మునుపటి నా మాట
బహుశా అది దేవదాస్ (1974) అనుకుంటాను. అంటే నట సామ్రాట్ ఏ.ఎన్.ఆర్ వారి సినిమా కాదు. నట శేఖర కృష్ణ గారిది. ఆ సినిమాలో కాంతారావు కత్తి లాంటి మాట ఒకటి అంటారు - 'ఆడ పిల్ల ఆడ పిల్లే గానీ ఈడ పిల్ల కాదు' అనీ. ఈ మాట కూర్చింది ఆరుద్ర గారు అనుకుంటాను. ఆత్రేయ గారు అంతకు నాలుగేళ్ల క్రితమే 'తాళిబొట్టు' (1970) సినిమా కోసం ఓ పాట రాసి ఇలా అన్నారు- 'ఎవరన్నారు నిన్నాడ దానివని, నేనంటాను నువ్వు ఈడ దానివని'. ఆడ,ఈడ అన్న చెణుకుల తరువాత ఆయన 'ఎక్కడి దానివో ఇక్కడకొస్తే ఏడ దానివో అనుకున్నా-దేవలోకపు సొగసులు తెస్తే ఆడదానివే నువ్వన్నా' అని గమ్మత్తుగా ముగించారు. ఆడది - అనే ఏక వచనం 'మగ వాడు' అనే ఏక వచనమంత విన సొంపుగా ఉండదు. ఏదో ఎగతాళికి అంటున్నట్టు ఉంటుంది. బహు వచనమే నయం. మగవారు లాగ ఆడవారు, ఆడువారు అని ఓ మర్యాద ఉంటుంది. 'ఆడది కోరుకునే వరాలు రెండే రెండు' అని ఓ మంచి కవి కనిపెట్టినా ఆడవారు కోరుకునే -- అని అనవచ్చుగా. ఆడవాళ్ళు అనే వ్యహారికం ప్రాంతాల వారిగా 'ఆడోళ్ళు' , 'ఆడాళ్ళు' అని అనిపించుకోవడం తెలిసినదే. కవులు మాత్రలకు సరిపడే పదాలు ఏవైనా వేసుకోగలరు. అంటే ఇదంతా కవుల అనారోగ్యం కాబోలు అనుకునేరు. దసరా అనగానే ఆదిశక్తి, దుర్గమ్మ, ఇంకా ఇతర పేర్లతో ఆ 'రుద్ర' సతిని, అమ్మలగన్న అమ్మని ఎంతగానో కొలుస్తారు. సరదాలు గడిచాక మళ్ళీ ఇళ్ళల్లో భార్యని 'ఏమేవ్', 'ఒసేవ్', 'ఏమే' అనే రంకెలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటికీ ఆధునిక మహిళ పెళ్ళి కాగానే భర్తని 'ఏమండీ' అనే పిలుస్తోంది. 'వోయీ అని పిలవాలని ఊహ కలిగెను' అని కవి కలవరించినట్టు కలవరించకపోవడం విడ్డూరం. పేరుపెట్టి పిలవడమంటే మరి కొన్ని ఇళ్ళల్లో 'మా సెడ్డ సిక్కె' ( సిగ్గే కాదు)! ఆడవారికి టీవీ సీరియల్స్, మగవారికి స్పోర్ట్స్ - ఈ వేర్పాటు ధోరణి ఇంకా మార్పు లేకుండా తూర్పార బెట్టకుండా నేర్పుగా సాగిపోతూనే ఉంది. సీరియల్ చూసినామె లో ఎంతో సీరియస్ నెస్ వచ్చేస్తోంది. స్పోర్ట్స్ చూసినాయానికి మాత్రం దేన్నీ ఇంకా స్పోర్టివ్ గా తీసుకోవడం రావడం లేదు.
చదువుకునే రోజుల్లోనే ఆడపిల్లలు చలాకీగా ఉండాలి, పెళ్లి కాగానే చపాతీలు వత్తుతున్నప్పుడు చచ్చినా సరే చిలిపితనం పనికి రాదు - అనే ఆంక్షలు ఇంకా ఉన్నాయి చాలామంది ఇళ్లలో. ఎవరికి ఎవరు ఆంక్షలు విధించుకుంటున్నారో కానీ ఇవాల్టి పెళ్ళిళ్ళు మూడు పువ్వులు, ఆరు కాయలుగా కాదు మూడు అవుట్ లు, ఆరు బయట లు గా చీలిపోతున్నాయి. కొత్త జీవితం అంటే ఎంతో వింతగా