మునుపటి నా మాట
ఎవరండీ రాజా సాబ్? ఏ సీమ నేలిన దొరలు వారు? ఎవరండీ రాజా? ఏ రాజ్యంలో సిరులు దొరలించిన వారు? ఎప్పుడైనా ‘శభాష్ రాజా’ అని ఎంతమంది చేత అనిపించుకున్న వారు వీరు? అప్పుడప్పుడైనా ‘రంగేళీ రాజా’ అని వెనకన చేరి వెక్కిరించిన ఏ నలుగురి దాడికో గురైన వారా వీరు ? రాజా అంటే తన రాజ్యం పట్ల, తన జాతి పట్ల అంకిత భావం ఉన్నవాడే ..వీరు అటువంటి వారా? రాజా అంటే రాగం, భోగం రంగులని జనం, జాగృతి వెలుగులని నమ్మి పాలించే వాడే...వీరు అలాంటి వారా? ఓహో...వీరిది ఊహా సామ్రాజ్యమా? అహో...వీరిది స్వప్న పరిపాలనమా? ఊహా సామ్రాజ్యమైతే గగన విహారి కావాలి వీరు. ‘నెలరాజా’ అని పేరు పొందాల్సిన వారు వీరు.. అమవస నిశినే తప్ప నెల పొడుగునా అంతో ఇంతో సూర్యుడినుంచి సంపాదించుకున్న వెలుగుని భూమాత సంతతికి పంచిపెట్టాలనే తపన ఉన్నవాడు కనకనే చిమ్మ చీకటి గగన సామ్రాజ్యానికి ‘వెన్నెలరాజా’వారు వీరు. ‘లే యెన్నెల ఇరజిమ్ము’ సందమామ నావోడు ఉండగా నా గృహమే కాదా ‘స్వర్గసీమ’ అని ఎలుగెత్తి చాటే జనపదం సంతోషాన్ని నిత్యం చూస్తూ అమవాస్యలో తన ఆయు దోషాన్ని దాచేసి మళ్ళీ ‘పాదయాత్ర’ చేపట్టే నిజమైన రాజా వారు నెలరాజా వారు. వారంతటివారా వీరు?
ఎవరండీ ఈ రాజా సాబ్? ఎవరీ రాజా? అయ్యారే...’మీకు తెలియని సామ్రాజ్యం ఒకటుంది.. సినీ సంగీత సామ్రాజ్యం ....దానికి వీరు రాజా అయ్యారే, ప్రపంచ మెరిగిన సత్యమిది ..ఆ మాత్రం తెలియదా’ అని మమ్మల్నే కించ పరుస్తున్నారా? మేమెవరమో తెలుసా? గంధర్వులం. మీ గ్రంధాల్లో ఇగిరిపోని గంధాల గురించి అతిశయంగా చెప్పుకునేవారేనేమో మీరంతా. మేమో ...నిత్య సుగంధ ధారులం, అమృత ధారలం. మాట మా సుగంధం. పాట మా అమృతం. ఆ లక్షణాలు దైనందిన జీవనంలో అన్ని క్షణాలు కలిగి ఉన్నవారికే మా సామ్రాజ్యంలో ప్రవేశముంది. మీరు చెబుతున్న రాజా వారు ఆ కోవకి చెందితే మా నెత్తిన ఉన్న కిరీటాలు దించి ఆయన్ని నెత్తి నెక్కించుకుంటాం. చెప్పండి... మీ రాజా వారి గురించి అందరిదీ ఒక్క మాటై నోరు విప్పండి... ‘గంధర్వ రాజా...’ ‘తప్పు...మీరు చెబుతున్న రాజా వారు రాజా వారే అని మేం ఒప్పుకునేదాక మమ్మల్ని మీరు రాజా అనరాదు. ఒకవేళ..మీ రాజా వారికి సాటి మేం కాదని మాకు అవగతం అయితే మాదంతా గతం, వారిదే ఇకపైన ఇక్కడ మనోహరమైన జీవితం.. ఈ విషయంలో మేం భూలోకంలో లాగ కాక మాట నిలబెట్టుకొనే వారం. ఇక కానీండి..’ ------- రాజా వారంటే పుట్టుకతోనే వెండి కంచంలో బంగారు గరిటతో అన్నం వడ్డించుకునీ రాగి చెంబుతో నీళ్ళు తాగి బతికిన వారు కాదండీ. తండ్రి ఘంటసాల సూరయ్య వీపున మృదంగం, మధ్యమ సంతానమైన తనను భుజాన మోసుకుంటూ తరంగ గాన విద్య నలుగురికీ పంచి పెడుతుంటే తోచినంత రాగం తీస్తూ, చిన్న చిన్న నాట్యాలు చేస్తూ ఊరివారి చేత బిరుదు పొందిన ‘బాల భరతుడు’ వెంకటబాబు (ఆ తరువాతి కాలంలో ‘అందాలరాణివై ఆడుమా’ అని అష్టవిధ నాయికలకు పాఠాలు నేర్పి ‘శభాష్ రాజా’ అని అనిపించుకున్న నాట్య గాయకులు వీరే). పదకొండో యేడులో ఉన్న తననెలాగైనా సంగీత విద్యలో ఉన్నతుణ్ణి చేయాలని ఆశిస్తూ అదే తన చివరి కోరికగా చెబుతూ కన్ను మూసిన తండ్రి వైపు