మునుపటి నా మాట
ఫాల్గుణ కృష్ణపక్షం అంటే కూడ సద్గుణ కృష్ణ(శాస్త్రీయ) పక్షమే! 1 Nov 1897 - 24 Feb 1980 ఒక వారం ఆగమన్నాను. తీరా చూస్తే ఓ పక్షం రోజులు గడిచినట్టున్నాయి. మీరు గానీ ఆశతో ఎదురు చూసేరో ఏమో? కృష్ణశాస్త్రి గారి పాటలు మరిన్ని వినాలనే ఉత్సుకత మీలో ఉందో ఏమో? నా దురాశ కాదు కానీ, ఈ ఫాల్గుణ మాసమంతా ఆయన ధ్యాసలోనే మిమ్మల్నీ గడిపేయమన్నాను. ఈ శిశిరం ఇలా వెళ్లిపోనీండి, ఎంచక్కా వసంతం వచ్చేస్తుంది. 'ఖర' నామ సంవత్సరం కొరకొర చూస్తోంది, ఎందుకంటే ‘నందన’ ఉగాది ఇంకెంతసేపు నా రాక అన్నట్టు ఉవ్వీళ్ళూరుతుంటేనూ! ఫాల్గుణ కృష్ణ పక్షంలో తొలి విడత మీరు చూసిన దృశ్య గానాలు ఇవీ : కనులు చూసినా పాటే- రెండు కనులూ తెరిస్తే చాలు నాలుగు వీడియోలు కృ.శా గారి శైలిని అద్భుతంగా అభినయించిన నటీనటుల్ని ఎదుట ఉంచాయి అని మీరూ అంటారు. సాహిత్య సంగీతాలతో పాటు నటన ఏకం అయ్యేలా చూడగలగడం దర్శకుడి బాధ్యత. అందులోనూ- కృ.శా పాట అనగానే అంతర్దర్శనం ఎరిగి ఉండాలి. మొదటిది- ‘ఇది మల్లెల వేళ యనీ’ పాట ( చిత్రం: సుఖదు:ఖాలు- శివరంజనీ, మిశ్ర పీలూ ఛాయల్లో కోదండపాణి అమోఘంగా సృష్టించి, సుశీలమ్మ చేత ఎంత ఆర్ద్రంగా పాడించారూ! పాట దృశ్యం అలా అలా చూసేయక దర్శకుడు తీసుకున్న శ్రద్ధని కాస్త గమనించారు కదూ. ఆలాపన నుంచి ముక్తాయింపు వరకు ఎంత సమయం పట్టిందీ, పాట సన్నివేశంలో గోడ గడియారం ఏం చూపుతోంది అనేది గ్రహించారు కదూ). కృష్ణశాస్త్రి గారి ఈ పాట - ఆనాడూ అందరినీ ఆలోచనలో పడేసింది. ఈ పాట శాస్త్రిగారు రాసి ఇచ్చిన తరువాతే స్వర కర్త కోదండపాణి ట్యూన్ కట్టారు. ఆ రికార్డింగ్ లో శాస్త్రి గారు దగ్గరుండి చాలా తృప్తి చెందారని దాసరి వారు చెప్పారు. కొంతమంది మాత్రం ఆ పాట రికార్డింగ్ కోసం వెళ్ళే లోపల ‘ఇది మల్లెల మాసమనీ, ఇది వెన్నెల వేళ యనీ’ అని ఉండేది కాస్త అటూ ఇటూ అయి పోయిందని లేనిపోనివి సృష్టించి చెప్పారు. అదే గనుక నిజమైతే ప్రత్యక్ష సాక్షి దేవులపల్లి ఊరుకునే వారా? ‘మేఘమాల’ పాటల పుస్తకంలోనూ దిద్దుబాటు ఉండేదే! అందరూ అనుకునేది ఆ పాట పల్లవిలో వసంత ఋతువూ, కార్తీక మాసం కలగలిసి పోయాయి అనే. ఆ చిత్రంలో నాయికది అర్ధాంతరంగా ముగిసి పోయే పాత్ర. ఆమె గాయని. అలా బ్రతుకు ముగిసిపోక ముందే ఆమె రేడియో కోసం పాడే పాట అది. ఆమె బేలతనం ఇంకొకరి తొందరపాటు తనానికి బలి కావడం ఒక భవిష్యత్ దర్శనం. కోయిలకి మావి చిగురులే తప్ప మల్లెల తోనూ, వెన్నెల తోనూ సంబంధమే లేదు. వెన్నెల ఏ మాసం లోనైనా రాత్రి వేళే వస్తుంది. ‘కార్తీక మాసంలో కరి మబ్బు ఉండదు’ కనుక ఆ మాసం లోని వెన్నెల మరింత తేజస్సుతో అగుపిస్తుంది. కోయిలకి మల్లెలూ, వెన్నెలా వసంతంలో అవసరమయ్యాయంటే అదంతా ‘ఆపోజిట్ జెండర్’ ఆకర్షణ వల్ల. ఈ ఆకర్షణే తొందరపాటుకి దారి తీసింది. ‘ఏ వసంత కోకిలా వాన వేళ పాడదు’ అని ఒక కవి సెలవిచ్చారు. అది నిజం కాదు. నిజమేనేమో అప్పుడింక మావి చిగురులుండవు కదా అనవచ్చు కొందరు. ఇంతకీ కోయిల కూసేది ఎందుకనీ? గజి’బిజీ’ ప్రపంచంలో కాకి గోల మధ్యన కాస్త ఊరట కలిగించే పంచమ స్వరం కోయిల కూత కనుక (ఇప్పటి కొత్త కవికి 'మాఘ మాస వేళ కోయిలమ్మ పాట' గురించి అనుభవముంది. ఎవరూ పల్లెత్తు మాట అనకూడదు). రెండవది - ‘కొంచెం కొంచెం బిడియాలు’ పాట ( చిత్రం: విజయం మనదే- మాటల్లో చెప్పలేని అన్న అనుబంధాన్ని సింధు భైరవి రాగంలో ఘంటసాల గారు స్వర పరిచి స్వయంగా పాడితే ఆర్ద్రత రాకుండా ఉంటుందా? పైగా – రచన కృ.