మునుపటి నా మాట
మూడు పదుల మాయ వయసు .... ఆ మహనీయునికి మాత్రమే తెలుసుమహర్షులు, మహనీయులు, మహాత్ములు, మహానుభావులు, మామూలు మనుషులు- జాగర్తగా చూస్తే ఇది భూమ్మీది మానవుల మధ్య ఉన్న పంచ మకార విభజనగా కనిపిస్తోంది కదూ. పంచ మకారమంటే మదం, మోహం, మత్సరం, మదిర, మగువ అనే అయిదు మనోవికారాలు అన్నది మరవకూడదు. వీటికి దూరంగా ఉండాలన్నది దైవజ్ఞుల ప్రవచనం. వీటిని అధిగమించి మనగల్గిన వారే మనం ముందు చెప్పుకున్న మకార పంచకంలోని మొదటి నలుగురు. అంటే మామూలు మనుషులు నిత్యం మనో వికారాలతో జీవిస్తూ ఉంటారన్న మాట. ప్రాత:స్మరణీయుడు అనదగ్గ మహానీయులు ఆది శంకారాచార్యులు. వైశాఖ శుక్ల పంచమి నాడు శంకరుల జయంతి. శంకరులు ఎప్పటి వారు! కేవలం మూడు పదుల కాలం జీవించిన భారతీయ సమైక్యతా మూర్తి ! శంకరులు కేరళ లోని కాలడి ప్రాంతంలో ‘నంబూద్రి’ వంశాంకురంగా జన్మించి ఇవాళ ఆంధ్రుల తలపుల్లో కొలువున్నారు. కారణం – భద్రాచలం కొండపైన ‘ఎటపాక’ వద్ద ‘అతిరాత్రం’ యాగం నంబూద్రీ ల సమక్షంలో జరుగుతుండడమే. [స్వగతం: సమాజ శ్రేయస్సు కోసం పరిపాలకుడు సంకల్పం కలిగి ఉండి యజ్ఞం తలపెట్టాలి. ఆ యజ్ఞానికి తానే సతీసమేతంగా ‘యజమాని’ (యజ్నస్వీకర్త) అవ్వాలి. ఈ ‘అతిరాత్రం’ యాగం పన్నెండు రోజులు జరుగుతుంది. ఇది 2012 వ సంవత్సరం కావడం వల్ల పన్నెండు సంఖ్యకు విలువ పెరిగింది. మనకున్న పన్నెండు మాసాలకి ఒక్కొక్క రోజు చొప్పున పన్నెండు రోజులు తీసుకోవడం ఇందులోని ప్రత్యేకత. శ్రీ రాముడు సతి సీతతో, అనుజుడు లక్ష్మణుడి తో వనవాసంలో గోదారీ తటాన నెలవు ఏర్పరచుకున్నప్పుడు మాయావి రావణుడు సీతనపహరించడం, మార్గ మధ్యమం లో ‘జటాయు’ రావణుడితో శక్తికి మించి పోరాడి రెక్కలు తెగి రామపాదాల చెంత పడిపోయి ఎవరు ఏ దిశలో సీతమ్మను ఎత్తుకు పోయారో చెప్పి అసువులు బాయడం, తరువాత శ్రీరాముడు ఆ విగత జీవికి తగిన కర్మకాండ జరపడం ఇదంతా ఈ భద్రాచల ప్రాంతంలోనే సంభవించడం వల్ల ఈ ప్రాంతం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ‘అతిరాత్రం’ యజ్ఞంలో ఉపయోగించే ముడి సరుకు రసాయన మిశ్రమం కాదు, అంతా ఓషధ గుణాలున్న వన్య విశేషమే. ఇది ఎంత మాత్రం ‘ప్రదూషణ’ కారకం కానే కాదు. ‘ఇన్ని కోట్లా ఒక యజ్ఞానికి!’ అని నొసలు చిట్లించుకునే వారు మిగతా ఎన్ని పనికిరాని పనులకి కోట్లు నీళ్ళలా ఖర్చౌతున్నాయో ఆలోచించాలి. ఒక సంప్రదాయం మంచి కోసం అయినప్పుడు అడ్డుపడడం తగని పని. ఇందులో శాస్త్ర మర్మమేముందీ అని గోళ్ళు గిల్లుకునేవారు పరిశోధనలకి పూనుకోవాలి]. శంకరులవారు నిజంగానే ‘శంకర’ అంశనుంచి జన్మించారని, ఆ విషయాన్ని పరమేశ్వరుడు పార్వతీ దేవికి విన్నవించుకున్నట్టు ‘శివ రహస్యం’ గ్రంథం చెబుతోంది. శంకరుల అసాధారణ ప్రజ్ఞా పాటవానికి కారణం అతని కైలాస యాత్ర లో అతనికి కలిగిన పంచ లింగ దర్శనం అని అంటారు.
