మునుపటి నా మాట
‘ఇవాళ ఏ తారీఖర్రా పిల్లలూ?’ ‘సెప్టెంబర్ ఇరవై అండీ మాస్టారూ ..’ ‘ఈ రోజు ప్రత్యేకత ఏమిటర్రా?’ ‘నే చెప్తా సార్’ ‘సార్ ..నే చెప్తా’ ‘నన్ను చెప్పనీండి సార్’ ‘నాకు తెల్సు సార్..నేనే చెప్తా’ ‘వదిలితే...మొత్తం అందరూ..ఏకకంఠంతో చెప్పేట్టున్నారే...ఉండండి..నువ్వు చెప్పరా నీలకంఠం..’ ‘నాగీస్సర్రావు పుట్టిన్రోజండీ’ ‘ఒరే ఒరే...ఆయనా నువ్వూ ఏదో కలిసి పుట్టినట్టు...ఏమిట్రా అదీ...సరిగా చెప్పు..’ ‘నేన్ సరిగా చెప్తా మాస్టారూ.....మహా నటుడు నటసామ్రాట్ నాగేశ్వరరావు గారి జన్మదినం’ ‘అదిరా..అలా ఉండాలి ....అక్కినేని నాగార్జున వాళ్ళ నాన్నగారనో, సుమంత్ వాళ్ళ తాత అనో అంటారనుకుని భయపడ్డాను. ఫరవాలేదే.....సరే....అ ఆ లు,గుణింతాలు గుర్తున్నాయి కదా ..ఇవాళ మీకు వైవిధ్యంగా ఉండేలా నేర్పుతా...వింటారా?’ ‘ఓ....వింటాం మాస్టారూ... చెప్పండి...’ ‘అ అంటే అక్కినేని, ఆ అంటే ఆదుర్తి’ ‘అవి ఇంటిపేర్లు కదండీ’ ‘అవునర్రా...అక్కినేని నటన, ఆదుర్తి దర్శకత్వం వెరసి తెలుగు సినీ కళామతల్లి జన్మ ధన్యమైంది. కాబట్టి ఈ అఆల గురించి అనుకోవడంలో తప్పేమీ లేదు’ ‘ఆదుర్తి వారి పేరేమిటండీ మాస్టారూ?’
‘సుబ్బారావు గారు. తెలుగు కుటుంబాల్లో పదిమందిలో ఒకడికి సుబ్బారావనే పేరు ఇదివరలో ఉండేది. ఫారినర్లు సుబ్రేవ్ అనేవారు, బాగా త్రేంచమన్నట్టు... సుబ్బారావులంతా మంచి వాళ్ళే. ప్రతి సుబ్బారావులోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఉదాహరణకి యల్లాప్రగడ సుబ్బారావు గారు....’ ‘యాంటీ బయోటిక్ సృష్టించింది వీరే కదండీ...’ ‘అవును. ఒక పట్టాన లొంగని రోగాల నివారణ కోసం ఈ సుబ్బారావు గారు మాత్రలు సృష్టించినట్టు ఆదుర్తి సుబ్బారావు గారు మానవతా విలువల ప్రోత్సాహం కోసం సినిమా పాత్రలు సృష్టించారు.’ ‘ఆదుర్తి వారు అన్ని సినిమాల్లో అక్కినేని వారినే హీరో చేశారా?’ ‘అక్కినేని వారు, దుక్కిపాటి మధుసూదన రావు గారు కలిసి అన్నపూర్ణా పిక్చర్స్ బ్యానర్ పెట్టి చాలా మాంచి సినిమాలు తీశారు. వాటిలో తొంభై శాతం ఆదుర్తి వారి దర్శకత్వం లోనివే.’ ‘దొంగరాముడు ..అని విన్నాం సినిమా పేరు. అది అన్నపూర్ణా వారిదే అని కంప్యూటర్ చెబుతోందండీ’ ‘కంప్యూటర్ ఎవడ్రా చూడమన్నది? నేనున్నాగా ...నాకు ఊ కొడుతూ వినండి చాలు. దొంగరాముడు ఆదుర్తి వారి దర్శకత్వం లో కాదు..కెవి రెడ్డి గారి డైరెక్షన్ లో వచ్చింది. ఏం?’ ‘ఊ(..’ ‘ఆదుర్తి వారు ముంబై వెళ్లిపోయి ఎడిటింగ్ శాఖలోనూ, ఫోటోగ్రఫీ లోనూ తర్ఫీదు పొంది చెన్నై వచ్చి తన ప్రతిభని చూపించారు..’ ‘ప్రతిభ అనే అమ్మాయా అండీ?’ ‘ఇంతలేసి లేరు...మీకు అమ్మాయిల గోల ఎందుకర్రా ఇప్పటినుంచే’ ‘సార్ ...వీడు మూడు సార్లు ఫెయిలై ఇంకా ఈ క్లాసులోనే ఉన్నాడు. వీడే అమ్మాయల గురించి వాకబు చేస్తుంటాడు’ ‘నోరు ముయ్యండర్రా....చదువుకున్న అమ్మాయిలు సినిమాకి ఆదుర్తి వారే దర్శకులు. తెలిసిందా? మాట్లాడరేం?’ ‘మీరే కదండీ మాస్టారూ నోరు ముయ్యమన్నది!’ ‘మీరే నయంరా. ఇంతకు ముందు బ్యాచు వాళ్ళు నోరు ముయ్యండి అంటే తిన్నగా నా మీదికొచ్చి నా నోరు మూసేసే వారు. ‘ ‘హి హి హి’ ‘సైలెన్స్ ... మూగ మనసులు సినిమా ఆయనే డైరెక్ట్ చేశారు’ ‘అందులో గోదారి గట్టుంది కదండీ..’ ‘గోదారి గట్టు రాజమండ్రిలో ఉంది. పాట మూగ మనసులు సినిమాలో ఉంది.’ ‘అయితే సార్ ..అక్కినేని, ఆదుర్తి ఇద్దరు మిత్రులు అన్నమాట’ ‘కాబట్టే ఇద్దరు మిత్రులు సినిమా అంత బాగా వచ్చింది. అందులో ఫారిన్ ట్యూన్ కి తెలుగు కోటింగ్ ఇచ్చి సంగీత దర్శకులు రాజేశ్వర రావు గారు భలే పాట చేశారు..హలో హలో ఓ అమ్మాయీ’ ‘పిలిచారా సార్...’ ‘నిన్నా తల్లీ? లేదులే ..పాట గొణిగా...అంతేలే ..’ ‘సార్ సార్ ....వీడు చూడండి... నా వీపు అడ్డం పెట్టుకుని చిన్న కునుకు తీస్తున్నాడూ..’ ‘ఎవడ్రా... కామరాజా?...కల కంటున్నాడేమో..కననీండి...మీకో సందేశం పాట చెబుతా ..స్కూలూ , సెలవలు అనేవి..’ ‘వెలుగు నీడలు’ ‘ఎవడ్రా అదీ..’ ‘అబ్బే నేను కాదు సార్ ..సీనియర్..’ ‘ఎవడైతేనేం ...మా బాగా సెలవిచ్చాడు’ ‘సార్ ..స్కూల్ లేదా? ఈ రోజు సెలవా?’ ‘కామరాజూ...నిద్రా భంగామైందా నాయ్ నా..సెలవు అనే మాట చెవిని పడగానే చూశారా ఎలా ఠక్కున లేచాడో?..సరే వీడి మాటలో పడి మరచిపోతాం ...వెలుగు నీడలు సినిమాకి ఆదుర్తి వారే దర్శకులు. అందులో కల కానిది విలువైనది బ్రతుకు అనే సందేశం ఉన్న పాట ఉంది. నేర్చుకోండి.’ ‘సార్...కలలు వెండివి, కంచువి ఉండవా? మా అమ్మ బంగారు కలలు అంటుంది’ ‘సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా...ప్రతి తల్లి తన కూతురు సుమంగళి గా, ఆమె అత్తింటి వారివి మంచి మనసులు కావాలని బంగారు కలలే కంటుంది. అవునర్రా..గుర్తుంచుకోండి ..సుమంగళి,మంచి మనసులు, బంగారు కలలు సినిమాలకి దర్శకులు ఆదుర్తి వారే’ ‘వీటన్నిట్లోనూ నాయిసర్రావ్ హీరో కదండీ’ ‘నాగేశ్వరరావు అనరా బాబూ... ‘వాడంతే నండీ...కామరాజుని కాంరాజు అంటాడు, రాంబాబుని రామబాబు అంటాడు. వీడి మాటల విచిత్ర బంధం భలే అండీ’ ‘విచిత్ర బంధం సినిమా ఆదుర్తి వారి దర్శకత్వం లోనిదే. విజేత అనే యద్దనపూడి సులోచనా రాణి వారి నవలని సినిమాగా తీశారు’ ‘అంటే..దేవదాస్ లాగా అండీ..’ ‘కనీసం ..దేవదాస్ అనేది నవల అన్న విషయం మీకు తెల్సినందుకు సంతోషం.’ ‘సార్....వీడు పలక మీద అక్షారాలు దిద్దలేదు. పుట్టగానే కంప్యూటర్ కీ బోర్డ్ నొక్కాడు.’ ‘ఎవడూ...రంగా గురించేనా?’ ‘వాడికేం సార్ ..పూల రంగడు’ ‘ఎప్పుడూ పువ్వుల చొక్కాలే వేస్తాడు..’ ‘ఆగండర్రా ...ఉన్నది ఉన్నట్టు నిజాయితీ గా చెప్పేస్తున్నారు. పూల రంగడు సినిమాకి ..’ ‘ఆదుర్తి వారే దర్శకులు’ ‘ఎవడ్రా అదీ.. ఇమిటేషనూ? ఒక్కటిచ్చానంటే....ఆ(...పూల రంగడు లో కొసరాజు కవిగారు నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా...అని మంచి సందేశం ఉన్న పాట రాశారు’ ‘టకు టకు టకు టకు...’ ‘ఎవడ్రా అదీ.. గుర్రపు చప్పుడూ ..’ ‘పాత సినిమా పాటల్లో అలాగే ఉండేది కదండీ’ ‘సరే కానివ్వండి... ఇప్పుడు నేను అక్కినేని-ఆదుర్తి కాంబినేషన్ లో కొన్ని సినిమా పేర్లు చెప్పాను. కొన్ని పాటలూ చెప్పాను.’ ‘సార్ సార్ ..వీడు మళ్ళీ కునుకుతున్నాడు’ ‘లేద్సార్... కనులు మూసినా పాటే అని ఎనిమిది పాటలు గుర్తు చేసుకుంటున్నాను’ ‘సరే...ఇంటర్ వెల్ అవుతోంది...మీ డబ్బాలు తెచ్చుకున్నారు కదా... తిండి అయ్యాక రండి’ ‘అలాగే సార్ ..అట్లాగే సార్..గట్లనే సారూ ..’ ************************************** ‘ఏమిట్రా డబ్బాలు ఖాళీ చేశారా లేదా?’ ‘కామరాజే అండీ....ఖాళీ చేస్తాడు కాని కడుపులోకి పోనీడు తిండిని.’ ‘పోనీక.. ఏవి(రా కామరాజూ....ఖాళీ డబ్బా ఇంట్లో అమ్మకి చూపించి బురిడీ కొడతావన్న మాట...అయితే ఆ తిండి నేం చేస్తున్నావ్?’ ‘వాడు చెప్పడండీ....ప్రపంచంలో ధనిక,పేద అనే తారతమ్యాలు ఉన్నంత కాలం మనుషులు బాగు పడరట. వాడి మాటలు మాకేం అర్థం కావు. మాలో మరీ బీద వాళ్లకి తన తిండిని పంచేస్తాడు. గురజాడ కవి అన్నారట – స్వంత లాభం కొంత మానుకుని పొరుగు వాడికి తోడ్పడవోయ్..అని’ ‘భేష్ రా కామరాజూ... గురజాడ వారు ‘కొంత’ అన్నారు కాని నువ్వేమిటీ అంతా మానుకునీ అందరికీ పంచేస్తున్నావ్. ఇలా అయితే ముందు ముందు నీకేరా ఇబ్బంది.’ ‘అయితే అలా ఊరికే పంచకూడదా మాస్టారూ’ ‘అందరూ శ్రమ పడాలి. శ్రమకి తగ్గ డబ్బు సంపాయించాలి. ఎంత వరకు వస్తువులు అవసరమో అంత మటుకే కొనుక్కోవాలి. ఊరికే వాళ్ళనీ వీళ్ళని చూసి కుమిలిపోవడం, పోటీ పడి కొనేయడం వంటివి చెయ్యకూడదు.ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఉండాలి’ ‘మాస్టారూ...కామరాజు తను చిన్నపుడు ఆడుకున్న ఆట బొమ్మలు అనాథాశ్రమాలకి పంచాడు. నాకూ ఇవ్వాలనే ఉంటుంది. కానీ మా నాన్న దాచి ఉంచరు. ఎందుకీ చెత్త అని పారేస్తూ ఉంటారు.’ ‘మనుషుల్లో అభ్యుదయ భావాలనేవి వస్తూ ఉండాలి. దాంతో బుద్ధి వికసిస్తుంది. సమాజం అర్ధమౌతుంది. మంచి మార్గమేదో, దుర్మార్గామేదో అవగాహన ఔతుంది.’ ‘అభ్యుదయభావం అంటే దేవుణ్ణి నమ్మ కూడదా మాస్టారూ?’ ‘అభ్యుదయ వాదుల్లో మళ్ళీ రెండు రకాలురా – కొందరు ఆస్తికులు, కొందరు నాస్తికులు. అక్కినేని వారు దేవుడి పట్ల అంతగా శ్రద్ధ చూపరు. మనిషి మనిషిగా ఒకరికి హాని చెయ్యక బతకడమే దైవత్వం అని నమ్మారు. జీవితకాలం ఆచరిస్తూ వచ్చారు. అయితే ఆయన కమ్యూనిస్టు సంఘాల్లోనో మరి వేటిలోనో సభ్యుడుగా ఉంటూ ఎదగ లేదు. తనకు తానుగా, కళామతల్లి బిడ్డగా నటన పట్ల నిరంతర ఆసక్తి చూపించి ఎదిగిన వ్యక్తి.’ ‘మాస్టారూ..ఆయన విప్రనారాయణ, భక్త తుకారం, మహాకవి కాళిదాసు, జయభేరి, బుద్ధిమంతుడు వంటి చిత్రాల్లో ఎంతో భక్తిరసం ఉప్పొంగే పాత్రలు వేశారట...మా నాన్న చెప్పారు.’ ‘అవును... మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన కాళిదాసు, బెంగాల్ కి చెందిన కల్పిత దేవదాసు, మహారాష్ట్రకి చెందిన తుకారం, ఆంధ్రకి చెందిన క్షేత్రయ్య, తమిళనాడుకి చెందిన విప్రనారాయణ, ఒడిశాకి చెందిన జయదేవ కవి, కర్నాటకకి చెందిన శిల్పాచార్యుడు జక్కణ, ఉత్తారాది కబీరు, శ్రీమద్రామాయణ మహర్షి వాల్మీకి, ...ఇలా చరిత్రకెక్కిన మహామహుల పాత్రలు పోషించి జాతీయ ఏకత్వం చూపారాయన. ఒక్క అన్నమాచార్యుల పాత్రే ఆయనకి కాక ఆయన కుమారుడు నాగార్జునకి దక్కింది. ఆయనలా ఎవరికైనా సరే కళ పట్ల ఆరాధాన ఉండాలి. కళాకారుడు ఏవో ఇజాల చుట్టూ గిరిగీసుకుని ఉండి పోకూడదు. మీకు తెలుసా? ఆయన స్వయంగా నిర్మాత అయి ఎన్నో సినిమాలు తీశారు కాని స్వీయ దర్శకత్వానికి దూరంగానే ఉండేవారు. అలాగే సాటి నటుడు రాజకీయాల్లోకి రమ్మన్నా ససేమిరా అన్నారు.’ ‘అక్కినేని నాగేశ్వరరావు గారిని విజయవాడ రైల్వే స్టేషన్ ఫ్లాట్ఫాం మీద చూసిన ఘంటసాల బలరామయ్య గారనే సినీ నిర్మాత ఆయనకి సీతారామ జననం అనే సినిమాలో శ్రీరాముడి పాత్ర ఇచ్చి హీరోగా పరిచయం చేయించారని....’ ‘మీ కంప్యూటర్ నిజమే చెప్పింది. జానపద హీరో గా కొన్నాళ్ళు వెలిగిన ఎ ఎన్ ఆర్ తరువాత రొమాంటిక్ హీరో అనిపించుకున్నారు. భగ్న ప్రేమికుడిగా మజ్నూ తరువాత దశాబ్దాల తరువాత ప్రేమనగర్, ప్రేమాభిషేకం లో మళ్ళీ ప్రత్యేకంగా కనిపిస్తే ప్రేక్షకులు వాటికి కాసుల వర్షం కురిపించారు. తెలుగు సినిమా పరిశ్రమ మెల్ల మెల్లగా అభివృద్ధి చెందుతున్న దశలో అంటే పంతొమ్మిది వందల యాభైల కాలంలో ఎందరో అభ్యుదయ వాదులు, స్వాతంత్ర్య సమర యోధులు పరిశ్రమలోకి అడుగు పెట్టి సినీ నిర్మాతలై పెట్టుబడి పెట్టి తమ సిద్ధాంతాలకు అనుగుణంగా సినిమాలు తీశారు. అలా కమ్యూనిస్టుగా అనుభవముండి ఒకాయన ప్రజా నాట్య మండలి అనే సంస్థ స్థాపించారు. ఆయనే తమ్మారెడ్డి గోపాల కృష్ణమూర్తి. అంతా తమ్మారెడ్డి కృష్ణమూర్తి అని అంటారు.. 1949 లోనే అనుకుంటా కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధాజ్ఞలుండేవి. అప్పుడాయన చెన్నై (అప్పటి మద్రాసు నగరం) వచ్చేసి సినీ ఆర్టిస్టుల పిల్లలకి ట్యూషన్ చెప్పేవారు. సారధీ సంస్థ లో ప్రొడక్షన్ యూనిట్ లో మేనేజర్ బాధ్యతలు నిర్వహించారు. ఎన్టీ రామారావు గారితో పల్లెటూరు (1952) వంటి సినిమాలో అభ్యుదయం వైపు అడుగేసి ధైర్యంగా ‘రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్’ అనే బ్యానర్ పెట్టి 1962 నుంచి 1982 వరకు రెండు దశాబ్దాల కాలంలో పదకొండు సినిమాలు తీశారు. అంటే ..సినిమాకి సినిమాకి మధ్య ఒక ఏడాది విరామం ఇచ్చేవారు. దీనివల్ల కథా బలం అవీ చూసుకునే వీలుండేది. ఏ నిర్మాతకైనా ఇదే సక్సెస్ మంత్రం. సినీ కార్మికులకి ఆయనే బాసట. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ఈ సెప్టెంబర్ నెల పదహారో తారుఖున మరణించారు. చనిపోయిన నాటికి ఆయన వయసెంతో తెలుసా? తొంభై మూడేళ్ళు. అంటే భారతీయ చలన చిత్రానికి ఉన్నంత వయసు ఆయనకి ఉండేదన్నమాట. చివరి రోజుల్లో ఆయన చనిపోయింది ఎక్కడో తెలుసా? చండ్ర రాజేశ్వరరావు పేరిట ఉన్న వృద్ధాశ్రమంలో. ఆయన కొడుకు లెనిన్ బాబు ఇప్పుడు లేరు. భరద్వాజ ఇంకో అబ్బాయి.’ ‘తమ్మారెడ్డి భరద్వాజ గారిని టీవీల్లో చూస్తూ ఉంటామండీ’ ‘చిత్ర సీమలో ప్రముఖ వ్యక్తి ఆయన. నిర్మాత.... లెనిన్ బాబు పేరు వింతగా ఉందా?’ ‘అవునండీ..’ ‘ఒకప్పుడు కమ్యూనిస్టులకి లెనిన్ గురువూ,దైవం. అలా ‘లెనిన్’ పేరు పెట్టారు కొడుక్కి. కృష్ణమూర్తి గారు నిర్మాత కాగా, వారి అబ్బాయి లెనిన్ బాబు దర్శకత్వం వహించిన ఒక సినిమా పేరు డాక్టర్ బాబు. అందులో హీరో శోభన్ బాబు’ ‘భలే ఉందే మాస్టారూ ...అందరూ బాబులే కదండీ’ ‘ఇదే శోభన్ బాబు గారితో అంతకు ముందు కృష్ణమూర్తి గారు బాబు పేరున్న ఒక సినిమా తీశారు- పేరు సిసింద్రీ చిట్టిబాబు’ ‘అంటే...మన క్లాసులోని సి.వి.మురళి లాగా అండీ? వాడి ఇంటి పేరు మేం ఎప్పుడూ అడగలేదు కానీ వాడి హడావుడి చూసి వాడికి సిసింద్రీ మురళి అని పేరు మార్చాం’ ‘మీరంతే ...నాకూ ఏదో నిక్ నేమ్ పెట్టే ఉంటారు. అయితే ..