మునుపటి నా మాట
Click to zoom నాలో నేను: సప్త స్వరాలు ఎన్ని? ఏమిటా ప్రశ్న? అందులోనే జవాబు ఉంటేనూ? సరిగమ పదని - అలా ఎందుకున్నాయి? సరిగ పదమని- ఎందుకుండవూ అనేగా నీ సందేహం. ఇవన్నీ సకారం గానే ఎందుకున్నాయి? సర్వేశ్వరుడి 'సర్వే' లో తేలిందేమిటి? మీతో నేను: అనగనగా ఒక విజయనగరం. కొందరికేమో విజీనారం. రైల్వే స్టేషన్ బోర్డ్ కయితే Vizianagaram. అక్కడ పులపాక వారింట శేషమ్మ, ముకుందరావు ల సంతానం ఒకటుంది. పేరు సుశీల. ఈ పాపాయివి పెద్ద చెవులు. ఎన్ని భాషలైనా ఇట్టే ఇమిడిపోగలవు. త క తె అని ఎవరో తాళం వేస్తే అవి తమిళం, కన్నడం,తెలుగు గా గ్రహించి ఆ మూడు భాషల్లో ఎప్పటికైనా సినీ గీతాలు పాడి తీరడం పాడి కదా అని పట్టు పరికిణీ దశలోనే పట్టు బట్టిన పండితురాలు. తండ్రి కోర్టు కెళితే చేతినిండా దస్తావేజులే కాని ఇంటికి తిరిగి వస్తే అదే చేతినిండా వీణ మీటు మోజులే. ఆయన 'తాన' అంటే 'తందనాన' అని తల్లి కూడా వప్ప చెబుతుంది. ఇంత చక్కని నేపధ్యం - చిన్న సుశీలని చిత్ర సీమ కి అచిరకాలంలోనే 'నేపధ్య గాయని' గా నెలకొల్పేందుకు దోహదం చేసింది. అప్పటికి ఏ చోట విన్నా రెండు చెవులకీ విందుగా ఇద్దరి గాత్రాలు - సుశాస్త్రీయంగా ఎం ఎస్ సుబ్బులక్ష్మి వారిదొకటి, సలిలతంగా లతా మంగేష్కర్ వారిదొకటి- విన్పిస్తున్నాయి. అలాంటి విందు అందుకోవడేమే కాదు, వారిలా తానూ అందివ్వాలని పట్టుదల పెరిగింది. అప్పటికి ఏ చోట విన్నా రెండు చెవులకీ విందుగా ఇద్దరి గాత్రాలు - సుశాస్త్రీయంగా ఎం ఎస్ సుబ్బులక్ష్మి వారిదొకటి, సలిలతంగా లతా మంగేష్కర్ వారిదొకటి- విన్పిస్తున్నాయి. అలాంటి విందు అందుకోవడేమే కాదు, వారిలా తానూ అందివ్వాలని పట్టుదల పెరిగింది.
ఫిడేల్ నాయుడు గారు అని ఎవరైనా ఒక పెద్ద మేరు నగాన్ని పొట్టి చేస్తే ఫెడేల్ మని చెంప వాయించాలి. ఆ మేరు పర్వతం పూర్తి పేరు ప్రపంచంలో పేరు గాంచిన - ద్వారం వెంకట స్వామి నాయుడు. ఆ కొండ ఇచ్చిన కొండంత అండ - శాస్త్రీయ సంగీతంలో చిన్ని సుశీల కిచ్చిన స,ప,స స్వర రహస్యాలు. సుశీల వాటిని సహజత్వం, పరిశీలన, సమతూకం అనే పెద్ద మాటలకి పొడి పొడి పొడి రూపాలుగా అన్వయించుకోవడం ఆమెకు మేలు చేసింది. ఏది పాడాలన్నా- గొంతు సహజంగా ఉండాలి. మౌనంగానే పదాలు పరిశీలించాలి. శృతి, లయల