మునుపటి నా మాట
కాలం తల్లి క్యాలెండర్ గా ముస్తాబై నవ మాసాలు మోసి తొమ్మిదో నెలని కంటే ఆ నెల బాలుడికి సెప్టెంబర్ అని పేరు పెట్టారు. సెప్టెంబర్ నెలా రావోయ్ (Come September) అంటూ గిటార్ మీద స్వాగత గీతం పాడారు. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు వీళ్ళంతా చివరికి 'బరు'వు గా ఎందుకు మారారో, ఆ తరువాత వచ్చిన జనవరి,ఫిబ్రవరి చివరికి 'వర్రీ' గా ఎందుకు మిగిలారో తనకి తెలుసు కనుక 'మార్చి' నెల తన పంథా మార్చుకుంది. సరిగ్గా మార్చి 21 న సూర్యుడు భూమధ్య రేఖ పైకి వచ్చి సుఖమూ, దుఖమూ అనే పగలూ, రాత్రీ అంతటా సమానమంటాడు. అప్పటికి సూర్యుడు ఉత్తరాయణం చేస్తుంటాడు. మళ్ళీ మహానుభావుడు ఆ సూర్యుడు సెప్టెంబర్ 23 న భూమధ్య రేఖ పైకివచ్చి అప్పుడు కూడా పగలూ, రేయి సమానమంటాడు. అప్పటికి సూర్యుడు దక్షిణాయనం చేస్తుంటాడు. మెల్ల మెల్లగా చీకటి ఎక్కువ కాలం రాజ్యమేలేది ఆ పైనే. వానా కాలం కి ఉత్తర భారతంలో తెర పడేది సెప్టెంబర్ లోనే. చెన్నై మాత్రం చినుకుల కోసం ఆరాటపడేది ఈ నెలలోనే. తతిమ్మా చోట్ల అంతో ఇంతో గిలిగింతల చలి ఆశ్వయుజ ప్రారంభాన్ని సూచిస్తున్నట్టుగా వణికిస్తూ ఉంటుంది. అప్పుడు కాస్త వేడి, కాస్త ఉల్లాసం సమపాళ్ళలో కావాలి కదా. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఒక అడుగు జాడని ఆశ్రయించాలి. అది సాహిత్యంలో కావొచ్చు, సంగీతంలో కావొచ్చు. సాహిత్య పరంగా చూస్తే కనిపించే 'అడుజాడ గురజాడది' - అన్నారుశ్రీశ్రీ. శ్రీశ్రీ కి ముందు 'మహాకవి' అని ఇక్కడ అనబోవటం లేదు. ఎందుకంటే శ్రీశ్రీ దృష్టిలో 'మహాకవి' ఒక్క గురజాడ వారే కాబట్టి. ఇక సంగీతపరంగా చూస్తే కనిపించే అడుగుజాడ లెన్నో ఉన్నాయి. అందులో 'వేళ చూడ వెన్నెలాయె', 'వెన్నెల తెచ్చాడు మా పాపడు', ' వేదన తీరగ వెన్నెల తీరుగా' అని వెన్నెల జాడలో తన ముద్రను గుప్తంగా దాచేసుకున్న మరో గురజాడ వారి అడుగుజాడ కనిపిస్తుందా? మరో గురజాడా? అదెలా సాధ్యమ్? అవును, సాధ్యం కనకనే ఈ పూట నా మాట ఇలా ఇద్దరి గురించి---. ఆ మరో గురజాడ అంటే-- గురజాడ ---- అని అర్థం. ఇంటిపేర్లు ఒక్కటే అయినా ఒంటిపేర్లు వేరు వేరు.
