మునుపటి నా మాట
భాద్రపద మాసం, శుద్ధ చవితి తిథి అంటే ‘వినాయక చవితి‘ మనకి. భాద్రపద శుక్ల చతుర్థి – శ్రీ గణేష్ చతుర్థి మహారాష్ట్రలో. ప్రతి మాసం శుక్ల పక్షంలో వచ్చే నాల్గవ తిథి- చతుర్థి-ని వినాయక చతుర్థి అంటారక్కడ. ప్రతి నెలా బహుళ (కృష్ణ) పక్షంలో వచ్చే చతుర్థిని ‘సంకష్ట’ చతుర్థి అంటారు. శ్రావణ మాసం శుక్ల చతుర్థిని వినాయక నాగ చతుర్థి అంటారు. ఎందుకంటే ఆ మర్నాడు పంచమి నాడు ‘నాగ పంచమి’ కనుక. ఎడమ వైపు మీరు చూస్తున్న గణపతి పుణే లోని ప్రసిద్ధ దగ్డూ షేట్గణపతి మందిర మూర్తి. భాద్రపద శుక్ల చతుర్థి నాడు చంద్ర దర్శనం నిషేధం. ఆకాశంలో నెలవంక ఇలవంక కవ్వించే రీతిలో చూస్తుంటే అప్రయత్నంగానే చూస్తాం. అయ్యో నిందలేనా అని ఆనక ఘొల్లుమంటాం. పాపం ఈ బోటు ఆకారం లో ఆకాశ నదిలో విహరించే చంద్రుడి బోటి వారికి శాపమేమిటో? అవును మరి- అంత పెద్ద బొజ్జతో గణపతి దర్శనమయ్యే సరికి శివుడి సిగలో హాయిగా కూర్చున్న ఈ బక్కపలచ వాడికి నవ్వొచ్చింది. అంతే ఫెడేల్న అంబ శపించింది. మిగతా పదకొండు నెలల్లో వచ్చే చతుర్థి నాడు జనం నిన్ను చూడొచ్చు కానీ ఒక షరతు – చూసినవారు ఉపవాసముండాలి అని పార్వతీ దేవిసవరించింది. అంతా మన మంచికేనేమో! ఆ రకంగా నెలకో మారు ఉపవాసముంటే ఆరోగ్యానికి మంచిదే. అసలు ఈ చవితి నాడు వినాయకుడు పుట్టాడా? కాదు. ప్రథమ పూజ పొందగలిగే ఏకైక వ్యక్తిగా, దైవిక శక్తిగా శివుడుగణపతిని ప్రకటించిన రోజు. గణపతి అనగానే తెలుస్తోంది- గణాలన్నిటికి అధిపతి అని. అందుకే మహా గణపతి కూడా. గణేశుడు- అంటే గణాల ఈశుడు. గణాల దేవుడు. ఏ పూజకైనా తొలి నామ పఠనం గణేష్ దే కనుక ‘ప్రధమేష్’ అయ్యాడు. ఏ దేవుని స్తుతించినా ప్రతి నామ మంత్రం ముందు ‘ఓమ్’ చేర్చాలి. ఓంకారం ప్రణవ నాదం. అది బ్రహ్మ దేవుని సృష్టి. తొలి విఘ్నాలను హరించజేయడానికి బ్రహ్మ ఓంకారాన్ని సృష్టించాడు. ఆ తరువాత దానికి ప్రాణం పోసే ఘడియ వచ్చింది.
ప్రతి ఇంట్లో అమ్మ కాసింత పసుపు ముద్ద తీసుకుని ఓ బొమ్మ చెయ్య గలదు. కానీ జగన్మాత పార్వతి పసుపు బొమ్మకైనా ప్రాణం పొయ్యగలదు. అయితే ప్రతి ప్రాణి పుట్టుక, గిట్టుట అనేవి త్రిమూర్తుల చేతుల్లో ఉంది. శివుడు తననే అడ్డగించిన పసుపు బాలుడి తల తెగ వేశాడు. అప్పుడు పార్వతీ దేవి రోదిస్తే బ్రహ్మ తన ఓంకార సృష్టికి ప్రాణం పోసి ఈ బాలుడిలో ప్రవేశపెట్టాడు. ఉత్తర దిశలో కైలాసం లో నివాసముండే శివుడు గణాలని పంపించి ఉత్తర దిశలో తలపెట్టి శయనిస్తూ ఉండే జీవి శిరస్సును తీసుకు రమ్మన్నాడు. ఆ శిరస్సు గజముఖం కావడం, అదే పసుపు