మునుపటి నా మాట
మూడు మాటల్లో – అదీ మూడు భాషల కలగా పులగం చేసి -చెప్పడం ఎందుకంటే ఇవాళ విలక్షణ గాయని శ్రీమతి వాణీజయరాం పుట్టిన రోజు (30 నవంబర్) కనుక. కాబట్టే- 'ఈరోజుమంచిరోజు-- మరపురానిది'. అందుకే- 'మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మా'. వాటితో పాటు చలికాలం 'ఎండలన్నిపూలజల్లులై' చెప్పే నమ్మలేని నిజం ఏమిటంటే- ఆమె కిప్ప్పుడు అరవై ఏళ్ళు అన్నది. ఇంకా ఇంకా అబ్బురపరిచే మాట ఏమిటంటే – ఇప్పుడూ ఆమె గళం మనం ఎప్పుడో డబ్భైల్లో విన్న గొంతులాగే ఉండడం. ‘బోలేరే పపీహరా’ హిందీ పాట ఒక సారి, ‘ఏళు స్వరంగళ్‘ తమిళం పాట ఒక సారి, ‘ఎప్పటి వలె కాదురా నా స్వామీ’ తెలుగు పాట ఒకసారి మనం మననం చేసుకుంటే గనుక, అవి ఆమెకు దక్కిన తొలి వరాలనే వివరాలు ముందస్తుగా తెలుసుకుంటే గనుక, అంతలోనే శంకరాభరణం, స్వాతి కిరణం లోని పాటలు మస్తిష్కంలో మసలుతుంటే గనుక ఆమె ఇప్పుడు అందిస్తున్న అనేక సీడీల లోనూ ఆమె గొంతు రవ్వంతైనా మారలేదనీ, పైగా ఇంకా ఇంకా బావుందనే నిర్ణయానికి రాగలం. అసలు పుట్టుకతోనే కోకిల స్వరం వరం తో పుట్టిన ఆమెకి ఏడాదికొక వరం చొప్పున కేటాయిస్తే ఈ అరవై వసంతాల్లో ఆమె అరవై వరాలు పొందినట్టే కదా. అవే తమిళంలో ‘వరంగళ్’ అయ్యాయి. కర్ణాటక కి చెందిన జయరాం అనే సితార విద్వాంసుడు తన జీవితంలోకి రాక ముందు ఆమె తమిళనాట వెల్లూరు అమ్మాయి. ఆ తరువాత సంగీతం ప్రవృత్తి గానే చేసుకునీ ముంబై లో అడుగు పెట్టిన బ్యాంక్ ఆఫీసరు. మహారాష్ట్ర ఎవరినీ ఊరికే వదిలేయదు. పైగా నాట్య సంగీతానికి అది పుట్టిల్లు. ఆమె కర్నాటక, హిందుస్తానీ అనే రెండు భిన్న సంగీత రీతుల్ని ఒకే త్రాట నడిపిస్తుంటే అంతటి ప్రతిభావంతురాలికి న్యాయం జరగాల్సిందే కదా. అప్పుడే దొరికారు ఆమెకి వసంత్ దేశాయ్ అనే గురువులు. నాట్యసంగీత కచేరీలలో ఆమె చేత పాడిస్తూ ప్రోత్సాహించారు. అప్పుడే జయరాం అనే సుగుణాకరుడు ‘నీ చేయి విడువను’ అని చేయూత ఇచ్చారు. సినిమా హీరోల జీవితమే గొప్పదనుకునే ఓ అమాయకురాలిలా జయబాధురి అద్భుతంగా నటించిన సినిమా ‘గుడ్డీ’ కోసం ఇష్క్ కవి గుల్జార్ తన మస్తిష్కం నుంచి వెలికి తీసి ‘బోలే రే పపీహరా’ పాట నిచ్చారు. ఏ ముహూర్తంలో వసంత్ దేశాయ్ అనుకున్నారో గానీ ఆ పాట వాణీజయరాం కి దక్కింది. ఆ సినిమాలో ఇంకా ఎన్నో పాటలు ఆమెవే. ఒక చోట మధుమతిసినిమాలోని ‘ఆజారే పర్ దేశీ’ పాట రావడం చూసి ఆశ్చర్యపోయామే కానీ అక్కడ ఉండాల్సిన వాణీ పాట తొలగించబడిందన్న నిజం తెలియని అమాయకులం మనం.
