మునుపటి నా మాట
‘ఏమిటోయ్ గోపాలా, డబ్భై రోజులూ నా మీదే జాలి చూపాలా? ఊరికే నన్ను ఆకాశానికి ఎత్తెయ్యడం మానేసి అసలు సంగతి చెప్పు ... ఈ శీర్షిక దేన్నో తలపిస్తోంది’ ‘కనిపెట్టేశారే మాస్టారూ.. సంగతులంటారా...అవి మీ వంటి ఉత్కృష్ట సంగీత సామ్రాట్టులకే గానీ ఉత్తుత్తి మాకెలా సాధ్యమో చెప్పండి. ఆకాశంలో ఉండిపోయారు గానీ ఇదిగో ఈ ఉదకం ...పాద్యంగా అందించి మీ పాదాలు కడగాలని నాలాగ ఎందరికో ఉందండీ. ఆంధ్ర సంగీత కుమారా జయోస్తు మీకు!’ ‘ఇదిగో మళ్ళీ అదే మాటా? కనిపెట్టాననే అంటావ్...కనులకి చూపెట్టవేం?’ ‘చూప సాధ్యం కాదండీ మాస్టారూ..వినిపిస్తానంతే. అప్పుడు గుర్తిద్దురు గానీ.. ఈలోగా సరదాగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వెయ్యోచ్చా అండీ? ‘వెయ్యోచ్చా అని వెయ్యి ప్రశ్నలు అడిగేవ్ ..వద్దు బాబూ అన్ని!’ ‘అబ్బే ..మూడంటే మూడే నండి..’ ‘నీకు మూడ్ వచ్చిందని తెలుస్తూనే ఉంది బాబూ... ప్రశ్నలు మూడే అని అనుకోమంటావా?’ ‘హమ్మయ్యా...అస్సలు అడగవద్దంటారేమో అని భయపడ్డాను. మాస్టారూ...ఈ భూమ్మీద మనిషికి ఉండవలసిన ముఖ్యమైన గుణం ఏది?’
‘మొదటి ప్రశ్నా?....సరే ....ఇదీ నా జవాబు ...చూసుకో....పరోపకారం!’ ‘ఏ మనిషికైనా తన గుండె సవ్వడి తనకి స్పష్టంగా వినిపించే దెక్కడ?’ ‘సొంతవూరు..లో’ ‘ప్రహ్లాద, మార్కండేయ, పోతన, రామదాసు, అంబరీష, తుకారాం వంటివారు గుర్తున్నంతగా గుర్తుకురాని భక్తుడు ఎవరంటారూ?’ ‘భక్త రఘునాథ్! ఏమిటోయ్... మీరెక్కడ పుట్టారు? విజయనగరం ఎలా వెళ్ళారు? ద్వారం వారి ముందు మీరెలా పాడారూ? అక్కినేని, నందమూరి వార్లకి తొలిసారిగా ఎప్పుడు పాడారూ? మీ చివరి రోజుల్లో మీతో పాటు అప్పటి వర్ధమాన గాయకుడు గొంతు కలిపారట, నిజమా?-----అని అందరిలా ఏవో ఇలాంటి ప్రశ్నలు వేస్తావనుకున్నా...మళ్ళీ ఇక్కడా ఓ మెలిక పెట్టావు...లోగుట్టు పెరుమాళ్ళు కెరుక...మీ గుట్టు నాకెరుక’ ‘మీరే కదండీ గళవేల్పులు...అంటే సంగీతానికి మరో పేరు అని చెప్పుకోదగ్గ పెరుమాళ్ళు మీరు. సర్లెండి..ఏం చేస్తాం? గుట్టు రట్టు చెయ్యండి’ ‘నీ ప్రశ్నలు తమాషాగా వేస్తూనే ...నిర్మాతగా నేను తీసిన లేక సమర్పించిన లేదా చెయ్ కాల్చుకున్న మూడు తెలుగు చిత్రాల పేర్లన్నీ రాబట్టుకున్నావ్.....ఉండు నీ పని చెప్తాను...’ ‘ఆఆఆ...ఆగండాగండి...తరవాత నీ జిమ్మడ...అని పాటలో అత్తగారు అన్నట్టు మీరు అనక ముందే ఆ పాట గురించి కొన్ని మాటలు అననీయండి’ ‘అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మో..