మునుపటి నా మాట
ఎడమ ప్రక్క బొమ్మ ఎవరిదీ? ఎవరదీ? పేరు చెబితే మహాభారతంలో విన్న పేరులా ఉంటుంది. పేరు చెప్పకపోతే మనసు నిండా ఎన్నో పేర్లు పేరుకు పోవచ్చు. అయినా ఇంతటి మండుటెండల్లో ఏదైనా సరే అలా పేరుకు పోవడం అసాధ్యం. ఇంతకీ పేరుకు పోవడానికి అతనేమైనా కొబ్బరి నూనా? కాదే- పోనీ జారు జారుగా జారి పోయే కొబ్బరి నీరా? నిశితంగా పరిశీలిస్తే అతని వర్చస్సులో సరిగమల సరస్సు కానరావడం లేదూ? అయితే కచ్చితంగా అతని స్వర రచన నారీకేళ పాకమేమో? కాకపోతే శృతి లయలకి సరి తూకమేమో? ఆయన ఒక మిలటరీ కమాండర్ గారి అబ్బాయి కనుక 'సరిగమపదని' స్వరాల్ని సరిగ పదమని ఆదేశించే ప్రజ్ఞా 'పాట’వం అతనికుండేది. అటువంటి కన్నతండ్రి సన్యాసుల్లో కలిసిపోతేనేం, అమ్మ, మేనమామ, తాతయ్యల అండతో సంగీతాన్ని సన్యసించక అందులోని విన్యాసాలు ఆకళింపు చేసుకోవాలని పట్టుబట్టిన వాడు ఆయన. అతని పేరు పలకడమెంత కష్టమో వ్రాయడం అంతే కష్టం. చెప్పగా చెప్పగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ తప్పుల్లేకుండా అతని పేరు చూపగలుగుతోంది. ఉన్నట్టుండి ఆయన గురించి ఏమిటీ భోగట్టాలు? ఎందుకంటే 1975 మే 21 నాటి మాట. నాలుగు దక్షిణ భాషల్లో చక్కని పాటల మూటలు మిగిల్చి నలభై ఎనిమిది ఏళ్ళు పూర్తి కాక ముందే నాలుగు ముఖాలాయన పిలుపందుకొని సరస్వతమ్మ కొలువుకి ఆయన తరలి వెళ్లిపోయినది ఆ రోజే కనుక. ఇది మే నెల కనుక, ఆ రోజు సమీపంలో ఉంది కనుక... ఒక్కసారి మననం చేసుకోవాలని.. మనం మనం బరంపురం... అనుకున్నాం కనుక..... అతని పాత వివరాలు –
నరసాపురంలో పుట్టుక (ఆగస్టు 21), చెన్నపురిలో పెరుగుదల.. అతని తండ్రి పేరు వరదాచారి. చిత్రంగా అతని మూడో గురువు పేరు కూడా వరదాచారియే. టైగర్ వరదాచారి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు. తరువాత 1938లో విజయనగరం చేరుకోవడం, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ద్వారం నాయుడు గారు ఆశ్రయం ఇవ్వడం, సీనియర్ బ్యాచ్ విద్యార్ధి ఘంటసాల పరిచయం కావడం బొమ్మలో ఉన్నాయన జీవితంలో మజిలీనే కాదు మలుపును కూడా ప్రసాదించింది. బొమ్మాయన తాతయ్యకి సముద్రాల రాఘవాచార్యులు తెలుసు. బంధుత్వం కూడా ఉంది. అటు ఘంటసాల వారికి, ఇటు బొమ్మాయనకి సముద్రాల వారే మలుపు నుంచి గమ్యం వైపు జీవిత నౌకను నడిపించింది. భారత భూమికి రెండు వైపులా రెండు సముద్రాలా అన్నట్టు ఉభయులకీ సముద్రాల వారు అభయమిచ్చారు. బొమ్మాయనకి సరేసరి ‘వరదా’ చారి వారి శిక్షణ ఉండనే ఉంది. ఇంక అతనిలోని స్వర ప్రవాహానికి కొదవేముంటుంది? సముద్రాల వారు అనగానే ఆయనకున్న ఆత్మీయులు దర్శక నిర్మాతలు బి.