మునుపటి నా మాట
రెండేళ్ళ క్రితం 'దివి' సీమ వైపు హుటాహుటిన వెళ్ళిపోయిన ముళ్ళపూడి వెంకట రమణ గారు వందేళ్ళకైనా మరవలేని ఒక శ్లేష పలికారు- అడ్జస్ట్ 'మెంటాలిటీ' అని. ముళ్ళపూడి వారంటే బుడుగు ద్వారా బుడుగు తల్లి తండ్రుల భోగట్టాలు రాబట్టేలా తెలుగు వారికి కొత్త ధర్మం నూరిపోసిన రచయితా, సినీ రచయితానూ. అయితే 'తెలుసో ఏమో అందానికి అలకే అందం', 'మేడ మీద మేడ కట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందూ..హలో హలో కమ్ అవుట్ ..రా ముందూ' లాంటి తొలి పాటలు రాసిన సినీ కవి అని కొందరికే తెలుసో ఏమో. అది ఆయన అడ్జస్ట్ మెంటాలిటీ. ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటే మేలు అన్నిటా కాలు పెడితే విరుగును కీలు - అని ఏ పెద్దాయనా చెప్పనట్టు జ్ఞాపకం. కాని ప్రతివాది భయంకర శ్రీనివాస్ ముళ్ళపూడి వారి ఈ రెండు పాటలూ పాడక ముందు నుంచీ ఒక అడ్జస్ట్ మెంటాలిటీకి అలవాటు పడిపోయారు. తన పేరు పొడి పొడిగా 'పి.బి.ఎస్' కదా, పి.బి. అంటే ప్లే బ్యాక్ అని శ్రీనివాస్ కాస్త శ్రీని 'వాయిస్' అని సినీ సీమ ముద్ర వేయగానే నవ్వుతూనే తన అడ్జస్ట్ మెంటాలిటీని కనపరిచారు. అయితే అసలే ఇండియా అందునా భాషలెక్కువ కాబట్టి పి.బి.ఎస్ మనసులో శత భాషలు శతభిషలు మొదలెట్టాయి- నన్నంటే నన్ను నీ 'వాక్కు'న చేర్చుకో అని తామంతా సతాయిస్తుంటే ఈయన కున్న అడ్జస్ట్ మెంటాలిటీ దేన్నిస్వీకరిస్తుందా అని. గొల్లప్రోలు వాడైనా గోపాలుడు కాదు. తెల్ల కాగితాలే తప్ప తెంపరితనం ఎరగడు. అందుకే ఆచి తూచి ఎనిమిది భాషలు పూర్తిగా నేర్చుకోవడమే కాక ఆయా భాషల కవిత్వ స్పూర్తితో తానూ వ్రాయడం మొదలెట్టాడు. ఇలా కాయితం, కలం తో భాషా అడ్జస్ట్ మెంటాలిటీ కన పరిచిన ఏకైక వ్యక్తి బహుశ: పి.బి.ఎస్ ఒక్కరేనేమో. జలపాతం కాదు ఆయన గళసీమ. అది- కొండల మీద నుంచి జారిపడిన తరువాత నేల మీద సెలయేరుగా మారిన జలసీమ! చిత్రసీమలో అటువంటి మెత్తని సన్నివేశం కల్పించినప్పుడు ప్రతి నిర్మాత ఊహించిన గొంతు శ్రీని 'వాయిసే'. అలా నిర్మాతలకి, స్వర కర్తలకి తన వంతుగా తన గొంతుని అందిస్తూ అడ్జస్ట్ మెంటాలిటీ చూపించిన మెలోడీ ప్రిన్స్ శ్రీనివాస్.