పాట గురించేనా?’ ‘అవును...కోడల్లేని అత్త గుణవంతురాలు ...ఇప్పుడు చెప్పండీ...ఈ అత్తా కోడళ్ళ ద్విపాత్రాభినయం... అదే ద్విగాత్రాభినయం మీకెలా సాధ్యపడిందీ? హాస్య రసం పండించడంలోనూ మీరు ఘనులు. కార్నివాల్ వేడుకల్లో మీరు విచిత్ర వేషధారణ చేసి రక్తి కట్టించేవారని విన్నాం. నందమూరి,అక్కినేని వారలకే కాదు రేలంగి గారికి సైతం మీరు ఆయనే పాడారా అన్నంత అద్భుతంగా పాడారు. ఒక్క లవకుశ చిత్రాన్నే తీసుకుందాం...నాగయ్య, ఎన్టీఆర్, ధూళిపాళ, కాంతారావు, రేలంగి ...ఇన్ని పాత్రలకి ఒకే గళం... ఇదిగో.. మీరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు.. ఆ సీటు బాలు గారికి దక్కింది. బాలుగారికి తాతినేని చలపతిరావు గారు అక్కినేని వారికి సరిపోయేలా కొన్ని గళ మెళకువలు తెలుసుకోమన్నారట, ఆలుమగలు చిత్రం సమయంలో. చలపతిరావు గారు మిమ్మల్ని మిత్రమా అని అంటారు కదండీ’ ‘అవును... చలపతి అప్పట్లోనే ఫాస్ట్ మ్యూజిక్ తెచ్చారు. నాకు తెలిసి హిందీ సీమలో శంకర్ జైకిషన్ ద్వయం మెలోడీ తో పాటు ఫాస్ట్ నెస్ తీసుకొచ్చారు. వారి సంగీత దర్శకత్వంలో ఒకే ఒక్క చిత్రానికి నేను పాడాను. విషాదం ధ్వనించే ‘సుడిగాలిలోన దీపం’ పాటకి వారు చక్కని బాణీ కట్టారు’ ‘అందులో అందుకు భిన్నంగా ఉండేది.. హుషారు పాట ...కంటిచూపు చెప్తోంది ....అదీ మీరు అద్భుతంగా పాడారు. ఆ రోజుల్లో కాలేజీ కుర్రకారులకది కంఠస్తం అండీ’ ‘బాబూ.. డబ్భైల కాలం నాటికి పాటల్లో వేగం అందుకోనారంభించింది’ ‘ఆడవారి, మగవారి ఫేషన్లు కూడా మారాయండీ అప్పుడే. బాబీ చొక్కాలు, దసరా బుల్లోడు పంచలు, ప్రేమ నగర్ చీరలు, బెల్ బాటం ప్యాంట్ లూ... వచ్చినవప్పుడే కదండీ. ఇందాక మీరు లోగుట్టు పెరుమాళ్ళు కెరుక ..అనే లోకోక్తి విసిరి ఒక సినిమా పేరు గుర్తు చేశారు. ఆ సినిమా లోని ఒక పాటలో యాభైల కాలం నాటి అబ్బాయిని డబ్భైల కాలం నాటి అమ్మాయి ఆట పట్టిస్తుంది. తీరా చూస్తే ఆ సినిమా విడుదలైంది పంతొమ్మిది వందల అరవై ఆరులో... ఆ పాట మీరూ,జానకమ్మ పాడారు. అలా డబ్భైల కాలం వేగం పుంజుకుంటున్న తరుణంలో మీరు మాకు దూరమై పోయారు. ఒక్కసారి కాలం రీలు వెనక్కి తిప్పి చూస్తే జానపదంలోనూ మీ స్వర పద ముద్రలు కొంచెం ఫాస్ట్ గానే ఉండేవనిపిస్తుంది. లవకుశలోని రామన్న రాముడు కోదండ రాముడు సీతమ్మ తల్లితో వచ్చాడురా.., శభాష్ రాముడులో ఓ చందమామ ఇటు చూడరా..., వాల్మీకిలో అనురాగమిలా కొనసాగవలె .., పాండవవనవాసము లో మొగిలిరేకుల చినదానా ......, బందిపోటులో మల్లియలో మల్లియలో ....