ఎన్.రెడ్డి, నట గాయకులు చిత్తూరు నాగయ్య గార్లు గుర్తుకు రావాల్సిందే. అలా వారి త్యాగయ్య చిత్రంలో తొలిసారిగా శ్రీరాముడి వేషం వేశారు అశ్వత్థామ. అవును ప్రక్క బొమ్మలో ఉన్నాయన, అదే ఇప్పుడిప్పుడే అన్న బొమ్మాయన పేరు అశ్వత్థామ! అశ్వత్థామ అంటే ప్రముఖ సంగీత దర్శకుడు, సినీ సంగీతంలో ఐరావతం!!!! అతని పాట వివరాలు – అశ్వత్థామ గారికి సినీ ప్రపంచం ఒక హ్రస్వ ధామమే. ఒక పాతికేళ్ళకు మించి లేదు అందులో ఆయన పాత్ర. ఆయన సినీ ప్రస్థానం మూడు దశలుగా మూడు దశాబ్దాలలో సాగింది. 1950 నుంచి 1959 వరకు తొలిదశ, 1960 నుంచి 1967 వరకు మధ్య దశ, 1970 నుంచి 1973 వరకు తుది దశ! డబ్భయిల నాటి స్కూల్ పిల్లందరికి ఆ నాలుగేళ్ల పాటు అశ్వత్థామ ట్యూన్స్ అన్నీకంఠస్థమే. ముఖ్యంగా అప్పట్లో ఎల్లారీశ్వరి ఎల్లరి ప్రియతమ గాయని కదా. ముక్కు చూడు ముక్కందం చూడు(మానవుడు దానవుడు), కంచెకాడ మంచెకాడ, నీ సన్నిధే నా పెన్నిధి (ప్రేమపక్షులు), అందుకో కలకల కిలకిల జిలిబిలి నగవులు నూరేళ్ళు(బాలుతో-పసిడి మనసులు) – అశ్వత్థామ మలచిన జానపద, పాశ్చాత్య కలగలుపుల్లో ఇవి కొన్ని మాత్రమే. ఏసుదాస్ గొంతు నుంచి ‘తెల్లరేదాక నువ్వు తలుపు మూసి తొంగుంటే తగువెట్టా తీరేదే తలుపు తీయవే భామా(ప్రేమ పక్షులు)’ పాట రావడం, అదీ రేడియో శ్రీలంక నుంచి సాయంత్రం ప్రసారం కావడం అదో అందమైన జ్ఞాపకం ఆ రోజుల్లో. సుశీలమ్మ పాడిన కానడా నడక - శ్రీగౌరి శ్రీగౌరియే శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసినా (విచిత్ర దాంపత్యం)–స్టేజి మీద కదిలితే పాడే అమ్మాయికి, నాట్యమాడే అమ్మాయిలకి ఆ రోజుల్లో మొదటి బహుమతి తప్పని సరిగా వచ్చేసేది. పచ్చని మనకాపురం పాల వెలుగై మణి దీపాల వెలుగై (మానవుడు దానవుడు), కనులు మాటలాడునని మనసు పాట పాడునని కవితలల్లితి ఇన్నాళ్ళు (మాయని మమత), నా మనసే వీణియగా పాడనీ (విచిత్ర దాంపత్యం)....