మునుపటి నా మాట
ఆషాఢ ఏకాదశి నాడు పాండురంగ సన్నిధి పరమ పుణ్య పెన్నిధి. ఆ తిథికి ఒక రోజు ముందు జగన్నాథుడు పూరీలో తన రథయాత్ర ముగించుకుంటాడు. సరిగ్గా ఇలాగే తమిళనాట చిత్ర లోకం చుట్టిన కవి ‘వాలి’బన్ ఆషాఢ ద్వాదశి నాడు (జూలై 18,2013) తన సుదీర్ఘ రాత యాత్ర ముగించుకున్నాడు. అవును.... ఎనభై రెండేళ్ళ కవి ‘వాలి’ రెప్పలు అలసి సొలసి వాలి అపుడే ఇది మూడవ రోజు అయిపొయింది. వాలి చుట్టూ తిరిగిన చిత్ర లోకం ఇక పైన ఎవరిని పిలవాలి? నాటి మహోన్నతుడు ఎమ్జీ ఆర్ నుంచి నేటి డాషింగ్ ధనుష్ వరకు అందరి పెదవుల మీద కదిలిన పాటల్లో ఎక్కువ వాటా ఉన్నది వాలికే. ‘ఉలగం సుట్రుం వాలిబన్’ (1973) చిత్రంలో పాటలు వ్రాసిన నాటికి ఆయన చిత్రసీమ వయసు రెండు దశాబ్దాలే. మళ్ళీ మకుటం మారి ‘వాలిబన్ సుట్రుం ఉలగం’(2010) కనిపిస్తే అక్కడా వాలి వాక్కు వినిపించింది. నాటి నట భూషణ జెమిని గనేషణ్ మనవడు గణిత మేధావి ‘రామానుజన్’ గా నటిస్తున్న చిత్రమే వాలి చివరి చిత్రం. వాలి అసలు పేరు ‘రంగస్వామి’ అని అంటే ఆశ్చర్యంగా ఉండదూ? వట్టి రంగస్వామియే కాదు- టి.ఎస్. అనే రెండక్షరాలు ముందుంటాయి. టి – అంటే తిరుచ్చి, ఎస్- అంటే శ్రీరంగం కాబోలు. ఎందుకంటే ఆయన జన్మస్థలం- తిరుచిరాపల్లి సమీపంలో ఉన్న శ్రీరంగమే. ఆకాశవాణీ కటాక్షంతో ఈ రంగడు తొలినాళ్ళు ‘బ్రతుకు జీవుడా’ అని అనుకున్నా ఎందుకో చలన చిత్ర రంగమే అప్పటి వయస్కాంతమై అతన్ని ఆకర్షించింది. కలం నాగలిగా పాట సేద్యంగా మారి ఈ కవి కర్షకుడు కొత్త అవతారమెత్తాడు 1950ల్లో. అప్పటికే కవి గురువులు కన్ణదాసన్ పద తరంగాలు ప్రతి ఒక్కరి గుండెలో పొంగి పొర్లుతున్న వేళ ఒక చిన్న అలను వాయువేగంతో విసిరే ప్రయత్నం ఈ ‘వాలి’ చేయడం అప్పట్లో ఒక సాహసమే. అయితే కవి గురువులు చంద్రుడైతే తానొక నూలు పోగు అని వినమ్రంగా ఒదిగారాయన. క్రమంగా మేటి హీరోలు ఎమ్జీ ఆర్, శివాజీలు భుజం తట్టారు. ఇంక వాలి కలం కాయితం మీద వాలిన మరుక్షణం సిరా చుక్కల నుంచి చిందినవి అమృత ధారలే. ఒకానొక సభలో వాలి తన వారసుడని సగర్వంగా చాటారు కన్ణదాసన్.
