మునుపటి నా మాట
వయసు గుర్తుచేస్తేనే తప్ప ఆ ఇద్దరు కళాకారుల్ని 'వృద్ధులు' అనడం తప్పు. వారి వారి క్షేత్రాల్లో వారి జీవితాలు వృధా పోనివ్వ కుండా కల్ప వృక్షాల్లా ఎదిగిన వారిద్దరూ 'నిత్య యవ్వనులే'. ఒకరు- నాట్య కళా చంద్రుడికి నవ్య వెన్నెల వెలుగులు ప్రసాదించిన 'నటరాజ రామకృష్ణ', మరొకరు- చిత్ర కళా రవికి చిత్ర విచిత్ర వన్నెలు , వెలుగులు సమకూర్చిన ' యమ్.యఫ్. హుస్సేన్'. 'నటరాజ' అన్నది ఒకనాడు మహారాష్ట్ర మహారాజు రామకృష్ణుల వారికి ఆయన పద్దెనిమిదేళ్ల ప్రాయం లోనే చూపించిన నాట్య ప్రతిభను మెచ్చి ఇచ్చిన బిరుదు. 'పద్మశ్రీ' భారత ప్రభుత్వం ఇచ్చిన మరో బిరుదు. ఆయన పరిశోధకుడు కనుక 'డాక్టర్' కూడా (ఏ.పి. సంగీత అకాడమీ -భరత కళా ప్రపూర్ణ, ఆంధ్ర విశ్వ విద్యాలయం-కళా ప్రపూర్ణ). హుస్సేన్ మహారాష్ట్ర లో పండరీ పురంలో జన్మించి భారత దేశం గర్వించేలా పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ మొత్తం మూడు పద్మ లు స్వీకరించినా బయట ప్రపంచం చేత 'భారతీయ పికాసో' అనిపించుకున్న చిత్రకారుడు. జన్మ స్థలం ఆయన్ని ‘పండరి భూషణుడు’ అంది.
నటరాజ రామకృష్ణ పుట్టుక ఇండోనేషియాలో బాలి ద్వీపంలో అయినా పెరిగింది, విద్య నభ్యసించిందీ భారత్ లోని చెన్నైలో, నాగ పూర్ లో, శ్రీ కాళ హస్తి లోనూ. చిన్న నాటే ఆయన తల్లిని కోల్పోయేరు. హుస్సేన్ పుట్టి పెరిగింది, తిరిగింది భారత్ లోనే అయినా చివరి సంవత్సరాలు గడిపింది దుబాయీ, ఖతార్, లండన్ లో. హుస్సేన్ చిన్న నాటే తల్లిని కోల్పోయేరు. నాట్యకళలో వినూత్న మార్గాలని నడుము వంచి నరనరాల లయను ఉంచి, భావుకత జోడించి, ఆలయాలు పరిశీలించి గ్రంధాలు పరిశోధించి సాధించిన ఘనత రామకృష్ణుల వారిది. జీవితమంతా నాట్యానికే అంకితం చేసిన జీనియస్ ఆయన. చిత్ర కళలో అధునాతన పద్ధతుల్నీ, అనితర సాధ్యం కాని మార్గాన్ని కుంచె నుంచి జాలు వారించి మెప్పించిన ఘనత హుస్సేన్ ది. జీవితమంటే చిత్ర లేఖనమే, అదే ఆహారమని జీర్ణించుకున్న జీవి ఆయన. కేంద్ర సంగీత అకాడెమీ ‘కూచిపూడి’ నృత్యాన్ని classical art form గా అంగీకరించక పొతే, పట్టుదలతో పరిశోధన చేసి 'ఆంధ్ర నాట్యం' అనేది వెలికి తీసి ఇంట గెలిచి రచ్చ పేరు పొందిన కార్య దక్షులు రామకృష్ణులు. కొంతమంది ఆగ్రహించి బహిష్కరిస్తే మౌనంగా దేశాన్ని వీడి కుంచె బలాన్ని ఇంకొంచెం పెంచుకునీ రచ్చ గెలిచి ఇంట పేరు పొందిన ధైర్యవంతుడు హుస్సేన్. 