మునుపటి నా మాట
బాణీ భ్రమణం లో చివరాఖరి దశ అంటే నాలుగవ దశ కొచ్చేశాం. భూమి కి చాలా దూరంలో ఉన్న గురు (బృహస్పతి) గ్రహం గానీ, శని గ్రహం గానీ సమీపంలోకి వస్తే టెలిస్కోపు సహాయంతో చూసేందుకు ఇష్ట పడడం సహజం. శని గ్రహమైతే చుట్టూ ఉండే రంగుల వలయాలు ఆకర్షణీయంగా ఉంటాయి. సినీ సంగీతంలోనూ అంతే , ఎక్కడో దూరాన ఏదో దేశం వారి చక్కని సంగీతం లయబద్ధంగానో, శ్రావ్యంగానో వినిపిస్తుంటే ఇలాంటిది మనకీ ఉంటే బావుణ్ను అని అనిపించడం నిజం. ఇదిగో అటువంటి ఇష్టాన్ని అర్ధం చేసుకునీ అందుకోసం ముందు నడుమూ తరువాత హర్మోనియం కట్టుకునీ అదే బాణీ లేదా అటువంటి వరసను అందించే ప్రయత్నం చేస్తుంటారు మన సంగీత దర్శకులు. ప్రపంచ మొత్తంలో ఎలా ఉన్నా మన దేశ సంగీతం మాత్రం నాలుగు వర్గాలుగా ఉంది. ఒకటి- హిందుస్తానీ సంగీతం, రెండు-కర్ణాటక సంగీతం , మూడు-జానపద సంగీతం కాగా నాల్గవది 'సినీ' సంగీతమైంది. మొదటి మూడు వర్గాలూ తమ తమ గిరులు గీసుకునే ఉన్నాయి. సినీ సంగీతంతో పాటూ 'లలిత సంగీతం' (సుగం సంగీతం ) అనేది ఒకటి వచ్చి ఈ మూడు శాఖల్ని కలుపుకునే ప్రయత్నమే చేసింది. కానీ అది అధిక శాతం 'వీనుల వరకే' పరిమితం కావడంతో ఆ కళ మెల్ల మెల్లగా అదృశ్యం అయిపోనారంభించింది. ఎప్పుడైతే ' చూపులూ, వీనులూ' కలిసి ఆనందం అనుభవించడం నేర్చుకున్నాయో అప్పటి నుంచి సినీ సంగీతం బలపడిపోయింది. సినీ సంగీతంలో ఆ మూడు వర్గాలు కలిసిపోవడమే విశేషం.
కర్ణాటక సంగీత పద్ధతిలో జనక రాగాలూ, జన్య రాగాలు ఉన్నట్టే సినీ సంగీతంలో స్వీయ బాణీ, సంగ్రహ బాణీ అని రెండు రకాల చీలిక ఏర్పడింది. స్వీయ బాణీ లో స్వర కర్త కష్టపడి పాట బొమ్మను తయారు చేస్తే, సంగ్రహ బాణీలో ఎవరి పాట బొమ్మకో కేవలం తనవంతుగా మెరుగులు దిద్దే పనితనమే స్వరకర్త లో చూడగలం. ఈ స్వీయ లేదా స్వంత బాణీ చుట్టూ గానీ, సంగ్రహ బాణీ చుట్టూ గానీ తిరగడాన్ని 'బాణీ భ్రమణం' అని చెప్పుకున్నాం. అందులో నాలుగవ దశ అంటే- పూర్తిగానో లేక కొంత వరకో విదేశీ ముద్ర వేయించుకోవడం అన్న మాట. త్యాగరాజ స్వామి వారి కాలంలో బ్రిటీష్ వారు ఉండేవారు. బ్రిటీష్ వారి 'బ్యాండ్' మ్యూజిక్ విని ఆయన 'శర శర సమరే ' అనే కీర్తన కోసం 'కదన కుతూహలం' రాగం సృష్టించారు.'రమించు వారెవరు రా' అనేది 'హుస్సేనీ'లో స్వర పరిచేరు. అక్కడ అది చెవుల కింపు అయింది కనుక ఆయన అలా కుతూహల పడ్డారు. అలా అనీ ఆయనే అదే పనిగా విదేశీ బాణీల తోనే తన శ్రీ రామ నామ గానాన్ని మలుచుకోలేదు. తెలుగు సినిమా పుట్టుకతోనే 'భక్త ప్రహ్లాద' అవతారమెత్తింది. