీ వరసలే తెలుగులోకి రవాణా చేయడం జరిగింది. కాని అమాయకుడు (1968) (సంగీతం: బి.శంకర్), మల్లెపువ్వు(1978) (సంగీతం: చక్రవర్తి) వంటి రీ మేక్స్ లో ఒరిజినల్ హిందీ వరసలు అస్సలు తీసుకోక పోవడమే విడ్డూరం. హర్షణీయం. మరాఠీ-తెలుగు ఋణానుబంధం మాస్టర్ వేణు మరాఠీ గీతాల ఆధారంగా ‘తెలియని హాయి ఇది’, ‘నాలోని మధుర ప్రేమ లోకాల చాటకోయి’ (పెళ్ళికాని పిల్లలు, 1961) చేశారు. పెండ్యాల ‘పాహి రామ ప్రభో—వెలుగు చూపవయ్య రామ’ అని మాట తప్పక మరాఠీ వరస ( బాయీ మీ వికట్ ఘేత్ లా) లోనే చేస్తానని ‘వాగ్దానం (1961)’ చెయ్యగా విన్నాం కదా. బెంగాలీ-తెలుగు ఋణానుబంధం జగపతి వారి ‘ఆరాధన (1962)’కి మూలం బెంగాలీ ‘సాగొరికా’. కాబట్టి బెంగాలీ చిత్రంలో ఉన్నట్టే పియానో ఎదుట ఉత్తమ కుమార్ లాగ (పాట – అమోర్ షోప్నేదెఖా- వీడియో ‘కనులు తెరిచినా పాటే’ లో చూడండి) తెలుగులో ఏఎన్నార్ ‘ నా హృదయంలో నిదురించే చెలీ-కలలలోనే కవ్వించే సఖీ’ అని ఘంటసాల-శ్రీశ్రీ ల గొంతు-కలం తో పాడారు. ఈ పాట విన్న ఓ అమాయక దర్శకుడు రాజేశ్వర రావును బాగా చేశారని తెగ మెచ్చుకున్నారట. వెంటనే ఆయన వ్యంగ్యంగా ‘అబ్బే. అది మన ట్యూన్ కాదు సార్, కలకత్తా నుంచి తెప్పించారు’ అన్నారట. శ్రీశ్రీ అన్నారు -‘ఇది నాకు చాలా ఇష్టమైన పాటలలో ఒకటి. బెంగాలీ ట్యూన్ ని అక్షరాలా అనుకరిస్తూ రాసినప్పటికీ ఒక స్వతంత్రమైన తెలుగు పాట రాశానని గర్విస్తున్నాను’ అనీ. ఈపాట ప్రేరణతోనే మళ్ళీ శ్రీశ్రీ గారి చేతే మరో పియానో పాట ‘ప్రేయసీ ప్రేమగా పిలిచిన వేళ’ అనేది పి.ఏ.పి. వారు ‘పునర్జన్మ (1963) లో సాధించేరు. చెలీ,సఖీ అనే మాట ప్రేయసిగా పునర్జన్మ పొందిదన్నమాట. ఇదీ విశేషమే. ఒరియా-తెలుగు ఋణానుబంధం 1990 ఆ ప్రాంతాల్లో ఆర్.పి. పట్నాయిక్ వంటి సంగీత దర్శకుడు, నటుడు ఉత్తరాంధ్ర నుంచి రావడం వల్ల ఒక ఒరియా జానపదం ‘రొంగొ బొతి రొంగొ బొతి’ ని అనుకరిస్తూ, అనుసరిస్తూ ఆయనే ‘బుల్లి బుల్లి’ అనే పాట ‘శ్రీ రామ్’ చిత్రం కోసం చేశారు. మళయాళం-తెలుగు ఋణానుబంధం ఈ కాలంలో వచ్చిన ‘నువ్వే కావాలి’ చిత్రం కోసం ‘కళ్ళలోకి కళ్ళుపెట్టి చూడవెందుకు’ అనే ‘చిత్ర’ లావణ్య గీతం స్వర పరచడానికి సంగీత దర్శకుడు కోటి, మలయాళంలో విద్యాసాగర్ స్వర పరిచిన పాటే కావాలి అని కోరుకున్నారు. ‘మనసంతా నువ్వే’ లోని ‘తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంక’ కూడా విద్యాసాగర్ మలయాళంలో చేసిన వరసే ( ‘ప్రణయ వర్ణంగళ్’ లో ‘కన్నాడి కూడుమ్ కూటి’- వీడియో ‘కనులు తెరిచినా పాటే’ లో చూడండి ). గమ్మతేమిటంటే -విద్యాసాగర్ తెలుగు వారే. అంత మాత్రాన ‘ఎక్కడన్నా బావా అంటే’ అనే నానుడిలా ‘మనం మనం బరంపురం’ అంటే అన్ని చోట్లా కుదరదు. ‘కాపీ రైట్’ అంటే కాపీ నా జన్మ హక్కు అనేందుకు వీలు లేదు. అనుమతులు తీసుకుంటే ఆనక బహుమతులు కూడా రావొచ్చు. కానప్పుడు ఒరిజినల్ కంపోజర్ మతి పోవచ్చు. మొత్తానికి సారాంశం ఏమిటంటే – నీటికి బావి,చెరువు,చెలమ అంటూ హద్దులు వేసేకన్నా ప్రవాహంలా పోనివ్వడమే మంచిది. అందుబాటులో ఉంటే దప్పిక తీరుతుంది. సినీ సంగీతం కూడా అంతే. అది విశ్వ జనితం, విశ్వ వ్యాప్తం. అయితే అమృతపానం వంటి ఆ నీరు చెత్తా చెదారం చేరి చెడిపోకుండా చూసుకుంటే అంతే చాలు.‘బాణీ భ్రమణం’ నాలుగో భాగం ఈ ‘విశ్వ’ దాహార్తిని ఎలా తీర్చిందో త్వరలోనే చెబుతుంది. అంటే కొన్ని పాట హిందీ పాటలకి గానీ, కొన్ని తెలుగు, తమిళ భాషల్లోని పాటలకి గానీ ‘అసలు’ మూల కారణంబెవ్వరనిన ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా’ అన్న చందాన ‘విదేశీ’ బాణీ వైపు చూడాల్సిందే. -డా. తాతిరాజు వేణుగోపాల్ , 29 మే 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|