మునుపటి నా మాట
ఒకనాటి ఉద్యాన (నందన) వనము – నేడు కనుము Click to Zoom వచ్చేసింది కదా- నందన నామ సంవత్సరం! ఇవాళేమిటీ? మార్చి 23. ఉగాది కాబట్టి చైత్ర శుద్ధ (శుక్ల) పాడ్యమి. అంటే చంద్రుడు ‘మీ మనసుల్ని ప్రభావితం చేసేది నేనే కాబట్టి , ఆ సూర్యుడి దయ వల్ల నెలా నెలా వెన్నెల ఇచ్చేది నేనే కాబట్టి నా తిరుగుడు కూడా గమనించి నన్నూ లెక్కలోకి తీస్కోండర్రా’ అని మన పూర్వీకులకి చెప్పడం చేత వాళ్ళు ‘ఆ(, నిన్నెవడు లెక్క చేస్తారోయ్ ‘ అని అనకుండా , కిందా మీదా పడీ లెక్కలు కట్టబట్టీ పన్నెండు ‘చాంద్ర మాసాలు’ ఉన్నాయని తేలింది. అంతే కాదు చంద్రుడి గతి వల్ల అతని రోజు కాస్త ‘తిథి’ అయింది. సూర్యుడికేమో ‘తేది’ దక్కింది. సూర్యుడికి ఎక్కువ రోజులు కేటాయించక పొతే మండి పడడూ? చంద్రుడు మాత్రం పాపం తక్కువ రోజులతోనే చల్లబడ్డాడు. వీరి రోజుల తేడా సంవత్సరానికి దాదాపు పదకొండు. అందుకనీ రెండేళ్లకో, మూడేళ్ళకో ఒకసారి చంద్రుడికి ముప్ఫై ‘అధిక’ తిథులిచ్చి ఆ లోటు పూర్తిచేస్తూ వస్తున్నారు. అలా ఈ ఏడాది మనకో ‘అధిక భాద్రపద’ మాసం వస్తోంది. మార్చి ఇరవై న ‘వసంత విషువత్’ ( సాధారణంగా మార్చి ఇరవై ఒకటిన వస్తుంది. ఈ ఏడాది ‘లీపు’ సంవత్సరం కనుక ఫిబ్రవరిలో ఒక రోజు ఎక్కువ కనుక , ఈ వసంత విషువత్ మార్చి ఇరవైన వచ్చింది) వచ్చి ‘ వెలుగూ చీకటి సమానత్వం’ అంటూ ఘోషించింది. ఇక ఇప్పటినుంచి సూర్యుడు తన ప్రతాపమంతా మన మీద –అంటే కేవలం మన తెలుగువాళ్ళ మీద అని కాదు, మొత్తం భారతీయులందరి మీదా- చూపిస్తాడన్న మాట. పిల్లలకేమో పరీక్షలైపోయి తల్లులు మెట్టింటి ఎండలు కన్నా పుట్టింటి ఎండలు వెన్నెల్లా ఉంటాయని ప్రయాణాలు కడుతుంటే , తల్లి మమత కొలువునే మరచిన మంత్రిగారు ‘సామాన్యుడి టికెట్ రేట్ పెంచే రాయి’ ని విసిరేశారు సభలో. ‘అది రాయి కాదు, కలికి తురాయి’ అని ఆయన అపోహ పడ్డారు. ‘అయితే కాసుకో అని తల్లి మమతల కోవెల నుంచే మరో ‘రాయి’ విసిరారు. ఆ రాయి కరక్టైన కోణంలో 'ముకుళిత' హస్తం విసిరితే సరిగ్గా రైల్వే ట్రాక్ లో పడింది. ఇక ట్రైన్ టిక్కెట్ రేట్లు పెరగవు, మన నడుములు విరగవు అని తల్లులు ఒయ్యారంగా నడవొచ్చు. ఇదంతా – ఖర నామ సంవత్సరం చివర్లో జరిగినా ‘నందన’ వచ్చిన వేళా విశేషం అని ‘పంచాంగ శ్రవణం’ లో ఈ పాటికి ఘోషించే ఉంటారు. తిథి, వార, నక్షత్ర,యోగ, కరణ – అనే అయిదు అంగాల మీద మన జీవన గమనం ఆధార పడి ఉంది అని జ్యోతిష్యం అంటుంది. అది చెవులారా వినడమే పంచాంగ శ్రవణమంటే! ‘ఆదాయం సున్నా, వ్యయం చెప్పలేకున్నా’ అని ఏ రాశి వారికైనా ఏ పండితుడైనా అన్నాడో అతని మీద ఎంత దండయాత్ర జరుగుతుందీ!
