మునుపటి నా మాట
సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించడంలో డిసెంబర్ నెలా, సెప్టెంబర్ నెలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి, ఎలా అంటే .. డిసెంబర్ లో winter solstice, సెప్టెంబర్ లో autumnal equinox వస్తాయి కాబట్టి. ఆ లెక్కన కాలం మారుతుంది. అలాగే ఒక న్యాయమైన తీర్పు చుట్టూ భారతీయుల మనసులు పరిభ్రమించడం గతేడాది డిసెంబర్ నెలలో ప్రారంభమై ఈ ఏడు సెప్టెంబర్ నెలతో ముగిసింది. కాలం మారింది. గాయాన్ని మాన్పింది. అందరి గురి ఒక ఆరుగురి పైన ఇన్నాళ్ళూ ఉండగా నలుగురికి ఉరితీత ఖాయం అన్న విషయం తెలిసి అందరి మనసులూ కుదుట పడ్డాయి. ఆరుగురిలో ఒకడు తనంతట తాను తల తెంచుకున్నాడు. మరొకడు ‘పాపం పసివాడు’ అన్న ధోరణిలో తప్పించుకున్నాడు. మిగతా నలుగురు కోర్టు తీర్పుకి తల దించుకున్నారు. ఒక డిల్లీ యువతి పట్ల జరిపిన పాశవిక చర్యకి వీళ్ళు ఉరికంబం ఎక్కడమే సరియైన న్యాయం అని న్యాయ దేవత గ్రహించింది. ఈ తీర్పు వెనక కోట్లాది గొంతుల ఆక్రోశం, ఆవేశం, సడలని పట్టు, శాంతియుత పోరాటం అన్నవి ప్రముఖ పాత్ర పోషించాయి. వాటికి జయం లభించింది. ఆ అభాగిని దామిని, నిర్భయగా అందరికి చెరొక కంటిలో అశ్రుకణంగా మిగిలినా ఆమె అసలు పేరు జ్యోతి. ఆ జ్యోతి తొమ్మిది నెలల క్రితం దారుణంగా ఆరిపోయింది. అయినా ఇవాళ నవ మాసాలు మోసి భారత మాత మళ్ళీ కన్న ఈ ఆడ శిశువుని న్యాయ దేవత తన తీర్పు పొత్తిళ్ళలో ఉంచి లోకానికి చూపించింది. దుష్టులుంటారు ....కరడు గట్టిన దుష్టుల్ని చూసినప్పుడల్లా,వినినప్పుడల్లా అయ్యో నారాయణా, దుష్ట శిక్షణ కోసం అవతరించు నాయనా అని ఎవరు మాత్రం కోరుకోరు? శ్రీకృష్ణుడు సంభవామి యుగే యుగే అన్నాడు. అంత భరోసా ఇచ్చిన వాడు ఏవో లెక్కలు తేల్చుకుని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూనే ఉన్నాడేమో ! బ్రహ్మ సృష్టించి, శివుడు నడిపిస్తే విష్ణువు ‘స్థితి’ బాధ్యత తీసుకున్నాడు. లోకం అనగానే దుష్టులూ,శిష్టులూ కలిసే ఉంటారు. కేవలం శిష్టులే ఉండరు. అలాగనీ అంతటా దుష్టులే ఉండరు. దుష్టత్వం మితి మీరినట్లయితే ఎప్పుడో ఒక చోట దానికి తెర పడాల్సిందే. శ్రీకృష్ణుడిగా ఒక పరిపూర్ణ అవతారమెత్తిన శ్రీమన్నారాయణుడు కృష్ణుడి ద్వారా తన అవతారాలన్నీ ఎందుకోసమో అన్నది స్పష్టం చేశాడు. తన శ్రీరామావతారంలో రాముడి ద్వారా నారాయణుడు పరశురాముడికి అంతకు ముందు తన అవతార రూపం పరశురాముడే అన్నది గుర్తు చేశాడు. విశ్వమంతా జలమయంగా ఉన్న స్థితిలో సోమకాసురుడు వేదాలు అపహరించి, వాటిని ఎవరికీ అందనట్టు జలసమాధి చేసి దాచేద్దామని దుర్బుద్ధితో జలమార్గంలోనే దాక్కున్నాడు. వేదాలు రక్షింపబడాలి, వాటితో భవిష్యతు నిలబడాలి అనే సంకల్పంతో విష్ణుమూర్తి తెలివిగా చేప రూపం దాల్చి జలమంతా గాలించి ఆ అసురుడి బారి నుంచి వేదాల్ని కాపాడాడు. ‘వేమరు చదివెడి విప్రుల వేదము-సోముక వైరి యశో విభవం –సుధామథనుని సంతత కరుణే’ అని అన్నమాచార్యులు శ్రీహరికి కృతజ్ఞత తెలుపుకున్నాడు.
