మునుపటి నా మాట
పూర్వ రంగం : ఇద్దరు స్నేహితుల మధ్య పాన ఘోష... 1:‘మత్త’ – అనే సంస్కృత అవ్యయం సంస్కృతార్ధంలో వాడితే ‘నా వలన’ అనే అర్ధం వస్తుంది. అదే ‘మత్త’ అనే విశేషణం ఉంది చూశావూ , మత్తెక్కినది, గర్వించినది అని అర్ధమిస్తుంది. అలా వచ్చి చేరినదే మన భాషలోని ‘మత్తు’ అనే వైకృత దేశ్య విశేష్యము. అంతేగానీ ‘నా వలన మత్తెక్కినది’ అని మాత్రం అనకు. ఎంత పార్టీ అయితే మటుకు పుచ్చుకోవడమేనా? నాలా మడి గట్టుకోవచ్చుగా? 2: అబ్బబ్బ, ఏదో చిన్న తప్పు చేస్తే మరీ దేవ భాష, మన భాష అన్నీ తీసుకొచ్చి నన్నిలా ఎద్దేవా చెయ్యడం నీకు తగదు సుమీ. 1: ఇప్పుడు సుమీ అంటున్నావు. నిన్న రాత్రి సునామీ. అవునా కాదా? అయినా నీకెలా గుర్తుంటుందిలే? అప్పుడు నీ స్టేజే వేరు. ఒకటే మంపు, ఒకటే కంపు! 2: మంపు అంటే? 1: అదే – మత్తు. 2: అలాగా ? కంపు అంటే వాసన, అంటే సువాసన అని పూర్వం కవులు పద్యాల్లో చెప్పేవారు. తెలుసా? 1:ఎవరికంపు వారికింపు. కంపు అనగానే శ్రీశ్రీ గారి ఛలోక్తి గుర్తొస్తుంది. ఆయన ఇలా అన్నారు- ‘ సిరిసిరి మువ్వ తరువాత చాలామంది శత’కంపు’ పద్యాలు రాస్తున్నారు’ . నవ్వేవా? సరే గానీ ప్ర.సా.దు తెలుసా? 2:తెలుసు గానీ , నేను మనసారా దుకాణాలకి వెళ్ళి ‘మనసా రా’ అని కవ్వించే సారా తెచ్చుకోను, మనీ కోల్పోను. ఏదో ఇలా ఎదుటవాడు మన పర్సు కత్తిరించక పోస్తుంటే నోరెళ్ళబెట్టుకోవడమే. 1:అది కూడా ఎందుకూ? మంచినీళ్ళో, ఆ రేంజ్ ని దాటి ఆరెంజ్ జూసో అందుకుంటే పోలా? నాకు కొందరు సినీ హీరో హీరోయిన్ల మీద తెగ జాలి. కొందరు ఏదో సరదాగా మిత్రుల బలవంతం వల్ల అలవాటు చేసుకునీ, మరికొందరు అణచుకున్న అవమాన భారం నుంచి తేలిక కావాలనుకునీ ఆ ద్రవం ఉపద్రవం చేసేంతవరకూ రోజుల తరబడి క్షార గరళం మింగుతూ నిక్షేపం లాంటి నట జీవితాన్ని వృధా చేసుకున్నారు,కుంటారు. మామూలు మనుషుల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఇదిగో ఇలా కాస్తో కూస్తో నటనలోనూ, ఇతర ప్రజా ర్రంగాల్లోనూ పేరు సంపాయించుకునేవారు అలా బలి కావడం న్యాయమా చెప్పు? 2: దెబ్బకి దెయ్యం వదిలింది అన్నట్టు నా మత్తుని పూర్తిగా దులిపేశావ్ నీ క్లాసు పీకుడుతో. 1: వార్నీ. హితబోధ చేస్తే క్లాసు పీకుడంటావా? గమ్మత్తేమిటంటే ప్రేమ మత్తు గురించి ఎవరి అనుభవాలు వారివి. అయినప్పటికీ పాపం వెర్రివాడు ఆ జమిందార్ బిడ్డ దేవదాస్ గురించి మూడు నాలుగు తరాలుగా అంతా చెప్పుకునేవారే. పొరపాట్న పాట్నాలోగానివ్వు, భవానీపాట్నాలో గానివ్వు ఎవడో భగ్న ప్రేమికుడైపోతే వాడి మొహానికి ‘పాపం దేవదాస్’ అనే లేబిల్ అంటించేస్తాం, ఏదో ఇంక వాడు మిగతా జీవితం అంతా తాగుతూనే గడిపేస్తాడని. వాడు ఎంచక్కా చేతులూ నీతులూ దులిపేసుకునీ ఉంటాడని ఎవరికెరుక? కాబట్టి ప్రేమకీ, తాగుడుకీ నో లింకనుకో. ఒకసారి లొట్ట వెయ్యగానే ఇంక మరీమరీ చవులూరించి ఏకంగా ఇంట్లో ఫ్రిజ్ లో దాచుకునేంత ధైర్యాన్నిస్తుంది ఆ వ్యసనం. ‘పాపా నా కెందుకు స్వరాలు సాపానీసా, పీపాకే నేను బానిస’ అని రాగం అందుకుంటాడు కూడా. 