ఉగాది పచ్చడి మీద, వినాయకుడి మీద పూర్వం ( అంటే ఓ రెండు దశాబ్దాల క్రితం వరకు) తెగ పిచ్చి పిచ్చి జోకులొచ్చేవి. అప్పటికన్నా ఇప్పుడే ఆ పచ్చడిలోని ఆయుర్వేద రహస్యం అర్థమై నవ్వడం కోసం నోరు తెరవక పచ్చడి తినడం కోసం నోరు తెరుస్తున్నారు. శుభ సూచకం ఇది. వినాయక చవితి నాడు ఉండ్రాళ్ళు అనగానే అవేవో ‘పేపర్ వెయిట్స్’ అన్నట్టు నవ్వేవారు. ఇప్పుడు పూజలో వాడే ఆ ‘ఏక వింశతి’ (21) పత్రాల లోని ఆయుర్వేద రహస్యం తెలుసుకునీ సరిగా ఆచరిస్తున్నారు. ఇదీ శుభ సూచకమే. ఆరు ఋతువుల కాల చక్రం – మన బాగు కోసమే నిరంతరం తిరుగుతూ కొన్ని కొన్ని వేళల్లో ఏం చెయ్యాలో, కొన్ని వేళల్లో ఏం కూడదో చెప్పి పోతోంది. ఒక ఏడాదిలో వచ్చే ఆరు ఋతువుల తొలి తీపి గురుతు ‘వసంతం’. ‘వసంత గాలికి వలపులు రేగ’టం ఒక కవి గమనించాడు. చివర్లో వచ్చే ‘శిశిరానికి చోటీయకు’ అన్నాడు మరో కవి. వసంతంలో కూయడం మరచి పోయి ‘వానకారు కోయిలనై’ పోయానే అని వాపోయాడు ఇంకో కవి. ‘ఏ వసంత కోకిలా వాన వేళ పాడదు’ అని అతని నమ్మకం. కోకిల సంగతి తరువాత, ముందు ఆకలి సంగతి మాటేమిటి అని అభ్యుదయ కవులు ‘కష్టించే రైతుల’ పక్షం చేరిపోయారు. రామరాజ్యంలో నెల మూడు వానలు కురిసి ఉండవచ్చు గాక, ఆకలి రాజ్యంలో అలా సాధ్యమా అని ఆరాలు తీశారు. ఎంత రైతుకైనా వాన ఒక్కటే ఆధారం, అభ్యుదయవాదం కాదు! వాన రాకడ, వాన పోకడ అంతా ప్రకృతి దయ. ఉన్న ప్రకృతిని ఉన్న చోట ఉన్న తీరునే ఉంచక వికృతంగా మారుస్తుంటే వానల రాకపోకల మధ్య తప్పటడుగులు పడుతున్నాయి. ఎక్కువై ఒక చోట, తక్కువై ఒక చోట – రెండూ ముప్పే. ‘అసలే కరువు, అందునా అధిక మాసం’ అని మా అమ్మమ్మ ఒక సామెత చెబుతూ ఉండేది. ఇవాళ నందన నామ సంవత్సరం ‘అధిక మాసం’ మోసుకొస్తున్నా కరువు రాదు, రాదు గాక రాదు అని చెప్పాలని ఉంది. నందన మనే పేరు సార్ధకం కావాలి కదా. పచ్చదనమే అంతటా విలసిల్లాలి, ‘గ్రీన్ రెవల్యూషన్’ లాగ. రెవల్యూషన్ అంటే గుర్తొచ్చింది- పరిభ్రమణం