మునుపటి నా మాట
శ్రీ పంచమి నాటికి స్వీకారం చుట్టి శివ రాత్రి వరకు ఎన్నో ముఖ్యమైన పండుగలు పూర్తి చేసుకుంటుంది మాఘ మాసం. మాఘ స్నానాలు పవిత్రమైనవి- అని చెప్పి పోతుంది, అదీ మన మంచి కోసం. శివుడికీ నీటికీ అనుబంధముంది. ఈశాన్య దిక్కుకి పెద్ద దిక్కు శివుడే. గృహ వాస్తు లో ఈ దిక్కులోనే నీటిని పొందమంటారు. గంగను తల మీద మోయడం తలకు మించిన భారమనుకోక భగీరథ ప్రయత్నానికి సాయపడిన వాడు ఈ సాంబ శివుడు. దేవులపల్లి వారు ఏమన్నారూ?- ‘శ్రీ శైలం మల్లన్న శిరసొంచేనా చేనంతా గంగమ్మ వాన’ అనేగా. వర్షాభావం ఏర్పడినప్పుడు తల్లడిల్లిపోక, డిల్లీకి పోక కర్షక హృదయం శివుడినే నమ్ముకోవాలి. ప్రతి నెలా వచ్చే బహుళ త్రయోదశిని ‘శివ రాత్రి’ అంటారు. మాఘ మాస బహుళ త్రయోదశిని ‘మహా శివరాత్రి’ అనాలి. ఇప్పటి పరిభాషలో ‘grand finale’ అన్నట్టు. ‘శివ రాత్రి’ సరదాలు తీర్చుకునే వేళ కాదు. చిన్నతనంలో జేబునిండా కాసిన్ని డబ్బులు చేరవేసి రాత్రి అస్సలు నిద్రపోకూడదనీ వరస పెట్టి రెండు లేక మూడు సినిమాలు చూసేయడమే పనిగా పెట్టుకోవడమే తప్ప శివాలయంలో భజన చేసి పుణ్యం కట్టుకోలేదు. తీరా తెల తెల వారే వేళలో ఏ ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ సినిమాకో వెళ్లి తెలియకుండానే కునుకు తీసి వ్రత భంగం తెలియకుండా మేల్కున్నట్టు నటించడం, ఎన్ని సార్లు పడుతూ లేస్తున్నా ఎన్టీయార్, అర్జా జనార్దన రావు పద్యాలతో పోట్లాడుకోవడమే కనపడటం, అందరూ లేచి హడావుడి చేస్తుంటే సినిమా అయిపోయిందని , శివరాత్రి ‘శివ శివ’ అంటూ వెళ్ళిపోయిందని తెలియటం తీపి లేక చేదు గ్యా(పకాలై మిగిలాయి.
అమ్మమ్మ చెబితేనే తెలిసేది – శివరాత్రి నాటికి చలి ‘శివ శివ’ అని వెళ్లిపోతుందనీ. కాని తరవాతే తత్త్వం తెలిసింది- శివుడికి చలితోనూ, వేడితోనూ ఒకటే అనుబంధం అని. అటు చల్ల చల్లని కైలాస గిరి పైన ఉండగలడు, ఇటు మరు భూమిలోనూ తిరగ గలడు. అందుకే ‘నమో కైలాస వాసా’ అన్నా, ‘నమో భూత నాధా’ అన్నా ఒకేలా అనుగ్రహిస్తాడు. శివుణ్ని ‘గరళ కంఠా’ అని పిలిస్తే అది హేళన. ‘నీలకంధరా’, ‘నీల కంఠా’ అంటే అందులో జాలి ఉంది. లోక కల్యాణానికి ఈ భోళా శంకరుడు ఎంతైనా త్యాగం చేయగలడు. తెలియక ఈ ‘లయ కారుడు’ నాశానకారి అని భయపడి పోతుంటారు. ఉబ్బు లింగడనీ వరాలిచ్చే వాడనీ అనుకున్నా మంచి చెడుల విచక్షణత తెలిసిన వాడు. మంచి మనసుతో ధ్యానిస్తే మంచి వరమిస్తాడు. చెడిపోతే చెరిపేస్తాడు. కోపం వస్తేనే ‘తాండవ’ మాడేస్తాడని అనుకుంటే అవివేకమే. ‘ఆనంద తాండవం’ ఆయన నట రాజసం. ముక్కంటి వాడె కాని ముక్కోపి కాదు. ముల్లోకాలు అదుపు తప్పితే మూడో కన్ను తెరవ గలడు. మదన గర్వం సర్వం అణగద్రొక్క లేదూ? ఈ శివుడే సమస్త జగతికి తండ్రి. జగన్మాత అన్నపూర్ణ - హిమరాజు పుత్రి కనుక ‘హిమజ’ గానూ, పర్వత (నగ, అద్రి, గిరి) రాజు కుమార్తె కనక ‘పార్వతి’ (నగజ,అద్రిజ, గిరిజ) గానూ పేరు పొందింది. అంబకు సగం దేహమిచ్చి ‘అర్థ నారీశ్వరుడు’ అయ్యాడు సాంబ శివుడు. ఇదే మీ వైవాహిక పరిపూర్ణత అని చెప్పకనే చెప్పాడు. దరిమిలా ‘భార్య’ అంటే ‘అర్థాంగి’ అనే మాట తెలిసింది సామాన్య జనావళికి. అటువంటిది గంగ రాకతో అనవసరపు అవహేళనకి గురి అయ్యాడు. అది కలి యుగంలో కవులకి కాలక్షేపమైంది. రాయల సీమలో నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు కవి సార్వభౌముడు ఇలా చమత్కరించేడు- సిరిగల వానికి జెల్లును దరుణులు బదియారు వేల దగ బెండ్లాడన్ దిరిపమున కిద్ద రాండ్రా ? పరమేశా! గంగ విడువు పార్వతి చాలున్ కృష్ణుడైతే పదహారు వేల భామల్ని పెళ్ళాడవచ్చు, సిరి గల వాడు కనక. తిరిపము( భిక్షము) వాడికి ఇద్దరేల? కాబట్టి ఓ పరమేశ్వరా, నీకు పార్వతి చాలు, గంగని విడిచేయి అనే అర్థం వచ్చేలా చెబుతూనే, అలా గంగ దిగి వస్తే సీమ బాగు పడుతుందని నచ్చ చెపాడు శ్రీనాథుడు. మరో సిని కవి గౌరమ్మ కోపం కొస రాజుకునేలా ‘నెత్తిన ఎవరినో ఎత్తుకొనీ నిత్యం దానినె కొలుచునట’ అని నిప్పంటిస్తే ఆమె ఏ మాత్రం తొణకక ‘సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే , పళ్ళు పదారూ రాలునులే’ అంది. మనిషికి ముప్ఫై రెండు పళ్ళు కాబట్టి ఆ రాలేవి ఆయనవే కాని తనవి భద్రం సుమీ అని ఆమె భావం. ‘శ్రీ గౌరీ శ్రీ గౌరియే శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసినా’ అని ఈ తగవు తీర్చేరు మరొక ఆచార్య కవి. బిచ్చమెత్తుకొనువాడు’ కనక ‘ఆది భిక్షువు వాడి నేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది?’ అని ఎవరైనా నసిగితే ఎలా? ‘మాతా అన్నపూర్ణ భిక్షాందేహి’ అని ఆమెని సదా వేడుకోబట్టే కదా కడుపు చల్లబడుతోంది. తన చల్లని చూపు ఉన్నంత వరకే ఈ దేహం, ఆ తరువాయి అంతా బూడిదే అని శివ సాయుజ్యం విలువ చెప్పబట్టే కదా సదా శివుడి పట్ల అనురాగం వెల్లడౌతోంది. ఆది దంపతుల ఆశీస్సు లేనిదే ఆహారం లేదు, ఆకారం లేదు. ‘పాశుపతం కోరెను పార్థుని మనసు- పరమ శివుని కోసము చేసెను తపసు’ అని బాపు బాలరాజు పాడి వినిపిస్తే అర్జునుడు ఒక్క కోరికే కోరాడేమో అనుకునే వారున్నారు. అర్జునుడి రెండో కోర్కె ‘ జన్మ రాహిత్యం పొందడం’, ‘అది మరో జన్మలోనే సాధ్యం’ అన్నాడు పరమేశుడు. అదిగో అలా జన్మించాడు- కన్నప్ప. బాపు తన మనో దృశ్యాన్ని మరో చిత్రంగా మలిచాడు. ‘మా రేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు’ అనీ పద చిత్రాలు శివ మూర్తికి దక్కాయి. ‘పరమ శివుని మెడలోని పాము అన్నది –‘గరుడా క్షేమమా?’ శివుని మెడలోన ఉన్నత వరకే సుమా- అన్నాడు గరుడుడు నవ్వుకున్నాడు శివుడు. కన్నన్ దాసుడైన తమిళ కవి శివ కేశవ భేదాలెందుకన్నట్టు తరచి మరీ అలా ప్రశ్నించి బదులిచ్చాడు. శ్రీ (సాలె పురుగు), కాళ (పాము), హస్తి ( ఏనుగు)– అనే అతి చిన్న, కాస్త పొడవైన, అతి లావైన మూడు ఆకృతులతో పాటు ఒక మానవాకృతికీ మోక్షమిచ్చి నిజమైన భక్తికి తరతమ తారతమ్యాలు లేవని చూపాడు దేవదేవుడు మహేశ్వరుడు. శ్రీ కాళ హస్తీశ్వర మందిర ఆవరణ, రామప్ప గుడి ఆవల నంది, తంజావూరు బృహదీశ్వర ఆలయం, బెంగళూరు లోని 65 అడుగుల ఎత్తైన శివ మూర్తి, మహారాష్ట్రలోని పుణే –పర్వతి మందిరం -లోని దేవదేవేశ్వర లింగ మూర్తి – ఈ వర్ణ చిత్రాలు ఇక్కడ కను విందు చేస్తే , అక్కడ ‘కనులు తెరచినా పాటే’ లో కన్నడ నట సార్వభౌమ డాక్టర్ రాజ్ కుమార్ నటించిన తెలుగు చిత్రంలోని పాట, తెలుగు నుంచి కన్నడంలోకి మారిన ‘సత్య హరిశ్చంద్ర’ చిత్రంలోని పాట కనువిందు చేయవూ? శివుడు అందరివాడు. అందరికి అందేవాడు. ‘కనులు మూసినా పాటే’ లో ‘భవహరణా, శుభ చరణా’, ‘శివ శివ శంకర’ –ఈ రెండు గీతాలు సామాన్యుల ఆవేదన అర్థం చేసుకునే శివుణ్ణి ముందుంచుతాయి.(play-let in 'achham ave achhulu' ) దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు శ్రవ్య నాటికల్లోనూ దృశ్య భావం కలిగించే నేర్పరి. ఆయన విరచితమైన ‘ శివ క్షేత్ర యాత్ర’ లోపలి పేజీల్లో చదివి ఆ శివుని దర్శించిన అనుభూతి మీరు పొందగలిగితే ధన్యుణ్ణి. ఓం నమశ్శివాయ ! - తాతిరాజు వేణుగోపాల్, మార్చి 02, 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|