2: ఆ రాగం పేరు ‘మద్య’ మావతి అయి ఉంటుంది. 1: ఇప్పుడెలాగూ వత్తులు లేని భాష మన తెలుగు భాష, సారీ టెల్గూ బాష కనుక ఈ మధ్య ‘మధ్య’ కాస్త ‘మద్య’ అయిపొయింది. ఆ రోజుల్లో కాబట్టి తాగినా చక్కటి తెలుగు మాట్లాడేవాడు దేవదాసు. 2: దేవదాసు పాత్రలో అక్కినేని గారు అంత సహజంగా నటిస్తే ఆయన నిజంగానే తాగేరేమో అనుకునేవారట. పెరుగన్నం, ఆవకాయ తిని కాస్త నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఆ డైలాగులు అప్పజెప్పేను అని ఏ.ఎన్.ఆర్. చెబుతుంటారు. అందుకే ఆయన మహా నటుడు. 1: ‘నటన’ అంటే ప్రతి విషయము లోనూ అనుభవమున్నది అని అర్ధం కాదు. నటనము అంటే కపట నర్తనము అని నిఘంటువు చెబుతుంది. నటన అంటే గుర్తొచ్చింది. మా గురువొకాయన పార్టీ లో భలే నటిస్తారనుకో. ఓ చేత్తో పెగ్గుచ్చుకునీ ఊరికే అటూ ఇటూ తిరుగుతూ వాళ్ళనీ వీళ్ళనీ పలకరిస్తూ ఉంటారు కానీ డేంజర్ లో పడరు. పెగ్గు తీసుకోలేదనుకో ఆయన్ని సిగ్గు లేకుండా సతాయిస్తారు కదా, అదీ తెలివి. 2: గొప్ప అప్ర’మత్తుడు’ అన్న మాట. 1: కరెక్ట్ గా అన్నావ్. ప్రమత్తుడు అంటే ప్రమాద పడినవాడు. అ-ప్రమత్తుడు అంటే ‘అలర్ట్’ గా ఉండే వాడు. 2: ఎంతసేపూ మత్తు కలిగించేది లిక్విడేనా? సాలిడ్ ఉండదా? 1: వెబ్ దునియా దంతా ‘సాలీడు’ తత్త్వం. ప్రపంచాన్ని తన వలలోకి ఈడ్వగలదు. గబ్బు ప్రపంచానిది సాలిడ్ + లిక్విడ్ తత్త్వం. లిక్విడ్ తో పాటు ఐస్ ముక్కలు ఉంటాయిగా. ఈ మేలు కలయిక ‘మత్తు’ లోకి ఈడ్వగలదు. 2: తాగే అనుభవం లేకుండా బాగానే చెబుతున్నావ్. తాగుబోతులదంతా గబ్బు ప్రపంచం అంటావ్. ఒక్కో భాషలో ఒకే మాటకి ఎన్నెన్ని అర్ధాలూ! ‘మత్తు’ అంటే తెలుసా? కన్నడంలో ‘మరియు’ అని. కాబట్టి తెలుగు మత్తు- లిక్విడ్ ‘మరియు’ సాలిడ్ అంటావ్. ఈ సేవనం వల్ల నిద్రమత్తు వస్తుంది ఒప్పుకో. నాకూ అలానే వచ్చింది నిన్న రాత్రి, అధిక సేవనం కాకున్న వృధా జీవనం. 1: పిచ్చివాడా. సాలిడ్ గా నిద్ర పోతే ఆ స్థితిని ‘నిద్రమత్తు’ అనాలి. 2: కుంభకర్ణుడు ఆ కోవలోకి చేరినవాళ్ళలో సాలిడ్ గా ప్రథముడు కదా, తాగేసేవాడంటావా? అలా నిద్ర పోలేని వారు నిద్రలేమితో ఏడుస్తూ ఉంటారు కనుక వారంతా లిక్విడ్ గా అధములా? 1: పనీ పాటా లేకపోతేనే కూర్చొనీ బింకం లేకుండా డ్రింక బుద్ధి వేస్తుంది. బాగా అలిసిపోయిన శ్రమజీవికి భూమిని ఆనుకోగానే నిద్ర వచ్చేస్తుంది. భూమాత జోకొడుతుంటే పలవరింతలో ఊ( కొట్టడం ఎంత హాయి! అయినా పాపం ఉన్న కాస్త డబ్బులూ తాగుడుకి తగలేసి వాగుడుతో జీవితాన్ని చెడగొట్టుకుంటాడు. ఎవరో ప్రోతాహిస్తేనే ఈ తెగులు అంటేది. 