చూస్తూ భవిష్యత్తు భయంలోకి అడుగు పెట్టిన బాల బాటసారి వెంకటబాబు. (ఆ తరువాతి కాలంలో మృత్యువంటే భయం లేనటువంటి వ్యక్తి పాడుకుంటున్న పాట-బహుదూరపు బాటసారీ అని రచించి కవిగానూ సార్ధకుడైన వారు వెంకటబాబు) రాగంలో ఎక్కడో ఎవరికో అపస్వరం తోచినపుడు వారు చేసిన హేళనకి కాసేపు కలవర పడినా, కలకాలం తన గాన విద్య కలకలం సృష్టించాలని దీక్ష పూని, ఉన్న ఊరులో అవకాశం లేకపోతేనేం, చేతికున్న బంగారు ఉంగరం అమ్మి, ఆ డబ్బుతో రైలెక్కితే విజయనగరం సంగీత కళాశాల చేరుకోవచ్చు, ఇక పైన ఘంటసాల వారి ఇంటిపేరుకే పేరు తీసుకు రావచ్చు అని చిన్నతనంలోనే ఇల్లు విడిచి వెళ్ళిపోయిన బాల సన్యాసి వెంకటబాబు ( ఆ తరువాతి కాలంలో ‘అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని...జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని ....’ అని గుండె లోతులనుంచి ఆ గాయకుడు పాడగలిగారంటే అది అలనాటి తన బాల్య సంఘటన వల్లనే కదా). తీరా చూస్తే కళాశాలకి సెలవులు. అప్పుడే మొలిచింది ఆశా కిరణం. అప్పుడే దొరికింది పట్రాయని సీతారామశాస్త్రి గారి రూపంలో సంగీతాభరణం. విజయనగర విద్యార్థులకు పెద్ద దిక్కు, ఉచిత విద్యనేర్పే ఉపాధ్యాయులు వారు. అంతలోనే తెలిసింది అక్కడొక మహారాజా వారున్నారనీ, ఇంగ్లీషు,సంస్కృతం,సంగీతం – ఈ మూడు రంగాల విద్యార్థులకి ఆయన ఏర్పరిచిన సత్రంలో ఉచిత భోజనం ఉంటుందనీ. బాగానే ఉంది. సంగీతం పట్టు దొరికేవరకు ఇది తన పట్ల ఒక పట్టుగొమ్మ. అయితే సమస్య..అంతవరకూ జీవనం గడిచేది ఎలాగా? ఊరంతా తిరిగి అంతో ఇంతో జోలెలో సంపాయించుకోవచ్చు- ఆచారమది. విచారం అనవసరం. వెంకటబాబు అదే చేశాడు. పెరిగి పెద్దవాడయి ఉన్నత స్థితికి చేరుకున్నా ‘నాడు ఏ తల్లి మొదటి కబళం తన జోలెలో వేసిందో ఆమె ఆ వాత్సల్య పూరితమైన భిక్ష తనకు అష్టైశ్వ ర్యాలతో కూడిన భవిష్యత్తునే ప్రసాదించింది’ అని చెప్పుకోవడానికి నామోషీ పడని వినమ్రశీలి వెంకటబాబు. గాత్ర సంగీతమే తనకి సరియైనదని సూచించిన ద్వారం (వెంకట స్వామి నాయుడు, వయోలిన్ మేధావి) వారు నిజంగా ఆయనకి మార్గం చూపిన ద్వారమే. తోరణం ఉండనే ఉంది-శాస్త్రి గారివంటి ఆభరణం. నాద శుద్ధి, శృతి శుద్ధి అనేవి గాయకుడి గళసీమ నలరించే తళుకులు అని శాస్త్రి గారి శిక్షణనుంచి తెలుసుకున్నవారు వెంకటబాబు. సంగీత విద్యలో లక్ష్యం,లక్షణం అనే వాటికే ప్రాధాన్యం ఇస్తూ కూర్చోక శాస్త్రిగారు విద్యార్ధుల్లోని స్వతంత్ర భావనాసక్తిని, నిర్మాణాత్మక శక్తిని, రస దృష్టిని గమనించి ప్రోత్సాహించ బట్టే ఒక విశిష్ట వ్యక్తిత్వంతో భవిష్యత్తులో నిలదొక్కుగోగలిగారు వెంకటబాబు. శాస్త్రీయ కచేరీ చేసే ప్రతి గాయకుడికి తంబూరా వెంట ఉంటుంది. కాని ఆదిభట్ల నారాయణ దాసు వంటి హరికథా పితామహులు స్వయంగా బహూకరించే తంబూరా అంటే సాక్షాత్తు నారదుడే దిగివచ్చి మహతిని ఇచ్చినంత గొప్ప విషయం. వెంకటబాబుకి అలాంటి అదృష్టం కలిగించింది విజయనగరం( వీరి పుత్రికా రత్నం సుగుణమ్మ ‘నేనెరిగిన మా నాన్నగారు’ అనే పుస్తకం రచించి ఇదే విజయనగరంలో ఇటీవల ఆవిష్కరించడం విశేషమే). వెంకటబాబు తన గమ్యంలో ఒక్కొక్క మెట్టు దాటిపోతున్నా పాఠాలు నేర్పిన గతాన్ని ఎన్నడూ మరవలేదు. ‘కళావరు రింగు’ గా అందరూ పిలిచే సరిదె లక్ష్మీ నరసమ్మ అతని పట్ల చూపిన ఆదరాభిమానాలు ఆయన మరువలేదు (అందుకేనేమో తరువాతికాలంలో మరువలేనురా నిన్ను నేను మరువలేనురా ..