మునుపటి నా మాట
లలిత సంగీతం, సినిమా సంగీతం – ఏక రూపం నుంచి వచ్చిన రెండు అపురూప ఉప రూపాలు. ఏక రూపమైన సంగీతంలోనూ అంతే ... స్వరం, రాగం రెండు స్వరూపాలు. స్వరములు ఏడైనా రాగాలెన్నో – అని కవి అబ్బురపడితే పడు గాక - ఒకాయనకి మాత్రం ఏడు రాగాలు చాలు. యమన్, మాల్కోస్, భీమ్ పలాస్, మోహన, కమాజ్, జయజయవంతి, హరికాంభోజి అలాగని ఆ ఒకాయనకి తతిమ్మా రాగాలతో ప్రమేయం లేదని కాదు- ‘బహుదారి’ వంటి అరుదైన రాగానికి దారి చూపించింది ఆ ఒకాయనే. కాబట్టే ఆ దారిలో ‘నిలువుమా నిలువుమా నీలవేణీ’ (అమరశిల్పి జక్కన్న), అనగానే ఆగాయి పాదాలు. ‘నడు.. నడు...నడచిరా హంస వలె’ (చిలకా గోరింకా) అనగానే కదిలాయి పాదాలు. ‘బేహాగ్’ రాగాన్ని ఆప్యాయంగా ‘హగ్’ చేసుకున్నదీ ఆ ఒకాయనే. కాబట్టే ‘వర మొసగే వనమాలీ నా వాంఛితమ్ము నెరవేరునుగా’ (భక్త ప్రహ్లాద) అని నారదుడు విష్ణు భక్త ఆలింగనంలో కరిగిపోయాడు. ‘కామోద్’ రాగం మీకామోదం కావాలంటే నేను చేసినట్టే ఉండాలి అనే జగమొండి ఈ ఒకాయన. అలాగని అది తెలుగు మాట ‘పొగరు’ అని అనుకుంటే పొరపాటు. దాన్ని ‘విగరు’ అని అంటారని ఇంగ్లీషులో నవ్వేయడం ఆ ఒకాయన అభిమానులకి అలవాటు. ‘నీ మధు మురళీ గాన లీల’ (భక్త జయదేవ్) తెలుప తరమా అని కొందరి ఉవాచ.
‘పఠ దీప్’ రాగమనగానే అది ఎస్డీ బర్మన్ స్వంతం అనుకుంటే తప్పు. అంతకుముందే ఆ ఒకాయన ‘రంగుల రాట్నం’ గిరగిర వడికించి రాగమంటే రంగే కదా అని ఇంత వెలుగు విసిరారు. ఆ వెలుగులో ‘కన్నుల దాగిన అనురాగం పెదవులపై విరబూయాలి’ – అవునా కాదా? 'సింధు భైరవి' అనగానే నౌషాద్ మహానుభావుడే గుర్తుకు రావడం సహజం. అటువంటిది మన ఒకాయన ఒకానొక కాలంలో 'తుమ్మెదా ఒక్కసారి' అంటూ పాటల ఉద్యానవనంలో ప్రవేశించి 'ఏమిటో ఈ మాయ ...ఓ వెన్నెల రాజా' (మిస్సమ్మ), 'ఏమని పాడెదనో ఈ వేళ' (భార్యా భర్తలు) అంటూ సంశయిస్తూనే, 'నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగి వచ్చునో....ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా' అని విన్నవించుకుని 'ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం' అని అవగతం చేసుకుని అదే సింధుభైరవ ద్వీపాన్ని వేరొకరికి త్యాగం చేసుకున్న ఉదాత్త మూర్తి. జాను తెనుగు ‘జావళీ’ పలుకులు ఎలా ఎక్స్ ప్రెస్ చేయాలో, అడుగులు ఎంత ఫాస్ట్ గా కదిలించాలో తెలిసిన ఈ ఒకాయన అనే రాగింజనీరు నేర్పరి వేసిన ఎక్స్ ప్రెస్ వే లోనే పరుగులు తీశారు అందరూ. ‘ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన’(విప్రనారాయణ) , ‘నిను చేర మనసాయెరా నా సామి’(బొబ్బిలి యుద్ధం) , ‘నగుమోము చూపించవా గోపాలా’(అమరశిల్పి జక్కన్న) , ‘శివదీక్షా పరురాలనురా’(పూజా ఫలం), ‘పిలిచిన