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉంటూనే నారాయణ మంత్రం పలికేడు. అందుకేనేమో దాదాపు పదేళ్ళ కాలం వరకూ ఇలా భక్తి సందేశమే సామాన్య ప్రజకు వినిపించింది. విశేషం ఏమిటంటే 1931-1940ల కాలంలో వచ్చిన సినిమాల లోని పాటల గురించి ఎక్కడా వివరాలు గాని, వినడానికి రికార్డ్స్ గానీ లేవు. అయితే ఎక్కువగా ఆ రోజుల్లో రంగస్థల నట వర్గమే సినిమా పాత్రలు పోషించేది కనుక సినిమాలోనూ రంగస్థల పద్యాలు మాత్రమే ఉండి ఉండవచ్చు ఇవి పూర్తిగా నిస్సందేహంగా దేశీయమై ఉంటాయి. 1940-1950ల కాలంలో కొంత ఆధునీకత సాధించింది తెలుగు సినీ సీమ. 1950ల నాటికే కీ బోర్డ్ యంత్రం వంటివి ఉపయోగానికొచ్చేయి. ఇప్పటికీ వినిపించే పాటల ఆధారంగా చూస్తే భానుమతి నటించిన, నాగయ్య, బాలాంత్రపు రజనీ కాంత రావులకు సంగీతపరంగా సహకరించిన 'స్వర్గ సీమ (1945)' లోనే మొదటి పాశ్చాత్య బాణీ వినపడిందని చెప్పొచ్చు. 'ఓహోహో పావురమా' అనే ఆ పాట లో భానుమతి కంఠం నుంచి వివిధ రకాల 'మాడ్యులేషన్స్' విని ఇప్పటికీ 'ఓహోహో' అని అనకుండా ఉండలేం. ఆనాటికి ఆధునికమైన ప్రత్యేక వాద్యాల 'ఎఫెక్ట్స్' వాహిని వారి 'గుణ సుందరి (1949)' లోనూ, విజయా వారి 'పాతాళ భైరవి (1951)' లోనూ విన్నాం. వీటిని మాస్టర్ వేణు వాయించేవారని అంటారు. షావుకారు (1950) చిత్రంలో ఘంటసాలఒక వినూత్న శైలిలో key board నేఫద్యం తో 'ఏమనెనే చిన్నారి ఏమనెనే' పాట స్వరపరిచారు. యాభైల నాటి విదేశీ ముద్రలు: ఆనాటి చాలా చిత్రాల్లో 'జిప్సీ' శైలి కనిపించింది. అరబ్ శైలి వినిపించింది. పాతాళ భైరవి (1951) చిత్రంలోని 'వగలోయ్ వగలు' అనే పాటను వీనుల విందు భోజనంగా ఆనాడు కోరుకుంటే ఈనాడు 'నరుడా ఓ నరుడా ఏమి కోరికా(భైరవ ద్వీపం)' అన్నది తిరిగి అడిగి మరీ వడ్డించుకున్నారు. విప్రనారాయణ (1954) చిత్రంలో భానుమతి పాడిన 'ఎందుకోయి తోటమాలి' పాటలో దేశీయ ముద్ర కన్నా విదేశీ మేళవింపే హెచ్చు. చార్లీ చాప్లిన్ నగర దీపాల ( City Lights) నేపధ్య సంగీతం ఎంత లలితంగా కూర్చాడంటే ఆ సున్నిత స్వర కాంతికి 'రాజీ నా ప్రాణం' లేచొచ్చింది అని ఆ రోజుల్లో (అంటే 1954 లో) కృష్ణ శాస్త్రి 'మల్లె పూలు మొల్ల పూలు' విసిరితే ఆ మత్తులో పడిపోయారు రాజేశ్వరుని అన్నగారు హనుమంత రావులు ( ఆడియో రూపంలో రెండూ వినే అవకాశం ఇక్కడే మీకు -కనులు మూసినా పాటే- లోనే సాధ్యం). 1957 లో విడుదలైన 'మాయా బజార్' చిత్రంలో నటించిన ఎస్.వి .రంగా రావుకి, పాడిన మాధవపెద్ది సత్యంకి ఎంతో ఖ్యాతి తెచ్చి పెట్టిన 'వివాహ భోజనంబు' పాటకి 'the laughing police man ' ఆధారం. అయితే ఇక్కడ సత్యం రంగారావులో పరకాయ ప్రవేశం చేసి ఆ పాటను ఎంతో బాగా రక్తి కట్టించారు. అది ఒక విదేశీ ముద్ర వేయించుకున్న పాటగా ఎవ్వరూ అనుకోరు (వీడియో రూపంలో రెండు పాటలూ చూసే, వినే అవకాశం ఇక్కడే మీకు -కనులు చూసినా పాటే- లోనే సాధ్యం). అరవైల నాటి విదేశీ ముద్రలు: ఋణానుబంధం (1960) చిత్రంలో 'ఓ అందమైన బావా' ఆవుపాల కోవా అంత మధురంగా దిగుమతి చేసుకున్న పాట.