మునుపటి నా మాట
నిత్య వసంతుడు అక్కినేని వారికి హిందీ అభినందనలు – కొత్త వసంతంలో తక్కిన వారికి తెలుగు శుభాకాంక4/4/2011 ‘అతడక్కినేని ధీనిధి’ – ఈ పలుకులు సరస్వతీ గిరి గారివి. అంటే ఒకప్పటి భారత రాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి గారి సతీమణివి. గిరి గారంటే బరంపురం వారనీ మాకో గర్వం. గిరి గారి నమస్కార ముద్ర భలే తమాషాగా ఉండేది. జోత అనేది మొహానికి అడ్డుగా ఉండకుండా చూసుకునేవారు. ఇప్పుడు దాసాహేబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత, పద్మవిభూషణ్ డాక్టర్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి కొత్తగా జోతలు ఎందుకో అనుకునేవారికి కొంత సమాచారమివ్వాలి. డాక్టర్ అనేది రెండుసార్లు దొర్లింది, ప్రింటింగ్ తప్పు కాదు. నిజమది. ఇటీవల ఆయనకి దక్షిణ భారత హిందీ ప్రచార సభ గౌరవ డాక్టరేట్ను చెన్నైలో జరిగిన 74వ వార్షికోత్సవ సభలో ప్రదానం చేసింది. తెలుగు సినిమా వయసు కూడా 75 సంవత్సారాలు దాటింది. అందులో మొదటి పదేళ్లు ఆయనవి కావు కనక అవి తీసేస్తే అప్పటినుంచీ ఇప్పటికీ ఎప్పటికీ యవ్వనుడు అక్కినేని. ఉగాది సందర్భంలో చెప్పాలంటే ‘నిత్య వసంతుడు’. మహాకవి కాళిదాస్ 'మేఘ దూత్' విరచిస్తే అక్కినేని ఆ 'మహాకవి కాళిదాసు' గా నటించి ఆనక 'మేఘ సందేశం' కూడా వినిపించారు. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఆయనకి 'కాళిదాస్ సమ్మాన్' ప్రకటించింది కూడా. అన్ని ఋతువుల ఋజువు అక్కినేని. అయితే అక్కినేనికి ఆమని తోనే ఎక్కువ అనుబంధముంది. వ్యక్తికే కాని నటనకి శిశిరం లేదని నమ్మే వ్యక్తి ఆయన. భగవంతుని మీద కన్న స్వయం కృషి మీద నమ్మకం పెంచుకున్న శక్తి ఆయన. అందుకే అ -అంటే అక్కినేని అన్నంత ఉన్నతంగా ప్రపంచ చిత్ర సీమ ఆయన్ని గుర్తించింది. అటువంటి మన నాగేశ్వరుడుకి 'పాటాభిషేకం' చేద్దాం. సువర్ణ సుందరి చిత్రంలో 'హాయి హాయిగా ఆమని సాగె' నెలాగో అదే హిందీ డబ్బింగ్ లో 'కుహూ కుహూ' మంటూ కోయిల కూసింది. ఈ రెండు పాటలూ కొన్ని ఋతువుల గురుతులు చూపిస్తాయి. ఆయన నటించిన మరో చిత్రం చూడకనే వసంత యామిని ఊహించుకుంటే 'పాడవేల రాధికా' అని మళ్ళీ అడగాలనిపిస్తుంది. అక్కడ కృష్ణుడు చాటుగా వింటూ ఇంక ఆగలేక తానూ గొంతు కలిపాడు. సుభద్ర కోసం అర్జునుడు వస్తే 'నవ వసంత గానమున, నవ వసంత రాగమున' మనసు పరిమిళించేలా అడుగులు పడతాయి. అక్కడే వస్తుంది కృష్ణార్జున యుద్ధం. అసలైన వసంత గలాటా మొన్ననే జరిగింది కదూ.