బిగువటరా ఔరర’(మల్లీశ్వరి) - ఇవి ఆ దారిలో కనిపించే మైలురాళ్లు. ‘ఉన్నవారికే అన్ని సుఖాలు రయ్యో రయ్యో - లేని వారికి ఈ లోకంలో నుయ్యో గొయ్యో’(పెంపుడు కొడుకు) అని మహాకవి వ్యంగ్యంగా చమత్కరించినా, ‘చెట్టు లెక్క గలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా’ (చెంచులక్ష్మి) అని రుద్రకవి గడుసుగా ప్రశ్నించినా, ‘చిల్లర రాళ్ళకు మొక్కుతూ వుంటే చెడిపోదువురా ఒరే ఒరే’(పూల రంగడు) అని ఆడంబర ఆధ్యాత్మిక కొస రాజుకునేలా మరో కవి మండించినా వాటిని జాన పదం అనే సహజ జ్ఞాన పథంలో నడిపించడం ఈ ఒకాయనకే చెల్లింది. ఎవరీ ఒకాయన ? ఒకాయన ఒకాయన అని ఎంతసేపు బుకాయించేదీ? ఆయన పేరు ఎస్.రాజేశ్వరరావు అంటే పోలా? తెలుగువారి గుండెల్లో ‘బుక్’ అయిపోయిన ఈ నిరాడంబర విజయనగర జిల్లా వాసి ఇంటిపేరు సాలూరు వారు. తెలుగువారు గుర్తించి పెట్టుకున్న ముద్దు పేరు ‘రసాలూరు వారు’. తెలుగువారు ఆ సాలూరు గ్రామం ముందు ఒక అక్షరం ఎక్కువేసి మురిసినట్లే ఆయన పేరులోని గ్రామరును మార్చి ‘రాజే’స్వర’ రావు అని అనగలిగే సాహసానికి ఒడిగట్టారు. ఒక ఆకు ఎక్కువ చదివినవారు ఆకులందు అణిగి మణిగి ఉన్న కోకిలగా గుర్తించి 'రాగే'స్వర రావు అని కూడా పేరు మార్చారు. ఇప్పుడంటే కనీ వినీ ఎరుగని వారం రోజుల కర్ఫ్యూ మూలంగా పాపులర్ అయిన విజయనగరం కావొచ్చు కాని సాలూరు సన్యాసి రాజు , మంగమ్మ దంపతుల కాలం నాడు కళలకి కాణాచి ఆ ఊరు. ఆ జిల్లా లోని సాలూరుకి మూడు కిలో మీటర్ల దూరంలో ఉంది శివరామ పురం. అదే వారి ఊరు. ఊరి పేరు నిలబెడతారనే కాబోలు పెద్దబ్బాయికి హనుమంత రావు అని, చిన్నబ్బాయికి రాజేశ్వర రావు అని నామకరణం చేశారు వారు. రాజమణి పెద్ద కోడలు. రాజేశ్వరి దేవి చిన్న కోడలు. ‘ద్వారానికి తారామణి హారం’ అని ఊరకే అనలేదు కృష్ణశాస్త్రిగారు (ఇది మల్లెల వేళ యనీ – పాట ఆకాశవాణి కోసం వాణిశ్రీ విజయనగర సౌశీల్య గాత్రంతో పాడుతుంది కదా) విజయనగరం ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వయోలిన్ తారలు శివరంజని రాగంలో ఆకాశ వాణి సిగ్నేచర్ ట్యూన్ అనే మణిహారం వెలుగులు వెదజల్లించాయన్నది కొందరికే ఎరుక. ఆ మహనీయుడి శిష్యులై ఆనక ఆకాశవాణి లలిత సంగీత గడప దాటి సినీ సంగీత ద్వారం చేరుకున్న స్వర పథికులు ఈ అన్నదమ్ములు. గురువు గారి మీద భక్తి చేతనో ఏమో, తమవూరి మీద మక్కువ వలనో ఏమో 'శివరంజని' రాగం వైపు అట్టే దృష్టి నిలపలేదు సోదర ద్వయం. 'పాలించారా రంగా' (విప్రనారాయణ) వంటిది ఒకటి 'రంజని' రాగంలో కూర్చి రంగడు కాబట్టి శివ ఎందుకని తప్పుకున్నారు రాజేశ్వరుడు. అంతెందుకు- ఎవరో రైలు కూత వింటూ అక్కడ ప్లాట్ ఫాం లో వేచి ఉన్న రాజేశ్వరుడిని అడిగారట- 'గురువు గారూ..