మునుపటి నా మాట
ఎవరివి జనవరి చివరి తొమ్మిది రోజులు? ‘ఇదే నీ ప్రశ్న ఐతే బాలాజీ, నేను జనవరి ఇరవై మూడు నుంచి మొదలెట్టాలి’ ‘నేను చెప్పేందుకు ఇష్టపడే మూడు రోజుల గురించి నన్ను చెప్పనీ’ ‘అటులే కానిమ్ము’ ‘జనవరి ఇరవై మూడు ఉందే, అది బోసు బాబు జయంతి. పరాధికార ధిక్కారానికి హింసాత్మక తిరుగుబాటే సరియైన బాట అని నమ్మి ఆచరించిన సుభాష్ చంద్ర బోస్ ఆ రోజున పుట్టాడు. సుభాష్ అడుగుజాడలు ఎంతమందికి శభాష్ అనిపించాయో తెలియదు కానీ ఆ వీరుడి అదృశ్యం మాత్రం ప్రతి భాషలోనూ ‘అయ్యో, అరరే ‘ అనే రెండు మాటలకి ఆస్కారమిచ్చింది. ‘అతని బాట సరికాదు, అహింసా మార్గం తోనే పర పాలకుల్ని పారద్రోలొచ్చు’ అని తను నమ్మిన సిద్ధాంతాన్ని చివరి వరకు ఆచరించిన మహాత్మా గాంధి దేశమాతకు స్వేచ్ఛ దక్కిన అయిదునెలలకే ఒక మతోన్మాది హింసాత్మక చర్యకి బలి కావడం ఈ జనవరి ముప్ఫయినే జరిగింది. అప్పుడూ అంతా ‘అయ్యయ్యో, అరరే’ అనే అన్నారు. ఈ రెండిటి మధ్యగా వచ్చిన జనవరి ఇరవై ఆరు మనకి గణతంత్ర దినం. ‘ఆహా ఆహాహా’ అంటున్నాం. బోస్ 1945 లో అదృశ్య మయ్యేడంటారు. గాంధీ 1948 లో అమరుడయ్యాడు. గణతంత్రం మనకి 1950 లో అమలైంది. స్వాత్రంత్యం తరువాత వచ్చే కాలం వారిద్దరికీ దూరమైంది. ఇక నువ్వు చెప్పు’ ‘ఒక్కసారి మనం చూడని గతాన్ని గుర్తు చేశావు. కొన్ని వందల ఏళ్ళు అప్పటి యువతీయువకులు, పెద్దలు ఒకే దీక్షలో ఒకే పట్టుదలతో ఒకే గమ్యం వైపు దృష్టి సారించేరు. అది- దేశమాత స్వేచ్ఛ. అందులో ఎందరో త్యాగమూర్తులు సర్వం కోల్పోతే మరెందరో దొడ్డిదారిని పరభుజ కీర్తులై పోయి పేర్ల ముందు టైటిల్స్ సంపాయించుకున్నారు. పోనీలే- దేశ భక్తి గీతాల్లో త్యాగమూర్తుల్లో ప్రముఖంగా ఓ పదిమంది పేర్లే వినిపించేవి. కొన్నిటిని చరిత్ర పరిశోధకులు దాట వేశారు. అవునా కాదా గిరీ?’ ‘ఇప్పటి యువత గాంధీయిజం సరియైనదని నమ్ముతూ ఇంకా కావాల్సిన స్పూర్తి కోసం చరిత్రలో మరుగున పడిపోయిన వారిని వెలికి తీస్తోంది. గాంధీ సిద్ధాంతాలు (గాంధీయిజం) నమ్మి ఆచరించేవాడిని గాంధేయవాది అన్నారు ఆ రోజుల్లో. ఇటీవల ఒక హిందీ సినిమాలో గాంధి పాత్ర తెర వెనక ఉండి అన్యాయం అనేది ఎలా ఎదుర్కోవాలో బోధిస్తే ఆ విధానానికి ‘గాంధీ గిరి’ అని పేరు పెట్టారు. అవునూ, గిరి అని నా పేరెత్తావు, ఈ గాంధీ గిరి ఊసెత్తాలనా?’