స్వతహాగా నవలా కారుడు ఆయన. కృష్ణుడు, పాండవులు, కృష్ణ భక్తులు, రామానుజులు – వీరే వారి నవలా నాయకులు. అంతకు మించి చిత్రకారుడు కూడానూ. అందుకేనేమో పదశిల్పాలు చెక్కడంలో ఘనుడు అని అనిపించుకున్నాడు ఆయన. కులం పేరుతో కుళ్ళిపోతున్న సమాజంలో ‘వాలి’ అనే కలం పేరుతోనే నిలబడి పదిహేను వేల గీతాలు వ్రాసిన ఘనత ఆయనది. అందులో అయిదు వేల గీతాలు ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరచడం ఆల్ ఇండియా అదృష్టం. రచయిత వాలి సన్నిహితులు గాయకుడు టి ఎం ఎస్, స్వరకర్త ఎమ్మెస్ విశ్వనాథన్. మాలి అనే చిత్రకారుడికి వీరాభిమాని రంగస్వామి. అందుకే తన పేరును వాలిగా మార్చుకున్నాడు. బహుశా ‘చూడండి నా కలం బలం’ అని చాటేందుకు ఆయన ‘వాలి’ పేరు ఎంచుకొని ఉండాలి. నన్నడిగితే- వాక్కు + లిరిక్కు కలబోతే ‘వాలి’ అని సమర్ధించుకోవడంలోనే ఆనందం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మనసు కవి ఆచార్య ఆత్రేయ, మెలోడీ వాయిస్ పి.బి.శ్రీనివాస్ ‘తలచినదే ..తడవుగా... జరిగినదా’ కన్ణదాసన్ గారి ప్రతిభా పరిచయం తెలుగు వారికి? (శ్రీనివాస్ గారి సంస్మరణ లో కొన్ని క్లిప్పింగులు కనిపిస్తాయి – చూడండి). ఆ తరువాత వాలి గారి ప్రతిభని తెలుగు వారికి పరిచయం చెయ్యడానికి ఎందుకో వేరే ఏ తెలుగు కవీ, గాయకుడూ ముందుకు రాలేదు. ‘వాలి’ పాట వాయు వేగాన్ని వేటూరి ‘సుందర’ రామ మూర్తి పాట వడితో పోల్చవచ్చు. అందుకేనేమో తమిళ కవి వాలికి ఇష్టమైన తెలుగు కవి వేటూరి వారే. అడపా దడపా తెలుగు సినీ కవులు సినిమాల్లో దర్శనమిచ్చేవారు. ఆత్రేయ అనగానే ‘కోడెనాగు’, దాశరథి అనగానే ‘వెలుగునీడలు’, సీతారామశాస్త్రి అనగానే ‘మనసంతా నువ్వే’ ‘గుర్తుకొస్తున్నాయి’ కదూ. అలాగే శ్రీశ్రీ, సినారె, వేటూరి కనిపించారు. మనకి బహుశా గుర్తుకు రానిది తమిళ చిత్రంలో కన్ణదాసన్ గారు కనిపించడం. ‘పరమ శివుడి మెడలోన పాము అన్నది గరుడా క్షేమమా ?’ పాట తమిళం మాతృకకి నటుడు ఆయనే. ఈ మధ్య కాలం నాటివైన ‘హేరామ్’, పాత్తాలే పరవశం లో ‘వాలి’ కదిలే బొమ్మ తెరమీద వాలింది. కొన్ని విషయాల్లో వాలికి సమతుల్యం ఆత్రేయ గారే. ఎందుకంటే ఆత్రేయ గారిలాగా వాలి గారు కూడా నాటక రంగాభిమాని. నాటకాలకి దర్శకులు. అధిక శాతం సినీ గీతాలు వ్రాసిన వారిగా ఇద్దరికీ పేరుంది. ‘వాగ్దానం’ తెలుగు చిత్రం ఆత్రేయ దర్శకత్వంలో వస్తే ‘వడై మాలై’ తమిళ చిత్రానికి వాలి దర్శకులు. ఆత్రేయ ఎన్నో చిత్రాలకి