ఉండాల్సింది పోయి అప్పుడే పాత బడిపోయినట్టు ఎక్కడినుంచి ఊడి పడతాయో పాడు దిగుళ్ళు! ఎడ మొగాలు పెడ మొగాలు ఎక్కువ కాలం రాజ్యమేలి ఎడమ కాలు కోర్టులో, కుడికాలు బంధువుల సపోర్టు తో పరుగులు పెడుతున్నాయి. జీవించడం ఒక కల కాదు- ఒక కళ. మగువ,మహిళ, పడతి,యువతి,ఉవిద, స్త్రీ, వనిత,ముదిత- ఇన్ని పేర్లు ఆడవారికి దక్కినట్టు మగవారికి దక్కలేదు. కవులయితే అక్కడితో ఆగక ఎలనాగ, సుదతి, లేమ, కొమ్మ వంటివి చేరుస్తారు. ఇన్ని పేర్లున్నా పాపం 'ఆడది' అని మాత్రమె ముద్ర వేసుకునీ నీరసంగా మిగిలిపోతోంది ప్రతి స్త్రీ. చక్కగా జీవించాలంటే మార్గం: ఆడా, మగా పరస్పర సర్దుబాటు అనే సరైన బాట వేసుకోవడమే. తెలుగు పదాలు ఆడ, మగ కలిసి తమిళంలో ఎంచక్కా 'ఆమ' అనిపించుకుంటున్నాయి. ఇద్దరికిద్దరూ 'సరే', 'ఔను' అని అనుకోవాలే కాని ఒకరికన్నా ఇంకొకరు రెండాకులు ఎక్కువ చదివాం అని అహం ప్రదర్శిస్తే ఆనక జయించేవి 'విడాకులే'. కదిపితే కన్నీళ్ళే కదా అని కడవల కొద్దీ కడళ్ళ వంటి కన్నీళ్ళ రీళ్లు తిప్పి అప్పుడు తీసినట్టే ఇప్పుడూ సినిమాలు తీస్తున్నారు. నాదీ ఆడ జన్మే, ఆడ బ్రతుకు, ఆడ పెత్తనం, ఆడవాళ్ళు-అపనిందలు, ఆడవాళ్ళూ జోహార్లు, ఆడ పడుచు, ఆడ జన్మ, నీడ లేని ఆడది, ఆడ బిడ్డ, ఆడ పిల్లల తండ్రి వంటివి పాత సినిమాలు. పేరు చూడగానే లోగుట్టు పెరుమాళ్ళు కెరుక- రుమాళ్ళు అవసరమని. కొత్త సినిమాల్లో 'ఆడ' శబ్దం పోయి 'ఇల్లాలు' వచ్చి కూర్చుంది. ఎప్పటి ఆత్రేయ! ఆయన 'దీక్ష' (1951) తో సినిమాలకి పాట రాసే పని ప్రారంభించి 'రంభ-రాంబాబు (1990)' తో స్వస్తి పలికారు. ఆయన 'ఆడ' శబ్దం ఉపయోగించి రాసిన పాటలు హోలుమొత్తంగా ముప్ఫై మూడు వరకు ఉన్నాయి. ముందుగా ఆత్రేయ 'అంతే కావాలి (1955)' అని బెదిరిస్తున్నట్టు ఉండే సినిమాకి భయపడుతున్నట్టు 'నిజమేనా నిజమేనా నే చేసిన బాసలు' అంటూ ఓ పల్లవి రాసి ఆ పాటలో ఓ చోట 'అనుమానం ఇంతేనా ఆడదాన వెంతైనా' అని అదో క్వాలిఫికేషన్ అన్నట్టు తీర్మానించారు. దొరికింది కదా 'ఆడ' మాట, వచ్చిన అవకాశం తను మిస్ కాకూడదని పింగళి వారు 'ఆడు వారి మాటలకు అర్థాలు వేరులే, ఔనంటె కాదనిలే, కాదంటె ఔననిలే' అని 'మిస్సమ్మ(1956)' ద్వారా కొత్త భాష్యం చెప్పారు. 