మునుపటి నా మాట
'చిలకలపూడి వారింటి కిలకిల పలుకులు ... అంటూ నిన్నా మొన్నా చెప్పి మా అల్లుడి మేనల్లుడు అన్నంత పనీ చేశాడోయ్ – ఇదిగో ఈ సోమవారం మహావిష్ణు శయనైకాదశి కదా మహానుభావుడే నిద్దరోతే మామూలు భావాల వాళ్ళం మేమెంత అని అంతా నిద్రపోతారేమో అని ముందస్తుగానే అంటే ఈ ఆదివారమే నా రేపటి జన్మ దినం అదేనోయ్ నా జయంతి ప్రకటించేసి ఏదేదో రాస్తున్నాడు- పైగా నా పాటలట, పద్యాలట, నా కామెడీ సీనులట –అవన్నీ కూడా ఇస్తున్నాడట. సంతోషం – మహదానందంగా ఉంది. వీళ్ళ జెనరేషన్ బావుందోయ్. మా కాలాన్ని కాలదన్నేయకుండా చేతులెత్తి మొక్కి కళ్ళకద్దుకుంటున్నారు. మన ఆశీస్సులే వారికి కొండంత బలం –అవునా?.. ఉండుండు ఝేవిటో అంటున్నాడు. నేనెప్పుడో రాసాను మా నాన్న గురించి, ఆయన ఇచ్చిన నా జాతక చక్ర వివరాలు కొద్దో గొప్పో నేన్ రాశాను. అవటా- మళ్ళీ ఇస్తున్నాడట. ఇవ్వడమే కాదు తను సంపాయించి పెట్టుకున్న మరాఠీ పంచాంగాల కట్టలు తిరగేసి నా ఏడు అంటే 1907 ప్లవంగ నామ సంవత్సరం పంచాంగం లో జులై నాటి ఆషాడ పక్షం వివరాలు కూడా ‘ఆహా.. ఆహాహా’ అనే ఏదో ఉందట అందులో భద్రంగా ఉంచాడట. దేవనాగరి తెలియక పొతే కష్టమే, అయినా 104 ఏళ్ళ కిందిటి సంపద వెలికి తీయడం ఎవరికైనా ఇష్టమే. ఇంకా చూస్తావేమిటి అలా ---లోపలికి పద' -----------------------------
అ-అక్కా చెల్లెళ్ళు ,అ-అప్పు చేసి పప్పు కూడు, అం -అంతా మన వాళ్ళే ఇ -ఇల్లరికం ఇలా అచ్చులు దాటి కచటతపలు, గజడదబలు ఆపైన వాటి గుణింతాల వరకు వచ్చేస్తే క- కన్యాశుల్కం, కృ-కృష్ణ కుచేల , గృ-గృహప్రవేశం చ-చక్రపాణి , చూ-చూడామణి జ-జయప్రద, జగదేకవీరుని కథ, జీ-జీవితం త-తల్లి ప్రేమ, తు-తుకారాం దే-దేవదాస్ ని-నిత్య కళ్యాణం పచ్చ తోరణం పా-పాతాళ భైరవి భ-భక్త తుకారాం, భక్త కుచేల (తెలుగు, మళయాళం) మా-మాయా బజార్, మామకు తగ్గ అల్లుడు వ-వచ్చిన కోడలు నచ్చింది శ్రీ- శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం స-సక్కుబాయి, సు-సుమతి అని మరి కొన్నిటి పేర్లు చెప్పుకోవచ్చు. ఇంతకీ వీటిలో కొన్ని చూడబోతే ఎవర్ గ్రీన్ హీరోలు ఎన్టీఆర్ వీ, ఏ ఎన్నార్ సినిమాల్లా కనిపిస్తున్నాయి కదూ. కానీ వీటన్నిటిలో మరో ప్రధాన ధీరోదాత్త పాత్రధారి ఉన్నట్టు మీరు సీరియస్ గా ఆలోచించినట్టయితే ఆ నటుని పేరుసి.ఎస్.ఆర్ అని తెలిసిపోతుంది. డాక్టర్ దివాకర్ల వేంకటావధాని గారి మాటల్లో చెప్పాలంటే- ‘సి.ఎస్.ఆర్ పూర్తి పేరు చాల మందికి తెలియదు. చిలకలపూడి సీతారామాంజనేయులు ఆ ఆంగ్లాక్షర త్రయమునకు తెలుగు వివరణము’ సి- అంటే సినిమా, ఎస్- అంటే స్క్రిప్ట్ , ఆర్- అంటే రోల్ అని నిర్వచిస్తే అవన్నీ కలబోసిన పేరే సి.ఎస్.