మునుపటి నా మాట
ఆంధ్రలో ఏ గడ్డ కన్న బిడ్డ అయినా 'ఉంగా ఉంగా' అనే అంటుంది. కాని అక్కడక్కడా కొందరు మాత్రమే పుడుతూనే కళాకారులై 'నాటక రంగా' అనో లేదా 'సినీ రంగా' అనో అంటారు. పైగా - పుట్టే ఆ కళాకారుల కళ్ళముందు ఒక మహా విశ్వాకారం ఇట్టే సాక్షాత్కరిస్తుంది. దాని పేరే 'ప్రతిభ'! ఎదిగి ఒదిగి,ఒదిగి ఎదిగి ఉండమని చెబుతూ వచ్చే ఆ మహా విశ్వ సదనంలో కొందరు ఉల్కలై రాలిపోతే మరి కొందరు 'తార'లుగా మిగులుతారు. అతి కొద్దిమందే ధృవ తారలౌతారు. సూర్యుడు శరీరాన్ని, చంద్రుడు మనసుని నియంత్రిస్తుంటే 'తారా పథం' మొత్తం ప్రపంచాన్నే కదిలిస్తోంది. పదహారు కళల కళాకారుడు అనదగ్గ చంద్రుడి ఒకానొక అమావాస్య కళని 'సినీవాలి' అంటారు. వెలుగునీడల సయ్యాట చంద్రకళ కాబట్టి చంద్రుడికి, సినిమాకి ఎప్పటినుంచో అనుబంధముంది అని తెలుస్తోంది. అందుకే సినిమా కళ ప్రతి ఒక్కరి మనసులో అంతో ఇంతో చోటు చేసుకుంటూనే ఉంది. తెలుపు, నలుపుల నుంచి రంగుల్లోకి మలుపులు తిరిగిన తెలుగు సినీ ప్రపంచం ఎనభై మైలు రాళ్ళ తారా పథం మీద హాయిగా ప్రయాణిస్తోంది. ఐతే మరో ఇరవై మైలు రాళ్ళు దాటినా కూడా ఒకే ఒక్క 'గళం' మాత్రం గుళ్ళోని గంటలా ఆగిపోక ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ప్రతి ఇంట ఇలవేల్పు లాగ 'గళ వేల్పు' అనే కొత్త పదం, కొత్త పదవి ఆ గళం అందుకుని ఉండిపోతుంది. నిజానికి గుళ్ళో దేవుడి పాదం కన్నా ముందు చేయి అందుకునేది గంటనే కదా. ఇక్కడ అలా కాదు- గుడి, గంట అనే ఏక వచనాలు ఏకమై 'గుడిగంటలు' అనే 'బహు' వచనమైపోయి ఒక నానుడిగా నిలిచి ఉంటుంది. తెలుగు వారు ఆ గళానికి, ఆ గుడిగంటల నానుడికి ఎప్పుడో 'ఘంటసాల' అనే పేరు పెట్టి ఉంచారు. మూడు దశాబ్దాల పాటు ఆ గళం, ఆ ఘంటారావం సృష్టించిన 'పాట' తరంగాలు మరో నాలుగు దశాబ్దలకైనా క్షీణించక పోవడం, పైగా అంతకంతకూ విశ్వ ఖ్యాతి పొందడం చూసి ఒక విశ్వ ప్రశ్న తలెత్తింది. 'ఘనమైన 'ఘంట' మ్రోగి, ఘనత పొందిన 'పాట'శాల పేరేమిటి?' అన్నదే ఆ విశ్వ ప్రశ్న.