'అయ్యా మీరు బ్రహ్మచారులే, మీకేం తెలుసు' అని అప్పటి పురుషులు ఆయన్ని ఆట పట్టించి తమకు తామే వండుకున్న నిమ్మకాయ పులుసుని ఫ్రిజ్ లు లేక పోవడం చేత పారబోసుకున్నారు. పింగళి వారు బహు వచనంలో బహుళార్ధం చెప్పగల చతురులయ్యారు. అయినా మళ్ళీ 'ఆడ' ప్రసక్తి ఆయన చేయలేదు. ఇక ఆత్రేయ గారు మాత్రం ఏ ఏటికా ఏడే బంగారం లాంటి 'ఆడ' పదం చుట్టూ బొంగరంలా తిరిగారు. కళామతల్లి - ''ఏదీ ఆడువారి మీద 'పాటలీ పుత్రా'' అంటే 'ఇదిగో పాటలు తల్లీ' అని గర్వంగా చెప్పగలిగేది ఆత్రేయ ఒక్కరే. అయితే ఒకటి, ఆత్రేయ గారు 'ఆడ' శబ్దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం తో ఇంచుముంచు 33 సూక్తులు దొర్లాయి. అవంటే ఇవే : ఆడదాని మాటవింటే తేలిపోవటం తేలికంటె తేల్చి తేల్చిముంచుతారంట ఆడవాళ్ళు ఆడుకునే ఆటబొమ్మ ఈ మగవాడు ( దానికి విరుద్ధంగా ఇంకోసారి ఇలా అన్నారు- ఆనాడు ఈనాడు ఏనాడూఆడదాన్ని ఆటబొమ్మగా చేశాడు మగవాడు, ఆడుకోను ఆటబొమ్మ కాదు ఆడది), అదేమిటో ఆడదంటే మగవాడికి అలుసులే, ఆడదాని మనసంటే విషమని తెలిసి ఏడ్వాలి, నిన్నదుపున పెట్టి పొదుపుగ చూచే ఆడది ఒకతె కావాలి ఆవిడ ఒకతె కావాలి, అరిటాకమ్మా ఆడజన్మమూ, కాలం మార్చని కన్నీటి గాధమ్మా ఈ ఆడజన్మ, మగని నీడనె మగనాలికమ్మా ఆడజన్మ, అల్లరులు ఎన్నాళ్ళు వేసెయి మూడు ముళ్ళు ఆపైన ఆడాళ్ళు బుద్ధిమంతులు, నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు, ఆడోళ్ళుఇక మీదట అందలాన ఉంటారు, కన్నది ఆడది కనకుంటే పీడది ఆ కట్ట మెట్టా తెలుత్తాది దున్నపోతుకి, హద్దులన్నీచెరిపేసి ఆడతనం చెలరేగింది, ఆడపిల్లవు నీకేమీ అద్దమెదుట కూచుంటావ్, అందుకేగా ఆడదానికో మగవాడుండాలి, చదువులెన్ని చదివినా ఆడదాడదే అది ఏనాడో ఒకనాడు మగవాడిదే, ఆడపిల్లతో ఇలాగేనా ఆటలాడేది, ఆడపిల్లకు పూలూబొట్టూ ఆది నుంచి అందాలు, పిల్లాడు చూపులకు గట్టోడే ఆడపిల్ల తాపిస్తే ఆగలేడే, కన్నువంటిది ఆడదీ కన్నీరామెకు తప్పనిదీ, ఆడదాని కంటి నీరు చిచ్చు వంటిది, ఆనాడు ఈనాడు ఏనాడూ ఆడదాని కీలుబొమ్మే అయ్యాడు మగవాడు, ఆడది కూడా అనుభవమున్నది ఐతే ఏమౌనంట? నెత్తురు పంచి ఇచ్చావు నిప్పును నువ్వే మింగావు ఆడదాని ఐశ్వర్య మేమిటో ఇప్పుడు తెలిసింది కథ ముగిసే పోయింది, రాయిని ఆడది చేసిన రాముడివా ఏమనుకోను నిన్నేమనుకోను?, సీతమ్మ జాతి ఆడదాన్నిరా. ఆరుద్ర కవి అలా కాదు. కవి బాలగంగాధర్ తిలక్ 'అమృతం కురిసిన రాత్రి' సంపుటంలో రాసిన ' నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు' అన్న మాటలు నచ్చాయో ఏమో ఆరుద్ర గారు 'ఆడపిల్ల' గురించి అడపా దడపా రాయడం మానుకోలేదు. అసలా మాట చుట్టపు చూపుగా ఆయన పాటల్లో వచ్చి చెట్టపట్టాల్ వేస్తూ 'సెటిల్' అయింది. అయితే ఆయన అలా నడిపిన బండి 'సీరియస్ నెస్' అనే పట్టాల్ మీదకెక్కి పట్టాల్ తప్పలేదు. అంతో ఇంతో ' తేలిక హృదయం' తో రాయడం వల్ల (ఆత్రేయ వారికి హార్ట్ ఎన్లార్జ్ అయిందని డాక్టర్స్ అంటే - 'ఇప్పటికైనా నమ్ముతారా, నాది విశాల హృదయమనీ!' అని అన్నారట. అందుకని ఆరుద్ర గారిది తేలిక హృదయం అని అనవలసి వచ్చింది) ఆత్రేయ రాసిన వాటిలో సగం మాత్రమె అంటే ఓ పదిహేడు దాక 'ఆడ' కత్తెరలో పాట చెక్క లాగ ఆరుద్రగారు రాసి గెడ్డం సవరించుకున్నారు. అవన్నీ 'ప్రతి రాతా ప్రసిద్ధమే ' లో తప్పక తిరుగాడుతుంటాయి. చూడండి. ఇవన్నీ 'take it easy' ధోరణిలో అధిక శాతం ఉన్నాయి కనుక ఇక్కడ ఆరుద్ర వారి కొన్ని పాటలు కనులు చూసినా పాటే (వీడియోలు), కనులు మూసినా పాటే(ఆడియోలు) అనుకుంటే - వాటిని దసరా 'పాటల కొలువు' గా స్వీకరించండి. 'ప్రతి ముఖమూ ప్రముఖమే' లో ఒకనాటి విజయ చిత్ర ఆరుద్ర ను ఫోటోలో ఎలా బంధించిందో చూడండి. మీరడగ వచ్చు- ఏం మిగతా కవులు కూడా అంతో ఇంతో 'ఆడ' పిల్ల తరఫున ఏదైనా రాసి ఉండవచ్చు కదా అని. మీరనుకున్నట్టే నేనూ అనుకున్నా. నాకు ముందు మహాకవి శ్రీశ్రీ గారి మీదా, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి మీద దృష్టి పడింది. వెదికితే ఒక్కటంటే ఒక్క పాటలో శ్రీశ్రీ 'ఆడ' శబ్దం ప్రయోగించినట్టు కనుక్కున్నాను. 'కొల్లేటి కాపురం (1976)' కోసం ఆయన ఓ పాట రాసి 'తప్పు తప్పు తప్పు అదిగో అదే తప్పు ' అని చీవాట్లు పెడుతూ 'ఆడదాన్ని ఆస్తిలాగ వాడడమే తప్పు' అన్నారు. నిజాలు చెప్పడమే కాని అభూత కల్పనలు జోడించడం ఆయనకి తగని పనులుగా తోస్తుంటాయి. అంతకుముందు 'బుద్ధిమంతుడు' కాని హీరో కి తగ్గట్టు ఆరుద్ర ' భూమ్మీద సుఖపడితే తప్పు లేదురా బులపాఠం తీర్చుకుంటే తప్పు లేదురా- ఒక్కలాంటి వారురా జాజి పువ్వూ ఆడపిల్లా , వాడిపోకముందే వాటిని అనుభవించరా, తప్పే లేదురా తప్పే లేదురా' అని రాసినా పదే పదే అనుకోవడానికి వీల్లేని అనంగీకారయోగ్యమైన బాష్యాలు అవి. 'కవి పని నిర్మాత, దర్శకులు ఏది అడిగితే అది ఇవ్వటమే' కనుక పాపం ఆరుద్ర ఏం చేస్తారు? అలా రాయక తప్పలేదు అని సరి పెట్టుకోవాలి. ( పానకంలో పుడకలాగ- ఇక్కడో కాకతాళీయ చమక్కు గుర్తొచ్చింది. ఆ సినిమాలో హీరో తాగుతూ చూపించే బాటిల్ మీద VAT 69 అని ఉంటుంది. సినిమా విడుదలైనది ఎప్పుడో తెలుసా? 1969 లో! తన సినిమా మీద తానే జోక్ వేసుకున్నారు బాపు- 'బుడ్డి మంతుడు' అనీ. బాపురే రమణీయం చూడండి) అదే హీరోయిన్ రాగానే హీరో అవుట్ (చెడ్డవారి నుంచి) అయి 'బుద్ధిమంతుడు' గా మారుతున్న టైం కి హీరోయిన్ 'కన్నెమనసు సన్న జాజి వాడనిది, అది ఎన్ని జన్మలకైనా వాసి వాడనిది' అనే విలువైన మాట చురక విసిరేస్తుంది ( అలా రాసినది సినారె). 