మునుపటి నా మాట
శ్రీ రామ నామం ఒక్కటి చాలు – మన శరీరంలోని, మన మనసు లోని ‘ ఎనర్జీ’ రీ చార్జ్ కావడానికి. అందుకే ఆనాటి పెద్దవాళ్ళు పనుల మధ్యలో ‘శ్రీ రామ’ అంటూ అలసటని ఆవలకి నెట్టేస్తూ ఉండే వారు. త్రేతా యుగం, ఆ యుగం, ఈ యుగం అనే లెక్కలకు అతీతంగా ఉండే ఓ అద్భుత శక్తి రాముడు. శ్రీ రామ కథ అంటే మొత్తం రామాయణం, లేదూ అంటే రామాయణం లోని ప్రతి ఒక్క కాండ! రామాయణం కల్ప వృక్షం. ఒక్కొక్క కాండ ఒక శాఖ. అందుకే వాల్మీకి రామాయణం ‘నిత్య’ పారాయణం చేయడం ఎందరికో ఇష్టం. కానీ కొందరికి సంస్కృతం అంటేనే చాల కష్టం. ఇదిగో ఇటువంటప్పుడే ఒకరు మంచిని బోధిస్తే ఆ సారాన్ని వారి వారి భాషల్లో తెలియ జేయడం అనేది గొప్ప గొప్ప మేధావులు చేసే పని అని తెలుస్తుంది.. ఉత్తర భారతాన అంటే తూర్పు ఉత్తర ప్రదేశ్ లో అవధి భాష ఉంది. తన భాషలో వాల్మీకి రామాయాణ గాధని సరళంగా చెప్పాలని తపన పడి సరిగ్గా శ్రీ రామ నవమి నాడే ( 1574 లో) శ్రీకారం చుట్టేడు తులశీ దాస్ గోస్వామి. అప్పటికి ఆయన వయసు నలభై రెండేళ్ళంటారు. అదే ‘శ్రీ రామ చరిత్ మానస్’ అంటే శ్రీ రామ లీలా మానస సరోవరమన్న మాట. చాలా చోట్ల ‘తులసీ రామాయణం’ అని అంటారు. ‘ఇదీ ఒక కావ్యమా’ అని ఆ తరం పెద్దలు ఈసడించుకున్న వారూ ఉండే వారట. చదవగా చదవగా అందులో భక్తి, జ్ఞానం, ముక్తి లేదా మోక్షం అనే మూడు అంశాలు ఉన్నాయని తెలుసుకునీ, తేల్చుకునీ ఆనక వేనోళ్ళ కొనియాడేరట. ఏడు అధ్యాయాల ఈ గ్రంధం సుమారు రెండున్నర ఏళ్లలో అయోధ్య, వారణాశి ప్రాంతాల్లో ఉంటూ రాసి పూర్తి చేసాడట ఆయన. కావ్య నియమం లో చౌపాయీ, దోహా, ఛంద్ ప్రయోగించాడు. ఈ దోహా మన ద్విపద లాంటిది. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, లంకా, ఉత్తర కాండలు రాసి వాల్మికి చెప్పిన లవ కుశ ఉదంతం మాత్రం విడిచి పెట్టేడట తులసీ దాస్. కారణం- అంత ‘సుకుమార ప్రేమ మూర్తి’ గా తను చిత్రించిన ‘సీతామాయి’ని కష్ట రూపంలో చూపించడం ఇష్టం లేక. బాల కాండ నిడివి కూడా ఎక్కువగానే ఉన్న శ్రీ రామ చరిత్ మానస్ లో లౌకిక, పారమార్ధిక భావ తరంగాలు సమ ఉజ్జీలుగా విరుచుకు పడుతుంటాయి. దక్షిణ భారతాన మనకి మన భాషలో ‘మొల్ల రామాయణం’ ఉంది. ఆమె కూడా తులసీ దాస్ మాదిరి గానే ఆనాటి పెద్దల చులకనాస్త్రాలు ఎదుర్కొంది. సరళం పానకం రుచి. కఠినం నారికేళ పాకం. ఎందరికో సరళ మార్గాలు నచ్చవు.
