మునుపటి నా మాట
‘జమిందారీతనం వల్ల వచ్చిన వల్లమాలిన బద్ధకం’ తనకుందని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎన్నో సందర్భాల్లో అంటూ ఉండేవారు. పాట వ్రాసి ఇవ్వండి శాస్త్రి గారూ అని హడావుడి చేసే ఏ నిర్మాతా ఆయన చుట్టూ తిరగలేదు. ఆయన పాట కావాలనుకునేవారు ఆగేవారు. అది ఇన్స్టంట్ కాఫీ కాదాయె. అమృతం ధార. ఆగాల్సిందే. ‘ఎందుకే నీకింత తొందర?’ అని ఆయన తన తొలి సినిమాతోనే స్పష్టం చేయడంతో తరువాత ఏ నిర్మాత కూడా ఆయన్ని తొందర పెట్టలేదు. ఆగితే మంచి చిలక పలుకులు దక్కుతాయని వారికి తెలుసు. అలాగని శాస్త్రిగారు తన ధోరణిలో ఏదో రాసుకుంటూ పోలేదు. సినిమాలో సందర్భానికి సరిపోయేలా రాస్తూనే తన శైలిని మాత్రం త్యాగం చెయ్యలేదు. ఆయన తన చుట్టూ టేప్ రికార్డర్ పట్టుకు తిరిగేలా ఎవర్నీ శాశించలేదు. ఇక్కడో ముక్క అక్కడో ముక్క చెప్పి పాట అయిందనిపించే సవ్య సాచి కారు ఆయన. అయినా పాటలందు కృష్ణశాస్త్రి పాటలు వేరయా అని ఇటు నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులతో పాటు శ్రోతలకు కూడా తెలుసు. రికార్డులున్న రోజుల్లో ఎక్కడో దూరాన్నుంచి సినిమా పాట వినిపిస్తుంటే ‘కృ.శా. గారి పాటలాగుంది’ అని చెవులు తొందర పడేవి. నిజానికి ఆయన పాటకెటువంటి దృశ్యం అక్కర్లేదు. అదృశ్యంతోనే మనో చిత్రాన్ని దర్శించుకోవచ్చు. ఆ మనో చిత్రానికి న్యాయం కూర్చాలని ప్రతి స్వర కర్తా మడి కట్టుకుని మరీ స్వర పరిచేవారు. ఉదాహరణకి- చక్రవర్తి సంగీతంలో కొన్ని వేల పాటలు వచ్చి ఉండవచ్చు. ఆయనదో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఉండి ఉండవచ్చు. అన్ని వేలపాటల్లో కొన్నిటిని వేళ్ళమీద లెక్కించాల్సి వస్తే అందులో రెండు వేళ్ళ మీద వెంటనే వచ్చి వాలే పాటలు కృష్ణశాస్త్రి రచనలే. అవి- చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు, కుశలమా నీకు కుశలమేనా ...అన్నవే. రెండు పాటలూ యుగళ గీతాలే. ఆ రెండు కూడా బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడినవే. చీకటి వెలుగులు పాట శ్రావ్య రాగమాలిక. అది చక్రవర్తి గారిని ఉన్నత శిఖరాన కూర్చోబెట్టింది. కుశలమా – పాట ఎంత ఆధునికమో అంత శ్రావ్యమైనది కూడా. మరొకరు సత్యం. వీరు ఎప్పటినుంచో చిత్రసీమలో ఉన్నా, ఎన్ని పాటలకో హిందీ బాణీలు ప్రేరణగా తీసుకున్నా శాస్త్రిగారి పాటలు తన చేతిలో పడేసరికి తన స్వంత బాణీలోని సత్తా