శా. గారిదాయే! మూడవది- మనసూగే తనువూగే (భాగ్య రేఖ- హిందీ పాట ‘మన్ డోలే మేరా తన్ డోలే’ వరసలో సాగినా హిందీ పాటలో ఉండే నాగస్వరం (బీన్ మ్యూజిక్ ) లేని తెలుగు పాట ఇది. అడుగడుగునా కృ.శా వేసే పదజాలం ఒక ఆకర్షణ (హిందీ పాటను హేమంత్ కుమార్ స్వర పరిస్తే, బీన్ మ్యూజిక్ ఇద్దరు మేధావుల సమష్టి కృషి. వారు- కల్యాణ్ జీ, రవి. కల్యాణ్ జీ వీర్ జీ షా దివంగతులై కొన్నేళ్ళయ్యింది. ఈ మార్చి 7 న రవి శంకర్ శర్మ, బొంబాయి రవి అనబడు రవి మరణించారు. రవి హిందీ లోనే కాక మలయాళంలోనూ ఎన్నో చిత్రాలకి బాణీలు అందించారు. తెలుగులోనూ ఒక సినిమా ఉన్నట్టు గుర్తు. నాగిన్ రికార్డ్ కవర్ ప్రతి ముఖమూ ప్రసిద్ధమేలో సిద్ధం). నాలుగవది- ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ (ఏకవీర- మహదేవన్ ఇంటర్ల్యూడ్స్ మాత్రమే ఇచ్చిన ఈ పాట ఒరిజినల్ కంపోజర్ బి.గోపాలం గారు. కాంతారావు గారికిబాలు గళం చక్కగా అమరుతుందని కోదండపాణి ‘ఉక్కుపిడుగు’ చిత్రం లో ‘ఏ వూరు ఎవరు మీ వారు’ పాట ఇచ్చి నిరూపించారు. ఘంటసాల, బాలుల మేలు గళ కలయిక లో ఇది రెండవ పాట, తొలి పాటంత హిట్ కావడం దీని విశేషం. ముఖ్యంగా స్టేజి మీద ఇద్దరు గాయకులు పాడవలసివస్తే ఇవి వరాలు). (All the four videos are archived under 'devulapalli' in kanulu choosinaa paate). సినిమా సన్నివేశంలో ఈ పాటకి ముందు సంభాషణా రచయిత డాక్టర్ సినారెపాట పల్లవిలోని మాటలే పాత్రల చేత పలికించారు. స్క్రీన్ ప్లీ లో అటువంటి జాగర్తలు ఎన్నో తీసుకునీ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రసిద్ధ నవలని సినిమా కథగా మలిస్తే అది సామాన్య జనాన్ని అంతగా ఆకర్షించలేక పోయింది. అయితే అందరూ హర్షించినదేమిటంటే మేటి కవులిద్దరూ తమ తమ బాణీల బాణాలు ఎవరికి వారే సాటి అన్నట్టు అద్భుతంగా సంధించారు అన్నదే. ఇక్కడో చమత్కారం చెప్పుకోవాలి. ఘంటసాల, బాలుల కాంబినేషన్ లో వచ్చిన తొలిపాట ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం’ (మంచిమిత్రులు) సి.నా.రె. వారి రచన అయితే రెండవపాట ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ కృ.శా వారి రచన కావడం విశేషం. తొలి పాట లో ‘ఉదయం’, రెండవ పాటలో ‘రాత్రి’ రావడం చూస్తే కవి ‘సమయాలు’ అంటే ఇవేనేమో అనిపిస్తాయి. కనులు మూసినా పాటే- అష్ట దిక్కులు మార్మోగేలా ఓ ఎనిమిది కృ.శా మెలోడీలు చెవిని తాకాయి కదా. అన్నీ అరుదైనవే. సాలెగూటిని జల్లెడ పట్టి గాలించి చూసినా దొరకని పాటలవి. ముఖ్యంగా మాటలాడలేని కృ.శా వారికిష్టమైన ‘మాట’ ప్రసక్తి తీసుకొచ్చిన మూడు పాటలు ఉన్నాయే - సత్యం, రమేష్ నాయుడు, రాజేశ్వరరావు గార్లు ఒక్కొక్కరు వాటిని ఎంత వైవిధ్యంగా స్వర పరచారో గమనించే ఉంటారు. సినిమా పాటలే కాక లలిత గీతాలు సైతం కృ.శా వారి పెన్నిధియే కదా – పి.బి.శ్రీనివాస్, కె.బి.కె మోహన్ రాజు, ఆర్. ఛాయాదేవి పాడిన పాటలు 'శీతవేళ-గుండెల్లో ఉంటే కులాసా- పడవ నడపవోయ్' అనే కోర్కె కలిగించాయి. ఇవి ‘కృష్ణప్రేమ’ లో తప్ప వేరే ఎక్కడా వినపడనివి అని నమ్మకం.( All these eight audio songs are archived under 'devulapalli' in kanulu moosinaa paate).