పెద్దక్కయ్యలో ఎదురుచూసే వేళలో ...ఇలా జానపదం అనే కాదు యుగళ గీతంలోనూ స్పీడ్ పెంచారు’ ‘డార్లింగ్ డార్లింగ్ కమాన్ ..రాక్ ఎన్ రోల్ ...అన్న పాట ప్రయోగం చేశాం ..సినిమా పేరు రంగేళీ రాజా..చిత్రసీమలో నా తొలిపాట స్వర్గసీమ లో భానుమతి గారితో కలిసి పాడిన ఓ నా రాజా ... లో నేనన్న పదాలు జానపదాలే... లేయెన్నెల చిరునవ్వుల...అని కదా ఉన్నాయి’ ‘అవును మాస్టారూ.. సంగీత దర్శకుడిగా మీరు జానపదం, లలిత గీతం, పద్యంతో పాటు సినిమా పాటకి కొత్త ప్రతిష్ఠ తీసుకొచ్చారు. ఇంకో విశేషం- మీకు గమ్మత్తైన సినిమా పేర్ల డబల్ షేర్లు దక్కాయి. జయం మనదే ..మీది. విజయం మనదే.. మీదే. శభాష్ రాజా మీదే..రంగేళీ రాజా కూడా మీదే. యాభైల కాలం నాటి నిర్దోషి కి మీరే. అరవైల కాలం లోని నిర్దోషికీ మీరే. రాముడు సీరీస్ ఉధృతంగా ఉన్న రోజుల్లో మీకు మొదట శభాష్ రాముడు దక్కాడు. ఆ తరువాత టైగర్ రాముడు గాండ్రించాడు. ఇవి అలా ఇంచితే... ఒకే సినిమా పేరు రెండు సార్లు వస్తే టీవీల వాళ్లకి ఎంత అశ్రద్ధ అంటే ఏ సినిమాకి ఎవరు స్వర కర్తలు అనే జిజ్ఞాసకి తావివ్వక పాటల వీడియోలు ఇష్టం వచ్చినట్టు చూపిస్తారు. ఉదాహరణకి- సుసర్ల వారి ప్రతిభ గురించి చెబుతూ ఆయన చేసిన ‘ఆలీబాబా నలభై దొంగలు’ సినిమా పేరు మాత్రమే చెప్పేసి మీరు స్వర పరచిన అదే పేరున్న సినిమాలోని పాటలు ఒకటి రెండు చూపించారు. ఏదో ఆ సమయానికి పోటీ పడి ఏదో ప్రసారం చేసేయాలి అన్నదే వారి లక్ష్యం. ఎవరు ముందు ప్రసారం చేశారన్నదే వారికి ముఖ్యం. సుసర్ల వారనగానే ఇలవేల్పు సినిమాలోని ఒక త్రిగళ గీతం గుర్తొస్తుంది. ఆ రోజుల్లో మీరు విదేశాల్లో ఉండడం చేత అక్కినేని వారికి రఘునాథ్ పాణిగ్రాహి అనే ఉడియా గాయకుడి చేత పాడించారని విన్నాం. రఘునాథ్ అనే ఈ పేరు చెప్పగానే మీరు స్వయంగా నిర్మాతగా మారి తీసిన మూడో సినిమా భక్త రఘునాథ్ గుర్తొచ్చింది. అవునండీ.. ఉత్కళ దేవుడు శ్రీ పూరీ జగన్నాధుడి భక్తుడు మీద చిత్రం తీయాలని మీకు సంకల్పం కలగడం విశేషం. బహుశా మీరు విజయనగరం సంగీత కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో ఉత్కళ రాష్ట్రం దర్శించుకుని ఉంటారు, లేదా ఆ జగన్నాధుని చరిత్ర విని ఉంటారు. ఆరుద్రగారు బావామరదళ్ళు సినిమా