చూపించుకున్నారు. ఎదుటనుంచి కదలను పదములింక వదలను, నేటికి మళ్ళీ మా ఇంట్లో ఎంచక్కా పండుగ, దూరాకాశ వీదుల్లో తారా దీపాలు, రామా ఓ రామా రావా కనరావా - ఈ పాటలన్నీ ఆయన చక్కగా చెక్కిన స్వర శిల్ప రూపాలు. దృశ్యం అవసరం లేని పాట రాయడం శాస్త్రిగారికంత అద్భుతంగా పట్టు పడడానికి కారణం ఆకాశవాణియే. రేడియోతోనూ, రేడియో ద్రష్టలు బాలాంత్రపు రజనీ , పాలగుమ్మి విశ్వనాథం, వింజమూరి అనసూయాదేవి గార్లతోనూ ఆయనకున్న స్నేహ బాంధవ్యం వల్ల ఆయన కలం నేర్చిన పాళీ భాషలో తెలుగు సిరా మృదువైన పదాలు అలా అలా దొర్లిస్తూ రావడానికి దోహద పడింది.
భావకవులవలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్- అని సాటి సినీ కవి ఎగతాళి చేసినా ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అనుకునే స్వభావం ఆయనది. భావకవి అనగానే ఎంతసేపూ ‘నేను’, ‘నా’ అనే అహం ముద్రలే వస్తాయి అనే అపోహ ముద్ర ఉంది. నేను అంటే ‘అహం’ అనే కదా. అంచేత భావకవి ‘అహంభావ కవి’ కావాలి. కాని కృష్ణశాస్త్రి భావకవే కాని అహంభావ కవి కారు. చొరవ అహంభావం కాదు. 'మల్లీశ్వరి' చిత్రమే తీసుకుందాం. అందులో మల్లి ‘నా బావా, నా రాజా’ అంటే నాగరాజు ‘నా పిల్లా, నా మల్లీ’ అని అనగలడు. ఆ చొరవ వెక్కిరింతకి ఆస్కారం కల్పిస్తే నకారం మకారమై పోతుంది కదా. అప్పుడు ‘మా బావ గారికి, మా బావ మెడలో, మా కోతీ బావ’ అని అనాలనిపిస్తుంది. ఇద్దరిదీ ఒకటే ఊరై నప్పుడు..ఆవల దారిలో కారు మబ్బులు ఎదురైనప్పుడు ‘మన ఊరు చేరాలి’ అని గిత్తలని ఉరకలు వేయించడం సబబే. విధి వశాత్తు ఇద్దరి మధ్య వేర్పాటు సంభవించినప్పుడు అవే మేఘాలు వారిద్దరి మనో వేదనలు మోసుకు పోగలవు. ‘ఏడ తానున్నాడో బావ’ అంటుందే తప్ప మల్లి అక్కడ ‘నా బావ’ అనదు. మా ఊరు అనే అంటాడే తప్ప నా మల్లి అని అనడప్పుడు నాగరాజు. ‘నా మనసు బావకు చెప్పి రావా’ అని వేడుకుంటుందే గాని నామనసు నా బావకు ..అని చెప్పదు. చివరికింక దుఃఖం ఆపుకోలేక ‘నా బావ లేనిది బ్రతుకజాల’ అని తన కన్నీరే వాన జల్లుగా మార్చుకునీ బావ మ్రోల కురిపించవా అని మేఘమాలని అర్ధిస్తుంది మల్లి. తనకోసం తన బావ వేచి ఉంటాడని ఆమె నమ్మకం. ఇలాంటి ఒక చక్కని రచనతో సన్నివేశం బలపడుతుంది. అలా తన సన్నివేశానికి శాస్త్రిగారి రచనే బలమౌతుందని ఎరిగిన ప్రథమ వ్యక్తి బి.ఎన్.రెడ్డి గారు. శాస్త్రిగారు తన పాటల సంపుటికి ‘మేఘమాల’ అనే పేరు పెట్టడమే కాక దాన్ని బి.