‘మంచిదే కదా గిరీ. బాలాజీ, మనం అంటే తెలుగువాళ్ళం కూడా కొన్ని సినిమాల్లో గాంధీ గారి పేరు వచ్చేలా చూసుకున్నాం. గాంధి గారు ఉన్నప్పుడే, ఇంకా దేశానికి స్వాత్రంత్యం రాక ముందే మాలపిల్ల (1938) చిత్రంలో 'కొల్లాయి కట్టితే ఏమి? మన గాంధి మాలడై తిరిగితే ఏమి?' అనే పాట ప్రవేశపెట్టారు. సినిమాకోసం రాయని బసవరాజు అప్పారావు గారి గేయం అది. కొద్దిపాటి మార్పులు ఆ గేయానికి చేసినా అవేమి గాయాలు కావు. అంత చక్కని ట్యూన్ ఎవరు కట్టారో తెలుసా?' 'సినిమా తొలి దశ అది. చప్పున గుర్తుకొచ్చేలా చెప్పు మరీ' 'చెప్పేయాలనే అంటారూ- సరే. భీమవరపు నరసింహా రావు గారు. బి.ఎన్.ఆర్.- అని సూక్ష్మం గా పిలిచేవారు ఈయన్ని. ఇప్పుడు లేరు. ఈ జనవరి ఇరవై నాలుగున ఆయన జయంతి. సినిమా ప్రారంభ దశకం (1930-39) నాటి సంగీత దర్శకులు ఆయన. హెచ్.ఆర్. ప్రభాకర శాస్త్రి , గాలి పెంచలనరసింహారావు, భీమవరపు నరసింహారావు ,ఓగిరాల రామచంద్రారావు, సాలూరు రాజేశ్వరరావు, చిత్తూరు నాగయ్య- ఈ షట్ చక్రవర్తుల కాలమది. వీరిలో జనవరిలో పుట్టినాయన బి.ఎన్.ఆర్ గారొక్కరే. బి.ఎన్.ఆర్ చేసిన తెలుగు చిత్రాలు కేవలం పదిహేనే. అందులో చివరిది ‘అర్ధాంగి, 1955’. ఆ సినిమాతో పాటు మరో తమిళ సినిమాకి సంగీతమిచ్చి ఆయన సినిమా రంగం నుంచి సన్యాసం పుచ్చుకున్నారు. ‘వద్దురా కన్నయ్యా – ఈ పొద్దు ఇలు వదలి పోవొద్దురా, అయ్యా’ అన్న ఆత్రేయ గారి పాట మల్లాది వారికెంతగానో నచ్చేసింది. ఆ పాట లో లాగ బ్రతిమాలినా కూడా బి.ఎన్.ఆర్ ‘ఇంక సినిమాలు వద్దు గాక వద్దు’ అని అనుకున్నారేమో. చిత్రాల చిత్రాలివి. ’కనులు మూసినా (ఆ) పాటే - గుర్తుకొస్తోంది. విందాం రండి.' ‘గాంధీ వ్యక్తిత్వం మీద హిందీ కవి ప్రదీప్ ఓ చక్కని హిందీ పాట 'సాబర్మతీ కే సంత్ తూనే కర్ దియా కమాల్’ రాశారు (జాగృతి, 1954) కదూ' . ‘అవునవును. కనులు మూసినా (ఆ) పాటే’ తలచుకుంటే గాయని ఆశా లోని చిన్న పిల్లాడి గళం ఎంత వినసొంపుగా ఉంటుందీ. మళ్ళీ తెలుగు వెలుగులోకి వస్తే- రాముడు మంచి బాలుడు - అని అనడమే తప్ప ‘దొంగ రాముడు (1955)' అన్నది సినిమా టైటిల్ అవుతుందని బహుశా ఆ రోజుల్లో ఎవ్వరూ అనుకునీ ఉండరు. ఐతే అన్నపూర్ణా వారు అందులో హీరో చెల్లెలు పాడేలా ‘బలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ’ అన్న పాట సముద్రాల వారి చేత రాయించారు. పెండ్యాల వారి స్వర రచన రాయంచలా దేశ్ రాగం ఛాయల్లో నడిచింది'. 