రైలు కూత ఏం రాగ మంటారూ?' అని. ఠక్కున ఆయనిచ్చిన సమాధానం -'సార్ ...రైలింజన్ చిత్తరంజన్ లో కదా తయా రైంది ..కాబట్టి రైలు కూతది 'చిత్తరంజని' రాగమే!' నాలుగేళ్ల వయసులోనే రాగాలు గుర్తించడం తెలిసిన రాజేశ్వరుడు ఏడేళ్ళ ‘పిల్లడు’గా ఉన్నప్పుడు బరంపురం పట్టు పంచె కట్టుకుని ‘హరి కథ’ చెప్పే వారట. సంగీతసాహిత్యాల సమ ఉజ్జీ అయిన తండ్రి సన్యాసిరాజు గారు హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణ దాసు గారి దగ్గరకి పిల్లాణ్ణి తీసుకెళ్ళారు. పసివాడికి పద్యాలా అని దాసుగారు నవ్వేసినా పద్యాలు పాడి తన పస చూపారట బాల రాజేశ్వరుడు. అన్నదమ్ములు ఎదుగుతున్న దశలోనే అమ్మ చనిపోయింది. సన్యాసిరాజు – పేరే విచిత్రం. ఇరు పార్శ్యాలున్నాయి. ఏం లేదు లోకంలో అనే సన్యాసి, తానే అన్నీ ఈ లోకంలో అనే రాజు! రెండో పార్శ్యం అతన్ని ఆత్మ విశ్వాసం వైపు నడిపించింది. ముసిరే వానలతో వరదొస్తే ఏం? ఆయన చలించలేదు. టైగర్ వరదాచారి, ముసిరి సుబ్రహ్మణ్యం అనే రెండు చేయూతలు పిల్లలకి దొరికేలా కష్టపడ్డారు. పన్నెండేళ్ళ రాజేశ్వర కుర్ర గాత్రం మెల్ల మెల్లగా ‘రికార్డ్’లకెక్కింది. ఆ రికార్డూ ఈ రికార్డ్ నోట విన్న సినీ పెద్దలు ‘కృష్ణుడిగా నటిస్తావా, పాడుతూనే సుమా’ అనగానే తమదే ఆలస్యం అన్నట్టు తలూపాడు. ‘శ్రీకృష్ణ లీలలు’ తొలిచిత్రం నటుడిగా రాజేశ్వరుడికి. తొలి ‘మాయాబజార్’ చిత్రంలో అభిమన్యుడు ఆయన. అదే పేరుతో విజయావారు రెండు దశాబ్దాల తరువాత సినిమా తీస్తే పింగళి వారూ ఊరికే అనలేదు- ‘నీవేనా నను తలచినది ..నీవేనా నను పిలిచినది’ అని. అలా ఆ తొలి నాటి అభిమాన్యమే మళ్ళీ తలచినది,పిలిచినది ఆయన్ని స్వర కర్తగా. పాండవుల ప్రసక్తి, ఉనికి లేని ఈ రెండో సూపర్ హిట్ చిత్రంలో ఈ హిట్ సాంగ్ కి ‘భీమ్’ పలాస్ రాగం కూర్చడానికి కారణం బలమైన ఈ స్వర భీముడు కావచ్చు, పలుకుల పలాస జీడిపప్పు కావొచ్చు. మధ్యలో సహజమైన చిరుకోపం వల్ల రాజేశ్వరుడి నుంచి వెంకటేశ్వరుడి చేతుల్లోకి మారిపోయింది చిత్రపటం. అది వేరే విషయం. అభిమన్యుడి తరువాత ఉత్తరుడు దొరికాడు. న్యూ థియేటర్స్ వారిచ్చిన కొత్త అవకాశమిది. వీరు కొత్త కాదు. కాని కలకత్తా ఆయనకి కొత్త. అయినా ఆ నగరం కొత్త బాట చూపించింది. అక్కడ అప్పటి గాత్ర పహిల్వాన్ లైన కె.ఎల్. సైగల్ గళ సైగలు, పంకజ్ మల్లిక్ గళ గుబాళింపులు ఆకళింపు చేసుకున్నారు రాజేశ్వరులు. కథకులు చక్రపాణి లాగ ‘స్వరకులు’రాజేశ్వరులకి కూడా బెంగాలీ నచ్చేసింది, యిట్టే వచ్చేసింది. ఆ అనుభవమే తరువాతి కాలంలో బెంగాలీ మాతృక నుంచి తీసిన ‘ఆరాధాన’ లో ‘నా హృదయంలో నిదురించే చెలీ’ వంటి పాటకి జీవం పోసింది. ఈ పాట విన్న వారు వహ్వా ఏం చేశారండీ అని పొగిడితే 'అది మన ట్యూన్ కాదు సార్ ...