ఆర్ -ఇదిమేము చేయు సవరణము. సి. సీతారామాంజనేయులు ,మద్రాస్ అంటే ఆ రోజుల్లో పోస్ట్ వాళ్ళకూ ఇబ్బందిగా ఉండేది. అదే సి. ఎస్. ఆర్ , పాండీ బజార్ అంటే పాకుతునే పసివాడు కూడా లేచొచ్చి 'అదిగో' అని చూపించేవాడు. అక్కడి చెట్లు సముద్ర గాలికి కదిలితే అవి రికార్డ్ చేసుకున్న సి. ఎస్. ఆర్ కబుర్లు మాత్రమే వినిపిస్తాయి. ఆయన పాండీ బజార్ కి వెళ్ళినా ఎప్పుడూ వట్టి జేబులతో కాదు, ఓ పది రూపాయాలు (ఆ రోజుల్లో అదో వంద తో సమానం) వేసుకునీ మరీ వెళ్ళేవారు. అది పెట్టి దాన ధర్మాలు చేసి గానీ ఇంటికి తిరిగి వచ్చే వారు కాదు. ఏ.వి.ఏం. వారి 'జీవితం ( 1950 )' సినిమాలో సి.ఎస్.ఆర్ ఓ ఊత పదం ఉహూ( కాదు ఊత వాక్యం అంటుంటారు- 'ఆ కాలం లో నేన్ చదూకునే రోజుల్లో పంక్చువల్ అంటే పంక్చువల్ ' అనీ. నిజ జీవితంలోనూ అంతే పంక్చువల్ గా పాండీ బజార్ వెళ్లొచ్చిన మర్నాడే అంటే అక్టోబర్ 8 న (1963) ఆయన తనువు చాలించేరు. పాత్రికేయులు ఇంటూరి వెంకటేశ్వర రావు అన్నట్టు- ‘సి.ఎస్.ఆర్. లేని పాండీ బజారు -శివుడు లేని కైలాసం’. (చెన్నై నేలుతున్న లలితమ్మ కు సహస్ర నామ విన్నపం- పాండీ బజార్ లో మా సి. ఎస్ .ఆర్. గారి విగ్రహానికి కాస్త చోటివ్వరూ- అలా చేస్తే మీ పేరు ముందు 'జై' అంటాం. ‘మనుషులు-మమతలు’ మీకు తెలియనివి కావు. దేశంలో బోర్డర్ లేని రాష్ట్రాలు ఆంధ్రా తమిళనాడు అని మీరేగా అన్నారూ, మా సి. ఎస్.ఆర్ అంతే- ఎల్లలు ఎపుడో దాటేశారు). ఏమిటి ఆయనలో ప్రత్యేకత? ఏమిటి ఆయనలోని నటుడి లోని ప్రత్యేకత? సంస్కారం, ఇంకా సకల కుల మత జాతి జనుల సహవాసం, ఇంకా నిర్మొగ మాట వైఖరి, ఇంకా నిష్కపట హృదయం, ఇంకా అజాత శతృవు, ఉదారుడు తటపటాయింపు లేని నిర్ణయాల స్థిర చిత్తుడు – మనిషిగా ఆయనలోని ప్రత్యేకత. నట యోగి, సాహిత్య ప్రియుడు, గొప్ప వక్త , క్రీడాకారుడు, తానుగా తన ఘనత చెప్పుకోని వ్యక్తిత్వం, సముచిత పాత్ర పోషణ, ఒక గమ్మత్తైన వాచకం- కళారాధకుడిగా ఆయనలోని ప్రత్యేకత. ఆ ప్రత్యేక పురుషుడి నూటా నాలుగవ జయంతి ఈ జూలై 11 న. ఆ రోజుల్లో రంగ స్థల అనుభవం కొలమానాలు - రూపం,నటన, గాత్రం. అవన్నీ ఎవరిలో మూర్తీభవించి ఉంటాయో వారికే సినిమాల్లో నటించేందుకు వీలయ్యేది. అలా ఒక దశాబ్దం నాటక రంగం ఏలి సినీ రంగానికి వచ్చిన తొలి నాటి ప్రముఖుల్లో సి. ఎస్. ఆర్ ఒకరు. సినీ వేదిక కాస్త ఖాళీగా అనిపిస్తే ఆయన శరవేగంతో నాటకాల స్టేజ్ ఎక్కేసేవారు. ‘‘స్థానం’ మారి రాజమండ్రి ‘గాలి’ నన్ను పట్టుకుంది; అద్దంకి , నేనూ, బందా –అంటే ఇంకేమైనా ఉందా?’ సత్యభామగా స్థానం నరసింహా రావు వారి స్థానం చెక్కు చెదరనట్టే ఆయనకి సమాన స్థాయిలో శ్రీ కృష్ణుడిగా నటించిన సి. ఎస్. ఆర్. వారి రంగ స్థల ప్రస్థానం కూడా అంతే నిండైనది. స్థానం వారివి స్త్రీ పాత్రలైతే, వాటికి దీటైన పురుష పాత్రలుసి.