మునుపటి నా మాట
కవి దాశరథి కృష్ణమాచార్యులు(దాశరథి) వారి జయంతి ఈ రోజు (జూలై 22). భువి పైనే ఉంటే ఆయనికిప్పుడు 85 నిండేవి. ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ’ మరెన్ని పాటలు ఇచ్చేవారో? పాతికేళ్ళ నాటి మాట ఆకాశంలో హంసయై హాయిగ ఎగిరి, మధ్యలో ‘వెన్నెలలో మల్లియలు మల్లెలలో ఘుమఘుమలు’ మరీ దగ్గరుండి ఆస్వాదించి, అటు పైన దివిలో విరిసిన పారిజాతం కోసుకొచ్చి భువికి తేవాలని కృష్ణమాచార్యులు పయనమై పోయి పాతికేళ్ళు కావొస్తోంది. ఆయన తన దారి వెతుక్కునీ మనకి తన గీతాల బాట మీద అడుగుజాడలు మిగిల్చారు. గీతాచార్యులు అనిపించుకున్నారు ఇక్కడ తొలిసారిగా రంగుల తేనె మనసులు (1965) ‘దివి నుండి భువికి దిగి వచ్చే దిగి వచ్చే పారిజాతమే నీవై నీవై’ అని కలవరిస్తే , మలి సారిగా ఒక కన్నె వయసు (1973) నలుపు-తెలుపు ప్రేమ ముచ్చటగా ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ అని పలవరిస్తే మధ్యలో లేత మనసుల (1966) సాక్షిగా ‘హలో మేడం సత్యభామా’ అని పలకరించినది ఎవరండీ ఈకృష్ణమాచార్యులేగా? అయితే ఈ ఆ‘కలి’ యుగం కన్నా ఆ ద్వా‘పర’ లోకమే మెరుగని ఎరుగని మనకు ఒక్కొక్క గీతంలో పారిజాత పరిమళం అద్ది ఇచ్చి తన విశ్వ రూపం ప్రదర్శించిన ‘గీతాచార్యుల’ని ఎందుకనుకోరాదూ? తిమిరంతో సమరం అగ్ని ధార తో సరి దాశరథి అని మనకి తెలిసిన పేరునే మనం స్మరిస్తే ‘సూర్యవంశానికి చెందిన శ్రీ రామ చంద్రుడు’ గుర్తొస్తాడు. ఆయనలోని సూర్యుడు అధర్మం మీద ‘అగ్ని ధార’ కురిపించినట్టు, ఆయనలోని చంద్రుడు నిరంకుశత్వం అనే 'తిమిరంతో సమరం' చేసినట్టు గుర్తొస్తుంది.
గుండె గాయాలు మాన్పే గాలిబ్ గీతాల పూతలు కవి దాశరథి తన రెండు కళ్ళు ఉర్దూ,తెలుగు అని ప్రకటిస్తే మనం ఆలోచించాం. ‘తీగలను తెంపి అగ్నిలో దింపినావు – నా తెలంగాణా కోటి రతనాల వీణ' అని నిజామ్ ప్రభువుని నిలదీసిన తీరు చూసి ‘పొట్టివాడు గట్టివాడే’ అని ఆయనతో జట్టు కట్టాం. ఏ మాట కా మాటే చెప్పుకోవాలి. ప్రభువు అనుభవించేవి భోగ భాగ్యాలు కనుక ఆయన మోజు పడే రత్నాలు, అందునా వాటిని మరింతలు చేసే ‘కోటి’ రత్నాలు పొదిగిన వీణగా తెలంగాణ ను కీర్తించినదెందుకంటే తీగలు తెంపి అగ్నిలోకి తోసేస్తే ఆ వీణ నాశనం అయిపోతుందని అనుకోవడం వెర్రి తనమే అని హెచ్చరించడానికే. అలా ‘గుండెలోని గాయాలు మండించే గేయాలు’ కావడంతో ఆయన గాలిబ్ గీతాల లోని చల్లని స్పర్శతో సేద తీరాడు. ఆ చలువకి తెలుగుతనం అద్ది మనందరి సేద తీర్చాడు. ఆ సేద తీర్చే చేద - ఆ గీతాల పక్కన బాపు