కలకత్తా నుంచి తెప్పించారు' అని అన్నారట. కుండ బద్ధలు ఆయన తత్త్వం. రాజేశ్వరుడు మరచిపోలేని తీపి గురుతు – సైగల్ మహాశయుడు ఆయనకు బహూకరించిన హార్మోనియం. హార్మోనియం అంటే ఆరో ప్రాణం అనుకునే వారిలో పెంచలనరసింహారావు, భీమవరపు నరసింహారావు ,రాజేశ్వర రావు, మాస్టర్ వేణు, సుసర్ల వారు, ఘంటసాల, పెండ్యాల, టి.వి.రాజు, ఎమ్మెస్ విశ్వనాథన్, చలపతిరావు, గోపాలం, జి.కె.వెంకటేష్, రమేష్ నాయుడు, పుహళేంది, కోదండపాణి, రాఘవులు,చక్రవర్తి, ,ఇళయరాజా వంటి వారి పేర్లే వినిపిస్తాయి. ‘అమ్మ నీ యమ్మ’ వంటి పాటలుండే ఈ కాలంలో ‘హార్మోనియమా, అదేమిటి?’ అనే ప్రశ్న రావొచ్చు. అలాంటి హార్మోనియం సాయంతోనే విదేశీ బాణీకి దేశవాళీ తనం జోడించి ‘హలో హలో ఓ అమ్మాయీ’(ఇద్దరు మిత్రులు), ‘ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది’ (చిట్టి చెల్లెలు), ‘అందేను నేడే అందని జాబిల్లి’ (ఆత్మ గౌరవం) వంటి పాటలు కూర్చిన చతురుడు రాజేశ్వరుడు అంటే ఆశ్చర్య పోదూ నవ తరం? ఎన్నో చిత్రాల్ని తన స్వర రచనలతో జయ ప్రదం చేసిన రాజేశ్వరుడుకి సంగీత దర్శకుడిగా దక్కిన తొలి చిత్రం ‘జయప్రద’. ఎప్పటి మాట! 1939 నాటి మాట. మూడు దశాబ్దాల తరువాత ‘జయప్రద’ అనే పేరు ఒక నటికి మారు పేరు కావడం విశేషం. ‘ఈనాటి బంధం ఏ నాటిదో’ అని అనుకోబట్టే అదే జయప్రద ‘ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు? పూలిమ్మని రెమ్మ రెమ్మకు’ అనే పాటని అవలీలగా అభినయించింది.( కనులు చూసినా పాటే) స్వరకర్తగా ఆయన నిలదొక్కుకున్నది మాత్రం ‘ఇల్లాలు’ తోనే. ఇల్లాలు అంటే గుర్తొస్తుంది – ఈయన రాజేశ్వరుడు అయితే ఈయన భార్య రాజేశ్వరి. అందుకేనేమో ఆయనలో ఆ రాజసం! ఇల్లాలు చిత్రంలో రెండు జంటలు ఉండగా పడుచు జంటగా రాజేశ్వరరావు, బాల సరస్వతీ దేవి నటించారు. ఆమె సరస్వతీ దేవి కాదేమో, స్వర సతీ దేవి. తండ్రి రాసిన ‘తుమ్మెదా ఒక్కసారి చూపించు నీ మోము’ వంటి పాటలతో అప్పటికే వీరి యుగళ గీతాలు ప్రసిద్ధం. ‘రాజేశ్వరరావుకి మెదడు నిండా సంగీతమే’ అంటారు బాలసరస్వతి. ఇంకా ఆయనెంత పిచ్చిమాలోకం అంటే ఘంటసాల గారు వస్తే వెనక కుర్చీ పట్టుకుని ‘మాస్టారూ కూర్చోండి’ అంటూ ఈయన తిరిగే వారట. అదేమిటండీ అంటే ఏం తప్పా అనే వారట. ఘంటసాల గారిని అందరూ పిలిచినట్టే ఈయనా ‘మాస్టారూ’ అని పిలిస్తే , ‘మీ ముందు నేనెంత? మీరు నన్ను అలా పిలవొద్దు’అని ఘంటసాల వారు అనేవారట. రాజేశ్వరరావు నిర్మొహమాటంగా అనేస్తారని ప్రస్తుతి. ఇలా మాస్టారు అనగానే ఆయన అన్నారట- ‘లేదండీ...