శ్లేష అని శీర్షికలో కనపడింది కదూ. మ్యూజిక్ అని పలకడంలో కొందరు మ్యూసిక్ అంటారు. మ్యూ -ఇంగ్లీషులో MU. M- అంటే మెలోడీ అని అదిగానీ మ్యూసిక్ నుంచి తొలగిపోతే మిగిలేది 'యూ సిక్' అంటే 'నువ్వు జబ్బున పడతావ్' అని ఎప్పుడో శ్లేషతో చురక వేసిన 'మ్యూజిక్ థెరపిస్టు' పి.బి.ఎస్. ఆయన 'మెలోడీ' యే మేలో, అరుపులతో డీ కొట్టడమే చాలో అని ఎప్పుడూ భాషించలేదు. ఆయన గొంతులో ఆ అడ్జస్ట్ మెంటాలిటీ అంత గొప్పది. కనుకనే 'హలో మేడం సత్యభామా' అని ఆట పట్టించే తీరులోనూ మెలోడీ కోమాలోకి పోలేదు. పియానో వాయించేది ఎవరైతేనేం, అక్కడ నిలబడి ఆహూతుల మధ్య మందస్మిత విషాద వదనంతో ఒక భగ్న ప్రేమికుడు 'ఓహో గులాబి బాలా' అని సత్యాలన్నీ వెల్లడి చేయాలంటే అక్కడ సరిపోయే మెలోడీ మార్దవ గాత్రం శ్రీని 'వాయిసే'. ఒక పక్క పియానో వాయిస్తూనే అందమైన అమ్మాయిని చూస్తూనే అబ్బే నీ నడక మాత్రమే చూశాను అని తప్పించుకునే హీరో 'ఓ హంస నడల దానా' అని తెలివిగా బుకాయిస్తే అక్కడ సరిపోయే మెలోడీ హుషారు గాత్రం శ్రీని'వాయిసే'! 'అందాల ఓ చిలకా', 'జగమున కనరాని సుందర నారీ' అని అంతెత్తు మనిషి మురిసిపోయినా, 'ఆనాటి చెలిమి ఒక కల' అని పియానో ముందు అంతలోనే మనసు విరిగిపోయినా ఆ హరనాథుడే ఈ శ్రీనివాసుడా అన్నంతగా శరీరంలో శారీరం కలసిపోవడం పి.బి.ఎస్. అడ్జస్ట్ మెంటాలిటీకి పరాకాష్ట! కత్తి తిప్పే కాంతారావుకి 'ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి' పాట పాడినప్పుడే తెలిసింది శ్రీని 'వాయిస్' కి- ఇక ముందు ముందు ఈయనదీ తనదీ జన్మజన్మల బంధమే అని. పైగా విఠల ఆచార్య వారికి కన్నడ సీమ తో బంధముంది. అదిగో ఈ బహు భాషీయుడికి అదే వరమైంది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గొంతుతో తన గళానికి ఏదో అనుబంధ ముంది అని తెలుకున్నాకా ఆ బంధం రెండు దశాబ్దాలుగా స్థిరమైంది. అలాంటి అడ్జస్ట్ మెంటాలిటీ అందరికీ దక్కేది కాదు. జెమిని గణేషన్ అదే తెలుసుకున్నప్పుడు తమిళ సినీ రంగం శ్రీని 'వాయిస్' ఇకపైన మీ చాయిస్ అని నిర్ణయించేసింది. ఆయన గళం విప్పితే చాలు ఆయనెవరో పోల్చుకోవచ్చు- ఒక వేళ అతి దారుణంగా ఆయన పేరు మరచి పొతే. కాని ఆయన తలమీద పెద్ద భారం మోపుతూ ఎదురయ్యేవారు. యువ శ్రీనివాస్ 'టోపీ' ధారి అయితే సీనియర్ సిటిజెన్ శ్రీనివాసాచార్యులు 'మైసూరు టర్బన్' ధారి. 'అదిగో శ్రీనివాస్ గారు' అనే ప్రత్యేక ముద్ర అవసరం లేకపోయినా ఇలా రెండు తలపాగాలతో తన అడ్జస్ట్ మెంటాలిటీ స్పష్టం చేసారు పి.బి.ఎస్. అందరికీ ఆప్తుడు. మిత్రులే తప్ప శత్రువులు అనే పదం తన జీవిత నిఘంటువులో చూసి ఎరగని మెత్తని మనసు వాడు. హోటల్ లో కాఫీ తాగుతున్నా కవిత్వం రాస్తూ సాఫీ గా సాగిపోయేలా జీవితాన్ని మలచుకున్న వాడు. వాడేం పాడాడూ,వీడేం సంపాయిస్తున్నాడు అనే దుష్కర్మల వైపు దృష్టి పోనివ్వని తటస్థుడు- హాయిగా ఉదయం స్నానం చేసి వచ్చి అలా కుర్చీలో కూర్చునీ ఏదో మరచిపోయానే అన్నట్టు చూసుకున్నారు- ఊపిరి తీయడం మరచిపోయారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, తనూ ఉన్నట్టా లేనట్టా అనే చింత లేకుండా ఈ ఏప్రిల్ పధ్నాలుగున కన్ను మూశారు పి.బి.శ్రీనివాస్. జీవించడంలోనే కాదు మృత్యువు దగ్గరా అడ్జస్ట్ మెంటాలిటీ అవసరం- అని ఆయన అనలేదు. అనుకొమ్మని చెప్పినట్టే అనిపిస్తుంది.'అనుకోనా ఇది కలయనుకోనా? నిజమనుకోనా?' -ఆయన ఉన్నారు అనుకోవడం కల. లేరు అన్నది నిజం. అయితే- ఆయన మృదు గీతాలు మరచిపోవడం కల! అది మాత్రం ముమ్మాటికి (పి.