మునుపటి నా మాట
(* 'రచన' మాస పత్రిక 2003 లో నా స్వీయ రచన 'పగలే వెన్నెలా? అదెలా?' ప్రచురితమైంది. అదే రచన 'తెలుగు-వెలుగు' (NY,NJ,CT) స్వభాను ఉగాది ప్రత్యేక సంచిక లో రచన సంపాదకులు శ్రీ శాయి గారి చొరవతో పున: ప్రచురితమైంది. ఈ రచనలో నే చేసిందల్లా 2000 వ సంవత్సరం వరకు వచ్చిన తెలుగు సినీ పాటల్లో 'పగలు వెన్నెల కాయడం' అనే వింత ఆలోచన ఎప్పుడు ఎక్కడ ఎవరితో ప్రారంభమైంది? ఎంత మంది అనుసరిస్తూ వచ్చారు? అనేది పరిశీలించి తేల్చి చెప్పడం! అన్ని వేల పాటల్లో కేవలం పదకొండు మాత్రమే ఆ భావంతో రావడం ఆశ్చర్యంగా ఉన్నా దీటైన కవులంతా ఏదో ఒక సందర్భంలో ఆ భావన పట్ల ఉత్సుకత చూపడం ఆనంద పరుస్తుంది. ఇక్కడ 'ఈ పూట నా మాట' లో అదే రచనని 'తిరగ' రాసి సమర్పిస్తున్నాను. రచన తో పాటు 'పాటలు' వినే,చూసే అవకాశం ఇక్కడ సాధ్యమౌతోంది కనుక నా ప్రయత్నం మీకు ఆమోదమనీ భావిస్తాను. ఈ పూట 'గురి పూర్ణిమ' కనుక ఈ పగటి చందమామ, పగలే వెన్నెల భావాన్ని రాసిన,తీసిన, స్వర పరిచిన, గానం చేసిన సినీ మేధావులందరికీ ఈ నా రచనే గురు దక్షిణ. - డా. తాతిరాజు వేణుగోపాల్) సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు---
అంటుంది ఒకానొక ఎనభైల-తొంభైల పాట. ఆయనకి కనులు, ఈయనకి చెవులు బాగా పని చేస్తాయి కాబోలు. చందమామకీ చెవులకీ సంబంధం ఉంది. లేకపోతె 'మామా చందమామా వినరావా నా కథ ' అని సంబరాల రాంబాబు ఎందుకు మొరపెట్టుకుంటాడూ? అన్నమయ్య కూడా ‘చందమామ రావే జాబిల్లి రావే’ అని తల్లుల చేత కబురు పంపడం ఇప్పటి పిల్లలకూ తెలుసు. ‘చందమామ చూసొచ్చాను. అక్కడంతా మట్టే’ అన్నాడు తిరిగొచ్చిననీల్ తన గట్టి భుజాలు దులుపుకుంటూ. అయినా సూర్యుడంటే మన శారీరిక శక్తి లోపాన్ని గ్రహించేవాడు, చంద్రుడంటే మన మానసిక శక్తిని నిగ్రహించేవాడు అంటుంది జ్యోతిర్వేదం. కానీ సూర్యుడు నక్షత్రం, భూమి గ్రహం, చంద్రుడు ఉపగ్రహం అంటుంది సైన్సు. సూర్యుని నుంచి వచ్చు కాంతి చంద్రునిపై పడి పరావర్తనము చెందుట వలన అద్దానిని ‘వెన్నెల’ యని అందుము అని కూడా అంటుంది సైన్సు లోని కామన్ సెన్సు. చూసారా.. సూర్యుడు లేకపోతేనేమో ఎంతో విలవిల్లాడతాం. కాస్త ఉదయం దాటగానే సూర్యుడి ప్రతాపం భరించలేక తెగ విసుక్కుంటాం. పైగా ‘మాయదారి ఎండా, దిక్కు మాలిన ఉక్క’ అని తిట్లు కూడా. అదే కాంతి చంద్రుడి మీద