2: మంచి విద్యార్ధులూ మానసిక శ్రమజీవులే. పరీక్షలముందు బుర్ర వేడెక్కేలా చదువుతూ చదువుతూ ఉండి ఉండి జోగుతుంటారు. అది సహజం. కాని కొందరు దుష్టులు వారికిష్టులైతేనే ప్రమాదం అడపాదడపా హాస్టల్ రూం కొచ్చి ‘చుక్కేసుకోవడానికి చెక్కేద్దాం పద’ అని డిస్టర్బ్ చేస్తారు. నా ఖర్మ – ఆ వయసులో అలా అలవాటై పోయింది. ఇంకోటి తెలుసా, నా థీసీస్ సమర్పించిన తరువాత వైవా కి ఎక్స్పెర్ట్ వస్తే నా బాస్ ‘వోయ్, అతగాడికి తీర్థం పొయ్’ అని ఉచిత సలహా పారేశాడు. చచ్చినట్టు మొహమాట పడక, మొహం చాటు చేసుకునీ ఆ నల్ల పానీయం ఆయనున్న గెస్ట్ హౌస్ కి వెళ్ళి ఆయన కిచ్చి వచ్చాను. ఇప్పుడు నేను థీసీసులు దిద్దే రోజోస్తే ఊరుకుంటానా, హిస్టరీ రిపీట్స్. ఇదంతా మామూలే గానీ ఏదీ సరదాగా శ్రీశ్రీ గారన్న మరిన్ని జోకులు చెప్పవూ? 1: ‘దీపావళి , దీపావళి! ఇంటింట ఆనంద దీపావళి – సినిమా పాట. మద్యనిషేధం వల్ల దీపావళీ, కాళీ పీపావళీ’ 2: ఆహాహా ... ఆయన రాసిన పాటలోని ముక్కలు నన్ను చెప్పనీ. భలే చమత్కారి- ‘ కాసే బ్రహ్మానందం, ఓ డోసే పరమానందం’ అని ఓ చెణుకు...అది ఎవరికో తగిలిందని మిగతా వారికి వణుకు. 1: ఇంకానూ ఉన్నాయి- ‘కవులు హాలికులైననేమి అన్నాడు పోతన ! ఆల్కహాలికులైన నేమి అంటాడు శ్రీశ్రీ’ అన్నదొకటి. శ్ర్రీశ్రీ ది కాకపోయినా శ్రీశ్రీని గూర్చిన జోక్ అని అంటుంటారు- అదేమిటంటే ----పేర్ల తమాషా ....కొసి’జిన్’, మార్కెట్’వైన్’, డాస్టా’విస్కీ’ , హుమయూన్ క’బీర్’, శ్రీ’రమ్’ గం శ్రీనివాసరావు ! తన పేరునూ ‘మధు’రమ్’ గా మార్చుకోగలరాయన. 2: నువ్వు మధు’రమ్’ అంటే నేను స్వేచ్చాజీవిని కాబట్టి పావు’రమ్’ తలుచుకుంటా. నాజూకు నా జోకు చెప్పనా? ప్రేమ ఫలించాలంటే కావాలి పావురం, ప్రేమ విఫలమైతే కోరాలి పావు ‘రమ్’. 1: అనుభవమా తండ్రీ. క్వార్టర్ అని నువ్వంటావు. ‘మీరెక్కడుంటారు?’ అని ఒకాయన ...మధుచక్రి అనుకుంటా.. అడిగితే ‘క్వార్టర్స్’ లో అన్నా. అదోలా చూసి వెళ్ళిపోయాడేమిటీ అని ఆ తరువాత అనుకున్నా. అంతెందుకు హిందీ అంతగా తెలియని రోజుల్లో ‘బార్ బార్ దేఖో, హజార్ బార్ దేఖో’ అంటే వెయ్యి బార్లు చూడమంటాడేమిటీ..అదీ ఇంత ధైర్యంగా --- అని కూడా అనుకున్నా. కామెడీలు చాలు గానీ, బీ సీరియస్. అసలు మనిషిని అసహనం లోకి ఈడ్చే వ్యసనం ఈ మద్యపానం కదా, దానికి తిలోదకాలు ఇప్పించేలా టీవీల్లో ఘోషించరాదూ? 2: నీ కోరిక తీరు గాక! ఈమధ్య ‘సత్యమేవ జయతే’ అనే ప్రోగ్రాం హిందీ నుంచి తెలుగులోకి, మిగతా భాషల్లోకి అనువాదంతో వస్తోంది కదా ఆదివారం - ‘కల్లు మానండోయ్, గుల్ల కాకండోయ్ ’ అనే థీం ఆమీర్ ఖాన్ చేపడితే చాలు --- కొంచెం చెప్పి బాగా తా’గుడుగుడు’ గుంచం ఆడించేస్తాడు. 1: బాగానే గుర్తు చేశావ్ – ఆ ప్రోగ్రాం పేరు వినగానే నాకో సినిమా గుర్తొచ్చింది. ఇందిరా రమణా పిక్చర్స్ వారి ‘సత్యమే జయం’ ఆ సినిమా. అందులో మామా మైకమా, మామా క్షేమమా? పిచ్చిమామ..తెల్ల మామ..చందమామ...