అనే సంస్కృతాంధ్ర పదం. ‘సూర్యుడి చుట్టూ తిరుగుతుంది భూగోళం’ అని కవి చెప్పేదాకా కొందరికి తెలియదట. అలాంటి వారి ‘తెలివిలోనే ఉంది ఏదో గందరగోళం’ అని కవి మాటే అప్పచెప్పాలి. ఇలా ఓ ఏడాది తన రౌండ్ భూమి పూర్తి చేసుకుంటే అలాంటి పన్నెండు రౌండ్స్ బృహస్పతి (గురుడు) పూర్తి చేస్తాడు. శని ‘మెల్ల మెల్ల మెల్లగా అణువణువూ నీదెగా’ అని పాడుకుంటూ ముప్ఫై రౌండ్స్ ఈడుస్తాడు. ఇవన్నీ గమనించి ఒక అరవై ఏళ్ళ కాల చక్రం తయారు చేశారు ఆనాటి మనవాళ్ళు ( అంటే మన తెలుగు వాళ్ళు అని అనుకోగలరు- అన్ని రకాల మేధావులు). అప్పారావు, ఆనంద రావు, ఇంద్రజ, ఈశ్వరి – అనే అ ఆ ఇ ఈ క్రమంలో మనం కొన్ని వేలమందికి పెట్టిన పేర్లే పెట్టుకోగలం. అలా కాకుండా ప్రభవ, విభవ, ----క్షయ (అక్షయ) అని పేరుకు తగిన ఫలం ఉండేలా ఒక్కో ఏడాదికి ఒక పేరు పెట్టారు. అరవై ఏళ్ళు పూర్తి కాగానే ( దీన్నే షష్టి పూర్తి అని అంటాం) ఒక ఆవృతం పూర్తయి మరో అరవై ఏళ్ళ ఆవృతం ఆరంభమౌతుంది. ఈ 2012 మార్చి 23 న ‘నందన’ వస్తే అరవై ఏళ్ళ క్రితం మాటేమిటీ? ఇప్పుడొచ్చిన ‘నందన’ నామ సంవత్సరం (2012) మన సినిమాలు ఒక కలగా కాకుండా కళగా రూపుదిద్దుకున్న తొలి దశలో 1952 లో వచ్చింది. అప్పటి ఉగాది మార్చి 26 న. అంటే- వెనకటి కాలం లో ఉగాది మూడు రోజులు ఆలస్యం చేస్తే ముందు కాలంలో అదే ఉగాది మూడు రోజుల ముందే వచ్చేసిందన్న మాట . అందుకే శీర్షిక లో – ఒకనాటి ఉద్యాన (నందంద) వనము నేడు కనుము’ అని అన్నాను. అనడమే కాకుండా ఆ 1952 లో విడుదలైనవి, పాటలు అందుబాటులో ఉన్నవీ, పాటల రచన సంపాయించే వీలున్నవీ చిత్రాలు స్మరించుకోవడం బావుంటుందనిపించి కొన్నిటిని కనులు చూసినా పాటే,కనులు మూసినా పాటే, కనులు చదివినా పాటే – అనే ముక్కంటి ‘నందన’ వనంలో నాటే ప్రయత్నం చేస్తున్నాను. ఆనాటి ( అనగా 1952 నాటి) విశేషాలు- ప్రసిద్ధ కథకులు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు పూర్తి స్థాయి సినీ గీత రచయితగా ‘చిన్నకోడలు’ చిత్రంతో వెండి ‘తెరంగేట్రం’ చేశారు. వెండి- అని ప్రత్యేకంగా అనడమెందుకంటే ఆయన ‘ధవళ వస్త్రధారి’ కనుక. చిత్రాల చిత్రమంటే ఇదే- ఆయన తొలిసారిగా రాసిన చిత్రం ‘చిన్నకోడలు’ , అందులో ఆయన రాసినవి పదకొండు పాటలైతే, ఆయన ఆఖరి పాట (ఒకే ఒక్కటి) వినిపించిన