మాటలు రాస్తే వాలి ‘కలియుగ కన్ణన్’ వంటి కొన్ని చిత్రాలకే మాటలు వ్రాశారు. వాలి స్వంతకథ, సంభాషణలు కూర్చిన ‘ఒరే ఒరు గ్రామత్తిలే’ అనే చిత్రం ఇబ్బందులకు గురై నిలదొక్కుకోవడమే కాదు జాతీయ బహుమతి కూడా గెలుచుకుంది. వాలి రచనా చాతుర్యం, సంభాషణా పటిమ ‘కలియుగ కన్ణన్’ నాటకంలో కనిపించింది. ఇదే తెలుగులో ‘దేవుడే దిగి వస్తే’ చిత్రంగా దాసరి చేతుల్లో రూపు దిద్దుకుంది. కృష్ణుడు ప్రత్యక్షమై ఒక నాస్తిక అహంకారి నడుగుతాడు- ‘నువ్వు తింటున్న మందులేమిటీ?’ అని. ‘టెరా మై సిన్, మెటా సిన్, ఎరిత్రో మై సిన్..’ అని అంటాడు అహంకారి. ‘మందుల పేర్ల చివరలో ఏముందీ?’ అని మళ్ళీ అడుగుతాడు కృష్ణుడు. ‘మై సిన్..మై సిన్..మై సిన్’ అని అరుస్తాడు అహంకారి. ‘అంటే చేజేతులా ఇది ‘నా పాపం’ అని ముమ్మాటికి అంగీకరిస్తున్నావు కదా..’ అని చురక వేస్తాడు కృష్ణుడు. వాలి హాస్య, వ్యంగ్య రచనల్లో మేటి. తమిళ చిత్రాల తెలుగు వెర్షన్లలో ఎక్కువగా ఆత్రేయ కలం వినిపించేది. దాదాపు అటువంటి అన్ని పాటల వెనక కన్ణదాసన్ గారి ముద్ర ఉండేది. ‘తోడు నీడ’ చిత్రంలో ‘అత్త ఒడి పువ్వు వలె మెత్తనమ్మా’ పాట విని కన్ణదాసన్ భావాలే అని తీర్మానిస్తాం. కాని నిజానికి ‘కర్పగం’ అనే ఆ తమిళ చిత్రం లో ‘అత్తై మడి ‘ పాట వ్రాసినది వాలియే (చూడండి- కనులు చూసినా పాటే). వాలి కలం పాళీకి ఇరు పార్శ్యాలు ఉన్నాయి- ఇటు వంచితే శాస్త్రీయ జ్ఞాన ధారలు కురుస్తాయి. అటు తిప్పితే చికుబుకు చికుబుకు రేలే, ముక్కాలా ముక్కాబులా ఓ లైలా వంటి నవ్య జనపదాలు మెరుస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి మీద ఆయన రాసిన రెండు గీతాలు ( కర్పనై ఎండ్రాలుం కర్చిలై ఎండ్రాలుం, కూవి అళైతాళ్ కురల్ కొండుప్పాన్) కచేరీలలో ఎప్పటికీ అలరిస్తుంటాయి (వినండి- కనులు మూసినా పాటే) (ఈ రెండు గీతాలు చదువుకొనేందుకు ఇంగ్లీష్లో ఉన్నాయి –కనులు చదివినా పాటే – గనుక), విలక్షణ నటుడు కమల్ హాసన్ ఎపుడూ మొగ్గు చూపింది ‘వాలి’వైపే. అందుకే ‘హేరాం’లో కేవలం వాలి పాటలే వినిపించ లేదు, వాలి నటన సైతం కనిపించింది. దర్శకుడు శంకర్ కూడా కోరేది ‘వాలి’ దర్శనమే! కొద్దిగా ఏమిటీ ఎంతో కృషి చేశారీ రంగస్వామి తన పెన్ను దన్నుతో ఎమ్జీఆర్ రాజకీయ రంగ ప్రవేశ ద్వారాన్ని నిలబెట్టి. కొందరికదంతే – శివుడాజ్ఞ లేనిదే అన్నట్టు ఎన్నో ఏళ్ళకి గాని ఈ కవిశ్రీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ‘పద్మ’మ్ము నడిచి రాలేదు. 