'నమో నారాయణ, నమో భూతనాథ, గంగాధర నమో నమో, నమో వెంకటేశా, నమో నారసింహా - అంటూ ముక్కోటి దేవుళ్ళని మొక్కుతూ నమస్సులు తెలియజేసుకుంటాం. మనుషుల్లో తిరిగిన దేవుడు మన గాంధీ. అప్పుడే కాదు, ఇప్పటికినీ ఎందరిదో అదే అభిప్రాయం'. 'కాబట్టే ఆరుద్ర గారు ఆ రోజుల్లో ఎం.ఎల్.ఏ (1957) కోసం 'నమో నమో బాపు, మాకు న్యాయ మార్గం చూపు' అని పల్లవిలోనే బాపూ నువ్వు లేక న్యాయం తప్పుదారి పట్టిపోతోందే - అన్న ఆవేదన వ్యక్తం చేశారు. పెండ్యాల వారికి బాపు మార్గం మీద మరో గీతం దక్కగానే దాన్ని బృంద గానంగా , ముగ్ధ మోహనంగా నడిపారు'. 'అక్కినేని-ఆదుర్తి వారి చక్రవర్తి చిత్ర అనే చిత్ర నిర్మాణ సంస్థ ఉండేది. తొలి ప్రయత్నం 'సుడి గుండాలు (1967) ----' 'ఒకసారి టీవీ వాళ్ళు సూది గుండెలు అని అనౌన్స్ చేశారు, SUDI కొచ్చిన పాట్లవి. ఇందులో స్కూల్లో ప్రదర్శన లాగ గాంధీగారి మీద ఓ గేయ గల్పిక పెట్టారు. మాస్టర్ రాజా గాంధీ గా నటించాడు'. 'వీళ్ళు ఆ తరువాత తీసిన 'మరో ప్రపంచం (1970)' ఉండేది చూడూ, అందులో మహాకవి శ్రీశ్రీ గాంధీ, నెహ్రూ,శాస్త్రీజీ ల కల,ఆశయం,కృషి మరో ప్రపంచమని అద్భుతంగా చెప్పారు'. 'మహాత్ముడే కలలు గన్న మరోప్రపంచం- పాట అది. ఎందుకో ఈ పాట ఇప్పుడు లభ్యం కావడం లేదు. లేత బాలు గొంతు ఎంత బావుంటుంది ఇందులో' 'ఏమో- ఈ రెండు సినిమాలే చాలనుకుంది చక్రవర్తి చిత్ర. దేశంలో మంచి సినిమాలకి రోజులు కావు అని అప్పుడే తెలుసుకున్నారు. అందుకేనేమో ఏ.ఎన్.ఆర్ గారికి కోపం వచ్చి ‘గాంధి పుట్టిన దేశమా ఇది’ (పవిత్రబంధం,1971) అని చెడా మాడా అప్పటి వ్యవస్థని ఏకి పారేస్తూ పాడినట్టు ఓ పాట వచ్చింది. అది ఆరుద్ర గారి రచన. ఈయనే అంతకు ముందు ‘నా జన్మ భూమి ఎంత అందమైన దేశము’(సిపాయి చిన్నయ్య,1969) అని అదే ఏ.ఎన్.ఆర్. కోసం పాట రాశారు. నువ్వన్నావే- అలా చిత్రాల చిత్రాలివి. మరో చిత్రం చెప్పనా- అప్పుడే అంటే ఆ డబ్భయిల కాలం లోనే అప్పారావు అనే కొత్త సంగీత దర్శకుడు 'చక్రవర్తి' పేరుతో ఓ కొత్త వరవడితో దూసుకొచ్చాడు. తెలుగు కవి ఎంత గడుసువాడంటే ఉన్న యాభై పై చిలుకు అక్షారాల్లో ఓ సగం తీసుకునీ ఎన్నైనా సాధించగలడు. గోపి అని మరో కవి, రాసినవి తక్కువే అయినా, ఉన్నవన్నీ పైపై మెరుగులు లేనివే అయినా మెరుపులు సృష్టించాడు. డాక్టర్ కమ్ యాక్టర్ అయిన ప్రభాకరరెడ్డి గారు----‘ ‘అర్థమైంది- ఆయన స్వయంగా రాసిన కథతో తీసిన ‘గాంధీ పుట్టిన దేశం (1973)’ సినిమా గురించేనా? ఆ టైటిల్ సాంగ్ అదుర్స్. గోపి కదూ రాస్త!’ ‘అవును గోపి రాసిందే. ఈ పాట గురించి రాస్తూ అప్పటి మహానుభావుడు ఎమ్వీ ఎల్ గారు ‘తప్పు గోపీ మరీ నిజాలు అలా చెప్పేస్తే ఎలా?’ అని సితార లో ‘వాణి ముత్యాలు’ శీర్షికలో చెప్పినట్టు గుర్తు. సరే. ఆ పాట తోనే సరి పెట్టుకోక ‘మరో పాట కావాలి, ఈసారి మీ నుంచి’ అని డా. రెడ్డి డా. సి.నా.రె. గారిని పిలిపించారట. సందర్భం ఇదండీ అని చెబితే ఈయన అవసరమా అన్నట్టు చూసారట. మొత్తానికి ‘బాపు’ తో ఒక స్త్రీ మొర పెట్టుకునేలా ఓ చక్కని పాట అప్పటికప్పుడు సి.నా.రె. గారు రాసి ఇస్తే స్వర కర్త కోదండపాణి గారు అద్భుతంగా ట్యూన్ కట్టేరట. ఆ మాటలు ‘ప్రతి రాతా ప్రసిద్ధమే’ లో రాత రూపంలో ఉన్నాయి. చదివేసి వద్దామా? పాటలు వినాలని ఉందా? సరే మనకి ‘కనులు మూసినా పాటే’ కదా. విందాం’ ‘సినిమాలేనా ఎంతసేపూ? గాంధి గారి గురించి లలిత గీతాలు ఉన్నట్టు విన్నట్టు గుర్తు’ ‘నీ అట్టులకేం బాలాజీ, బాగానే కుదురుతాయి. గీతాలు దొరక లేదు కాని దేవులపల్లి వారివి, మరి కొందరివి, పాలగుమ్మి విశ్వనాథం గారు కృష్ణశాస్త్రి వారి ‘గాంధీ’ రచనల గురించి చెప్పినవి సంపాయించాను. ఇదిగో ‘కనులు చదివినా పాటే’ అని అనిపిస్తే అక్కడకి వెళ్లి ఆ గీతాలు చదివేద్దాం. ఆ ‘తిరుగులేని మాట’ లేమిటో ‘అచ్చం అవే అచ్చులు’ పరిశీలిద్దాం’ ‘ఆహా ఆహాహా --- గాంధి గారిదే జన్మ అంటే!’ ‘ అందుకే గిరీ ఆయన బొమ్మలు అవీ ‘ఆహా ఆహాహా’ లో (ఆయన) ప్రతి ముఖమూ ప్రసిద్ధమే’ కాబట్టి ఓ వరసలో పేర్చి ఉంచాను. చూడాలని ఉందా? పదండి’ ‘కృష్ణశాస్త్రి గారు మాటలాడలేక పోయినా మౌన వేదాలు చెవిలో ఊదినట్టనిపిస్తుంది’ ‘నిజమే బాలాజీ. ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అని కీ.శే. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవి అన్నారు. ‘ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం, అందులోని ప్రతి అక్షరం అందమైన నక్షత్రం’ అన్నారు అభినవ శ్రీనాథ కవి కీ.శే. వేటూరి సుందర రామమూర్తి. తన అక్షారాల గురించి దేవులపల్లి వారు ఏమీ అనలేదు కానీ మనల్ని అనమంటే-‘ ‘నీలిమేఘ మాకాశం విడిచి నేల నడిచినట్టనిపించే కృష్ణుడి పాదాల జాడలు ఇవిగోనే అనేలా ఆ అక్షరాలుంటాయి. యామ్ ఐ రైట్?’ ‘రైట్ రైట్ అని రెండు సార్లు అంటే బస్ కదిలిపోతుంది – నిన్న మా పుణే లో పొద్దుటే ఎనిమిదప్పుడు అదేం మాయదారి ఉన్మాదమో గానీ ఓ బస్ డ్రైవరు పిచ్చి పిచ్చిగా ఖాళీ బస్ యమా ఫాస్ట్ గా నడిపి నడిచే వారిని, కార్లో కూర్చున్న వారినీ, ఆటోల్లో వెళుతున్న వారినీ ఓఎనమండుగురిని పొట్టన బెట్టుకునీ, పాతికమందిని గాయ పరిచాడు. తప్ప తాగాడా అంటే కాదట. మరి ఈ తిక్క ఏమిటో. ఇవాళ దేశంలో ఉన్న ప్రధాన సమస్య ‘అన్నిటికీ కోపం, అన్నిటి మీదా కోపం, అందరి మీదా కోపం, తన కోపమే తన శతృవు అని సుమతి మొత్తుకున్నా వినే వాళ్ళే లేరు. సరదాగా కోపం వస్తే అలక అని సరి పెట్టుకుంటాం. ఈ వింత కోపం దారుణం. ఎవరూ మాట పడలేరు. ఎవర్నీ పల్లెత్తు మాట అనకూడదు. అస్సలు కోపం రాని వాడికి ఓ ‘సుమతి అవార్డ్’ ఇస్తే బావుణ్ణు’ ‘అక్షరాల నుంచి మెల్లగా మాటల్లోకి వచ్చాం. అంతా చదువుల తల్లి సరస్వతీ దేవి కటాక్షమే. ధనలక్ష్మిని అదుపు లోన పెట్టిన వాడి గురించి ఆరుద్ర చెప్పారు. అలాగే సరస్వతీ దేవిని కూడా జాగర్తగా కాపాడుకోవాలి. ఆమె నరుడి నాలుక మీద నాలుగు మాటలు రాసి ఇస్తే చివరికి అవి ప్రేలాపనలుగా మారిపోతున్నాయి. తిట్లు రాజ్యమేలుతున్నాయి. ఈ జనవరి 28 న శ్రీ పంచమి కదా. తల్లీ—మానవాళిని క్షమించు’ ’అక్షరాభ్యాసం నాడే అక్షర శిల్పులు కారెవ్వరూ. కాగితం పట్టగానే కవులు కాలేరు అందరూ. సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం రెండూ ఉంటేనే ఈ భూమ్మీద బ్రతగ్గలం’ ‘కావొచ్చు కానీ ఆ రెండు కటాక్షాల్లో ఏదో ఒకటుంటే చాలు అని సర్దుకు పోవాలి. లేనిది ప్రయత్నిస్తే వస్తుంది. వచ్చినదాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది’ ‘బహు బాగా సెలవిచ్చావ్ బాలాజీ’ ‘రిపబ్లిక్ డే – సెలవే కదా’ ‘సెలవు సరే- సరస్వతి దేవి చలవే కవిత్వం, నాట్యం, చిత్ర లేఖనం, నటన, ఆట, పాట అన్నీనీ. కొందరు కార్ పార్క్ చేసి వాక్ చేస్తూ పాడుకుంటారు చూడూ....వాళ్ళని ‘వాక్ గేయ కారు’లంటాను’ ‘మధ్యలో జోకా, పాహిమాం. నవ్య యుగంలోనూ నిజమైన వాగ్గేయకారులున్నారు తెలుసా?’ ‘ఓ, సీరియస్సా. డాక్టర్ బాలమురళి గురించేనా చెప్పబోతున్నది’ ‘ఆయనైతే అందరికీ తెలుసు. కొందరికే తెలిసిన ఒకాయనకిప్పుడు 92 ఏళ్ళు. ఆయనకి కూడా పేరులో ‘బాల’ శబ్దం ఉంది. కొన్నేళ్ళు చెన్నపట్నం సముద్రం, దాదాపు నాలుగు దశాబ్దాలు ఆకాశవాణి, ఇప్పుడు విశాఖ పట్నం సముద్రం ఆయన పేరుని మారు మ్రోగించినవీ, మ్రోగిస్తున్నవి’ ‘ఎవరబ్బా ఆయన?’ ‘రజనీ కాంత్ ఎవరో తెలుసా అని అడిగితే కోటి మంది చేతులెత్త గలరు. అయ్యా- ఆయన నటుడు. ధనుష్ కి మామ గారు. అది వేరే విషయం- అని అనగానే చేతులు దించేస్తారు సిగ్గుపడీ. తొందరగా చెప్పవయ్యా మమ్మల్ని చంపక - వై దిస్ కొలవెరి కొలవెరి డీ- అని గొణుగుతూ. మనకి కావాల్సింది వాగ్గేయకారుడి పేరు’ ‘అమ్మమ్మ – ఎంత తిప్పి తిప్పి లాక్కొచ్చావయ్యా- బాలాంత్రపు రజనీ కాంత రావు గారి గురించా నువ్వనేది?’ ‘హమ్మయ్య- పట్టేశావ్. ‘రజనీ’ అని ఆ రోజుల్లో ఆయన్ని ఆప్యాయంగా ఆత్మీయులు పిలిచేవారు. కృష్ణశాస్త్రి గారైతే మరీనూ- ఇద్దరి పేర్లూ కలిపేస్తూ ‘కృష్ణ రజనీ’ అంటూ ఎన్నో లలిత గీతాలు రాశారు కూడా. ఆయన పుట్టిన రోజు జనవరి 29 న. ముందు అందరం లేచి నిలబడి ఆ మహా మనీషికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం. ఇందాక తెలుగు సినీ తొలి దశకం లోని ప్రముఖుల్ని స్మరించుకున్నాం. రజనీ గారు – రెండో దశకం (1940-1949) కి చెందినవారు. అప్పటి స్వర ప్రముఖులు- రజనీ, మాస్టర్ వేణు, సుసర్ల దక్షిణామూర్తి,సి.ఆర్.సుబ్బురామన్, సాలూరు హనుమంతరావు,ఘంటసాల,పెండ్యాల నాగేశ్వరరావు, ఆదినారాయణరావు- అష్ట దిగ్గజాల్లాగా. చిత్రంగా ఉంటుంది ఇది వింటే- పెండ్యాల గారు రజనీ గారికి అసోసియేట్ గా ఉండేవారు. వాహినీ బి.ఎన్.రెడ్డి గారు ‘స్వర్గ సీమ, 1945’ చిత్రం కోసం ‘ఓహోహో పావురమా’ పాట రజనీ గారి చేత చేయించుకున్నారు. ఆయన ‘రాజ మకుటం,1960’ చిత్రం వేణు కిచ్చినా ‘ఊరేది పేరేది ఓ కలువభామా’ పాట ఒకటీ, మరో పాటా రజనీ చేత చేయించారు. వాహినీ వారి ‘బంగారు పాప, 1954’ లో ‘తాధిమి తకధిమి తోల్ బొమ్మా’ రజనీ గారి సృష్టే.’ ‘నిజమే. అలాగే తెలుగు రేడియో బ్రతికిందంటే అదంతా ఆయన చలవే’ 'అవును గిరీ, బాలాజీ, ఆయన పట్ట భద్రుడయ్యాక ‘ఆకాశవాణి’ని ఆరో ప్రాణంగా ఎంచుకున్నారు. అదే ఆయన రజనీ ఆశ్రమం. అక్కడ తెలుగు కార్యక్రమాలకి ప్రాణం పోసారు. స్వయానా గేయ రచయిత, స్వర కర్త కావడం వల్ల ఆయన చొరవ వల్ల 'లలిత గీతాలు' ఊపందుకున్నాయి. ఘంటసాల మాస్టార్ గారిని ఆకాశవాణికి పరిచయం చేసింది రజనీ గారే. దాశరథి గారు 'ఆ రజనీకర మోహన బింబము ' అనే సాకి తో 'తలనిండ పూదండ' గేయం కూర్చినా అందులో 'రజనీ' అనే మాట దొర్లడం, ఆ పాట ఘంటసాల గారే పాడడం చిత్రాల చిత్రాలు కాదు, రేడియో సముచితాలు. అడపా దడపా బి.