సమతూకం పాటించాలి. అవన్నీ ఉండబట్టే ఆమె పాడిన ప్రతి పాటా బట్టీయం అందరికీ. ఎందరో ఆమె లాగ పాడాలనుకుంటారు. తీరా పాడే సరికి ఒక అంజలీ దేవి, ఒక సావిత్రి, ఒక జమున, ఒక కృష్ణ కుమారి, ఒకషావుకారు జానకి, ఒక సరోజా దేవి, ఒక వాణిశ్రీ, ఒక జయలలిత, ఒక కాంచన, ఒక రాజశ్రీ, ఒక రాజసులోచన, ఒక సరోజ, ఒక శారద కళ్ళ ముందు మెదిలి ' అబ్బే మనం ఈమె లాగ పాడలేం బాబూ' అని తప్పుకోవడం ముమ్మాటికీ నిజం. ఘంటసాల రెండు భుజాలకి సరిపడ్డా అక్కినేనినీ, నందమూరినీ అన్ని సార్లూ ; శోభన్ నీ, కృష్ణ నీ కొన్ని సార్లు ఎక్కించుకునీ వారేవీరా, వీరే వారా అన్నంతగా వారితో మమేకమైపోయారు. మరి సుశీలమ్మ మాటేమిటీ? బేబీ పద్మిని, బేబీ రోజారమణి, బేబీ శ్రీదేవి, మాస్టర్ బాబ్జీ, మాస్టర్ ఆదినారాయణ, మాస్టర్ ప్రభాకర్, మాస్టర్ రాము లే అచ్చం పాడుతున్నట్టు అనిపిస్తుందే! శారద వీణ మీటుతుంటే అక్కడ ఇ.వి. సరోజ 'పాడవేల రాధికా' అని పాడుతున్నట్టే ఉంటుందే! వాణిశ్రీ వీణ మీటితే చంద్రకళ'మదిలో వీణలు మ్రోగే' అని సిగ్గుపడినట్టే అనిపించిందే. అప్పుడే 'లీల'గా సావిత్రి గుండమ్మ సేవలు చేసొచ్చి 'సుశీల' గా మారి పోయి 'అలిగిన వేళనే చూడాలి' అని ఎన్ టీ ఆర్ ని బుజ్జగించినట్టే కనిపించిందే. షావుకారు జానకి 'పాండవులూ పాండవులూ తుమ్మెదా' అని రెచ్చిపోయి పాడితే ఏ ఎన్ ఆర్ లా మనమూ ఆశ్చర్య పోయామే! జమున 'గోదారి గట్టుంది' అని పెంకెగా ఎగిరితే అమ్మో ఈవిడే సత్యభామకి తగును అని అనుకున్నామో లేదో 'మీరజాల గలడా నా యానతి' అన్న ఆమె సవాల్ విన్నాం కదా. 'మొక్కజొన్న తోటలో' 'ముత్యాల జల్లు కురిసే' అనిజయలలిత హడావుడి చేస్తే మనమూ పరుగులు తీశాం. 'దూరాన నీలి మేఘాలు' అని కృష్ణ కుమారి చూపిస్తే థియేటర్ చూరు చూస్తుండిపోయి పాట సరిగా చూడలేదని 'గుడి గంటలు' కొట్టి మరీ మళ్ళీ సినిమాకి వెళ్ళాం. 'పిలువకురా అలుగకురా' అన్నది నాటి 'సువర్ణ సుందరి' అంజలీ దేవియేనా? కొన్నేళ్ళ తరువాత 'మీ నగుమోము నా కనులారా' అని అన్నదీ ఆమేనా? అమావాస్య చీకటి లోనూ కాంచన పాడినట్టే 'అందెను నేడే జాబిల్లి' మనకి. ఏక గాత్రంలోనే భిన్న పాత్రాభినయం. అదే సుశీల స,ప,స ల త్రివేణీ సంగమం. ఆ పాటల ప్రవాహంలో ఈత కొట్టాం. ఈల వేశాం. పద్మభూషణ్ అన్నది ప్రభుత్వ సత్కారం. కాని