శ్రీ రామ నామం స్మరించడం ఒక ఎత్తు. ఆ నామ గానం మరో ఎత్తు. ‘రామ కథ’ అన్నా హరి కథే కదా. అందుకే ఎన్నో హరికథలు రామ పరంగా అలరించాయి. తాళ్ళపాక అన్నమాచార్యులు ‘ఇతడే పరబ్రహ్మ మిదియె రామ కథ’ అని మూడు చరణాలలోనే ముచ్చటగా ముగించారు రామాయణాన్ని. భద్రాచల రామదాసు రామ కథ మకుటంతో రాయక పోయినా ‘ఎంతో మహాను భావుడవు నీవు’ అంటూ అయిదు చరణాలలో ‘రామాయణము’ అనే అయిదు అక్షరాల సారం ఇమిడ్చేరు. అలాగే ఇరవై నాలుగు కేశవ నామాల పరంగా ‘చతుర్వింశతి నామ ప్రతిపాదక చూర్ణిక’ ప్రసాదించారు. ఇకతిరువారూరు త్యాగ రాజ స్వామి రెండు శతాబ్దాల వెనక శ్రీ రామ ‘విగ్రహ’ శక్తినుంచే నిగ్రహంతో రామానుగ్రహం పొందగలిగిన మహానుభావుడు. ‘వినయమునను కౌశికుని వెంట చనిన’ శ్రీ రాముని ఆపాదమస్తకమూ రామాయణ అంశాలతో కొనియాడుతూ ఆ ఒక్కొక్క శరీరాంగ విశేషము చూచే దెన్నటికో అని త్వరపడే భక్తుడి ఆరాటంలోని భక్తి, జ్ఞానం, మోక్షం మూడూ కళ్ళ ముందు ఉంచారు స్వామివారు. ఇక బమ్మెర పోతన సరే సరి. ‘పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామ భద్రుండట’ అని పద్య మందార మకరంద మాధుర్యాలు చవి చూపించారు. ‘నే /బలికిన భవహర మగునట /బలికెద వేరొండు గాథ బలుకగ నేలా?’ అని తృప్తి పడిన తపోధనుడు. లేకపోతే మరో రమ్యమైన రామాయణ కావ్యం పోతన నుండి మనకు దక్కేదే. ఇటు కనులకూ, అటు వీనులకూ విందు కూర్చ గలిగే ఛాయా శబ్ద చిత్ర సంపద ఇరవయ్యో శతాబ్ద తొలినాళ్ళలో దక్కినదే తడవుగా రామ కథ మరింత చేరువైంది సామాన్య ప్రజకి. ఆ సంపద నిక్షేపానికి కాపు కాసిన కవి త్రయమే సముద్రాల రాఘవాచార్యులు, మల్లాది రామకృష్ణ శాస్త్రి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి. మల్లాది వారు ఆంజనేయ జన్మకు తారకమైన శ్రీ రామ దివ్య కథను ఒకే ఒక్క సారి (వీరాంజనేయ,1968) వినిపించారు. మూడు చరణాల ఆ పాటలో అయోధ్య,అరణ్య, కిష్కింద కాండల ప్రస్తావన ఉండడం గమనించవచ్చు. కృష్ణశాస్త్రి వారి ‘సీతాపహరణ’ దృశ్య గానం (బంగారు పాప,1954) హరికథగా వినవచ్చు., శబరి నడుగుతూ చెప్పించుకున్న రామ కథ (భక్త శబరి,1960)లో బాల, అయోధ్య,అరణ్య కాండల సంక్షిప్త రూపం దర్శించవచ్చు. చివరి సారిగా ‘ఎన్నడేని సుఖమేని ఎరుగని సీతారాముల కరుణ కథ’ (శ్రీ రామ పట్టాభిషేకం,1978) లో లంకా కాండ విశేషాలు మూడు ఘట్టాలుగా వినిపించారు కృష్ణ శాస్త్రి గారు. అరుదైన విశేషం ఒకటుంది. అదేమిటంటే మహాకవి శ్రీశ్రీ చేత ఆచార్య ఆత్రేయ తన స్వంత సినిమా ‘వాగ్దానం,1961' కోసం ఒక ‘హరి కథ’ రాయించారు. శ్రీశ్రీ మాటల్లోనే ఆ ‘సీతాకళ్యాణ సత్కథ’ వివరాలు తెలుసుకుందాం. రాసిన శ్రీశ్రీకి, నటించిన రేలంగికి , ఆలపించిన ఘంటసాలకి ఆ పాట అపురూప మని చెప్పాలి. అచ్చం హరికథ ఎలా ఉంటుందో అలాగే పిట్ట కథలకి బదులు ఇతర కవుల వర్ణనలు చేర్చి శ్రీశ్రీ చేసిన రచనా ప్రయోగానికి పెండ్యాల వారి స్వర రచన మంచి ఫలితాన్నిచ్చింది. రావణబ్రహ్మ ప్రధాన పాత్ర గా తీర్చి దిద్దిన అలనాటి ‘సీతా రామ కళ్యాణం, 1961’ చిత్రంలో చిట్ట చివరి కళ్యాణ దృశ్యం పాట రూపంలో కళ్లకు కట్టినట్టుంటుంది. అద్భుతమైన సన్నాయి వాయిద్య నాదంతో అందలమెక్కిన ఆ పాట నేటి తరం వారు కూడా పెళ్లి విడిదికి అలంకారం గా అమర్చుకునేందుకు