చిత్రం –‘అత్తగారు- కొత్తకోడలు’. ఒక ఏడాది ముందు ‘మల్లీశ్వరి’ చిత్రంలో మనసున మల్లెల మాలలూగించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఈ ఏడాది ‘ఆకలి’ చిత్రం లో తన కలంతో కలకలం రేపారు. ఒక ఏడాది ముందు ‘దీక్ష’ తో సినీ గీత రచనా దీక్ష మొదలెట్టిన ఆచార్య ఆత్రేయ అందులో నాలుగు పాటలు రాసి ఊరుకునీ ఈ ఏడాది ఆదర్శం, దాసి చిత్రాలకి ఒక్కో చిత్రానికి పదకొండు పాటల చొప్పున రాశారు. మల్లాది వారి ప్రభావమా? సామ్యవాదం, అభ్యుదయ కవిత్వం మెల్ల మెల్లగా అన్ని వర్గాలనీ ఆకర్షిస్తున్న రోజులవి. అప్పుడొచ్చింది తాతినేని ప్రకాశరావు గారి ‘పల్లెటూరు’. శ్రీకృష్ణ (కమిటీ కాదు) రాసిన ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కోసం రాసిన ‘పొలాలనన్ని హలాల దున్ని’ గేయం అందులో చోటుచేసుకున్నాయి. సుంకర వారి భావగీతం ‘ఆ మనసులోన’ కూడా అందులోనే ఉండడం మరీ విడ్డూరం. రాజు-రైతు భావం మీద బొమ్మల కొలువు సందర్భంలో పిల్లల ఎదుట ఒక పాట పాడి వినిపించడం ఒక నూత్న ప్రయత్నం. చేయెత్తి జైకొట్టు- పాటలో ఎన్.టి.ఆర్ కంఠం కదులుతూ ఉంటుంది. సహజత్వ తపన ఉండబట్టే వారు పదికాలాలు హీరోలు కాగలిగేరు. ఇందులో ఎన్టీఆర్, సావిత్రి జంట అయితే ఎన్టీఆర్, జి.వరలక్ష్మి జంటతో ఇదే ఏడు ‘పెళ్లి చేసి చూడు’ అనే హాస్య వ్యంగ్య చిత్రం ఎప్పటిలా విజయా వారు తీసి చూపించారు. ‘భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్’ అనే చురకలు పింగళి నాగేంద్ర కవి వేసారు. అన్న ఈయనే ఇదే సినిమాలో ఓ భావగీతం ‘ఎవరో ఎవరో’ అన్నది రాయడం వింతే. చూడగా చూడగా ఆ ఏడాది సినిమాల్లో వచ్చిన వాటిలో అన్నిట్లో జోల పాటలు ఉన్నట్టు అనిపించింది. కొన్ని జోలల మధ్య సారూప్యాలు కూడ కనిపించాయి. దేవులపల్లి వారు ఆకలి లో ‘ఏడవకు చిన్నారి కూన’ పాట రాసి అందులో పేదతనం ప్రసక్తి తీసుకొచ్చారు. ఆత్రేయ ‘దాసి’ లో ‘ఏడవకమ్మ ఏడవకు—ఏడుపులన్ని పేదలకు’ అన్నారు. మల్లాది వారు భిన్నంగా ‘జోజోజో – వయారి గదె’ (చిన్న కోడలు) పాటలో చిరునవ్వుని రతనాల రాశితో పోల్చారు. అయితే ఇంకొక పాటలో ‘ గొప్పగొప్పోళ్ళ లోగిలి నిండా లడాయ్ బడాయ్ – కొద్ది కొద్దోళ్ళ పుటకే హాయ్’ అని అనకపోలేదు. బాలాంత్రపు రజనీ కాంత రావు గారు రేడియో సేవకే అంకితమైపోయారు కాని ఎన్నో