కోసం మీరు పాడిన ముక్కోటి దేవతలు ఒక్కటైనారు పాట చివర్లో ఒక చరణం రాశారు- ‘మొండి చేతులవాడ వెందుకైనావంటే/చేతికెముక లేని దాతవని చాటుటకై /నీ రథము కదిలితే శుభము లొనగూరును /నా జీవిత పథమును మార్చు శ్రీ జగన్నాథా’-అని. కాని ఆ చరణం రికార్డ్ కాలేదు. బహుశా తతిమ్మా చరణాలు అన్నీ ఆంద్ర పుణ్య క్షేత్రాలకు చెందినవి కావడంవల్లనే ఆంధ్రేతర పుణ్యక్షేత్రాన్ని తీసుకోలేదేమో. ఏది ఏమైనా ...మీరు మూడు సినిమాలు నిర్మించినా అవి అపజయం పొంది మిమ్మల్ని ఆర్ధికంగా బాగా దెబ్బతీశాయని విన్నాం.’ ‘కాలం మారుతుంది..చేసిన గాయాలు మాన్పుతుంది... అని తరువాతి కాలంలో పాడాను కదా బాబూ... ఇవన్నీ గాయాలు... భవిష్యత్ పాఠాలు. నిర్మాతగా నా తొలి చిత్రం పేరు పరోపకారం. తెలుగులోనే కాదు తమిళంలోనూ తీశాను. కమల్ ఘోష్ దర్శకులు. మహానటి సావిత్రి నటించారు. ముక్కామల వారూ, జీ వరలక్ష్మి గారూ ఉన్నారు. పరులకు ఉపకారం చేయడం కోసం పరోపకారం సినిమా తీశాను. అనుకున్నామని జరగవు అన్నీ ...ఆత్రేయ కలం నుంచి ఆ తరువాతి కాలంలో వచ్చిన పాటే నాకు ఉపశమనం. సినిమా విడుదల అనేది ప్రేక్షక నాడిని బట్టి చెయ్యాలి. మూడంటే మూడు సినిమాలు విడుదలకు నోచుకున్నవైతే మధ్యలో తలపెట్టిన ‘దైవం’ సినిమా ఒక పాట రికార్డింగ్ వరకు వెళ్లి ఆగిపోయింది. సరే . రెండేళ్ళు ఆగి ఎన్టీఆర్ , రాజసులోచనలతో సొంతవూరు సినిమా తీశాను. రాజసులోచన తొలిసారిగా కథానాయిక అయినది ఈ సినిమాలోనే. ఒక అంతర్నాటకంలో శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ తొలిసారిగా కనిపించిన చిత్రం ఇదే. అయితే ఆయన్ని కొన్నేళ్ళ తరువాత కె.వి.రెడ్డి గారు శ్రీకృష్ణుడిగా తీర్చి దిద్దిన మాయాబాజార్ చిత్రం ఏవో కారణాలవల్ల నా చేతుల్లో పడింది. అందులో యుగళగీతాలు రాజేశ్వరరావు మాస్టారువి.’ ‘భక్త రఘునాథ్ చిత్రం విడుదలైనప్పుడే భక్త జయదేవ్ చిత్రం రావడం వల్ల ఏమైనా ....’ ‘భక్త రఘునాథ్ చిత్రం అరవైవ సంవత్సరంలో నవంబర్లో వచ్చింది. భక్త జయదేవ చిత్రం అరవై ఒకటి ప్రారంభంలో అనుకుంటా వచ్చింది. అందులో రాజేశ్వరరావు మాస్టారు అద్భుతమైన స్వర రచనలు చేశారు. అందులో హమీర్ కళ్యాణ్ రాగంలో నేను పాడిన నీ మధు మురళీ గానలీల, స్వీయ చిత్రం భక్త రఘునాథ్ కోసం నేను సింధుభైరవి రాగంలో స్వర పరచి,పాడిన - నీ గుణగానము నీ పదధ్యానము అమృతపానము రాధేశ్యాం –సముద్రాల రాఘవాచార్యుల వారి ఈ రెండు గీతాలు విశేషంగా ప్రజాదరణ పొందినవే.’ ‘కాంతారావు,జమున,రేలంగి వంటి మేటి తారాగణం ఉన్నా, మీ గాడ్ ఫాదర్ అనదగ్గ సముద్రాల రాఘవాచార్యులు దర్శకత్వం చేసినా భక్త రఘునాథ్ చిత్రం ఎందుకనో పోలేదు జనాల హృదయాల్లోకి. ఎంత గొప్ప విచిత్రమో చూశారా.. గాయకులైన మీరు నిర్మాతగానూ , కవులైన సముద్రాల వారు దర్శకులు గానూ మారడం! అరుదైన ఘట్టం. పోన్లెండి.. తెలుగు సినిమా చరిత్రలో ఈ ఘట్టం నిలుస్తుంది.’ ‘ఇక నా జీవిత గాథని ఆరుద్ర గారి రచనతో సినిమాగా తీయాలని అనుకున్నాను. తాతినేని ప్రకాశరావు గారు దర్శకులు. లక్ష్మీ కటాక్షం కాలేక ఆగిపోయాను’ ‘గాయకునిగా సరస్వతీ కటాక్షం పొందిన మీకు నిర్మాతగా లక్ష్మీ కటాక్షం దక్కలేక పోవడం విచారకరం.’ ‘ఈ రెండును మించి ఆరోగ్యం అనే శక్తి ప్రతి ఒక్కరికి ఉండాలి. అది అమ్మవారే ప్రసాదించగలరు. పాటల మాణిక్యం మా మల్లాది కవివరులు ముగురమ్మల మీద రాసిన అద్భుత గీతం ‘లలిత భావ నిలయా’ ఉంది కదా.. రహస్యం చిత్రంలో ఆయన సూచించిన రాగాలతోనే ఆ పాట స్వర పరిచాను. ఆ పాటని విస్మరించకండి. నిత్యం ఆ ముగురమ్మలను స్మరించండి. తరించండి. మన దేశం బావుండాలి. మనమంతా బావుండాలి. మన సంగీతం విని విదేశాల వారు ‘ఆహా’ అని అనుకోవాలి. శభాష్ అనాలి. వెర్రి పోకడలు పోయి అభాసు పాలు కావొద్దు. విదేశీ బాణీలు తీసుకున్నా మన నేటివిటీ జోడించి తగిన గాయనీ గాయకుల చేత పాడిస్తే తప్పక రాణిస్తాయి. వివాహ భోజనంబు ...ఒకనాటి మాయాబజారు లోనూ అదే ట్యూన్ తో ఉండేది. గురువులు గాలి పెంచలనరసింహారావు గారు స్వర పరిచారు. నా వంతు రాగా తమ్ముడు మాధవపెద్ది సత్యం గారి చేత పాడించాను. నట సార్వభౌముడు ఎస్వీఆర్ గారికి సత్యమే పాడుతుండే వారు. నేనాయనకు పాడిన నా రాణి కనులలోనే, ధనమేరా అన్నిటికి మూలం, బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటి ..వంటి పాటలు ప్రేక్షకులూ,శ్రోతలూ బాగా ఆదరించారు. సినిమా అన్నది ఒక వ్యక్తి ఇష్టాయిష్టాల మీద కాదు సమష్టి శక్తి మీద ఆధారపడుతుంది. గమనిస్తే వర్తమాన సినిమా జీవితం అల్పాయుషుగా తోస్తోంది. పట్టుమని పది సంవత్సరాలే ప్రతిభకి పట్టం కడుతున్నారు. అనుకరిస్తూ,అనుసరిస్తూ గాయనీ గాయకులు బోర్లపడిపోయే ప్రమాదం ఉంది. లలిత సంగీత కళాశాల నెలకొల్పాలన్న నా ధ్యేయం నేనుండగా నెరవేరలేక పోయింది. బహుశా ఇప్పుడు అలనాటి సినీ సంగీతాన్ని లలిత సంగీతం అంటారేమో. టీవీల ప్రోగ్రామ్స్ మీ కాలంవి. ఆరుబయట