తొలిసారిగా పాడిన వాణీ’జయ’ రాం లోనూ, తొలిసారిగా నటించిన ‘జయ’ బాధురిలోనూ ‘జయ’’జయ’ ధ్వనులు చోటు చేసుకోవడం చిత్ర విచిత్రమే కదా. ఇటు ముంబై, అటు చెన్నై – రెండూ సముద్రాల పాద్యాలతో ఎప్పటికప్పుడు ప్రక్షాళనమైపోతుంటాయి. వాణి ఈ రెండు సీమల హద్దులలోనే ఉంటూ సంగీత ధ్యాస లోనే జీవితాన్ని గడిపేస్తూ ఎనిమిదివేల పాటలు పాడడమే కాదు, ఏకంగా పధ్నాలుగు భాషల్లో పాడడమే విశేషం. జాతీయ బహుమతులు , ప్రాంతీయ బహుమతులు, ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఎప్పటికప్పుడు ఆమె స్వంత మయ్యాయి. అవార్డ్ దక్కించే సూత్రం – అయి ఉండాలి విలక్షణ గాత్రం. ఆ గాత్రం లో శృతి బద్ధమైన ఆర్ద్రత ఉండాలి. లయ బద్ధమైన మాట దొర్లాలి. డాక్టర్ మంగళంపల్లి వారు అనే వారు- ‘సుస్వరం’ అనే మాట గురించి- ‘సుస్వరం అంటే- స్వరాల్లో మంచివి, చెడ్డవి అని ఉంటాయా ఏమిటీ? అన్నీ మంచి స్వరాలే. ఐతే శ్రావ్యంగా వినపడే స్వరమే సుస్వరం’. అదిగో ఆ శ్రావ్యతే వాణి ఆభరణం. అందుకే ఒక శంకరాభరణం ఒక మహదేవుడికీ, ఒక విశ్వనాధుడికీ గర్వకారణం ఐతే అందులో ‘భవసాగరాల’ తులసి బాబు గొంతులో పరకాయ ప్రవేశం చేసిన వాణి కీ అంతే గర్వ కారణం. మరో ‘స్వాతి కిరణం’ అదే విశ్వనాథుడి, అదే మహాదేవుడి కంటి ముత్యపు చిప్పల్లో పడినప్పుడు ‘తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ, ఇలా గొంతు వణికింది ’ అన్న వాణి వాక్కులు ‘నంది’ ని కదిలించి తెచ్చాయి. సముద్రం- సినిమా సంగీతం. ఒక్కో కెరటం – గాలి తో ఆడుతూ నెమ్మదిగా లేస్తుంది. వడి వడిగా భూమ్మీది తీరాన్ని సమీపిస్తుంది. గాలి పుసుక్కున జారి పోగానే పాపం అక్కడే కెరటం కుప్ప కూలి పోతుంది. ఆ కెరటం వెనకనే మరో కెరటం – ఆ కెరటాన్ని మించి పోవాలని మరో కెరటానికి ఆరాటం--- ఈ కెరటానికీ ఆ కెరటానికీ పోరాటం. ఇదో అనంత గమనం. హద్దులో ఉండే కెరటాలే ముద్దు. సునామీలు వద్దు. కెరటాలు వస్తూ పోతుంటేనే సముద్రం సంబర పడుతుంది. గాలి అంబరానికి, భూమికీ మధ్య కనపడని ‘అనుభూతి స్పర్శ’ నిచ్చి తమాషా చేస్తుంది. సినీ ప్రపంచంలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఇది సహజం. ఒక్కొక్కరి గళం ఒక్కొక్క అనుభూతి కలిగిస్తుంది. ఈ గళం ఈ అనుభూతికి సరైనది అని తెలుసుకునే జ్ఞాని సంగీత దర్శకుడు. వీరి మధ్య మాటల వంతెన వేసే ఇంజనీరు కవి. చివరికి సుఖ ప్రయాణం చేసేది శ్రోతే. వాణీ జయరాం గాన కచేరీ అంటే అదొక కదిలే గాన గ్రంథాలయం. ఒక్కొక్క పాట చక్కగా అట్ట వేసి చూపెట్టే పుస్తకం. ఆర్భాటాలు, అతిశయాలూ దొర్లని ఒక్కొక్క మాట ఒక్కొక్క పేజీ అందులో. కొన్నేళ్ళ క్రితం వరంగల్ లో అన్నయ్య, వదిన మా ఆవిడ సాయంతో