కృష్ణమూర్తి గారు అలనాటి ఎన్టీఆర్ గారితో పల్లెటూరు సినిమాతో ఉన్న అనుబంధం వల్ల నిర్మాతగా మారాక తీసిన తొలి చిత్రం లక్షాధికారి లో ఎన్టీఆర్ హీరో. అందులో సస్పెన్స్ అనే ప్రక్రియని తొలిసారిగా ప్రవేశ పెట్టారు. అదో పెద్ద హిట్ ఆ రోజుల్లో. ఆ తరువాత ఎ ఎన్ ఆర్ వారు హీరోగా ...మీకు తెలీదు..... మేమంతా అక్కినేని అనో, నాగేశ్వరరావు అనో అనుకోం. సింపుల్ గా ఎ ఎన్ ఆర్ అంటాం... వారిని హీరోగా తీసుకుని తమ్మారెడ్డి గారు వరసగా మూడు సినిమాలు ఏవీ ..... జమిందార్, బంగారు గాజులు, ధర్మదాత తీశాక మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఎ ఎన్ ఆర్ తో దత్తపుత్రుడు సినిమా తీశారు. వీరి కాంబినేషన్లో అదే ఆఖరు చిత్రం. దత్తపుత్రుడు సినిమాకి లెనిన్ బాబే దర్శకులు.’ ‘మాస్టారూ.. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు పాత్రని సూచించే పేర్లే పెట్టేవారా? చూడండీ... లక్షాధికారి, జమిందార్, ధర్మదాత ..ఇలా ఉన్నాయి పేర్లు ...ఒక్క బంగారు గాజులు మినహాయించి’ ‘అవునర్రోయ్ ...నేను గమనించలేదు. కుర్రాళ్ళు చాకులా ఉన్నారే’ ‘మీరిలా అంటారు...ఏ మాత్రం అల్లరి చేసినా మమ్మల్ని ఇంట్లో డ్రాకులాలా ఉన్నారంటారు..’ ‘అలా తల్లితండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు సరాదాగా అనుకోవడం సహజమే. తమ్మారెడ్డి గారు బంగారు గాజులు సినిమాలో అన్న- చెల్లి అనుబంధాన్ని చక్కగా చూపించారు. అలాగే ధర్మదాత సినిమాలో తండ్రి పట్ల పిల్లలు ఎలా ఉండాలో చూపించారు. దత్తపుత్రుడు లో ఆ రోజుల్లో ఉండే దత్తత విధానం, అందులోని సాదక బాధకాలు చూపించారు. ఎ ఎన్ ఆర్ వారి జన్మ దినం సందర్భంగా ఈ నాలుగు సినిమాల్లోంచి చెరో రెండు పాటలు తీసుకుని వీక్షిద్దాం.’ ‘అంటే...మాకివాళ కనులు చూసినా పాటే ..అన్నమాట మాస్టారూ..’ ‘మీకు తెలియదు ..వినండి... అంతకు ముందు తెలుగు సినిమాలన్నీ చెన్నైలోనే తయారౌతూ ఉండేవి. సినీ పరిశ్రమని పూర్తిగా హైదరాబాద్ కి తరలించాలని అప్పటి ముఖ్యమంత్రి ఆశిస్తే తొలి అడుగు వేసింది ఎ ఎన్ ఆర్ గారే. ఆ తరువాత తమ్మారెడ్డి గారూ సరేనన్నారు.’ ‘మాస్టారూ... తెలుగు సినీ పరిశ్రమకి పితామహులు రఘుపతి రాఘవ గారు కదటండీ...’ ‘కంప్యూటర్ గానీ చూశావా...పేర్లు కలగా పులగం చేశావ్. బళ్ళారి రాఘవ గారిని, రఘుపతి వెంకయ్య నాయుడు గారిని కలిపేశావ్.’ ‘సారీ అండీ...అయితే ప్రభుత్వం నాయుడు అనే పేరు తొలగించి రఘుపతి వెంకయ్య అవార్డు అంటోందీ...అదే బి.ఎన్. అవార్డ్ అనకుండా బి.ఎన్.రెడ్డి అవార్డ్ అని అంటోందీ...ఏ(విటీ వివక్ష? అని ఈ మధ్య దర్శకులు దాసరి నారాయణ రావు గారు దులిపేశారు.’ ‘చెన్నైలోనూ వీధులకి పెట్టిన పెద్దల పేర్ల వెంట కులాల పేర్లుఉండేవి. వాటిని కత్తిరించారు. అయినా ఇప్పటికీ శంభుశెట్టి స్ట్రీట్ అనేవే చెలామణి అవుతున్నాయి. ఎంకి-నాయుడు బావ అనడంలో ఓ చరిత్ర ఉంది, ఆప్యాయత ఉంది, ఒక పెహచాన్ ఉంది. మిస్సమ్మ సినిమాలో ‘ఓ.. నాయుడివా’ అని ఎస్ వి రంగారావు గారి పాత్ర నోట ఓ ‘దగ్గరితనం’ చేరే మాట ఉంది. సినిమాలకి రాసే కవుల్లో ఒక సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు, ఒక సీతారామ శాస్త్రి ఉన్నారు. ఒక కృష్ణమాచార్య ఉండేవారు. అనిసెట్టి సోదరులు భేష్. నరాల రామిరెడ్డి శభాష్. ఎవ్వరిది ఏ కులం అనే వ్యాకులంలో పడిపోయి సమయం వృధా చేసుకోవడమెందుకు? ఎంత బాగా ఎవరు రాసినా మెచ్చుకోవాలి. ఎబ్బెట్టు గా ఎవరు రాశినా ఒక్కటిచ్చుకోవాలి. మేం యువకులం – మాదంతా ఒకటే కులం అనుకుంటూ ముందుకు సాగిపోవాలి’ ‘అలాగే మాస్టారూ.. సార్ ...