వంటి కళ్యాణ రాగ గీతికలు వినిపించని ఇల్లే ఉండేది కాదు. చిన్నారి నీ చిరునవ్వు విరిసిన మల్లెపువ్వు పొన్నారి నీ అందం పూచిన పూడెందం (పసిడి మనసులు) అని పగలు పాడుకుంటూ మురిసి పోయిన యువకుడు రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం (మాయని మమత) – పాట పాడుతూ కుమిలిపోని రాత్రి ఉండేది కాదు. అమ్మా లాంటి చల్లనిది లోకామొకటి ఉందిలే (మానవుడు దానవుడు) – అని ఏ తల్లి పాడినా పిల్లలు హాయిగా ఆకలి మరచిపోయి నిదరోయేవారు. అణువు అణువునా వెలసిన దేవా కను వెలుగై మము నడిపింప రావా(మానవుడు దానవుడు) – చంద్ర కౌ(జ్ రాగ లాలిత్యం ఎందరో డాక్టర్లని దేశభక్తులుగా మార్చింది. ‘ఎవరికోసం ఎంతకాలం ఈ జాజిపూలు రోజు రోజు పూసి పూలు పూచేది ఎవరికోసం’ (విచిత్ర దాంపత్యం) –శివరంజని రాగంలో ఈ పాట ఆయన స్వర పరచి ఎంత కాలమో కంట తడి పెట్టించారు. ఈయనెవరో బలే ఇస్తున్నాడు పాటలు – అని పొందుతున్న ఆ ఆనందం అట్టే కాలం నిలవ లేదు. 1975 మే నెల రానే వచ్చింది. అశ్వత్థామ శాశ్వతంగా విశ్వ శయ్యపైన మేను వాల్చారు. అశ్వశక్తి ఉన్న అశ్వత్థామ సంగీతం ఒక చరిత్ర అయిపోయింది. మధ్య దశలో ఎన్నెన్ని మాణిక్యాలు మలిచారూ... కవీశ్వరులు మల్లాది రచనలే అసామాన్యం అనుకుంటే వాటికి ఈయన అందించిన స్వర రచన అసాధారణం! ఈ సంగీత సాహిత్య దిగ్గజాల (అందులో ఒకరి పేరే అచ్చంగా అశ్వత్థామ) మధ్య ఏమిటీ ‘అన్యోన్యం?’. ఇప్పటికీ అది ‘unknown’యం! ‘ధర్మమే జయం’ లో కొన్ని పాటలు ఈయనవే. ఆ సినిమానే వెతుక్కోవడం ఇప్పుడు కష్టం. అందులో ఈయన చేసిన మూడు పాటలేవన్నది చెప్పడం మరీ కష్టం. పద్మశ్రీ వారి ‘జగన్నాటకం’ అనే సినిమా ఒకటుందని ఎందరికి తెలుసు? అందులో మల్లాది వారి ఇష్ట పదాలైన మగరాయ, మరుమల్లె మరో దశకంలోనూ వికసించాయి. ‘జగన్నాటకం’ చిత్రం తోనే ఒక మెయిన్ గాయనిగా ఎల్లారీశ్వరి నలుగురికీ తెలిసింది. మంజీరా వారి ‘చివరకు మిగిలేది’ – సినిమా పేరు అదేమీ చిత్రమో కాని (ఆ సినిమాలోని ప్రధాన భూమిక పోషించిన) నటీమణి సావిత్రికి నిజ జీవితంలో చివరకు మిగిలిందేమిటీ అని బాధపడని తెలుగువాడు ఉండడు. ఒక్కటి నిజం – అప్పటికీ ఇప్పటికీ అనే కాదు ఎప్పటికీ ‘చివరకు మిగిలేది’ మల్లాది వారి పద సంపదా, అశ్వత్థామ వారి స్వర సంపద మాత్రమే. ఇందులోనే జమునారాణి ఆలపించిన ‘అందానికి అందం నేనే – జీవన మకరందం నేనే’ అనే పాట ఉంది. ఆ పాటలో స్వాతిశయం ఉంది. అహంకారం కాదు. దాన్ని అంతే అందంగా అంటే ఒక మోహన గీతంగా మలచిన అశ్వత్థామ గారికి జోహారు. అందానికి అందం – అని మల్లాది వారు చల్లిన విత్తనం తరువాతి కాలంలో అందానికి అందానివై (దత్తపుత్రుడు –దాశరథి), అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ (సిరిసిరిమువ్వ – వేటూరి) వంటి మరో రెండు గీతాలకి జన్మ నిచ్చింది. అయితే వీటి స్వర కర్తలు - చలపతి రావు గానీ, మహదేవన్ గానీ అశ్వత్థామ స్వర రచన అనుసరించక పోవడమే విశేషం. ఎందుకంటే అశ్వత్థామ స్వర నడక ‘రూటే’ వేరు! మల్లాది గురువుగారు పాటలకి అచ్చ తెనుగు జిలుగులద్దితే వాటికి తెలుగు జాతీయాల సొగసు చూపించింది శిష్యుడు ఆరుద్ర గారే. ఒక్కసారి పింగళి వారి రుచికర సాహిత్యం (వివాహ భోజనంబు) గుర్తొచ్చి ఆయన రాయకుండా వదిలేసిన గోంగూరను చేరదీశారు ఆరుద్ర. దేవాంతకుడు రాకెన్ రోల్ వరసలో ‘మనసారా’ ‘మనసా రా’ అంటూ పాడిన ‘గో గో గో గోంగూర’ అశ్వత్థామ స్వర వంటకమే. గోగోగో---అంటే క్విట్ ఆంధ్రా అని కాదిక్కడ. అందుకే జై ఆంధ్రా అన్నారు ఆరుద్ర. ఇదిగో ఇదిగో ఇదిగో అనేదానికి సంక్షిప్త రూపం అనుకుందాం. గోంగూర పులుపో కాదో తెలియదు కానీ ఆ పాట మనసారా కోరుకున్నది ఆ చిత్ర దర్శకులు ‘పుల్లయ్య’ గారే. చంద్రికా వారి శ్రీకృష్ణ రాయబారం లో మళ్ళీ కృష్ణుడు ‘దైవరాయ’ అని అనిపించుకున్నాడు మల్లాది వారి దయ వల్ల. అశ్వత్థామ స్వర కర్త. మళ్ళీ – అని అనడం ఎందుకంటే అంతకు ముందు ‘తెల్లవార వచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా ....దైవరాయ నిదుర లేరా’ (చిరంజీవులు) అని అందుబాటులో ఉన్న జానపదానికి తనవైన ‘దైవరాయ’ సొగసులద్ది ఇచ్చినది మల్లాది వారే. ఆ చిరంజీవులు చిత్ర స్వర కర్త ఘంటసాల. మల్లాదివారి దృష్టిలో ఘంటసాల,అశ్వత్థామ ఇద్దరూ చిరంజీవులే. ఆయు:ప్రమాణ దృష్ట్యా చూస్తే అశ్వత్థామ, ఘంటసాల, మల్లాది వారు శ్రీకృష్ణ రాయబారమో ఏమో భగవత్ గీతా లోకానికి తొందరగా తరలిపోయిన ధన్య జీవులు. నిజానికి అశ్వత్థామకి తెలిసిన దైవరాయడు నాగయ్య గారే. తొలినాళ్ళలో ఈ అపర ‘త్యాగయ్య’ కి సహాయకుడిగా ఉండేవారు. అటువంటి నాగయ్య ‘భక్త రామదాసు’ చిత్రం తలపెట్టి, తీసిన సినిమాని ఆర్ధిక వనరులు కుదరక అవతల పెట్ట వలసి వస్తుంటే తలా ముందుకొచ్చి సాయపడ్డారు. అలా ఆ రామభక్త చిత్రానికి సంగీత దర్శకుడైన నాగయ్య గారికి సంగీత సహకార మందించిన వారు - సినీ సంగీతానికి ఆద్యుడైన ప్రభాకరశాస్త్రి, నాలుగవ పేరుగా చెప్పుకునే ఓగిరాల రామచంద్రరావు లైతే