ఎప్పటికీ గానకోకిల గానే ఆమె గళం శ్రోతల ముందు సాక్షాత్కారం. లతా మంగేష్కర్ - లకారం తో start. సుశీల- ల కారం తో stop. ల-ల అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరిగితే సూర్యుడికి ఉత్తరాయణం, దక్షిణాయనం ఏర్పడినట్టు యావత్ భారత సినీ పరిశ్రమ వీరిని ఉత్తర, దక్షిణ సీమల్లో నిలబెట్టి ఈ 'పాటల' పరి భ్రమణం అనంతం అని ధ్రువీ కరించింది. లల లాలా ల ల్లాల లలా ----అని పాటల జలాకాలాటలో మునిగి తేలుతూ రేపటి మాట మరిచిపోతున్నామేమో? నవంబర్ 14- పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన తేది. చాచా నెహ్రూ అని పిల్లలూ, హమారా గులాబ్ అని పెద్దలూ సంబర పడే రోజు. శాంతి దూతకి దేశ విదేశాలు నివాళులిచ్చే రోజు. కాబట్టి - సుశీలమ్మ గళం 'పిల్లల' రూపంలో ఎలా పరకాయ ప్రవేశం చేస్తుందో తెలిసిన విషయమే అయినా మరోసారి ఏడు స్వరాలన్నట్టు ఏడు 'దృశ్య కావ్యాలు' చూస్తే నాటి బేబి పద్మిని, బేబి రోజారమణి, బేబి శ్రీదేవి, మాస్టర్ బాబ్జీ, మాస్టర్ ఆదినారాయణ, మాస్టర్ ప్రభాకర్, మాస్టర్ రాము లు ఎంత బాగా పాడారూ అని అనిపిస్తుంది. చల్లగ వీచే ఈ నవంబర్ చల్ల గాలికి 'కనులు చూసినా పాటే'. అంతే కాదు- 'కనులు మూసినా పాటే'! కాస్సేపు నడుం వాల్చే మనకే 'అమ్మ' జోల పాడితే ఎంత బావుణ్ణు అని అనిపిస్తుందే. అలాంటిది సుశీలమ్మ జోకొట్టి పాడితే ఆ 'లాలి' కే ఒక అందం. 'లాలిజో లాలిజో లాలీ లాలి' అని నాలుగు మాటలే పల్లవిగా (అతి చిన్న పల్లవి) పాడినా నాలుగు వేదాలు చదివేసినంత తృప్తి నిచ్చింది ఆమె పాట. 'అత్త ఒడి' లో నిద్దురపోయే మేన కోడలు కైనా అత్తగారంటే భయపడే కోడలు కైనా ఆమె అందించిన 'లాలి' పాటలు అవసరం. అందుకే కొన్ని దశాబ్దాల తరువాత కూడా అదే సుదతి 'లాలి'త్య గళంలో 'స్వాతి ముత్యం'లా మెరిసింది ('లాలి పాటల మాటకొస్తే- ఇంతవరకు ఇదే ఆఖరు' అన్నట్టు) 'వటపత్రశాయికి వరహాల లాలి' అనే లాలి పాట. సుశీలమ్మ పుణ్యమా అని ఈ పాటతో ఇళయ రాజా అనే అబ్బాయిగారు కాస్త 'ఇ'లాలి'య రాజా' అయిపోయారు. లకారమంటే లక్షలని అనుకునే వారికి వరహాల లాలి. లకారం అంటే లక్ష గళాల పెట్టు మన సుశీలమ్మ లలిత, లావణ్య గళం అనే వారికి లక్షణమైన లాలి. సుశీలమ్మ గళం పది కాలాలు వర్ధిల్ 'లాలి' !!! మీతో ముక్తా 'యింపు' మాటలు కూడా నావే: సప్తస్వరాలు ఎన్ని? అని ఎందుకడిగానూ? సుశీలమ్మ 77 వయసులోకి అడుగు పెట్టిన చిన్న పిల్ల కనుక ఆరోహణలో ఏడు స్వరాలూ, అవరోహణలో ఏడు స్వరాలూ పక్క పక్కన చేరి 77 అని మీరు అనాలని, మీరంటే నేను వినాలని! సప్త (7), స్వరాలూ (7) అని వాదిస్తారానీ, నాతో ఏకీభవిస్తారని! 