రఘుపతి వెంకయ్య అవార్డ్ అక్కినేని వారికి, తమ్మారెడ్డి వారికి ఇచ్చారు కదండీ.’ ‘అవును...ఎ ఎన్ ఆర్ తన పేరూ నిలిచేలా అక్కినేని అవార్డ్ ప్రవేశ పెట్టి మొదటి అవార్డ్ ఎవరికిచ్చారో తెలుసా?’ ‘......’ ‘తెలీదా? ప్రఖ్యాత నటుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత దేవానంద్ గారికి’ ‘ఆ టోపీ ఆయనా? ఆ మధ్య లండన్లో పోయారు కదండీ....' 'అవునాయనే ....వీరు హమ్ దోనో సినిమాలో డబల్ రోల్ చేస్తే అదే సినిమాని తెలుగులో సిపాయి చిన్నయ్య గా తీసి ఎ ఎన్ ఆర్ చేత మరోసారి డబల్ రోల్ చేయించారు. అదలా ఉంచండి.. ప్రముఖ గాయని భారతరత్న లతా మంగేష్కర్ కి అక్కినేని అవార్డ్ ఇచ్చారు.’ 'అదేమిటి మాస్టారూ ...అన్నీ హిందీ వారికేనా?' ‘అక్కినేని వారి విషయంలో సుసర్ల దక్షిణామూర్తి గారనే సంగీత దర్శకులు మరపురాని సంఘటనలు తీసుకొచ్చారు. ఒకటి- ఎ ఎన్ ఆర్ హీరో అయిన సంతానం అనే సినిమాలో తొలిసారిగా తెలుగు పాటని లతా మంగేష్కర్ చేత పాడించడం. ‘నిద్దురపోరా తమ్ముడా’ అని పూర్తి పాట ఆమె పాడుతుంది ఒక వెర్షన్ లో. మరో వెర్షన్లో మధ్యనుంచి అక్కినేని అదే- ఘంటసాల వారు అందుకుంటారు. రెండవ సంఘటన- ప్రసిద్ధ ఒడియా గాయకుడు,స్వర సామ్రాట్ రఘునాథ్ పాణిగ్రాహి చేత హీరో అక్కినేనికి తొలిసారిగా పాడించడం. ఆ పాట – చల్లని రాజా ఓ చందమామా. చిత్రం పేరు – ఇలవేల్పు. ఈ ఏడాది ఆగష్టులో దివంగతులైన రఘునాథ్ పాణిగ్రాహి గారికి అక్కినేని అవార్డ్ ప్రకటిస్తే ఎంతో మంచిది. ఈయన జయదేవ కవి రాసిన ‘గీతగోవిందం’ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. అక్కినేని జయదేవుడంటే ఇలా ఉండే వాడేమో అన్నంత బాగా ఆ కవి పాత్ర పోషించారు. స్వయంగా అక్కినేని వారికి రచనాసక్తి ఎక్కువ. నేనూ నా జీవితం, అక్కినేని ఆలోచనలు (అ ఆ లు) వంటి రచనలు చేశారు. నీతో మాటాడటమే ఓ ఎడ్యుకేషన్ అని గిరీశాన్ని ఉద్దేశిస్తూ అన్నట్టు ఎ ఎన్ ఆర్ ఎందరో మహానుభావులతో స్నేహ బాంధవ్యాలు పెంచుకుని తనని తాను ఉన్నతంగా ఎడ్యుకేట్ చేసుకున్నారు.’ ‘మాకు ఎ ఎన్ ఆర్ గారిని చూడాలని ఉంది. ఈసారి ఎడ్యుకేషనల్ టూర్ లో ఆయన దగ్గరికి వెళదామండీ మాస్టారూ..’ ‘రామోజీ రావుగారి స్టూడియో కూడా చూసేయొచ్చు.’ ‘ప్రిన్సిపాల్ గారు ఒప్పుకోవాలి కదా...’ ‘ప్రిన్సిపాల్ అంటే గుర్తొచ్చింది సార్ .....ఎన్టీఆర్ బడిపంతులు గా నటించారు కదండీ.. ఎ ఎన్ ఆర్ విషయం చెప్పరూ?’ ‘ఆయన ఆత్మ గౌరవంలో కాలేజ్ స్టూడెంట్ గానూ, ఆరాధనలో మెడికల్ విద్యార్ధి గానూ, డాక్టర్ చక్రవర్తిలో డాక్టర్ గానూ, సుమంగళి లో లెక్చరర్ గానూ, బుద్ధిమంతుడులో బడి గొప్పతనం చెప్పే వ్యక్తిగానూ, రంగేళి రాజాలో రకరకాల మనస్తత్వాల విద్యార్ధుల మీద పాట పాడుతూ..ఇలా ఎన్నో పాత్రలు పోషించారు.’ ‘బావుందండి మాస్టారూ ...