ఉడతా భక్తిగా అశ్వత్థామ కూడా నిలబడ్డారు. అందులో మహమ్మద్ రఫీ ఆలపించిన కబీరు తత్వాలు ఈయన స్వర పరచినవే. నవశక్తి వారికి అశ్వత్థామ గారి అశ్వ శక్తి మీద ఎంత నమ్మకమో. తెలుగు సినీ గీతాల సిలబస్ అంటూ ఒకటుంటే తప్పక అందులో మొదటివిగా చెప్పుకోదగ్గ పాటలు వారి ‘కలిమి లేములు’ సినిమా ద్వారా వినిపించారు. అవి మల్లాది వారి రచనలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ‘కొమ్మల మీద కోతికొమ్మచ్చు లాడింది తెల్లా తెల్లని ఓ బుల్లి ఎండ’(పిల్లల భాషలో వచ్చిన ఏకైక పిల్లల పాట), ‘అయ్యారే ..చూడ చక్కని చక్కనయ్య ఓర చూపులే చూశేవు’ (అచ్చమైన కోలాటం పాట), గాలిలో తేలే పూల డోలలో ...చిననాటి ఆనందసీమలో (అమలిన స్నేహ బాంధవ్య గీతం) – మూడు పాటలు చాలు తెలుగు కీర్తి బావుటా ఎగరడానికి. కలిమికీ,లేమికీ తప్పనిసరి అయిన గంగిగోవుపాలు అందించిన కామధేనువు అశ్వత్థామ సంగీతం.. ‘గాలిలో తేలే’ పాట ఒక రకంగా గజల్ లా సాగుతుంది. ఆ సంప్రదాయం అశ్వత్థామ గారికి ఎంత ఇష్టమో చివరకు మిగిలేది లోని కొన్ని పాటల ద్వారా తెలుసుకున్నాం. అని నీవన్నది విన్నానోయి....అటువంటిదే. అంతగా తెలియని ముక్కామల సునంద గారి నోట ఆ పాట రావడం, అందానికి అందం నేనే – పాట జమునారాణి గారు పాడడం, కవి కోకిల – పాటని సుశీలమ్మ చేత పాడించడం, తత్వాన్ని ఎమ్మెస్ రామారావు గారికివ్వడం, సిస్టర్ – అని తాగుబోతు ప్రేలాపన మధ్య ఆవేదన జొప్పించి పాడే చేవ ఉన్న ఘంటసాల వారిని ఎంచుకోవడం – సంగీత దర్శకుడిగా అశ్వత్థామలో అంతర్గతంగా ఉన్న ప్రతిభని చూపిస్తున్నాయి. ఒక్కొక్క భావం ఒక్కొక్క గళంలో అనుకున్న దానికన్నా ఎక్కువగా రాణిస్తుంది. అలా గల నిర్ణయం చెయ్యడంలోనే స్వరకర్త గొప్పతనం తెలిసేది, అంతేకాని నిర్మాత ప్రమేయం ఎంత మాత్రమూ కాదు. స్వేఛ్చ ఉంటే స్వర కర్త హృదయం పెడతాడు – అని నిరూపించిన వారు అశ్వత్థామ! ‘వీలునామా’ సినిమాకి ఈయనే స్వరకర్త. ఒక్క పాటైనా వినే వీలు కలుగుతుందా, ప్రయత్నించాలి. మణులు ఊరికే దొరకవు. వెతుక్కోమంటాయి. అప్పటికే మాస్టర్ వేణు వరవడి గా ప్రవేశపెట్టిన వలజి రాగానికి ముగ్దుడైపోయి అశ్వత్థామ ‘మా ఇలవేలుపు నీవేనయ్యా మము కాపాడే రామయ్యా ...