శంకరులు జీవితకాలమంతా కేరళనుండి గుజరాతు , అటునుంచి కాశీ, ఇలా సకల దివ్య క్షేత్రాలు దర్శిస్తూ, భాష్యాలు రచిస్తూ, శిష్యుల సాయంతో మానవాళికి అందిస్తూ కడపటి రోజులు కంచి క్షేత్రంలో గడిపారు. శంకరులు మన చుట్టూ అల్లుకుని ఉన్న సంప్రదాయం మీద తిరుగుబాటు ఎన్నడూ ప్రదర్శించలేదు. చెడు ఉంటే సంస్కరించడమే తగిన పని అని ఆ విధమైన అవసరమొచ్చినప్పుడు అలానే ఆచరించారు. కొన్ని పూజా విధానాలని పరిపుష్టం చేశారు. స్వయంగా జ్ఞానియైనా అహంకారి కారు. ఒక గురు సమక్షంలో తన జ్ఞానం మెరుగు పడాలని తనకు తానుగా గురువుల అన్వేషణకి నడుం కట్టుకున్నవారు. అయిదేళ్ళ బాలుడిగా ఉన్నప్పుడు శంకరులు ‘కనకధారా స్తవము’ స్తుతుంచి లక్ష్మీదేవి కృపకు పాత్రుడయ్యారు. భిక్షాటనంలో ఒక పేద ఇల్లాలు ఏమీ ఇవ్వలేని స్థితిలో ఒక ఎండు ఉసరికాయ ఇస్తే శంకరులు ఆమె పేదరికానికి చలించి లక్ష్మీ దేవిని స్తుతిస్తే కనక వర్షం కురిసింది. ఆ చిన్న వయసులోనే శంకరులు ఇంటినుంచి పారిపోయి సన్యాసులు కాలేదు. తల్లి ఆర్యాంబని జాగ్రత్తగా చూసేవారికి బాధ్యత లప్పజెప్పి ఉత్తర దిశగా గురువుల దర్శించే కార్యక్రమంలో ముందు నర్మద వైపు తరలిపోయారు. శంకరుల తొలి గురువులు గోవింద భగవత్పాదులు. సాధారణమనిపించే ‘నీవెవరవు?’ అని గురువు వేసిన ప్రశ్నకి శంకరుల సమాధానం ‘ పంచభూతముల్లో దేనినీ కాదు, పంచేంద్రియాల్లో దేనినీ కాదు. పరమానంద స్వరూపుణ్ణి’. ఇది చాలు గురువు మెచ్చే శిష్యుడు అని ఎవరైనా ఉంటారా అంటే చూప గలిగే ఆధారం. గురువు సైతం ఇతడే తనకు తగిన శిష్యుడు అని పొంగిపోయారు. నన్ను మించిన జ్ఞానియా అని ఈర్ష్య పొందలేదా గురువు. వీరి దగ్గర అభ్యసించిన విద్యనే శంకరులు ‘వివేక చూడామణి’ పేరిట గ్రంధస్థం చేశారని ప్రతీతి. ధర్మ శాస్త్ర మర్మాలన్ని అవలీలగా అప్పచెబుతున్న శిష్యుడు చీకటి భవిష్యత్తుకి కర దీపిక కాగలుగుతాడు అన్నది గురువుల నమ్మకం. శంకరులు ఏ మాత్రం తన విద్వత్తుకి గర్వ పడకుండా అణకువగా ఉంటూ తన జ్ఞాన తృష్ణని అడుగడుగునా ఎదురయ్యే ధర్మ సందేహాల రూపంలో తీర్చుకున్నారు. అలనాటి శంకరులనుంచి నేర్చుకోవాల్సినది ఈ తరానికి ఎంతో ఉంది. గురువుల ఆదేశం మీదట శంకరులు కాశీ వెళ్ళి ‘ఉపనిషత్తు’ల మీద ప్రసంగాలు చేస్తే ఎందరో ఆయనికి శిష్యులయ్యారు. ఇక్కడే ఒక వృద్ధ పండితుడు ఒక కఠినమైన సంస్కృత వ్యాకరణ సూత్రాన్ని పదే పదే వల్లె వేస్తూ శంకరులవారికి కనిపిస్తే ‘జీవన తుది సమరంలో పోరాటం సాగిస్తున్న వాడివి, నీకు కావాల్సింది వ్యాకరణం కాదు, గోవింద నామ స్మరణం’ అని అప్పటికప్పుడే పన్నెండు శ్లోకాలు చెప్పారు. వీటిని ‘మోహముద్గర’ అంటారు. కూడ వచ్చిన శిష్యులు మరో పధ్నాలుగు శ్లోకాలు చేర్చారు. వీటిని ‘చతుర్దశ మంజరికా స్తోత్రం’ అంటారు. మొత్తంగా వినిపించే భజగోవింద శ్లోకాల సంఖ్య 31. ఈ సంఖ్య ఆదిశంకరుల ఆయువును సూచిస్తుంది ఈ క్రమంలో ఏవి శంకరుల వారి శ్లోకాలో, ఏవి శిష్యులు పలికినవో చెప్పడం కష్టం. ఎందుకంటే గురువు శైలికి శిష్యుడు అలవాటు పడితే గురువుకి నకలు మాత్రమె అవ్వగలడు. అలాగని శంకరుల శిష్యులు సామాన్యులు కారు కనకనే వారు ఒక్కొక్క శిష్యుడిని ఒక్కొక్క క్షేత్రానికో, పీఠానికో అప్పజెప్పి సంస్కృతీ సంరక్షణా భారాన్ని అందరి మీదా మోపారు. భజగోవింద శ్లోకాలు ఏదో ముదిమినాటి గొణుగులు కావు. అవి అన్ని వయసుల వారికి హెచ్చరికలు. వయసు గడిచిన కొద్దీ మనసు పొందే పరిపక్వతలో ‘దైవ’ స్మరణం మరవ కూడదని, తుచ్చమైన వాటి చుట్టూ మనసును వృధగా తిప్పడం తగదని మెత్తగా మందలిస్తూ ఉంటాయి. తత్వంతో పాటు వినిపించే సూక్తి ప్రతి శ్లోకానికి స్ఫూర్తి. శంకరులు దర్శించిన ఏ దేవీ క్షేత్రమైనా వారి అద్భుత స్తోత్ర వర్ణనంతో ప్రకాశించేది. శ్రీ భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం – కేవలం పదిహేడు శ్లోకాల సమ్మేళనం. అందులో అమ్మవారి ఆనంద లహరి, చిదానంద లహరి, సౌందర్యలహరి ప్రధానమైనవి. భజగోవింద శ్లోకాల్లో ఏవి కూడదో, ఎవరిమీద మనసు నిలపాలో చెప్పిన శంకరులు ‘అమ్మ’ని ఈ లహరుల్లో వర్ణించారు కదా అని కొందరు శంకించ వచ్చు. ఒక స్పష్టమైన, నిర్దుష్టమైన రూపంతో ‘అమ్మ’ సాక్షాత్కరిస్తే పసిపిల్లవాడి దృష్టంతా, మనసంతా అమ్మపైనే ఉంటుంది. అమ్మనుంచి వచ్చి అమ్మను చేరడమే జీవిత చక్రం! ‘పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం’ అని శంకరులవారే స్పష్టం చేశారు. దైవనామస్మరణంతో మరణం నాటికి ‘పునర్జన్మ’ పొందే బాధ ఉండదని తెలియజేశారు. భజగోవిందం ఎటువంటి తాత్పర్యం లేకుండా గానం చేస్తేనే అంత శక్తిని ఇస్తోందే, అటువంటిది తాత్పర్యం తెలుసుకునీ శ్లోకాలు మననం చేసుకుంటే అవి మన పరుగుల ప్రపంచంలో ‘స్పీడ్ బ్రేకర్స్’ అవుతాయి. మనల్ని నియంత్రిస్తాయి. ఈ నియంత్రణ మంచి కోసమే కాని విచ్చలవిడి స్వేచ్ఛకి భంగం కలిగించే ఇనప సంకెల కాదు. గతవారం పుస్తకాల గురించి చెప్పుకుంటూ ‘ఎమెస్కో’ వారిని తలుచుకున్నాం. అనుకోకుండానే ఆదిశంకరుల వారిని తలచుకోగానే నా చేతులు అందుకున్న రెండు చిన్న’భజగోవిందం’ పుస్తకాల్లో ఒకటి ఎమెస్కో వారు 1975 లో ప్రచురించినదే కావడం నన్నూ ఆశ్చర్యపరచింది. శ్రీ ధర్మవరం వేంకటరమణారావు గారు ఒక భాగాన్ని చక్కని తేటగీతులతో (పద్యరూపంలో) రాశారు. ఎక్కడా శంకరుల వారు వెలిబుచ్చిన భాష్యాలని తప్పు దారి పట్టించలేదు. మరో భాగంలో ప్రతి శ్లోకానికి తెలుగు గేయం అందించారు. ఉదాహరణకి- పద్య రూపంలో : ఆటపాటల బాలున కాశ మెండు, తరుణునకు( జిత్తమెప్పుడు( దరుణి యందు, వృద్ధు( డెప్పుడు( జింతచే( బీడితుండు; ఇంక నెవ్వా(డు భగవంతు నెంచువా(డు? అని చెబుతూ గేయ రూపంలో బాల్యమంతయును ఆటల( గడచును, పడ(తులతో యౌవనమరుగున్, వార్ధక్యము చింతాకుల, మి(క పర మాత్మతత్వమును ఎవ(డెరుగున్? అంటారు. ఆచార్య పప్పు వేణుగోపాలరావుగారు ‘భజగోవింద శ్లోకాలు’ పేరిట 1990 ల్లో ప్రచురించిన చిన్ని పుస్తకంలో చక్కని తేట తెలుగు వ్యాఖ్యానం చేశారు. బాలాస్తావాత్ క్రీడాసక్త: తరుణ స్తావత్ తరుణీసక్త: వృద్ధస్తావత్ చిన్తాసక్త: పరమే బ్రహ్మణి కో పి నసక్త: అన్న ఈ శంకరుల వారి శ్లోకాన్ని తెనిగిస్తూ రావుగారిలా అంటారు- ‘బాల్యాన్ని ఆటలయందలి ఆసక్తి తోనూ, యౌవనాన్ని యువతుల మీద ఆసక్తి తోనూ, వృద్ధాప్యాన్ని విచారంతోను వెళ్ళబుచ్చుతారు కానీ, ఎవ్వరూ పరబ్రహ్మం మీద ఆసక్తి జూపరు గదా!' ఆచార్యులు ప్రహ్లాదుడు నిర్వచించిన తొమ్మిది భక్తి మార్గాలు ప్రస్తావిస్తూ ‘శ్రవణం’ తొలిది, ‘ఆత్మనివేదనం’ చివరిది అని గుర్తు చేశారు. ‘భజగోవిందం’ అని అనడం వల్ల శ్రవణం, కీర్తనం, స్మరణం అనే మూడు మెట్లు ఒక్కసారే దాటేయగలుగుతున్నాం అని అంటారు. మహా గాయని భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారు గానం చేసి ఏనాడో వినిపించిన ‘భజగోవింద’ స్తోత్రాలకి నకళ్ళు రాలేక ఆమె కీర్తి చిరస్థాయి కావడం హర్షదాయకమే. ఆమె మనమధ్య భౌతికంగా లేకపోయినా మనకీ. భగవంతుడికీ ‘మధ్యేమార్గం’గా ఇప్పటికీ ఉన్నారు. భజగోవింద శ్లోకాల సారాంశం ఇలా ఉంటుంది... సద్బుద్ధి,కర్మ,ధనార్జన ; శరీరం,మోహావేశం,మనసు; రోగం,మోసం,శోకం; ధనావశ్యకత, అభిమానం,జీర్ణ శరీరం; కుశలం, ప్రాణగతం,భీతి; బాల్యం.యౌవనం.వార్ధక్యం; సంసారం, స్వయంకృతం, ఆలోచన; సజ్జన స్నేహం,నిశ్చల బుద్ధి, జీవన్ముక్తి; కామ దహనం, ధన నాశనం, తత్వ విచారం; గర్వం,మాయ, బ్రహ్మపదం; కాల చక్రం, ఆయువు, ఆశ; ధనాశ, భవసాగరం,సజ్జనసాంగత్యం; రూపదర్శనం, వేషం, మూఢత్వం; జర, ఊతం, కోర్కె; అగ్ని, వసతి, ఆశ; స్నానం,జ్ఞానం, ముక్తి; విరాగి సుఖం; బ్రహ్మానందం; భగవద్గీత, గంగాజలం, మురారి పూజ; జన్మ, సంసారం, మురారి కృప; యోగి, బాలుడు, పిచ్చి