బి.ఎస్ కనుక) నిజం!!! (కనులు చూసినా పాటే, కనుకు మూసినా పాటే- త్వర పడండి. శ్రీని 'వాయిస్' ఆఫ్ ఇండియాని వినేందుకు. మిగులు: ఆకలి రాజ్యం చిత్రంలో హిందీ పాట తూహై రాజా మై(హూ( రానీ....ఉందే అది పి.బి.ఎస్ స్వీయ రచనే. దేవులపల్లి వారి దగ్గర ఈయన కూర్చుంటే ఆయన పదాలు ఇవ్వడం, ఈయన పెదాలు కలపడం జరిగేది. ఉదయగిరి పైన అదిగో గగనాన కదలె దినరాజు తేరు ..ఒదిగి చిరుగాలి నిదుర తెర జారి కదలె కోనేరు నీరు- అలా ప్రకృతిని ఉభయులూ కలిసి శాసించారు. కనులకు తోచేది కాదు సోయగము మనసున పూచేటి మధురిమగానీ - అని శాస్త్రి వారు ప్రవచిస్తే మృదువుగా వచించారు శ్రీనివాస్. స్నేహితులతో ఇదీ ఆయన అడ్జస్ట్ మెంటాలిటీ. ఆయన స్నేహుతుడు ఎం.ఎస్.శ్రీరాం రెండు మూడు సినిమాలకి సంగీతం బాధ్యతలు శ్రీనివాస్ కే అప్ప చెప్పేవారు. పెళ్లిరోజు, మంచిరోజు అన్ని రోజులూ కలిసి వచ్చాయి ఇరువురికీ. సంగీత దర్శకుడు అశ్వత్థామ గోగోగో గోంగూర రుచిని రాకెన్ రోల్ వరసలో చూపిస్తే అందరి నాలుకల మీద ఆ రుచికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు శ్రీనివాస్, జాన'కమ్మ'దనం సాయంతో. ఎస్ జానకి వారితో పి.బి.ఎస్ చాలా పాటలు పాడారు. కోడెకారు చినవాడా, ఓ చిన్నవాడా ఒక్క మాట, ఈ కన్నెగులాబీ విరిసినదోయీ, ఏవేవో చిలిప తలపులురుకుతున్నవి, వలపులోని చిలిపితనం ఇదేలే, ఓ అందమైనబావా ఆవుపాలకోవా, ---ఆ జాబితా అనంతం. ఘంటసాలవారు మహాగాయక నటుడు నాగయ్య గారికి నేపధ్యం పాడడానికి మనసొప్పక పి.బి.ఎస్ తో సాహసం చేయించారు. శ్రీరాముడుకి సైతం ఆ హంస ధ్వని స్వీకారమైంది. ఎమ్మెస్ విశ్వనాథన్ గారిని ఒక అన్నగా పిలిచే చనువుంది పి.బి.ఎస్ కి. ఎన్నెన్ని మధుర గీతాలకో ఆయన పెద్ద పీట వేస్తే దాన్ని సింహాసనం స్థాయికి తన గాత్రంతో తీసుకెళ్ళారు పి.బి.ఎస్. కన్నదాసన్ అంటే అమితమైన భక్తి ఆయనకి. స్వయంగా లలితా గీతాలు రాసుకునే దశలో పి.బి.ఎస్ కి వీరిలా పదజాలం ప్రయోగించే నేర్పు కలిగింది. పాలవెల్లి నా పిల్లనగ్రోవి ..నీల గగనమే నా మోవి అని విస్తరింపజేసిన కృష్ణ తత్వానికి ఆయన పలికిన ముక్తాయింపు భాష్యం - 'ప్రశ్నార్ధకం విధి వ్రాత- ప్రత్యుత్తరం భగవద్గీత!' వారం పదిరోజుల కిందట రికార్డింగ్ అయిన ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమంలో మొన్న సోమవారం ఎస్.పి.బి. (పి.బి.ఎస్ మరో స్వరూపం కాబోలు. అందుకే బాలు గారి తొలి పాట శ్రీనివాస్ గారితో కుదిరింది) మహా రంగస్థల, ఈలపాట గాయకుడు రఘురామయ్య గారిని సంస్మరిస్తూ శ్రీనివాస్ గారి సరదా వ్యాఖ్యానం గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఒక తమిళ చానెల్ లో గాయని వాణీ జయరాం సన్మానంలో శ్రీనివాస్ ఆమెని ప్రశంసిస్తూ పలికిన తమిళ కవిత అద్భుతం. అదే రోజు ఆయన భౌతికంగా లేకపోయినా సాయంత్రానికి 'బొమ్మ' పలుకుతుంటే కంటి వెంట నీరు యథాలాపంగా జారింది. మేళకర్తల రాగాల స్వరాలు ఎలా పోల్చుకోవడం అని మధన పడేవారు తప్పకుండా పి.బి.ఎస్. గ్రంధం చదివి ఊపిరి పీల్చుకోవడం మంచిది. జీనియస్ కింతేనా నివాళి? అందరం కలిసి ఆయన కుప్పలుగా రాసి పెట్టిన బంగారం విలువ ఏ మాత్రం తగ్గిపోనివ్వక మార్కెట్టు లోకి వచ్చేలా చూడాలి. పి.బి అంటే పాత బంగారం......). -డా. తాతిరాజు వేణుగోపాల్, 17 ఏప్రిల్ 2013
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|