వాణీ జయరాం గాన కచేరీ ఏర్పాటు చేశారు. అక్కడి శ్రోతలకప్పుడది ‘ఘల్’ ఘల్’ అంటూ సాక్షాత్తు శ్రీవాణి నడిచొచ్చి ఇచ్చిన వరం! నిజం, ఈ వాణి ఇచ్చిన వరమే! అంతే కాదుతరిగొండ వెంగమాంబ సంకీర్తనలు హనుమకొండ ప్రతిధ్వనులు గా మార్చడం ఎవరి తరం? నిజంగా, ఈ వాణి తరమే. అంతకు ముందు వాణీ జయరాం గుజరాత్ లో సన్మానం స్వీకరించి ‘పుణే వస్తాను. కలువు’ అని మా ఆవిడకి కేవలం ఫోనులో అనడమేమిటీ , ఆమె తన భర్తతో నిజంగానే వచ్చేసి మా ఇంట మా ఆతిథ్యం స్వీకరించడమేమిటీ, 'అంతా భ్రాంతియేనా' అని పాడుకుంటుంటే- ‘నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా – సరదా పడితే వద్దంటానా’ అని మా ఆవిడని వెనకేసుకొచ్చారు వాణి. ‘అంతా భ్రాంతియేనా’ పాట పాడింది నాటి గాయని రాణి. ‘నువ్వడిగింది ఏనాడైనా’ పాడ గలిగేది మేటి గాయని వాణి. చెన్నై లో ఆమె నివాసం పక్కన చక్కని ఉద్యానవనాలు ఉన్నై. అక్కడ ఆమె నడుస్తుంటే – వాణి కనుక వాగ్దేవి అంటారో, ఇంగ్లీషు లో ‘వాక్’ దేవి అంటారో గానీ ఆ దరిదాపుల్లో ఉన్న వారంతా అదృష్టవంతులు. ఆమె ఇల్లు – స్వరాల నిలయం. ఒక పక్క ‘మ్యూజి కలా, నిజమా’ అని మనం ఆనంద సాగరంలో తేలుతుంటే ‘ఇవిగో నా చిత్రాలు’ అనే ఆమె మాట విన్పిస్తుంది. ఉలిక్కి పడతాం. ఏవో సినిమా పేర్లు రాసి ఉన్న ప్లేట్స్ చూపిస్తారనుకుంటాం. కాని ఆమె తెచ్చినవి తను స్వయంగా గీసిన బొమ్మలని తెలుసుకోగానే మళ్ళీ అచ్చెరువనే చెరువులో మునుగుతాం. సంగీతంలో రెండు పార్శ్యాల్ని అవలీలగా సాధించడమే గొప్ప అనుకుంటే, సంగీతం, చిత్రలేఖనం అనే ద్విముఖాలా వాణివి? బ్రహ్మకి నాలుగు ముఖాలైతే అతని అర్ధాంగి సరస్వతికి రెండు ముఖాలనుట సత్యదూరము కాదు. అయిననూ పప్పులో కాలు వేసితిమి. ఎందుకంటే- ఆమె కవయిత్రి కూడా. వంటలోనూ సిద్ధహస్తురాలే! అంచేత ఆమె వాణి యే - స్త్రీ బ్రహ్మఅంటేనో? అంటే – ‘నో’ అనే వాళ్లకి ఆమె ప్రతిభ గురించి బొత్తిగా ఏమీ తెలియదని అర్ధం. ‘యస్’ అనే వాళ్లకి ఆమె యశస్సు తెలుసునని అర్ధం. కనులు చూసినా పాటే లో మీరు చూసే ‘బోలేరే పపీహరా’ (గుడ్డీ) పాట ఆమె తొలి సినీ గీతం. ఆ గీతోపదేశం చేసిన మార్గ దర్శి వసంత్ దేశాయ్. ఆమెనీ చిత్ర జగత్తుకి పరిచయం చేసి ఆమె career కి ‘lift’ ఇచ్చి తాను lift ప్రమాదంలో అసువులు బాసిన ఆ సంగీత దర్శకుడు మరపురాని మహోన్నతుడు. ఆయన్ని మనసారా తలచుకోవాలి. ‘మల్లెపువ్వు’ చిత్రంలో వీటూరి (వేటూరి కాదు) పాట ‘నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా’ ఒకటి ఇప్పుడు మన మధ్య లేని చక్రవర్తి మన మధ్య ఉన్నప్పుడు కట్టిన చక్కని బాణీ, వాణీ గళం ద్వారా మనకు కలిగిన మెహర్బానీ. మరో కృష్ణుడి పాట – ‘హే కృష్ణా – మళ్ళీ నీవే జన్మిస్తే – నీ భగవద్గీతే ఋజువైతే’ అనేది డా.