గీత ! ‘నాదు గుండె గాయం కుట్టు సూది కంట –అశ్రు జలధార దారమై అవతరించె’, ‘చింతిలెడు మాకు బ్రహ్మాండ మెంతొ ఇరుకు-అందు గగనమ్మొక పిపీలకాండమంత’ ‘మనిషి ఏకాకియైనను మనసులోన-గుంపులుగ భావములు చేరి గోష్టి జరుపు’ ‘నీటి చుక్క ముత్తెమౌట వర్జించెను- కనులలోన నిలువ గలిగె నిపుడు’ ‘బాల్యమున మజ్నూపై చిన్న రాతిని-విసరాలని చేపట్టినాను అప్పుడే తోచింది –నాకును నొక తల ఉన్నదని’ ‘ఆమె గనినంత నా మొగ మందగించె-రోగి బాగయ్యెనను కొన సాగె నామె’ వంటి నవ్య తత్వ చింతనతో పాటు ‘వత్తునని రాక నా గృహద్వారమునకు –నన్నె కాపలాగా నిల్పినా వదేమె?’ ‘అద్దమందు నిన్నె అవలోకనము సేసి-ఈర్ష్య చెందుచుంటివేమె, సుదతి! నిన్ను వంటి అందమున్న వారింకొక-రుండినేని యెంత మండి పడెదొ’ ‘ఎంత తీయని పెదవులె ఇంతి నీవి?-తిట్టుచున్నప్పుడు గూడ తీపి కురియు’ వంటి భావనా చాతుర్యం మనకు అందించి ‘గజల్’ పట్ల మోజు పడేట్లు చేసిన తొలి భావుకుడు దాశరథి. వేటూరి కలం కారీ తనం అద్దిన దాశరధి చిత్రం వేటూరి వారన్నారు- అతను బుడుగైనా ఆర్తి పొడుగు. మూర్తి చిన్నదైనా కీర్తి దొడ్డది. అతను నాటు తెలుగు గూటిలో గుట్టుగా దాగి ఒక్క పెట్టున గుక్కపట్టి గొంతు విప్పిన కవితల గిజిగాడు. అమాయకుడు,అమల హృదయుడు,ఆవేశ పరుడు,ఆంధ్రుడు –అన్న పదాలు దాశరధికి పర్యాయ పదాలు. వినయశీలి, వేదాంతి, విప్లవకారుడు ఆయన. ఆస్థాన కవి అంటే ఆ స్థానం ఆయనకే ఆంధ్రుల తొలి ఆస్థాన కవిగా నిలబడిన దాశరథి ఎదుగుదలకి కొలమానం ఆయనలోని వినమ్రత. అంతే కాదు ఆయన స్వాతంత్ర సమర యోధుడు కూడా. ఉభయ భాషా ప్రావీణ్యత మరో అదనపు సౌలభ్యం. దాశరధి బహు దిశా రథ సారథి దాశరథి 'గేయం' అయినా ‘గీతం’ అయినా అందులో పాటించింది – మాట క్లుప్తత, భావ స్పష్టత. ఎన్నో సినిమాలకు ఆయన ఎన్నో పాటలు రాశారు. ఆకాశవాణి గా గాలి దారుల మీదుగా లలిత గీతాలు పలికించారు (హాసంలో, ఆంధ్రప్రభలో లోగడ ప్రచురించినవి కొన్ని, ఆ పత్రికల వారికి కృతజ్ఞతలు చెబుతూ 'కనులు చదివినా పాటే' లో మీ కోసం అందిస్తున్నాను). సమాజంలో ఎదుగుతున్న మనిషికి పరిస్థితులు విషమంగా తోస్తే వాటి నెదుర్కునేందుకు ఆవేశం రావాలి, ఆవేదన కావాలి అని చెప్పడానికి ఆయన జంకలేదు. అటువంటి వైషమ్యాలు లేని అనురాగ సీమ లో పుట్టిన ప్రతి పాపాయి నవ్వాలి, పండగే రావాలి అన్నదే కవి దాశరథి ఆశయం. సినీ ‘ఖుషీ’వలుడు ఒక్క దాశరథి మాత్రమే మొత్తం అన్ని పాటలు రాసిన సినిమా ఏదైనా ఉందేమో అని వెదికితే కనిపించక పోవచ్చు కానీ ( ఆగండి - నాకు తెలిసి శ్రీ వాణీ ఫిల్మ్స్ వారి 'నాదీ ఆడజన్మే (1965)' లో పాటలన్నీ దాశరథి గారివే, కాకపొతే ఆయనకి ఇక్కడ స్వేఛ్చ తక్కువే) దాశరథి గారి పాట ఒక్కటైనా ఏ సినిమాలోనైనా ఉంటే అది తప్పకుండా ప్రజల నోట ఎప్పుడూ పలుకుతూనే ఉండేలా ఉంటుంది. ఏదైనా సినిమాలో ఒకే పల్లవితో రెండు పాటలు ఒకటి సంతోషంగా, ఇంకొకటి విషాదంగా ఉన్నాయంటే వాటి కర్తలు ఆత్రేయ కవి గానీ, దాశరథి కవి గానీ అయి ఉండాలి. స్వంత భాషలో సరే - తమిళం నుంచి తెలుగులోకి, హిందీ లోంచి తెలుగులోకి ఏదైనా సినిమా రీటేక్ అయితే అక్కడా ఈ సంతోష విషాదాలు దాశరథి కలానికి కరతలామలాకాలే. అయితే, 'నాదీ ఆడజన్మే' లో 'నా మాట నమ్మితివేల?' అనే పల్లవితో ఉన్న రెండు పాటలూ సంతోషం వైపునే నిలవడం ఆశ్చర్యంగా ఉంటుంది. దాశరథి సినీ కవిగా అవతారమెత్తినది అన్నపూర్ణా వారి 'ఇద్దరు మిత్రులు (1961)' చిత్రం ద్వారా. 'ఖుషీ ఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ' ఆయన పాటలకొక కొత్త వరవడి తెచ్చారు. అందులోనే ఒక 'కవ్వాలీ' రాసి అందులోనూ 'నవ్వాలి నవ్వాలి ' సుమా అనే సందేశమే ఇచ్చారు. 'ఖుషీ ఖుషీగా నవ్వుతూ' నే ఆయన ఎంచక్కా 'ప్రియుని చేర' అనే గ్రాంధిక ముద్ర పక్కనే 'వెళ్ళింది నా చెలి మీనా' అనే వ్యవహారిక ముద్ర వేయటం చూస్తే ఆయన ఉభయ ‘ఖుష్’ లోపరి అనేగా అర్థం! ('ఇద్దరుమిత్రులు' తో కవిగా దాశరథి సినీ ప్రవేశం జరిగిందని ఆరుద్ర కవి విజయచిత్రలో గుర్తు చేసుకున్నారు-ఆహా ఆహాహా లో ప్రతి రాత ప్రసిద్ధమే చూడండి) ఉభయ భాషల్లోనే కాదు , ఉన్న భాషలోనూ రెండు పార్శ్యాలని కట్టిపడేసే వారిగా తొలినాళ్ళలోనే గుర్తింపు పొందిన ‘పార్శ్య’ నాధుడు దాశరథి. తరువాత కవి మిత్రుడు ఆచార్య ఆత్రేయ స్వయంగా నిర్మించిన, స్వీయ దర్శకత్వం వహించిన 'వాగ్దానం(1961)' చిత్రం ద్వారా 'నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాలు గెలువ నీరా' అనే అనురాగ అనుబంధాన్ని కొత్త పద్ధతిలో చెప్పారు. మన వెంట వచ్చేది ముందో, వెనకో మన 'నీడ' మాత్రమే. అదీ మన మీదో మన వెనకో పడే వెలుతురు బట్టీ ఉంటుంది. 'నీ వెంట' అన్నప్పుడు ఆమె 'నేను నీడలా' ఉంటాను అనేగా చెబుతోంది. అది సాధ్యం కావాలంటే ఆమె కంటికి వెలుతురు తెలియాలి. ఆ వెలుతురు అతనే! ఆ వెలుతురులో ఉండేవి ఏడు రంగులు. ఇద్దరి చూపుల వెలుగు ఒకటైతే ఏడేడు లోకాలు గెలిచినట్టే కదా - అనుకుంటే ఇంత ఉంది వ్యవహారం. తొలిచిత్రంలోనూ, మలి చిత్రంలోనూ రాసిన ఆ రెండు యుగళ గీతాల్లో చంద్రుడు,వెన్నెల చోటు చేసుకోవడం విశేషం.