ఓ పంచదారవంటి పోలీసెంకటసామి ...అని ఒక పోలీసులోని సుగుణాల మీద పాట పాడి, జీవితంలో ఎవ్వరినీ మరువకూడదు అనే విషయాన్ని చాటి చెప్పడం సాధ్యమైంది వెంకటబాబుకి). సంగీత కచేరీలన్నవి ఎవరో ఉదారంగా ముందుకొచ్చి ఆర్ధికంగా ప్రోత్సాహిస్తేనే తప్పజరగనివి. వాటితోనే ఉదర పోషణ జరగడం కష్టం. మన లోని కళకి హార్దిక ప్రోత్సాహంతో పాటు ఆర్ధిక లాభం కూడా అవసరమని గ్రహించి నాటక సమాజాన్ని స్థాపించి చిన్ననాటి అనుభవంతో నాటకాలు ప్రదర్శించి మేటి రంగస్థల నటులతో నటించినా ఒక పుష్కర కాలం వరకు ఎటువంటి గుర్తింపు పొందలేదు వెంకటబాబు. అసలే జీవనలో ఆర్ధిక అసౌకర్యం, పైగా ప్రపంచంలో యుద్ధ వాతావరణం. దేశంలో పర పరిపాలన, దాస్యం మీద తిరుగుబాటు అధికమౌతున్న సమయం. అప్పుడే ఏదో అమాయక ఆవేశం! ఆగస్టు క్రాంతి లో వెంకటబాబు గళం కొత్త పుంతలు వెతుక్కుంది. పద్యాలు పాడినందుకు నెలకో పద్యం చొప్పున పద్ధెనిమిది నెలల జైలు శిక్ష పడింది. అయితే వెంకటబాబు ఏమాత్రం కుమిలిపోలేదు. పైగా జైలు జీవితం తనకు మహోపకారం చేసిందని భావించారు. కర్తవ్య దీక్ష, స్థిర సంకల్పం, నియమబద్ధమైన జీవితం అనే మూడు అంశాలు ఆయన్ని అలరించాయి (తరువాతి కాలంలో .......జైలులో తండ్రీ కొడుకులు ఒకరికొకరు తెలియని దశలో తత్త్వంతో పాటు వర్తమాన కర్తవ్యం కూడా ఒకరికొకరు బోధిస్తూ పాడే సన్నివేశానికి పాట ఒకటి పాడవలసి వచ్చినప్పుడు ఆయన పలికిన తీరులో ఇవన్నీ మూర్తీభవించాయి. చిల్లర రాళ్ళు, పరమేశ్వరుడు అనే తేడా గమనించమన్నప్పుడు పర దాస్యంతో పరమాన్నం సాధించుకున్న వాళ్ళు, దేశం అనే పరమేశ్వరుడి కోసం ఎదురు తిరిగి కొరడా దెబ్బలు తిన్నవాళ్ళు గుర్తుకు రాక మానరు). అక్కడితో తెలియని రాజకీయ లోతుల్లోకి దిగక వెంకటబాబు తన సంగీత కొలను ఒడ్డున స్వరాల కలువల రేకుల నిమిరే నెలరాజా వారిలా మిగిలిపోయారు. ‘కలువలరాజా కథ వినవా’ అని ఎవరో ప్రేమగా,లాలనగా పిలిస్తే తెల్సింది .. పెదపులిపర్రు గ్రామం నుంచి ఒక సావిత్రమ్మ తన సహధర్మ చారిణి కావాలని తన జీవితంలోకి తొంగి చూస్తున్నదనీ, ‘ఓ నా రాజా’ అని ఆమె కళ్యాణ ఘడియ కోసం ఎదురు చూస్తోందనీ. ‘ఓ..ఓహో.. రాజసుకుమారా ..రావోయి.. నీ సోయగమునకు అంజలి గైకొనుమా,,, ప్రేమాంజలి గైకొనుమా’ అని ఆమె వేసిన పూలబాణం స్వీకరించగానే ‘స్వాగతం...స్వాగతం... కవి సామ్రాజ్యమే సంసారం’ అని ఆయనా, ‘రాణిని నేనీ సామ్రాజ్యానికి, ప్రాణం మీరే రాజా సాబ్’ అని ఆమె ఒకరికొకరు ఆలనగా పాలనగా కుదిరిపోయారు. కదిలి కదిలి నదులన్నీ కలిసేది సముద్రాలలోనే కదా. అలా వెంకటబాబు సింధు భైరవి ఆలపించడం వల్లనో ఏమో శ్రీమాన్ సముద్రాల రాఘవాచార్యులు గారి పరిచయం వెంకటబాబుని సినీరంగం వైపు తరలించింది. బి.ఎన్, అద్దేపల్లి, నాగయ్య గార్లు భుజం తట్టారు. తనలోని గాత్ర సౌందర్యానికి ‘స్వర్గసీమ’ తొలి పరిమళపు పూత వేసింది. అక్కడ జానపదం లో ‘లేయెన్నెల ఇరజిమ్మిన’ గళం తనదైతే ‘ఓహో నా రాజా ... లల్లలల్లలల్లల..’