మునుపటి నా మాట
సూర్యవంశమునందున శ్రీ రామచంద్రుడు శ్రీరస్తు! శుభమస్తు! శ్రీ రామ జననం చైత్ర శుద్ధ నవమి తిథిని ఇరవై ఏడు నక్షత్రాలల్లోని ఏడవ నక్షత్రమైన పునర్వసు లో జరిగింది. ఆ తొమ్మిది (తిథి), ఈ ఏడు (నక్షత్రం) వెరసి పదహారు కళల చంద్రుడు శ్రీరామ చంద్రుడు సూర్యవంశాన ఉద్భవించాడు. దేవతామూర్తుల వివాహం వారివారి పుట్టిన తిథి,నక్షత్రాల్లోనే జరపడం మానవులమైన మనం తరతరాలుగా ఆచరిస్తున్న ఒక నియమం. అలా – ఇదే నవమి నాడు ‘సీతారామ కళ్యాణం’ జరుపుకునీ అవతారమూర్తి రామయ్యను , సహనశీలి సీతమ్మను పదేపదే తలుచుకుంటూ వడపప్పు, పానకం (పాలూ తేనె కలసినట్లుగా ఆలూ మగలు ఉండాలి – అని కవిగారిలా అనుకోవడం అతిశయమే. వడపప్పు, పానకం వేరు వేరుగా ఉన్నా ఒకరికోసం ఒకరం అన్నట్టుగా ఉంటాయి) మిశ్రమ సేవనంతో తరిస్తాం. అయోధ్య నుంచి అడవికి , అడవి నుంచి అయోధ్యకి ‘ధర్మ రక్షకుడు’ శ్రీరాముడు పయనిస్తూ చవి చూసిన ఎనభై నాలుగు ఋతువుల కాల చక్రం అనుభవాన్ని మహర్షి వాల్మీకి రామాయణ కావ్యంగా అందించాడు. రామాయణ ప్రారంభంలోనే ఒక ప్రత్యేకత ఉంది. అదే- రామ, భరత, లక్ష్మణ , శత్రుఘ్నల జననం- తల్లుల పాయస సేవనం ద్వారా వారి జననం సాధ్య పడడం. అలాగే సీతాదేవి భూమి పొరలనుంచి రాజర్షి జనకునికి లభించడం. ఆధునిక విజ్ఞానం ఎదుట నిలుస్తున్న సంతాన వైఫల్య సమస్యల పరిష్కారాన్ని ఆదికవి కావ్యం ఆనాడే చూచాయగా సూచించింది. ఆ రహస్య మంత్రం లుప్తమై మన పరిశోధనలకి కొత్త ఆశ మాత్రమే ప్రాప్తమైంది. డబ్భైల కాలంలో ఇదంతా ‘ట్రాష్’ అని కొట్టి పారేశేవారు. ఇప్పుడు కాస్త నయం. కాసేపు ఆలోచిస్తున్నారు. శ్రీరామ నామాలు , సపరివార నామాలు దశరథ మహారాజు పెద్ద కుమారుడు రాముడు కాబట్టి రాముణ్ణి ‘దాశరథి’ అనాలి. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు- అనే వరస ఒకనాటి పాట ద్వారా మన చెవిని పడీ పడీ స్థిరపడిపోయింది కాని నిజానికి రాముడు (కౌసల్య పుత్రుడు), భరతుడు (కైక పుత్రుడు), లక్ష్మణశత్రుఘ్నులు (సుమిత్ర కవలలు) అన్నదే వరస. రాముడికి అందరూ తమ్ములే అయినా తమ్ముడు (అనుజుడు) లక్ష్మణుడినే ‘రామానుజుడు’ అంటారు. అతను సుమిత్ర పుత్రుడు కనుక ‘సౌమిత్రి’ అయ్యాడు. తమ్ములందరిలో ప్రతి ఒక్కరిని ‘దాశరథి’ అని అనకూడదు. ఆ పేరు శ్రీరాముడికే పరిమితం. క్షత్రియ ధర్మం ప్రకారం రాజు తరువాత అతని జ్యేష్ట పుత్రుడే పరిపాలకుడు. అయోధ్య పుర