అమృత మథనం సమయంలో ఆ అమృతం కాస్త నీటిపాలు కాకుండా కూర్మం వచ్చి ఆదుకుంది. ఆ కూర్మావతారుడు నారాయణుడే. బంగారం ఇప్పుడే కాదు సృష్ట్యాది నుంచి ఒక గొప్ప విలువైన లోహం. అటువంటి ఆ ‘హిరణ్య’ రూప అసురుల్లో హిరణ్యాక్షుడు ఒకడు. హిరణ్య గర్భ అయిన భూమిని చాపలా చుట్టేసి సోమకుడి లాగ ఇతగాడు జల మార్గం పట్టి పోతుంటే శ్వేత సూకర (వరాహ) రూపం తో వాడి అయిన కొమ్ములతో వాడిని హతమార్చి భూదేవిని రక్షించినది నారాయణుడే. హిరణ్య సోదరుల్లో హిరణ్య కశిపుడు తెలివైన కోర్కె ప్రకటించి శివుడి నుంచి మృత్యుంజయ వరం పొందాడు. ఆ దర్పంతో శ్రీహరిని తూలనాడాడు. కొడుకు ప్రహ్లాదుడు అందుకు విరుద్ధంగా హరినే నిత్యం స్మరిస్తుంటే ఉపేక్షించ లేక పోయాడు. కొడుకుని చంపుకునేంత వరకు దారి తీశాడు. ఇదిగో ఇప్పుడే శిష్ట రక్షణ దుష్ట రక్షణ జరగాలి. రాక్షస గుణం అంతరించాలి. తామస గుణం హరించాలి. సత్వ గుణం నిలవాలి. నారాయణుడు నరుడు + సింహం అనే ద్వంద్వ రూపంతో స్తంభం నుంచి బయలు దేరాడు. అసుర వంశంలో పుట్టినా ధర్మాన్ని నడిపే విష్ణుభక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుని కోసం నరుడిలా నడిచి వచ్చాడు. హిరణ్య కశిపు కోసం సింహంలా గర్జించాడు. మృత్యువు తన దరికి రాలేని వింత వరాలు పొంది విర్ర వీగి విష్ణువుని ద్వేషించిన హిరణ్య కశిపుని ఆ సింహ రూపంతోనే, కోనగోళ్లతోనే సంహరించాడు. ప్రహ్లాదుడి విష్ణు భక్తి మనవడైన మహాబలికి సైతం ఆమోదమే. అయితే విపరీతమైన దాన గుణం బలి చక్రవర్తిని అహంకారిని చేసింది. దేవతల మీద తన అధిపత్యానికి గర్వపడ్డాడు. శ్రీహరి దేవతల తల్లి గర్భాన జనించి, బలి నిర్వహిస్తున్న నూరవ అశ్వమేధ యాగ సమయంలో అతన్నిమూడడుగుల నేల అడిగితే ‘ఓస్ ఇంతేనా’ అని అనుకున్నాడు బలి. 'అతనెవరో కాదు విష్ణురూపి జాగర్త సుమా' అని శుక్రాచార్యులు అప్పటికే వారిస్తున్నా, ‘అలా అయితే... అదే భాగ్యం, సాక్షాత్తు విష్ణు దర్శనమే సౌభాగ్యం’ అని మూడడుగుల నేల దానమివ్వడానికి సిద్దపడ్డాడు బలి చక్రవర్తి. వటుడింతై, ఇంతింతై ....