ఎస్.ఆర్ వారివి. ఎవరికి వారే సాటి- వేసిన పాత్రలే వేస్తున్నా విసుగెత్తించకుండా మధ్య మధ్య ఛలోక్తులతో మహదానంద పరచేవారు. రచయిత చింతామణి నాటకం కోసం ‘ఏం..ఇవాళ ఇంత పూర్తిగా ముస్తాబయ్యావు’ అని రాస్తే సి.ఎస్.ఆర్స్వతంత్రించి ‘ఇంత అసహ్యంగా ఉన్నావేం?’ అనేవారు. స్థానం వారేమైనా తక్కువా? “ఓర్వలేని మీ కళ్ళకు నేను అలాగే కనపడతాను లెండి’ అని వగలు పొయ్యేవారు. వీరిద్దరూ వారి వారి వ్యక్తిగత జీవితాల్లో ఉత్తర-దక్షిణ ధృవాలైనా నటనలో ప్రేమతో అతుక్కునే వారే! గాలి పెంచలనరసింహారావు గారిది రాజమండ్రి. అటు వచ్చినప్పుడల్లా సి. ఎస్. ఆర్ ఆయన్ని కలవకుండా, పాటో పద్యమో అందుకోకుండా ఉండలేరు. గాలి వారూ అంతే. సి. ఎస్. ఆర్ వస్తున్నారని కబురొస్తే చాలు హార్మోనియంతో వీధిగదిలో ఎదురు చూసే వారు. ఆయన సి ఎస్ ఆర్ గారిని ‘అంజిన్లు’ అని పిలిచే వారు. ‘హే(విటి మీరు మరీనూ, నా పేరు కుదించేస్తున్నారు’ అని సి.ఎస్.ఆర్ అలిగితే పెంచల వారు ‘నేనెంత కురచగా అన్నా నీ పేరు పెరుగుతూనే ఉంటుంది. అది ఆంజనేయులు తోక తెలుసా? దానికి పెరగడమే గాని తరగడమే ఉండదు’ అనేవారు. సి.ఎస్.ఆర్ రామదాసుగా, నరసింహారావు హార్మోనిస్టు గా ఆడిన ‘రామదాసు’ నాటకం రాజమండ్రి కళారాధకులకి కనుల పండుగ చేసింది, వీనులకు విందైంది. గాలి వారి వాక్కు గాల్లో కొట్టుకుపోలేదు. అద్దంకి వారు దశరథుడైతే, భరతుడు బందా వారు, మరి సి.ఎస్.ఆర్ - శ్రీ రాముడు! అలా ‘పాదుకా పట్టాభిషేకం’ జరిగింది. మేటి నటులతో మ్యాటినీ షోలు ఊరూరా ఉర్రూతలూగించాయి. 'ఉర్రేయ్ ప్రొడ్యూసరూ నీ పిక్చర్నినా పజ్యాలు రచ్చిస్తాయిలే ఫో' అసలు తెలుగు వారి మొట్ట మొదటి సినీ రాముడు సి ఎస్ ఆర్. ఆ చిత్రం రామదాసు. అదేమిటో రామదాసు లాగే ఆ చిత్రం కూడా కష్టాల పాలైంది. రిలీజే కాలేదు. రామదాసు అంటే గుర్తొచ్చేది నేటి నాగార్జున కాదు, నాటి నాగయ్య. నటులకి నాగయ్య గురువైతే నాగయ్యకు గురువు సి ఎస్ ఆర్ అని అంటారు. తరువాత తొలి సినీ కృష్ణుడు కూడా సి ఎస్ ఆరే. ద్రౌపదీ వస్త్రాపహరణం (1936) విడుదలైన ఆ రోజుల్లో పోటీ ధోరణి విపరీతంగా ఉండేది. దీనికి పోటీ గా 'ద్రౌపదీ మాన సంరక్షణ'(1936) సినిమా వచ్చింది. సంవత్సరానికి నాలుగో ఆరో సినిమాలు- అందులో ఒకటీ అరా పోటీ పడడం అదో వింత కదా. రెండు సినిమాలు ఇలా పోటీ పడితే ఏదో ఒకటి తుస్సు మనడం ఖాయం. నిజం చెప్పాలంటే 'ద్రౌపదీ వస్త్రాపహరణం' సినిమా సి.ఎస్.ఆర్ పద్యాల వల్లే బతికి బట్ట కట్టింది. ‘భక్త కుచేల’ చిత్రంలో ఆయన కుచేలుడిగా నటిస్తే మళయాళ నిర్మాత సంబరపడి పోయి మళ్ళీ ఆయన చేత మళయాళంలో నటింపజేయడం ఒక విశేషమైతే, ఇది మరీ బావుందని దాన్నే ‘శ్రీకృష్ణ మహిమ’ పేరుతో తెలుగులోకి డబ్ చేయడం మరో విశేషం. అయితే అప్పటికి సి.