దేవాంతకుడు (1960) లో 'గో గో గో గోంగూరా' అన్న ఘాటు మిరపకాయల పాట గుంటూరు కాక వేరే ఫారిన్ టూర్ చేసి వచ్చిన పాట. బాటసారి(1961) లో 'ఓ బాటసారీ ననూ మరువకోయీ' పాటను భానుమతి pat boon ఆధారంగా కూర్చారు. బాటసారి మాటకేం గానీ తెలుగు 'పాట'సారి విదేశీ ప్రయాణం ఈ అరవైల్లో మహా 'జోరుగా హుషారుగా' (భార్యాభర్తలు, 1961) సాగింది. 'య ముస్తఫా' అంటే o, the chosen one అని అర్థం. మరి ఈ 'ya mustafa' అన్న గానం గ్రీక్, అరబ్, ఇటాలియన్,ఫ్రెంచ్,టర్కీస్ --ఇలా సర్వత్రా వినబడిన చరిత్ర కలిగి ఉంది కనుక అది తిన్నగా మన రాజేశ్వరుడి మదికి చాయిస్ అయి ఇద్దరు మిత్రులు (1961) కోరుకున్న 'హలో హలో ఓ అమ్మాయి' రూపంలో వచ్చి పలకరించింది (వీడియో రూపంలో రెండు పాటలూ చూసే, వినే అవకాశం ఇక్కడే మీకు -కనులు చూసినా పాటే- లోనే సాధ్యం). ఆరాధన(1962) లో 'ఆడదాని ఓర చూపులో' ఆనాటి 'ట్విస్ట్' డాన్సు ల మధ్య గమ్మత్తుగా ఎస్ జానకి గొంతునుంచి 'ట్విస్ట్' లతో ఆశ్చర్య పరిచిన పాట. ఆత్మబలం (1964) చిత్రంలో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' పాట చివరలో వినిపించే 'జాజ్' స్టైల్ నేపధ్యం అప్పట్లో జన రంజకం. శభాష్ సూరి (1964) చిత్రానికి తమిళం ఆధారం. అందులోని 'ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల' పాటలో కలిసినవి ఇరుగింటి పాలు, పొరుగింటి కాఫీ పౌడర్ (ఇది వరకు వీడియో పాట లింక్ ఇచ్చాను. archieves లో మళ్ళీ చూడొచ్చు). తోడూ నీడ(1965) లో భానుమతి స్వయంగా ఆలపించిన క్యూ సరా ఇంగ్లీష్ గీతం 'when I was just ' ఇప్పటికీ మరీ మరీ వినాలనే ఉంటుంది. పొట్టి ప్లీడర్ (1966)లో 'ఇదిగో ఇదిగో తమాషా' పాట మధ్యలో కోదండపాణి తమాషాగా కోరస్ చేత పాడించిన 'అవునంటే పువ్వు లాగా నవ్వుకోరా తేనె చిందేలా' అనే భాగం విదేశీయమే. చిలకా గోరింక(1966) లో 'పాపా కథ విను బాగా విను విను' అన్నది రాజే స్వరమైనా అందులో పాశ్చాత్య పోకడ ఉంది. ఆత్మ గౌరవం (1966) అంటూనే 'అందెను నేడే అందని జాబిల్లి' అనే మెలికల గీతం రష్యన్ వరస నుంచి అందేలా చేశారు రాజే'స్వరులు'. 1966 లో గూఢచారి 116 రూపంలో టి.