'సరిగ పద మని' ఆమె చెప్పే మాటకి ఆ ఏడు స్వరాలూ ఎప్పుడూ బద్ధమై ఉండేవి కాబట్టి అవి తతిమ్మ వారికే 'స రి గ మ ప ద ని' అనే తికమక, అందులోనూ మకతిక- అని నా మాట, అదే మీ మాట అని! ఇవన్నీ 'స'కారంగానే కదూ, ఎందుకనీ అలా మొదలయ్యాయి? అంటే- మరి సుశీల- కూడా సకారమే కాబట్టి అది సహజం అని, నిజం అని మీరూ నేనూ చెప్పాలని! ఏతావాతా తేలిందేమిటంటే -సకల లోకం మెచ్చే గళం 'సుశీల' గళం అని 'సర్వే'శ్వరుడి 'సర్వే' లో తేలింది. [కొన్ని 'హౌ? రా' అనే ఆశ్చర్య వాక్కులు: కళా తపశ్వి తొలిసారిగా దర్శకత్వం చేపట్టిన 'ఆత్మ గౌరవం' సినిమాలో ఎస్.జానకి పాట లేనే లేదు. ఆ సినిమాకి కాంస్య నంది దక్కింది. అదే విశ్వనాథ్ గారికి 'టర్నింగ్ పాయింట్' అయిన 'శంకరాభరణం' ( బంగారు నంది పొందింది) లో పి.సుశీలపాట లేనే లేదు. చిత్రంగా 'సాగర సంగమం' లోనూ సుశీల పాట లేదు. నటి బి.సరోజా దేవి డ్యూయట్ పాటలకి సుశీల హమ్మింగ్ కంపల్సరి! ఆత్మబలం లో 'పరుగులు తీసే నీ వయసునకు' ,అమరశిల్పి జక్కన్న లో 'నిలువుమా నిలువుమా నీలవేణి' గుర్తొచ్చాయా? అలాగే సరోజాదేవికి సుశీల సోలో పాట ఉంటే పురుష గళం ష్! బీ సైలెంట్. ఏ ఎం రాజా ' ఐసీ' 'నిజంగా' అనే రెండు మాటలే ఒక పాటలో అన్నారు. చెంచులక్ష్మి లో రెండు పాటలు ఘంటసాల, జిక్కి పాడగా ఉన్నాయి. అవే పాటలు రికార్డ్స్ లో పి.బి.శ్రీనివాస్, సుశీలపాడినవి కూడా విడిగా వచ్చాయి. సుశీల పాడిన మూడు పాటలకి ( అంతా మన మంచికే- మాట చాలదా మనసు చాలదా , ఒకే కుటుంబం- కావాలి తోడు కావాలి, మూగ ప్రేమ- ఈ సంజలో కెంజాయలో) బాలు 'హమ్మింగ్' మాత్రమే ఇచ్చారు]. ఆహా ఆహాహా లో 'మీ నగుమోము మా కనులారా కననిండు' అని మనం అంటున్నట్టు సుశీలమ్మ ముఖారవిందం ఉంది. చూడండి. ఇంకా - ఆరుద్ర కబుర్లు అవీ ఇవీ అన్నీ కూడా 'ఈ పూట ఆమె పాట' ప్రత్యేకాలే. -డా. తాతిరాజు వేణుగోపాల్ , 13 నవంబర్ 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|