ఎస్.ఆర్. లేరు. వచనంలోనూ రాగాలాపన చేయడం సి.ఎస్.ఆర్ కే చెల్లు. కావాలంటే తిప్పండి ‘చక్రపాణి (1954)’ రీలు. 'శాంతమ్మా , ఏ(విటిది.. మీ ఆయన మళ్ళీ అదే సినిమా అంటే బావుంది కానీ అదే పారితోషికం అంటే బావుందా చెప్పు, కాలం మారిపోచ్చి, హాచ్చి' పి పుల్లయ్య తీసిన తొలి ‘వేంకటేశ్వర మహాత్మ్యం’లో తొలి వెంకటేశ్వరుడూ సి ఎస్ ఆరే. ఆయనకి జంటగా పుల్లయ్య సతీమణి శాంతకుమారి వేశారు. మళ్ళీ పుల్లయ్య గారే ఎన్టీ ఆర్ తో తీసిన శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (1960) లోశాంతకుమారి వకుళా దేవి గా (శ్రీనివాసుడి తల్లిగా) నటించారు. కాని అందులో సి.ఎస్.ఆర్ లేరు- అప్పటికే 'కాలం మారిపోచ్చి'. 'ఝే(విటీ ,అప్పుడు నాకు అయిదు వేలిచ్చి ఇప్పుడు అప్పు చేసి పప్పు కూడు అంటారా, ఎవరక్కడ? తలుపులు మూసేయండి' శ్రీ కృష్ణుడిగా నటించినందుకు సి.ఎస్.ఆర్ కు దక్కిన పారితోషికం అక్షరాలా ఐదువేలు- అంటే అది ఇప్పటి కరెన్సీ ప్రకారం లక్షలు దాటే వీలు. ‘అంత ఇస్తారా’ అని మాట వరసకి సి. ఎస్. ఆర్ అనగానే ఆ నిర్మాత కురుకూరి సుబ్బా రావు 'ఓ యస్ సార్ ' అన్నారట. విజయా వారి ‘అప్పు చేసి పప్పు కూడు (1954)’ సినిమాలో అందుకే అంత విజయ గర్వంతో అప్పు సూత్రాలు అప్ప చెప్ప గలిగేరు. ఉదాహరణకి- ‘అప్పు చెయ్యడంలో కొత్త బిచ్చగాడిలా కనబడుతున్నావ్’. “అప్పు ఎంత ఉన్నా ఫరవాలేదు. కానీ అప్పుల వాళ్ళు మాత్రం ఎక్కువమంది ఉండకూడదు”.”ఇకముందు నీకో వెయ్యి రూపాయిలు కావాలంటే ఒక్కడి దగ్గరే తీసుకో. పదిమంది దగ్గరా పది వందలుగా మాత్రం తీసుకోకు’ (కనులు చూసినా పాటే –లో పాట బదులు సి.ఎస్. ఆర్ వాటి మాటలున్న ACPK చిత్రం లోని దృశ్యాలు చూడండి). నాటకం చూసేవాళ్ళే సినిమాకీ వస్తారనుకుంటే –ఝే(విటిది—పప్పులో కాలు వేశాను అంతకుముందు నాటకం వేస్తే ‘భక్త తుకారాం’ ఎంతగానో రాణించింది. అదే కథను సినిమాగా 1937 లో తీస్తే అది కాస్త ఫెయిలయింది. మళ్ళీ తీసి అంతా మెచ్చుకునేలా చేయాలని ఆశించారు. కానీ కుదిరింది కాదు. ‘నేటి కొత్త నీరు రేపటికి పాత నీరు- నాటకాలు ఆడనీరు, చూడనీరు’ నాటి మద్రాస్ లో సెంట్ మేరీస్ హాల్లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు సభ జరిగింది. ఆ సభలో ఎప్పుడూ లేని కొత్తదనం ఒకటి తీసుకొచ్చారు. అదేమిటంటే నాటక పోటీలు జరపడం. కాకలు తీరిన పాతవారితో పాటు నలభై దాక అమెచ్యూర్ సంఘాలు పాల్గొన్నాయి. కొత్త వారి ప్రవేశం ససేమిరా ఇష్ట పడక పాతవారు కొందరు గొడవ చేశారు. బందా వారూ, స్థానం వారూ వాగ్వివాదం లోకి దిగారు. అప్పుడు శృతి మించి రాగాన పడుతోందని గ్రహించిన సి.ఎస్.