. ఇక- ఫాల్గుణ కృష్ణ పక్షంలో కృష్ణశాస్త్రీయ పక్షంగా వారి సద్గుణ మేలు కలయికలు కొన్ని పరిశీలిద్దాం - కృష్ణశాస్త్రి –మేటి స్వర కర్తలు : ఒక శాస్త్రి (మల్లాది కవి) గారి పాటల స్వర కర్త అయిన అశ్వత్థామ తన రెండో ‘ఇన్నింగ్స్’ ప్రవేశంతో ఈ మరో శాస్త్రి గారి ‘ఎవరో వచ్చే వేళాయే’ అనే కృష్ణ గానం (చిత్రం: మాయని మమత) ఎంత సరళంగా, సరదాగా స్వర పరిచారో అంత ఆర్ద్రంగా ‘రానిక నీ కోసం’ పాట ట్యూన్ చేశారు (listen both in kanulu moosinaa paate now). అలాగే ‘ఏనాటికి రాడు ఏలాటి ప్రియుడే’ అనే కృ.శా లలిత గీతాన్ని బాల సరస్వతి గళంలో అద్భుతంగా పలికించిన రమేష్ నాయుడు కూడా తన రెండో ఇన్నింగ్స్ ‘అమ్మ మాట’ చిత్రంతో మొదలెట్టడం, అందులో శాస్త్రి గారి ‘ఎంత బాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా’ పాట కమాజ్ రాగ సుధలు అందివ్వడం ఒక తీపి గురుతు నిన్నటి శ్రోతలకి. కనులు మూసినా పాటే- అంటూ నేటి శ్రోతలైపోయి మీరూ 'శాస్త్రిగారు ఎంతబాగా అన్నారు!' అని తలూపడం కనిపిస్తూనే ఉంది. ఇవన్నీ మలుపులూ, మజిలీలు – కృ.శా. వారన్నట్టు ‘మలుపు మలుపు కడ నిలిచి చెవిలో మంతనాలు ఊదాలి, కలసి మెలసి కలకాల మిలాగే మధురయాత్ర సాగాలి’ లేదా ‘మనసున్న చోట మజిలీ, కాదన్న చాలు బదిలీ’! ( ఈ చివరి పంక్తి 'నా పేరు బికారి, నా దారి ఎడారి' పాట లోనిది. పాట వీడియో చూడండి కనులు చూసినా పాటే లో). నాకు తెలిసి ఏ సంగీత దర్శకుడైనా సరే దేవులపల్లి వారి పాట చేతి కందగానే ఏదో దివ్య వరం పొందినంత నిష్టగా స్వర పరిచే వారు. ఒకవేళ వారే ట్యూన్ ఇచ్చినా శాస్త్రి గారు ప్రాణమిచ్చే మాటలతో పాట బొమ్మకు ఆయువు పోసేవారు. బహుశా కృ.శా వారి పాట ఒక్కటి కూడా స్వరపరచని వారు ‘రాజన్-నాగేంద్ర’ ద్వయం ఒక్కరే అని అనుమానం. ఘంటసాల వారికి సహాయకుడిగా ఉన్నప్పుడేమో కానీ విడిగా సంగీత మందించిన జె.వి.రాఘవులు గారు కూడా కృ.శా. వారి పాటలు పొందలేదు. పద్మ భూషణ్ ఇళయరాజా వారికి ఘంటసాల గారి గానం ఎంత మాత్రమూ ప్రాప్తించలేదు. స్వరకర్త జి.కె. వెంకటేష్ వారికి సహకారమందిస్తున్నప్పుడు ఘంటసాల వారి గాత్రంతో ఆయనకి అనుభవముండి ఉండవచ్చు. వెంకటేష్ గారి సారధ్యంలో కృ.శావారి 'పాడనా తెనుగు పాట' లో రాజా వారి పోకడలు కన్పిస్తాయి. అదృష్ట వశాత్తు ‘రాక్షసుడు’ చిత్రంలో కృష్ణశాస్త్రి గారి ప్రసిద్ధ దేశభక్తి గేయం ‘జయజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి’ ని ఉపయోగించడం వల్ల రాజా వారి స్వీయ సంగీతంలో కృ.శా వారి పాట కుదిరిందని సంతోషించ వచ్చు. కాని, ప్చ్! ఆ పాట వేరే ఎవరో ఎప్పుడో మలచిన పాత బంగారం. రవీంద్ర కవికి దీటుగా శిష్య కవి కృష్ణశాస్త్రి రాసిన ఉదాత్త గేయమిది. జాతీయ గీతానికి సరి పోయేది. మరో పద్మ భూషణుడు బాలసుబ్రహ్మణ్యం గారు కృ,శా వారి పాటకి సంగీతమందించ లేకపోయారు. కాని గాయకుడిగా తన తొలి కృ,శా గీతం ‘మేడంటే మేడా కాదు’ తన గాడ్ ఫాదర్ కోదండపాణి స్వర పరిస్తే పాడినందుకు గర్విస్తారు. విశేషమేమిటంటే- అది కోదండపాణి గారికి కూడా తొలి కృష్ణ శాస్త్రీయ గీతం కావడం! (listen in kanulu moosinaa paate). ‘కళ్యాణమండపం’ చిత్రంలో ‘సరిగమపదనిస’ పాట పల్లవిలో సరిగమపదనిస స్వరావళి ఒక పదంలా మార్చి భీం పలాస్ రాగంలో కట్టి తన ప్రతిభేం తక్కువ కాదని నిరూపించారు స్వర కర్త పి.ఆదినారాయణ రావు గారు. (listen in kanulu moosinaa paate). ‘ఆడజన్మ’ చిత్రంలోని బొమ్మల కొలువు పాట ఎలా స్వరపరిస్తే ఒక సంప్రదాయం కళ్ళ ముందు నిలుస్తుందని మాస్టర్ వేణు అభిప్రాయ పడ్డారో గానీ అతని స్వర జ్ఞానానికి నూటికి నూరు మార్కులివ్వొచ్చు. ఎవరే,ఎవరెవరో గానీ వంటి కృ.