పెరిగి పెరిగి ఒక అడుగు గగన తలంలో, ఒక అడుగు భూ తలంలో వేసి మూడవది ఎక్కడ వేయనూ అని అడిగితే తన అహంకారానికి సిగ్గుతో తల వంచి తన తల చూపాడు బలి చక్రవర్తి. మూడవ పాదం బలిని పాతాళానికి అణిచింది. ఇక్కడ బలి హతుడు కాలేదు. అహంకారం అణిగింది అంతే. అందుకే ప్రతి ఏడూ వామనుడు అవతరించిన శ్రవణా నక్షత్ర తిథి నాడు తన ప్రజల సుఖ సంతోషాలు గమనించే వరమివ్వమని విష్ణువుని కోరాడు. దేవభూమి అయిన కేరళ లో భాద్రపద మాసంలో శ్రవణా నక్షత్ర సమయాన ‘ఓనం’ పేరిట సంబరం జరుపుకుంటారు. శ్రవణా నక్షత్రానికి శ్రీహరి యే అధిపతి. శ్రవణం నుంచే ఓణం శబ్దం వచ్చింది. ఏ పనినైనా తాత్సారం లేకుండా చెప్పిన తడవునే చేసే పరశురాముడిగా నారాయణుడు గొడ్డలి భుజాన దాల్చి అవతరించాడు. తండ్రి ఆజ్ఞాపిస్తే తల్లిని, అన్నదమ్ములని హతమార్చాడు. అందుకు సంతోషించి వరమడగమని తండ్రి ఆదేశిస్తే తల్లిని, అన్నదమ్ములని తిరిగి బ్రతికించమన్నాడు పరశురాముడు. నారాయణుడు శ్రీరాముడయ్యాడు. ధర్మం నేర్పాడు. నారాయణుడు బలరాముడయ్యాడు. శ్రమ విలువ, పనితనం నేర్పాడు. నారాయణుడు శ్రీకృష్ణుడయ్యాడు. పరిపూర్ణ అవతారమది. బుద్ధి వికాసం నేర్పాడు. తర్కం నేర్పాడు. అనేక విధాల ఒడిదుడుకుల జీవితం నుంచి బయటపడే మార్గాలు సూచించాడు. నారాయణుడు గౌతమ బుద్ధుడయ్యాడు. కరుణ,ప్రేమ అనే అస్త్రాలతో శాంతి మార్గం వెదకమని సూచించాడు. ఇక కల్కి అవతారం అనేది ఒక ప్రశ్నార్ధకం చేసేసి మానవ జాతిని ఇంకా పరికిస్తూనే ఉన్నాడు. ఇవే ‘దశావతారములు’ అని మనం చెప్పుకుంటాం. బహుశా నారాయణుడు ఒక అశ్వం సాయంతో తాను కల్కిలా అవతరించడం అన్నది అశ్వ గతితో పరుగులెత్తాల్సిన చట్టంగా రూపొందించడమే అని తీర్మానించుకున్నాడో ఏమో. ప్రజకి సరిగా న్యాయం అందడం అంటే అక్కడ నారాయణుడి చైతన్య రూపం సాక్షాత్కరించినట్టే, హయగ్రీవుడిగా, పాండు రంగడుగా ఒక చోట, జగన్నాధుడిగా ఒక చోట, వెంకటేశ్వరుడిగా ఒక చోట నారాయణుడు రూపులు దాల్చినా అది వసుధైక కుటుంబ రక్షణ కోసమే అని గ్రహించాలి. దశావతార తొలి వర్ణన దేవభాషలో మనకి జయదేవ గీత గోవిందంలోని ప్రథమ అష్టపదిలో కనిపిస్తుంది. అందులో శ్రీకృష్ణ అంశమైన జగన్నాధుడికే తన కృతిని నివేదించుకుంటున్నాడు కనుక ప్రత్యేకంగా శ్రీకృష్ణావతార ప్రసక్తి చేయలేదు కవి. ఈ సందర్భంగా ఒడిశాలో జన్మించిన ఈ కవిది పదకొండవ శతాబ్దం అని గ్రహించాలి. గీత గోవిందం లో ఇరవై నాలుగు అష్ట పదులే ఉంటాయి. ఒడిశాకి గుర్తింపు తెచ్చి పెట్టిన నాట్య రూపం ఒడిశీ. కేలూ చరణ్ మహాపాత్ర అనే నాట్యాచార్యుడు ఒడిశీ నృత్యాన్ని ప్రపంచ వ్యాప్తం చేశాడు. ఆయన శిష్యురాలు సంయుక్తా పాణిగ్రాహి. జయదేవ అష్టపదికి నడకలు కూర్చడంలో తన హస్తవాసి ఎటువంటిదో చూడండి అని సంయుక్త చూపించిన ఒడిస్సీ నాట్య విలాసం న భూతో న భవిష్యతి ( అప్పటి జయదేవుని కాలంలో ఆమె లేదు. మనమున్నఇప్పటి కాలంలోనూ ఆమె లేదు). (కనులు చూసినా పాటే) ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు రఘునాథ్ పాణిగ్రాహి ఈమె భర్త. సంయుక్తా పాణిగ్రాహి మానస సరోవర యాత్ర చేస్తూ విధి