ఆర్ మధ్యస్తంగా ఉంటూ మరో కొత్త వాదన చేశారు. ఆ ఇద్దరూ శాంతించారు. అమెచ్యూర్ సంఘాలు హర్షించాయి. సి.ఎస్.ఆర్ ‘కళ’కి, ప్రతిభకి పట్టం కట్టే వారు అనడానికి ఇదే ఉదాహరణ. అంతే కాదు- కళాకారుల క్షేమం కోసం సంఘాలు ఉండాలని కోరుకునే వారిలో ఆద్యులు కూడా ఆయనే. మదరాసు సినీ వర్కర్స్ యూనియన్ – అనే చిన్ని మొక్క మొలకెత్తితే దానికి తొలి అధ్యక్షుడిగా ఉన్నది ఆయనే. అది ఇప్పుడు ఒక వట వృక్షమై ఎందరికో నీడనిస్తోంది. 'మై డియర్ తులసమ్మక్కా - ఐ యాం లైక్ తులసి మొక్క' వయసులో కొంచెం ఆలస్యంగా సినీ రంగానికి రావడం జరిగినా హీరో పాత్రలే కావాలి అని ఆయన పట్టుబట్ట లేదు. పట్టు బట్టలతో మామయ్య గారిగా, ప్యాంట్ షర్టు తో బామ్మరిది గా, కామెడీ చేసే మహా రాజుగా, మంత్రిగా, ఎత్తుకు పై ఎత్తు వేసే శకుని గా ఇలా అన్ని పాత్రలకీ న్యాయం చేశారు.. నాటి 'గృహ ప్రవేశం' ( 1946) సినిమాతో ( అందులో ఎల్వీ ప్రసాద్ హీరో) ఇలాంటి పరకాయ ప్రవేశం చేసి నలుగురినీ మెప్పించారు ఆయన. ఆ నలుగురు ఎవరూ అంటే- నిర్మాత, దర్శకుడు, మాటల రచయిత,ప్రేక్షకుడు. ఆ సినిమాలో ఆయన పాడిన ‘తులసమ్మక్కా' పాట ఇపుడు మరోసారి వింటే (కనులు మూసినా పాటే –లో ఈ పాట తో పాటు కన్నాంబ-సి.ఎస్.ఆర్. ల యుగళ గీతం, కొన్ని పద్యాలు వినండి) ఆనాటి కాలం లోనే అంత కొత్తదనం ఎలా తీసుకోచ్చేరో అని ఆశ్చర్యపోతాం. అలా ప్రతి గృహం పెరటిలోనో, బాల్కనీ లోనో ప్రవేశించే ఓ తులసి మొక్కలా ఆయన పేరు పూజనీయమైపోయింది. సి.ఎస్.ఆర్ గారిని విపరీతంగా అభిమానించే పద్మనాభం ‘నిండు సంసారం (1968)’ చిత్రంలో హిందీ బాణీ ననుసరిస్తూ ‘మై డియర్ తులసమ్మక్కా ---లక్కీ ఛాన్స్ కొట్టేసా’ అని పాడడం గమనించే ఉంటారు. ఎటొచ్చీ నాడు జానకి, తరువాతి కాలంలో జ్యోతి. పద్మనాభం స్వయంగా పాడుకుంటే బావుండేది, గాయకుడు కదా. కానీ ఆయనకీ పిఠాపురం పాడారు. పిఠాపురం,మాధవపెద్ది సత్యం ల కంఠాలకి మంచి కాలం అది. విచిత్రం ఏమిటంటే ‘మహాకవి కాళిదాసు(1960)’ సినిమాలో సి.ఎస్.ఆర్. కవిగా నర్తకి (రాజసులోచన)ని వర్ణించే చలాకీ పాట సి.ఎస్.ఆర్ గొంతున కాక మాధవపెద్ది వారి గొంతున వింటాం. కనులు చూసినా పాటే –లో చూడండి. 'నాకు శివ గంగ దక్కక పోతేనేం, నా పాండీ బజార్ కి తెలుగు గంగ చక్కగ వస్తే చాలు. కావున దేవుడు మీకు మేలు చేస్తాడు' ఇంతటి వైవిధ్య నటనానుభవం ఉన్న వారెవరైనా 'దర్శకత్వం' బాధ్యత కూడా చేపట్టాలని ఆశించడం సహజం. సి. ఎస్. ఆర్ఆశ పడీ చేసిన భగీరథ ప్రయత్నం ఎందుకో 'శివ గంగ' (చిత్రం) ను తీసుకు రాలేక పోయింది. అందులో ఆయన పాత్ర - 'నారదుడు' . అలా ఆ పాత్రలో ఆయన్ని ఫోటోల్లోనే తప్ప పాత్రగా చూడ నోచుకోలేక పోయాం. నారాయణ! నారాయణ! ఇదంతా కృష్ణుడి మాయ ఇక ఇక్కడ రంగుల్లో హెడ్డింగ్ ల్లా ప్రత్యేక వాక్యాల్లో అక్కడక్కడా సి. ఎస్. ఆర్ వారి మాటలల్లె ఉన్నాయని కనిపెట్టారా? సరే. ఇప్పుడు అసలు సిసలు 'పాచిక'లాగులు (డై లాగులని అర్థం) మెల్లగా నెమరేసుకుందాం. పాచిక అనడం సబబే. ఎందుకంటే మాయాబజార్లో సి ఎస్.