కనులు చూసినా పాటే లో ఎనిమిది పాటలూ బావున్నాయి సుమండీ.. ఎవరిదో ఒకే బాణీ వినిపిస్తోంది. స్వర కర్త ఎవరండీ?’ ‘త- తమ్మారెడ్డి , ‘త’ కు దీర్ఘమిస్తే ‘తా’ –తాతినేని అని నేను చెప్పబోతుంటే ..ఎలా పసిగట్టావురా పరమేశం?’ ‘తాతినేని వారా? ఎవరండీ?’ ‘తాతినేని చలపతి రావు. గొప్ప సంగీత దర్శకులు. టి.చలపతిరావు అని అంటారు. వీరే స్వర జానకికి తమిళ చిత్రంలో గాయనిగా తొలి అవకాశం ఇచ్చారు. చలపతిరావు గారు ఇంజనీరు పట్టభద్రులు. అదీ ముంబైలో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. ఈయన కోటయ్య అనే ఆయనకి ‘దత్త పుత్రుడు’. కోటయ్య వారిలాగా సంగీతంలో అభిరుచి ఉన్నవారు ఈయన. ప్రజానాట్య మండలి వారు ఊరూరా తిరిగి ప్రభోదాత్మకమైన నాటకాలు ప్రదర్శిస్తుంటే ఈయన సంగీతం అందించేవారు. తరువాత సినీ పరిశ్రమలో ప్రవేశించి ఎస్.రాజేశ్వరరావు గారికి అసిస్టెంట్ గా కుదిరారు. ఇందాక ఆదుర్తి సుబ్బారావు గారనే ఆయన గురించి చెప్పుకున్నాం కదా. అలా పెందుర్తి సుబ్బారావు అనే ఆయన చలపతి వారిని రాజేశ్వరరావు గారికి పరిచయం చేశారు. డాక్టర్ గరికపాటి రాజారావు గారనే నాటక దర్శక నిర్మాత ‘పుట్టిల్లు’ (1953) చిత్రానికి కొత్తవాళ్ళను పరిచయం చేశారు. నటి జమున గారికదే తొలి చిత్రం. హాస్య సంజీవిని అల్లు రామలింగయ్య గారి కదే తొలి చిత్రం. అలాగే చలపతిరావు, మోహన్ దాస్ లకి సంగీత దర్శకులుగా తొలి చిత్రం. అలా చిత్ర సీమే చలపతి రావుగారికి ‘పుట్టిల్లు’ అయిపొయింది. 1959 లో ఆయన కోరకుండానే ‘ఇల్లరికం’ దక్కింది. అందులో ‘నేడు శ్రీవారికి మేమంటే పరాకా?’ పాటలో రాజేశ్వరరావు పోకడలు వినిపిస్తాయి. పునర్జన్మ(1963) చిత్రంలో ‘ఎవరివో నీవెవరివో’ అనే కల్యాణి గీతం రాజే’స్వర’ విన్యాసానికి భిన్నంగా ఉంటుంది. అదే సందర్భంలో ‘ప్రజా నాట్యమండలి’ తరఫునుంచి తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి స్నేహ బాంధవ్యం పెరిగింది. ఆయన రవీంద్ర ఆర్ట్స్ నుంచి తీసిన అన్ని చిత్రాలకి తాతినేని చలపతి రావు గారే సంగీత దర్శకులు, ఒకే ఒక్క చిత్రం –ఇద్దరు కొడుకులు తప్ప. ఇది నిర్మాతగా తమ్మారెడ్డి వారి ఆఖరి చిత్రం. ‘అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి’ అని డాక్టర్ సి.నారాయణ రెడ్డి, అంటే సి.నా.రె. గారి కలం సరళంగా మాటలందిస్తే అంతే మృదువైన స్వర మెట్లు కుదిర్చారు చలపతిరావు గారు. ఇది తమ్మారెడ్డి వారి బంగారు గాజులు సినిమా పాట. అందులోని మోహన కల్యాణి రాగం - ‘విన్నవించుకోనా చిన్న కోరిక’ – అన్న దాశరథి వారి పాట కూడా ఇప్పటికీ మనోహరమైన మెలోడీయే. లక్షాధికారి లో ఎన్ టి ఆర్ హీరో. ‘మబ్బులో ఏముందీ’ యుగళ గీతాన్ని యుగాల గీతంగా వ్రాసినది సి.నా.రె వారే. వీరే ఆంధ్ర జ్యోతి సచిత్ర వార పత్రికలో కొన్ని వారాలపాటు ‘పాటలో ఏముందీ’ పేరిట తన పాటల గురించి ప్రస్తావించారు. జమీందార్ లో ఎ ఎన్ ఆర్ హీరో. ‘పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు’,’ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను’,’కస్తూరి రంగ’,’ శేషగిరి బావా’ వంటి హిట్ సాంగ్స్ చలపతిరావు కూర్చారు. ‘ధర్మదాత’లో తండ్రి పాడే ‘జో లాలి’ పాట, పిల్లలు పాడే ‘ఓ నాన్నా నీ మనసే వెన్న’ ఇప్పటికీ వన్నె తరగని బంగారు గీతాలు. తమిళ మాతృక కి తనదైన బాణీ కలబోసి చేసిన యుగళం ‘పరమేశ్వరి జగదీశ్వరి రాజేశ్వరి ఇకనైనా శాంతించవే’ పెద్ద హిట్ ఆ రోజుల్లో. ‘చిన్నారి బుల్లెమ్మ’ వంటి హుషారు గీతం ఆర్కెస్ట్రాలో స్పీడ్ ఉంటుంది. ‘దత్తపుత్రుడు’లో ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం – ఇరువురి పాటలూ ఉన్నాయి. సి.