చలపతి రావు వెతికి పట్టుకున్న పాట 'యా యా యా --మనసు తీరా నవ్వులే నవ్వులే నవ్వులే నవ్వాలి' ఓ ఫారిన్ 'ముద్దు'గుమ్మ వారాల లిస్టు ఇచ్చి పారేసుకున్నదే (ఆడియో రూపంలో రెండు పాటలూ వినే అవకాశం ఇక్కడే మీకు -కనులు మూసినా పాటే- లోనే సాధ్యం). అవేకళ్ళు(1967) చిత్రంలో 'మా వూళ్ళో ఒక పడుచుంది' రాక్ ఎన్ రోల్' వరసల్లో వచ్చిన పెద్ద హిట్ సాంగ్. పూల రంగడు(1967)లో ప్రత్యేకంగా 'స్టెప్పులు' వేస్తూ ఏ ఎన్ ఆర్ రంగుల్లో ఆడించిన 'నీ జిలుగు పైట నీడలోన' పాట విదేశీ,దేశీల కలగలుపు. ఆదర్శకుటుంబం(1969) లో మళ్ళీ చాలా ఏళ్ళకి రాక్ ఎన్ రోల్ వరసల్లో రాజేశ్వరరావు 'హలో సారూ ఓ దొరగారూ' అనే పిక్నిక్ పాట కూర్చడం ఒక ఆట విడుపు. డబ్భైల నాటి విదేశీ ముద్రలు: ధర్మపత్ని(1970) లో చలపతి రావు జింగిల్ బెల్స్ ఆధారంగా చేసినా 'కాకమ్మ చిలకమ్మ కథలే మాకొద్దు - మా గాంధీ చెప్పిందే మా కెంతో ముద్దు' అనే పిల్లల దేశ భక్తి గేయం బాగా కుదిరింది కనుక ఇప్పటి పిల్లల చేత వల్లె వేయించాలి. 1970 లో ఓ 'చిట్టి చెల్లెలు' 'ఈ రేయి తీయనిది' అని భర్త అనురాగానికి మురిసిపోతుంటే ఆ మోదం 'love is blue' అనే విదేశీ ఆమోదం అని గ్రహించాలి. రాజేశ్వర రావు మళ్ళీ 'సమయానికి తగు పాట కూర్చును' అనిపించుకున్న ఘనులు (వీడియో రూపంలో రెండు పాటలూ చూసే,వినే అవకాశం ఇక్కడే మీకు -కనులు చూసినా పాటే- లోనే సాధ్యం). ఒకనాటి విజయచిత్ర 1975 జులై సంచికలో రాజేశ్వర రావు ఏమన్నారంటే- 'మంచి బాణీలు ఎక్కడివైనా మనం అనుసరిస్తూ, వాటికి నూతన స్వరూపాలను ఇవ్వడంలో తప్పేమి లేదు. నేను 'ఇద్దరు మిత్రులు' చిత్రంలో స్వర పరచిన 'ఖుషీ ఖుషీగా నవ్వుతూ','హలో హలో ఓ అమ్మాయీ' పాటలు కాని, 'భార్యా భర్తలు' చిత్రంలో 'జోరుగా హుషారుగా' వంటి పాటలు కానీ కొంత పాశ్చాత్య సంగీత ప్రభావంతో ట్యూన్ చేసినవే. అయితే ఆ పాటలు మక్కీకి మక్కీ విదేశీ సంగీతం అని ఎవరూ అనలేరు! కారణం సృజనాత్మకంగా నా కృషి కూడా ఆ పాటల్లో ఉంది.' ఈ నిజాయితీ ఇప్పుడు ఎందరిలో ఉందీ? పాటకు పల్లవి ప్రాణం అంది నాటి 'సంగీత లక్ష్మి', చక్కని రాజేశ్వర రాగ మాధుర్యంతో. నేడో? 'పాటకు ప్రాణం పల్లవి అయితే --ఓ ఓ ఓ ' అంటూ కుర్ర జనం మైఖేల్ జాక్సన్ బాణీలో మెలికలు తిరిగి పోతోంది. అయినా సరే, 'ముస్తఫా ముస్తఫా don't worry mustafa' అంటూ తన బాణీ ప్రభంజనంతో విదేశాల లోనూ దుమారం రేపాడు ఏ. ఆర్. రెహమాన్. ఆ మాటకు అర్థంగా తానే ఇటు దేశంలోనూ అటు విదేశాల్లోనూ 'the chosen one' అయిపోయాడు. అతనికి కొంచెం ముందే బితోవన్, మొజార్ట్ లను తిరగ తోడుతూనే, సరిగమలతో ఆరోహణలు,అవరోహణలు ఆడుతూనే, ఎక్కడా విదేశీ బాణీలు భారంగా మోసుకు రాకుండా ఓ రెండు దశాబ్దాలు మలయ పవనంలా సాగి పోయాడు ఇళయ రాజా. ఔత్తరాది బిదేషీ ఉత్సాహం: వీరి కన్నా ముందే నాటి 1950-1960 ల కాలంలోనే మొజార్ట్ సింఫనీ 40 ని పల్లవి