రాం రాం సీతారాం’ పాట చేసి ‘మా వదిన’ కిచ్చారు, కలలు కనే వేళ ఇదే కన్నయ్యా – పహాడీ లో అమ్మ ఆలపిస్తే ఆ అమ్మ ఒడి అనే లోయలో హాయిగా పవళించే భాగ్యం ఆ కాలం చంటి పిల్లలది. ‘సిసలైన చిన్నావాళ్ళం’ – అని ఈ సినిమాలోని పాట పాడుతూ కాస్త పెద్ద పిల్లలు ఇళ్ళలో హడావుడి చేస్తే ‘ఉండండ్రా’ అని అమ్మమ్మలు కేకలు వేసిన కాలమది. అశ్వత్థామ తొలిదశలోకి తొంగి చూస్తే – అల్లుడొచ్చే ‘సంక్రాంతి’ కన్నా’మా ఇంటి మహాలక్ష్మి’ ‘చిన్న కోడలు’ మెరుగేమో అనిపించింది. ‘పక్కింటి అమ్మాయి’ ‘రేచుక్క’ లా మెరిసినా ‘ఉమా సుందరి’ ‘నవ్వితే నవ రత్నాలు’ ‘భలే బావ’కి. ఆమె ‘అన్నాతమ్ముడు’ గమనిస్తుంటే అంతే మరి. అదే ‘దైవ బలం’అంటే! 'చిన్నకోడలు' చిత్రం నేపధ్య కవిగా కాక వెలుగు చూసిన కవిగా మల్లాది వారికి తొలి చిత్రం. భీమవరపు నరసింహారావు వంటి ఉద్దందుడితో పాటు ‘నువ్వూ కట్టవోయ్ వరసలు’ అని పుల్లయ్యగారు ప్రోత్సాహిస్తే ‘అర్ధాంగి’ చిత్రంలో ముత్యం మూడు పాటలు ముత్యాల్లా స్వర పరిచారట అశ్వత్థామ. అందులో ‘వద్దురా కన్నయ్యా ఈ పొద్దు ..’ ఈయన స్వర పరచినదే అట. ఆత్రేయగారి కలాన్ని మల్లాది వారు మెచ్చితే అశ్వత్థామ ‘నేపధ్యం’ అని తెలియక పోయినా జనం ఆ పాటనెంతో మెచ్చారు. కవిగా ఆత్రేయగారికి రెండవ చిత్రం 'ఆదర్శం'. దీనికి అశ్వత్థామ స్వర పోషకులు (కనులు చదివినా పాటే- అశ్వత్థామ స్వర పరిచిన మాల్లది వారి చిన్నకోడలు, ఆత్రేయ గారి ఆదర్శం ..చిత్ర రచనలు). దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ అంతరాళం తరువాత అశ్వత్థామ స్వర పరచిన 'విచిత్ర దాంపత్యం' కోసం ఆత్రేయ ఒక్క పాటే రాశారు. 'కార్తవరాయని కథ' చిత్రంలో లోకము గులాబి తోట ...అని ఒక పాట మధ్యలో ఘంటసాల గొంతు ఖంగు మని వినిపిస్తుంది. అశ్వత్థామ సంగీతంలో దేవులపల్లి వారి తొలి పాట ఇదే. మళ్ళీ పుష్కర కాలం తరువాత ‘మాయని మమత’ చిత్రంలో వీరి కాంబినేషన్ కుదిరింది. ‘ఎవరో వచ్చే వేళాయే’ అంటే ఎవరో కాదు అశ్వత్థామ గారే అని కాబోలు శాస్త్రి గారి ఉవాచ. అశ్వత్థామ స్వాభిమాని. స్వాభిమానికి అవస్థలు తప్పవు. గొప్ప గొప్ప పాటలందిచినా ఎప్పుడూ గొప్పలు పోనీ గొప్ప గుణం ఆయనిది. ‘శ్రీగౌరి శ్రీ గౌరియే’ పాటలో వీణానాదం ఆయన కుమార్తె ‘బేబీ’ గాయత్రి గారిదే. దరిమిలా ఈచంపాటి గాయత్రీ రామకృష్ణ వీణ గాయత్రిగా పేరు పొందారు. ఇంకొక కుమార్తె శ్యామలా కెన్నీ కూడా వీణ విద్వాంసురాలే. వీణ చిట్టిబాబు గారి వాద్యంతో ‘మనసే అందాల బృందావనం’ గా మలిచిన ఎస్పీకోదండ పాణి మనసా వాచా