నేను కూడా నలుగురితో నారాయణ అనాల్సిందే’! నారాయణ అని ఆయన సముచితంగానే అన్నా ఆయన మాత్రం ఈశ్వర త్రయం అనదగ్గ మిత్ర బృందంలో (జన్మ సంవత్సర తిథి ప్రకారం) రెండవ వ్యక్తి. ఇంతకీ ఎవరా ముగ్గురు ఈశ్వరులు? పెండ్యాల నాగ ‘ఈశ్వరుడు’, సాలూరు రాజ ‘ఈశ్వరుడు’,'ఘంటసాల వెంకట 'ఈశ్వరుడు'. రాజేశ్వరుడు కట్టిన ఆ-రుద్రుని మాట 'అందుకో మా గుడ్ బై', మహదేవుడు కట్టిన ఆ-రుద్రుని మరో మాట 'టాటా..వీడుకోలు...గుడ్ బై ..ఇంక సెలవు' చక్కగా ఆలపించిన కడపటి 'ఈశ్వరుడు' అతి తొందరగా కైలాసం వైపు తరలి పోయారు. ఘంటసాల మాస్టారు దివంగతులైన సాయంత్రం సాలూరు వారు, పెండ్యాల వారు తెల్లవారేవరకూ విలపిస్తూనే ఉండిపోయారట. అలాగే మంచి స్నేహితుడు సుబ్బురామన్ చిన్న వయసులోనే కన్నుమూస్తే రాజేశ్వరరావు తట్టుకో లేకపోయారట. పాడుతా తీయగా –టీవీ ప్రోగ్రాం లో రాజేశ్వరరావు భోళా తనం గురించి బాలసుబ్రహ్మణ్యం గారు చెబుతూ అనేవారు- ఈయన ఎవరైనా నిర్మాత కాపీ చేయమని చెబితే తప్పదన్నట్టు ఆ ట్యూన్ కాపీ చేసి ‘ఆయన విదేశీ బాణీ చెయ్యమన్నారు. మనం కొంచెం మార్చాం అన్నమాట’ అని ఉన్నమాట అందరి ముందు అనేసేవారట. నిర్మాత సరదాగా ‘ఏమిటి సారూ, కాపీ చేశారు’అంటే ‘మీరు మాత్రం సినిమా సన్నివేశాలు మక్కీకి మక్కి కాపీ చెయ్యరూ?’ అని వేసే తిరుగు బాణ చాతుర్యం సాలూరు వారిది. అసలు సందిస్తే చాలు విదేశీ సినిమాలు చూసేయడమే ఆయన లక్ష్యం అన్నట్టు ఉండేది కూడా. రాజేశ్వరరావు స్వరకల్పన అంటే మహాకవి శ్రీశ్రీకి వల్లమాలిన ఇష్టం. తొలి తెలుగు డబ్బింగ్ చిత్రంగా ‘ఆహుతి’ చరిత్ర సృష్టిస్తే ఆ సినిమాకి మాటలు,పాటలు కూర్చింది శ్రీశ్రీ , స్వరాలు ‘మార్చి’ కూర్చింది రాజేశ్వరుడు. నీరా ఔర్ నందా అనే మూడు పదాల సినిమాని మూడక్షరాల ‘ఆహుతి’ గా డబ్ చేస్తే సినిమా మాత్రం డబ్బు చేస్కో లేదు. క్షేత్రయ్య రచనేమో అని భ్రమ పడేలా రాసిన ఒకే ఒక్క జావళీ ‘నిను చేర మనసాయెరా నా సామి’ (బొబ్బిలియుద్ధం) కానివ్వండీ, ఆత్రేయ రచనేమో అని భ్రమ పడేలా రాసిన ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై’ (డాక్టర్ చక్రవర్తి) పాట కానివ్వండీ మహాకవి శ్రీశ్రీ కి ఎంత పేరు తెచ్చిపెట్టాయో అంత పేరు వాటిని స్వర పరచిన రాజేశ్వరుడికీ తెచ్చిపెట్టాయి. ఒక విడుదల కాని సినిమాకి ఎప్పుడో తండ్రి స్వర పరిచి పెట్టిన పల్లవి ట్యూన్ తీసుకుని ఆయన కుమారుడు కోటి ‘నువ్వే కావాలి’ సినిమా పాట ‘ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది’ స్వర పరిచారట. నిజమే- రాజేశ్వర రావు మన మధ్య లేకపోయినా మన పక్కన ఉన్నట్టే ఉంటుంది , అటువంటిది ఒక కొడుక్కి తండ్రి ప్రేమ నిత్యం వెంట వస్తూనే ఉంటుంది. నటన, సంగీతం – కళాకారుడి నాకర్షించే రెండు రూపాలు. ఒకసారి నటన రుచి