‘చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసి పోదమా హాయిగా’ అని తొలిసారి , ఆ చందమామలో ఆనంద సీమలో –వెన్నెల స్నానాలు చేయుదమా’ అని మలిసారి అనగా విన్నాం. 'మజ్నూ నేనైతే ఓ లైలా లోకమే చీకటై పోవునే' అని తొలి సారి, 'నీ వెంట లోకాలు గెలవనీరా' అని మలి సారి ఆయన ప్రకటించడం చూస్తే లోకంలో వెన్నెల వంటి వెలుతురంటే ఆయన కున్న అపేక్ష అర్థమౌతుంది. 'తిమిరంతో సమరం' చేసిన యుద్ధ వీరుడు అలానే ఆశిస్తాడు. దాశరథి అష్ట పది దరిమిలా దాశరథి కొన్ని పదాల్ల పట్ల మక్కువ ఏర్పరుచుకున్నట్టు తెలుస్తుంది. ఆకాశం, వెన్నెల, పాపాయి, ఉయ్యాల, కోవెల, పువ్వు, నవ్వు , మది -ఈ అష్ట పదాలనే ఎనిమిది దిక్కులుగా భావిస్తూ ఆయన కలం ఎన్ని చుట్లో చుట్టింది. అయినా తూర్పు దిశలో రవి బింబం లాగ ఎప్పటికప్పుడు ఏదో కొత్త దనం కన్పించేది. అదే మరి- పునరుక్తం లోనూ విసిగించని జాణతనం అంటే. 'అందాల ఓ చిలకా' అని ఒకసారి అన్నా 'గోరొంక గూటికే చేరావు చిలకా' అని మరో సారి అన్నా , 'అందాల ఓ చిలకా అందుకో నా లేఖ' అన్నా 'రాశాను ప్రేమలేఖలెన్నో' అన్నా, 'దివి నుండి దిగి వచ్చే పారిజాతమే నీవై నీవై' అన్నా, 'ఏ దివిలో విరిసిన పారిజాతమో' అన్నా, 'నా హృదయపు కోవెలలో' అన్నా, 'మనసే కోవెలగా' అన్నా, 'మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పులే' అన్నా, 'భువిలోన మల్లియలాయే ' అనో 'మమతలు మల్లెలుగా' అనో అన్నా, 'పాపాయి నవ్వులే మల్లెపూలు' అని ఒకసారి పోలిక చూపించినా , 'పాపాయి నవ్వాలి పండగే రావాలి' అని మరో సారి కోరిక తెలియజేసినా – అన్నీ బాగానే ఉండేవి. 'నెయ్యాలలో తలపుటుయ్యాలలో' ఒకసారి ఆనందపుటంచులు అందుకున్నా, ' హృదయాలు కలిసి ఉయ్యాలలూగి' ఆకాశమే అందుకోగా మరోసారి, 'ఆకాశానికి అంతుంది - నా ఆవేదనకు అంతేది' అని ఒక చోట నిరాశ చెందినా , 'ఆకాశంలో హంసలమై కులాసాగా తేలిపోదామా' అని మరో చోట నికార్సుగా ప్రకటించినా అవీ బాగానే ఉండేవి. అవే మాటలు పదే పదే విన్నా అనుభూతి పరంగా భిన్నత్వం అలరించేది. 'నా హృదయపు కోవెలలో' పాట లో దాశరథి కోవెల, మందిరం, ఆలయం అనే మూడు సమానార్ధ పదాలు ప్రయోగించారు. దాశరథి కరుణాపయోనిధి శ్రీ వైష్ణవ సంప్రదాయం లో అయ్యవారికి ఇచ్చుకునే వినతులు అమ్మ వారి ద్వారా చేర వెయ్యడం అనేది ఉంది. నాడు భక్త రామదాసు 'నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి' అని తన విన్నపం ఎలా నివేదించుకున్నాడూ? అయితే దాశరథి రాసిన 'నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర ది గి వ చ్చునో' అన్న (రంగుల రాట్నం, 1967)సినీ గీతంలో పల్లవి,అనుపల్లవి అసంపూర్ణంగా ఉంటూ చరణాల చివరల్లో 'విభువుకి మా మాట వినిపించవమ్మా' అని మంగమ్మ తల్లికి విన్నవించుకోవడం కనిపిస్తుంది. ఇది ఒక సాహస ప్రయోగమే. 