ఆర్ పాచిక లాడిన సందర్భం ఒక్క సారి గుర్తుకు తెచ్చుకుంటే ‘ఏం దుర్యోధనా – చూశావా తలలో ఆలోచనలు చేతిలో పాచికలు వీటితో నీ మామ సర్వ నాశనం చేయగలడు’, (దుర్యోధనుడు సందేహిస్తూ ముందు రెండు అని తరువాత కాదు ఒకటి అని అన్నప్పుడు) 'తడబడుతూ అడిగితే అదీ తడబడుతూ ఒక్కటే పడ్డది’ అని బదులిచ్చిన తీరు ఆయన రూపాన్ని కళ్ళ ముందుంచుతుంది. మాయాబజార్ లో ఏ పాత్రకా పాత్ర గొప్పదే. అందరూ ఉద్దండులే. సి.ఎస్.ఆర్ ప్రత్యేకత ఆయన వాచకం- ‘శకుని ఉన్న చోట అపశకునమా?’ ‘నా పాచికల ప్రభావం ఆ పాండవ పక్షపాతి శ్రీకృష్ణుడికి కూడా తెలిసి వస్తుంది, పదండి’, ‘దుర్భరం దుర్యోధనా దుర్భరం—గుళ్ళో పూజలు చాలక నాకీ జాతర ఏమిటీ?’ (బలరాముడు వస్తునాడంటే దుర్యోధనుడికి గుండె దడ. అసలే ముక్కోపి అని అతని భయం. అప్పుడు-) ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’- ఇవన్నీ మనం మనలో అనుకుంటే మనం మనం కాం. సి.ఎస్.ఆర్ అవుతాం. బలరాముణ్ణి బుట్టలో వేసుకోవడంలో దొర్లిన సంభాషణ: ‘’అహ.. ఏదైనా అధర్మం జరిగితే వారు సహిస్తారా?- కానీ ఆ భీముడే భీషణ ప్రతిజ్ఞలు చేసి వెళ్లాడు. ---నేనూ పట్టలేక అనేశాను- హు( -- మా రారాజు పక్షం కొండంత దేవుడు బలరాములు ఉన్నారని’. ‘అందంగా కనిపిస్తే హరిహరాదు లడ్డమైనా హరించి తేవాల్సిందే!’ ‘శాస్త్రాలు సామాన్యుల కోసం.. ఫలితం ఏమిటో చెప్పండి జోస్యులూ ’ – ఇన్ని పింగళి వారి ప్రియమైన పలుకులు సి.ఎస్.ఆర్ వారి నోట ‘చిలకల’పూడి పలుకులై పంజరాలెరుగని నట గగన విహారం చేశాయి. ఇప్పటికీ చేయిస్తున్నాయి. జై పాతాళ భైరవీ - జై జై నట రవీ ఎంత మాత్రమూ అబద్ధామాడలేం- చిన్నతనంలో పాతాళ భైరవి (1951) చూసొచ్చి ఇంట్లో ప్రతి ఒక్కరి నటనా అనుకరించినట్టే ఇప్పటి తరం అదే సినిమా చూసి అలాగే ఇమిటేట్ చేస్తుంటే మురిసిపోతాం అన్నది. రేలంగి ఎన్.టీ.ఆర్ ని బంధించి తీసుకొస్తాడు. తల ఎత్తుకునే ఉండే ఎన్.టీ. ఆర్ ని తలదించు కొమ్మన్నట్టు ఆదేశిస్తాడు. ఎన్.టీ.ఆర్. ఒప్పుకోడు. అప్పుడు సి.ఎస్.ఆర్- ‘ఎవ్వరికిని తల వంచని సాహసమే లక్ష్మి ఉజ్జయినికి’ అనడం ఆ రోజుల్లో ఒక పద్యపాదం లా గుర్తుండిపోయింది. ‘తిప్పలు పెట్టకుండా చప్పున ఒప్పుకుంటావా అబ్బాయీ’ అని ఆయన ఒక వేలు గాలిలోకి విసిరి అంటుంటే - 'నిజం చెప్పమంటారా? అబద్ధం చెప్పమంటారా?' అంటాడు చేతులు కట్టుకునీ తోట రాముడు (ఎన్.టీ.ఆర్) 'నిఝమే చెప్పవోయ్' - అప్పుడది రాజు గారి డైలాగ్. ఆ రెండు మాటలు అనడంలో కదిలిన భ్రుకుటి, రాణి వైపు చూసిన కొంటె చూపు అది సి.