ఇందాకంతా సెప్టెంబర్ వైశిష్ట్యం గురించి ఊ తెగ దంచేం మాటలు, దానికీ వీరికీ ఏమిటి అనుబంధం? ఉంది కనకనే ఇంత భాగోతం. సూర్యుడు భూమధ్యరేఖ మీదకి చేరే లోగా సెప్టెంబర్ 21 న ఆంధ్ర ప్రాంతంలో రెండు అద్భుతాలు జరిగాయి. తెలుగుతల్లి 'తాపీ' గా బరంపురం లో నాయుడి వారింట కాలు మోపక ముందు విజయనగరం- విశాఖపట్నం లో ఒకసారి ఆగి చూసే సరికి తన అడుగుజాడ లో ఏదో వెలుగు జాడ ఒక ఇంటిపేరుగా అగుపించింది. ఆ ఇంటిపేరు 'గురజాడ'! ఆ వొంటి పేరు అప్పారావు. ఒక సంఘ సంస్కర్త పుట్టుక 1862 సెప్టెంబర్ 21న జరిగింది. పంతులు గారుగా ఆయన సుప్రసిద్ధులు ఆ గురజాడ మహాకవి అయ్యారు. 'ముత్యాల సరాలు' పేనారు. 'దేశమంటే మట్టి కాదని, మనుషులని' ఆయన చేసిన ఒక కొత్త నినాదం తో ప్రజ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 'తిండిగలిగితే కండ గలదోయ్' అనే మరో నినాదంతో అర్థాకలి బతుకులు వద్దనే సందేశం దేశం అర్థం చేసుకుంది. 'సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడ్పడవోయ్' అని నాడే అర్థశాస్త్రం సూక్తి కొత్తగా వినపడింది. అన్నా హజారే కి గురజాడ తెలియదు. అంతెందుకు, గురజాడ వారంటే ఆంధ్రులకే చాలామందికి తెలియదు. మహా మేధావులు ఎప్పుడూ అంతే! మట్టిలో మాణిక్యాలు! గురజాడ వారు తన సంస్కరణ ఉద్యమానికి మాధ్యమంగా నాటకాన్ని ఎన్నుకున్నారు. 'కన్యాశుల్కం' విశ్వమంతా మారుమ్రోగిన ఏకైక నాటకం. ఆ నాటకం లోని కొత్తదనం ఎన్నో చోట్ల ఎన్నో ఏళ్ళు ఎప్పటికప్పుడు ఇంకా కొత్తగా ఉందనిపించేలా ప్రదర్శనకి నోచుకుంది. అది 'సినిమా' కళకి సైతం అబ్బురమైంది. కాసుల కోసం కన్న కూతుళ్ళని ముసలి మనుషులకిచ్చి పెళ్లి చేసే దురాచారం అది. 'పుత్తడిబొమ్మ పూర్ణమ్మ' రూపంలో గురజాడ వారు స్పందిస్తే ప్రజలో ప్రతిస్పందన ఆలోచనా రూపంలో వచ్చింది. గిరీశం బతక నేర్చిన వాడైతే , సౌజన్యారావు బతుకుని సుగమ్యం వైపు చేరనిచ్చేవాడు. మదురవాణి 'లొటిపిట' అంటూ గల గల నవ్వేసి ఆట పట్టించే గడసరి. బుచ్చమ్మ అమాయకత్వం సరే సరి! వెంకటేష్ గిరీశం కోతల బాధితుడు. వీళ్ళంతా మన చుట్టూ ఉండి మన సంఘాన్ని ప్రశ్నిస్తున్న వారే. జవాబిస్తున్న వారే. అందుకే శ్రీశ్రీ ప్రశ్న, జవాబు వెరసి 'ప్రజ' అన్నారు. గురజాడ ప్రజా రచయిత. గురజాడ చేసిన 'దిద్దుబాటు' తెలుగు వారికి తొలి కథ. ఆ మహానుభావుడిప్పుడు మూడు యాభైలలోకి అడుగు పెట్టడం, వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు జయంతి ఉత్సవాలు జరగ బోతుండడం ఆంధ్రమాతకి గర్వకారణం. కనులు చూసినా పాటే ఈ మహా గురజాడని మీ ముందు చూపుతోంది. చూస్తూ వినండి. 