కుశలమా? నారికేళ పాకమా? నాగుతో సరాగమా? విషమే అమృతమా? నిజమే నిష్టురమా? పరాయి వాడివోయి తెల్లమామా , బడాయి కూడదోయి కల్లమామా ||మామా|| నిప్పుతో వివాహమా? తప్పుకో పిశాచమా భారత నారినోయ్ – నీకే మారినోయ్ దురాశ ఏలానోయి దొంగమామా నిరాశ తప్పదోయి పిచ్చమామా ||మామా|| అన్న సరదా పాట ఉంది. అన్నీ ప్రశ్నలే. కోదండపాణి ఎలా వరస కూర్చారో తెలియదు. పాట చదవడమే గానీ విన నోచుకోలేదు. పాడిన వారెవరో తెల్సా? సుశీలమ్మ! రాసినవారో? శ్రీశ్రీ! 2: అనుకున్నా, ఆ పదాల చెమక్కులు విని ఆయనే అని. కాసేపు ఆరుద్ర అని భ్రమ పడ్డా అనుకో. ఇది సరదాగా ఉంటే ఉండవచ్చు గాక, కానీ ‘పంతాలు పట్టింపులు’ సినిమాలో ‘ఇనుకోరా ఇనుకోరా, ఈ మల్లన్న మాటే ఇనుకోరా' పాటలో శ్రీశ్రీ గారి ఆవేదన చూడు – ‘కాలే ఆకలి కార్చిచ్చు , దాన్ని కల్లు నీళ్ళతో సల్లార్చు’ , ఇంకెవరైనా అలా రాయగలరా? దటీజ్ శ్రీశ్రీ. ఐ మీన్ – దట్ వాజ్ శ్రీశ్రీ. తెలుపు రంగు సత్యానిది, ఎరుపు రంగు ఆకలిది అని నిర్వచించడం అందరికీ చెల్లదు. అది ఆయన పేటెంట్. నువ్వు కోదండపాణి అన్నావ్ కదూ.. ఈయన తన పాటనే పేరడీగా చేసుకునీ సరదాగా అంటూ ఉండేవారట ఇలా- ‘ఇదిగో దేవుడు చేసిన మందు, ఇది నిలిచేదేమో మూడు గంటలు, ఇంట్లో తిట్లు పదివేలు’. 1: పాణి ‘గ్రహణం’ అలాంటిది. ఆచార్యులు సి.నా.రె కలం చేసిన చిలిపి తనం విన్నావా? ‘గోపాలుడు భూపాలుడు’ చిత్రంలో ఎన్టీఆర్ బందీ అయిపోతే అతన్ని విడిపించడానికి నాయకి లంబాడీ వేషం వేసి అక్కడ కాపలా ఉన్న వారందరినీ ‘మత్తు’లో చిత్తు చేయిస్తుంది. అప్పటి పాట – ‘జిం జిం జిం జింతడీ ...రం రం రం రంఖడీ, అచ్చమైన సరుకు, రెచ్చ గొట్టే చురుకు , మచ్చుకోసం తెచ్చింది లంబాడీ’. ఇందులో జిన్నూ,రమ్మూ అంతర్లీనమై ఉన్నాయి కదూ. వామ్మో --- ఇప్పుడా పాట ఆ సినిమా డీవీడీల్లో ఉండి ఉండదని నా నమ్మకం. 2: మొత్తం సినిమా అంతా త్రాగు ‘రంగు నీటి’ సమస్యే అయితే ఒకటీ అరా ‘తాగితే మరచి పోగలను’ అనో, ‘మధుపాత్రకెదలో ఇంక ఏ మాత్రం చోటు లేదని మనసైన పిల్లే చెప్పింది, నా మనసంతా తానై నిండింది’ అనో తీర్మానించుకోవడం వింటాం. ‘శక్తి మరచి రక్తి విడచి ‘మత్తు’ ఏదో మరిగినావు’ అనే చీవాట్లూ వింటాం. ఆ థీం లేని సినిమాల్లో అయితే ‘ మత్తు కొలుపు చల్లని తెలి వెన్నెలవో’ అనో ‘చాంగురే బంగారు రాజా, మత్తైన వగకాడా’ అనో, ‘హుషారుగొలిపే వెందుకే నిషా కనులదానా’ అనో, ‘దాగి ఉన్న దోరవయసు ఊగుతున్నది, ఊగిఊగి ‘మత్తు’ లోన తూగుతున్నది’ అనో, ‘భలేగా నవ్వితివి ఎలాగో చూచితివి –మత్తుగా మెల్లగా మనసు దూకితివి’ అనో, ‘ఆ మత్తులో కాస్త కనుమూసి ఒరిగాను’ అనో ‘మెత్తనైన మనసు నీది కొత్త చిగురు వేసింది , మత్తులోన మునిగింది ఓ పిల్లా’ అనో మత్తు గొలిపే మాటలు వింటాం. 