సి.నా.రె కలం వాణి. సినిమా పేరు – మొరటోడు. పాట చూస్తే మెత్తన. ఆ పాట కర్త ఎం.ఎస్. విశ్వనాథన్ గారిని అడిగితే ఏమంటారో? ‘వాట్ ఈజ్ ఇన్ నేమ్ – ఎంజాయ్ ప్లేయింగ్ మ్యూజిక్ యాజ్ సెవన్ నోట్స్ గేమ్’ అనేగా? అలా నిండు నూరేళ్ళు పాట ని ‘ఎంజాయ్’ చేస్తూ వాణీ ‘జాయ్’రాం పాడుతూనే ఉండాలని ఆకాంక్షిద్దాం. మన శంకరాభరణం లోని ఒక ముత్యం , స్వాతి కిరణం సోకి ప్రకాశించింది అని అనడం సత్యం. ‘బ్రోచేవారెవరురా నిను వినా రఘువరా’ అంటుంటే అ రఘువరుడు ఎవరూ తన ‘జయరాం’ అని వాణి అంతర్ వాక్కు. అందుకేనేమో- ‘పూజలు చేయ పూలు తెచ్చాను, తీయరా తలుపులను రామా’ అని అంత నమ్రంగా అంతకు ముందే ఆదేశించారు. మళ్ళీ తీపి తలపులనే తలుపులు గుర్తొచ్చి ‘ తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ’ అని ఆమె అంటున్నారు. చూడండి చోద్యం. ఎప్పుడో మహా సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కృష్ణ భక్తురాలు మీరా గా నటించి పాడితే ఒక తరానికి కనుల,వీనుల విందు జరిగింది. మళ్ళీ సలలిత సుధా రస సారంగి లతా మంగేష్ కర్ మీరా భజనలు పాడితే మరో తరానికి వీనుల విందైంది. సితార విద్వాంసుడు పండిట్ రవిశంకర్, గుండె కవి గుల్జార్ హిందీకరించిన మీరా భజనల్ని గీతాలుగా మలిచి కొత్తగా హాయిగా వినిపించ గలిగే గళం ఏదేనా ఉందా అని వెతుకుతుంటే 'ఓ లేకేం, గుడ్డీ లో నా పాటలో అనాయాసంగా స్వర బుసబుసలు చిమ్ముతూ కాంతులు మెరపించిన చిచ్చుబుడ్డి వాణీ జయరాం ఉందిగా' అని గుల్జార్ అనడం, రవీజీ ఆమె పాట వినడం , ఏ మాత్రం భేషజం లేకుండా 'భేష్!' అనడం వాణి గాన యాత్రలో మరో మలుపు తిరిగేలా చేసింది. హేమమాలినిఅందమైన మీరా గా కనువిందు చేస్తే వాణి అందమైన గళంతో అప్పటి రసహృదయుల చెవుల కర్ణభేరి పై పొరలో చాలా ఏళ్ళు నాద ఫలకం వేసుకు కూర్చుంది. మచ్చుకి -పలువురూ మెచ్చిన 'మేరే తో గిరిధర్ గోపాల్' మరోసారి చూసి, విని తరించండి. కనులు మూసినా పాటే – అందులో ఒక అర డజను పాటలు చేరటం పరిపాటే. అందులో మూడు పాటలు- ఆమెను తెలుగు చిత్ర సీమకి పరిచయం చేసిన కీ.శే. ఎస్.పి. కోదండపాణి ఆమె నోటమ్మట పలికించిన ముచ్చెం మూడు పాట ముత్యాలు. తొలి పాట డా. సి. నారాయణ్ రెడ్డి గారి జావళీ- ఎప్పటి వలె కాదురా నా స్వామీ. అదే వాణీ జయరాం తొలి తెలుగు పాట.