పడితే ‘ఈ వెన్నెల.. లలల’ అని తెగ పాడుకుంటాం. కవి గారైతే ‘ఎండ-నిప్పుల కుండ, అయితే మరి వెన్నెలా? –ఉంది పాల గిన్నెలా’ అనక పోరు. మా స్నేహితుడు నిండు పున్నమి చంద్రుడు ‘ఆస్ప్రో’ బిళ్ళలా ఉందనేవాడు. సూర్యుడి ద్వారా ఎండ, చంద్రుడి ద్వారా వెన్నెల సహజమని నమ్ముతున్నా కవి తన రచనలో చమత్కార ప్రయోగం చేసి ‘పగలే వెన్నెల’ తేవొచ్చు. ‘ఏమో బాబూ, మేం నమ్మం’ అని భీష్మించి కూర్చున్న వాళ్ళలోసముద్రాల రాఘవాచార్యులు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి , మల్లాది రామకృష్ణశాస్త్రి ప్రముఖులు. వీరితో జట్టు కట్టేరుదాశరథి. వారు ఏనాడూ ఆ భావాన్ని పోషించలేదు. తెలుగు సినిమాల్లో పగలే వెన్నెల చూపించ గలిగిన ప్రతిభాశాలి ప్రముఖ ఛాయా గ్రాహకుడు కీ.శే. మార్కస్ బార్ట్లే . మాయాబజార్ ( 1957) చిత్రంలో వారు + కె.వి. రెడ్డి తీర్చి దిద్దిన ‘లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే తూగెనుగా’ దృశ్య కావ్యం న భూతో న భవిష్యతి.అంతకు ముందు ‘మల్లీశ్వరి’ (1951) లో ‘నెలరాజా వెన్నెల రాజా’, ‘ మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల డోల లూగెనే’ పాట దృశ్యాలు బి.ఎన్.రెడ్డి గారు కూడా పగలే తీసి ఉంటారు, కానీ అవి లాహిరి లాహిరి అంత గొప్పగా మత్తు మందు చల్లలేదు. పగటి పూట చంద్ర బింబం – వింత కాదు. మబ్బు పట్టని ఆకాశంలో మిట్ట మధ్యాహ్నమైనా చంద్రుడు కనిపిస్తాడు. రాత్రి పూట సూర్యుడు – ఉహూ( వీల్లేదు. కాబట్టి రాత్రి పూట అలరించే వెన్నెల పగలు కురియడ మన్నది వింత, విడ్డూరం. అయితే కవి చమత్కారి కాబట్టి ఈ రెండు అంశాలూ ఎంత బాగా చెప్పగలిగాడు అనేది చూడాలి. మల్లీశ్వరి, మాయాబజార్ వంటి మకారాల పుణ్యమా అని ‘మాంగల్య బలం’ (1958) కూడా తెలుగు వారి మమకారం సంపాయించుకుంది. ‘పగలే జాబిలి ఉదయించె నేల?’ అనే ప్రశ్నతో ఒక నవ్య భావానికి తెర తీశారు మహాకవి శ్రీశ్రీ. ‘వాడిన పూలే వికసించెనే’ అనే యుగళ గీతంలో ఒక చరణమది. ఆ ప్రశ్న హీరో ఎందుకు వేశాడో హీరోయిన్ కి అర్ధమైనట్టే ఉంటుందిక్కడ. కాబట్టే ‘వగలే చాలు పరిహాసమేలా?’ అని తిరిగి తనే ప్రశ్నిస్తుందా?. ఆ ప్రశ్నతో ఎదురు చూసే జవాబే ఆమెకు ముఖ్యమక్కడ. అందుకే హీరో అనేశాడు- ‘తేట నీటను నీ నవ్వు మొగమే తేలియాడెను నెలరేని వలెనే’ అని. అంత పగటి పూట ఆమె నవ్వు మొగం చందమామ లాగ ఉందట. ఇక్కడ 'పగటి వెన్నెల' ప్రయోగం కాలేదు కాని 'పగటి చంద్రుడు' మొదటి సారిగా దర్శనమిచ్చాడు. అదే గ్రహించి తన గురువు గారు ఆగ్రహించరులే అనే ధైర్యంతో ఉపగ్రహం తో కొత్త ఉపమానం ప్రయోగించారుఆరుద్ర. అది కూడా తొలిసారిగా పల్లవిలోనే ప్రారంభించారు. ‘అన్నపూర్ణ’ (1960) చిత్రంలో ‘తళ తళ మిల మిల- పగటి పూట వెన్నెల –ఎందువలన? ఓ లలన!’ ఎందువలన – అనేది తెలియడానికి చివరి చరణం వరకూవినాల్సిందే. ‘చిననాటి చెలిమి చిగురించెను నేటికి, మనసు పయనమైనది మధురమైన చోటుకి’ కనుకనే పగటి పూట ఆ వెన్నెల అనుభూతి అలా కలిగింది. ఇప్పటికాలం వారు JVK అనుకోదగ్గ చిత్రం ‘జగదేక వీరుని కథ’ (1961). కానీ కవి పేరు PNR అనడం బాగోదు. రైల్వే టిక్కెట్ మీద అదేదో నంబరు కాబోలు అనుకుంటారు. పింగళి నాగేంద్ర రావు ‘వార్నీ మా పగటి వెన్నెల దృశ్యాన్ని మీ ఇద్దరూ కైవసం చేసుకునీ నన్ను వెయిట్ లిస్టు లో పడేస్తారా?’ అని ఇక లాభం లేదనుకునీ ‘ఉన్నది పగలైనా అహ వెన్నెల కురిసేనే’ లల్ల లా లా ల – సరోజం వికసించేలా, విజయం వరించేలా ‘జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా’ అనే పాటలో ఎన్నో ‘లా’ పాయింట్లు లేవనెత్తేరు. నిజమే-కణకణ మండే ఎండలో జలకాలు, ఏమి హాయి! అప్పుడు పగలే వెన్నెల గా ఉంటుంది. ‘హనీ మూన్’ అనే విదేశీ సంప్రదాయాన్ని ‘ప్రేమ యాత్ర’ గా తెనిగించడం పింగళి వారికే చెల్లింది. ‘గుండమ్మ కథ’(1962) చిత్రంలో ‘పాటిస్తే పొదుపు-అది రేపటి మదుపు(పెట్టుబడి)’ అని అనలేదు కాని అదే సూక్తి చూచాయగా చెబుతూ పింగళి వారు ‘ప్రేమ యాత్రలకు బృందావనము నందవనము ఏలనో’ అన్నారు. ఇటువంటి సందర్భంలో పాట పిక్చరైజ్ చేయాలంటే ఇప్పుడు ప్యారీస్, సింగపూర్, లండన్ లు చుట్టి వచ్చి ‘వెల్ డన్’ కదూ అంటారు. కాని పింగళి వారు చరణంలో అన్న ‘చెలి నగుమోమే చంద్ర బింబమై పగలే వెన్నెల కాయగా’ అనే ప్రయోగానికి మాత్రం జోహారులంటారు. ఇదిగో ఇక్కడ పింగళి వారే చంద్రుడు,వెన్నెల రెండూ తీసుకొచ్చారు. ఇప్పుడంటే ‘పద్మ’నాభుడి ‘సిరి సంపదలు’ గురించి అంతా ఆలోచిస్తున్నారు కానీ 1962 లో పద్మశ్రీ వారి ‘సిరిసంపదలు’ ఏం తక్కువ కాదు. అందుకే ఆచార్య ఆత్రేయ కాస్త వేరే టీ తీసుకునీ వెరైటీ గా శ్రీశ్రీ తొలి సారిగా ప్రశ్నించినట్టే తానూ ఇలా ప్రశ్నించారు హీరో చేత- ‘ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ – ఆ కారణమేమి చెలీ’ అని. హీరోయిన్ ముసి ముసి నవ్వులతోనే ‘హా(‘ అంటూ ఏం చెబుతాడో అని ఎదురు చూస్తుంటే ‘ వింత కాదు నా చెంతనున్నది –వెండి వెన్నెల జాబిలి, నిండు పున్నమి జాబిలి’ అని కవ్విస్తాడు హీరో. ఇక్కడ ఆత్రేయ పింగళి వారిలా చంద్రుడు-వెన్నెల రెండూ ప్రస్తావించారు. ఎటొచ్చీ ‘పున్నమి చంద్రుడు’ అనడం వల్ల ఆ వెన్నెల మహాత్మ్యం ఎంత గొప్పదో ఊహించ వచ్చు. పైగా – వెండి తో పోలిక. చూస్తున్నారు చూస్తున్నారు సి.నా.రె- ఈ ముగ్గురు కవుల విజ్రుంభణ ఇలా ఉంటే తన ‘పూజాఫలం’ (1963) వల్ల తనలో కదిలే ఊహలకి కొత్త రూపం రాక పోదా అని. ‘పగలే వెన్నెల –జగమే ఊయల’ ఒక లైన్ అద్భుతంగా వచ్చింది. అది ఎప్పుడు ఎలా సాధ్యమో చెప్పాలే! ‘కదలే ఊహలకే కన్నులుంటే’ అని ధ్రువీకరించారు. ఇక్కడ హీరో, హీరోయిన్ ల ప్రసక్తే లేదు. సోలో పాట కావడం వల్ల అభినవ జానకు లెందరో వేదిక నెక్కి పాడగలిగేరు. ఇప్పటికీ స్వర జానకి తన బుల్లి పాటల పుస్తకం తెరిచి ఈ పాట పాడనిదే శ్రోతలు ఊరుకోరు. ‘పగలే వెన్నెల’ మకుటంతో ప్రముఖ పాత్రికేయులు వి.ఎ.కె. రంగారావు గారు డా. సి.నారాయణ రెడ్డి గారి తొలి పాటల సంకలనం తీసుకొచ్చారు. సూర్యుడంటే ‘శభాష్ సూరి’(1964) యే కదా, అందులో ‘ఈ వెన్నెల లలలా’ అని విదేశీ కలంతో ఎంత దేశీయం సిరా ఒలికించినా ఆత్రేయ గారికి తృప్తి కాలే. అందుకే ‘పువ్వు పువ్వు ఏం పువ్వు?’ ‘పగలే వెలిగే జాబిలి పువ్వు’ ‘జాబిలీ జాబిలి ఏం జాబిల్లీ?’ ‘నవ్వుల పువ్వుల నువ్వే జాబిలి’ అని ఒక ప్రశ్నా, మరొక జవాబు పరంపరగాపగలు-చంద్రుడు భావానికి కొత్తగా ‘పువ్వు’ తో పోలిక పెట్టి , దాన్ని నవ్వుతో మెలిక పెట్టి హడావుడి చేశారు. మళ్ళీ ఆరుద్ర ‘ఉయ్యాల జంపాల’ (1965) లూగుతూ ‘కొండగాలి తిరిగింది’ అని తెలుసుకోబట్టే వింతగా అక్కడ ఆ స్టేజిలో ‘పట్ట పగలు సిరివెన్నెల భరత నాట్య మాడింది’. వి.ఎ.కె వారు గ్రామఫోన్ రికార్డ్ నంబర్లతో సహాఆరుద్ర గారి పాటల సంకలనం ‘కొండగాలి తిరిగింది’ మకుటంతో ఎమెస్కో ప్రచురణగా అందిస్తే ఎమెస్కో వారు అన్ని కాపీలూ చక్కగా అమ్మేస్కోవడమే గానీ తిరిగి ప్రచురించలేదు. పాటలో పగలు-వెన్నెల పునరుక్తమైంది కాని పగటిపూట చంద్రుడికి మాత్రం ఎప్పటికీ తావీయలేదు ఆరుద్ర. ఇలాంటి అవకాశం మళ్ళీమళ్ళీ ‘చిక్కదు(డు)-దొరకదు(డు)’(1967) అని, తానీ సారి తప్పక పగటి చంద్రుడి ప్రసక్తి తేవాలని ఆసక్తి చూపిన సి.