మునుపటి నా మాట
ఆయన -పాట అనే మాటకి నిర్వచనం. ఆయన పాట రాసి ఇవ్వడం అంటే మరో కొత్త కుసుమం విరిసినట్టే. అదే పాట స్వరాల చందనం పూసుకుందంటే ఇక ఆ తోటనిండా పరిమళాల గుబాళింపే. ఆకాశవాణి ఆయన పాటని ఆనాడు ఆకాశ వీధుల గుండా తిరగనిచ్చి ప్రతి ఇంట మళ్ళీ మళ్ళీ వినిపించే అవకాశం కలిగించింది. ఆయన రాసిన శ్రవ్య నాటికలు ఒక పక్క ముచ్చటైన కోమలమైన మాటలతో, మధ్య మధ్య పాటలతో కనిపించని దృశ్యాన్ని కళ్ళకు కట్టి చూపించేవి. ఆయన తన గిరజాల జుట్టు సవరించుకుంటే ఆయన చుట్టూ ఆయనతో జట్టు కట్టుకునేవారే అంతానూ. ఒక పక్క విశ్వనాథ, మరో పక్క శ్రీనివాస రావు. అదే శ్రీనివాస రావు శ్రీశ్రీ గా మారి తనదైన బాణీని సంపాదించుకునే వరకూ ఈయన భావ కవితా శైలినే అనుసరించారు, ఎప్పుడైతే ఆ కొత్త గొంతులో ఏదో వేదన, దాన్ని తొలగించే సాధన కోసం పడుతున్న తపన చూసారో ఈయన ‘ శ్రీశ్రీ మనలో కాస్త తల పైకెత్తి చూస్తున్నాడు’ అని మెచ్చుకున్నారు. తాను మాత్రం ఒక షెల్లీ గానే మిగిలారు.
ఒకానొక నాగరాజు, అతని కంటి వెలుగు మల్లీశ్వరిల ప్రణయ గాథని తెరకెక్కించే ప్రయత్నంలో బి.ఎన్.రెడ్డి గారు ఆయన్ని సినిమా లోకం వైపు దారి తీయించారు. తనదైన శైలిలో ఆయన మూడు పేజీల వర్ణన రాసి ఇస్తే- రెడ్డి గారు భళ్ళున నవ్వి ‘దీన్ని మూడు నిమిషాల పాటే చూపిస్తా’ అన్నారట. అప్పటినుంచి సినీ కళలో మెళకువలు మెల్లమెల్లగా తెలుసుకున్నా ఆయన పాటను మాత్రం పరుగులు పెట్టించలేదు. 1951 లో ‘మల్లీశ్వరి’ కి ఆయన తొలిసారిగా మాటలూ పాటలూ రాసి ఆ చిత్రం ఒక మధుర దృశ్య, శ్రావ్య కావ్యమయ్యేలా చేసారు. మళ్ళీ 1968 లో ‘ఉండమ్మా బొట్టు పెడతా’ అనే విశ్వనాథ్ సినిమాకి పాటలన్నీ ఆయనే రాసి ఆ చిత్రానికి ప్రాణం పోసారు. చిత్ర సీమ లో విచిత్రం – బి ఎన్ రెడ్డి గారి ‘రంగుల రాట్నం’ (1967) చిత్రంలో ఈయన పాట ఒక్కటీ లేక పోవడం. అదే రెడ్డి గారి ‘బంగారు పంజరం’ (1969) ఈయన పాటల వల్ల కాస్త గుర్తుండి పోయింది. ‘మనసున మల్లెల మాల లూగెనే’ పాట పల్లవి మొత్తం పాటలో ఎక్కడా పునరుక్తం కాదు. ఆ ప్రయోగం ఇటు రాసిన ఈయనికి, స్వరం కట్టిన రాజేశ్వరుడికి పేరు తెచ్చింది. అమ్మో ఆయన పాటా ? అదీ ఇంత తొందరగానా? – ఇదీ ఆయన వెనుక నలుగురూ అనుకొనేది. ఆయనంటే ఆలస్యమనీ, ఆయనకదంతే – అలసత్వమనీ అపవాదులు. అవును మరి- నోటు తీసినంత వేగంగా ఆయన పాట తీసి ఇవ్వలేదు. అంతెందుకు – మామూలు సినిమాలకైనా మహా విలువైన మాటలు పొదిగి పాటలిచ్చి ఆయా నిర్మాతల్ని కాపాడేరు. అంతకు మునుపు పావురం పాట అంటే ఏదో సందేశం పంపే నెపంతో రాసే వారు కవులు. ఈయన ‘ఎగిరే పావురం’(జగత కిలాడీలు, 1969) లో గుప్తమై ఉన్న శక్తిని బయటకి లాగి ప్రోత్సహించారు. భక్తులంటే భగవంతుని పట్ల చొరవ కలిగి ఉండాలి అని నమ్మిన వ్యక్తి కనుక మూడు సందర్భాల్లో శబరికి, ఒకటి రెండు దఫాలు గుహుడికి పాట లిచ్చి పుణ్యం మూట కట్టుకున్నారు. ప్రకృతి పట్ల ఎంత జాలి అంటే – ‘ప్రతి పులుగూ (పక్షి) ఎగిరే దైవమ’ని భావించారు. మనిషి పట్ల ఎంత దయ అంటే- ‘ప్రతి మనిషీ నడిచే దైవం’ అన్నారు. ‘మనిషైతే మనసుంటే కనులు కరగాలి, కరిగి కరుణ కురియాలి’ అన్నారు. నిర్మాతకి ఏ హిందీ బాణీయో లేదా ఏ పాశ్చ్యాత్య ధోరణియో నచ్చి అదే వరసలో పాట కోరితే అప్పుడూ ఆయన తనదైన ముద్రను వదులుకోలేదు. అలా వచ్చినవే ‘మనసూగే సఖి తనువూగే ప్రియ’, ‘కన్నె ఎంతో సుందరి’, ‘లతలాగ ఊగే నా ఒళ్ళు’ వంటి పాటలు. రేడియో శ్రవ్య నాటికల ప్రభావంతో వీలైనప్పుడల్లా ఆయన సినిమాల్లో కూడా యక్ష గానం (మల్లీశ్వరి, 1951), ఇదిగో స్వర్గ ద్వారం తెరిచారెవరో (ఆకలి, 1952), మహిళామణులారా ఎవ్వరో మధువన కుసుమాలా?( తండ్రి, 1953), మిసమిస లాడే పసిడి లేడికయి (బంగారు పాప, 1954), అందాల మన దేశము (రాజగురువు, 1954), నీల మోహనా రారా (డాక్టర్ ఆనంద్, 1966), అదిగో మా రాధిక (కలసిన మనసులు, 1968), ఓం హరా పురహరా (అఖండుడు, 1970) ఈ దారి నా స్వామి నడిచేనే (చెల్లెలి కాపురం, 1971), విందురా వినగలరా విన్న విన్న కన్నీరు కారునే ( శ్రీ రామ పట్టాభిషేకం, 1978) వంటివి రాసారు. ఇవి ఇప్పటికీ ప్రదర్శనా యోగ్యమే. మధు వని, మధు మాసం, మధుపం, మధు మంత్రం, మధురం, మధుర రహస్యం, మధుర క్షణం,మధురామృతం- ఇలా ఎన్నో తీయని మాటలు ఆయన పాటల్లో తరచుగా దర్శనమిస్తాయి. అందుకే శ్రీశ్రీ అన్నారు- ఆపాత మధురమైన ఆయన సాహిత్యం సమస్తమూ ఇక్షు రసార్ణవమే –అని. ఆయనకంటూ మదిలో ఒక ఆశ్రమం ఉంది. అందుకే ‘తోటకు నే తోబుట్టువును’ అన్నారు. ఇంకా ‘తేటనీటి ఏటి ఒడ్డున నాటిన పువ్వుల తోట’ కనుక అక్కడ ‘అన్ని రాత్రులూ పున్నమి రాత్రులే’, ‘ఆరు ఋతువులూ ఆమని వేళలే’! కాబట్టే ‘శీతవేళ రానీయకు, శిశిరానికి చోటీయకు’ అంటూ కలవరించేరు. ‘ముసలి తనపు అడుగుల సడి ముంగిట వినపడినా వీట లేడని చెప్పించు వీలు కాదని పంపించు’ అని ప్రార్ధించేరు. ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ గా ఉండాలని ఎంత కోరుకున్నా ‘రాదిక వసంత మాసం’ అని దిగులు తోనే 1980 ఫిబ్రవరి 24 రాత్రి ‘ మాయ మయ్యెదను మధుర గానమున’ అనే మౌన ముద్ర తో శాశ్వత నిద్ర పోయారు. ఆయనే – దేవులపల్లి కృష్ణ శాస్త్రి. ఆయన గొంతు శస్త్ర చికిత్సలో ఏనాడో మూగ బోయింది. అయినా ‘మాట తీసుకుని నాకు మౌనమిచ్చావు’ అని ప్రభువుని నిందించక ‘ఉదయ గిరి పైన అదిగో గగనాన కదలే దినరాజు తేరు’ ,’ఘనా ఘన సుందరా- అది పిలుపో మేలు కోలుపో’ అంటూనే ఆనాడే తానూ ‘రీ చార్జ్’ అయి మనల్ని మన తెలుగుని ‘రీ చార్జ్’ చేయించారు. ‘జయ జయ ప్రియ భారత జనయిత్రీ ‘ అని భారత మాతని, ‘ఘల్లు ఘల్లున కడియాలందెలు అల్లనల్లన నడయాడె తెలుగు తల్లి’ని సదా స్మరించమన్నారు. ఇప్పుడు కూడా ఆయన పాటలు ‘పోటీ’ పెడితే నెగ్గుకొస్తాయి, పోటీ పడీ మరీ దగ్గరౌతాయి. ఆ స్వేచ్ఛాజీవి ఆనాడు ఒక చిలక్కి చెప్పినదేమిటో, ఒక పావురంతో అన్నదేమిటో ---ఒక్కసారి గుర్తు చేసుకుంటే అదే పాట జనావళి ఆయనకిచ్చే నివాళి ఔతుంది. -తాతిరాజు వేణుగోపాల్ , ఫిబ్రవరి 24, 2011.
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|