వాసులు రాముణ్ణి ‘అయోధ్య రామా’ అని పిలవగలరు. సూర్య వంశీయుడు కనుక రాముడిని ‘రఘు వంశ తిలకా’, ‘రఘురామా’ , ‘రఘువరా’ , ‘ఇనకులాభి సోమా’ ,’రాఘవా’ అని పిలవాలి. రాముడు అయోధ్యలో లేని పక్షంలో భరతుడు రాజ బాధ్యతలు తీసుకోగలడు. ధర్మం అనుసరించడం శ్రీరాముడు కర్తవ్యంగా భావిస్తే అన్నను అనుసరించడం తమ ధర్మమని తమ్ములు భావించారు. మిథిలలో మెదలిన రాముని ఆజానుబాహు రూపాన్ని కోరుకున్న సీత అదే రామునితో అయోధ్యను వీడినప్పుడు అతని పాదాలనే అనుసరించింది. అడవికి అన్న వెళ్ళిపోయినా అతని పాదుకలు పెట్టి రాజ్యమేలాడు భరతుడు. సీతమ్మ వియోగ సమయంలో యజ్ఞం చేయవలసివస్తే స్వర్ణ సీతను నెలకొల్పాడు రాముడు. ఇలా ఎవరికివారే ఆదర్శమూర్తులు. ‘ధర్మం’ పాటించడం క్షత్రియ లక్షణం. అదే రాజు అనదగ్గ వాడి ప్రథమ కర్తవ్యం. శ్రీరాముడు ‘ధర్మజ్ఞ:’ (ధర్మజ: - అని ధర్మరాజు ననాలి) ఇక రాముడు దేహ ఛాయ బట్టి నీలమేఘశ్యాముడు అని పేరు పొందాడు. దేహ విస్తీర్ణం ప్రకారం ఆజానుబాహుడు అయ్యాడు. ఇప్పుడు రామరాజ్యం అంటే ఏదో సినిమా టైటిలే తప్ప దేశం అలా ఉంటుంది అనుకోవడం కల్ల. రాజకీయ నేతలు రాముళ్ళు కాలేరు, కాబోరు.
జనక మహారాజు కి లభించిన పుత్రిక సీత కనుక ‘జానకి’, భూదేవి కుమార్తె కనుక భూమిజా, అవనిజ, పృథ్వీ పుత్రి. పుడమి సంస్కృత శబ్దం కాదు కనుక పుడమిజ అని అనకూడదు. అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడు, పవన కుమారుడు కనుక పావని. లంకానాధుడు, లంకేశ్వరుడు రావణుడు. పదితలలు కలవాడు, అయినా ‘దశముఖుడు’ అనే కన్నా ‘దశ కంఠ’ అనడమే ఎందరికో ఇష్టం. రాముడికి ఎవరితోనూ శత్రుత్వం లేదు. కనుక రాముణ్ణి ‘రావణారి’ అని అనవచ్చా? త్యాగయ్య ‘మా జానకి చెట్టబట్టగ’ కీర్తనలో ‘రావణారి’ అంటారు. అన్నమయ్య ‘అరి రావణాంతక’ అని తన సంకీర్తనలో ప్రయోగించారు. రాముడు ధనుష్కోటి దగ్గర వానర సైన్య సహాయంతో లంక వైపు చేరటానికి వారధి నిర్మించాడు. శివుడు జలాధిపతి. అందుకే రాముడు వారధి నిర్మించే ముందు శివ పూజ చేశాడు. తమిళనాట రామన్, శివ రామన్, సేతురామన్ అనే పేర్లు వినిపిస్తుంటాయి. రఘురాముడు ‘రఘువరన్’ , ‘రాఘవన్’ అయ్యాడక్కడ. తెలుగువారికి రామయ్య, సీతారామయ్య, రఘురామయ్య, రాఘవయ్య దక్కారు. కన్నడంలో రామప్పలు మిగిలారు. పద్యం – ఒకనాటి తెలుగువారి చోద్యం వాల్మీకి రామాయణం సామాన్య ప్రజకి చేరువయ్యేలా తులసీదాస్ శ్రీరామ చరిత మానస్ రచించాడు. కుమ్మరి మొల్ల చలువ వల్ల మనకీ ‘మొల్ల రామాయణం’ ఉంది. కన్నడంలో బంపన కవి సరళమైన రామాయణం రచించాడు. తమిళంలో కంబ రామాయణం ప్రసిద్ధం. పద్యాలు మన సాహిత్యానికి కిరీటాలు. వృత్తాలూ అవీ సంస్కృతం నుంచే వచ్చినా పద్య పఠనం మన ప్రత్యేకత. వృత్తాల్లో (చంపకమాల,ఉత్పలమాల మొదలైనవి) 10/11/13/14 అక్షర స్థానాలు యతి స్థానాలు కావడం వల్ల పద్య పఠనం సమయంలో తాళానికి తగినట్టు ఊపిరి తీసుకునేందుకు అవకాశముంది. మొల్ల రామాయణం లోని పద్యం తీసుకుందాం- సుడిగొ/ని రాము/పాదము/లు సోకి/న ధూళి/వహించి/రాయి యే/ ర్పడ నొ/క కాంత/ యయ్యెన/ట , పన్ను/గ నీత/ని పాద/రేణువి/ య్యెడ వ/డి, నోడ/ సోక ని/ది యేమ/గునో య/ని సంశ/ యాత్ముడై/ కడిగె/ గుహుండు,/రామ ప/ద కంజ/యుగంబు/ భయమ్ము/పెంపునన్/ ఆ వాలు గీతలు న,జ,భ,జ,జ,జ,ర అనే గణ విభజన చేసి ‘చంపకమాల వృత్తం’ ఇదని చెబుతున్నాయి. ఆ లావు అక్షారాలు యతి మైత్రిని, యతిస్థానాన్ని గుర్తు చేస్తున్నాయి. సామాన్య జనం మరచిపోతేనేం, కనీసం గాయనీ గాయకులైనా పద్యాలు మననం చేసుకుంటూ ఉంటే నోట చక్కని ‘తెలుగు’ పలుకుతుంది. లేకపోతె ఇప్పటిలా ముందుముందు కూడ ‘తెగులే’ మిగులుతుంది. ఛందస్సు మీద ఎడాపెడా చెవాకులు పేల్చినా మహాకవి శ్రీశ్రీ కి పద్య రచన అంటే ఇష్టమే. హాస్యనటుడు పద్మనాభం లాంటి చతురులు పరీక్ష పెట్టారు కూడ. కథానాయిక మొల్ల చిత్రంలో అప్పు, నిప్పు, మెప్పు,చెప్పు దత్తపది కవయిత్రి మొల్లకిచ్చి వాటిని ఆ అర్థాల్లో కాక రామాయణ అంశం ఒకటి చెప్పమంటారు. శ్రీశ్రీ కలంనుంచి చమత్కార కంద పద్యం ఇలా సాగింది- అప్పుడు మిథిలకు జని, నే / నిప్పురంబున జరుపు వింత నిచ్చటి ప్రజా తా/ మెప్పుడును జూడబోరని/ చెప్పుచు రాఘవుడు విఱిచె శివ కార్ముకమున్. తెలుగు పట్ల అభిమానం ఉండాలే కాని మనకి ఉన్నన్ని సాహిత్య విశేషాలు ఎవరికున్నాయి చెప్పండీ? తెలుగు భాష నేర్పేటప్పుడు సుమతీ శతకంలోని ఈ ప్రథమ కంద పద్యమే చెబుతారు- ‘శ్రీరాముడి దయ చేతను/ నా రూఢగ సకల జనులు నౌరాయన(గా ధారాళమైన నీతులు/ నోరూరగ( జవులు పుట్ట నుడివెద సుమతీ!’ శ్రీరాముడి దయ – అంతంటి మహిమ కలది. కంచర్ల గోపన్న (రామదాసు) ‘దాశరథీ శతకం’ లో తొలి పద్యానికి శ్రీకారం చుడుతూ ‘శ్రీ రఘు రామ, చారు తులసీ దళ దామ, శమ క్షమాది శ్రుం/ గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమా లలామ, దు/ ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో/ త్తారక నామ, భద్రగిరి, దాశరథీ, కరుణాపయోనిధీ’ అనే ఉత్పలమాల సమర్పించుకుంటారు. త్రికాలజ్ఞులు- అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య – ఈ వాగ్గేయకారులు ముగ్గురూ మూడు కాలాలకు చెందిన వారు. అందుకే వారు త్రికాలజ్ఞులు. శ్రీవేంకటేశ నుతుడైన అన్నమాచార్యులు ఇప్పుడు ‘పాట’ గా మనం చెప్పుకునే ప్రక్రియకి ఆద్యులు. రాముడైనా, కృష్ణుడైనా, వెంకటేశుడైనా శ్రీహరి రూపాలే. శ్రీరాముణ్ణి నుతిస్తూ అన్నమయ్య ఎన్ని పదకవితలు పలికారో! ‘ఇతడే పరబ్రహ్మ మిదియె రామకథ/ శతకోటి విస్తరము సర్వ పుణ్యఫలము’ ‘తారకబ్రహ్మము తానైవున్నాడు / ధారుణితో చెలువొందె దశరథరాముడు’ ‘జయజయ రామా-సమరవిజయ రామా!/ భయహర నిజభక్త పారీణ రామా’ ‘రామా దశరథ రామా నిజ సత్య కామా నమో నమో కాకుత్స రామా’ శ్రీ రామదాసు కీర్తనలు తెలిసినవే. కాబట్టి ప్రస్తుతం వాటి ‘పలుకే బంగారమాయెనే’. నాదయోగి త్యాగయ్య కీర్తనల్లో ఉండేది ‘అంతా రామమయం’ ( నిజానికి అంతా రామమయం అన్నది – రామదాసు పలికిన మాట). కొన్ని కీర్తనలు మెదడుకు మేత పెడతాయి. ఎవరని నిర్ణయించిరిరా – నిన్నెవరని శివుడనో మాధవుడనో కమల భవుడనో పరబ్రహ్మమనో నిన్నెవరని శివమంత్రమునకు మా- జీవము / మాధవ మంత్రమునకు రా-జీవము ఈ వివరము తెలిసిన ఘనులకు మ్రొక్కెద/ వితరణగుణ త్యాగరాజ సన్నుత నిన్నెవరని ఈ కీర్తనలో దాగి ఉన్న భావం : రామ – అనే శబ్దం శివకేశ బేధం లేనిది. ఓం నమశ్శివాయ – పంచాక్షరీ మంత్రంలో మ అనే జీవాక్షరం లేక పొతే శుభానికి కాదు అనే అర్థం వస్తుంది. ఓం నమో నారాయణాయ- అష్టాక్షరీ మంత్రంలో రా అనే జీవాక్షరం లేకపోతే అక్కడా శుభానికి కాదు అనే అర్థమే వస్తుంది. ఆ రెండు జీవాక్షరాల సంగమం ‘మరా’ లేక ‘రామ’ వాల్మీకి ద్వారా వెలికి వచ్చి రామాయణ కావ్య మాధుర్యమైంది. ‘నిధి చాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా’ కీర్తనలో ధన వ్యామోహంలో పడి రామ భక్తిని మరిచే వారిని మందలిస్తారు త్యాగయ్య . ‘నిన్ననవలసినదేమి రామ- నన్ననవలెగాక – కన్న తండ్రి నీ కన్న వేల్పులెవ రున్నానురా ఆపన్న రక్షక నేనిన్నన వలసినదేమి’- కీర్తనలో తను చేయని సత్కర్మల గురించి చెబుతూనే అలాంటి వారికి హితబోధ చేస్తారు. ‘బంటురీతి కొలువియ్యవయ్య రామ’ అని త్యాగయ్య తన నొక బంటుగా స్వీకరించమంటారు. బంటు అంటే సేవకుడని కాదు. భటుడు. భటుడు కావడానికి కొన్ని