1: ఆహాహా ... ‘మైకంలో ఉన్నాను మన్నించు’ అన్న వాడివి ఈ లోకం లోకి వచ్చేసి ఎన్నెన్ని పాటల మాటలు కరువు తీరా ఏకరువు పెట్టావ్. ఇప్పుడు చెప్పు ఈ ‘మత్తు’ అనేది సినిమా పాటల్లోకి తొలిసారిగా పాకింది ఎప్పుడు? ఎవరివల్ల? 2: క్విజ్జా బాబూ... నా వల్ల కాదు. నిద్దరొస్తోంది మళ్ళీ. నీ మాటలు రికార్డ్ చేసి పెట్టు. తీరిగ్గా వింటాను. 1: అన్యాయం తండ్రీ. ఏకపాత్రాభినయం అయిపోదూ? 2: పోదూ.... ఉత్తర రంగం: స్వగతానికి స్వాగతం నాకు తెలిసి --- ‘మత్తు’ ని తొలిసారిగా పాటలో అనుభవానికి తెచ్చింది పింగళి నాగేంద్రరావు కవి మహాశయులే. రాజాం లో పుట్టిన ఈ బ్రహ్మచారి కవిగారు ఏది రాసినా , అంటే సినిమాకి మాట రాసినా, పాట రాసినా ఎంతో రాజసంగా ఉండేది. ఎంచక్కని స్త్రీగళ గీతాలూ, యుగళ గీతాలు రాసేరూ! ఎక్కడినుంచి వచ్చేదో ఆయనకా పదజాలం, అదో ఇంద్రజాలం. ‘పాతాళ భైరవి(1951)’ చిత్రంలో ‘ఘాటు’ ప్రేమ అనే కొత్త ప్రయోగం పింగళి వారిదే. పాట రికార్డింగ్ లో ఎవరో ‘ఘాటు’ బదులు వేరే పదం వేస్తే బావుంటుందేమో అని నసిగారట. పింగళి వారు ఆయన్ని ఘాటుగా కసిరారట. ఈ సినిమాలోనే రాకుమారి తన చెలికత్తెలతో ఉద్యాన విహారం చేస్తూ పాడుతుందే, ‘ తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయీ’ అన్నది, అందులో ఆయన తొలిసారిగా ‘మత్తు’ ని క్రియాత్మకంగా వాడారు, ఎలాగంటే- ‘క్రొత్త రాగమున కుహూకుహూ మని మత్తిలి కోయిల కూయగా’ అని. ‘మత్తిలి’ అనేది గమనించావా? ’అత్తిలి’ లాంటి ఊరు పేరు కాబోలు అని అనుకునేవు. ఆ తరువాత వచ్చిన ‘దేవదాసు (1952) చిత్రంలో తొలిసారిగా ‘లాయిరి’ అనే పదం వినిపించింది. ‘లాహిరి’ కి వికృతి అది. లాహిరి అంటే మత్తు. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ పాటలో ‘ లాయిరీ నడి సంద్రమున లంగరుతో పని లేదోయ్’ అని అనిపించారు సముద్రాల వారు. వాక్యాంతాల్లో పొల్లులు రావడం బట్టి చూస్తే ఆ పాట మూల విరాట్ మల్లాది కవి గారేమో అనిపిస్తుంది. ఇక మరో విచిత్ర మైన పదబంధం ప్ర్రవేశించింది అలనాటి యాభైలలోనే. అదే- ‘మత్తుమందు’. అనస్థీషియా అనుకుంటే సరి. తాత్కాలిక ‘లోక విముక్తి’ కల్పించే నిద్ర. ఆ సమయంలో శరీరం పూర్తిగా అవతలి వారి స్వాధీనంలో ఉంటుంది. మెలకువ రాగానే సినిమాల్లో అన్నట్టు – ‘ఇప్పుడు నేనెక్కడున్నాను?’అని ప్రశ్నించడం జరుగుతుంది. ‘బ్రతుకు తెరువు (1953)’ చిత్రంలో ‘ ఏదో మత్తుమందు జల్లి మాయలుజేసి’ అనే పల్లవితో ప్రారంభమయ్యే పాట ఉంది. ఆ గీతాన్ని సముద్రాల వారు ( సీనియరా, జూనియరా--- జూనియర్ అంటే సముద్రాల వారి అబ్బాయి--- అన్నది తేలని ప్రశ్న) రాశారు. అప్పట్నుంచి కాబోలు ‘మత్తుమందు చల్లడం’ ఒక జాతీయమై పోయింది. పింగళి వారు ‘లాహిరి’ మాటని పల్లవి పల్లకీ ఎక్కించి 'మాయాబజార్ (1957)' లో ఊరేగించారు. సముద్రాల వారి మాట (ఆయన ‘నడి సంద్రములోన’ ప్రయోగిస్తే) పింగళి వారికి నది పైన నౌకా విహార సందర్భంలో ఉపయోగపడింది. లాహిరి లాహిరిలో జగమే ఊగడం, తూగడం కొత్తగా, వింతగా కనిపించాయి, వినిపించాయి అందరికి. ఆయన ప్రత్యేకత ఇలాంటి చోట్ల చూడాలి. లాహిరి లాహిరి లాహిరి అని మూడుసార్లు అన్నారు. ఒక ‘లాహిరి’ లో జగం ఊగితే మరో ‘లాహిరి’లో తూగడం, ఇంకో 'లాహిరి'లో సాగడం ఆయన కనిపెట్టిన విద్య. 