బాలుడుకి శిరోధార్యం కావడం జరిగి పోయాయి. అప్పటినుంచి ‘గజానన’, గజముఖ’, ‘గజ రాజు’, ‘ఏక దంత’, ‘వక్ర తుండ’ – వంటి పేర్లతో పిలవబడ్డాడు గణేశుడు ( నేటి జెనెటిక్ ఇంజనీరింగ్ కి నాటి ఈ ఉదంతమే ప్రేరణ, అవునా?). గణేశ నామాలలో ‘స్కందాగ్రజ’, ‘గుహాగ్రజ’ అంటూ కుమారస్వామికి సాక్షాత్తు అన్నవి నువ్వు అనే అర్థం స్పురించేలా ఉంటాయి. గణేశుడిని ప్రథమ పూజకు అర్హుడిగా శివుడు నియమించడంలో కుమారస్వామి పాత్ర కూడా ఉంది. తమిళ నాట ఈ ఉభయ దైవాలని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఏ పనికైనా విఘ్నాలు ఎదురైతే ఎలా? అవి తొలగించే నాధుడు కావాలి. అందుకు ‘విఘ్నేశ్వరుడు’ సిద్ధమయ్యాడు. మంచి పనికి విఘ్నం కలగకుండా చూడడం, చెడు పనికి విఘ్నం కలిగేలా చూడడం రెండూ ఆ దేవుడి చేతిలోనే ఉన్నాయి. గణపతి మూషిక వాహనుడు. ఎందుకనీ? అదో కథ. ఇవాళ కంప్యూటర్ (అంటేనే గణాంక యంత్రం) పరిభాషలో ‘మౌస్’ అంటే చిట్టి ఎలుకే. ప్రపంచమంతా వినాయకుడి తెల్విని శ్లాఘిస్తున్నాయన్న మాట. తాను ‘భారత గాథ’ చెబితే అంతే వేగంగా రాయగలిగేది ఎవరని వ్యాస మహర్షి ఆలోచించి తీసుకున్నది ఎవరినీ? గణపతినే! ఇదే నేటి ‘ఇంటర్నెట్’ మాధ్యమం! మహారాష్ట్రలో ఇంటింటా గణపతిని పూజించడం కన్నా సామూహిక గణేశోత్సవాలకే ప్రాధాన్యమిస్తారు. స్వత్రంత్ర సమర యోధుడు బాల గంగాధర్ తిలక్ నాడు పూనేలో తలపెట్టిన ఈ తొమ్మిది రోజుల గణేశోత్సవ్ ఇవాళ రాష్ట్రమంతటా, మరీ ముఖ్యంగా పూనే, ముంబై నగరాల్లో అతి వైభవంగా జరుపుకుంటున్నారు. ముంబైలో శిద్ధి వినాయక మందిరంలాగే ‘లాల్ బాగిచా గణపతి’ కీ పేరుంది. ఏ పేట గణపతిని ఆ పేటకి రాజు గా అభివర్ణిస్తారు మహారాష్ట్రలో. ‘గణపతి బప్పా మోరయా’ ( తండ్రీ గణపతీ మ్రొక్కెదము) నినాదం నేడు దేశమంతటా తారక మంత్రమైంది. నవరాత్రులు కాగానే పదవ రోజు గణపతి విగ్రహాన్ని విసర్జన లేదా నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం వేళ ‘ గణపతి బప్పా మోరయా- పుడ్చా వర్షి లౌకర్ యా’ ( తండ్రీ- మళ్ళీ ఏడాది తిరిగి రండి) అని నినదిస్తారు. భక్త సులభుడు గణపతి దేవుడు. మట్టి చాలు నన్ను బొమ్మగా చేయడానికి- అనే దేవుడు కనుక పేదా,గొప్పా తేడాలెరుగని వాడు, పంచ భూతాల్లో ఒకటైన భూమి జనితుడు కనుక మన్ను చాలంటాడు. ఆయన్ని ‘భూతాకారం’ అనేది ఇందుకే. ‘ఏక వింశతి’ పత్ర (ఇరవై ఒక్క ఆకుల) పూజ చాలు అని ఆరోగ్య సూత్రం తెలియజేసిన భిషక్కు. అందులో తులసి, రేగు, రావి, జాజి, మాచి,శమి,దాడిమ(దానిమ్మ),మామిడి, బిల్వ,దేవదారు, దూర్వా వంటివి ఎక్కువగా పరిచయమున్న