సినిమాలకి అద్భుతమైన ట్యూన్స్ ఇవ్వగలిగే వారే. ఆ ఏడాది ‘మాయావతి’ చిత్రంలో ఆయన రాసి స్వర పరచిన ‘ఓ మలయ పవనమా’ యుగళ గీతం మలయమారుతం రాగంలోనే ఉండడం – కవే స్వరకర్త అయితే వచ్చే లాభాన్ని సూచించింది. రజనీ వారు ముందే రాసుకున్న ‘ఉందువో మధురానగరిలో’ , ‘ఎవరిదా ప్రేమ గీతి’ అనే రెండు పాటలూ ‘ప్రియురాలు’ చిత్రంలో ఉపయోగించుకున్నారు. పెళ్లి చేసి చూడు లో ‘ఏడుకొండలవాడా వెంకటారమణ’ పాట ‘మలయ మారుతం’ రాగంలో కూర్చినదే. ఇందులో ‘బీబి నాంచారమ్మ’ ప్రస్తావన ఉంది. మల్లాది వారు ‘చిన్న కోడలు’ చిత్రం కోసం అనార్కలి గేయ రూపకం రాశారు. నాటి ‘నందన’ నామ సంవత్సరంలో అనార్ కలి (దానిమ్మ మొగ్గ) ప్రస్తావన సముచితమే. పల్లెటూరు, పెళ్ళిచేసి చూడు – ఇవి ఘంటసాల వారి సంగీత దర్శకత్వంలో వచ్చిన రెండంటే రెండు సినిమాలే అయినా ఆ ఏడాదే కాదు ఇప్పటికీ వాటి వీడియోలు లభ్యం అవుతున్నాయంటే ఎన్టీఆర్ తో పాటు ఘంటసాల వారూ గ్రేటే అనాలి. అప్పటి మేలు కలయిక అనదగ్గ సుబ్బరామన్, సుసర్ల, ఘంటసాల, రజనీ, రాజేశ్వరరావు, అశ్వత్థామ లకు దీటుగా టీ.వీ.రాజు ‘టింగు రంగా’ మంటూ పూర్తి స్థాయి సినీ సంగీత రంగ ప్రవేశం చేశారు. ఈ ‘టింగు రంగా' చిత్రానికి ఎస్.బి.దినకర రావు కూడ సంగీతమిచ్చారు. విశేషం ఏమిటంటే- టీ.వీ.రాజు గారి పూర్తి పేరు ‘తోటకూర వెంకట రాజు’ లో తోట ఉండడం ‘నందన’ నామ మహిమో ఏమో. ఈ రాజు గారి సంగీతంలో డా.సి.నా.రె ఎన్నో ‘రాజు’ పాటలు రాశారు. బహుశా వారి ‘తోటలో నా రాజు’ పాట పల్లవికి ప్రేరణ ఈ తోటకూర రాజు గారేనేమో! బాలసరస్వతి,శాంత కుమారి, ఎస్.వరలక్ష్మి,జిక్కి, భానుమతి,లీల, రాణి, సరోజిని – ఎనమండుగురు గాయనీ మణుల ప్రతిభ సరే సుశీల గారు ఏరీ అనే సందేహం రావొచ్చు. ఈ గారాల బిడ్డను సినీ గాయనిగా తీర్చి దిద్దడానికి సినీ కళామ తల్లి ‘కన్నతల్లి’ గా మారినది ఈ ఏడాది కాదు, 1953 లో. నట గాయని జి.వరలక్ష్మికి ‘లీల’ ప్లే బ్యాక్ పాడడం ‘ఏమిటో ఈ మాయ—లీలగా ఇపుడే తోచేనయా’ అన్న పింగళి వారినే అడిగి తెలుసుకోవాలి. గాయనిగా మిస్ అయిన జీ వరలక్ష్మినర్సమ్మగా నటించి ఈ ఏడు దర్శనమిచ్చారు. స్వర కర్త ఆదినారాయణరావు ఈ ఏడాది కాస్త విరామ చిహ్నం చూస్తూ గడిపేశారు. ఆయనంతే – ఇంటర్వెల్ తరువాత సినిమా జోరందుకున్నట్టే కొద్దిపాటి గ్యాప్ ఇస్తూ తిరిగి విజ్రుంభించే వారు. ‘అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా’ అని ఓ పాట ఉండేది పాత సినిమాల్లోనే. ఆ తేడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. 