అనే విదేశీ ముద్ర ఉన్న స్త్రీ గళం మహిళా మేధావి భానుమతి గారిది.. ఎక్కడో నేర్చిన శాస్త్రీయ సంగీతం.... ఇక్కడ చూస్తే ఇదీ సంగీతమే... మార్గ సంగీతం తన ధోరణిలో తానుంది. అందుబాటులో ఉన్న తమ దేశి సంగీతంతో జనం సంతోషపడుతూనే ఉంది. సినిమా కళ విదేశీ బాణీ మోసుకొస్తోంది. తగినట్లు విదేశీ జంత్రాలు దిగి వస్తున్నాయి. సంగీతానికి ఎల్లలు అవసరమా? కలగలుపు అసమంజసమా? చూడగా చూడగా వెంకటబాబు గారికి అర్ధమౌతోంది... విదేశీయుల సంగీతం దృశ్య ప్రధానంగా ఉందని. వీధి భాగోతాలు, తోలు బొమ్మలాటలు, బుర్ర కథలు ...వీటితో పాటు దంపుళ్ళ పాటలు, పెళ్లి పాటలు, ఊడుపుల పాటలు, నూర్పుల పాటలు, పడవ పాటలు, చెక్క భజనలు, లాలి పాటలు, జోల పాటలు.. వీటన్నిటినీ ప్రదర్శనా యోగ్యంగా తీర్చి దిద్ది విదేశాల్లో చూపించి మన దేశ సంగీత వైవిధ్యాన్ని వారు కొనియాడేలా చేయవచ్చని ఆయన గుర్తించారు. ఇదే దేశి సంగీతం. ఇందులో చిననాటి నుంచి తనకు ప్రవేశం ఉంది ( అందుకే తరువాతి కాలంలో అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మా, కోడల్లేని అత్త గుణవంతురాలు ..అనే జానపద ధోరణికి ఆయనే చక్కగా ద్విగాత్రాభినయం చేయగలిగారు. కాశీకి పోయాను రామా హరీ ....అన్నప్పుడు ఎంత చెణుకు విసరాలో ఆయనకి మాత్రమే తెలిసిన విద్య. ఆయన తమకు నేపధ్యంలో పాడిన పాటలతో నటులు మహా నటులై కీర్తి గడించారు. నటనా ప్రతిభ వారిది. గాన కళా ప్రతిభ వీరిది). మార్గ,దేశి సంగీతాలను ఒక చోట చేర్చితే మనలోని భావ ప్రకటనకి ఒక కొత్త పుంత దొరికనట్టవుతుందని, దాని పేరే లలిత సంగీతమని వెంకటబాబు గ్రహించారు. రజనీ కాంతుల వారి సౌజన్యంతో ఆకాశవాణి పలికించే ఆ వినూత్న ప్రక్రియకి తనవంతు బాణీ అందించి ఎందరో కవుల, కవయిత్రుల ఉద్భవానికి, వారి గుర్తింపుకి తోడ్పడ్డారాయన. దేశంలో శాస్త్రీయ సంగీతంలో నిజమైన రసజ్ఞత పెంపొందించుకోవాలంటే అందుబాటుగా ఉండే లలిత సంగీత ప్రచారం వల్లనే జరుగుతుందని వెంకటబాబు విశ్వసించారు. అయితే లలిత సంగీతమంటే ఏ ఇద్దరు ముగ్గురు ఆధునిక కవుల విషాద గేయాలో పాడడంతో సార్ధకం అవ్వదని ఆయన హెచ్చరించారు. లలిత సంగీత కళాశాల స్థాపన ఆయన చిరకాల వాంఛగా మారింది. సుమారు మూడు దశాబ్దాలు సినిమాల ద్వారా చిత్ర సంగీతంతోనూ, ఆకాశవాణి ద్వారా లలిత సంగీతంతోనూ వెండి తెర వెనుక ఉండి , సంగీత కచేరీల ద్వారా శాస్త్రీయ సంగీతంతో వెలుపల ఉండి ఆయన అంతటా తానై నిండిపోయారు. ఇంత కీర్తి శిఖరాన్ని మోస్తున్నా ఆయన ఏనాడూ గర్వంతో విర్రవీగిపోలేదు. ఒక పాట ముగిసిన వెంటనే మరొక పాట, నేపధ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా జోడు గుర్రాల స్వారీ అవలీలగా చెయ్యగలగడానికి కారణం ఒకనాటి అలనాటి చిననాటి ఆ అభ్యాసమే. రెండు నావల్లో చెరొక కాలు పెడుతున్నాననే సందిగ్ధానికి ఆయనెప్పుడూ లోను కాలేదు, తన సాధనా,కృషీ ఫలించాలంటే, సార్ధకత చెందాలంటే ప్రతి కళాకారుడూ ప్రజలతో తనకు గల సంబంధాన్ని నిత్యం గుర్తిస్తూ, కళారంగంలో తనకున్న బాధ్యతలను, ఎదుర్కొన వలసిన శక్తులను వారికి తెలియజేస్తూ వారినుండి విజ్ఞాతా పూరకమైన సలహాలను, అభిమానోపేతమయిన సానుభూతిని పొందుతుండడం అవసరమౌతుంది- ఇదీ ఆయన తన అనుభవసారంగా తెలియజేసింది ( స్వానుభవమున చాటు నా సందేశమిదియే ...