'తప్పే లేదురా' అని శిష్యరత్నం ఆరుద్ర అలా అనడం ఏమిటని కొన్నేళ్ళకి గురూజీ శ్రీశ్రీ ( నేనంటున్నది మహాకవి శ్రీశ్రీ - ఈ రోజుల్లో 'గురుదేవ్' 'శ్రీశ్రీ' 'రవిశంకర్' అంటే రోబింద్రో నాథ్ టాగోర్ కాదు, మహాకవి శ్రీశ్రీ అంతకన్నా కాదు, సితార వాయించే రవిశంకర్ కానే కాదు) 'తప్పు తప్పు తప్పు' అనే హితబోధ చెణుకు వదిలి ఉంటారు. శ్రీశ్రీ వారు సినీ కవి కావడానికి మల్లాది కవి గారే కారకులు. మల్లాది వారు 'కన్నె' అనే శబ్దం కొన్ని పదుల సార్లు ప్రయోగించి ఉంటారు కాని 'ఆడ' శబ్దం కేవలం ఒకే ఒక్క పాటలో ఉపయోగించారు. ' ఆడువారి మాటలు రాకెన్ రోల్ పాటలు(ఇంటిగుట్టు, 1958)' అన్న ఈ వ్యంగ్య చిత్రీకరణ బట్టి ఆ మాటలెంతటివో తెలిసిపోతుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 'ప్రేయసి', 'ఊర్వశి' అనడం తప్పితే 'ఆడ' అనే శబ్దం పట్ల అనాసక్తులు అనుకున్నాను. కానిబి.ఎన్.రెడ్డి గారు ''నా ఇల్లు (1953)' సంక్రాంతి ముగ్గులతో శోభిల్లాలి శాస్త్రి గారూ' అని కోరినట్టు ఉన్నారు, ఆయనకోసం గొబ్బిళ్ళ పాట రాసి అందులో 'డూ డూ డూ డూ బసవన్నా ఆడబిడ్డలకు దణ్ణం పెట్టు' అన్నారు. ఏమో తరువాతి కాలంలోఆడబిడ్డలు 'యు డూ , ఐ డోంట్ వాంట్ టు డూ' అని అనే మాటలకు మగ వారే 'డూ డూ బసవన్న'ల్లా తల ఊపే పరిస్థితి వస్తుంది అని వారు అప్పుడు ఊహించలేదు. ఇక రెండోసారి 'రక్త కన్నీరు' చిత్రం లో 'ఇంటగల అబలల కంటగించేరు' అని నోరుగల పురుషుల ధర్మాన్ని తెగనాడుతూ 'ఆడది లోకానికెల్ల ఆది వేలుపే' అని సుభాషించారు. శభాష్. అందుకే ఆరుద్ర తన ముద్ర ఉండేలా తన పాటల్లో 'ఆడపిల్ల' ను బాపు గీసిన బొమ్మలా చిత్రీకరించుకున్నారు. చిత్రమేమిటంటే బుద్ధిమంతుడు (1969), ఇంటి గౌరవం (1970), బాలరాజు కథ (1970)- వంటి బాపు సినిమాల్లో 'ఆడపిల్ల' మీద ఒక పాటైనా రాయకుండా ఆరుద్ర ఉండలేక పోయారు. అలాగే స్వర రాజేశ్వరుడు 'య ముస్తఫా' ట్యూన్ ఇచ్చి 'ఇద్దరు మిత్రులు (1961)' చిత్రానికి పాట రాయమంటే ఆ ఒరిజినల్ కంపోజరే కళ్ళు తిరిగి పడిపోయేట్టు ఆరుద్ర అవలీలగా 'ఆడపిల్ల అలిగినచో' , 'ఆడవారిదే పైచేయి' అనే జాతీయాలు సృష్టించి పారేసారు, 'హలో హలో ఓ అమ్మాయి' అని పలకరిస్తూనే. శంకర్-జైకిషన్ ల ట్యూన్స్ కి ఆరుద్ర రాయడం తొలిసారిగా 'ప్రేమలేఖలు (1953)' చిత్రం కోసం జరిగింది. రాజ్ కపూర్అప్పటికే సిద్ధంగా ఉన్న హిందీ ట్రాక్స్ కాకుండా మళ్ళీ రికార్డ్ చేయించి తెలుగు పాటలు విడుదల చేశారు. ఆరుద్ర గారికి రెండవ సారి శంకర్-జైకిషన్ ల ట్యూన్స్ కి పాటలు రాసే అవకాశం 'జీవిత చక్రం (1971)' సినిమా ద్వారా కలిగింది. సాధారణంగా హిందీ వరసలకి హిందీ కవులు ఎక్కువ పంక్తులు రాస్తారు. ఇక్కడ ఆరుద్ర 'కంటి చూపు చెపుతోంది' అనే పాటలో ఆ పద్ధతిలోనే 'ఆడపిల్లా పూల తీగే ఒక్కలాగే చక్కనైనవి' అని ఒక సారి అని, వెంటనే 'ఆడపిల్లా పూలతీగే ఒక్కలాగే అండ కోరుకుంటాయి' అంటారు. 