1952 లో పాతిక మించలేదు తెలుగు సినిమాలు. 2012 లో ‘సెంచురీ’ కొట్టడం ఒక ఆనవాయితీ కనుక అన్ని సినిమాలు రావొచ్చు. ఎటొచ్చీ నాటి ‘నందన’ శోభ మళ్ళీ తీసుకు రాగలవా ‘నందనా?’ అనే ప్రశ్నార్ధకం ఎగిరి పోయి ‘ నాటి నందన శోభ మళ్ళీ తీసుకు వచ్చావా నందనా!’ అనే అచ్చెరువు చిహ్నం రావాలి. సమవృష్టి తో భాద్రపదం వరకూ దేశం ‘నందన’ వనంలా కళకళ లాడాలి. అధిక భాద్రపదం అంటోంది- ‘భద్రం కొడుకో!’ భద్రతా అంటే గుర్తొచ్చింది- గార్డెన్ సిటీ గా పేరొందిన బెంగళూరంటే బెంగగా ఉంది. మొన్నటికి మొన్న ఓ అవివాహిత మంచి జాబే చేస్తున్నా ఏమిటో జీవితం బోర్ గా ఉందని ఉన్నఫళాన ఉరేసుకుంది. ఎంత పిచ్చితనం! బెంగళూరు లాంటి ఊళ్ళో రోజుకి ఇరవైఆరు గంటలున్నా సరిపోవని అనుకునే వాళ్ళమే- ఇంత మార్పా? ఇదిలా ఉంచితే- పాపం మొన్నటికి మొన్నే ఫుట్ బాలుడు 'వెంకటేష్' బెంగళూరు మైదానంలో కుప్పకూలి పోయి గతించాడు. ఫీల్డు పరిసరాల్లో డాక్టర్ గానీ, రుగ్వాహనం కానీ లేకపోవడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఎంత దారుణం! మనిషికి మనిషితో అనుబంధం కొరవడిపోతే, సాటి మనిషి పట్ల సానుభూతి అడుగంటిపోతే ఉద్యానవనాలున్న ఊళ్ళ కన్నా, ఉప్పు సముద్రం పరుగులు తీసే ఇసక పట్నాలకన్నా మసక వెలుతురులో మామూలు స్థాయిలో పడి ఉండే పల్లెలే నయమేమో. బాబా ఆమ్టే తనయుడు డాక్టరు. సిటీల్లో 'ఖరీదు కట్టే షరాబు' కాడు. ఎక్కడో అడివిదారుల్లో ఎవరూ సాహసించని మారుమూల పల్లెలో అమాయక ప్రజకి సేవ చేస్తున్న దంపతులు వారు. వారు పొందుతున్న 'తృప్తి' ని మించిన నందనం మరొకటి లేదేమో! పింగళి వారు అంటారు కదా- ప్రేమయాత్రలకు బృందావనము, నందన వనము ఏలనో?' అని. కానీ ఆయన అనుకున్నట్టు 'కులుకులొలుకు చెలి చెంత నుండగా' కాదు. అర్థం చేసుకుని వెంట నడచు చెలి చెంత నుండగా- అని సరి దిద్దుకోవాలి. అమ్మా - నందనం, నీకు వందనం. అందరి జీవితాలూ ఆనందంగా ఉంచు , అదే మా జీవన ఇనప్పట్టెల్లో మూలధనం. -డా. తాతిరాజు వేణుగోపాల్ , 23 మార్చి 2012
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|