శామృదు పిలుపులు వేణు స్వరాల దారుల్లో భలేగా నడిచి, తిరిగాయి కొత్త మలుపులు ( సినిమాలో నటి జమున కాబోలు అభినయిస్తారు. జమున గారు అనగానే సినీ పరిశ్రమలో అందరికీ తెలుసు ‘బొమ్మల కొలువు’ ప్రతి ఏడూ పెట్టి తన ప్రత్యేకతను నిలబెట్టుకునేవారని). కనులు మూసినా పాటే- పాటంతా విన్నాక మీ కనుబొమల చాటున ఎన్ని బొమ్మలు కొలువై పోయి ఉంటాయో! ‘ఉండమ్మా బొట్టు పెడతా‘ - ఎంత కాదనుకున్నా మహదేవన్ పదహారణాల తెలుగు వారేనేమో అనే ఆశ ఆయన కట్టే ప్రతి పాట కలిగిస్తూ ఉంటుంది. లేకపోతే, శ్రీశైలం శివుడు, పాతాళ గంగమ్మ కృ.శా వారు ‘అచ్చం’గా అనుకున్నట్టే శిరసొంచడం, ఉబికుబుకి రావడం సంభవమేనా? అలాగే సఖులు 'ఔనే చెలియా సరిసరి' అని ఆట పట్టించడం వంటి ముచ్చట్లు ఆయనకి కరతలామలాకాలు ఎలా కాగాలిగాయో ? లేక 'ఔనోయ్ చెలికాడా పుహళ్లేందీ, సరిసరి , ఆ తెలుగు మాటలు నేర్చావా గడసరి' అని ఇంకో ఆయన్ని పిలిచి అసలు రహస్యం అతడే అని కనుగొనాలో ఏమో! ( listen in kanulu moosinaa paate). స్వరరాజేశ్వరుడు ‘బంగారు తల్లి’ , ఆమె పిల్లల చేత కృ.శా వారి ఆర్ద్ర గీతాన్ని ఎంతైనా బరువు లేక తేలికగా పాడించి మన హృదయాల్ని బరువెక్కించ గలరు. ‘అమ్మ’ అంటేనే ఆర్ద్ర మూర్తి. ఎందరో అమ్మలకుకృ.శా. వారి పాట ఒక ఓదార్పు (మదర్ ఇండియా చిత్రాన్ని తెలుగులో బంగారు తల్లి గా తీశారు. నర్గీస్ పాత్రని జమున పోషించారు. ‘దునియామే హమ్ ఆయే హై తో జీనా హీ పడేగా- జీవన హై అగర్ జహర్, తో పీనా హీ పడేగా’ అన్న పాటలో ఉండే తామస వాద విష ప్రస్తావన తీసుకు రాక శాస్త్రి గారు ‘ ఎంతైనా బరువు ఈ బ్రతుకు, ఏమైనా వరమే ఇది మనకు’ అనే ఆశావాదం చూపించారు. హిందీ పాట వరస అంతో ఇంతో (ఎందరికో తెలియని) బాపు గారి దర్శకత్వంలో వచ్చిన ‘ఇంటి గౌరవం’ లో ‘నారు పోసి ఊరకుంటే తీరిపోదు బాధ్యత, నీరు పోసి పెంచడమే నిజమగు మమత’ అనే పాటగా అప్పటికే వచ్చేయడంతో రాజేశ్వరుడుకి చక్కని ‘తన’ వరస వినిపించే అదృష్టం కలిగింది). కనులు మూసినా పాటే- వినిపించిన పాటలో ఎంత ఇంపో అంత చెమరింపు కూడా. [ కృ.శా గానాయణంలో -- కల వేట : మల్లీశ్వరి చిత్రానికి రాజేశ్వరరావు తో పాటు వింజమూరి (అవసరాల) అనసూయాదేవి పేరు కూడా ఉంటే బావుండేది అని ఇప్పుడనిపిస్తుంది. ఆమె కృ.శా వారి మేనకోడలే కాదు, ఆకాశవాణికి ఆంధ్ర నుంచి అన్ని ప్రాంతాల ‘జానపదాలు’ అందించిన గొప్ప పరిశోధకురాలు. ఆ మధ్య ‘సాక్షి’ వార్తా పత్రికలో ఆమె మల్లీశ్వరి పాటలకి తానెంతో ‘కంట్రిబ్యూట్’ చేసినట్టు చెప్పారు. అయితే భానుమతి గారు తన ‘నాలో నేను’ పుస్తకంలో అనసూయ గారి గురించి ఒక్క మాటా అనలేదు. పైగా మనసున మల్లెల మాలలూగెనే – పాట ట్యూన్ ఒక మరాఠీ గీత ప్రేరణ అనీ, నెలరాజా వెన్నెల రాజా – పాట మొదట్లో వచ్చే సాకి ఒక హిందీ వరస అని, తనే అలా తీసుకున్నానని ఆమె రాశారు. ఎవ్వరేమని అందురో- కృ.శా. వారూ లేరాయే! భా.మకూడ లేరాయే! స్వర రాజేశ్వరుడు కూడ లేడాయే!]. అల్లుడే మేనల్లుడు, అమాయకుడు (ఇందులోమనిషైతే మనసుంటే, అనుకోనా ఇది కలయనుకోనా - అన్నవిశాస్త్రి గారి పాటలే) వంటి సినిమాలకి మంచి పాటలు కట్టి ఇచ్చిన బి.