మొన్న రెండో తేదీన ప్రపంచ కప్పు 'గంభీరంగా' ఆడి గెలిచిన మన క్రికెట్ట్ వీరులు దేశానికే కొత్త వసంతం తీసుకొచ్చారు. వికృతి వెళుతూ వెళుతూ ఓ చేదునీ, కొన్ని తీపివీ జ్ఞాపకాలు మిగిల్చింది. ఇప్పుడొచ్చిన 'ఖర' పేరు బావులేదు. అయినా అరవై సంవత్సరాల కాల చక్రంలో ఇది తప్పదు. ఆటు పోటులుంటేనే సముద్ర గాంభీర్యం తెలుస్తుంది కదా. ఆరు ఋతువులున్నది ఇందుకే. తొలి ఋతువు వసంతం. ఆ తరువాతే గ్రీష్మం. మాసాల్లో మొదటిది చైత్రం. ఆ తరువాతే వైశాఖం. ఇలా మనకి ఆరు ఋతువులున్నాయి. అంటే ఒక్కొక్క ఋతువూ రెండేసి నెలలన్న మాట. ‘ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసేవసంత మొక్కటే’ అన్నది ఆరుద్ర వాక్కు. ఋతువూ, కాలం ఒకటేనా? వేసవి కాలం, ఎండా కాలం అంటాం. గ్రీష్మ కాలం అంటామా? కానీ వర్షర్తువు అనీ, వర్షా కాలం అనీ, వానా కాలం అనీ అప్పుడు మాత్రమె కాలం, ఋతువు ఒక్కటే అంటాం. ‘కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనే? అని పింగళి వారి సరదా ప్రశ్న. అది నచ్చి దేవులపల్లి వారు ‘తొందర పడి ఒక కోయిల ముందే కూసిందని’ ఆవేదనతో జవాబిచ్చారు. కోయిలకి వసంతంతోనే అనుబంధముంది. వసంత కోకిల అనే టైటిల్ కూడా అలా వచ్చినదే. ‘ ఏ వసంత కోకిలా వాన వేళ పాడదు’ అని వేటూరి వారు తీర్మానించారు కూడా. ‘నవ వసంతమున నందన వనమున కోయిల పాడిన పాటవో’ అని శ్రీశ్రీ తెలియని ఆమె గురించి పునర్జన్మ దాకా ఎందుకనీ వెంటనే తేల్చి చెప్పమన్నారు.. ‘నీకు నాకు స్వాగాతమనగా కోకిలమ్మ కూయగా – నవ వసంత రాగముతో నీవు చెంత నిలవగనే’ మనసు పరిమళించిందని పింగళి వారు స్పష్టం చేసారు. కాల మహిమ ఏమో గానీ వసంత వేళ, వసంత రాత్రి, వసంత మాసం ప్రత్యేకించి చెప్పుకోదగ్గవి. ‘ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలూగామే’ అని పాడుకున్న జంట ఆనందపుగూడుపుఠాణిని సినారె బయట పెట్టారు. అలాంటి ఆనంద సమయముంటే ‘మగువా అదియే వసంత వేళ’ అని ఒక జగత్ కిలాడీ ద్వారా దేవులపల్లి వారు కూడా గుర్తు చేసారు. ‘ఈ వసంత యామినిలో ఈ వెన్నెల వెలుగులలో –జీవితమే పులకించగా’ రాధికని పాడవేల అని ప్రశ్నించారు శ్రీశ్రీ, ‘ఏక వీర’ పేరుకు తగ్గట్టే ఏదైనా ఒకటే ఉండాలి కాబోలు - ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ ఒక్కటే కావడం దేవులపల్లి వారికి ఇష్టం. ‘అచ్చంగా వసంత మాసం వచ్చే దాకా’ ఆగాలన్నా ఆయనికి ఇష్టమే, నిట్టూర్పులో ఓదార్పుగా ‘వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం’ అని అనగలిగేదీ ఆయనే. కానీ తీరా సమయం మించిపోతే ‘రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం’ అని మాయని మమత తో నిట్టూర్చేదీ ఆయనే. మల్లెలకీ వసంతానికీ అనుబంధముంది. ’‘మల్లెలతో వసంతం’ సహజమనీ దేవులపల్లి వారన్నారు. ఆయనకి ‘ఏనాటికీ వసంతము ఈ తోటకింక రాదా?’ అని ఒకసారి సందేహం వచ్చింది. ఎందుకూ అంటే మల్లెలు లేక పోవడమే అయి ఉండవచ్చు. ‘మల్లీశ్వరి’ పేరుకు తగ్గట్టుగానే మనసున మల్లెల మాల లూగితే, కన్నుల వెన్నెల డోల లూగితే ఎంతో పొంగి పోయింది.. అయితే ఈ మల్లీశ్వరి నోట ఎక్కడా వసంతం అనే మాటే రానివ్వలేదు ఆయన. మల్లెలూ, వెన్నెల కలిసి ఉంటాయి తెల్లదనానికి అనే కాదు స్వచ్ఛతకి ప్రతీకలుగా. అందుకే ‘ఇది మల్లెల వేళయనీ, ఇది వెన్నెల మాసమని’ తొందర పడే కోయిల గురించి ఆయన ఆనక అంత బాగా చెప్పగలిగేరు. ( రామాయణంలో పిడకల వేట: వసంత మాసం అంటూనే వెన్నెల మాసం అంటారేమిటీ ఈయన? అని చిరాకు పడ్డ వారు ఉన్నారు. వెన్నెల మాసం అంటే కార్తీకం కదా అన్నది వారి విసుగుకి కారణం. కార్తీక మాసంలో కరి మబ్బు ఉంటుందా? అని ఈయనే ప్రశ్నించారు కదా అలా అయితే కార్తీకంలో కోయిలేమిటీ? కరిమబ్బు ఉంటే మయూరి నాట్యం చేస్తుంది. పింగళి వారు కూడా వసంత గాలి గురించి చెబుతూనే మయూరి ప్రస్తావన తీసుకొచ్చారు. కవి హృదయంలో ఇంత తికమక ఉంటుంది కనుక పింగళి వారే ‘భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్’ అని తేల్చి పారేశారు.) ఇంతవరకూ చెప్పుకున్న వసంతం ఏక వచనంలోనే ఉంది కదూ.. వసంతం అనేది బహు వచనంలోనూ రాణించింది. సినారె ‘వసంతాలు పూచే నేటి రోజు’ అని శాశ్వతంగా ఏ రోజు కైనా అన్వయించుకునేలా ఒకానొక జరిగిన కథ ఆధారంగా చెప్పారు. అంతకు ముందు రోజులతో పని లేని ప్రేమాటగాళ్ళని గుర్తు పెట్టుకునీ ‘ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి -వసంతాల అందాల ఆనందాల ఆడాలోయి ’ అని దాశరథి ఆత్మగౌరవం ఉన్న వాళ్ళని మాత్రమే ప్రోత్సాహించారు. కొన్ని దశాబ్దాల తరువాత ‘వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది ?’ అని వాపోయింది వేటూరి వారే. సిటీలో ‘సీటీ’ (ఈల) బజాయిస్తే పిటీ ఏ(విటంటే ఒక్క కోయిలా బదులివ్వదు. వసంతమా, ఏ(వి సంతరా బాబూ అనుకోవాలి. సంతలోని సరుకు అంతా నాది అంటే ఎలా? కానీ వసంతం అందరిదీ, బృందావనమది అందరిదీ అయినట్టు. ‘ఏ వసంతమిది ఎవరి సొంతమిది?’ అని వేటూరి వారు దబాయించి అడగ లేదూ? అందుకే ఎవరికీ వారే సొంతం చేసేసుకునీ వసంతం కుడివైపు ఎన్నో పదాలు చేర్చారు. ‘కల కల లాడెను వసంత వనమే’ అని శ్రీశ్రీ తెలియని ఆనందం కలిగిన ఉదయం స్పస్టం చేసారు. అలాంటి వసంత ఉద్యాన వనంలో గానం, నాట్యం రెండూ నడిస్తే ‘తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి, వసంత నాట్యమె హాయ్ హాయ్’ అనిపించడం సహజమన్నారు పింగళి. వీరే ‘నవ వసంత గానముతో (నీవు) నటన సేయగనే’‘నవ వసంత రాగముతో (నీవు) చెంత నిలవగనే’ మనసు పరిమళించడం కూడా కనిపెట్టారు. వసంతంలో ఒకరికి గానమనిపిస్తే మరొకరికి రాగమనిపించడమేమిటీ? రెండూ ఒకటి కావా? వేరే! ఎందుకంటే ఇక్కడ ‘రాగం’ అంటే రంగు. ‘కలసిన మనసుల కలరవములతో జీవితమంతా వసంత గాన మౌనులే’ అన్న ధృఢ నిశ్చయం కూడా ఆయనదే. కాబట్టే అలనాటి అనుబంధాన్ని విడవక ఒకానొక ఆధునిక భైరవ ద్వీపంలో సంగీతంకి గుడి చుట్టీ సింగీతం చేసి కవి ‘విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిలో’ అని మళ్ళీ కనుక్కో గలిగారు. గాలి విషయంలో పింగళి వారి ఊహలు మహాద్భుతంగా ఉంటాయి. ‘ఓ మలయా నిలమా—ప్రియురాలికి విరహాగ్ని పెంపు చేయవే’ అని గాలి అగ్నిని ఎగదోసే తనాన్ని ఎంత చిన్న మాటలతో తోట రాముడి నోట ఒకనాడు సెలవిచ్చారూ! అదే వసంతం అనే సరికి ‘వసంత గాలికి వలపులు రేగ’ తనువూ మనసూ ఊగీ తూగేయట. సింగీతం వారే చెబితే తెలిసింది- మాయా బజార్ లో మాయమైన పల్లవి 'కుశలమా కుశలమా నవ వసంత మధురిమా' అనేది ఒకటి ఉందనీ. వసంత చెలి, వసంత సఖి అని ఎవరూ పిలుచుకోలేదు కనుకనే దేవులపల్లి వారు ఒక వింత కథలో ‘అనుకోనీ—కరుణించిన కణ్వ తపోవనిలో విరబూచిన వసంతలక్ష్మి వనీ’ అని అనుకునే ప్రియుడిని గౌరవించారు. సినారె 'వసంత మూర్తి' వని పొగిడారు. వసంతమే ఆమని. చైత్ర మాసమే మధు మాసం. మధు అంటేనే తీపి. ఇంత ఎండల్లో ఇంట కూర్చునీ ఉంటే అంతకన్నా తీపి ఏముందీ? ‘ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో’(దేవులపల్లి) అన్నది మరో కవి వాక్కు. సినారె కూడా 'తోడుగా నీవుంటే - ప్రతి ఋతువూ మధు మాసం' అన్నారు. దేవులపల్లి వారూ అంతే-మనకోసం ప్రతి నిమిషంమధుమాసం కావాలి' అన్నారు. వేటూరి వారు 'ఆమనీ పాడవే హాయిగా' అని గీతాంజలి ఉపదేశించి తొందరపడి ఆమని రాకముందే రాలిపోయిన పువ్వై పోయారు, ఏ దేవుడి పాదాల చెంతనో ఉండేందుకు. సీతా రామ శాస్త్రి 'తరలి రాదా తనే వసంతం - తన దరికి రాని వనాల కోసం' అని ఎంత నమ్మకంతో చెబుతున్నారూ! అటువంటి నమ్మకంతోనే మరిన్ని వసంతాలకు ఆహ్వానం పలుకుదాం. -డా. తాతిరాజు వేణుగోపాల్, 04 ఏప్రిల్ 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|