ఎన్. గారికే అంకిత మిచ్చారు. ఇస్తూ ఆయనన్నారు- ‘నా పాటలు అంటే మీకు వల్లమాలిన ఇష్టం. వాటిని వింటూంటేనే మీ కళ్ళు చెమ్మగిల్లుతాయి. నేను పాటలు వ్రాసిన మొదటి చలనచిత్రం 'మల్లీశ్వరి'. నాడే నేర్చుకున్నాను సినిమాకు పాటలు వ్రాయడం. నాకు దొరికిన వాటిలో, కొన్నిటిని ఈ సంపుటిగా కూర్చి మీకు అందిస్తున్నాను’. నాడే నేర్చుకున్నాను- భావకవి అహంభావకవి కాదు అనడానికి ఈ మాట చాలు. సినిమాలు తీసి పారేసే గుణమే ఉంటే బి.ఎన్. తొందర పడేవారే. ఆయన తొందర పడలేదు కనుక శాస్త్రి గారూ పాటలు వ్రాయడంలో తొందర పడలేదు. మొదటి చిత్రంలోనే మల్లి పాడే రెండు పాటల్లో ఆయన ‘తొందర’ పద ప్రయోగం చేసి సందర్భానుసారంగా ఒకే పదంలో రెండు భిన్న అనుభూతులు కలిగించారు. అందెల రవళుల సందడి మరి మరి తొందర చేస్తుండగా తాను పిలిస్తే అంత బిగువా? అని అనడంలో అరమరికలు లేని మల్లి మారువేషంలో ఉన్న మహారాజు ఎదుట చూపించే జావళీ నాట్య కేళీ విలాసం కనిపిస్తుంది. అదే మహారాజు రాణి కోరిక మీద మల్లిని రాణి గారి ఇష్ట సఖిగా నియమిస్తే దానినొక చెరసాలగా మల్లి భావించడం, ఆ చెరసాల నుంచి బయట పడుతున్న వేళ మనసు నాట్యమాడుతుంటే ఎదురుగా ఉన్న చిలక ఎంత తొందరగా బయట పడతామా అన్నట్టు ఉందని మల్లికి అనిపించడం సహజమే. అయినా సరే, ఇంకా రేయి ఉంది, అంతవరకూ ఎందుకే నీకింత తొందర...అని ఆ చిలకతో చెప్పాలనిపిస్తుంది తనకి. మల్లి చిలక అయినప్పుడు తమ ఊరిలో ఉన్న నాగరాజే కదా గోరువంక ! బి.ఎన్ మల్లీశ్వరిలో ‘మారువేషంలో ఉన్న మహారాజు’ని చూపించారు సరే. మరి రాజ మకుటం కూడా ఆయనదే అయినప్పుడు కృ.శా. ఊరుకున్నారా? ‘మణి కిరీటము లేని మహరాజు గాకేమి?’ అని ఒక ప్రేయసి తన ఒడిలో ప్రియుని నిద్దుర పుచ్చుతూ గొడవ చెయ్యొద్దని గాలినే శాసిస్తుందని నిరూపించారు. ‘ఈ పంజరపు బ్రతుకు ఇక నీకు తీరునే’ అని తాను తొలిసారి అన్నందుకు బి.ఎన్. మదిలో మరో చిత్రానికి తెర లేస్తుందని కృ.శా. అనుకునే ఉండరు. ‘బంగారు పంజరం’ వచ్చేసింది. నాగరాజు అందులో లేడు కాని ‘నల్లకనుల నాగసొరము ఊదే’టి రాజు మాత్రం ఉన్నాడు. అప్పుడు ‘నే కొలిచే దొరవైనా నను వలచే నా రాజువే’ అని ఒక పల్లె పిల్ల అనగలిగిందంటే భక్తుడి చొరవకి భగవంతుడు కదిలి రావాల్సిందే అన్నది తేటతెల్లమౌతుంది. అదీ కృష్ణశాస్త్రీయం! ఇక్కడ ‘దొర’ ఎదురైనట్టే మరొక సందర్భంలో కృ.