శంకర్ 'ధనవంతులు-గుణవంతులు' చిత్రం కోసం శాస్త్రి గారి 'తెరచి ఉంచేవు సుమా పొరపడీ నీ హృదయము' పాటని చక్కని భీం పలాస్ రాగం లో కట్టి మెప్పించారు (listen in kanulu moosinaa paate). కృష్ణశాస్త్రి- తోటి కవులు : కృష్ణశాస్త్రి గారు తన సినీ మాటల ప్రస్థానంలో ‘మల్లీశ్వరి’ వంటి కావ్య శిల్పం ఒక్కటి చాలు అని సరి పెట్టుకున్నట్టే డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు ఏక వీర (ఇవాల్టి భాషలో ఒక వీరుడు అనే అర్థం లో చూడకండి, అప్పుడది విశ్వనాథ కవి స్త్రీ పాత్రకి పెట్టిన పేరు) వంటి కావ్య గౌరవం ఉన్న ఒకే ఒక్క చిత్రానికి దివ్యమైన మాటలు రాసి చాలనుకున్నా ఆయన్ని అక్బర్ సలీం అనార్కలి –ముగ్గురూ వదిలి పెట్టలేదు. లోగడ 'సిపాయి చిన్నయ్య' సినిమాలో కృ.శా 'ఆ నావ దాటి పోయింది' అని పాటరాశారు. మూలం తమిళమే అయినా తన ధోరణి తనదే ఆయనకి. ఆ తెలుగుతనం ఆయన్నుంచి దూరం కాదు కాక కాదు. ఆ సినిమాలో సి.నా.రె పాటలు రాసినట్టు లేదు. చిత్రంగా అక్బర్ సలీం-- సినిమాలో ఆయన 'సిపాయీ ఓ సిపాయీ ' అని పాట రాయడం, అలాగే 'తడి ఇసుకలో రాసిన రాతలు అల తాకితే మాసి పోతాయి' అనడం ఇరు కవుల సముద్రపు లోతంత బాంధవ్యాన్ని చెబుతుంది. సి.నా.రె వారు ఒకసారి చెప్పారు- 'తోటలో నారాజు తొంగి చూసెను నాడు' (ఏకవీర) పాట తాను రాస్తే అదికృ.శా వారిదని ఎందరో భ్రమ పడ్డారని. ఇలాంటి భ్రమదాసరివారి ‘తొలిసంజ వేళలో తొలిపొద్దు పొడుపులో’ పాట కూడ కలిగించింది, నిజానికి దేవులపల్లివారి శైలి తెలిసిన వారు మాత్రం ఈ మాటలు విని నవ్వుకుంటారు. ఆయన రచనల్లో ‘లఘువుల’ ప్రయోగం ఎక్కువగా ఉంటుందని దాసరి వారు చక్కగా పరిశీలించి చెప్పారు. కృ.శావారి బాణీ తెలిసిన వేటూరివారు అంతే మెత్తగా,సూటిగా హత్తుకు పోయే పదాలు తన పాటల్లో ప్రయోగించిన చిత్రం సీతామాలక్ష్మి. అందులోని రెండు పాటలు - 'సీతాలు సింగారం మా లచ్చి బంగారం' ( వేటూరి వారి పాట) , 'మావి చిగురు తినగానే కోవిల పలికేనా' ( దేవులపల్లి వారి పాట) (see the video in kanulu choosinaa paate)–ఇవి గానీ ఒక దాని వెంట మరోటి పెట్టి వింటే కవులిద్దరూ ఒక్కరేనేమో అని అనిపించడం సహజం. కృ.శా. వారు లేనప్పుడు ఆయన లలిత గీతాలు కథానుగుణంగా ఉన్నవి సేకరించి దాసరి వారు ‘మేఘసందేశం’ లో ఇమిడ్చి మంచి పని చేశారు. ఐతే వేటూరి వారు కృ.శా వారి మీదున్న భక్తితో తన దైన శైలిని పక్కన పెట్టి కృ.శా వారి ధోరణిలో ‘నిన్నటి దాక శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా’ అనే పాట రాశారు, ‘నిన్ను జూచునందాక’ (కృ.శా) అని నాడు శబరి పడిన వేదన ప్రేరణగా. ‘నీవుండేదా కొండపై’ పాటకి పేరడీ కాకపోయినా అదే ట్యూన్ లో మరో పాట (అదీ సరదా పాట-నీ సిగ్గే సింగారమే ) అదే చిత్రానికి (భాగ్యరేఖ) రాయగలిగే భాగ్యం కృ.శా. గారికి దక్కింది, రెండు బిందువులుంటే సరళ రేఖ గీయగలం అని సరళంగా రాసి చూపించారు శాస్త్రి గారు. నీవుండేదా కొండపై (కనులు చూసినా పాటే) పాటలోని అనుపల్లవిలో ‘ఏ లీల సేవింతునో, ఏ పూల పూజింతునో’ అనే పంక్తి ఎందరో కవులకి ప్రేరణ అయ్యింది. దాశరథి వారు ‘తిరుమల మందిర సుందరా’ అని శ్రీనివాసుని , వేటూరివారు ‘శివశివ శంకరా’ అని మహాదేవుని స్తుతిస్తూ రాసిన పాటల్లో ఆ పోలికని కనిపెట్టి ‘హౌరా, ప్రేరణ!’ అని ఆశ్చర్య పొతే సరి. లేకపోతె పాట=తిరుగు టపా లో ఆనక నింపాదిగా చూసుకునీ మురిసిపోతే సరి. కృ.శా ‘మావి చిగురు తినగానే కోవిల పలికేనా? కోవిల గొంతు వినగానే మావి చివురు తొడిగేనా?’ ( కనులు చూసినా పాటే) అని ప్రశ్నించి ‘ఏది ముందు? ఏది పిమ్మట?’ అనే ఆసక్తి కలిగించేరు. ఇంతకు ముందు ఆయన లలిత గీతం ఒకటి రాసి ‘ వెన్నెలల వేళనే వేణువూదేనా ? వేణువూదిన వేళ వెన్నెలాయేనా?’ (ఆనక ఈ లలిత గీతమే సినిమా పాటగా మారింది) అని అదే రకమైన ప్రశ్న సంధించారు. ఈ రెంటికీ ప్రేరణ మాత్రం బసవరాజు అప్పారావు(కృ.శా వారి దృష్టిలో ఈయన ఒక మహాకవి) చెప్పిన ఈ మాటలే: ‘పాట పాడుతుండగ నా ప్రాణి దాటి యేగేనా? ప్రాణి దాటి యేగుచుండ పాట నోట మ్రోగేనా?’. కృష్ణశాస్త్రి వారివా - అయ్యయ్యో అవేం పాటలూ? : కృ.శా వారు కొన్ని పాటలు రాయకుండా ఉండాల్సిందని బాధపడే వారూ ఉన్నారు. పైసా పైసా హైలేసా (భలే రంగడు), నీవే మదనదేవుని మారు మూర్తివని (నిండు హృదయాలు), కన్నె ఎంతో సుందరి (భాగ్యరేఖ), లత లాగ ఊగే ఒళ్ళు (శ్రీ రామ పట్టాభిషేకం), చాలు చాలు ఈ విరహాలు (సీతామాలక్ష్మి). అయినా కృ.శా వారు రాయాలే గానీ రాసిన ఏ పాటా పేలవంగా ఉండదు. సన్నాయి అప్పన్న – చిత్రం కోసం ఓ పాట ఆయన రాసి కోపంతో విసిరి కొట్టారని అంటారు, ఎవరో ఏదో గొణిగారనీ. ఆ చిత్ర నిర్మాణ భాగస్వామి, నటుడు చలం శాస్త్రి గారిని బుజ్జగించి తిరిగి రప్పించారట. కృష్ణశాస్త్రి- పాటల్లో ‘ప్రతి’ ధ్వని : మహాకవి శ్రీశ్రీ 'వెలుగునీడలు' చిత్రం కోసం రాసిన 'పాడవోయిభారతీయుడా' జగత్ప్రసిద్ధం. అందులో 'ప్రతి మనిషీ మరియొకని దోచుకోనేవాడే' అనే పంక్తి ఉంది. ఉంటేనేం? ఇక్కడ 'ప్రతి మనిషి'- అనేది ఏకవచన రూపంలో ఉంది. శ్రీశ్రీ గారు అల్లూరి సీతారామరాజు చిత్రం కోసం 'తెలుగు వీర లేవరా' – పాట రాస్తే జాతీయ బహుమతి లభించింది. అయితే ఆ పాటలో ‘ప్రతి మనిషి’ అనే ఏక వచనంతో మొదలైన పంక్తి ‘సింహాలై గర్జించాలి’ అనే బహువచనంతొ ముగుస్తుంది. ఇది పెద్ద పొరపాటు అని శ్రీశ్రీ వారు బాధ పడి తన తొలి సినీ గీతాల సంకలనం ‘పాడవోయి భారతీయుడా’లో దిద్దుబాటుతో రెండో సంకలనం వెలువడుతుందని ప్రకటించారు. శ్రీశ్రీ గారి మరణానంతరం వెలువడిన ఆ రెండో సంకలానికి ' తెలుగు వీర లేవరా' అని పేరు పెట్టి తొలి పాటగా ఈ పాటనే చేర్చి ‘ప్రతి మనిషి----సింహంలా గర్జించాలి’ అని సవరించారు. ప్రింట్ రాత నైతే మార్చగలం కానీ రికార్డ్ తలకెక్కిన రాత మార్చలేం కదా. పాట= తిరుగుటపా లో చూడండి ఈ రెండు పాటలూ. ఇది చదివిన తక్షణం నాకు దేవులపల్లివారి పాటల్లో ‘ప్రతి’ అనే అవ్యయం ఎక్కువగా దొర్లేది అని అనిపించింది. ఆ జాబితా ఉన్న పట్టిక తిరుగులేని మాట లో చూడవచ్చు. ఏకాకితనం, ఒంటరి బతుకు నచ్చని మనసు ఎప్పుడూ 'ప్రతి'ని కాంక్షిస్తుంది అని దీని బట్టి తెలుస్తుంది. ఆయన రచనలు 'కృష్ణ పక్షము' ,' ప్రవాసము', 'ఊర్వశి' - ఈ మూడింటిలో 'ప్రతి' ధ్వనించింది ఒకసారి మాత్రమే ప్రవాసం లో, ఒకసారి ఊర్వశిలో. 'ఈ పయనపుం దెరువు ఇరు దెసల శిరసెత్తు / ప్రతి కుజము ప్రతి సుమము ప్రతి విహంగమ రుతము' 'వాడిపోయిన ప్రతి సౌరభమ్ము కొరకు/ కను మొరంగిన ప్రతి హిమకణము కొరకు / బ్రతుకు బ్రతుకెల్ల కరగు బాష్పములు కాగ ,/ ఎట్లు కననేర్తు నానాటి దృశ్యమేను?' కృష్ణశాస్త్రి- పాటల్లో మరి మరి వినిపించేది : ఔను గానీ, నేనింకేమైనా చెప్పడం మరచేనా? ఔనౌను- కృష్ణశాస్త్రి గారి పాటల్లో మీకు ఎక్కువగా కనిపించేది ‘ఆమ్రేడితం’. తొందర తొందరలు, విందులు విందులు, సరి సరి, బిరబిర, చరచర – ఇలా ఎన్నో. పదేపదే మీరు పట్టిక కావాలంటే చూస్తూ చూస్తూ ఓపిక పట్టాల్సిందే. కృష్ణశాస్త్రి గారికి ప్రతి నిమిషం పాటే : కృష్ణశాస్త్రి వారికి కూడా బసవరాజు వారిలాగే ‘బ్రతుకంతా ప్రతి నిమిషం పాట లాగ సాగాలి’ అన్నదే కోరిక. రచన మాస పత్రిక లో ఒకసారి ‘కృష్ణశాస్త్రి: పాట గానే ప్రభాతం, పాటతోనే ప్రస్థానం’ అని ఊరుకోక నేనూ (ఒక వ్యాసం) ప్రకటించాను. ‘పాట నాకు సైదోడు , పక్షి నాకు తోడు ’ అని అన్నది ఆయనే కదా. సంఘంలో బతుకు సాగించే వాడికి ప్రతి నిమిషం పాట లాగ జరుగుతుందా? పాట అంటే ఎలా ఉండాలి? ఒక 'గుణ కీర్తనం'లా. ప్రభువు కోసం బ్రతుకు సాగించే వాడు 'ప్రతి క్షణము నీ గుణ కీర్తనము పారవశ్యమున పాడెదను' (కనులు మూసినా పాటే- ప్రతిభా మూర్తి పి.