అర్హతలు, కొన్ని ఆదేశాలు ఉంటాయి. కంచుకం, ఖడ్గం,రాజ ముద్ర – ఈ మూడూ తప్పనిసరి. రాముని తలపే తన కవచం, రామ భక్తియే రాజ ముద్ర, రామ నామమే ఖడ్గం – ఇవన్నీ తనకి అమరగా ఇంక తనకి బంటు రీతి కొలువు కలగక తప్పదు కదా. ‘’బలము కులము ఏల రామ? భక్తి కారణము’ – కీర్తనలో రామభక్తికి కులం అడ్డు నిలవదని ప్రవచించారు. భక్తి నటించేవారిదే కపట కులమని హెచ్చరించారు. ‘సీతా కళ్యాణ వైభోగమే – రామ కళ్యాణ వైభోగమే ------త్యాగరాజనుత |సీతా|’ కీర్తన మధ్యలో ఇరవై నాలుగు రకాలుగా శ్రీరాముని వర్ణిస్తారు త్యాగయ్య. మకుటంలో కళ్యాణ సందర్భంలో సీతనీ, రాముడినీ వేర్వేరుగా ఎందుకెంచారూ? ఎందుకంటే కళ్యాణం జరిగాకనే సీతారాములౌతారు కాబట్టి. ఎటువంటి రాముడితో సీత వివాహం జరుగుతోందో చెప్పడానికి ఇరవై నాలుగు విశేషణాలు ఉపయోగించారు త్యాగయ్య. ఇరవై నాలుగు గంటలొక రోజు. ఈ ఇరవై నాలుగు నుతులు గంటకొకటి చొప్పున ధ్యానిస్తే సీతా రాముల పెళ్లిరోజు పూర్తవుతుంది అని నేననుకుంటున్నాను. ఇది నా అజ్ఞాన మేధో మధనం. మంగళ హారతి కీర్తన- ‘జయ మంగళం, నిత్య శుభ మంగళం’ లో 22 విశేషణాలతో శ్రీరాముని కీర్తిస్తారు త్యాగరాజులు. అయితే శ్రీరాముడికి ముందు శ్రీహరి, పిమ్మట శ్రీకృష్ణుడు అన్నది త్యాగయ్యకి ఎరుక కనుక మాధవాయ, కందర్ప జనకాయ అని ఒకదానివెంట ఒకటి చేర్చారు. ‘సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా’ అని ముందు ఒక కీర్తనలో నాదయోగి త్యాగయ్య స్పష్టం చేశారు కాబట్టి ఈ ఇరవై రెండు విశేషణాలు ఇరవై రెండు శ్రుతులనుకోవచ్చేమో! ఇదీ నా అజ్ఞాన తిమిరంలోని వెలుగు రేఖే. శ్రుతీ.లయ జ్ఞానంతో పాడలేని వారికి అవకాశాలు మంగళం పాడేస్తాయి అని నా భావం . మడిపడిగ బలరామాచారి గారు చక్కని కీర్తనం ఇలా రాశారు- ‘శ్రీ రామ రామ హరే సీతా రామ రామ హరే రామచంద్రుని పదములను కెం/ దామర భజియించు వారికి / కామనలు తీరేనురా /బ్రతుకంత సౌఖ్యములీనురా |శ్రీ| వేషములు పదిదాల్చి లోకపు/వేదనల పోగొట్టి భక్తుల నాదుకొన్నటువంటి పావన/నామము నారాధించరా |శ్రీ| ఇనకులంబున పుట్టి సత్యము/ఘనముగా పాలనము చేసి దనుజులను దునుమాడి శాంతిని/ ధర్మమును స్థాపించెరా |శ్రీ| నాయని సుబ్బారావు గారు లలిత గీతంలో రాతిని సమీపిస్తున్న శ్రీరామపాదం, రాతిలో కలుగుతున్న చైతన్యం గురించి అద్భుతంగా ఇలా రాశారు- రాముని యడుగులు ముందుకు సాగినంత తొందరగా రాతికి అంతశ్చేతన