శా. గారికి దొర దొరికారు. అతను దొరా? లేక తనకోసం దిగిన దేవర వారా? అని పల్లె పిల్లకి సందేహం. అంతలోనే ‘ఈ వరకెరుగని తొందరలు, ఏవో సిగ్గుల దొంతరలు’ ఒకదానితో ఒకటి పోటీ పడిపోతున్నాయి. చిలిపి దొర తక్కువేమీ కాదు- నీకై దిగిన దొరని, అయితే లోకాల నేలే దేవరని..అంతే...అని అంటాడు. దేవరనే.. ఇప్పుడు నీకోసం దొర రూపంలో దిగి వచ్చాను సుమా అని ఎంత గడుసుగా చెబుతున్నాడూ. ఇదీ కృష్ణశాస్త్రీయం! బి.ఎన్ రంగుల్లో తీయని ‘రంగుల రాట్నం’ చిత్రం మటుకు ఎందుకో కృ.శా చేత రాయించని చిత్రంగా ‘తొందర’ పడిందేమో అని అనిపిస్తుంది. అందులో దాశరథి గారికి సైతం కొంచెం కృ.శా పోలికలు రాకపోలేదు – కోయిల కోయని పిలిచినది ..ఎవరి రూపో ....అంటూ ఆయనలోని భావకవి మేల్కొవాల్సి వచ్చింది. బి.ఎన్. ఇంక సినిమాలు మానుకున్నాక ఎవరో ఘనులు ‘ఏకవీర’ తీసి సాహసం చేశారు- విశ్వనాథ వారి రచనకి సి.నా.రె. సంభాషణలు కూర్చారు. మూడంటే మూడే కాదు – అన్నా సరే కృ.శా మూడే పాటలు రాశారు. కళ్ళకు గంతలు కట్టి చెలికత్తెలు తమాషాగా ఆడిస్తుంటే అక్కడ మళ్ళీ ఆయనకి ఓ ముచటైన పదసామగ్రి దొరికింది. అదే- ‘మారు వేషంలో ఏ మహరాజో?’. బహుశా ఆయన దృష్టిలో బి.ఎన్ ఒక మారువేషం లో ఉన్న మహరాజేనేమో! మూడంటే మూడే కాదు- అని అనుకున్నప్పుడు ‘సుఖదు:ఖాలు’ సినిమాలోని పాట గురుతొచ్చి ఉండాలే.. అదే..మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు - పాట . చెల్లి,తల్లి, పొదరిల్లు,కోవెల,గోరింక, పెళ్లి, గుబులు,దిగులు- ఇంతే ఒక ‘అన్న’ ఉపయోగించిన పదాలు. ప్రతి అన్నకీ ఇష్టమైన పాట, ప్రతి చెల్లికీ ఇష్టమైన పాట, ప్రతి తల్లి కంట నీరు ఒలికించే పాట! చిన్న మాటలతోనే చిరకాలం గుర్తుండే పాటలు రాశారు శాస్త్రిగారు. ఆయనే వేరే పదాలతో ‘తొందర’ పడి ఉంటే పాట రూపు ఎలా ఉండేదో? ఒకనాడు శాస్త్రి గారే చిలకతో అన్నప్పుడు ‘ఆ వంక గొరవంక’ ఉందని అన్నారు కదా, అంటే గోరింక పురుషుడే కదా. మరి ఈయనేమిటీ స్త్రీని గోరింక అంటున్నారూ? ఎందుకంటే- సినిమాలో ఆ స్త్రీ, అంటే ఆ అన్నయ్య చెల్లి చురుకైనదే కాని అమాయకురాలు. ఆ మాత్రం మగటిమి స్త్రీలో ఉంటే తప్పా? ఇక అదే సినిమాలో.. ఊహించని భవిష్యత్తుకి ముందే అదే స్త్రీ, ఆ అన్నయ్య చెల్లెలే పాడిన పాట ‘ఇది మల్లెల వేళయనీ..ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది’ –శాస్త్రి గారి రచనే. ఇంతకీ కూసే కోయిల మగా? ఆడా? మగ కోయిలే అలా కూస్తుందని అంటారు. మళ్ళీ శాస్త్రిగారేమిటీ...