పత్రాలు. అయితే గణపతి దేవుడికి దూర్వా అంటే ప్రీతి అంటారు. అంటే- కాసింత మట్టి తీసుకునీ గణపతి బొమ్మ చేసి దూర్వా గడ్డితో పూజిస్తే చాలనే నిరాడంబరుడు కనుక అందరికీ అంత ప్రియ దేవుడు. మోదక ప్రియుడు. మనం ఉండ్రాళ్ళు, కుడుములు,జిల్లేళ్ళు చేస్తాం. పాలవెల్లి కట్టి పళ్ళు వేళ్ళాడదీస్తాం. వెలగపండు మహా ఇష్టం గణపతికి. మొక్కజొన్నలు ఈ వానాకాలంలో పీచు పీచుమంటూ ఒంట్లో కొవ్వు కరిగించేస్తాయి. బాగా నమిలినందుకు పళ్ళు ధృఢ పడతాయి కూడా. అతివృష్టి ని ‘ఏనుగు’తో పోలుస్తారు. ఏనుగు ఎన్నో బోధించే ప్రాణి. తొండంతో నీటిని పైకి లాక్కొని సర్రున విడవగల విద్య ఏనుగుకి తెలుసు. ‘టార్నేడో’ అన్నది తొండం ఆకారంలో వచ్చే మేఘం . ఒక్క ఉదటున సర్వం లాక్కొనే భీబత్స పెనుగాలి దాని వెంబడి ఉంటుంది. బహుశా తొండం (తుండం అనేది సంస్కృత నామం) అనే మాట టార్నేడో గా రూపాంతరం చెందిందేమో. ఏనుగు నడక విశేషమైనది. ‘గజ గామిని’ అని ప్రేయసిని కవి వర్ణిస్తే ‘ఆమె అంత లావా?’ అని ప్రశ్నించుకునే అమాయకులున్నారు. గజముఖ దేవుడుని ఎవరో అత్యద్భుతంగా పోల్చి చెప్పారు. ‘ఆహా--ఆహాహా’ ని చూడండి. ‘నర్తనశాల’ సినిమాలో బృహన్నల (అర్జునుడు) ఉత్తరకు నాట్యం బోధించే సన్నివేశం ఉంది. ‘జయ గణనాయక’ అనేసముద్రాల రాఘవాచార్యుల వారి గీతం నాడే కాదు నేడూ నాట్య ప్రదర్శనాయోగ్యమే. ఘంటసాల, జానకి ల యుగళ గీతాలు తక్కువ. అందులో ఇది తొలి మేలిమి బంగారం. కనులు చూసినా పాటే- లో ఆ నాట్య గీతం చూడండి. బి.ఎన్.రెడ్డి గారి అపురూప శిల్ప కావ్యం ‘మల్లీశ్వరి’ కదా. అయితే- అందులో టైటిల్స్ అప్పుడు చిత్తూరు నాగయ్య గారి వ్యాఖ్యానం, దానితో పాటు వచ్చే ‘లంబోదర’ స్తుతి ఎంతమందికి గుర్తుందో తెలియదు. ఆ కీర్తన ‘కనులు మూసినా పాటే’ లో వినండి. మల్లీశ్వరి చిత్రం నుంచి దేవులపల్లి వారు సినిమాలకి పాటలు రాయడం మొదలు పెట్టారు. విశేషమేమిటంటే- ఈ ఒక్క చిత్రానికే ఆయన మాటలు కూడా రాశారు. ఇదే దేవులపల్లి వారు తన చివరి రోజుల్లో ‘వినాయక విజయం’ లో ‘ఎవరవయా – ఏ దివ్య దివినుండి దిగి ,ఈ అమ్మ ఒడిలోన ఒదిగి’ అనే చక్కని పాట రాశారు. అంతే చక్కగా స్వరలూరురాజేశ్వరరావు బాణీ కట్టారు. ‘కనులు మూసినా పాటే’ లో ఆ పాటతో పాటు కొన్ని మాటలు కూడా చూస్తూ వినండి. ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలో మహాకవి శ్రీశ్రీ చేత ఓ ఘాటు విమర్శనాస్త్రం ప్రయోగించి గణపతి ఊరేగింపులో పాట పెట్టారు. గణపతి బొజ్జలో దుర్మార్గులు, అవినీతిపరులు డబ్బుల కట్టలు దాచిపెట్టారు చూడండి అంటూ చూపిస్తారందులో. ఘంటసాల వారితో కలిసి బాలు నాలుగంటే నాలుగు పాటలు పాడేరు. ఆ కాంబినేషన్ లో వచ్చిన అపురూపమైన పాటగా ‘కనులు చూసినా పాటే’ లో వినండి మరోసారి. డా. మంగళంపల్లి వారు 'హంస ధ్వని' ఆలపిస్తే శ్రీ గణేశుడు తాపీగా వచ్చి వాతాపిలో వాలిపోడూ? కనులు మూసినా పాటలో దూరదర్శన్ వారి పుణ్యమా అని ఆ భాగ్యం కలుగుతోంది. తెలుగు వారికి శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారి ‘వాతాపి గణపతిం భజే’ కంఠోపాఠం కదా. అది ఘంటసాల వారి చలువ. అయితే- కీర్తిశేషులు భ.రా.గో (రచయిత, మ్యూజిక్రి ఆర్టిస్ట్) ఘంటసాల వారు ‘అనేకదం తం’ అని విరవక ‘అనేకదంతం’ అని పాడేరు, అదే తర తరాలుగా అంతా పాటిస్తున్నారు అని ఎద్దేవా చేసేవారు. నాకలా అనిపించలేదు. మీరు మరోసారి, ఇంకోసారి, మళ్ళీ మళ్ళీ విని చెప్పండి. అదేదో ఇక్కడే వినిపించేస్తేనో? కనులు మూసినా పాటే – లో ప్రత్యక్షం. మనకి దొరికిన మలయాళ స్వర మాంత్రికుడు కె.జె.ఏసుదాస్. ఆయన ముత్తుస్వామి వారి 'మహాగణపతిం' పాడుతుంటే మహా మాయలో పడి మనల్ని మనమే మరచిపోతాం. కావాలంటే కనులు మూసినా పాటే లో ఒక్కసారి కళ్ళు తెరవండి. ఇప్పటికిప్పటి తరం అంత తక్కువేమి కాదు. శంకర మహదేవన్ వంటి అద్భుత గాయకుడు ఈ తరానికి లభించడం ఒక వరం. పుణే వాసులైన అజయ్-అతుల్ బ్రదర్స్ విలక్షణంగా స్వర పరిచిన గణేశ స్తుతి శాస్త్రానికి విరుద్ధం కాదు. కాని ఆ సినిమా 'విరుద్ద్' గా ఇక్కడ ఆ పాటని 'కనులు మూసినా పాట' గా అందించడానికి సిద్ధంగా ఉంది. ముక్తాయింపు: ఏటేటా వినాయక చవితి వస్తుంది. మా అమ్మమ్మ గుర్తుకొస్తుంది. మా అమ్మమ్మ (విన్నకోట ధనంజయమ్మ) రుచికరమైన వంటల్లో ఎంత ప్రసిద్దమో మట్టితో తీరైన వినాయకుణ్ణి తయారు చేయడంలోనూ అంతే సుప్రసిద్ధం. అవలీలగా చేయగలిగేది ఆ మూర్తిని. ‘ఒరే, వినాయకుడికి కళ్ళు పెట్టాలిరా, మిలటరీ లైన్స్ షాపు వాణ్నిఅడిగి గురివింద గింజలు పట్టుకు రండి’ అని అమ్మమ్మ పని పెడితే ఎగిరి గంతేసి తెచ్చి పెట్టే వాళ్ళం. ప్చ్. ఆ కళ మళ్ళీ మా కుటుంబంలో ఎవరికీ రాలేదు. కలలోకి అమ్మమ్మ వచ్చి ‘పిచ్చి సన్నాసుల్లారా- అప్పుడు మావన్నీ చాదస్తాలుగా అనుకున్నారు. ఇప్పుడు శాస్త్రీయంగా ఆలోచిస్తున్నారు. Better Late than Never’ అని చివాట్లు పెట్టింది. ‘అమ్మమ్మ ఇంగ్లీషా’ అని ఆశ్చర్య పోతుంటే సూర్యుడు ‘జ్ఞానోదయం అయిందా లేలే’ అని మొహాన ఇన్ని కిరణాలు పారేశాడు. ‘ఈ పూట నా మాట’ మా అమ్మమ్మ స్మృతికి అంకితం. -డా. తాతిరాజు వేణుగోపాల్ , 01 సెప్టెంబర్ 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|