'స్వామి కరుణా మయుడు' అన్నది దాశరథి వారి సడలని నమ్మకం. అది కూడా మరో సందర్భంలో పునరుక్తం చేస్తున్నట్టే చేసి కొత్త నడక తో ముందుకు సాగారు. 'తిరుమల మందిర సుందరా/సుమధుర కరుణా సాగరా' (మేనకోడలు, 1972) పాటను సినిమా సన్నివేశం కోసం సుశీలమ్మ చేతే పాడించినా ఆ పాట ఎంతగానో నచ్చి తన తృప్తి కోసం ఘంటసాల మాస్టారు తాను కూడ వేరుగా పాడి రికార్డ్ చేయించారు. సాగరం ఉప్పగా ఉంటుంది కదా. సుమధురం అంటారేమిటి దాశరథి ? అని మొండి ప్రశ్న వేసేవారికి 'అక్కడ సముద్రం ముందు ఉన్న 'కరుణ' అనేది మరచి పోకూడదు' అని హెచ్చరించాలి. కన్నీరు ఉప్పగా ఉంటుందేమో కాని కరుణ తియ్యటిదే. నాడు త్యాగరాజ స్వామి ‘నను పాలింప నడచి వచ్చితివో నా ప్రాణ నాథా’ అని మోహనంగా కీర్తించడం అందరికి తెలిసినదే. శ్రీ రాముడైనా శ్రీకృష్ణుడైనా శ్రీ వెంకటేశ్వరుడైనా అంతా ఆ విష్ణు రూపమే కదా. ‘బుద్ధిమంతుడు (1969)’ అనదగ్గ దాశరధి చేత ‘నను పాలింపగ నడచి వచ్చితివా గోపాలా’ అనే ఒక అపర గానం అలా సిద్ధింప జేయడం సాధ్యమైంది. విశేషం ఏమిటంటే కృష్ణుడుని ఎక్కువగా ‘గోపాల’ నామంతోనే స్మరించుకున్నారు దాశరథి. ట్యూన్ మీది –పాట రాసే ఫార్చ్యూన్ నాది 'కుముదం' అనే తమిళ సినిమా లోని ట్యూన్ ఆధారంగా పాట రాయాల్సి వస్తే కేవలం ఇటు అటు ఫోన్ ద్వారానే పూర్తి స్థాయి తెలుగు తనంతోనే 'నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే (మంచి మనసులు,1962) ' పాట రాసిన ఘనత దాశరథివారిది. అప్పటి ఆ మహదేవన్ బాణీ, దాశరథి వాణి ఇప్పటి కీరవాణి పాట గుండె కి సైతం ఒక ‘లబ్ + డబ్’ ధ్వని కావడం విశేషం. దాశరథి గారంటే ఇచ్చిన ట్యూన్ కి మెచ్చే మాటలు అందించే నూటికి నూరుపాళ్ళ తెలుగు వారని సినీ సంగీత సీమకి తెలుసు. ఎప్పటిదో తమిళ వరస తెచ్చి నిర్మాత ఆ భావం కాకుండా వీణ పాట రాయ మంటే దాశరథి వారు చక చకా రాసి ఇచ్చిన పాట- 'మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన' (జమిందార్ గారి అమ్మాయి, 1975). ఇలా రాయటం ప్రముఖ తమిళ కవి కణ్ణదాసన్ గారికి ఎంతగానో నచ్చిందట. మహదేవన్ గారి దగ్గర కొన్నాళ్ళు అసిస్టెంట్ కంపోజర్ గా ఎస్. పి. కోదండపాణి ఉండేవారు. 