'పేరిణి' శివ తాండవం రామకృష్ణుల వారి ప్రత్యేకత. కాకతీయుల శౌర్యం ఇనుమడించేందుకు ఆనాడు (ఏడు వందల ఏళ్ళ క్రితం) ఆ తాండవ నృత్యం ‘ప్రేరణ’ అయ్యింది. రామప్ప గుడి ‘పేరిణి’ నాట్య భంగిమలెన్నిటినో చూపిస్తూ ఈనాడు ప్రత్యక్ష సాక్షిగా నిలిచి ఉంది. చంద్రగిరి నుంచి తంజావూరు వెళ్ళిన ముద్దు చంద్ర రేఖ ద్వారా తెలుగు వారి నృత్యం తమిళనాడులో ‘భరత నాట్యం’గా వికసించిందని నిరూపించిన సాహసి ఆయన. శిలా భాష తెలిస్తేనే తప్ప నాట్య ఔన్నత్యం అర్థం కాదని రామకృష్ణుల ఉవాచ. శివ లింగం స్వరూపం లేనిది. కాని శివ స్తోత్రమ్ చేస్తూ ఆ పవిత్ర శివ లింగం నుంచి శివుని సాక్షాత్కరింప చేసుకోవడమే పరమార్థంగా గ్రహించమని ఆయన బోధించారు. ఆయన భావకుడు. సౌందర్య ఆరాధకుడు. అభ్యంతరకరంగా ఉండే' దేవదాసీలు' అనే పిలుపుని 'రుద్ర గణికలు’ అనే మాటగా మలిచి వారి కళను ‘ఆంధ్ర నాట్యం’ గా పునరుద్ధరించడానికి నడుం కట్టుకున్న నాట్యాచార్యులు, పుణ్యం మూట కట్టుకున్న పూజనీయులు ఆయన. కళ తెచ్చి పెట్టిన కాసుల్ని కళకే అప్పచెప్పిన కర్మ యోగి ఆయన. శిష్యులు ప్రేమగా తొడిగిన స్వర్ణ కిరీటాన్ని కేంద్ర విశ్వ విద్యాలయానికి బహూకరించి తల పైకెత్తి తిరిగిన తపస్వి ఆయన. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయి వేలాది శిష్యులే తన పిల్లలుగా ఎంచుకునీ, వారికి తను నేర్చిన నాట్య విద్య నేర్పించి, ఒక కళా వృక్షంగా తానూ ఎదిగి శాఖోప శాఖలు విస్తరింప చేసి అలసిన పాదాలు మట్టిలో కలిసి పోనిచ్చే ఎనభై తొమ్మిదేళ్ళ వయసు చెప్పిన మాట విని హాయిగా కన్ను మూశారు నటరాజ రామ కృష్ణ. అరుదైన గౌరవం ఆయన అంతిమ యాత్రలోనూ చోటు చేసుకుంది. కుతుబ్ షాహీ రాజాస్థాన నర్తకి నాట్యమాడిన తారామతి‘బారాదరి’ ప్రాంగణం పక్కనే నటరాజు ఆత్మ విశ్రమించింది. ( అక్కచెల్లెళ్ళయిన తారామతి సంగీతంలోనూ, ప్రేమావతినాట్యంలోనూ ప్రతిభావంతులు. వీరిని గోల్కొండ పాదుషా కుతుబ్ షా గౌరవించారు. ప్రేమావతి సమాధి పేరే బారా దరి –పన్నెండు వైపుల నుంచి గాలి వచ్చేలా నిర్మించారు కనుక ఆ పేరు. తారామతి, ప్రేమావతుల సమాధులు గుర్తించడంలో నటరాజ రామకృష్ణ చాలా కృషి చేశారు). (కనులు చూసినా పాటే –లో రామకృష్ణుల మాటలు, పేరిణి చరిత్ర మీద ఇంగ్లీష్ వ్యాఖ్యానం ఉన్న డాక్యుమెంటరీలు వినండి) 'క్యూబిస్ట్ ' కళా పద్ధతికి తన దైన శైలిని జోడించి పొడుగుపాటి కుంచెను రంగుల్లో ముంచి మానసిక భావాలకు ప్రేరణగా నిలిచిన సజీవ ఆకృతుల్ని తిరగ తోడి చిత్రించి, అవి చూడ గానే వాటి నుంచి ‘ఎంతో తెలిసిన- ఏమీ తెలియని’ సందిగ్ధం నుంచి మనిషి బయట పడాలని ఆశించిన చిత్రకారుడు హుస్సేన్. ఎవరైనా సరే మరణం తో రణం చేసి జయించి కోలుకుంటే వారికి ‘గ్రీటింగ్స్’ చెప్పడం మామూలే. చిత్రకారుడు మాటలతోనే కాదు వేలికొసలతోనూ ఆకాంక్షలు అందజేయగలడు. ‘కూలీ’ సినిమా షూటింగ్లో అమితాబ్ ప్రాణానికి ముప్పు వాటిల్లడం తెలిసినదే. ఆయన కోలుకుంటున్నప్పుడు యం. యఫ్ హనుమంతుడు-సంజీవిని చిత్రించి ఇచ్చారట. రామాయణ గాథ చిత్రించాలన్నది హుస్సేన్ కి తీరని కోరిక. చిత్రకారుడు మానసిక స్వేచ్ఛా జీవి