చూసాక ఆ వాసనలు ఆకర్షిస్తూనే ఉంటాయి. ఇదిగో- అప్పుడే జెమిని వాసన్ (జెమిని – అంటే మిథునం – అంటే ద్వయమే కదా. వారి లోగో చూస్తే ఇద్దరు బాలురు బూరా లూదుతూ కనిపిస్తారు కదా! ) హిత బోధ చేశారట. పంతొమ్మిదేళ్ళ ప్రాయంలో జెమినీ స్టూడియోలో చేరి ఏడేళ్ళు ఆస్థాన విద్వాంసుడిగా ఉండి పోయారు రాజేశ్వరుడు. ఆదినారాయణరావు గారికి అంజలి వారి ‘సువర్ణ సుందరి’ లాగ రాజేశ్వరరావుకి జెమిని వారి ‘చంద్రలేఖ’ ఒక వరం. అందులో ఢంకాల పైన నాట్యానికి ఆయనిచ్చిన నేపధ్య సంగీతం అప్పటికే కాదు ఇప్పటికీ అబ్బురమే. ఆకాశవాణి లో రజనీ, దేవులపల్లి వారల సాహచర్యం ఒక స్నేహ ‘వాహినీ’ కాగా బి.ఎన్.రెడ్డి ‘మల్లీశ్వరి’ చిత్రం ఒక వారధి అయ్యింది రాజేశ్వరుడికి. దేవులపల్లి వారు మాటలు రాసిన ఏకైక చిత్రం మల్లీశ్వరి. పాటలు రాసిన తొలి చిత్రం మల్లీశ్వరి. దేవులపల్లి వారు పాటలు రాయని ఏకైక బి.ఎన్. చిత్రం ‘రంగులరాట్నం’. సంగీత సహాయకుల పేర్లను సంగీత దర్శకుడితో పాటు వేయించే దొడ్డ గుణం బి.ఎన్. గారిది. అందుకే మల్లీశ్వరి చిత్రంలో రాజేశ్వరరావు పేరుతో పాటు అద్దేపల్లి రామారావు పేరు వస్తుంది. రంగుల రాట్నం, బంగారు పంజరం చిత్రాల్లో బి.గోపాలం పేరు వస్తుంది. ‘ఈయనకి కోపరేషన్ కన్నా కోపమెక్కువ’ అని అలిగిన భానుమతి గారు తరువాత ఆయనలోని మేధావితనానికి జేజేలు పలికారు. ఆమె నటించిన ‘గృహలక్ష్మి’ చిత్రం తరువాత చాల ఏళ్ళకి తీసిన ‘తాతమ్మ కల’ చిత్రానికి కూడా రాజేశ్వరరావు గారే సంగీత దర్శకులు. అంతెందుకు, చక్రపాణి చిత్రంలో ఆమె స్వర పరచిన యమన్ రాగం - మెల్ల మెల్లగా చల్ల చల్లగా రావె నిదురా హాయిగా –పాట వింటుంటే రాజేశ్వర యమన్ పోకడలు కళ్ళ ముందు తారాడతాయి. ఊయలలూగినదోయి మనసే (బొబ్బిలి యుద్ధం), మా వారు శ్రీవారు మామంచి వారు (గృహలక్ష్మి), మనసున మల్లెల మాల లూగెనే (మల్లీశ్వరి), సా విరహే తవ దీనా (విప్రనారాయణ), రారా నా సామి రారా (క్షేత్రయ్య పదం) ...ఎన్నో యమునా కళ్యాణ గీతికలు ఆమె గళంలో మధు స్రవంతులు కావడం రాజేశ్వరరావు స్వర మహిమే. ‘దునియా రంగ్ రంగేలీ బాబా’ పాట చాయలు కనిపించే ‘బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే’ పాట నచ్చి హిందీ వెర్షన్ మిస్సమ్మ (మిస్ మేరీ) స్వర కర్త హేమంత్ కుమార్ ఆ వరసని అలాగే ఉంచేశారు. తరువాత ‘చిన్నారి పొన్నారి పువ్వు’ అనే సుదర్శన్ వరస కూడా హిందీలో యధాతధంగా రావడమన్నది రాజేశ్వరుడు తీసుకొచ్చిన వరవడి చలవే. శీలము కలవారి చినవాడా (పల్నాటి యుద్ధం), అనురాగపు కన్నులలో నను దాచిన ప్రేయసివే (జై జవాన్), ఏ తల్లి పాడేను జోల (కాలం మారింది) వంటివి 'హరి కాంభోజి' రాగంలో ఆయన స్వరపరిచినందుకు కారణం చిననాటి 'హరి' కథా గానమే నేమో! సినిమా పేరు 'కులగోత్రాలు' కావడం అటుంచి చూస్తే, పేకాట వంశాచారంగా చెప్పుకునే మాధవపెద్ది సత్యం నోటనే 'అయ్యయో చేతిలో డబ్బులు పోయెనే' అని పలికించడం ఎంత సరదా చమత్కృతి! 