స్మరించే తన నలుగురు దిక్పాలకుల్లో అశ్వత్థామ ఒకరు. అశ్వత్థామ ప్రస్థానంతో ఆగిపోనివ్వొద్దు ఆయన స్వర రచనలు. ఎన్నో వెబ్ లు ఏవేవో పాటలు కుప్పలు కుప్పలుగా ఊరికే పోస్తూ కూర్చున్నాయి. ఈయన పాటలు అతి తక్కువ సంఖ్యలో లభిస్తున్నాయి. పాతబంగారం శ్రమపడి సాధించ గలదు. తలా ఒక విన్నపం చేర్చండి. (ఈ వ్యాసానికి తోడ్పడినది: పులగం చిన్నారాయణ సంపుటిత గ్రంధం: స్వర్ణ యుగ సంగీత దర్శకులు, 2011, courtesy: chimata music.com) (కనులు చూసినా పాటే – మొదటి విడతలో ‘చివరకు మిగిలేది’ అశ్వత్థామ -మల్లాది వారి స్వర రచనలూ, భాస్వర రచనలూనూ. రెండవ విడతలో అతని మాయని మమత, మానవుడు దానవుడు, చివరకు మిగిలేది! కనులు మూసినా పాటే- మనం స్మరించే అశ్వత్థామ స్వరించిన మెలోడీలు – ఈ మే లోనండీ రెండు వారాల పాటు... జూన్ తొలివారంలో కేరళలో తొలివాన కురిసింది అనగానే ఎంత కెవ్వు కేక ..........సెలవందాక! [వర్తమాన వార్తల ఆధారంగా: ఆరోజుల్లో టైగర్ కి అర్ధం వేరు. చ‘క్రికెట్టు’లో పుండరీకాక్షుడు అనే పేరు ఉంది, పులికన్నులు కలవాడు కాబట్టి. ఇప్పుడు బాబోయ్ .. టైగర్ అంటే స్పాట్ ఫిక్సింగూ అదీ అంటూ క్రికెట్టులో చెంప దెబ్బ తిన్నా ఫరవా లేదులే అని ‘పులి’సిన డబ్బు వెదజల్లే ప్రక్రియకు మార్గదర్శి అని అర్ధం. హాయిగా ఆట చూస్తూ కొత్త మాటలా ‘ఏం కెవ్వుకేకరా!’ అని అనుకున్న మనమే ఒక్కసారి ఉలిక్కి పడి పాత మాటలాగే కెవ్వుమని పొలికేక పెట్టాం. ఎంతైనా విధి ‘పులీ’యం! ఒకనాటి కళాదర్శకుడు ‘కళాధర్’ నిన్న (మే 18) చంద్రకళాధరుడిలో ఐక్యమయ్యారు. తొంభై ఆరేళ్ళ ‘బృహత్’ జీవితం గడిపిన ఈయన ‘విజయా’ వారి చిత్రాలకి ఆస్థాన కళా జీవి. ‘తిరుగులేని మాట’ వైపు చూస్తే ఒకనాటి విజయచిత్ర ఆయన గురించి ఏం రాసిందో చూడవచ్చు]. [మేనెల ఎండల్లో మేనెలా వాల్చడమా అనే చింత సుంత పక్కన బెట్టి హాయిగా డాక్టర్ పి.బి.శ్రీనివాస్ గీతా విన్యాసాలు (కనులు చదివినా పాటే), వ్యాసాలూ , పింగళి నాగేంద్రరావు గారి కబుర్లు ,ఆచార్య ఆత్రేయ కలం బూర్ల ( తిరుగులేని మాట) తియ్యదనాలు ఉన్నాయి కదా ...చవి చూడడమే. చివరకు మిగిలేది- ఆల్ బొమ్మలే లో పి బి ఎస్ ఫోటోలు .... అని అనుకోవాలి కూడా. (కృ.ప్రే)] -డా. తాతిరాజు వేణుగోపాల్, 19 మే 2013 (ఆదివారం), 24 మే 2013 (శుక్రవారం)
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|