అని ఎక్కువగా ఊహించుకోవడంలో హుస్సేన్ కొన్ని మొండి తప్పటడుగులు వేయడం జరిగింది. ఫలితంగా ఆయన ఆక్షేపణలకు గురి కావాల్సి వచ్చింది. రవివర్మ దేవతా మూర్తి అంటే ఇలా ఉండవచ్చు అని నాడెప్పుడో కట్టూ, బొట్టూ, ఆభరణం సకలం సమకూర్చి ఒక ప్రామాణిక చిత్ర సంపదను అందిస్తే ఆ మూర్తుల రూపాలు చూస్తూ తాదాత్మ్యం పొందుతూ వస్తోంది సామాన్య ప్రజ. అటువంటి మూర్తులను వక్రీ కరించడమే కాక ఆయా పేర్లు పెట్టడం అదే ప్రజా ఆగ్రహానికి దారి తీయదా?. అందుకే ‘రాజా రవి వర్మ అవార్డ్’ ఆయనికి దక్కకుండా పోయింది. (రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో- అని తెలుగు కవి ఒక్క ముక్కలో తేల్చేశారు. ప్రతి చిత్రకారుడికీ వర్మ చిత్రాలే సిలబస్. ఆ పాట కనులు చూసినా పాటే లో వింటూ చూడండి) హుస్సేన్ లోలోపలి భావుకత వెనుక రెండు ప్రధాన అంశాలు ఉంటాయి- ఒకటి పసితనం లోలా ఎప్పుడూ కోల్పోకూడని స్వేచ్ఛ. ఇందుకు సింబాలిక్ గా ఆయన చిత్రాల్లో ‘పావురం’ తొంగి చూస్తుంటుంది. రెండోది- ఎప్పుడూ శక్తివంతంగా ఉండే యవ్వనం. ఇందుకు సింబాలిక్ గా ‘గుర్రం’ ఆయన చిత్రాల్లో కనిపిస్తుంటుంది. ఈ రెండూ దాటితే వచ్చే వార్ధక్యం మాటేమిటి? అది అన్నిటినీ భరిస్తూ అనుభవాన్ని నెమరు వేసుకుంటూ రంగుల మార్పులతో వెనకనే ఉండి పోయే ‘కాన్వాస్’ కావొచ్చు. చలన చిత్ర కళలోనూ ఆరి తేరాలనుకున్నా ఒకటి రెండు చిత్రాలతో ఆగి పోయిన విచిత్ర వ్యక్తి ఆయన. థియేటర్ మొత్తం టికెట్లు తానే కొనుక్కునీ ఒక్కడూ ఒక నటి నటించిన సినిమా చూస్తూ ఉండిపోవడం అర్థం కాని మనస్తత్వంగా కొందరికి తోస్తే ‘ తస్వీర్ బనాతా హూ( - తస్ వీర్ నహీ బన్ తీ’ అని ఆయన మనసు కోరుకున్న ఏకాగ్రత కోసమే అలా చేస్తారని కొందరికి అనిపించి ఉండ వచ్చు. ( కనులు మూసినా పాటే లో ఈ తలత్ పాట ఉంటుంది- వినండి) పసితనంలో కనులారా చూడని తల్లి కోసం ఎప్పటికీ ఆరాట పడుతూనే ఉండిపోయింది హుస్సేన్ మనస్సు. ‘గువ్వలా ఎగిరి పోవాలి –ఆ తల్లి గూటికే చేరుకోవాలి’ అనుకుంటూ చెప్పులు తొడగని కాళ్ళతో రంగుల ప్రపంచం చెరసాల నుంచి బయట పడమని, లోకంలో వెంట తరిమే చదరంగాలూ, సుడిగుండాలు ఇంక చాలు అని నిర్ణయించింది తొంభై అయిదేళ్ళ ఆయన వయస్సు. (కనులు మూసినా పాటే లో గువ్వలా ఎగిరి పోవాలి పాట వినండి). ‘ఊరు పొమ్మంది కాడు రమ్మంది’ అన్న సామెత ఈయన విషయంలో మారిపోయింది. ‘ ఊపిరిచ్చిన ఊరు పొమ్మంది కాలు మోపిన చోట కాడు రమ్మంది’. నిర్జీవమైన ఆయన భౌతిక కాయం లండన్ మట్టి లోనే కలిసి పోయింది. కాన్వాస్ , పావురం, గుర్రం, - యం( mat) యఫ్ (free bird) హెచ్ (horse) అనే మూడు అక్షారాలకు ప్రతీకగా మౌనం గా నిలబడ్డాయి. -డా. తాతిరాజు వేణుగోపాల్ , 11 జూన్ 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|