'జియవో' అనే హిందీ వరస లాగితే ఇంత గొప్ప డొంకని కదిలించవచ్చు అని ఎవ్వరూ ఊహించలేక పోవడం ఉందే- అదే రాజేశ్వరం! రాజేశ్వరరావు సంగీతంలో ఎప్పుడెప్పుడా తన పాట అని ఊహా డోలికలు ఊగుతున్న ఆ 'బాల' సుబ్రహ్మణ్యుడికి 'చిలిపి నవ్వుల నిను చూడగానే వలపు పొంగేను నాలోన' పల్లవి కన్నా 'ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో నిన్ను నే చేరుకున్నాను' అనే అనుపల్లవే ఇష్టమై ఉంటుంది. కలవరించిన గాయకుడి కల వరించినది అప్పుడే అయినా 'మ్రోగింది కళ్యాణ వీణ' ఆటు పిమ్మటే, 'కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణ' ఆ తరువాతే. వీణ వాయించే రంగారావు అనే ఆయన వీణ రంగారావు గా ప్రసిద్ధులైనా అసలు వీణ పాటలంటే అవి రాజేశ్వరుడి స్వరాస్తులు. పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా, ఏమని పాడెదనో ఈ వేళ' అని విప్లవ కవి శ్రీశ్రీ గారి లోని లాలిత్యానికి పెద్ద పీట వేసిన రాజేశ్వర రావంటే మహాకవి శ్రీశ్రీకి అలాగ కూడా వల్లమాలిన అభిమానమే. బాపు గీతల్లో కనిపించే 'ఒకాయన' ఆహార్యం బట్టి చూస్తేనే యిట్టె తెలిసి పోవాలి ఆయన ఎవరన్నది. 'పాట పాడుమా కృష్ణా పలుకు తేనెలొలుకు నటుల ..మాటలాడుమా ముకుందా మనసు తీరగా' అని ఆ గొంతు మడిచి వేసిన భీమ పలాస్త్రీ ఎంత కుస్తీ పట్టి విప్పినా దక్కదు అన్యులకి. అందుకే సాక్షాత్తు శ్రీకృష్ణుడే అంటాడట -' నీ అంత హాయిగా నే పాడగలనా? నే మురళి నూదెద, నీవు పాడుము పాట'. ఎన్ని చెప్పినా చాలదు ...ఎందరు ఎంత చెప్పినా వెలితే. ఆయన సంగీత చుట్టుకొలత, హృదయ వైశాల్యం, గాన ఘన పరిమాణం కొలిచేందుకు మనం మిగిలి ఉన్నాం...అంతవరకూ మనం అదృష్ట వంతులం. అక్టోబర్ అదృష్టమో,దురదృష్టమో చెప్పలేని ద్వంద్వ ఘటనలు జరిగాయి. 1921 అక్టోబర్ 12 న రాజేశ్వర భూలోక సంచారం, 1999 అక్టోబర్ 26 న ర'సాలూరు' రాజేశ్వర / 'రాగే'శ్వర/ రాజే'స్వర' కైలాస ప్రస్థానం. ఏడు స్వరాలనటూ ఇటూ విడ దీసే మధ్యవర్తి 'మ' కారం ఎంత గొప్పదీ.. కత్తికి రెండు వైపులా పదునే అని చెప్పగలదది. ఇప్పుడు 'మమ' అనుకుందాం- ఎందుకంటే: కనులు మూసినా పాటే - ఎనిమిది సిరుల మూట! నలభైల నాటి చెంచు లక్ష్మికి, యాభైల నాటి చెంచు లక్ష్మి కి ఆయనే స్వర కర్త. భక్త ప్రహ్లాద లోని పాటలూ,పద్యాలూ ఆహ్లాదకరంగా ఉండటానికి కారకులు రాజేశ్వరులే. రెండవ చెంచులక్ష్మి లోని ప్రహ్లాదకి, భక్త ప్రహ్లాదకి అదే సుశీల గాత్రం. అదే పోతనామాత్యుడి మందార మకరందం. రెండు ఉప రూపాల ఏక రూపం. 