'ప్రతి రాతా ప్రసిద్ధమే' లో గురజాడ వారి రచనలపై వచ్చ్చిన వ్యాఖ్యలు చదవండి. తిరుగులేని మాట లో గురజాడ వారి 'దేశ భక్తి' గీతం మరోసారి మననం చేసుకోండి. అంతా బావుంది. మరి ఆ రెండో అద్భుతం ఏమిటో? అద్భుతమే! అదే రోజున (సెప్టెంబర్ 21) 1927 లొ 'గురజాడ' ఇంటిపేరుతో భాగ్యనగరంలో వెలసిన కృష్ణదాస్ వెంకటేష్(వెరసి జి.కె.వెంకటేష్) అనే బాల మేధావి జననం అద్భుతమే కదా! చిన్ననాడే వీణ తీగల మీద వేలి కొసలు ఆన్చి వాణి ఆశీస్సులు పొందిన వాడు. ఎమెస్ విశ్వనాథన్ కి మిత్రుడైనవాడు.సుబ్బరామన్ శిష్యుడైనవాడు. స్వంతంగా నిలదొక్కు కునీ ఆనక 'ఇళయరాజా' వంటి సహాయ స్వర కర్తని పొందినవాడు. తొలిసారిగా మలయాళం చిత్ర సీమ 'బేబి' (1947) గా ఆయన్నిపెంచి పెద్ద చేసింది. ఎనిమిదేళ్ళ మౌనం తరువాత కన్నడచిత్ర సీమ 'సోదరి' ని చూపించింది. 'కన్నడ నౌషాద్' వెలిసాడక్కడ. అష్ట భాషా ప్రవీణుడు ప్రతివాద భయంకర శ్రీని 'వాయిస్' నట సార్వభౌమ డాక్టర్ రాజ్ కుమార్ కి అభయకర గళం ఇచ్చినప్పుడు వెంకటేషే అతని ప్రతిభకి పట్టం గట్టాడు. ఆ తరువాత 'కన్నడ కంఠీరవ' స్వయంగా పాడుకోవడం ప్రారంభిస్తే 'నా నిరువుదు నిమగాగి' (నేనున్నది మీకోసమే) అని భరోసా ఇచ్చినది వెంకటేషే! జి.కె. తెలుగు 'వాడి' తనం మాత్రం 'అత్తగారు కొత్త కోడలు' (1968) ఎదురైతేనే గానీ తెలుగు వారికి తెలియ రాలేదు. అదే సినిమాలో ఆయనకి మల్లాది రామకృష్ణ శాస్త్రి వంటి మేధావి ఆఖరి సినీ గీతం దక్కడం విశేషం. ఆ తరువాత సి.రామచంద్ర బాణీలు కొన్ని 'నాటకాల రాయుడు (1969)' లో ఉపయోగించినా తన బాణీ గా 'వేళ చూడ వెన్నెలాయె' అని ఆరు బయలు చాట గలిగారు వెంకటేష్. 'రవి వర్మకు అందని ఒకే ఒక అందం' ట్యూన్ పరంగా ఎలా చూపాలో వెంకటేష్ కి తెలుసు. 'పాడనా తెనుగు పాట' అని అమెరికా అమ్మాయి మన ఎదుట మన పాట ఎలా పాడగలదో వెంకటేష్ కి తెలుసు. 'రాశాను ప్రేమ లేఖలెన్నో' అని లేత బాలు గళంలో కొంటెతనం ఎలా రాబట్టుకోవాలో వెంకటేష్ కి తెలుసు. మరాఠీ అభంగ్ పాడే పద్ధతికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా 'మానవా ఏమున్నది ఈ దేహం' అని మోక్ష మార్గం చూపడం వెంకటేష్ కి తెలుసు. ఇంకా చెప్పాలంటే 'ఈల' వేయడం లో మరో రఘురామయ్య వెంకటేష్. హిందీ వరస లో 'పూలు గుస గుసలాడేనని' చెప్పే ముందు ఏ భాషా అక్కరలేని 'ఈల' వేసి మెప్పించడం వెంకటేష్ కే చెల్లు. వెంకటేష్ గాయకుడు. 'సంతోషం (1955)' గా ఆయన ఒక డ్యూయట్ ఒక నాడు విశ్వనాథన్ కోరిక మీద పాడారు. కనులు మూసినా పాటే ఈ మరో గురజాడని మీ ముందు ఉంచుతోంది. వినండి. గురజాడ వారు లేరు. అయినా అడుగుజాడ చెక్కు చెదరదు. మరో గురజాడ (జి.కె.) లేరు. అయినా వెన్నెల జాడ మసక బారదు. -డా. తాతిరాజు వేణుగోపాల్ ,23 సెప్టెంబర్ 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|