ఎస్.ఆర్ చూపించినంత త్వరగా, చక్కగా ఇంకెవ్వరూ చూపలేరు. 'పారశీకమేమిటి? తప్పు తప్పు- పర శోకం పరశోకం' మార్క్ డైలాగులతో సినిమా అంతా నవ్వులు పేల్చిన రేలంగి తిన్నగా అక్కయ్య దగ్గర కొచ్చి అలానే 'తప్పు తప్పు' అంటుంటే సి.ఎస్.ఆర్ ' రాణీ ఇక్కడో బెత్తం ఉంచుతుండు. తప్పుతప్పన్నప్పుడల్లా మీ తమ్ముడుకో చురక వేస్తుంటాను' అనడం గుర్తొస్తే ఇప్పటికిప్పుడే మీరు వీడియోల వైపు పరుగు తీస్తారు. రాణి తన తమ్ముణ్ణిచ్చి కూతురి పెళ్లి చెయ్యాలని మురిపెంగా రాజు దగ్గరకొస్తుంది. అప్పుడు—‘అలా ఆ మాటంటుంటే ఎంత ముద్దొస్తున్నావు రాణీ’ అని గోముగా రాజంటే ‘ మరి నా ముద్దు చెల్లించండి’ అని అంతే గోముగా రాణి అంటుంది. ఠకీ మని సి.ఎస్.ఆర్ మార్క్ డైలాగ్- ‘ఎప్పటిదోయ్’. రాణి బిడియంగా ‘అబ్బ! పొండి’ అనడంతో హాలు హాలంతా నవ్వులమయం. 'ఒక పిల్లి -పిల్లి ముందు రెండు పిల్లులు. పిల్లి వెనుక రెండు పిల్లులు. రెండు పిల్లుల మధ్య పిల్లి. అన్నీ ఎన్ని పిల్లులూ?’ –ఇది రాజకుమారి ఇందు (మాలతి) , మావయ్య కి పెట్టిన పరీక్ష. మావయ్య అయిన రేలంగి 'ఓస్, ఇంతేనా' అంటూ మొత్తం వేళ్ళతో లెక్క కట్టి కంగారు పడతాడు. ‘పెళ్లి మాట ఎత్తితే ఈ పిల్లేమిటే’ అని అమ్మ కోపం. కట్ చేస్తే- తరువాత చిరు నవ్వుతూ 'ఇందూ, కదూ' అంటూ ఎడం చేతి మూడు వేళ్ళు కనీ కనిపించకుండా చూపించిన మహారాజు సి.ఎస్.ఆర్ కూతురి పట్ల వాత్సల్యం, తన కూతురివి తన తెలివి తేటలే సుమీ అనే గర్వం—రెండూ ఏక కాలంలో అభినయించడం అనితర సాధ్యం. గాఢ నిద్రలో మహారాజు. అంతలో పీడ కల. రాకుమారిని ఎవ్వడో మంత్రగాడు ఎత్తుకు పోతున్నట్టు. అది కల కనుక కళ్ళు తెరవ కూడదు, కళ్ళల్లో కదలికలు ఉండాలి, పీడ కల వల్ల గుండెలు ఎగిసి పడేలా ఊర్పులుండాలి. కల తేలి పోగానే ఒక్క ఉదటున పక్క మీంచి లేవాలి. చుట్టూ చూడాలి. ఓహ్! ఇది కలా? అని ఊపిరి పీల్చుకునీ స్థిమిత పడాలి. ఎంత అద్భుతంగా ఆ సీను పండించారు. అదీ సి. ఎస్. ఆర్ నటన అంటే. మాంత్రికుడు 'జై పాతాళ భైరవి' అంటాడేమో కానీ సినీ యాంత్రికుడు 'జై సి. ఎస్. ఆర్. నట రవి' అని అనక మానడు. మగవాళ్ళు చీర కడితేనే మనగలిగే రోజులొస్తాయి ఏమనుకుంటున్నారో 'హే రాజన్' లేనిదే జగదేక వీరుడు కథ (1961) నడపగలిగే వాడేనా? అందులో ఆయన చీర కట్టి ముస్తాబైన తీరు అదో ఫార్ములా అయింది తరువాతి సినీ మగ తరానికి. ఇప్పటి తరం రాఘవ లారెన్స్ ‘కాంచన(2011)’ సినిమాలో స్త్రీ వేషం వేస్తూ ఆ వేషానికి ఎంత శ్రమ పడ్డదీ ఈ ఆదివారం పేపర్లో చెప్పడం చదివే ఉంటారు. ఈ జులై 15 న ఆ చిత్రం విడుదల కాబోతుంది. ఈ లోగా సి.ఎస్.