కోయిలకి స్త్రీ వాచకం ఆపాదిస్తున్నారు? ఇంతకు ముందు గోరింక అనిపించుకున్న ఆ స్త్రీ ఇప్పుడు కోయిల అనిపించుకుంటే తప్పా? ఆ స్త్రీ లోని తప్పు అదే- కాస్త పురుషత్వంతో మసలేసరికి తను నమ్మిన పురుషుడే ఆమెను వంచించడం! స్వేచ్చగా ఎగిరే ఆ కోయిల కాస్త తొందరపాటు వల్ల శాశ్వతంగా చిరిగిన రెక్కలతో నేల కొరగాల్సి వచ్చింది, అయినా కరుణ కరిగేది చల్లని దైవం కనుక వాడే లతకి వసంతం ఎదురౌతుంది, అక్కడ, ఆ మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలుస్తుందీ మందారం. ఇదేమిటీ.. కోయిల కాస్త మందారమైపోయిందేమిటీ? రెక్కలు తెగిన కోయిల శరీరం రక్తపు ముద్ద అయినప్పుడు అది మందారం లాగే ఉండదా? దైవం సన్నిధిలో పూవే విలువైనది కదా. అయినా పాపం ఈ మందారం ఇంకా మొగసాల లోనే పడి ఉంది – ‘లోనికి రావడానికి నాకు అర్హత లేదు’ అని ఆమె భావం, కరుణ కరిగే దైవం ఆజ్ఞ కానిదే తాను ఆ పవిత్ర సీమ లోపలికి పోలేదు. కృష్ణశాస్త్రి ‘తొందర’ అనే చిన్న పదం వేసినా ప్రతి ఒక్కరినీ తాపీగా ఆలోచించమంటున్నారు. న్యాయం ఎప్పుడూ తొందరగా జరగదు, అఘాయిత్యానిదే తొందరపాటు! 'మల్లీశ్వరి' తరువాత మొత్తం సినిమాలో అన్ని పాటలూ రాసే భాగ్యం కృ.శా. గారికి ‘ఉండమ్మా బొట్టు పెడతా’ వల్ల దక్కింది. అప్పుడెప్పుడో తొలి చిత్రంలో రెండుసార్లు ‘తొందర’ అనే మాట ప్రయోగించానే, మళ్ళీ ఇన్నాళ్ళకి ఒకే సినిమాలో అన్ని పాటలు రాస్తున్నా కదా, ఇందులో ఒక్కసారైనా ‘తొందర’ పడితే బావుణ్ణు కదా’ అని అనుకున్నట్టున్నారు శాస్త్రిగారు. మల్లీశ్వరి గుర్తుకొస్తే మహనీయుడు బి.ఎన్. గుర్తుకు రావాల్సిందే కదా. ‘సడిసేయకో గాలి సడి సేయబోకే’ అని 'రాజమకుటం' కోసం పాట రాసినప్పుడు అందులో గాలి తొందర పడకూడదు కదా మరి....అందుకే ఈ సారి ‘ఎందుకీ సందెగాలి? సందెగాలి తేలి మురళి?’ పాట మకుటం కుదరగానే శాస్త్రిగారు వెంటనే ‘తొందర తొందరలాయే విందులు విందులు చేసే’ అని అనుపల్లవితో ముగించారు. ఎందుకు తొందర అంటే –ప్రభువు పాదాల వాలేందుకే నట. తొందరపడి ఒక కోయిల అప్పుడు విందులు చేయడం వేరు. సందె గాలి, మురళి ఎదురౌతున్నప్పుడు ఇప్పుడు విరహ గోపికలో కలుగుతున్న తొందరలు,విందులూ వేరు. అప్పటి ఆ తొందర, విందుల పాట కోదండ ‘పాణి’ స్వర పరచడం ఆయన స్వయానా దగ్గరుండీ మరీ విన్నారట. అందుకే కాబోలు ఈ మరో తొందర,విందుల పాటలో ‘రాధా పల్లవ పాణి’ అనే పద ప్రయోగం చేశారు శాస్త్రిగారు. ఇంకో విశేషం- ఇంత వరకూ ‘తొందర’ అనే మాటని ఏక పదంగా వాడుతూ వచ్చిన శాస్త్రి గారు ఇక్కడ మాత్రం ఆమ్రేడించారు. తొలి చిత్రం 'మల్లీశ్వరి'లో ఎన్ని ఆమ్రేడితాలో....