నా.రె. మొత్తానికి సాధించేరు. ముందు శ్రీనివాస్ గళంతో పద్యం పాడి తరువాత ఘంటసాల గొంతుతో 'పగటిపూట చంద్ర బింబం అగుపించెను’ అంటాడు కత్తి వీరుడు కాంతారావు. ‘ఏదీ ఏదీ’ అని అమాయకంగా అడుగుతుంది పుత్తడి బొమ్మ కృష్ణకుమారి, సుశీలంత గోముగా. ‘అందమైన నీ మోమే! అది కాకింకేది?’ అని అతనంటే ఆమె వెండి వెన్నెల కొమ్మ కావలసిందే. ప్రశ్న-జవాబు, పగలు-చంద్రుడు వరవడి లో మరో మధురిమ - సి.నా.రె పలికించిన ఈ సరిగమ. డబ్భైలకాలం ఆసన్నమైంది. సినీ సముద్రానికి ‘న్యూ వేవ్’ ఎదురైంది. చంద్రుడికీ, తరంగాలకి ఎంతో అనుబంధమున్నా ఈ వేవ్ లో ఏవేవో ఇసుక పాటల మధ్య అయిదేళ్ళ అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది పగటి వెన్నెల. ‘మామా చందమామ’ మార్క్ రాజశ్రీ వంటి ఒక ‘ఊరికి ఉపకారి (1972)’కి మాత్రం ఊరికే ‘పగలు’ అని ప్రయోగించే చోట ‘ఎండ’ బాగా ఉపకరిస్తుందని తోచిందే తడవు ‘ఏమమ్మా రాధమ్మా’ అని సంబోధిస్తూ ‘ఎండ ఈ వేళ ఎన్నెల్ల ఉంది’ కదూ అన్నారు. ఆహా! అదే కదా తత్వ బోధ అంటే. ఎండలో ఉంటూనే వెన్నెల వంటి అనుభూతితో పని చేసుకు పోతుంటారు శ్రమజీవులు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పదిహేడేళ్ళు విజ్ఞానం బాగా వంటబట్టిందో ఏమో కాని ఇటువంటి విచిత్రాలు మా కొద్దు అని ఎన్నో చిత్రాలు పగటి వెన్నెలని పక్కన బెట్టేసాయి. ‘ఆమనీ పాడవే హాయిగా’ అని రాస్తున్నప్పుడేవేటూరి సుందర రామ మూర్తి కవికి ఎడా పెడా డబ్బింగ్ చేసేస్తున్న రాజశ్రీ గీతోపదేశం గుర్తొచ్చి ఉండాలి. ‘గీతాంజలి’ లో ఒక భాగంగా ‘ఝల్లంత కవ్వింత కావాలిలే’ అనే గందరగోళ అవస్థలో ‘ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే’ అని ఇళయ రాజసంగా ముగించారు. ముక్తాయింపు: నేటికి ఈ అయిదారుగురు కవి రాజుల్లో ఈ ‘పగటి వెన్నెల’ మూలాల ఆచూకీ తెలిస్తే చెప్పగలిగేది ఆచార్యులు డా. సి.నారాయణ రెడ్డి గారు ఒక్కరే. త్వరలో ఎనిమిది పదులకు దగ్గరౌతున్న ఆయన ‘సహస్ర చంద్ర దర్శన భాగ్యులు కానున్నారు. చంద్రుడికో నూలు పోగు లాగ ఈ పదకొండు గీతాల మాల వారికే సమర్పణం. వీడియోలు నాలుగు, ఆడియోలు మూడు మీ కోసం లోపలి పేజీల్లో ఎదురు చూస్తున్నాయి. -డా. తాతిరాజు వేణుగోపాల్, 15 జూలై 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|