బి.శ్రీనివాస్ దేవులపల్లి వారు ఆయనకోసం ప్రత్యేకంగా రాసి ఇచ్చిన లలిత గీతాల్ని శాస్త్రిగారి ప్రథమ వర్ధంతి సందర్భంలో సంగీతా కంపెనీ ద్వారా విడుదల చేయించారు. మచ్చుకి ఇది ఒకటి ) అనే సంకల్పంతో ఉండాలన్నది కృ.శా వారి ఆశయం. అందుకు ఆ ప్రభువే 'పదములు ఇవ్వాలి, పాడే సుస్వరమివ్వాలి'. అలా ఉండగలిగిన వారు మనకు తెలిసిన వాగ్గేయకారులు- అన్నమయ్య, త్యాగయ్యలే. అన్నమయ్యకి ప్రభువు 'పదములు' కూర్చాడు. త్యాగయ్యకి ప్రభువు స్వరములు నేర్పాడు. పాట రాయడం గురించి కృష్ణశాస్త్రి గారు ఏమాన్నారో చూడండి- ‘మీరు పదమో పద్యమో ఎలా కడతారండీ? మీ కెలా వస్తుందండీ గేయం? అని అడుగుతుంటారు. అంటే ఏమి! ఎలా చెప్పగలుగుతారు? రకరకాలుగా వస్తుంది. అదృష్టాన్ని బట్టి వస్తుంది. కనబడని చెయ్యి యేదో గళద్వారపు గడియ తీస్తే వస్తుంది. ఒక్కొక్క పాట అనుకోని అతిథి లాగ తలుపు తెరుచుకొని ఎదుట నిలబడుతుంది. మరొక్కొక్క పాట పుట్టలోంచి పాములాగా కొంతకొంతగా పాకి వస్తుంది. ఒక్కొక్క పాట నిన్న రాత్రి మోడులాగే కనపడే పొదమీద తెల్లవారగానే నిండుగా వికసించిన కన్య పువ్వులాగా గాలిలో తలూపుతూ ఉంటుంది. ఒక్కొక్క పాట మట్టిబొమ్మలాగా, కర్రయంత్రం లాగ, ఒక కాలూ, ఒక చేయీ, ఒక చక్రం, ఒక మరా అతికించుకుంటూ స్తబ్దుగా తయారవుతుంది. చెప్పలేం. ఒక్కొక్కసారి గేయం అంతా తయారై దానిలో ఒక మాట ఏ నెల్లాళ్ళకో వచ్చి సమగ్ర మోహనరూపం ధరిస్తుంది.” (స్వగతం: అలా పాట లోని మాటల కోసం తపించడం ఇవాళ లేనే లేదు. తెలుగుపాటలో తెలుగే లేదు. ‘ఈ ప్రొడ్యూసర్ కి తల్లి లేదు – అని శ్రీశ్రీ గారు తన పదబంధ ప్రహేళికలో ఒక చురుకైన ఆధారం ఇచ్చారు. సమాధానం : నిర్మాత. అందుకే కాబోలు ఇవాల్టి నిర్మాతకి మాతృభాష అన్నది లేనే లేదు). కృష్ణశాస్త్రి- లోని త్రిమూర్తి వేదన వల్ల గానీ ప్రేమ కలుగదు, ఆ రెండూ కలిస్తే కరుణ అవుతుంది – అంటారు కృ.శా. పాట రాయడమంటే హృదయం లో దాగి ఉన్న వేదన వెలికి రావడమే. ఆయన మాటలాడలేరు కనుక అది ఎందరికో వేదన అయ్యింది. కాని కన్న కూతురుసీత చిన్ననాడే కన్ను మూస్తే , ఆండాళ్ళు శ్రీ హరిలో కలిసిపోయినట్లు సరిపెట్టుకునీ తిరుప్పావై పదాలు రాసి ఆయన తన వేదనని లోలోనే అణచుకున్నారు. ఆయనకి సమాజం పట్ల ప్రేమ ఉండేది. ‘పూని కరుణ ధర్మము విడని నాయకులుండిన నవయుగమందున అందాల మనదేశము’ ఉండగలదని ఆయన ఆశించేరు. ‘కరుణ మాలిన నీకు గతిలేదురా’ అని ఒక ఏకాకి మీద విరుచుకు పడ్డారు. ‘ప్రేమ,కరుణ,స్నేహం నింపుకో’ అని హెచ్చరించారు. మనిషైతే మనసుంటే కనులు కరగాలి, కరిగి, కరుణ కురియాలి, కురిసి జగతి నిండాలని అభిలషించారు. తేలిపోయే నీలి మేఘం జాలిజాలిగా కరుగుతుందని ఆయన గ్రహించారు. కాబట్టే జాలిగుండెల మేఘమాల కి విన్నవించగలిగారు. నీల మేఘ మోహనుడే – అని కీర్తించడమెందుకు అతను ‘జాలి’ వాన కురిపించకపోతే? అని రామనామ గానంలోనూ స్పష్టం చేశారు. ఆయన దృష్టిలో రాముడంటే కళ్యాణ రాముడే కాదు కారుణ్య ధాముడు కూడా. ‘రేయి కన్నా నల్లనైన’ దానినే అని నీల బాధపడితే కృష్ణుడి రూపంలో కృష్ణశాస్త్రి గారు చక్కగా ప్రవచించారు - ‘కనులకు తోచేది కాదు సోయగము, మనసులో పూచేటి