కచేరీలే మావి. సోదరి మాలతీ చందూర్ విదేశీ కచేరీలలో పద్యాలు, జానపదాలు పాడమని నాతో చెబితే అవి ఎవరు వింటారూ అని అనుకోనేవాణ్ణి. వాటిని ఎంతగానో ఆదరిస్తారని స్వయంగా పాడినప్పుడు తెలుసుకున్నాను. మన సంస్కృతి నాలుగు చెరగులా అనంతంగా ఉంది. అయిపోయింది ఇంకా పాడటానికి ఏమీ లేవు – అని నిరాశ పడేవారు ప్రయత్నాలు చెయ్యాలి.’ ‘సింహాచల క్షేత్రంలో కృష్ణమయ్య అనే ఆయన చిన్న చిన్న పద రచనలతో నరసింహ దేవుని స్తుతిస్తూ ఉండేవారట. ఆయన పన్నెండవ శతాబ్దం వారట. పుట్టుకతో అంధులైనా స్వామి అనుగ్రహంతో చూపు సంపాదించుకున్నారట. బాగా ఆలస్యంగా కొన్ని వెలుగులోకి వస్తాయి. మీ వంటి ఉత్తమశ్రేణీ గురువుల కాలంనాటికి దక్కని సాహితీ సంపద ఈ కాలం వారికి దక్కడం చూస్తుంటే ఇదంతా కాల మహిమే అని అనిపిస్తుంది. ఇప్పుడు చూడండీ.. మీ పాటలు ఒక సిలబస్ గా గుర్తింపు పొందుతున్నాయి. విజయవాడలో మీ పేరిట సంగీత కళాశాల నెలకొల్పింది ప్రభుత్వం. మీ గ్రామఫోన్ రికార్డులూ, మీ వస్త్రాలు అవన్నీ అక్కడికి చేర్చాలని మీ పుత్రుడు రత్నకుమార్ ఆశ పడుతున్నారు. డబ్బింగ్ ప్రపంచాన్ని చిన్న చూపు చూడకూడదని శ్రీశ్రీ వంటి మేధావులు ఒకనాడు ముందుకొచ్చారు. ఉత్తమ భావాలు అన్ని దిశల్నుంచి రావాలని వివేకానంద స్వామి ఉద్బోధించారుకదా. డబ్బింగ్ వల్ల ఇతర భాషల గొప్పతనమూ తెలుస్తుంది. అయితే ఇవాళ తెలుగు సినీ హీరోయిన్లకి స్వంత భాష లేదు. ఒకే వ్యక్తి అందరికీ వాయిస్ ఇస్తుంటే వైవిద్యం కరువౌతోంది. అయినా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రత్నకుమార్ ఇటీవల రికార్డ్ నెలకొల్పడం హర్షదాయకం. సినీ ప్రపంచంలో హీరోలకే తప్ప తతిమ్మా కళాకారుల వారసత్వానికి గుర్తింపు లేకుండా పోతోంది.’ ‘బ్రతుకు తెరువు, రక్త సంబంధం, వారసత్వం, అభిమానం, జీవిత బంధం, తల్లిదండ్రులు, వంశోద్ధారకుడు....ఇవన్నీ సినిమాలకి పేర్లే. ఎవరి మనుగడ ఎటువైపు అన్నది నిర్ణయించేది ఆ పైవాడే బాబూ.’ ‘ఇప్పుడే ఎస్వీఆర్ గురించి చెబుతూ చిలకా గోరింకా సినిమాలోని నా రాణి కనులలోనే పాట గుర్తుచేసుకున్నారు మాస్టారూ...ఆ ఎస్వీర్ నట సార్వభౌముడి మనుమడు నటుడు కావాలని ప్రయత్నించాడు. చిలకా గోరింకా చిత్రంలో తొలిసారిగా హీరోగా ప్రవేశించిన కృష్ణంరాజు గారి తమ్ముడి అబ్బాయి ప్రభాస్ ఇప్పుడిప్పుడే నటుడిగా నిలదొక్కుకుంటున్నాడు. మీ కాలం నాడు వాద్య సహకారం అందించినవారి పుత్రులు ఒకరిద్దరు సినీ సంగీతదర్శకులు కాగలిగారు. కొందరు టీవీ సీరియల్స్ కి పరిమితం అయిపోయారు. ఒక రచయిత గారి అబ్బాయి స్వరకర్త కావడం, ఒక స్వరకర్త గారి అబ్బాయి కొన్నాళ్ళు హీరో కావడం ..