మునుపటి నా మాట
ఫాల్గుణ బహుళ తదియ (తృతీయ) తిథి - మన దేశ చరిత్ర సంపదలో ఒక పెన్నిధి. ఎందుకంటే ఈ తిథిని ఒక మరాఠా తేజం పుట్టింది. అది భోంస్లే రాజ వంశానికే కాదు యావత్ ప్రజానీకానికీ గర్వ కారణం. షాహాజీ, జిజాబాయిల కడపటి (అయిదవ) సంతానమది. భవానీ మాత వర ప్రసాదమది. అందుకే పేరులో శివ శబ్దముంది. శివనేరి కోటలో అప్పుడు ఉదయించిన ఆ పసివాడి తేజస్సు మరిన్ని వెలుగులు వెదజల్లుతుందని ఎవరూహించ గలిగారో గానీ వారు ధన్యులే. తండ్రిలో అమిత శక్తి ఉంది. తల్లిలో అలౌకిక భక్తి ఉంది. రెండూ కలిసి ఆ పసివాడిని ఒక విశిష్ట వ్యక్తిగా తీర్చి దిద్దాయి. శివాజీ అంటేనే ఒక సంస్కృతి, ఒక దుర్గం, ఒక భరోసా- అని ముద్ర వేసుకున్నాయి. చిన్నతనం నుంచే గోమాజీ దక్షతలో పెరిగి సద్గుణ సంపన్నుడయ్యాడు. స్వామి సమర్థ రామదాసు వారి సన్మార్గ బోధలు విని ఆచరించిన వాడు,గురువులు దాదాజీ కొండ్ దేవ్ దగ్గర సైనిక శిక్షణలో మెళకువలు నేర్చిన వాడు, జ్ఞానేశ్వర్, తుకారాం వంటి వాగ్గేయకారుల (సంత్) నుండి సాధారణ 'జీవన శైలి' అనుసరించిన వాడు కనుకనే శివాజీ అసామాన్యుడయ్యాడు. పదునాలుగేళ్ళకే 'రాజ ముద్ర' పొంది పుణే పరిసర ప్రాంతాలకి అధిపతి అయినవాడు, మన భూమి పైన 'పర పీడన' ఎందుకు అని ఆనాడే మదిని పదను పెట్టి ఆలోచించిన వాడు, తండ్రి తల వంచితే తాను మాత్రం నవాబు ముందు తల ఎత్తుకునే సింహంలా రాజస ఠీవి తో వెన్ను వంచక వెను తిరగక నడిచి వెళ్ళిన వాడు- ఆ బాలుడే. అప్పుడా బాలుడి వయస్సు కేవలం పదహారేళ్ళే. దక్కను ప్రాంతమే కాదు డిల్లీ సుల్తానులు సైతం ఒక్క ఈ వీరుడి పేరెత్తితే చాలు గజ గజ గజ లాడే వారట. అతని 'అశ్వశక్తి' అమోఘం. 'ఖడ్గ విద్య' అద్వితీయం. కోటేరు ముక్కు, తీరైన గెడ్డం అతని బాహ్య రూపం. సహనం, పౌరుషం, విచక్షణ అతని అంతర్ రూపం.
ఒకటి కాదు, రెండు కాదు - మూడు వందల దాకా కోటలు సమకూర్చుకున్నవాడు. కొన్ని స్వయంగా నిర్మించాడు. కొన్నిటిని పునర్నిర్మించాడు. ఇప్పటికీ భీమా శంకర్ ప్రాంతంలోని 'రాజ్ మాచీ' , పుణే లోని పురందర్,తోర్నా,సిమ్హ్ గడ్, కొండాన కోటలు, సహ్యాద్రి కొండల నడుమ శివాజీ రాజధాని అయిన 'రాయగడ్' కోట, ఇప్పటికీ చెక్కుచెదరని సౌందర్యంతో కనువిందు చేస్తున్నాయి. రాయగడ్ దుర్గంలోనే 1674 జూన్ 6 న శివాజీ మహారాజ్ కి పట్టాభిషేకం, 'ఛత్రపతి' బిరుదు ప్రదానం, 'హైందవి స్వరాజ్' స్థాపన, 'శివ సూత్ర' ప్రతిపాదన జరిగి అవి భావి దేశ చరిత్రకి ఆనవాళ్ళయ్యాయి. ఓటమి ఎరుగని వీరత్వం, ఓర్మి, ధర్మ రక్షణ, మంచితనం ఉంటే మతాతీత స్నేహం పంచటం, వంచనకి వంచనతోనే సమాధానం చెప్పటం - ఇవన్నీ శివాజీ మహారాజు జీవిత గమనంలో ఆశ్చర్య పరిచే అద్భుతాలుగా ఖ్యాతి పొందాయి. రామాయణ, మహాభారతాలు చిన్ననాడే ఆపోసన పట్టినవాడు కనక మంత్రి కూటమి అంటే ఎనిమది మందిచాలు అనుకునీ వారి సలహాలతోనే రాజ్యమేలిన వాడు శివాజీ మహారాజ్. ఈ మంత్రుల పదవుల పేర్లు కూడా సంస్కృత నామాలే ఉండేటట్టు