మధురిమ గానీ- నీ చెలులు చూసేది నీ బాహ్య మూర్తి, నేను వలచేది నా నీలలో దీప్తి’ అని. ఈ కరుణార్ద్ర హృదయమే ఆయన చేత రక్త సంబంధాల గురించి కూడా మెత్తగా చెప్పించేది. తోడబుట్టిన చెల్లెలు ఎప్పటికైనా పుట్టినిల్లు దాటవలసిందే అని తలచుకుని కంట తడిపెట్టే అన్నయ్యల హృదయ వేదనని దేవులపల్లి వారిలాగా మరే కవి స్పర్శించలేదు. అన్న ఆకూ కొమ్మా, చెల్లి వెన్నెల వెల్ల ఐతే పదిలంగా నేసిన, పూసిన పొదరిల్లు వారిదట. అటువంటి పొదరింటినుంచి గోరింక పెళ్లైపోయి ఏ వంకో వెళ్ళిపోతే గూడు గుబులు కావడం, గుండెల్లో దిగులై పోవడం తప్పని సరి (కనులు చూసినా పాటే- లో 'మేడంటే మేడా కాదు' పాట చూసే ఉంటారు). మా మంచి చెల్లి , పెళ్ళి కూతురైతే మగనింటికి పోయే తొందరలే హెచ్చని అన్నకి తెలుసు. అయినా అల్లారు మేనల్లునెత్తుకొని, అంతలో తిరిగి వస్తుందిలే అనేది అన్న మనసులో ఉన్న భరోసా. చిన్ని చెల్లి అనురాగం, కన్న తల్లి కారుణ్యం మళ్ళీ కనుగొనగలిగితే అదే ఇంట్లో పండుగ అని తృప్తి పడాలి (సుఖదు:ఖాలు, జగత్ జెట్టీలు, విజయం మనదే, వాడె వీడు – ఈ నాలుగు చిత్రాల్లో ఒక్కో సోదర బాంధవ్యం మీద నాణ్యమైన పాట ఒక్కొక్కటి రాశారు శాస్త్రి గారు). ముక్తాయింపు- శాస్త్రిగారు పలికిన వేద వాక్కు: ‘గొంతు పాడితే చాలునా గుండెలో రాగం ఉండాలి’. అంతటితో ఆగేరా, మరో వేద వాక్కు కూడ జోడించారు- ‘మాటలాడగానే సరా? మనసులో నిజం పలకాలి’ ( audio archived under 'devulapalli' in kanulu moosinaa paate). ఎవరు పాడినా, మాటాడినా ఒక్కసారి వారి వారి 'జీవితాశయం' అదే అని మననం చేసుకుంటే చాలు. అటువంటి తృప్తి ఇవాళ సాధ్యమేనా? [ కృష్ణప్రేమ సలహా: దేవులపల్లి వారి అబ్బాయి బుజ్జాయి (ప్రముఖ చిత్రకారుడు) ‘మేఘమాల’ పేరుతో కృ.శా వారి సినీ గీతాల సంకలనం ప్రచురించినా , నాకు తెలిసి ఒక నలభై పై చిలుకు పాటల ముద్రణ ఇంకా రావాల్సి ఉంది. ‘కన్యాశుల్కం’ చిత్రంలో బొమ్మల పెళ్ళి పాట శాస్త్రి గారిదే. ఆ పాట ఇందులో లేనే లేదు. ‘అమృత వీణ’ లలితగీతాల సంకలనంలో ‘మేఘ సందేశం’ లో మార్చి రాయించిన ‘శీతవేళ రానీయకు’ పాటనే ప్రచురించారు. నిజానికి ఒరిజినల్ వెర్షన్ వేరనీ ఆయనకు తెలుసునే! ( కనులు మూసినా పాటే (archived under devulapalli' in kanulu moosinaa paate) – లో అది మీరు విన్నదే. పాటంతా వింటూ ఉంటే స్వర కర్త 'రమేష్ నాయుడు' కాక ఇంకెవరు అనిపిస్తుంది). ఈ సంకలనం లోనూ శాస్త్రి గారి వెన్నోలలితగీతాలు చోటు చేసుకోలేదు. ‘డుంబు’ సృష్టికర్త వీటిని ‘బుడుంగు’ మని కాల ప్రవాహంలో ముంచేయక అసంఖ్యాక అభిమానుల మనసులో తిరిగి చిత్రీకరిస్తారని చిగురించే ఆశతో 'నవ వసంత నందనం' లోకి అడుగు పెడదాం]. -డా. తాతిరాజు వేణుగోపాల్, 10 మార్చి 2012, 15 మార్చి 2012
4 Comments
G J RAO`
12/3/2012 07:33:09 am
WHAT ALL YOU WRITE IS QUITE INFORMATIVE AND ENJOYABLE LOT OF EFFORTS MU ST BE GOING IN COLLECTING THE FACTS.
Reply
Venugopal
20/3/2012 05:46:46 am
All my efforts are towards a paper-less reading for the generations who had experienced the facts in their time and who try to recollect those hidden in their memory.
Reply
Sree
19/5/2016 09:56:41 pm
adbhutam!
Reply
Radha Manduva
4/8/2018 05:38:58 pm
సర్, ఒక అమ్మాయి కథ లోని వెన్నెలల వేళనే వేణువులూదెనే పాట ఆడియో కి లింక్ ఇస్తారా ప్లీజ్.
Reply
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|