అని ఆయన ఎటువంటి సందేశమిచ్చినా యువతరం ఆదరించింది. మాస్టారు అని ఆయన్ని అభివర్ణించింది, సాటి గాయనీ గాయకులకి సైతం ఆయనే ‘మాస్టారు’. వారు పాడే విధానం నుంచే ఇతరులు మెళకువలు నేర్వగలిగేవారు.) గాయకులు శ్రోతల నుండి ‘సానుభూతి’ పొందితే గాయకుల నుంచి శ్రోతలు ‘రసానుభూతి’ పొందడం సాధ్యమౌతుంది- ఇదీ ఆయన తెలుసుకున్న రహస్యం. ( కరుణశ్రీ వారి పుష్ప విలాపం – పద్యాలుగా చదవడం వల్ల సానుభూతి కలుగుతుంది. ఆ పద్యాలు మాస్టారు పాడగానే కరుణ రసానుభూతి కలగనివారు లేనేలేరు.) ఆయనకి ‘దేశి’ సంగీతం అంటే ఎంతో ఇష్టం. హాయిగా, స్వేచ్చగా భావ ప్రకటన చేసుకొనే వీలు కల్పిస్తుంది దేశి సంగీతం (ఎపుడో చెప్పెను బ్రహ్మం గారు, అపుడే చెప్పెను వేమనగారు, ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా ..విస్సన్న చెప్పిన వేదం కూడా... అని మూడు కాలాల్ని ఏక గళంతోనే సునాయాసంగా విడదీసి కళ్ళకు కట్టినట్టు చూపించేలా పాడిన మహాగాయకుడు ఆయన). అలాగే రంగస్థలంలో ఒకనాడు రూపం, వాచకం రెండూ సమపాళ్ళలో ఉండే వారికే పట్టం గట్టే వారు. కొందరి గాత్రంలో పద్యాలలోని భావం కన్నా సుదీర్ఘ ఆలాపనలతో వారి వారి గాన ప్రతిభే ముందుకు చొచ్చుకు పోతుండడం ఆయన గమనించారు. పద్యం హృద్యంగా ఉండేలా ఒక నూత్న విధానాన్ని ఆవిష్కరించారు. ఇది మన ఆశ్రమము ...అని పద్యం పాడుతూనే చేయెత్తి చూపించడానికి వీలు కలిగించే రాగమేదుంటే ఆ రాగంతో పద్యాన్ని రక్తి కట్టవచ్చు అని గ్రహించారు. ఇటు మార్గ సంగీతానికి భంగం రాకుండా, దేశి సంగీతంలో కలిగే స్వేచ్ఛా పరిధి మించకుండా, లలిత సంగీత మార్గంలో ఉండే నెమ్మది తనంకి పరిమితం కాకుండా ఆయన పద్యాలు పాడడంలో ఒక స్పష్టమైన ముద్ర సాధించగలిగారు. ఒకానొక సీస పద్యానికి పాదానికో రాగం చొప్పున ఆయన స్వర పరిచారని విజ్ఞులు శోధించి మరీ చెప్పారు. మాస్టారు గారు వ్యక్తం చేసిన అభిప్రాయాల మాలిక నుంచి ఏరి పేర్చిన కొన్ని పూలనిక్కడ గమనించండి. అవి కాయితం పూలు కావు, కలకాలం పరిమళించే వాడని పూలు.... భారతీయ జీవన రంగంలో సంగీత కళకున్న స్థానం మరే సంస్కుతిలోనూ లేదని చెప్పడం సాహసం కాదు. సంప్రదాయ సిద్ధమైన ఈ కళా విశేషాన్ని విస్మరించి మనం ఏ విధమైన అభివృద్ధినీ సాధించలేము. రస సిద్ధ్హిలో భిన్న ఫణతులు అవలంబించే మార్గంలో ఒక విచిత్రమైన ఐక్యతను మన సంగీతం ఏర్పరచుకొంది. దేశంలో ఏ ప్రాంతపుదైనా సంగీతం విషయంలో ఏకత్వం గోచరించక మానదు. ఇందులో ..శాస్త్రీయ సంగీతం (మార్గ సంగీతం) భక్తిభావ పునీతమైతే దేశి సంగీతం నవరసభరితం. ప్రస్తుత నాగరిక జీవన విధానాన్ని బట్టి, పాశ్చాత్య సంగీత ప్రభావాన్ని బట్టి, వ్యావహారిక భాషా ప్రభావాన్ని బట్టి, ఒక నూతన సంగీత సంప్రదాయం మన సంగీతంలో రూపొందించుకొంటున్నది. ఇదే సినిమా సంగీతం. కొంతకాలం నిశ్చలంగా ఉన్న మన దేశీయ సంగీతం సినిమా కళ యొక్క అభివృద్ధితో నూతనోత్తేజాన్ని పొంది కొత్త రంగులు రంగరించుకొంది. ఈ నూతన సంగీత సంప్రదాయ నిర్మాణం