ఇలాంటి వింతలు పరిశ్రమలో జరిగాయి, జరుగుతున్నాయి. రాజేశ్వరరావు గారి ఆఖరి శిష్యుడుగా ఇప్పుడిప్పుడే తెలిసిన మురళీధర్ అనే ఆయన ఖుషీ సినిమాలో తొలిసారిగా పాడాడు. ఖుషీ మురళి గా పేరుకూడా పొందాడు. కెవ్వు, కేక వంటి కొత్త మాటలు పుట్టుకొచ్చాయి. మీకు తెలియవులెండి. తెలుసుకోవడానికి మాకూ టయిం పట్టింది. ఈ మురళి కెవ్వు,కేక పాట కూడా బాగా పాడాడు. ఒకనాటి ఎ.ఎం. రాజా వారి పాట ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ కి కొత్త సొగసులు అద్ది తిరిగి ఖుషీ చిత్రంలో మురళి చేత పాడించారు. విధి ఒక విషవలయం అన్నమాట నిజం మాస్టారూ. లోగడ ఒక కచేరీ నిమిత్తం బయలుదేరిన ఎ.ఎం. రాజా, ట్రైన్ బయట నిల్చొని, అది కదలగానే ఎక్కబోతూ మధ్యలో నలిగిపోయారు. ఇటీవల కాకినాడలో కచేరీ చేయడానికి తన కూతురు హరిప్రియను తీసుకొని ట్రైన్ లో బయలుదేరిన మురళి ట్రైన్ దిగగానే గుండెపోటుతో కుప్పకూలాడు. ఒక వర్ధమాన గాయకుణ్ణి కన్ను తెరిచి మూసేలోగా కోల్పోయాం. బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటి ..ఈ సరదా పాట సన్నివేశ పరంగా ఆనందాన్ని ఇచ్చినా పాట అయిపోగానే మా గుండె బరువౌతుంది ...ఎందుకంటే నటించిన ఎస్వీఆర్, పాడిన మీరు, స్వర పరచిన కోదండపాణి.. అన్నదమ్ములవంటి త్రిమూర్తులు ఒకరికొకరు ముందే నిర్ణయించుకున్నట్టు ఒకే సంవత్సరంలో అంటే.. 1974లో మానుంచి అదృశ్యమై పోయారు. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యమ్ ----మీరు స్వర పరచిన హుషారు పాటలు కొన్ని చూపించి వినిపించడం (నా భాషలో కనులు చూసినా పాటే) , మీ స్వంత చిత్రాల నుంచి కొన్ని పాటలు కేవలం వినిపించడం (నా భాషలో- కనులు మూసినా పాటే). చూపిస్తున్న పాటల్లో కె.రాణి గారు పాడిన ‘ఓ చందమామ ఇటు చూడరా’ ఉంది చూడండీ.. అందులో మీరు రెండు మాటలే – అహహహ, హాయ్ – అన్నారు. అయినా అందులోనూ ఏదో ప్రత్యేకత ఉంది. పాండవవనవాసము –చిత్రంలో భరతనాట్య నర్తకీమణి హేమమాలిని తొలిసారిగా అభినయించడం, అది మీ హయాంలో వచ్చిన పాట కావడం విశేషం. అరవై పైబడిన హేమ ఇప్పటికీ దుర్గాదేవిగా నర్తిస్తుంటే ఆశ్చర్యపోతున్నాం. పాట = తిరుగు టపా అని ఇంకొక అంశం ఉంది. అందులో పోలికలున్న పాటలు వ్రాసిగానీ, కాపీలు