'నేను మాత్రం తక్కువా' అన్నట్టు మార్కస్ బార్ట్లే కెమెరా తో శ్రమించారు. ఆయన ‘చలవ’ వల్ల మిట్ట మధ్యాహ్నం పూట పండు వెన్నెల కాసింది ఆ సినిమాలో. బహుశా మార్కస్ సృష్టించిన కృత్రిమ పగటి పూట రాత్రి వెన్నెల దృశ్యమే మహాకవి శ్రీశ్రీ చేత ‘పగలే జాబిలి ఉదయించెనేల?’ (మాంగల్యబలం, 1959) అని తొలిసారిగా ప్రశ్నించి సమాధాన పరిచే అవకాశం కల్పించి ఉండాలి. అలా పాట రూపంలో పగలు జాబిలి ఉదయించడం అనే ఊహ రావడానికి ఆయనే నాంది పలికారు. 'మాంగల్యబలం' చిత్రంలోనే హాయిగా ఆలుమగలు కాలం గడపాలంటే ఆలి ‘తలగడ మంత్రం’ చదవొద్దని ఆయనే ఉపదేశించారు. అలుకపాన్పు ఎక్కించే ఈ తలగడ మంత్రం ఒక రకంగా వశీకరణ మంత్రం అనే చెప్పాలి. ముందు ముందు ఇలాంటి మంత్ర ప్రభావం పాటల మీద పడడం ప్రారంభమైంది. ( తేలు కుట్టినా, నోరు పూసినా ఆ రోజుల్లో మంత్రం వేసే ఆచారం ఉండేది. ఈ మంత్రం అలాంటిది కాదు. వశం చేయించేది. వశీకరణ మంత్రం అన్నమాట). పింగళి వారు తొలిసారిగా ‘మత్తు మందు జల్లి’న మాటల్ని అప్పు తీసుకున్నారు. ‘ఎచటనుండి వీచెనో ఈ చల్లని గాలి’ అని మదరాసు ఎండల్ని సైతం పటాపంచలం చేసే సాయంత్రపు సముద్ర గాలి తాలూకు మేనేజ్మెంట్ థీరీ ప్రవేశపెట్టి, గాలినే ప్రశ్నించి ‘తీయగా, మాయగా మత్తుమందు చల్లుతూ’ వచ్చావని ప్రశంసించారు (అప్పుచేసి పప్పుకూడు, 1959). అంతేగాని తనకన్నా ముందరే సాటి కవి వల్ల ఈ జాతీయం ప్రయోగమై పోయిందే అని బాధ పడక ‘ఐనదేమో అయినది’ (జగదేకవీరుని కథ, 1961) ) అని సరిపెట్టుకున్నారే తప్ప ‘ఘాటు’ గా తన మీద తాను మండిపడలేదు. పైగా ‘ఏమి మంత్రము వేసినావో, ఏమి మత్తును జల్లినావో’ అని మత్తుమందు, మాయలతో పాటు శ్రీశ్రీ గారి మంత్రం కూడా చేర్చారు (ఈ పాటలో ఉన్నది మత్తు కాదు మచ్చు అని పాటల పుస్తకం చెబుతోంది). శ్రీశ్రీ గారు పగటి పూట జాబిల్లి అన్నారు కానీ పగటి పూట వెన్నెల అనలేదు. ఎంతైనా విజయా వారి హక్కు అది. అది పింగళి వారికి లాభించింది. ‘ఉన్నది పగలైనా అహ వెన్నెల కురిసేనే’ (జగదేకవీరుని కథ, 1961) అని ఆయన కొత్త నుడికారం దిద్దారు. శ్రీశ్రీ గారికి తెలుసు- ఇలా కవులు ఒకరి మాటలు మరొకరు ఉపయోగించడం అన్నది ‘వెలుగు నీడలు’ వంటిదని. ‘హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి’ (వెలుగు నీడలు, 1961) నవ్వడం శ్రీశ్రీ గారికి కలిగిన మరో కొత్త ఊహ. అయితే కొంత (అప్పటికింకా కొత్తదే) పాతదనం కూడా చేర్చి ‘మందు జల్లి నవ్వసాగే ఎందుకో, మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో ’ అని చమత్కారంగా ప్రశ్నించారు. ఈ సారి పింగళి వారు మళ్ళీ ‘లాహిరి’ ని వదులుకోలేక పోయారు. అయితే చలాకీగా లాహిరి కి ప్రాస మిత్రుడు లహరి ని తీసుకొచ్చారు. గుండమ్మ కథ (1962) నాటికి ‘మధురభావ లాహిరిలో మనము తూలిపోవగా/ మధుర భావ లహరిలో మనము తేలిపోవగా’ అనడంలో ఏ పదానికి సరిపోయే క్రియావచనం ఆ పదానికి వర్తింపజేయడం ఆయనకే చెల్లింది (పాట: ఎంతహాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి) అని అనిపించదూ? పింగళి వారు ఇదే పాటలో మళ్ళీ ‘చందమామ చల్లగా, మత్తు మందు చల్లగా’ అనే తొలినాటి మాటల గారడీ చేశారు. మధుమాసం ప్రేమమాసం కదా. డా. సి.నా.రె ప్రేమికుల మధ్య పని చేసే మంత్రం మధుమాసానిదే అని తేల్చారు- 'దోసెడు మల్లెలతో ఎదురై మధుమాసములో నను మంత్రించి వేసే దేవరో' అని ప్రేయసి ప్రియుడితో అంటుంది (రక్త సంబంధం, 1962). అవకాశమొస్తే ‘ఆకాశం దించాలా’ అని అతిశయించే ఆరుద్రగారు ఇదే లాహిరి వశీకరణలో పడి ‘ఇదేమి లాహిరి! ఇదేమి గారడీ! ఎడారిలోన పూలు పూచి ఎంత సందడి!’ అని ఆశ్చర్యపోవడం సహజమే (ఈడూజోడు, 1963). పింగళి వారే సుభద్రార్జునుల ఉద్యానవన విహార గీతం లో ‘మనసు పరిమళించడం’ అనే కొత్త పద సంపద మోసుకొచ్చారు. పైగా ఆ పరీమళం ఇనుమడించడానికా అన్నట్టు ‘ క్రొత్తపూల నెత్తావులతో మత్తు గాలి వీచగా’ ఘంటసాల వారు ఏ.ఎన్.ఆర్ కి తగ్గట్టు ‘మత్తు’ ను గమ్మత్తుగా పలికారు (శ్రీ కృష్ణార్జున యుద్ధం, 1963). ‘మత్తు’ మరోసారి రంగంలోకి వచ్చింది. పింగళి కవి గారికి కె.వి.రెడ్డి వంటి దర్శకుడు, డా. సి.నా.రె కవి గారికి బి.ఎన్.రెడ్డి వంటి దర్శకుడు దొరికితే – కవి మైత్రి ఎంత బావుంటుందీ! ‘పూజా ఫలం (1964)’ అంటే అదే మరి. పింగళి వారు ఒకసారి పగటి వెన్నెల, ఒకసారి జగం ఊగడం వంటివి కనిపెడితే సి.నా.రె. తిరిగి వాటికి పనిపెట్టి కలిపిగొట్టి ‘పగలే వెన్నెల, జగమే ఊయల’ అని నగిషీ చెక్కారు. వారినుంచి 'మంత్రం' కూడా దూరం కాలేదు. 'మాటతో సయ్యాటతో నను మంత్రించి వేయకు' (అగ్గిపిడుగు, 1964) అన్నారు, 'ఏమో ఏమో ఇది నాకేమి ఏమి అయినది?' అని ప్రశ్నిస్తూనే. భార్యాభర్తల టూరిజం లోనూ 'వీటూరి'జం అనే భావ కవిత్వం భర్త నవ్వుల మోహాల మంత్రమే భార్యకు ఆమోదం అని తెలియజేసింది. 'ఎటు చూసినా నువ్వే, వినిపించె నీ నవ్వే, మోహాలతో నన్ను మంత్రించకు' అని ఆమె అతన్ని నియంత్రించడం అతని నవ్వునే మరీ మరీ ఆమె కోరుకుంటుందని చెప్పడమే కదా (దేవత, 1965). ఉద్దండులైన అప్పటి కవులు మత్తుమందు, మాయ, మంత్రం అనే మూడు మకారాల పట్ల (త్రిమకారం) మమకారం పెంచుకోవడమన్నది యాభైల చివర్లో మొదలై ఇలా అరవైల్లో పరాకాష్ఠ కి చేరుకుంది. ఈ మత్తు గమ్మత్తు వేరు. ఈ మత్తు హాయికి గురుతు. ఈ మత్తు ఆరోగ్య హేతువు. ఈ మత్తు స్త్రీ పురుష బాంధవ్య సేతువు. ఎర్ర బనీన్లు, చుక్కల చీరలు కన్పిస్తూ డబ్భైల