చూసుకున్న దేశ భక్తుడు. తనకి సుపరిచితమైన పశ్చిమ తీరంలో 'నౌకా దళ వ్యవస్థ'కి నాంది పలికిన వాడు. శివాజీ వ్యక్తిత్వం ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం ద్వారా మరింత ఉన్నతమైంది. అందుకే ఇప్పటికీ మహారాష్ట్రలో స్త్రీని స్నేహమయిగా చూస్తారు. శివాజీ తన మాతృమూర్తికిచ్చిన విలువ బహుశా చరిత్రలో ఇంకే రాజూ ఇచ్చి ఉండడు. ఆ మహనీయుడి తల్లి పుణే లోని సోమేశ్వర వాడి లో కొండ లోయలో ఉన్న ఈశ్వర మందిరానికి వచ్చి పూజలు చేసే వారట. ఇప్పుడక్కడ ప్రతి శివరాత్రికి ఎంతో వైభవంగా అభిషేకాలు జరుగుతాయి. అలాగే సింధు దుర్గ్ కోటలో మూడు వందల నలభై ఏళ్ల పై చిలుకు నాటి శివాజీ నిర్మించిన శివ రాజేశ్వర మందిరం ఇప్పటికీ ఉంది. వీటి సంరక్షణ పట్ల నిర్లిప్తత తగని పని. భక్తీ శక్తీ రెండూ కలబోసుకున్న శివాజీ పుట్టిన రోజు విషయంలో తగినట్టుగానే సౌర మానం, చంద్ర మానం రెండూ పోటీ పడ్డాయి. అందుకే ఆ మహనీయుడి, ఆ మహారాజువి రెండు పుట్టిన రోజులు - గ్రెగేరియన్ కేలండర్ ప్రకారం 1627 ఫిబ్రవరి 19 న ఒకటి, చాంద్రమానం ప్రకారం ఫాల్గుణ కృష్ణ తృతీయ తిథి ని మరొకటి. ఛత్రపతి శివాజీని రెండు సార్లు ఎందుకు , ఎన్ని సార్లు తలుచుకున్నా రోమాంచితమే. శివాజీ మహారాజ్ కేవలం అయిదు పదుల కాలమే జీవించాడు. అలా జీవించి మన సంస్కృతిని మరో వెయ్యేళ్ళు కాపాడుకొమ్మని చెప్పి, చూపించి శివ సాయుజ్యం పొందాడు. ఆ మహారాజుకి ఇవే కైమోడ్పులు. మరాఠీ సినిమా రంగం కంటే నాటక రంగానికి ఇప్పటికీ ఆదరణ ఉంది. 'నాట్య సంగీత్' అనేది ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నదే. శివాజీ చరిత్ర మీద వచ్చిన తొలి మరాఠీ చిత్రం లోని పట్టాభిషేక సన్నివేశం 'వీడియో' చూడండి. అందులో గాన కోకిల లత చిరు నవ్వు దివ్వెతో కనువిందు చేస్తుంది. శివాజీ గా నటించిన వారు- చంద్రకాంత్. ఇక దక్షిణ సినిమా రంగంలో శివాజీ పాత్రకి పెట్టిందే పేరు - శివాజీ గణేషన్. అసలు ఆ పాత్రతోనే ఆయన పేరు మారిపోయిందని అంటారు. అటువంటి గణేషన్ మళ్ళీ భక్త తుకారంలో శివాజీ గా దర్శన మిచ్చారు.వీడియో చూడండి. చెవులకీ ఇంపు - ఒక మరాఠీ సినిమా గీతం, ఆ గీతం నుండి ప్రేరణ పొందిన తుకారాం సినిమా గీతం రెండూ కలిగిస్తాయి. ఆడియోలు వినండి. 'తుకారాం బీజ్' - అంటే భక్తుడు తుకారాం పండరీశునిలో ఐక్యం కావడం కూడా ఫాల్గుణ బహుళ విదియ నాడే కావడం విశేషం. ముక్తాయింపు లో ఇంపైన వార్త: బాబా సాహెబ్ పురందరే అనే శివాజీ అభిమాని ఒక విశేష యజ్ఞం తలపోశాడు. అది- పుణే సమీపంలో అంబేగా(వ్ అనే పల్లెలో ఈ ఏడాదికల్లా 'శివసృష్టి' అనే బృహత్ నిర్మాణం పూర్తి చేసి మహారాజుకు సంబంధించిన సకల విషయ పరిజ్ఞానం అక్కడ ప్రదర్శించాలన్న తలపు. ఆచరణలోకి వచ్చిన ఈ ప్రయత్నం ఎంతో హర్షణీయం. రాబోయే తరానికి కాబోతోంది రమణీయం. -డా. తాతిరాజు వేణుగోపాల్, 22 మార్చి 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|