'కన్న కొడుకు (1961)' చిత్రం తో పాణి స్వతంత్రుడయ్యారు. అయినా చొరవ తోనే మామ పాణిని మహా నటి సావిత్రి తీసిన, దర్శకత్వం వహించిన'మాతృ దేవత (1969)' లో ప్రధానమైన పాట 'మనసే కోవెలగా మమతలు మల్లెలుగా' కి వరస కూర్చమన్నారు. పాణి అద్భుతంగా స్వర పరిచేరు. పాణి పేరు టైటిల్స్ లో వేయాలని మామ కోరితే పాణి గురుభక్తితో వద్దన్నారు. ఆ పాట రాసిందిదాశరధి గారే. సినీ విపణి లో కోదండపాణి కి తొలి బోణీ , దాశరథి కి తొలి లాభం కూర్చినది 1961 కదా. దాశరధి పాట బాణం - స్వయం వరం కొందరికి దాశరథి వారి రచన 'నా హృదయపు కోవెలలో' బాలు తొలిసారిగా అక్కినేని వారికి ఇద్దరు అమ్మాయిలు (1970)చిత్రానికని 'ట్రాక్' గా పాడినా బాలు అదృష్టం, ఘంటసాల వారి ఆశీస్సు వల్ల అది బాలు పాట గా 'రికార్డ్' స్థాయిని పొందింది. అలాగేదాశరథి వారి 'చిక్కావు చేతిలో చిలకమ్మా' పాట అక్కినేని వారి కోసం రామకృష్ణ తొలిసారిగా పాడి ఒక విచిత్ర బంధం(1972) నెలకొల్పారు. అక్కినేని,దుక్కిపాటి వారి అన్నపూర్ణా సంస్థ ఆనాడు రచయితగా దాశరథి గారినీ, తరువాతి కాలంలో గాయకుడిగా రామకృష్ణ నూ పరిచయం చేసిన విషయం తెలిసినదే. దాశరథి 'గోరొంక గూటికే చేరావు చిలకా/ భయ మెందుకే నీకు బంగారు మొలక' (దాగుడు మూతలు,1964)- పాట లో 'అబ్బ- ఉండన్నాయి' అనే నిత్య వ్యవహారిక పదాలు వాడడం , మహదేవన్ స్వర విన్యాసంతో ఘంటసాలవంటి మేధావికి అది ఒక గాత్రాభినయం కావడం - ఎంత ఆరోగ్యకరమైన పోటీ! అలాంటి పోటీలు పెట్టే చలాకీ మాటలు రువ్వే 'ఖిలాడీ' దాశరథి. దాశరథి తెలుగు వారి సాథీ ఎవరేమనుకుంటే ఏం అని అని దాశరథి వారు ఎప్పుడో ఒక గట్టి తీర్మానం చేసేశారు- 'పసి పాప పలికేటి మొదటి మాట - అదే అమ్మా అమ్మా అనే తెలుగు మాట' (మామంచి అక్కయ్య, 1970)అని. ఇంకో సందర్భంలో నర్తకి భాష ఏమిటో చెప్పాలని తెనాలి రామలింగడికి పరీక్ష పెడితే దాశరథి కలం ఆ నర్తకి చేత 'పొగరు గల పిల్లా- ఇది తెలుగు జాతి పిల్లా- లొంగే మాట కల్ల' అని తెలుగులోనూ, 'సాథీ హూ( తేరే సాథీ హూ( ' అని ఉర్దూ లోనూ పలికించింది (కథానాయిక మొల్ల,1970). దాశరథి కథా సరిత 'కోనసీమ పల్లెలోన గొప్ప వారి ఇంటిలోన పాప లాంటి మనసున్న పద్మనాభుడు బాబుగారు' వారి 'వింత సంసారం(1971)' గురించి పెద్దలకు చెప్పాలన్నా, 'కలతలు లేని నలుగురు కలసి సాగించారు 'పండంటి కాపురం (1972)' అని పెద్దల కథ పిల్లలకు చెప్పాలన్నా ఆయనకు ఎంతో ఇష్టం. అలాగే సైకిల్ మీద విజిల్ వేసుకుంటూనే ఒక శ్రామికుడు -చెడిపోతున్న సమాజం లో ధన మదంతో మారుతున్న మనిషి గురించి –బాధపడుతూ ‘మంచిని మరచీ వంచన నేర్చీ’ 'పంపకమంటూ వచ్చే సరికి అంతా తనదే అన్నాడు' అని నిట్టూర్చడం