ఆ విశ్వ ప్రశ్న కిచ్చినహ్రస్వ జవాబు 'ఘంటసాల'! మామూలు గంట మ్రోగే పాఠశాల లో విద్యకి కాల పరిమితులుంటాయి. కాని ఈ 'ఘంటసాల' అనే 'పాట'శాల లో ఎన్ని సార్లు విన్నా ఎన్ని సార్లు అన్నా ఇంకా ఏదో తెలియని కొత్త విద్య దాగి ఉన్నట్టే ఉంటుంది. ఆ విద్యను ఎలాగైనా రాబట్టుకోవాలనే ఉంటుంది. సముద్రాల రాఘవాచార్య, బి.ఎన్.రెడ్డి, చిత్తూరు వి. నాగయ్య, బాలాంత్రపు రజనీ కాంత రావు వంటి నాలుగు స్తంభాల ఆసరాతో ఆ 'పాట'శాల నిలబడింది. పట్రాయని సంగీత రావు, జె.వి.రాఘవులు వంటి 'వెన్నంటి' ఉండే సహచరుల వల్ల ఆ 'పాట'శాలకి మరింత శోభ కూడింది. సుబ్బరామన్, సుసర్ల, సాలూరి, పెండ్యాల, ఆదినారాయణరావు, మాస్టర్ వేణు, మహదేవన్, చలపతిరావు అనే అష్ట దిగ్గజాల వంటి ఇన్స్పెక్టర్ల వల్ల ఆ 'పాట'శాల కి గుర్తింపు వచ్చింది. నాగయ్య, రాజా, శ్రీనివాస్, పిఠాపురం, మాధవపెద్ది , వరలక్ష్మి, భానుమతి, రాణి, కోమల, లీల, జిక్కి, బాలసరస్వతి, జమునారాణి, సుశీల, జానకి, ఈశ్వరి, వసంత - ఇంత మంది సహోపాధ్యాయుల ఆదరాభిమానాలతో ఆ 'పాట'శాల చరిత్రకెక్కింది. సముద్రాల, కొసరాజు, మల్లాది, దేవులపల్లి, శ్రీశ్రీ, అనిసెట్టి, ఆత్రేయ, ఆరుద్ర, రామానుజాచార్య, సదాశివబ్రహ్మం, నారాయణ రెడ్డి, దాశరథి - వంటి డజనుకు పై చిలుకు స్పెషలిస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు పరీక్షా పత్రాలు అందించి ఆ 'పాట'శాల 'స్టాండర్డ్' నిలబెట్టేరు. అప్పుడప్పుడూ గురజాడ, బద్రిరాజు, బసవరాజు, జాషువా,విశ్వనాథ, కరుణశ్రీ వంటి వారి నిఘా తనిఖీలు 'పాట'శాల పని తీరును శ్లాఘించేలా చేశాయి. ఈ డిసెంబర్ 4 న ఘంటసాల అనే ఆ 'పాట'శాల పుట్టిన రోజు (జయంతి అనే మాట ఈ 'పాట'శాల కి వర్తించదు. అది 'అ-క్షరం' అన్న మాట అక్షరాలా నిజం కనుక 'పుట్టిన రోజు' అనడం సబబే. అబ్బబ్బే- అనే వాళ్ళు ఉండరన్నదీ పచ్చి నిజం). ఈ సందర్భంగా ఈ 'కృష్ణప్రేమ' తనవంతు సంబరాన్ని- ఒక రోజు క్రితం అందిన వార్త జత చేస్తూ, తగినట్టు పాటలు చూపిస్తూ, వినిపిస్తూ - 'పాటల కొలువు' ద్వారా తెలియజేసుకుంటోంది. ఏమిటా వార్త? వార్త కాదు- వార్తలు. అలనాడు ఘంటసాల వారి 'ఘంటా'రావానికి పోటీ పడుతూ 'బాల' తనంతో కోమల శ్రుతితో పాడి ప్రతి ఒక్కరి మనసుకి హాయిగొల్పిన రావు బాలసరస్వతీ దేవి గారికి 'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం విశిష్ట పురస్కారం' ఈ డిసెంబర్ 2న లభించింది. నగదు యాభై వేలు కన్నా ఆమె ఆ మహా గాయకుడితో పాడిన వందల పాటలు చాలు- అదే పదివేలు! అరవైల నుంచి డబ్భైల కాలం వరకు అంచెలంచెలుగా తన వైవిధ్య స్వరాల అలల గొంతుతో 'నా పేరు సెలయేరు' అంటూ దూసుకొచ్చిన, అల్లరీశ్వరి అని పేరు పొందిన ఎల్.రాజేశ్వరి ఉరఫ్ ఎల్.ఆర్. ఈశ్వరి గారికి ఘంటసాల జయంతి సందర్భంగా ఈ డిసెంబర్ 2న రాగరాగిణి ఆర్ట్స్ అసోసియేషన్ వారి కార్యక్రమంలో డా. సి.నారాయణ రెడ్డి వారి చేతుల మీదుగా 'స్వర్ణ కంకణం' అలంకృతమైంది. 