ఎవరికి మాత్రం తెలియదు కనుక! బిరబిర, చరచర, పరుగున పరుగున,గలగల, ఘణఘణ,గుంపులు గుంపులు, బారులు బారులు, మరి మరి, దేశదేశాలు, ప్రియా ప్రియా, కొసరి కొసరి, గుస గుస, ఉసురుసురు! ఏ సినిమాకైనా పాట ఒకటి ఉంటేనే సన్నివేశం ఏర్పడుతుంది. సన్నివేశం ఇలా ఉంటుంది అని స్పష్టంగా చెబితే మంచి పాట కుదురుతుంది. సినిమా అదృశ్యమై పోయినా, అందులోని దృశ్యం గుర్తులేక పోయినా పాట వింటుంటే మనకి మనమే ఒక సన్నివేశానికి రూపకల్పన చేసుకోగలం అనిపించేలా రాయగలిగేది కృ.శా గారొక్కరే. ‘అగ్ని పరీక్ష’ చిత్రంలోనిది అని చెప్పినా చెప్పక పోయినా వింటుంటే బావుందే అనిపించే పాట- ‘ఎలాగనీ ఎలాగనీ నిండిన మనసందాక నిలిచుండలేక పాడాలనీ’! ఎందుకు పాడడం అంటే మనసు నిలవటం లేదు కాబట్టి. ఎందుకు మనసు నిలవటం లేదంటే ‘ఎవరో వచ్చే వేళాయే’ కాబట్టి. ఆ వస్తున్నది ఎవరో కాదు- తనవాడు. అతని అడుగుల సడి తానెరిగినదే. తనకోసమే అతను వస్తున్నాడు కనుక అతని నడకలో వడి ఉంది. అందుకే తనకి ప్రకృతి అంతటా పరుగులే కనిపిస్తున్నాయి, అన్నిటికీ తొందరలే అనిపిస్తున్నాయి. ఆనంద సాగరంలో అలలు తొందర పెడుతున్నాయి. ఏమాత్రం కళ్ళు మూసినా ...అమ్మో.. పరుగు పరుగున తనకోసం వస్తున్న తన ముందర కనిపించనున్న రూపం ఇట్టే కను మరుగైనట్టే కదా. అందుకని వాకిటిలోనే నిలబడాలి. ఒక అన్న చెల్లెల్ని గోరింకతో పోల్చి ‘గోరింక పెళ్ళైపోతే ఏ వంకో వెళ్ళీ పొతే గూడంతా గుబులైపోదా’ అని అనుకున్నట్టు కృ.శా ఊహించారు. మరో అన్న తన చెల్లెలు నిజంగానే పెళ్లికూతురైపోగానే చూసి ఆనందిస్తాడా, లేక ‘అయ్యో..మెట్టినింటికి వెళ్ళిపోతుందే’ అని బాధ పడతాడా? రెండూ ఏకం చేసి కృ.శా ‘కొంచెం కొంచెం బిడియాలు’ అనే పాట రాశారు. అందులో సఖులంతా ఏకమై ఒక్క మాటే అన్నారు-ఏమని? ‘మా మంచి పెళ్లి కూతురికి మగనింటికి పోయే తొందరలు’ అన్నదే! ‘ఏకవీర’ సినిమా గురించి ప్రస్తావించుకున్నాం కదూ.. కృ.శా వారి ఆమ్రేడితాలూ మనకి కొట్టిన పిండే. హంస నడకల చెలియని చూస్తే సఖులు ‘ఔనే చెలియా సరి సరి’ అని ఎందుకనాలీ? ఎందుకంటే ఆమె ‘వాలు కనుల రెప్పల్లో వాలాడే తొందరలు’ వారు గమనించారు కనుక! ఆమె కళ్ళు దించుకుంటే వారికి కనిపించేవి ఆమె పెదవులే కదా... అవి ఎలా ఉన్నాయీ...’