ప్రతి ఒక్కరి అనుభవ సారమే అన్నట్టు చెప్పడం ఆయనకే చెల్లింది (ఒకే కుటుంబం,1970). దాశరథి శతకం – అంటే దాశరథి వారి ఒక 'నూరు' పాటలు పోగు చేయాలనుకుంటే ఆ జాబితా లో ఇంతవరకు చెప్పుకున్న పాటలతో పాటు ఇంకెన్ని చేర్చాలో ఆలోచించండి. అన్నిటికన్నా తెలుగు వారి ఇళ్ళల్లో దాశరథి వారి రెండు లలిత గీతాలు ఇప్పటికీ వినిపిస్తుండడం విశేషం. అవి- 1.ఘంటసాల వారు 'కళ్యాణి' రాగం లో స్వర పరిచి పాడిన 'తలనిండ పూదండ దాల్చిన రాణి' ( ఈ పాటలో ఇందాక చెప్పుకున్న దాశరథి ముద్రలు అనదగ్గ ఆకాశం, నవ్వులు, పూలు ఉంటాయి) 2. తిలంగ్ రాగంలో స్వర పరిచిన ఘంటసాల,లీల ల యుగళ గీతం 'వెలిగించవే చిన్ని వలపు దీపం -ఎందుకే నా మీద ఇంత కోపం'. ఇవి రెండూ శతకానికి తొలి పలుకు (తల కనుక) ,తుది పలుకు (దీపం కనుక) గా చేర్చుకుంటే బావుంటుంది. ముక్తాయింపు: నాలుగు వీడియోలు ‘కనులు చూసినా పాట’ లో దర్శనమిస్తున్నాయి. ‘రంగుల రాట్నం (1967)’ లోని ‘నడిరేయి ఏ జాములో’ పాట ప్రముఖ విలన్ పాత్రధారి త్యాగరాజు (ఈ చిత్రంలో సాత్వికుడు) మీద చిత్రీకరించారు. అదో గొప్ప ‘రెవల్యూషన్’. అంతే కాదు వారికి ఘంటసాల పాడారు, అది ఇంకో విశేషం. ఒకసారి ఘంటసాల వారి కచేరి తిరుమల పైన జరుగుతోందట. అదే రోజు స్వర జానకి, ఆమె భర్త దైవ దర్శనానికి తిరుపతి వచ్చారట. ఆ సంగతి ఘంటసాల వారికి తెలిసి అప్పటికప్పుడు ఈ పాట పాడించుచు కున్నారట. అందుకేనేమో తెలుగు వారి ఇలవేల్పు దాశరథి కవిని ఆస్థాన కవిని చేశాడు. ఇక –మరో వీడియో (కథానాయిక మొల్ల, 1970) లో సహజ నటుడు గుమ్మడి ఎంతో హృద్యంగా 'మనిషిని బ్రహ్మయ్య' తత్త్వం పాడుతుంటే ఎంతో ‘రిలీఫ్’ గా ఉంది కదూ. అతి తక్కువ పాటలున్న గుమ్మడి గారికి బాలు తొలి సారిగా పాడిన ఘనత ఈ పాట దక్కించుకుంది. ‘మనుషులు మారాలి (1969)’ ఒక గొప్ప మలుపు తిప్పిన చిత్రం. దీనికి మళయాళం ‘తులాభారం’ చిత్రం ఆధారం. అయితే దాశరథి సామ్యవాదంలో ఋతు ఘోష తీసుకు రావడం అనితర సాధ్యమే కదా. 'పాపాయి నవ్వాలి పండగే రావాలి' వంటి పాటలీ రోజుల్లో కూడా కావాలి. ‘గూడు పుఠాణి (1972)’ చిత్రంలో 'కన్నులైనా తెరవని' చిట్టిపాప స్వాగతం పాట పూర్తిగా లేదే అని విచారించకండి. సన్నివేశం అలాంటిది. ఈ చిత్రంతో ఇద్దరు నూతన నటీమణులు శుభ, హలం పరిచయమయ్యారు. రెండు ఆడియోలేనా అంటే అదంతే . కాసేపు లలిత గీతాలు వినడం ఆరోగ్యానికి మంచిదంటారు సినిమాలు చూడని డాక్టర్లు. -డా. తాతిరాజు వేణుగోపాల్ (22 జూలై 2011)
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|