'జిల్లాయిలే', 'పగటి కలలు కంటున్న మావయ్య', 'మొగిలి రేకుల', 'అందమంటే నీవె నీవె', 'లౌ లౌ లౌ మి నెరజాణ', 'లే లే లే లేలేలే నా రాజా' వంటి పాటలు ఆమెతో పాడినప్పుడు ఘంటసాల మాస్టారు అప్పటి కాలానికి తగ్గట్టు తన గళాన్ని 'హుషారు' గళంగా మలచుకున్నారు. ఈశ్వరి గారి పుట్టిన రోజు ఈ డిసెంబర్ 8 నే కాబట్టి ఆమెకి 'డబల్' శుభాకాంక్షలు. 'కనులు చూసినా పాటే' లో ఈ ఇద్దరు గాయనీ మణులతో ఘంటసాల వారు పాడిన ఎన్నో పాటల మధ్య ఏదో ఒక విశేషమున్న రెండు పాటల వీడియోలు చోటు చేసుకుంటున్నాయి. చూడండి. వినండి. జయసింహ చిత్రంలో ఆ నటి వహీదా రెహమాన్ అని గుర్తు పట్టేరు కదూ. ఉమా చండీ గౌరీ శంకరుల కథ ( కె.వి.రెడ్డి వంటి మహానుభావుడి ఈ చిత్రం ఎందుకో ఫెయిల్ అయినా పెండ్యాల వారి పాటలు నిలిచాయి) లో నటి బి.సరోజాదేవి కి ఎల్.ఆర్.ఈశ్వరి గాత్రం ఒక విశేషం. తెలుగు పాటల్లో ఈశ్వరి పాడిన వాటిలో 'కోయ' వారి పాటల ధోరణే అధికం. మాస్టారి కన్నడ, తమిళ పలుకు సొబగులు అద్దిన డాక్టర్ రాజ్ కుమార్, జెమినీ గణేషన్ ల అభినయం చూసారా? ఎవరో ముచ్చట పడి 'ఘంటసాల' వారిని చిత్రించి, 'ఘనా ఘన సుందరా' అనే మాస్టారి పాట జోడించి తన్మయులయ్యారు. వారికి కృతజ్ఞతలు చెబుతూ ఆ వేడుక కూడా చూద్దాం, ఆ పాట విందాం. ఒకనాటి 'ఘంటసాల' వారి సన్మాన విశేషాలు వీడియో గా రావడం మన అదృష్టం. కనులకు విందు అది అన్నది సుస్పష్టం. 'పాండురంగ మహాత్మ్యం ' సినిమా టైటిల్స్ లో ఆనాడు ఒక లోపం జరిగి పోయింది. అదే- 'ఘంటసాల' వారి పేరు లేక పోవడం. ఘంటసాల వారి పాటలతో పేరొచ్చిన ఆ చిత్రంలో ఆ ఒక్క కార్డ్ వేయడం ఇప్పుడు దుస్సాధ్యం కానే కాదు అని 'హాసం' పత్రిక కొన్నేళ్ల క్రితం బుజ్జగించింది కూడా. చూసి మీరూ అలానే కోరండి. 'కనులు మూసినా పాటే' లో ఒక విశేషం ఉంది. ఇది ఘంటసాల వారి గాత్రానికి అందిస్తున్న గళ సూత్రం. ఘంటసాల వారి పేరు (ఇంటిపేరు ఆయన పేరైంది కనుక) 'ఘం' అనే విశేష నాదంతో మొదలైంది కనుక 'అహం' ఎరగని ఆ మహా చంద్రునికో నూలు పోగుగా అం నుంచి హంవరకు ఉన్న పాట పల్లవులు (ఆయన పాడినవి మాత్రమే) పేని ఇస్తున్నాం. ఈ మెడ్లీ పాట తోరణం కచేరీల్లో చేరి 'డెడ్లీ' అనిపించుకోవాలని మా ఆశ. మా అన్నయ్య జగాల ప్రేరణ అయిన 'పంచ భూతాల' ప్రస్తావన తీసుకొచ్చాడు 'మిత్రుల పత్రాలు' లో. సమయానికి తగు పాట పాడెనే మన ఘంటసాల వారు- అని అనిపించింది. ఆకాశం, భూమి, గాలి, నీరు(జలం), నిప్పు (అగ్ని) ఉన్న అయిదు పాటలు ఎంపిక చేసి ఇస్తేనో? అని అనిపించింది. ఇంతకీ మీకో రహస్యం తెలుసా 'శ్రీ ఘంటసాల' అనేది 'పంచాక్షరి'! పంచభూతాల సాక్షిగా చెబుతున్నాం- ఈ పంచాక్షరి మంత్రం జపిస్తే వర్ధమాన స్వర ప్రపంచం లయ తప్పక శ్రుతిబద్ధంగా ఉంటుంది. అర్ధం చేసుకోరూ... 'ప్రతి రాతా ప్రసిద్ధమే', 'ప్రతి ముఖమూ ప్రముఖమే' - నిండా 'ఘంటసాల' వారి ధ్యాసే ఈ పూట. ఆ మాట కొస్తే ఏ పూటా నూ. కొసమెరుపు: ఘంటసాల వారి పూర్తి పేరు- ఘంటసాల వేంకటేశ్వర రావు. అవును కదా- ఆ పేరు చివరలో ఉన్న 'ఈశ్వర' 'రావు' అనేవి మరో ఇద్దరు గాన కళాకారులైన ఈశ్వరి, రావు బాలసరస్వతి గార్ల ప్రతిభకి ఈ ఏడాది కొత్తగా ప్రభలు కూర్చడం కాకతాళీయమో, నా పెన్ను పాళీయమో ---- -డా. తాతిరాజు వేణుగోపాల్ , 04 డిసెంబర్ 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|