తీసిగానీ చూపిస్తుంటాను. దాగుడు మూతలు చిత్రంలో దేవుడనే వాడున్నాడా అనే మీ పాటకి, ప్రేమనగర్ లో నేను పుట్టాను అనే మీ పాటకి పోలికలున్నాయి. రెండూ మీరు పాడారు సరే- రెండిట్లోనూ నవ్వూ,ఏడుపు, లోకం, నేను, మనిషి అనే పదాలు ఉన్నాయి. రెండూ ఆత్రేయ గారి కలానివే. రెండూ మహదేవన్ గారు స్వరపరచినవే మీరు స్వీయ సంగీతంలో పాడిన ‘రామయ తండ్రీ రఘురామయ తండ్రీ’ (పాదుకా పట్టాభిషేకం), ఆ తరువాత ఇంచుమించు అలాగే ఉండే ‘రామయ తండ్రీ ఓ రామయ తండ్రీ (సంపూర్ణ రామాయణం)’- ఈ రెండు పాటలు ఇదివరకొకసారి అక్కడే పొందు పరిచాను. వెనక్కి తిరిగి ఓసారి కృష్ణప్రేమ లోని అంశాలు వెతికేవారికి ఇవి సులభంగా దొరుకుతాయి. ఈ రెండు రామయ్య తండ్రి పాటలూ కొసరాజు కవివర్యుల రచనలే కావడం విశేషం. ఇక ఇవాళ వినిపిస్తున్న మీ పాటలలో రెండు పద్యాలు కూడా వస్తాయి. ఇదిగో అక్కడుందండీ మొట్టమొదట మీరు కనిపెట్టిన పంక్తి.. అది – ‘ఆంధ్ర కవితాకుమారీ జయోస్తు నీకు’. ఈ సందర్భంలో ఒక మాట మాస్టారూ... మీరు ప్రేమంటే లవ్, ఆవంటే కౌ అనే హాస్య గీతం పాడారు. అందులో బౌ అనే పదం కూడా వచ్చింది. సరిగ్గా ఇలానే లవ్వూ,కవ్వూ, బవ్వూ అంటూ నటులు రజనీకాంత్ గారి అల్లుడు ధనుష్ ఇటీవల వెరైటీ కొలవరి పాట అందించి ఆశ్చర్య పరిచాడు ప్రపంచాన్నే. అంటే ...మీరు మీ టయిం లో విసరిన బాణం ఈ ధనుష్ చేతికి ఇన్నాళ్టికి చిక్కిందనే అర్ధం ...సోనూ నిగం వంటి గాయకులూ కూడా ఇదే తరహాలో ఇంగ్లీష్ హిందీ మేళవిస్తూ పాడినట్టు పిల్లలు చెబుతున్నారు. మీ పాటలు అడపా దడపా మా పిల్లలకి వినిపిస్తుంటాం కనుక వాళ్ళకీ కొన్ని కొట్టిన పిండైపోయాయి. ’ ‘ఓహో.. అలా ఆ ఆంధ్ర కవితా కుమారీ జయోస్తు నీకు ...అన్న పంక్తిని మార్చి నా వైపు గురి పెట్టావా నాయనా...సంతోషం.’ ‘అసలు మిమ్మల్ని రిపబ్లిక్ డే నాడు పిలుద్దాం అని కలగంటుంటే....కనురెప్పలు ఈ ఆదివారం నాడు కళ్ళు తెరవమని ఆదేశించాయి...తెరుస్తే ఎదుట మీరుండరు.... అయినా ఎదుటనున్న కంప్యూటర్ లోకంలో అంతటా మీరే...ఆ తృప్తి చాలు మాకు ....నే విన్నదీ చదివినదీ విన్నవించుకునే నా చిన్న కోరికని మీరు మన్నిస్తున్నారు... మీ ఆశీర్వాదబలం మాస్టారూ’ ‘జయోస్తు’ ‘సెలవండీ మరి.. ఇరవై ఆరు నాడు పునర్దర్శనమ్ ప్రాప్తిరస్తు అనండి మాస్టారూ.’ ‘అస్తు!’ -డా.తాతిరాజు వేణుగోపాల్, 20 జనవరి 2013 (ఆదివారం)
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|