సినీ సంగీత దర్శకుల ప్రతిభను బట్టి నిర్మించబడుతోందని చెప్పడం సాహసం కాదు. కారణం మార్గ సంగీతంలో మార్పులకి ఆస్కారం లేదు. అయినా తన ప్రతిభతో సంగీత దర్శకుడు అటు మార్గ దర్శకమైన మార్గ సంగీతాన్ని విస్మరించక, భావ ప్రధానమైన దేశి సంగీతానికి విదేశీయ సంగీత రీతుల్ని జోడించి తన నూతన సంప్రదాయ సృష్టికి ఉపకరణములుగా స్వీకరిస్తున్నాడు. ఈ నూతన సంప్రదాయ నిర్మాణం ఉత్తర భారత దేశంలోనే ప్రారంభించబడిందనటం సాహసం కాదు. సినిమా పరిశ్రమకు పూర్వం కూడా మన నాటక సంగీతంలో పద్య పఠనానికి శాస్త్రీయ సంగీత రాగాలనూ, పాటకు ఉత్తర దేశ లలితసంగీత రచనలనూ, ఒరవడిగా తీసుకొనడం జరిగింది. తొలినాటి సినిమా సంగీతంలో శాస్త్రీయ సంగీత ప్రభావమే ఎక్కువగా ఉండేది. రాగ ప్రధాన రచనలే ఎక్కువగా ఉండేవి. కాల క్రమేణా ‘దేశి’ సంగీతమే పలుకుబడికీ, నుడికారానికీ, భావావేశానికి అనుకూలమైనదని గ్రహించారు. ఈ విధానానికి మార్గదర్శి నౌషాద్ గారు. సినిమా సంగీతాన్ని స్థూలంగా పరిశీలిస్తే గేయానికి చెందిన భాగం మన సంప్రదాయాన్ని, చిత్రీకరణకు అవసరమయ్యే నేపధ్య సంగీతం పాశ్చాత్య పద్ధతులను అనుసరిస్తున్నట్లు తెలుసుకోవచ్చును. సంగీత దర్శకుని బాధ్యత పాటలతోనే తీరదు. చిత్రంలోని ప్రతి సన్నివేశానికి ఆయా రసాలకు తగినట్లుగా ‘నాదాత్మక వ్యాఖ్య’ (రీరికార్డింగ్) ఇవ్వటం కూడా అతని పనే. అసమర్ధమైన రీరికార్డింగ్ చిత్రాన్ని పేలవంగా తోపింపజేస్తుంది. ప్రజ్ఞావంతమైన రీరికార్డింగ్ బలహీనమైన సన్నివేశాన్ని కూడ చిత్రంలో కుదుట పర్చగలదు. ప్రతి సంగీత దర్శకుడు తన స్వంత కళాభిరుచితో బాటు, ప్రజాభిరుచి, చిత్ర పరిశ్రమ యొక్క ఆర్ధిక నిబంధనలని గుర్తుపెట్టుకో వలసి ఉన్నది (మాస్టారు గారి సంగీత సారధ్యంలో వచ్చిన ‘లవకుశ’ చిత్రంలో ఒక పాట కానివ్వండీ, ఒక పద్యం కానివ్వండీ ఏదీ అకస్మాత్తుగా ఊడిపడదు. వాటి రాగాల నేపధ్యం ముందు వినిపిస్తూ మనల్ని ఆయా పాటల, పద్యాల భావాత్మవైపు తీసుకు పోతాయి. ఆ చిత్రం కొన్నిఏళ్ళ విరామంలో కొంచెం కొంచెంగా తీయబడినా ఒక పూర్ణ స్వరూపంగా వచ్చినప్పుడు మాస్టారు గారి నేపధ్య సంగీత ప్రతిభ వల్ల ఆ విరామాలు కనిపించవు.) ఏ గాయకుడికైనా తన భావాలను పోషించగలిగే గాత్రశైలి యే శాస్త్రంలోను, యే పారిభాషిక పదాలలోను నిర్వచించబడనిది. అనుభవమే వారికి గురువు. నా భావనలో నేపథ్యగాయకునికి సంగీత హృదయంతో బాటు కవి హృదయం, కంఠస్వరంలోని మెళకువలతోనే నటించగల నటనా కౌశల్యం కూడా అవసరం. ఇవన్నీ మా మాస్టారు చెప్పిన మధుర వాక్కులు. చివరిగా ఆయన మరో మాట అన్నారు- భావ తీవ్రత, ఆర్ద్రత లేని హృదయం నుండి ఉత్తమమైన కళ వ్యక్తమయ్యే అవకాశం లేదు. అందుచేత కళాకారుడు కళా సాధనతో తుల్యంగా జీవిత అనుభావాలనుండి ఉన్నతమైన హృదయ సంస్కారాన్ని కలిగించుకోవలసి ఉంది. ‘(ఇంతగా విడమర్చి ఏ గాయకుడూ, ఏ సంగీత దర్శకుడు ఎప్పుడూ చెప్పలేదు. ఇవన్నీ నిజానికి సినీ పరిశ్రమలో కాలు బెట్టి నిలవలేక చతికిలబడిపోయినవారు తప్పక తెలుసుకోవాల్సిన విలువైన విషయాలు. సినీ సంగీతానికి ఒక సిలబస్ అంటూ సినీ పరిశ్రమ ఏర్పాటు చేస్తే మాస్టారు గారు చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఉల్లేఖనాలే