మునుపటి నా మాట
ఆది ‘వాస్తు’ విజ్ఞాని, దేవశిల్పి ‘విశ్వకర్మ’. హస్త కళ ఆయన ప్రత్యేకత. మంచి ‘constructive thinker’ అన్న మాట. ఆదర్శ వంతమైన ఆలోచనలే తప్ప ‘ఆదర్శ్’ అపార్ట్ మెంట్స్ లా కట్టేయడం, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు కూల్చేయడానికి సిద్ధ పడడం లాంటివి ఎరుగని లోకం వారిది. అదేం లోకం? అదీ మన భూలోకమే కదా. అంటే పరిమితిలో, కనుగొన్న‘జ్యామితి’లోనే అన్ని కోణాలూ ఆలోచించి విశ్వకర్మ తన ఇంజనీరింగు ప్రతిభ చూపించేడన్న మాట. వారికి ‘కుంభ కోణాలు’ తెలియవాయే! విశ్వకర్మ జయంతిగా ఈ మాఘ శుద్ధ త్రయోదశి తిధిని గౌరవిస్తారు. అవును- సామాన్యుడా? అతను, మాన్యుడు కానీ. మాఘ అంటే మాహా ఘనుడని అర్థమేమో! (మహా గణపతి కీర్తన చాలా మంది నోట మాహా గణపతి గా మారడం మీరూ గమనించే ఉంటారు. అందుకే ఇక్కడా ‘మాహా’ అన్నాను) .
విశ్వకర్మ సూర్యుణ్ణి గుండ్రంగా మార్చాడు. అలా చేసి సూర్య తాపాన్ని తగ్గించాడు. ఆ చెక్కడంలో వచ్చిన చూర్ణాన్ని విష్ణు చక్రంగా మలిచాడు. శ్రీ రాముడికి సేతువు, రావణుడుకి లంకా నగరు, పాండవులకి ‘ఇంద్రప్రస్థ’, చివరికి శ్రీ కృష్ణుడికి ద్వారక –ఇవన్నీ మిత్రులా శత్రువులా అని చూడకుండా ‘ మంచి పనితనమే మనిషికి మూల ధనం’ అన్న రీతిలో నిర్మించి ఇచ్చిన నిజమైన ప్రతిభా మూర్తి ఆయన. ద్వారక నిజంగానే మునిగి పోయింది. సముద్ర మట్టం పెరిగి పెరిగి ముంచేసిందంటారు. కలి యుగంలో మాత్రం అద్భుతమే జరిగింది. మెరైన్ ఆర్కియాలజీ విభాగం తరఫున డాక్టర్ ఎస్. ఆర్. రావు గారు ఇందిరా గాంధి ప్రధానిగా ఉన్న రోజుల్లో (1981) పచ్చ జండా ఊపితే 1983-90 ల మధ్య కాలంలో స్కూబా డైవింగ్ విద్యతో ద్వారక (గుజరాత్ తీర తీర్థ స్థలం ) అవశేషాలు వెతికి పట్టుకున్నారు. వెలికి తీసారు. జయహో రావు గారూ. మీలాంటి నవీన విశ్వకర్మల శ్రద్ధ, సంస్కృతి పట్ల మీకున్న గౌరవం శ్లాఘనీయం. మీకు భారత రత్నలు వస్తాయా? డౌటే! ఓ కవిత గానీ, ఓ పాట గానీ రాయాలంటే విశ్వకర్మ లాగే గొప్ప పదునైన బుద్ధి కావాలి. పాటల్లో ఏముంది వట్టి మాటలే అనుకుంటే అలా కట్టిన పాటలు పేక మేడల్లాగనే కూలిపోతాయి. పోనీ ఏవేవో అర్థం పర్థం లేని భావాలు చొప్పిస్తే చాలను కుంటే ఆ పాటలూ గాలి మేడల్లాగనే కనిపించకుండా పోతాయి. రాసే ప్రతి పాటలో ఏదో ‘వెరైటీ’ చూపనిదే కొందరు ‘కవి’శ్వ కర్మలు ‘వేరే’టీ జోలికి పోలేదు. అదిగో- అలాంటివారే మన ఆరుద్ర , ఆత్రేయ గార్లు. సాధారణంగా ‘ఫలానా ఎక్కడ’ అంటే వేలు చూపుతాం. ఏమిటా వైవిధ్యమున్న పాటల చిట్టా? అని ఇక్కడ అడిగితే అరచేయి చూపితే చాలు. అంటే ఓ అయిదు – ఓ ఫైవుందా అని ముళ్ళపూడి వారి అప్పారావు అడిగినట్టు- అయిదేనా? అవును ముమ్మాటికి అయిదే కనిపిస్తాయి. అస్తమానూ చూపకండి- ఏదో పార్టీ ప్రచారం అనుకో గలరు తెలియని వాళ్ళు. పాటకి పల్లవి ప్రాణం. పాటకి ప్రాస ఆభరణం. పల్లవిలో ప్రాస పల్లవించినప్పుడు అది నామ వాచకమైతే చరణాలన్నిట్లోనూ వాక్యం చివర నామ వాచకమే ఉండేలా చూడడం ఒక అద్భుత ప్రయోగం. అలాగే, పల్లవిలో వాక్యాంతం క్రియా వాచకమైతే అలాంటి క్రియా వాచాకాలతోనే తతిమ్మా చరణాలూ సాగిపోవడం ఈ అద్భుత ప్రయోగంలో మరో ప్రయోగం. అంతే కానీ నామ వాచకాలూ, క్రియా