అభిమాన వంతులు సినిమాలో నిజానికి ఆ సన్నివేశం అవసరమే లేదు. పాట ముందే తయారవుతుంది కనుకవాణీజయరాం అదృష్టమనే కన్నా మన భాగ్యం అనాలి. లేకపోతే - ఆమె తెలుగువారికి మరి కాస్త ఆలస్యంగా పరిచయమయ్యేవారేమో! అపురూపంగా నే దాచుకున్న ఈ పాట ఇక్కడ వినిపిద్దామని ఎంత వెదికినా లభ్యం కాలేదు. నెట్ లో కొన్ని దొరకవు. అప్పటికీ ఉంటాయి పదుల సంఖ్యలో పస లేని పాటల సైట్లు! వాటిలో అనవసరమైన కామెంట్ల ఫైట్లు! ‘భాగస్తులు’ చిత్రానికి గోపి అనే మెత్తని కవి రాసిన ‘నవ్వూ నవ్వించు’ అనే పాట మొత్తం వింటే వాణి గొంతుకే ‘ఫిట్’ అనికోదండపాణి ఎందుకనుకొని ఉంటారో తెలుస్తుంది (ఈ పాట వెబ్ లో దొరికేది కాదు. ప్రత్యేక శ్రద్ధతో మా చందు బాబు చేసి ఇచ్చినది). మూడవది సుశీల, వాణీల జంట గానం, అది ఒక ‘అందాల మల్లెల మాల’. ఇది - ఇది మల్లెల వేళయనీ తొందరపడి వెళ్ళిపోయిన కోదండపాణి చివరి చిత్రం ‘మాంగల్య భాగ్యం’ లోనిది. ఆయనకి సహాయ సంగీత దర్శకుడు ముత్తు అనే ఆయన ఒకడుండే వాడని ఈ పాట ఒక్కటే చెబుతుంది ( ఈ పాట కూడా ఈజీగా దొరికేది కాదు. ఇది కూడా మా చందు బాబు శ్రద్ధే!). వీటి తరువాత మీరు వినగలిగే పాట తమిళ గీతం- దక్షిణాది సంగీత దర్శకులంతా మహా గురువువుగా , సంగీత మేధావిగా చెప్పుకునే ఎం ఎస్ విశ్వనాథన్ స్వర పరిచి వాణీజయరాం చేత 'అపూర్వ రాగంగళ్' చిత్రానికి పాడిస్తే ఆమె కి నేషనల్ అవార్డ్ తెప్పించిన పాట ( ఇదే చిత్రం తెలుగులో తీసి 'స్వరములు ఏడైనా రాగాలెన్నో' అనే పాట కట్టి సుశీలమ్మ చేత పాడించారు). ఎం.ఎస్. విశ్వనాథన్ అనే దక్షిణం ఆయన తెలుగు, తమిళ సినిమా పాటల వరసలు అమోఘంగా కట్టి ‘మరో చరిత్ర’ రాయడం ఆయన జీవితంలోనే కాదు, మనకీ అదొక ‘అందమైన అనుభవం’. ఇలాంటి ‘విధి చేయు వింతలన్ని’ఉంటే అన్నిటా ‘నీ సరి ఎవరయ్యా’ ! అని ఆయన్ని అనవలసినదే. ఆచి తూచి మంచి పాటలిచ్చి వాణీ జయరాం గారికి గుర్తింపు తెచ్చి పెట్టిన ఈ విశ్వనాధుడికి ఆమె ఋణ పడి ఉంటే శ్రోతలమై మనం పాట విన్న మరుక్షణం ఆ అప్పు తీర్చేస్తున్నాం. 'నేనా -- పాడనా -- పాట! మీరా -- అన్నదీ మాట!' అని ఆమె 'హమ్మయ్య' అని హమ్ చేసుకోవాల్సిందే. కొస మెరుపు: వాణీ, జయరాం గారి ఆశీస్సులు-- వారి చేజేతులా-- అచ్చుకాని నా పాటల-ప్రతి కవర్ పేజీని అలంకరించాయి. పెద్దల ఆశీస్సులెప్పుడూ ‘తిరుగు లేని మాట’ లే కనుక ఆ విభాగం మిమ్మల్ని కూడా దీవించమంటోంది. ఇదే 'తిరుగులేని మాట' లో ఆ రోజుల్లో అంటే 1975 ల్లో ఆమె కిష్టమైన ఆమె పాట గురించి చెప్పడం గమనించండి. 'కనులు చదివినా పాటే' లో 'భాగస్తులు' పాటల పుస్తకం అందించిన వివరాలు చూడండి. -డా. తాతిరాజు వేణుగోపాల్, 30 నవంబర్ 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|