దోర పెదవి అంచుల చిరునవ్వుల దోబూచులు’ ఆడుతూ! ఆ వైపు నవ మన్మధుడు త్వర పడుతుంటే ఈ వైపు హంస నడకల ఈమె మనసు పడే తొందరలు! నడుమ ఈ సఖుల ఆట పట్టింపు! భావ కవులు సహజంగా స్త్రీ పక్షముంటారు. కృ.శా పాటల్లో అధికశాతం స్త్రీ గళ గీతాలే. పెళ్లి నాటికి సరే- సంసార లోకంలో సైతం ఏ మాత్రం ఎడబాటున్నా దంపతులు సహించగలరా? అటువంటి దంపతులకోసం కృ.శా ‘కుశలమా నీకు కుశలమేనా?’ అనే విచిత్రమైన ‘టపా’ సందేశంతో పాట వినిపించారు. ‘పూలగాలి రెక్కలపైన, నీలి మబ్బు పాయల పైన’ కబుర్లూ, కమ్మలూ ఎన్నో పంపానే ..ఒకటైనా అందాయా? అని ఆమె బేలగా అడుగుతోంది. అతని కొంటె జవాబు-‘అందాయి..తొందర తెలిసింది’ అనీ! ఒకనాడు మల్లీనాగరాజుల విరహ వేదనని మేఘ సందేశంగా వినిపించిన కృశా గారు విరహ విహారంలో దొర్లిన కమ్మని కబుర్లు కమ్మ రూపంలో అందించారు. భార్య సీత అయితే, భర్త శ్రీరాముడే. సీత మనసే శ్రీరాముడి సింహాసనం. ఆ ఇంటి లోగిలిలో తులసమ్మ కొలువైతే ఇంక హరి పూజకి పూలు కావాలి. ఎవరిస్తారు పూలు? కొమ్మలూ,రెమ్మలూ ..అంతేగా! వాటికే ఆ తొందర ...హరి పూజకి పూలిమ్మని వాటికి ఒకటే తొందర. కృ.శా ‘ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు’ పాట రాయడమే కాదు ఆదర్శ గృహిణులకి ఆనంద సంసార మంత్ర దర్శనం చేయించారు. తులసి పేరు చెప్పగానే రుక్మిణి, పూలనగానే పారిజాతాలు, పారిజాతాలనగానే సత్యభామ గుర్తొస్తారు. ద్వాపరం నాటి శ్రీకృష్ణుడు మరీ గుర్తొస్తాడు. కాని కృ.శా త్రేతా యుగంలోకి లాక్కుపోయి సీతమ్మను గుర్తు చేయించారు. సినిమా పేరే ‘ఈనాటి బంధం ఏనాటిదో’ అయినప్పుడు ఇన్ని బంధాలు కావాలి మరి! ఇన్ని పాటల్లో మృదువుగా ‘తొందర’ పద ప్రయోగం చేసి మోసం,ద్వేషం లేని సీమకి త్వర త్వరగా తరలి పోయారు శాస్త్రిగారు. ‘అవునోయీ గోపీ.. ఇక్కడ లాగితే కూపీ ....తెలిసింది ....నా ‘తొందర శబ్ద’ రత్నాకరం నీ దగ్గరుందనీ...ఏదీ ఏదీ ఆ జాబితా? చూపిస్తే నాలో నేనే హాయిగా పాడుతూ నవ్వుతా...’ అన్నట్టు లేదూ ఎడమ ప్రక్కన ఆయన ఫోటో? అది నలుపు తెలుపు ఫోటో, కృష్ణ పక్షం, శుక్లపక్షం కలబోసుకున్న చంద్రుడి రూపానికి డిటో...అవునా? అనుకోనా? త్వర పడి నిజమనుకోనా? తొందర తొందరగా కలయనుకోనా? (కనులు చూసినా పాటే, కనులు మూసినా పాటే, కనులు చదివినా పాటే----అన్నిటా 'తొందర' లాయే!) -డా.తాతిరాజు వేణుగోపాల్, 03 మార్చి 2013
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|