2007 లో ‘పద్మశ్రీ’ వరించక ముందే ఈయనికి తమిళ నాట అయిదుసార్లు (1970, 1979, 1989, 1990, 2010) ఉత్తమ గీత రచయితగా అవార్డులు లభించాయి. ‘ఇందియ నాడు ఎన్న్ వీడు’ (భరత విలాస్, 1973) అనే గీతానికి జాతీయ బహుమతి ప్రకటిస్తే వద్దన్నారీయన. ఈ విషయంలో వేటూరి వారు గుర్తుకొస్తారు. ఈయన బుద్ధి పాదరసమా? అయితే మెర్క్యూరీ లాంటి ఈ తమిళకవి రచించిన పదిహేను వేల గీతాలు శోధన చెయ్యాలంటే ఆ బుధ గ్రహం తనలో తాను నెమ్మదిగా తిరిగినట్టే మనం తిరిగితేనే గాని కుదరని పని. అందులో ఎనిమిది వీడియోలూ, ఆరు ఆడియోలు మాత్రమే గుర్తు చేసుకునీ వాలి హృదయంలో వాలిపోదాం. ఈ విషయంలో నాకు దొరికిన సులభ మార్గం- నా గ్రామఫోను రికార్డుల (బురు)జూ తలుపు తెరవడం. లాంగ్ ప్లే రికార్డులు జిరాఫీల్లా పొడవుగా తల బయట పెట్టాయి. సాఫీగా నిమిరితే కోయిల వైపు తలెత్తాయి. అక్కడ చూస్తే ... వేటూరి వారి భాషలో ....వానకారు కోయిలగా తెల్లవారి వెన్నెలగా గీతాల రెమ్మలున్న సినిమా రంగం కొమ్మ మీద ‘వాలి’ మరో లోకంలో కనులు తెరవాలి అన్నట్టు శేషతల్పం మీద రంగస్వామి లాగ కనిపించారు. భారతీయ చలన చిత్ర సీమకిపుడు నూరేళ్ళు. అందులో దక్షిణ రంగం చూసుకున్నవి శత చంద్ర వెన్నెలలు. ‘వాలి’... ఎనభై రెండు... నిండు నూరేళ్ళకు సరిపోయే లెక్క చూసుకున్నారన్న మాట (అయోమయమా? సౌరమానం ప్రకారం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండే కాలం ఒక ఏడాది అయితే అటువంటివి నూరేళ్ళు తీసుకుంటే..చాంద్రమానం ప్రకారం చైత్రం నుంచి ఫాల్గుణం వరకు ఉండే కాలం ఒక ఏడాది, అటువంటి ఎనభై ఒక్క సంవత్సరాలలో ఎనభై ఒక్క పున్నములు + పంతొమ్మిది అధిక మాసాల పున్నములు చేరి శత కౌముదులు అవుతాయి). అయితే- ఎటొచ్చీ ఈ మనీషికి శత జాహ్నవీ వేడుక జరపాల్సిన తరుణంలో వీడుకోలు చెప్పాల్సి వచ్చింది. ఒక్కటే ఊరట- ఆఖరి శ్వాశ తీసుకున్నప్పుడు ఆయన కొన్ని పాశురాలు తన మిత్రుడి ద్వారా విని హాయిగా కన్ను మూయటం. (కనులు చూసినా పాటే- ఎవ్విధంబున అలనాటి హీరోలు, హీరోయిన్లు ‘వాలి’ రచనలను అభినయించిరో చూడుడీ. కనులు మూసినా పాటే- ఎవ్విధంబున ‘వాలి’ రచియించెనో కనులు మూసుకొని వినుడీ. కనులు చదివినా పాటే- ఎవ్విధంబున ‘వాలి’ రచనలు అర్థము చేసుకొనుటయో చదివి తెలుసుకొనుడీ. ) -డా. తాతిరాజు వేణుగోపాల్ , 21 జూలై 2013 (ఆదివారం)
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|