విలాసం వల్ల కొన్నేళ్ళ క్రితం జగన్నాథ సన్నిధి చేరిపోయింది. ఈ ఏడాది ఆగస్టు ఇరవై అయిదున ఎనభై పై చిలుకు ఒడియా గాన గంధర్వుడు పద్మశ్రీ రఘునాథ పాణిగ్రాహి ఆమె సన్నిధి చేరుకున్నారు. [పాణిగ్రాహి చేయి పట్టుకుని తెలుగు వారి వాకిళ్ళ లోకి సుసర్ల దక్షిణా మూర్తి వారు రాక పొతే అక్కడ తొంగి చూస్తున్న 'చల్లని రాజు చందమామ' మనకి కొత్తగా కనిపించేవాడే కాదు. ఘంటసాల గళమే తప్ప అన్య గాత్రంబెరుగని అక్కినేని వారికి రఘునాథ పాణిగ్రాహి గళం అప్పటికి కొత్తగా కనిపించిన వింత. త్యాగయ్య, శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు- వీరినే మ్యూజిక్ ట్రినిటీ అంటారు. అటువంటిది ‘కుదురైన నీమముల కొలిచే వారి మది శారదా దేవి మందిరమే’ అయినప్పుడు మరో కొత్త ట్రినిటీ ఎందుకు సాధ్యం కాదూ? అని పెండ్యాల నాగే’స్వర’ బ్రహ్మ సృష్టించిన త్రిమూర్తులు- ఘంటసాల, పి.బి. శ్రీనివాస్, రఘునాథ పాణిగ్రాహి. ‘జయభేరి’ మ్రోగించిన ఆ త్రిమూర్త్య గానంలో ఘంటసాల వారి ‘తరళ తానములు’ తనవిగా చేసుకుని అక్కినేని వారు తనివి తీరా నటనా జల క్రీడలాడారు. అసలు ఒక్కొక్క కళాకారుడు అవతరించడం, వారిని మన ‘హయాంలో’ చూసో, వింటూనో మనం తరించడం – ఎంత అదృష్టం! గొప్ప కళాకారుడొకడు అవతరించాడంటే కళ కళ తప్పి పోక కళకళలాడుతుందని చెప్పడమే. అలాంటి అవతార మూర్తులు వాగ్గేయకారులు కూడానూ]. రాజేశ్వర గీత గోవింద స్వర కల్పనకి ఘంటసాల మాస్టారు గళం తోడై పదికాలాలు తెలుగు వారి ఇంట దశావతారాలు వినబడుతున్నాయి. చాలామంది ఇళ్ళలో దశావతార బొమ్మలు కనబడుతున్నాయి. కృష్ణప్రేమలో కనులు చూసినా పాటే (గళం ఘంటసాల వారిది, బొమ్మలు సినిమా లోనివి కావు). స్వర విదుషీమణి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గాత్రాన్ని ఏ గంధర్వ లోకానికో అర్పించేయక తన తొమ్మిది అవతారాల కాలంలో కాపాడుతూ వచ్చి కలి యుగంలో శ్రీహరి మన మధ్య చరించే కోకిల గానంగా ప్రతిష్టించాడు. ఆమె దశావతార పఠనం (కనులు చూసినా పాటే) మన పూర్వ జన్మ సుకృతం. ఇవాళ తిరుపతిలో చిరు నవ్వులతో పలకరించే ఆ తల్లి విగ్రహం అంతా శ్రీనివాసుని అనుగ్రహం (ఈ తల్లి మన మధ్య గనుక ఉండి ఉంటే ఈ రోజు ఆమెకి నూటికి మూడేళ్ళు తక్కువ అని సంబర పడే వాళ్ళం). పదునాలుగవ శతాబ్దం వాడు శ్రీ అన్నమాచార్యులు. తెలుగు పద సంకీర్తనాచార్యుడు. పదివేల పై చిలుకు పదసంకీర్తనలు శ్రీ వెంకటేశ్వర పద సన్నిధికి సమర్పించుకున్న పుణ్యాత్ముడు. వీలైనప్పుడల్లా ఆయన దశావతార వర్ణనతో పద సంకీర్తన చేస్తూ వచ్చి సంకీర్తనకీ సంకీర్తనకీ మధ్య ‘వైవిధ్యం’ చూపించిన నవీనుడు. ఇవాళ తాళ్ళపాక ప్రాంతంలో అంతెత్తు అన్నమయ్య విగ్రహం నీడలో కాసేపు నిలుచున్నా చాలు శ్రీహరి దర్శనం