ఆనందం; ప్రపంచం,కల,ఆలోచన; సహనం, సమత, విష్ణుత్వం ; వేర్పాటు,సంధి, అజ్ఞానం; ఆత్మదర్శనం, ఆత్మజ్ఞానం; గీతాగానం, సజ్జన సాంగత్యం, దీన జనోద్ధారణం; సుఖం,రోగం,పాపం; ధనం, సుఖలేమి,భయం; ప్రాణాయామం,విచక్షణ, ఏకాగ్రత; ఇంద్రియ నిగ్రహం, మనో నియంత్రణ, సంసార ముక్తి. ఇందులో ప్రధానంగా కనిపించేది -సంసార బంధంలో గిలగిల్లాడుతూ ధన వ్యామోహం, స్త్రీ వ్యామోహం, మోసపూరిత జీవనం, గర్వం, వేషధారణ, ఆశ, సుఖం, రోగం, పాపం వంటి పాశాలు కూడా పేర్చుకునీ జీవితం వ్యర్థం కావించుకోవడం ఎందుకు? సజ్జనులతో స్నేహం చెయ్, నిశ్చల బుద్ధిని కలిగి ఉండు, సహనం,సమత పెంపొందించుకో, ఆత్మదర్శనం చేసుకో. ఆత్మానందం పొందు. ఆత్మజ్ఞానం కాపాడుకో. విచక్షణ కలిగి ఉండు. కాసేపు వేర్పాటు, కాసేపు సంధి అంటూ అజ్ఞానంలో కొట్టుకు పోకు. అందరినీ నీవాళ్ళుగా చూడు. భగవద్గీత గానం చేసుకో. మురారిని భజించు. ప్రాణాయామం చెయ్. ఏకాగ్రత పెంచుకో. మనసును అదుపులో పెట్టుకో. దీనులకి దానం చెయ్. తప్పకుండా నారాయణుడు కరుణిస్తాడు- అనే ప్రవచనం.. జీవన విధానమంతా నాటకం, నటన అనేవి చూచాయగా సూచించారు భజగోవింద శ్లోకాల్లో శంకరులవారు. వీటినే సరళం చేస్తూ తాళ్ళపాక అన్నమాచార్యులు ‘నానాటి బ్రదుకు నాటకము’ అనే సంకీర్తనం పాడి శ్రీవేంకటేశుడొక్కడే కడపటి ముక్తిని ప్రసాదించేవాడని చెప్పారు. న్యూటన్ మూడు గతిసూత్రాల గురించి చెప్పడం భౌతిక శాస్త్ర గొప్పదనంగా పేర్కొంటాం. State of rest, State of uniform motion; action-reaction అవి. అంతకుముందే గ్రహతారకల అధ్యయనం చేసిన మన పూర్వీకులు ‘రాశి’ అనేదానిని నిర్వచించి ‘స్థిర రాశి’, ‘చర రాశి’ అనే రెండు వర్గాలతో పాటు మూడవదైన ‘ద్విస్వభావ రాశి’ ని కూడా చెప్పారు. అంటే rest, motion తో పాటు relativity ని కూడా చెప్పేశారు. భౌతిక ప్రపంచం, మానసిక ప్రపంచం ఈ సంఘర్షణల తోనే నిత్యం నిలిచి ఉంటాయి. కొందరు స్థిరమనుకునేది మరికొందరికి చంచలం. మరికొందరిది ఇటా అటా అనే ద్విస్వభావం. ఇటువంటి దశల్లో క్రుంగిపోక ఆది శంకరులవారి జ్ఞాన బోధతో ఊరట పొందాలి. శంకరులవారిని వెక్కిరించేటంత పిచ్చిపనికి ఎవరూ పాల్పడలేదు. కాని విజ్ఞానమత్తులో ఒరిగిపోయి జ్ఞానం కోల్పోయి వ్యంగ్యాస్త్రాలు సంధించిన వారు లేకపోలేదు. ’మాయంటావ్ –ముద్దుల వేదాంతీ’ అనే వింత ప్రకటనలు రాకపోలేదు. సినిమా విజ్ఞానం సహజ సంస్కృతిని కొంత మాయ చేసింది. ఆనందం, పరమానందం, బ్రహ్మానందం, భజ గోవిందం అనేవి సరదా మాటలయ్యాయి. ఆ మాటలు పాటలయ్యాయి. కొన్ని ఇజాలు ఎలాగోలా భారత గడ్డమీదికి దూసుకొచ్చి పరిస్థితిని మరింత దిగజార్చాయి. నవ్యత్వం అనే