ఆర్ నటించిన ఆ JVK సినిమా మరోసారి చూసేస్తే సరి. మొత్తం కథ అంతా స్త్రీ పాత్ర ‘మధురవాణి’ చుట్టూ తిరిగే గురజాడ వారి (ఆంధ్రుల తొలి తెలుగు నాటకం) ‘కన్యాశుల్కం(1955)’ (నాటకాన్ని) సినిమాగా పుల్లయ్య గారు తీస్తూ ఒకరికొకరు నటనలో తీసిపోని వారిని ఎంచుకున్నారు. అందులో రామప్పంతులు సి.ఎస్.ఆర్ ఉత్తరం చదివే, చదివించే సీన్ లో మహా నటి సావిత్రి నవ్వులూ, ‘లొటి పిట’ వెక్కిరింపులూ,సి.ఎస్.ఆర్ అదిరిపడడాలూ –ఇవన్నీ నేటి భాషలో చెప్పాలంటే ‘కేక’ లేక ’అదుర్స్’. నా మానాన నేనుంటే మా నాన్న నన్ను నడిపించాడు ఒక్క మాటలో చెప్పాలంటే సి.ఎస్.ఆర్ = నటన + పద్యం + పాట అని ఈ మొత్తం ఉదంతాలు చదివి అనుకుంటాం. ఆయనలో ఓ చక్కని రచయిత కూడా ఉండేవారు. స్వీయ కథను రాసిన విధానం చదువుతుంటే అది ఒక దృశ్య సంకలనం అనిపిస్తుంది. ఆయన పైకి అనే మాటలే ఆయన రాసే రాతలూనూ అని అనిపించారు. తండ్రి తన పట్ల చూపించిన వాత్సల్యాన్ని ఆయన జీవితాంతం మరచిపోలేదు. సి.ఎస్.ఆర్ గారిని నాటక రంగం వైపు బాగా ప్రోత్సాహించింది వారి నాన్నగారే. ( ఈ సందర్భంలో సంగీత దర్శకుడు, గాయకుడు అయిన స్వర్గీయ ఎస్.రాజేశ్వరరావు గుర్తుకొస్తారు. ఆయనకీ అంతే- వారి తండ్రి గారే చేయి పట్టి సంగీత రంగం వైపు నడిపించారు. ‘ఫాదర్స్ డే’ అంటే- ఉన్నాయో లేవో అని నోట్లు లెక్కేయడం కాదు, నోట్లో కేకులు కుక్కేయడం కాదు – చప్పట్లతో కేకలు వెయ్యడం కాదు-అప్పులు చేసైనా సరే మన ఎదుగుదల కోసం పాటు పడిన ఆ తండ్రికి ఎంత ‘ఋణపడి’ ఉన్నామో తెలుసుకుంటే చాలు). ముక్తా’ఇంపు’: సినీ మాయా బజార్, జీవన నాటక రంగం ఈ రెండిటిని సమతుల్యంగా ఎరిగిన సి.ఎస్.ఆర్. మాత్రం ముఖం పైన రంగు చెరిపేసుకున్నాక స్నేహితుల సముఖం కోసం ఎంచక్కా పాండీ బజార్ వైపు ప్రాకులాడేవారు. అందుకే చివరికి ఆ వేదిక మీదనే తనదైన నివేదిక సమర్పించుకొచ్చి హాయిగా ఇంట్లో కన్ను మూసారు. మేధావి రంగంలో ఇమిడే సి.ఎస్.ఆర్ మేలైన మాట అన్నారు- ‘నాటక రంగం నాకు పుట్టిల్లు. మెట్టినిల్లు సినిమా రంగం. మెట్టినిల్లు మీద మమత తగ్గినప్పుడు నేను పుట్టిల్లయిన నాటక రంగాన్ని అప్పుడప్పుడు వెళ్లి దర్శించి వస్తుంటాను’. (టీవీ సీరియళ్ళ పుణ్యమా అని ఇప్పుడు ‘మూస’ కథా కాలక్షేపం నిక్షేపంగా జరుగుతోంది. ‘మీ నాటకాలు మా దగ్గర సాగవు’ అనేది టీవీల నినాదం. సినిమాలు తీస్తే రాత్రికి రాత్రే దొడ్డి దారిన ప్రింట్స్ తయారై విడుదల రోజు హాళ్ళు బోసి పోతున్నాయి. అటు నాటకాలు, ఇటు సినిమాలు ఈ రెండిటి మనుగడ ఒక పెద్ద ప్రశ్న అయింది. ఇప్పటి నటులు ‘సినిమా రంగం నాకు పెద్దిల్లు. టీవీ రంగం నాకు చిన్నిల్లు.....’ అంటుంటే అంతా కిసుక్కున నవ్వుకోవడమే కదూ, ఈ ‘అంతా’కేదో రకరకాల ఇళ్ళ సంగతి తెలిసినట్టు! ) - డా. తాతిరాజు వేణుగోపాల్ , 10 జూలై 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|