కాదు ఉన్నత భవిష్యత్తుకి వేసిన ఉత్తమ మార్గాలు. సినీ సంగీత దర్శకులు గొప్ప సినీ గాయకులు కాక పోవచ్చును. అలాగే సినీ గాయకులు సినీ సంగీత దర్శకులు కాలేక పోవచ్చును. రెండు రంగాల సమ పాళ్ళు మాస్టారుగారు పొందటం ఆయన అదృష్టం, సినీ పరిశ్రమ అదృష్టం. అందుకే మాస్టారు వారు ఒక యుగకర్త కాగలిగారు. ఇన్ని చెప్పిన వీరి మాటలు వృధా పోనియ్యక తానూ మరొక యుగానికి కర్తనౌతానని నిరూపించగలిగారు ‘బాలు’ అని రెండక్షారాలతో వినమ్రుడైన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం). అందుకే మా మాస్టారు గారిని ‘రాజా’ వారిగా మా మనసులు ఎప్పుడో అంగీకరించాయి. కృష్ణశాస్త్రి గారు ఒక పాటలో అన్నట్టు ‘రత్న కిరీటము లేని మహారాజు గాకేమి’ మా మాస్టారు. ఏ రాజా వారైనా వినోదాలు,విలాసాలకు మాత్రమే పరిమితమైతే వారు ‘రంగేళీ రాజా’ వారేగానీ ‘శభాష్ రాజా’ అని అనిపించుకోరు. మాస్టారు చేతిలో ‘రంగేళీ రాజా’ చిత్రం పడితే ఆయన విద్యార్ధుల పట్ల కవి చూపించిన సానుభూతికి వత్తాసు పలుకుతూ నాలుగు రకాల విద్యార్ధి మనస్తత్వాలను నాలుగు రసాలలో పలికించి ఆ నవ సమాజ నిర్మాతల, ఆ దేశ భావి నిర్ణేతల కళ్ళు తెరిపించారు. ఆ నలుగురు ఎవరంటే .......ఎపుడో వచ్చే పరీక్షలకి ఇపుడే ఎందుకు జంజాటం అని జల్సాగా ఉండే ‘స్టూడెంట్ లైఫ్’ ఆశించే సరదా జీవి విద్యార్ధి ఒకడు; చదువే ఆహారం, చదువే పానీయం, పాఠాలే మహాప్రియం అంటూ పుస్తకమే సమస్తమని ఎంచే చాదస్త విద్యార్ధి ఒకడు; సహనం,శాంతి, అహింస,సర్వోదయమార్గం అంటూ వల్లమాలిన సౌజన్యంతో చల్లారిన విద్యార్ధి ఒకడు; కుళ్ళిన,వయసు మళ్ళిన సంఘం కీళ్ళు,వేళ్ళు నరికేయాలని, అందుకు పెన్ను విడిచి పెట్టి గన్ను చేత పట్టమనే ఉద్రేకంలో ఉనికిని మరచి ఉగ్రవాది అయిపోతున్న విద్యార్ధి ఒకడు. మాస్టారు చేతిలో ముందొకసారి ‘శభాష్ రాజా’ చిత్రం పడితే ఆయన ‘వినోదం కోరేవు విషాదం పొందేవు ...జవరాలంటే జ్వలించే మహాజ్వాల, దరి చేరావో దహించి వేస్తుంది సుమా ...రావోయీ నా రాజా...’ అని కవి అన్న మాటలకి స్వర రూపమిచ్చి అప్పటి యువతను హెచ్చరించారు. అయితే ... మా రాజా వారు మాకు ఇంకెన్నో గాన గుళికలు మాకోసం తయారు చేసి, తమ అద్భుత ‘మ్యూజిక్ థెరపీ’ తో మనసులకి తెరిపి నిచ్చి యువతని సదా ఆరోగ్యవంతం చేసి కాపాడుతుంటారని అతిగా ఆశించామే తప్ప అయ్యో ఆయన మనకోసం తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం లేదే అని ఒక్కనాడైనా ఆలోచించనే లేదు. అయ్యయ్యో ఆ విషాద ఘడియలు సమీపించేసాయి.. ఆ పంతొమ్మిది వందల డబ్భై నాలుగు ఫిబ్రవరి పది రాత్రి, పదకొండు తెల్లవారు జాము మధ్య ‘రేయి మించేనోయి రాజా..హాయిగ నిదురించవోయి’ అని విధి విధిలేక ఆయన చెవిలో ఊది ఆయన చేత ఆయన కనులనే మూయించింది. ఆయన తనకోసమే అన్నట్టు ఎప్పుడో స్వర పరచి పెట్టుకున్న పాట అది.....అది మామూలు నిద్ర కోసం ఆయన సంగతులు కూర్చితే ఆయన పట్ల శాశ్వత నిద్ర కోసమే అన్నట్టు ప్రతిధ్వనించాయి. ఇప్పుడు చెప్పండి...గంధర్వులూ.. వెంకటబాబు ‘ఘంటసాల’ అనే పేరు తోనే చిరకాలం గుర్తుండి పోయి తన ఇంటి పేరుకే గౌరవం తెచ్చిపెట్టారే...