వరకే తీసుకునీ దేశీయత జోడించి హిందీ పాట 'ఇత్ నా న ముఝ్ సే తు ప్యార్ బడా' కూర్చిన ఘనుడు సలీల్ చౌదరి. అంతకు మించి విదేశీ బాణీ మీద ప్రేమ పెంచుకోని వాడూ ఆయనే. రాక్ ఎన్ రోల్ మోడల్ -రారాజు- ఎల్విస్ ప్రెస్లీ 'who makes my heart beat like thunder' అని పాడితే మార్గరెటా ఆనందం వెల్లువ కావాల్సిందే. ఆ పాటను భారత భూ మార్గం పట్టించి దారి పొడుగునా స్వప్న సుందరిని తలుచుకుంటూ జీపు నడిపే కుర్రవాడి చేత హుషారుగా 'కౌన్ హై జో సప్నోమే ఆయా' అంటూ ప్రశ్నించిన శంకర్ జైకిషన్ ఘనులే. పల్లవి సరే, పాట చరణాలు స్వంత ధోరణిలో ఎంత అందంగా మజిలీ చేశాయీ! ఒకరిలో 'జై' ఉండనే ఉంది కనుక రెండో వారిని జై జై శంకర్ అన వచ్చు(ఆడియో రూపంలో రెండు పాటలూ వినే అవకాశం ఇక్కడే మీకు -కనులు మూసినా పాటే- లోనే సాధ్యం). ముక్తా'ఇంపు'గా----- కొత్త సంగీత దర్శకుల (ఇటు తెలుగైనా, అటు హిందీ అయినా) 'కాపీ' ధోరణి గురించి ఇక్కడ ఎక్కువగా ప్రస్తావించలేదు. రాజేశ్వర రావు గారు అన్న ఆ 'సృజనాత్మక కృషి' వీరందరిలో కనపడితే వీరినీ 'భేషజం' లేకుండా 'భేష్' అనవచ్చు. అంత వరకూ 'హుష్' గప్ చుప్. కాపీ అనగా ఒరిజినల్ కి వేసే టోపీ అని, చెయ్యని వాడికి 'Hats Off ' అని సరి పెట్టుకోవాలి. రాజేశ్వర రావు అనేవారు- 'విదేశీ బాణీలు మనకు సూటబుల్ గా ఉంటేనే వాటిని ఎంపిక చేసుకోవాలి. లేకపోతే ఎబ్బెట్టుగా ఉంటుంది'. నిజమే. అన్ని వేల కొలది విదేశీ పాటల్లో అప్పుడప్పుడూ ఒకటీ అరా ఎంపిక చేసుకునీ వీరంతా తమ బాణీ, తమ అస్తిత్వం ఏమాత్రం కోల్పోలేదు. బాణీ భ్రమణం దశలన్నీ పూర్తయ్యాయి. అన్నట్టు ఈ జూన్ 4 న కవి ఆరుద్ర వర్ధంతి. ఆరుద్ర భౌతికంగా ఈ దేశంలో లేరు. ఏ విదేశాల్లోనూ లేరు. బాణీ విదేశీయమైనా (హలో హలో ఓ అమ్మాయీ, మనసు తీరా నవ్వులు, గో గో గో గోంగూర జై జై జై జై ఆంధ్రా') తెలుగు జాతీయాలు తన ముద్ర - అని రాసి చూపించి మన మనసుల్లో గూడు కట్టుకున్నారు. కాకతాళీయం కాకపొతే- ఇవాల్టి వార్త ఏమిటో తెలుసా? భారత వాయు సేన గుజరాత్ లోని నలియా ఏర్ బేస్ లో (దేశీయం) ఇజ్రాయిలీ (విదేశీయం) మీడియం పవర్ రాడార్ నెలకొల్పనుంది. దాని పేరు - ఆరుద్ర! వారి దృష్టిలో అది నక్షత్ర నామం కావొచ్చు. మనం మాత్రం 'అది మా కవి పేరే' అంటూ గెడ్డం నిమురుకోవచ్చు. త్యాగరాజ స్వామి 'ఆడ మోడి కలదా' అన్నారు. అవును - ఆడ 'మోడి' కలరు (మోడి, గెడ్డం కల వారే), వారి ధర్మమా అని ఇది సాధ్యమై యుండ వచ్చును. ఈ పూట నా మాట కి ఈ విధంగా సాయ పడిన ఆరుద్ర కవి కి శత 'కోటి' వందనాలు. -డా. తాతిరాజు వేణుగోపాల్, జూన్ 4, 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|