నాటి సినిమాలు ‘పాట’ భాషని మెల్ల మెల్ల మెల్లగా రెండర్ధాల వైపు మళ్లిస్తూ తలనొప్పి తేవడం ప్రారంభించాయి. ఈ తలనొప్పికి నివారణ అన్నట్టు చందమామ కూడా ‘ఆస్ప్రో’ మాత్రలా కన్పించేవాడు. దానికి తోడు డైరెక్టర్ అసిస్టెంట్ ని ‘ఏమయ్యా, పాట సీన్ అయ్యిందా’ అని అడిగితే ‘సారీ, డన్’ అనడం వల్ల మరో మాత్ర విలువ కూడా పెరిగింది. సందట్లో సడేమియా అన్నట్టు డబ్భైల్లోనూ జానపదాలు ప్రేక్షకులకి తలనొప్పి కలిగించవని నమ్మిన నిర్మాతలు కొందరు ఇంకా వాటి మీద ఆశ వదులుకోలేదు. అయినా పగటి జాబిలి, పగటి వెన్నెల, మత్తు మందు, మాయ, మంత్రం అన్నీ నిజంగానే మాయమైపోయాయి. ఒకే ఒక్కసారి ‘లాహిరి’ మాత్రం తూలుకుంటూ వచ్చింది. చిల్లర భావన్నారాయణ గారు ‘లాహిరీమోహనా, లలనాశృంగార పారీణా, త్రిభువన ధారణ రసగుణ రమణ! కుముద కుసుమ నవ్య పారిజాత రసికా’’ అనే సంస్కృతార్ధ శోభిత పల్లవి (సుగుణసుందరి కథ, 1970)కి పూనుకోకపోయి ఉంటే లాహిరి అనే మాటకి అప్పటికే కాలం చెల్లి పోయి ఉండేది. కాలచక్రం ఆపడం ఎవరి తరం? శ్రీశ్రీ గారన్నట్టు. ఇరవై వొక్క శతాబ్దంలో ‘లాహిరిలాహిరిలాహిరిలో’ అనే సినిమావే రాగలిగింది. సింగీతం వారికి ‘మాయాబజార్’ తో అనుబంధం ఉన్నా విశ్వనాథ్ వారికి ఇందులో నటించే భాగ్యం కలిగింది. నుయ్యి ఎక్కి నాట్యం చేస్తూ ‘తకిట తకిట తందానా’ అంటూ ‘టెన్షన్’ పెట్టిన కళా కారుణ్ణి మూడు దశాబ్దాల క్రితం చూశాం. కథ మామూలే – పేదరికం, భగ్న ప్రేమ, కళలో కాపాడాల్సిన విలువలు అనే త్రికోణంలో బిగుసుకు పోయే కళా కారుడు ‘తాగుడు’కి బానిసౌతాడు. అంతేనా? మరోలా ఉండదా జీవితం? బీ పాజిటివ్. రక్తం గ్రూప్ కాదు. యువకుల రక్తం లో ఉండాల్సింది ‘పాజిటివ్’ నేచర్... వక్రగతిలోకి ఈడ్చే మత్తు వద్దు, నిద్ర మత్తు వద్దు, మందు జల్లడం వద్దు, మత్తుమందు జల్లడం అంతకన్నా వద్దు. వీటినుంచి దూరంగా ఉండగలిగే ‘మంత్రం’ మాత్రం కావాలి. అది- ‘ఈ సమాజానికి నా అవసరముంది. నాకు ఈ సంఘంతో పని ఉంది. అలా అవసరమైన పనిలో బిజీ గా ఉండే నా జీవితం గజిబిజి కాకూడదు’ అన్నదే. ప్రతి బిడ్డా అలా ఎదిగినప్పుడు ఆ బిడ్డను కన్న తల్లి తన జన్మ సార్ధకమైంది అని అనుకుంటుంది. ఆ తల్లి ఆనందమే ఆ బిడ్డ జన్మ సార్ధకమైంది అని సూచిస్తుంది. అలాంటి తల్లులదే నిజమైన 'మదర్స్ డే' , మూడువందల అరవై అయిదు (2012లో ఓ రోజెక్కువ) రోజుల్లో ఒక రోజు ఆమెకా? అదీ ఆదివారమా? అమ్మలు ఎంత నవ్వుకోవాలీ? అమ్మ ఆదరణ కరువైతేనే బిడ్డ అధోగతి పాలయ్యేది. అందుకే ఆమె అన్ని రోజులూ బిడ్డల బాగు గురించే ఆలోచిస్తుంది. నిద్రాభంగం : 2: ఇవాళ ఏమిటో..... కనులు చూసినా (మత్తు మందు చల్లిన) పాటే, కనులు మూసినా (మత్తు) పాటే --- థాంక్యూ వెరీ ‘మత్’ ఫర్ యువర్ 'మంత్రం'. -డా. తాతిరాజు వేణుగోపాల్ , 12 మే 2012
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|