నా.రె వారి పిల్లోయ్ జాగర్త, వంటివి ఘంటసాల (సుశీలమ్మతో యుగళం)పాడితే, దాశరథి వారి అందానికి అందానివై ఏనాటికి నా దానవై ...పాట బాలు (సుశీలమ్మతో యుగళం) పాడినది. మా చేను బంగారం - పాటలో కొసరాజు వారి కలం నుంచి జాలువారిన కొత్తదనం కనిపిస్తుంది. చివరలో ఆయన విసిరే వ్యంగ్య బాణం షరా మామూలే. వీటినీ, వాటి నేటివిటీని ఠీవిగా స్వరపరచడంలో చలపతిరావు ఎప్పటిలా తన పటిమ చూపించారు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి లాగ టి.చలపతి రావు గారు కూడా సినీ కార్మికుల భవిష్యత్తు ఆలోచించేవారు. సినీ మ్యూజిషియన్స్ యూనియన్ – వ్యవస్థాపకులు ఈయనే. 1992 నుంచి ఈయన ఆరోగ్యం దెబ్బతింది. జనం మనం ఆయన ఆఖరి చిత్రం. అందులో బాలమురళి వారు పాడారు. 1994 ఫిబ్రవరి 22 నాడు ‘కన్ను మూసింది లేదు’ పాట స్వర కర్త చలపతిరావు కన్ను మూశారు. అందరిచేతా 'మాస్టారూ' అని పిలిపించుకున్న ఘంటసాల వారిని 'మిత్రమా' అని అనగలిగినది ఈయనొక్కరే. ‘ఏటి దాపుల తోట లోపల’ ఎవరో కోయిల పిలిస్తే ‘ప్రేమ కానుక' గా తన ఊపిరినిచ్చేసిన ‘అసాధ్యుడు’ ఈ ‘మంచి మనిషి’ అనే ‘జనం –మనం’ లాగ మనం మాత్రం మిగిలాం.' ‘మనం మిగిలితేనే మననం చేసుకోగలుగుతున్నాం కదండీ...అయితే తమ్మారెడ్డి వారి ఇంటి అడ్రస్ పుచ్చుకుంటే తాతినేని వారి ఇల్లు దొరికినట్టే అన్నమాట.’ ‘కనులు చూసినా మాటే- లో మీ తరం వారికి ‘తాత’ అయిన అక్కినేని వారి యంగర్ డేస్ చూశారు. పనిలో పనిగా తాతినేని-తమ్మారెడ్డి అనే ‘తాత’ గార్లనీ విన్నారు. ఇంకో విషయం చెప్పేదా? అక్కినేని వలె అక్కిరాజు వారు ఉన్నారు. తాతినేని వలె తాతిరాజు వారు ఉన్నారు.’ ‘సార్ ....అక్కినేని వారి పుట్టిన రోజు వేడుక జరుగుతుంది. ఇదే టయిం. పదండి పోదాం హైదరాబాదు’ 'ఆగండాగండి ....తీరైన మాట అన్నారు...రష్యా దేశం నుంచి అక్కినేని వారూ, తమ్మారెడ్డి వారూ తిరిగొచ్చినప్పుడు విజయచిత్ర పత్రికలో ఫోటో వచ్చిందర్రా ......ఆల్ బొమ్మలే అని తనివారా చూడండి' ************************************************************************************ ‘హైదరాబాద్...హైదరాబాద్....వెళ్ళాలి సార్ ...స్టూడెంట్స్ కోరుతున్నారు..ప్లీజ్...’ ‘ఏమిటోయ్ ....నిద్రలోనా ఆ కేకలు? లేక మెలకువలోనేనా?’ ‘వార్నీ....వరించింది కల, దాంతో పాటు పలవరింత...లేకపోతే ....స్టూడెంట్స్ బుద్ధిగా అక్కినేని, తమ్మారెడ్డి, తాతినేని వారి కబుర్లు, పాత గాధలు వింటూ కూర్చోవడం కూడానా? ప్రిన్సిపాల్ దగ్గర ఒక్క నిమిషం నిలబడితే చాలు, పైన ముచ్చెమటలు, కింద సెలయేళ్ళు ...అటువంటిది హైదరాబాద్ ట్రిప్ వేస్తాం అని చెప్పే ధైర్యం ఒకటా? ఎనీ వే... హేపీ బర్త్ డే అక్కినేని వారూ’ -డా. తాతిరాజు వేణుగోపాల్ , 20 సెప్టెంబర్ 2013
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|