తనంతట తానే జరుగుతుంది. అన్నమయ్య కీర్తనా గానానికే తన జన్మనంతా ధారపోసిన బాలకృష్ణ ప్రసాద్ అన్నమయ్య దశావతార సంకీర్తనలు ఎన్నో పాడిన ధన్యుడు (కనులు మూసినా పాటే). అలాగే శ్రీమతి శోభారాజ్ ధన్యురాలు (కనులు మూసినా పాటే). జీవితకాలమంతా చలన చిత్ర నేపథ్య గానానికే అంకితమైన బాలసుబ్రహ్మణ్యం గళంలో సినిమా ఛాయ పడనీయక ఎవరు పాడించారో గాని ‘తెప్పగా మఱ్ఱాకు మీద తేలాడు వాడు’ అనే అన్నమయ్య దశావతార సంకీర్తన చక్కగా కుదిరింది (కనులు మూసినా పాటే). [జయదేవ అష్టపదులు ఘంటసాల, బాలమురళీకృష్ణ వంటి సుమేరు గళ నగాధిపతుల గొంతుల నుంచి గలగలమని జారుతూ వుంటే నయాగరాకి సైతం నయగారం అలవడి పోతుంది. అయితే బాలమురళి వారి గళం నుంచి దశావతార అష్టపది ఎందుకు రాలేదో? వచ్చిందేమో... నేనెరుగనైతినేమో!] ఇక ఆ తరువాతి శతాబ్దాల భక్త కవి, శ్రీరాముడే సర్వం అని నమ్మి కొలిచిన కంచెర్ల గోపన్న రామదాసుగా అవతరించాడు. దాశరథీ శతకం పేరిట ఆయన పద్యాలు వ్రాశాడు. అందులో ఒక్క పద్యంలోనే దశావతారాల్లోని కొన్నిటిని వ్యక్తం చేసిన ఆయన ప్రతిభకి జోహార్లు. వినిపించిన బాల సుబ్రహ్మణ్యం వారలు ధన్యులు. నెట్ ప్రపంచంలో ఈయన పాడిన తొలి విడత అరవై పద్యాల్లో ఇది ఒకటి. (కనులు మూసినా పాటే). తతిమ్మావి ఎప్పుడు పాడతారో? అందులో ఎన్నో శతక పద్యాలు దశావతార పరంగా ఉన్నవే. బాలు గారి చెవిని వేయండి, పాడమని తొందరించండి. ఒక వెబ్ సైట్ లో రామదాస తెలుగు దాశరథీ శతకం బెంగాలీ భాషలో లభ్యం కావడం ఆనందకరమైన విషయం. ‘భక్త జయదేవ’ చిత్రం నుంచి స్పూర్తిని పొంది దర్శక నిర్మాత బి.ఎన్.రెడ్డి గారు తొలిసారిగా ఒక సాంఘిక చిత్రం –రంగుల రాట్నం- లో దశావతార తెలుగు తనం చూపించారు. ‘చేప రూపున’ అంటూ దాశరథి కవి చిన్న చిన్న మాటలతో క్లుప్తంగా పది అవతారాల గురించి చెప్పడం సామాన్య విషయం కాదు (కనులు చూసినా పాటే). 'కథానాయిక మొల్ల' చిత్రంలో శ్రీహరితో తన పరిణయం అయ్యిందని మొల్ల సభా సమక్షంలో వెల్లడి చేసే సందర్భంలో దశావతార రూపుడైన శ్రీహరిని తానెలా చూసిందో చెబుతుంది. రామలింగ కవి ఆట పట్టిస్తాడు. గీతం డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారిది. మామూలు కంటికి, భక్తిలో తాదాత్మ్యం పొంది దర్శించే కంటికి ఉండే తేడా ఏమిటో స్పష్టం చేశారు కవి (కనులు చూసినా పాటే). ‘పండంటి సంసారం’ అనే ఓ చిత్రం వచ్చింది అనే కన్నా అందులో మధుర గాయని భానుమతి పాడిన పాటలు ఉన్నాయంటే సంతోషం కలుగుతుంది. అయితే ‘కోతి నుంచి పుట్టాడు మానవుడు’ అనే డార్విన్ సిద్ధాంతం ఆలంబనగా ఒక కవి మనిషి ‘కోతి చేష్టలు’ చూసి విసిగి పోయి దశావతారాల ప్రసక్తి తీసుకొచ్చాడు ఒక పాటలో (కనులు మూసినా పాటే). 