'ఆడవారికి' తన వంతు సూక్తిగా ఆయన అంతకు ముందు 'లక్ష్మీ నివాసం (1967)' చిత్రంలో 'ఇల్లే కోవెల' అనే పాట రాసినా అందులో 'సుదతి, వనిత' కనిపించారే కాని 'ఆడ' మాట లేనే లేదు. ఒక్క 'మీనా' చిత్రం లోనే 'మల్లె తీగ వంటిది మగువ జీవితం' అనే సూక్తుల గొలుసు లో ఓ ముత్యం లాంటి మాట ' ఆడవారికి అన్నివేళలా తోడూ నీడా ఉండాలి' అనేది జత చేశారు. అంతకు ముందే శ్రీశ్రీ గారు 'తోడొకరుండిన అదే భాగ్యమూ అదే స్వర్గము' అన్నారు కదా 'మనసున మనసై బ్రతుకున బ్రతుకై' ఉండగలిగే వారి గురించి చెబుతూ. ఇది అసలు సంభవమేనా అని ఆనాడే కాదు ఈనాడూ యువత ప్రశ్నించుకుంటోంది. ఇరుగింటావిడ 'మొరటోడు నా మొగుడు' అంటే పొరుగింటావిడ 'మావారు శ్రీవారు మా మంచి వారు' అంటుంది. ఇదిగో ఇలాంటప్పుడే పింగళి వారి పలుకులు సార్ధకమౌతుంటాయి- 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే!' అన్నది. ఆ రోజుల్లోనే దానికి పేరడీగానూ, విరుద్ధంగానూ అనేవారట- 'ఆడవారి మాటలకు అర్థాలే లేవులే' అనీ! ఆయనెవడో పాపం 'దగా పడ్డ తమ్ముడు' కాబోలు. అటువంటి వారిని ఉద్దేశించి ఆరుద్ర గారైతే ' సంసారమన్నది సోదరా సాగరమనుకునీ ఈదరా, ఆడపిల్ల చేపపిల్ల కాదురా నువు వేసే వలలోకి రాదురా' అనే వారేమో! ( ఇలాంటి పాట లేదు. ఇది నా ఉహా గీతం) [ఈ పూట నా మాట కి ఉపయోగపడ్డ రచనలు: 1)ఆత్రేయ సాహితి: పాటలు 1,2,3 మనస్విని, మదరాసు 2)వినవేడుక : శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి సినిమా పాటలు, ఆర్కే బుక్స్, హైదరాబాద్, సం:2005, 3) మేఘమాల: దేవులపల్లి కృష్ణశాస్త్రి వెండి తెర పాటలు, దేవులపల్లి సన్మాన సంఘ ప్రచురణ, మద్రాస్, 1975, 4)పాడవోయి భారతీయుడా: శ్రీశ్రీ సినిమా పాటల సంకలనం, శ్రీశ్రీ ప్రచురణలు, మద్రాసు, 1983, 5) శ్రీశ్రీ సినిమా పాటలు : తెలుగువీర లేవరా , విశాలాంధ్ర ప్రచురణ, 1996 6) శ్రీశ్రీ సినిమా పాటలు: విశాలాంధ్రలో ప్రజా రాజ్యం, విశాలాంధ్ర, హైదరాబాద్,1999, 6)హాసం, సాక్షి (ఈ పాటకు ట్యూన్ తెలుసా), సేకరించి పెట్టుకున్న పాటల పుస్తకాలు, ఎట్సెట్రా] -డా. తాతిరాజు వేణుగోపాల్ , 01 అక్టోబర్ 2011, 05 అక్టోబర్ 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|