ఆయన్ని రాజా వారు అని మేమనడం సమ్మతమేనా? మీకిపుడు నమ్మకమేనా? సమ్మతమే అయితే మీకాయన ఇకపైన గంధర్వ రాజు...’ ‘కాదు బాబూ కాదు ..’ ‘అసూయ మీకు. ఇంత చెప్పినా చలించలేదంటే మీరు గంధర్వులు కారు..అంధకారంలో అలమటించే నిరాశావాదులు.’ ‘ఆగు బాబూ ఆగు... సినీ సంగీతాన్ని తలెత్తుకు తిరిగేలా చేసిన మీ రాజా వారికి మేం స్వాగతం చెబుతూ వినమ్రంగా కిరీటాలు తీసి తలలు వంచాం. కాని ఆయన మాకూ అందనంత మరో అద్భుత ప్రపంచానికి అలా అలా ఎదిగిపోతూ చేరుకోవడం విస్తుపోతూ చూసాం మేం. అందుకు కారణం ఏమిటా అని ఆలోచిస్తే తెల్సింది..కారణం ఆయనే అని..’ ‘ఆయనా? ఏమిటి మీరంటున్నది?’ ‘అవును బాబూ .. ఆయన భగవద్గీత లోని కొన్ని అధ్యాయాలు సరళంగా, భావ యుక్తంగా తన చివరి రోజుల వరకు పాడి తరించి పోతుంటే మీ ఇలవేల్పు వేంకటేశ్వరుడు ఒక్కసారి తన పూర్వ రూపంలోకి అంటే కృష్ణ పరమాత్మగా మారిపోయి ఘంటసాల రాజా వారికి విశ్వరూపం చూపించి తనతో పాటు ఆయన ఆత్మని కలుపుకుంటూ మాకూ తెలియని ఆ పరమాత్మ లోకానికి తీసుకు పోతుంటే ఆ అపరిమిత వెలుగుల్లో ..నువ్వన్నట్టు నిజంగానే అంధకారంలో అలమటించిన నిరాశా జీవులం అయిపోయాం.’ ‘అయితే..ఇన్ని తెలిసి కూడా ..ఆరంభంలో ‘ఎవరండీ రాజా సాబ్’ అని అన్ని ప్రశ్నలు వేసి వేధించారెందుకూ?’ ‘తెలియని వారికి తెలియాలి కదా....ప్రజాస్వామ్య పధ్ధతి మీది. తెలుసుకునే హక్కు అందరిదీనూ...’ ‘నాకు ఉపకరించిన భోగట్టాలు – ఘంటసాలవారి స్వీయ రచన ‘ఇది నా కథ’, ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక 09 జూన్ 2001 లో పునర్ముద్రితం, మరొకటి- ‘సినీ సీమలో సంగీతం’ అన్న ఘంటసాల వారి స్వీయ రచన (పత్రిక గుర్తులేదు కానీ అక్కడా అది పునర్ముద్రితమే)’ ‘అమరగాయకుడికి గీతాంజలిగా డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 11 వరకు చేపట్టిన గీత యజ్ఞంలో డబ్భైరెండు మేళకర్తల్లా రోజుకో గీతం చొప్పున డబ్భైరెండు రోజులకి సరిపడా మాస్టారు గారికి సంబంధించిన డబ్భైరెండు పాటలు ఇవ్వగలిగావా బాబూ..’ ‘నా యజ్ఞంలో లోపాలుంటే అవి నావే.. సాధ్యమైనంత వరకు సేకరించిన విషయాలు వివరించాను, సేకరించిన గీతాలు వినిపించాను. అందుబాటులో ఉండే పాట దృశ్యాలు చూపించాను. సమకాలీన సంగతుల మధ్య మాస్టారు గారి పాటలతో ఉపశమనం పొందాలని కాంక్షించాను. మా రాజా వారికి ఏదో ఆత్రంలో ‘గాత్రేయ’ అనే టైటిల్ ఇచ్చాను. మీరేమంటారూ?’ ------ గంధర్వులు కిరీటాలు తగిలించుకునీ వెళ్ళిపోతున్నట్టు కనిపించలేదు కానీ మాస్టారు శ్రీకృష్ణ విశ్వరూపంలో ఐక్యమవ్వడం నా కల పరిధికి చేతకాక నాకు మెలకువ వచ్చేసింది.... -డా. తాతిరాజు వేణుగోపాల్, 11 ఫిబ్రవరి 2013 (కనులు చూసినా పాటే - షావుకారు,సారంగధర,శాంతి నివాసం,శభాష్ రాముడు -దృశ్య గీతాలు కనులు మూసినా పాటే- స్వర్గసీమ,టింగురంగా,శభాష్ రాజా,రంగేళీ రాజా, రక్షరేఖ,నిర్దోషి,జయం మనదే,మర్మయోగి,రేపు నీదే,శభాష్ రాముడు -శ్రవణ గీతాలు) (తిరుగులేని మాట - 'సీమ' పదం ఉన్న గీతాలు; ఘంటసాల వారి సంగీత దర్శకత్వంలో వచ్చిన సినిమాలు, పాటలు,రాగాలు)
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|