'దేవాలయం' అనే సినిమాలో మాత్రం వేటూరి సుందరరామ మూర్తి కవి దశావతారాలకి కొత్త భాష్యం చెబుతూ సుదీర్ఘమైన గీతమొకటి రాశారు (కనులు మూసినా పాటే). ఎందరికో ఆయన ఆధునిక జయదేవుడు అయితే మరెందరికో ఆధునిక శ్రీనాథుడు. అందరూ మెచ్చుకొనేలా అన్నమయ్య జననం మీద పాట రాసిన ‘అన్న’ వారు అని అంటారు ఆ పాట విన్నవారు.. 'దశావతారాలు' అనే సినిమా పేరు కొత్త కాదు. లోగడ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ (ఆయన తొలిసారిగా గాయక అవతారమెత్తినది ఈ చిత్రంలోనే) నటించిన ‘దశావతార’ తెలుగులోకి రా నోచుకున్నదే. వైవిధ్య నటుడు కమల్ హాసన్ లక్ష్యాలు వేరుగా ఉంటాయి కనుక ఈయన తీసిన ‘దశావతారాలు’ వేరు. అయితే అందులోని ‘ముకుందా ముకుందా’ పాట అటు గాయనీ మణులకి, ఇటు నాట్య రమణులకి బహు ప్రీతికరమై పోయింది. అందులో కాస్తో కూస్తో దశావతార ప్రస్తావన ఉంది (కనులు చూసినా పాటే). చాంద్రమాన మాసాలుగా చైత్రం నుంచి ఫాల్గుణం వరకు పన్నెండు నెలలు మనకి తెలిసినవే. విశేషం ఏమిటంటే చైత్రశుక్ల పాడ్యమి నాడు సృష్టి ప్రారంభం జరిగిందట. ‘యుగాది’ కి బదులు ‘ఉగాది’ అని మనం అంటున్నది ఆ రోజు గురించే. చైత్ర శుక్ల తృతీయ (తదియ) తిథి నాడు శ్రీమన్నారాయణుడు ‘మత్స్యావతారం’ దాల్చాడు. చైత్ర శుక్ల నవమి అనగానే తెల్లబోతామేమో కాని ‘శ్రీరామ నవమి’ అనగానే ‘ఓ అదా?’ అని తలూపుతాం. ఆ నవమి నాడు శ్రీరామావతార ఆవిర్భావమనే కదా అర్థం! చిత్రం ఏమిటంటే సూర్యుడు మీన రాశిలో ఉండగా మనకి ‘ఉగాది’ వస్తుంది. రాశి మీనం, అవతారమేమో మత్స్యం – ఎంత సారూప్యం! వైశాఖ శుక్ల తృతీయ(తదియ) నాడు ‘పరశురాముడు’ ఆవిర్భవించాడు. వైశాఖ శుక్ల చతుర్దశి నాడు నరసింహావతారం ‘కంభమున వెడలె’. శ్రావణ శుక్ల చతుర్దశి నాడు నారాయణుడు శ్వేత వరాహ రూపంతో మరో అవతారమెత్తాడు. శ్రావణ బహుళాష్టమి నాడు శ్రీకృష్ణుడై పరిపూర్ణ అవతారం దాల్చాడు. భాద్రపద శుక్ల ద్వాదశి నాడు శ్రవణా నక్షత్రంలో నారాయణుడి వామనావతారం ఉద్భవించింది. బంతిపూలతో బలి చక్రవర్తికి స్వాగతం చెబుతుంది భాద్రపద మాసం. వామనావతారాన్ని ఉద్దేశిస్తూ 'నీకు గానే చెయి చాచి నాంచారమ్మా ' అని అన్న అన్నమయ్య పలుకులతో శీర్షిక తలపెట్టి శ్రీహరి పది అవతారాలు కాంచానమ్మా అని తృప్తి పడుతున్నా. పనిలో పనిగా డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జున గారి విరచితం -దశావతార విశేషాలు (ఈనాడు - మహారాష్ట్ర సౌజన్యంతో) 'తీరైన మాట' లో పొందు పరిచాను. విందు మీదే. కనులు చదివినా పాటే - లో అన్ని రకాల దశావతార గీతాలు (అంటే జానపదాలు, సంకీర్తనలు,అష్టపది త్వరలో లభ్యమౌతాయి. -డా. తాతిరాజు వేణుగోపాల్ , 16 సెప్టెంబర్ 2013
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|