'నిలువుమా నిలువుమా నీలవేణి ...తడబడే అడుగుల' అని ఒకనాడు 'బహుదారి' లో ఆపిన రాగాల కానిస్టేబుల్ మరునాడు 'నడు నడు నడచిరా హంస వలె' అని అదే రీతిలో ఆహ్వానించడం చోద్యమే, సుశీలమ్మ నాడూ మరునాడూ 'ఆఆ ఆ ఆ ' అని వెనక నిలిచి ఆలపించడం రాగ దైవానికి సమర్పించిన నైవేద్యమే. 'గాంధారి గర్వ భంగం' డబ్బింగ్ చిత్రం నాటికి, అదే వినూత్న 'బాల భారతం' చిత్రంగా మారిన నాటికి స్వర కర్త చిత్రంగా రాజేశ్వరులే. శ్రీశ్రీ మాటల హారానికి ఆరుద్ర చెక్కిన నగిషీ, నాటి మరునాటి పాటలు తానె పాడిన ఘంటసాల మనీషి - వేటికవే హై,లో అనే తేడా లేక సాగి పోయే హైలో హైలెస్సలు. మ్రోగింది కళ్యాణ వీణ - సుభద్రార్జున యుగళ గీతం అయితే 'నీ వలపే బృందావనం నీ పిలుపే మురళీ రవం' అని రాధాకృష్ణులు ఇంచుమించు అదే రాగ ఛాయలో మరో సందర్భంలో పాడడానికి కారణం - కురుక్షేత్రం చిత్రంలో శోభన్ కృష్ణుడు, కృష్ణ అర్జునుడు. అప్పుడు కృష్ణుడు పాడలేదు. అందుకే శోభన్ నటించిన రాధాకృష్ణ చిత్రంలో ఆ లోటు భర్తీ చేశారు రాజేశ్వరులు. కనులు చూసినా పాటే- అనుకుంటే నాటి రాజేశ్వర హిందీ 'చంద్రలేఖ' విశేషాలున్నాయి. నాటి ప్రియురాలు (చంద్రలేఖ) ప్రియునితో వెన్నెల్లో సంబర పడిన దానికి, మల్లీశ్వరీ నాగరాజులు అదే వెన్నెలంటే ముచ్చట పడడానికి పోలిక ఉంది. మందార మకరంద మాధుర్య గళంతో డబ్బింగ్ కే పరిమితం అయి పోయిన రోజారమణిని, 'సత్తెకాలపు సత్తెయ్య'లో శాంతమ్మా ...ముద్దు ముద్దు నవ్వు ..అని అదే చిన్నారి రోజారమణికి జోల పాడిన చలంని హీరోయిన్, హీరోలుగా చూడాలనుకుంటే 'లంబాడోళ్ళ రాందాసు' సినిమా ఉంది. 'ఈ పాల వెన్నెల్లో' మళ్ళీ నూతన వెలుగు ధారలు కురిపించిన రాజేశ్వర శైలి ఉంది. శ్రోతల హృదయాల్లో కలిసిన గాయనిగా సుస్వర వాణీజయరాం కి (యమునా తీరం, ప్రణయం అనడంలో ఆమె పలికిన యకారం వైపు, పకారం వైపు రాజేశ్వరులు ఎలా చూసి ఉంటారో! ) తప్ప సినిమా పేరుకి గుర్తింపు నివ్వని రాజే'స్వర' మాధుర్య మార్కు పాట కూడా ఉంది. అన్నీ ముగిసాక 'ఓహో యాత్రికుడా' అని పిలిచే అదృష్టం లేదే అనే బాధ మిగులుతుంది. అయితేనేం? స్వరాధనాలయం వైపు చూస్తే ఆయన పాటల ధ్వజ స్తంభం 'ఇది నీవు నేర్పిన గానమే' అని గంట మ్రోగిస్తుంది. రాగ దేవుడికి శతకోటి వందనాలు. -డా.తాతిరాజు వేణుగోపాల్ , 26 అక్టోబర్ 2013 (బాపు బొమ్మ సౌజన్యం: విశాఖ పట్నం శాస్త్రి గారు. రచనకి ఊత: చిన్నారాయణ పెద్ద పుస్తకం, ఇతరులవి కొన్ని. అందరికీ కృతజ్ఞతలు)
1 Comment
DESHAVENI SHANKAR
31/8/2022 08:18:12 pm
ఎంత చక్కగా వివరించారు మాస్టారు గారు. శత సహస్ర ప్రణామాలు.
Reply
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|