పేరు పెట్టుకునీ కవులు వేరే దారులు వెదుక్కున్నారు. కవి శ్రీశ్రీ ‘మరోప్రపంచం పిలిచింది’ అనే నినాద కవిత్వంలోనూ ‘భజగోవిందం’ మీటర్ ని అనుసరించక తప్పలేదు. ఎందుకంటే అప్పటికది అంతగా ఆకర్షణీయంగా ఉండేది. ఆచార్య ఆత్రేయ వంటి కవి, నాటక రచయితకి జన్మ సిద్ధాంతం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండేది. వీలైనప్పుడల్లా ఆయన ఆ ప్రసక్తిని తన పాటల్లోకి తీసుకొచ్చేవారు. శంకరులవారు ‘పునర్జన్మ’ తప్పనిదైనా మురారికృప కోరుకుంటే దానినుంచి విముక్తి పొందుతావు అన్నారు. ‘ముక్కోటి దేవుళ్ళు మురిసీ సూస్తుంటారు, ముందు జనమ బందాలు ముడియేసి పెడతారు’ అంటారు కవి. ఏ ఆశ, కోరిక వెంట తరుముతూ మన కొంప కొల్లేరు చేస్తాయో వాటికి దూరంగా ఉండాలన్నది శంకరులవారు చేసిన హిత బోధ. కాని మనకి కవి గారన్నట్టు ‘కోరికే ఒక జన్మ కావాలని, అది తీరకే మరుజన్మ రావాలని’ ఉబలాటం హెచ్చు. ఈ జన్మలో సజ్జన సాంగత్యం విడవొద్దని శంకరులు అన్నారు. ‘చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది, జనమ జనమకూ అది మరీ గట్టిపడతది’ అంటారు కవి. మనసులు,మమతలు వీటి వెంట వెంపర్లాడి దేవుని నిర్ల్యక్ష్యం చెయ్యొద్దన్నారు శంకరులు. ‘మరుజన్మ ఉన్నదో లేదో, ఈ మమతలప్పుడేమౌతాయో – మనిషికి మనసే తీరని శిక్ష , దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష’ అని పాత్ర స్యయంకృతాపరాధాన్ని దేవుడి మీదికి నెట్టేస్తాడు కవి. వ్యామోహమా, తస్మాత్ జాగ్రత్త అంటారు శంకరులు. ‘చిదుమని చెక్కిలి చిందే సిగ్గుల్లో /సందెవేళ అలముకునే ఎర్రజీర చూస్తున్నా/ ఆ ఎర్రదనంలో ఆ కుర్రతనంలో / వెనక జన్మలెన్నెన్నో పెనవేసిన వెచ్చదనం కంటున్నా’ అంటారు కవి. అయితే కవికి తెలియనిది కాదు ఇన్ని లంపటాల మధ్య తోసుకుంటూ బతుకు బండిని పోనిచ్చినా ఎప్పటికైనా కైవల్యం ఇచ్చేది ‘ఏడేడు జన్మల పాపముల ఎడబాపి బ్రోచే’ దైవమే అని. కొందరు అదే సినీ విజ్ఞాన మాధ్యమంతోనే శంకరుల వారి జీవిత చరిత్రని తెరకెక్కించగలిగారు. అయ్యరు లాగ అంతా అటువంటి సినిమాలు తియ్యరు. ఆయన పేరులో జీ.వి ఉంది. సినీ జీవితంలో మేధావుల జీవిత చరిత్రలు చూపగల్గటంలో ఆయనకుండే శ్రద్ధ అందరికీ ఉండదు. అలా వచ్చిన వాటితో, ఆయన ఇచ్చిన వాటితోనే తృప్తి పడాలి. కనులు చూసినా పాటే- ఆదిశంకరాచార్య సంస్కృత భాషా చిత్రం నుంచి సన్నివేశం ; ఎం.ఎస్ వాణి : భజగోవిందమ్ కనులు మూసినా పాటే- ఎం.ఎస్. వాణి: అన్నమయ్య సంకీర్తనం – ‘నానాటి బ్రదుకు నాటకము’ -డా. తాతిరాజు వేణుగోపాల్, 29 ఏప్రిల్ 2012
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|