దోహద పడింది. బాలకాండకి విస్తృత రూపమే బాపు తీసిన 'సీతా కళ్యాణం, 1976'. ఇందులో రాముడు నిజంగానే మిత భాషి. సీత సిగ్గుల పూబంతి. రాముడు వేసే ప్రతి అడుగునూ ఒక దృశ్య కావ్యంగా చూపించే ప్రయత్నంలో రామ ఘట్టాలు ప్రతి పాటలోనూ విస్తరించుకున్నాయి. ఆరుద్ర, సినారెల భాషా జిగి గురించి ఆంధ్రులకి కొత్తగా చెప్పాల్సిన పనేమిటీ? లక్ష్మణుడు సీతమ్మను అడివిలో విడిచి పెట్టాల్సి వస్తున్న సందర్భానికి (లవకుశ, 1963) ఒక తత్వ గీతం రాసిన కొసరాజు శ్రీ రామ కథని హరికథగా (ఆదర్శ కుటుంబం, 1969) మలచి సూక్ష్మం లో మోక్షం ప్రసాదించారు. అయితే సినీ కథకు బలం కూర్చే ప్రయత్నంలో ‘అసూయ తోటీ ద్వేషం తోటి అన్నదమ్ములు కుమిలే కంటే – మనుషులు దూరాన్నుంటే మేలు మనసులు దగ్గర చేరగ వీలు’ అని సూక్త్యోక్తి పలికేరు. నిజానికి రామాయణ కథలో రాముడి పట్ల తమ్ములకి అసూయ లేనే లేదు. ‘స్నేహం దూరంగా ఉంటేనే జోరౌనులే’ అని కొస రాజు గారే ఒకనాడు అన్నారు కనక అదే పునరుక్తి అయ్యింది అంతే. విశేషమేమిటంటే శ్రీ రాముడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. ఇది నక్షత్ర క్రమంలో ఏడవది. శ్రీ రాముడు కూడా మహా విష్ణువెత్తిన ఏడవ అవతారం. పునర్వసు పేరు సూచిస్తున్నట్టే రాముడు కూడా ‘పునర్వాసం’ ఏర్పరచుకున్నాడు. ‘భూ కైలాస్, 1958’ చిత్రంలో సముద్రాల వారు నారద పరంగా చెప్పిన ‘రాముని అవతారం రఘుకుల సోముని అవతారం’ అనే భవిష్య వాణిలో మనకు వినిపించేవి కూడా ఏడు చరణ ధ్వనులే. ఇక సముద్రాల వారి రామాయణ రచనలో తల మానికం అనదగ్గది– సాక్షాత్తు లవకుశులే దిగి వచ్చి ఆలపించిన అనుభూతి కలిగించినది- రామ కథను వినరయ్యా (బాల, అయోధ్య కాండలు) + వినుడు వినుడు రామాయణ గాథ (అయోధ్య, అరణ్య కాండలు) + శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా (అరణ్య, లంకా, ఉత్తర కాండలు) అనే మూడు గేయాల సంపుటి (లవకుశ, 1963). రామాయణ గాధని ముచ్చటగా మూడు పర్యాయాల్లో వినిపించి, ఆ మూడవ పర్యాయమే తన జీవితం గడప దాటి రామాయణ పారాయణం అనే కాగితం పడవెక్కి కాల ‘సముద్రాల’ దాటి పోయి మన కోసం భావ రాగ తరంగ సుధను ఒడ్డున పడేసి పోయిన వారు రాఘవాచార్యుల వారు. రామాయణ ఘట్టాలు రాగ మాలికగా అల్లుకున్న ఆయన చివరి పాట ‘రామకథా శ్రీ రామకథ’ (శ్రీ రామ కథ, 1968) లో ముందు మాట, ముక్తాయింపు ల మధ్య నడిచిన చరణాల సంఖ్య 31. అందులో బాలకాండ పరంగా 11, అరణ్య కాండ పరంగా 10, సుందర కాండ పరంగా 5,లంకా కాండ పరంగా 5 చరణాలు కేటాయించడం చూస్తే సముద్రాల వారు మరో తులసీ దాసు కాబోయే వారేనేమో అనిపిస్తుంది. పదమూడు నిమిషాల ఈ సంక్షిప్త రూప సముద్రాల సంపూర్ణ రామాయణాన్ని వినడానికి ఓపిక ఉంటే మీకు ‘శ్రీ రామ నామ’ మెంత రుచో ‘కోదండపాణి’ స్వర మన్నా అంతే రుచి అంటాడు ‘బాల’ పద్మ(నాభ)భూషణుడు, ఎందుకంటే రుచికరమైన వాటిని ఆస్వాదించడానికి నాలుక ‘నాకు ఓపిక లేదు’ అని అనలేదు కదా. -డా. తాతిరాజు వేణుగోపాల్, 14 ఏప్రిల్ 2011 ( నవమి దాటిన రెండు రోజులకా? ఏం చెయ్యడం? ఇనకులాభి సోముడు కరుణించినా ఇంటర్ నెట్ కనెక్ట్ కావాలి కదా; సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి)
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|