ఎన్.రెడ్డి వారి వంటి ఉత్తమాభిరుచుల సినీ నిర్ణేతలు ఆయన్ని కొంచెం సినీ దిశగా వాలి పోయేలా చూశారు. కాని రజనీ వారికి అందులో సినీవాలి (అమావాస్య చంద్రకళ) తోచినట్టుంది 1940 నుంచి 1978 వరకు దాదాపు నాలుగు దశాబ్దాలు ‘ఆకాశవాణి’ సేవలోనే తరించారు. ఆకాశం నుంచే రజనీకాంతులు వెదజల్లాలిగా. ‘సినిమా నాకు వ్యావ్రుత్తి మాత్రమే’ అని ఆయన అనేవారు. ఉద్యోగ నిబంధనల వల్ల మారు పేరుతో ( అన్నయ్య ‘నళినీ కాంతారావు’ పేరుతో ) కొన్ని సినిమాలకి పూర్తిగా స్వరాలందించేరు. ఆయన మొత్తం ఓ డజను సినిమాలు డజను అరటి పళ్ళలా చేసి ఉంటారు’ ‘ఐతేనేం. ఆ అరటి గెల మన పెరటి పంట. ఇంతకీ ఆయన్ని మట్టిలో మాణిక్యం అనాలా? మణిహారంలో ఎక్కడో దాగిఉన్న మణిపూస అనాలా?’ ‘ఎన్నైనా అనవచ్చు గిరీ. కాని బొగ్గుకీ, మణికీ తేడా తెలియని వాళ్ళంతా ఆయన్ని విస్మరిస్తున్నారు. సరే- లోగడ ‘గృహ ప్రవేశం,1946’ లో సి.ఎస్.ఆర్. సార్ పాడిన ‘జానకి నాదేనోయ్’ పాట ఇక్కడే విన్నాం. బాలసరస్వతి, ఎం.ఎస్. రామారావు ల ‘ఓ మలయ పవనమా’ (మానవతి, 1952) విన్నాం. అవన్నీ బాలాంత్రపు సాయంత్రపు కొండ గాలి తీసుకొచ్చిన రజనీ గంధాలే. నాకు తెలిసి మలయమారుతం రాగంలో వచ్చిన తొలి సినీ గీతం ఈ ‘ఓ మలయ పవనమా’ యే యేమో. అదే రాగంలో అదే ఏడాది ‘పెళ్ళి చేసి చూడు, 1952’ సినిమాలో ఘంటసాల వారు ‘ఏడుకొండలవాడా వెంకటా రమణా’ అనే లీల గారి పాట స్వర పరిచేరు. మళ్ళీ పదమూడేళ్లకి పెండ్యాల వారు ‘ఉయ్యాల జంపాల, 1965’ చిత్రం కోసం ‘కొండగాలి తిరిగింది’ పాట మలయమారుత రాగంలోనే కట్టారు. ఈ మూడింటిలోనూ ‘కొండ’ శబ్దం రావడం, తగ్గట్టు ‘మలయమారుతం’ వాడుకోవడం – ఆ రోజుల్లోని మేధస్ ట్రిక్స్ . అదో మేధ మేటిక్స్! ‘కొండ కొండ అంటున్నావ్ , అందుకేనా ఈ గిరిని రమ్మన్నదీ!’ ‘వెంకట రమణా అంటూ ఈ బాలాజీని పిలవలేదూ—ఈ గోపి తన పేరు ఎక్కడా చెప్పకుండా కవి ‘గోపి’ గురించి కూడా చెప్పేశాడు’ 'చెప్పకపోయినా ఈ పూట నా మాట ముక్తాయింపు కింద నేనెలాగూ ఉంటాగా' ‘ఎనీ వే- అంతా కలుసుకునీ ఇలా బ్లాగోగులు చెప్పేసుకుంటేనే వినోదం, విషాదం, విజ్ఞానం, వింత, విడ్డూరం,విచిత్రం గట్రాలు తెలిసేను! రజనీ గారిని మన సమక్షంలో చూస్తున్నంత ఆనందంగా ఉంది. భారత ప్రభుత్వం ఇలాంటి వారిని ఎందుకు విస్మరిస్తుంది? మన మధ్య ఉన్న సుసర్ల వారికి, బాలాంత్రపు వారికి పద్మవిభూషణాలు ఆ మాత్రం ఇవ్వలేరా?’ ‘తెలుగు వారి చింతలు వేరే ఉన్నాయి. వారికి బాపు అక్షారాలు పెళ్ళి కార్డుల మీద వేసుకోవడం తెలుసు కానీ బాపు గారికి పద్మ అవార్డ్ ఇవ్వండని ప్రభుత్వాన్ని కోరడమో, పోరడమో తెలియదు. సుసర్ల వారూ, రజనీ వారూ అసలు అక్కర్నే లేదు. (ఓహో – బాపు రమణలది ఏకాత్మ కదా అందుకే ఒక్కరికే ఎలా ఇవ్వడం అని నసుగుతున్నారా? వారెవరూ.. ఈ ఏడు ఒకే పద్మశ్రీ ఇద్దరూ పొందలేదూ, అలాగైనా మావాళ్ళకి ఇవ్వొచ్చుగా పద్మవిభూషణ్?)’ ‘ఎవరిని అడగాలి బాపూ- ఏమని అడగాలి ?- మూగ గుండెలో బాధ మూగ గానే మిగలాలి !’ ‘ఆ బాపు, ఈ బాపు – సర్కారు కన్ఫ్యూజ్ అయిందేమో. ఫ్యూజ్ మార్చే వరకూ-ఇవాళే ‘పద్మవిభూషణ్’ అయిన దివంగత గాయకుడు భూపేన్ హజారికా చివరి రోజుల్లో పాడిన గాంధీ గారికిష్టమైన ప్రార్థనా గీతం ‘కనులు చూసినా పాటే’ లో వింటూ చూద్దామా? అలాగే అదే గీతం –ఇవాళే ‘పద్మశ్రీ’ అయిన భక్త గాయకుడు అనుప్ ఝలోతా గళం నుంచి వింటే ఎలా ఉంటుందో చూడమంటుంది ‘క.చూ.పా.’.పద్మభూషణ్ యేసుదాస్ ఇంగ్లీష్ లో అహింసా గానం పాడితే ఎలా ఉంటుందీ? ‘క.చూ.పా’ చూస్తే సరి'. 'ఎవరో తమిళంలోనూ. కన్నడంలోనూ, తెలుగులోనూ, మళయాళంలోనూ పాడుకుంటూ ఇటు వస్తున్నట్టుందే---' 'కచ్చితంగా మా సురేష్ అయి ఉంటారు. అన్ని భాషల పాటలు ఆయన కాచి వడబోయగలడు. గాంధీ గారి పాట గురించి ఏదో చెప్పాలని ఆయనకి మాత్రం ఉండదా ఏమిటీ?' 'గురూ గారూ--' 'రండి సురేష్ రండి- మాయాబజార్ లో నాగభూషణం పేటిక తెచ్చినట్టు మీరు లాప్ టాప్ తో వచ్చారె- అరె- 'నమ్రత సాగర్ '- గాంధీ గారి రచన- పద్మభూషణ్ ఇళయరాజా వారి స్వర రచన- పైగా భారత రత్న దివంగత భీమసేన్ జోషి గాత్రం- క.చూ.పా లోకి తరలించేయండి --- మన మిత్రులంతా వింటారు'. 'ఎవరివి జనవరి చివరి తొమ్మిది రోజులని జనం వర్రీ అవుతుంటే ఫిర్ సే షురూ వర్రీ ఫిబ్రవరీ మే' 'వర్రీయించను. మీరే చూద్దురుగానీ. కృష్ణ ప్రేమ రెండో సంవత్సరం లోకి ఈ శ్రీ పంచమి నాడే అడుగు పెట్టింది.ఆ కొండ మా ఇంటి వెనకదే- కదలదు, మారదు. ఆ మేఘాలు ఒకనాటివి. kadu' -డా. తాతిరాజు వేణుగోపాల్, 26 & 30 January 2012
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|