కూడెనంత వేగముగా ! రాముని పదధూళి రేగి గ్రమ్మెనంత దట్టముగా రాతికి భావావేశము కలిగెనంత గాఢముగా! రాముని చరణాగ్ర స్పర్శ సోకెనంత లాలనగా రాతికి రామరూపము అమరెనంత అందముగా! దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రామకథ చెప్పలేని తన అసౌకర్యాన్ని హృద్యంగా ఇలా చిత్రించారు- అగునా పాడగ రఘురాముని కథ తగుదునని కవి ననుకొని అలసిని |అగునా| బిగిసిన గొంతు పెగలక ముగిసి సొగసిన మనసున వెలుగే లేక .. |అగునా| దివికి భువికి నిశ్రేణి ఆదికవి దేవుని వాణి నవ రసధాని – కురిపించిన నిర్జర గీతినా? సురమౌని చేతి మహతినా మహతినా? |అగునా| జీవితంలో ఒక్కసారైనా ‘రామ’ అనుకుంటే చాలు. అందుకేనేమో ఇంట్లో ముసలివారి మీద విసుక్కుంటూ ‘హాయిగా రామా కృష్ణా అనుకుంటూ కూర్చోవచ్చు కదా’ అంటారు, వారి ‘టర్న్’ వచ్చేటప్పుడు గానీ తామన్నదాని విలువ అర్థం కాదు. సినీ యుగం- శ్రీరామ పరం ఒకరు సముద్రాల రాఘవాచార్య , మరొకరు దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఇద్దరూ ఉద్దండ కవులు. ‘లవకుశ’ చిత్రంలో సముద్రాల వారు రామాయణమంతా మూడు హరికథల రూపంలోమొత్తం పదమూడు చరణాల్లో సంక్షిప్తం చేశారు. స్వర పరచిన ఘంటసాల కాక సుశీల,లీల లు వాటిని గానం చేశారు. సముద్రాల వారి ఆఖరి రచన ‘శ్రీరామకథ’ చిత్రంలోని ఇరవైఒక్కచరణాల సంక్షిప్త రామాయణ గానమే. దానిని అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్నగాయకుడు బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. కృష్ణశాస్త్రి గారు బంగారుపాప, శ్రీరామ పట్టాభిషేకం చిత్రాల్లో రామాయణ ఇతివృత్తాలు రాసినా భక్త శబరి చిత్రం లో లలితమైన పదాలతో ‘అనరాదా శ్రీరామ యనీ’, ‘ఏమి రామకథ శబరీ శబరీ’, ఏమి రామకథ వ్యథయై సుధయై’ వంటి ముచ్చటైన మూడు గీతాలు రాశారు (చూడండి- కనులు చదివినా పాటే). శబరి పాటలకి శాస్త్రిగారు ఈ చిత్రంతోనే నాంది పలికారు. వేరొక సందర్భంలో ఒక చిత్రంలో ‘చీకటి వేళల నడిపించేది- రాముని చేయూత, ఒంటరి ఘడియల వినిపించేది రాముని పిలుపు’ అని ప్రవచించారు శాస్త్రిగారు. చీకటివేళ, ఒంటరి ఘడియ- నిజమే ఎంత నరకమవీ! స్వకీయం, స్వరచితం: శ్రీరామ నామం మదిలో మెదిలినప్పుడు నేను సైతం కొన్ని గీతాలు రాయక పోలేదు. రాకూడదటయ్యా రామయ్య ! మా ఇంటికి ఏ కొసనో ఉంటేనేం, రామ! ఒక నాటికి |రా| అయోధ్య వాసమంతటి /అందమైనది కాకపోయినా అడవి పర్ణశాల కంటే /పొందికైనది లేకపోయినా |రా| ఆజాను బాహుడివి ఆదిలోనే నీకు అడ్డుపడునేమో ఈ మా ద్వారము మా జానకి తల్లి ఎదనుండే నీకు అగపడదేమో మా ఈ నేరము |రా| కాలు మోపిన చోటు కాంచు కొత్త రూపు చేవ్రాలు దాల్చు చేయి నిమురు వీపు కోరి పిలిచే మా అందరి తుది కోరిక దీర్చు కాసేపు ఊరి వారికి తెలియనట్టు ఉత్తుత్త వేషంలో రాబోకు (పాట రచనా కాలం: 1994) రాముణ్ణి రమ్మంటే రాడు కదా. కాని క్రిందిటేడు స్వర జానకి పూణే వచ్చారు. ఆమెకైనా అంతే, ఆమెను అపురూపంగా చూసుకునే భర్త రాం ప్రసాద్ కొన్నేళ్ళ క్రితం కాలం చేశారు. అక్కా అని నా శ్రీమతి ఆవిణ్ణి చనువుగా సంబోధిస్తుంది. ఆత్మీయంగా ఆమె చేతికి ముందు రోజు రాత్రి రాసుకున్న నా పాట ఒకటి తెచ్చి ఇచ్చాను. ఈ ప్రత్యేక జానకమ్మ గీతం పేజీ మీద ఆమె చేవ్రాలు చూడాలని ఉందా? చూడండి- ప్రతి రాతా ప్రసిద్ధమే! శ్రీరామ నామ మహిమ అంటే ఆషామాషీ కాదు. పరిమళ్ ఫడ్కే అనే మా నాట్య శిష్యుడు మార్చి మొదటివారం ఇంటికొచ్చి ‘హిందీలో రాశాను. మీరు తెలుగులో రాసి ఇవ్వండి. నాట్య రూపకం లాగ శిష్యుడు ప్రదర్శిస్తాడు’ అని సీతా వియోగంతో ఉన్న శ్రీ రాముడి అంతర్మథనాన్ని తనదైన ప్రాసానుప్రాసలతో రాసిన పాట కాయితం ఇచ్చి వెళ్లాడు. అందులో కొంత కొరత ఉందని గ్రహించి కొంత చనువుతో తిరగ రాశాను తెలుగులో (చూడండి పాట=తిరుగు టపా). శ్రీరాముడి ఉన్నత అస్తిత్వాన్ని కాపాడుతూనే ప్రాణంలో ప్రాణమైన సతి లేని కారణంగా ఆ మహనీయుడి మనసులో చెలరేగుతున్న అలజడిని వ్యక్తం చెయ్యడం – నే చేసిన పని. ఒకనాటి నా రచన ‘శ్రీరామ నామ గానామృతం’ ‘ప్రతి రాతా ప్రసిద్ధమే’ లో సిద్ధంగా ఉంది, చూడగలరు. కనులు మూసినా పాటే- సూర్య వంశము నందునా --- కోలాట గీతం కోలాహల గీతం కాదు. 'ఆదర్శ కుటుంబ' వ్యవస్థలో తల ఎత్తే అలజడులకి రామ గాధ పరిష్కార మార్గం చూపగలదని ఆశించారు అందులో. ముక్తాయింపు: త్యాగయ్య ‘వెడలెను కోదండపాణి’ అన్న కీర్తన రాయలేదని ఒక మెలిక ఉంది. అందుకే సాహసించి దానిని అనుకరించి నే రాసిన దేమిటో ఈ ఏప్రిల్ 5 న చెబుతాను. అంతవరకూ ‘ఏమి ‘సేతు’ రా లింగా--- జాతి గౌరవం ‘'రామసేతు’ అని దేశం చెప్పదేమి గర్వంగా?’ అని తత్త్వం పాడుకుందాం. -తాతిరాజు వేణుగోపాల్, 01 ఏప్రిల్ 2012
1 Comment
G J RAO
9/4/2012 05:16:16 am
ramudu gurinchi chala baga varnincharu!!!!
Reply
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|