వాచకాలూ కలిపేయ కూడదు. పితామహుడు ‘భీష్మ’ చిత్రం లోని కాంతారావు (ఈయన గీసిన బొమ్మలోంచి బయటకొచ్చి పాడుతాడీ సీనులో- వెనకటి సినిమా రోజుల్లో ఏనిమేషన్ అనేది లేకపోయినా బార్ట్లే వంటి విశ్వకర్మలు ఉండేవారు. మాయా బజారు లో టీవీ, లయ్యర్ డిటక్టర్ వంటివి ఆనాడే చూపించేరు) పాట వింటూ మీరు మైమరచిపోయి ఉండాలి. ఎందుకైనా మంచిది,ఇప్పుడే, వెంటనే మరో సారి ఆ పాటని జాగర్తగా వినండి. వీలయితే రాసుకోండి. ఆ ‘మనసు లోని కోరిక’ పాట లో ‘క’ అంత్య ప్రాస లేదూ పాట మొత్తం. పైగా ‘క—క—క—క—క’ తో ముగిసే నామవాచకాలే అంతటా. హాట్స్ ఆఫ్ ఆరుద్ర గారూ (గెడ్డం ఆఫ్ అంటే ఆయనికి కోపం రాదూ? స్వర్గంలో మునులకి, తాపీ ధర్మారావు కీ ఆయన నచ్చుతారు). మహానటి సావిత్రి ని తలుచుకుంటూ మీరు బహుశ: మరచిపోయి ఉండాలి. సుమంగళి (1965) చిత్రంలోని ‘కన్నులు నీవే కావాలి’ పాట ఇక్కడే ఇప్పుడే మరోసారి వినండి. ఈ పాటలో ప్రాస గా క్రియా వాచకాలే రావాలని ఆశగా ఉందా? మీ ఆశ నిరాశ కాలేదు. లి,లి,లి,-లి, లి ఎన్నిసార్లు విన్నా రియల్లీ ------అదో పాలవెల్లి. చివర్లో మాత్రం ‘శిల్పం నీవై కల్పన నేనై’ అన్న లైను తప్పిస్తే ప్రతి లైనూ ‘లి’కారంతోనే ముగుస్తుంది. ఇహ మీరు తక్షణ కర్తవ్యంగా రెండు వీడియో క్లిప్స్ కొత్తగా చేర్చినవి చూడాలి. ఒకటి- ‘కొండగాలి తిరిగింది’ పాట. మరొకటి – ‘గుట్ట మీద గువ్వ కూసింది’ పాట. ‘ఉయ్యాల-జంపాల’ ( 1965 ) చిత్రంలోని ‘కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది’ పాటలో ఏం ఉంది? పాటంతా క్రియా వాచకం ఉంది , ‘ది’ అక్షర ప్రాస ఉంది. అంటే అంతటా ‘దికార’ మే గానీ ఆ నియమం మీద ‘ధిక్కారం’ లేదని రుజువైంది కదా. అదే ప్రాస, అలాంటి క్రియా వాచకాలే మనకి ‘బుద్ధిమంతుడు’ (1969) చిత్రం లోని ‘గుట్టమీద గువ్వ కూసింది కట్ట మీద కౌ(జు పలికింది’ పాటలో క/వినిపిస్తాయి. ఆరుద్ర మనసులోని కోరిక ఎంత బలమైనది అంటే మరో సారి ఈ ‘క..క..క..’ క భాష వాడారు. ‘ఈ మౌనం ఈ బిడియం’పాట ‘డాక్టర్ చక్రవర్తి’ (1964) లో రావడం, మీరు వినడం జరిగి పోయాయి. ఎటొచ్చీ ఇప్పుడు కొత్తగా మరో కోణంలో ఉండి వింటే కొత్త హాయి కలుగుతుంది. ఈ పాట మరో సందర్భంలో వినే లేక కనే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ మౌనం అర్ధాంగికారం. కచ్చితంగా ఈ అయిదు పాటలే, అదీ ఈ ఇద్దరు మహానుభావులు రాసినవే ఉన్నాయి ఇంత మన సినీ భండాగారంలో. మరో అర చేయి ఉందేమో అని మీకు వచ్చిన సందేహమే నాకూ వచ్చింది. అయితే రెండు పాటలు ఇమడక చెంప చెళ్లుమని పించాయి. ‘రేపంటి రూపం కంటి’ (మంచి-చెడు, 1963) పాట లో అంతటా ‘టి’కారమే వస్తుందని సంబర పడే సమయానికి అలా లేదని తేలిపోతుంది. ‘చూచి వలచి చెంతకు పిలచి’ పాటా అంతే. విచిత్రం ఏ(విటంటే ఇవీ ఆత్రేయ,ఆరుద్ర కలాలనుంచి జారిన సిరాలే. ఇలాంటి ప్రయోగంతో వచ్చిన పాటలప్పుడే అన్ని లేవు – ఇప్పుడా రావు గాక రావు. మునిగి పోయిన (తెలుగు పాట) ద్వారక, ఎప్పుడో తిరిగి నీ రాక? ఏ విశ్వకర్మ కెరుక? విశ్వమే పోతుందని బెంబేలు పడిపోతుంటే ఈ తాంబేలు కబుర్లెవరిక్కావాలి? -డా, తాతిరాజు వేణుగోపాల్ (16 ఫిబ్రవరి 2011)
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|