మునుపటి నా మాట
‘అనుకున్నామని జరగవు అన్ని... అనుకోలేదని ఆగవు కొన్ని’ – ఎంత బాగా అన్నారు మనసు కవి! వాన కూడా అటువంటిదే. ఇదిగో వచ్చేసింది కొబ్బరి తోటల కేరళకి అని ప్రకటిస్తే అవునుస్మీ ఎవరబ్బా, జబ్బ చరిచిందీ దెబ్బకి కదిలొచ్చింది అని బహుళ ప్రాసలతో బహుదానంద పడ్డాం. అది అంతలోనే చతికిలపడి పోయింది. అయినా ఆశ ఉంది... ఆలస్యమైనా ఆంధ్రలో అమృత ధారలు కురుస్తాయని! ఆ వాన రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూడాలి. అంటే ఓ ఐదువందలమంది ఎదురు చూస్తే చాలా? ఎవరది? మరీ లెక్క కట్టి చెబుతున్నారు. బొత్తిగా అతిశయోక్తులు గిట్టవా ఏమిటీ? ‘ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా’ అని శాంతకుమారి ఆర్ద్రంగా పాడితే గోపాలుడు ఆలస్యం చెయ్యనే చెయ్యడు. కన్నులేమిటీ, కాయలు కాయడమేమిటీ—మళ్ళీ ఎవరదీ? జాతీయాలు తెలియని జాతి కాదురా మనదీ. కేరళలో అనంత పద్మనాభుడు ఒక్కసారి నిద్రలేచినట్టున్నాడు – ఇన్నాళ్ళు శయనిస్తుంటే బంగారపు రాశులంటూ కేకలూ బొబ్బాలూనూ ... ఆయన మాత్రం ఎలా నిద్ర పోగలడు? ‘చూడ కళ్ళు చాలవనుకో’ – ఏదీ అతని శయన మూర్తి చూడ ..కాదు, అడుగున ఉన్న బంగారు రాశులు చూడ ... ఏ నోట విన్నా ఏ పూట విన్నా ఇదే మాట. ఇప్పుడు కొత్తగా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి దక్కిన కానుకల లెక్కలు కూడా మొదలయ్యాయి. అసలు అక్కడి అమ్మవారి దర్శనమే ఓ మహా భాగ్యం. రాతిపైన అచ్చైన శ్రీ చక్రం ముద్ర సందర్శనమే పుణ్య ఫలం. అటువంటిది ఇక పైన వచ్చేవారి దృష్టంతా బంగారం మీదకి మరలుతుందేమో. అంటే- తళుకులు అనేవాటిని చూడాలంటే కళ్ళ సంఖ్య పెరగాల్సిందే అని అర్ధమౌతోంది. అలాంటిది వానకోసం వెయ్యి కళ్ళ నిరీక్షణా? చోద్యం కాకపొతే వానలో ఏం తళుకుందనీ? ‘నీరము తప్త లోహమున పడి అనామకమై నశించు.. ఆ నీరమే శుక్తి లో పడి మణిత్వం గాంచి ప్రకాశించు’ అని భర్తృహరి సుభాషితం ఉందా లేదా? ముత్యపు చిప్పలో పడితే వాన చినుకుకి తళుకు రాదా? పైరులో ప్రతి చినుకు బంగారమే. పాపం రైతన్నకి వాన సాయ పడితేనే కదా వ్యవసాయం జరిగేది. సహజంగానే ప్రతి రైతు వెయ్యి కళ్ళతో వానకోసం ఎదురు చూస్తాడు, కన్నులు కాయలు కాచేలా. ‘ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపగలు ఎదురు తెన్నులు చూచెనే.. వానకై...చెదరి కాయలు కాచెనే’ అని భావకవి ఎప్పుడో అనిన మాటలు మార్చి పాడుకుంటాడు కూడా. పైగా అది మేఘసందేశమాయే! ఆకాశం నల్ల బడడం, అంతలోనే వాలుగా వాన జల్లు పడడం... ఇవేవీ చూడలేని చక్కనమ్మ చెవిని ‘నా కనులు నీవిగా చేసికొని చూడు’ అని భరోసా ఇచ్చే భర్త మాటలు ఎంత కులాసా నిస్తాయీ! ఐ డొనేషన్ ఒక గొప్ప వరం- అది చూచాయగా ఆనాడే తెలియజేశారు మనసు కవి. మంటల్లో తగలెయ్యక మనుషులకివ్వండి అని చెప్పకనే చెప్పారు. చూపు లేని రెండు కళ్ళ కోసం వేయి కన్నులు ముందుకు రావడం గొప్ప విషయం. హాయిగా రెండు కళ్ళు ఉన్నా ఒక్కోసారి ఎంతో హారిబుల్ గా చాలవనిపిస్తాయి. శృంగారం మితి మీరి అబ్బాయిగారు ‘ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు ...నా కున్నవేమో రెండే కన్నులు ... ఎలా చూసేది..ఏది చూసేది?’ అని సందేహం వెలిబుచ్చగానే పిచ్చ అమ్మాయి ఊరుకోవచ్చుగా.. ఉహూ(.... ‘చాలకుంటె కావాలంటే నావి కూడా తీసుకో..నీ తనివి తీరా చూసుకో..’ అని బుసలు కొట్టింది. ఈ డొనేషన్ ఏమిటండీ మనసుకవి గారూ? అప్పుడలా అన్న మీరే ఇప్పుడిలా అన్నారే! సందర్భం బట్టి సిరా పలుకులు మారడం షరా మామూలే అంటారా? శృంగార కవ్వింపు అంతటితో ఆగిందా? ‘జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్ల పూలు పెట్టుకుంటే ... అది నువ్వే నువ్వే నువ్వేనమ్మ నూరుపాళ్ళు ...నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయి కళ్ళు’- అనేది సిరివెన్నెల సోనగా సాగింది [ వి. కనులు మూసినా పాటే – చిన్నబ్బాయి (1997) పాట]. ‘ఓ చతురానన నీకు పరాకేలనయ్యా..’ అని ఒక కీర్తన ఇలా మనందరికీ దృష్టి నిచ్చిన సృష్టి కర్తని పట్టుకు ఎడాపెడా దులిపేసింది. నాలుగు ముఖాలున్న బ్రహ్మకి నాలుగు జతల కళ్ళు అంటే ఎనిమిది కళ్ళు ఉండాలి. అష్ట దిక్కులూ గమనించేందుకు అవి సరిపోవచ్చు. బ్రహ్మదేవుడు తనని పట్టించుకోలేదని సంకీర్తానాచార్యుడు ఆయన పరాకు మీద చిరాకు పడ్డాడు. అయినా విశ్వాన్ని ఓ కంటకనిపెట్టే సృష్టి కర్తకి ఎనిమిది కళ్ళు సరిపోవు, ఎన్ని కోట్లో కావాలి. విష్ణు మూర్తి పులివంటి కన్నుల వాడు కనుక పుండరీకాక్షుడు అయ్యాడు. విష్ణువుకి సహస్ర నామాలు ఉన్నాయని విన్నాం. మన ఈ ‘స్థితి’ కి కారకుడైన నారాయణుడుకి సహస్రాక్షులు ఉన్నాయని ఎవరైనా అన్నారా? శివుడు – ముక్కంటి. మొత్తం మనందరి లయకి కారణ భూతుడు ఈ భూతనాధుడు. ఆగ్రహం తెప్పించే, అసహనం పెంచే కార్యమేదైనా ఎదురైందో అంతే...మూడో కన్ను తెరిచి మసి చేసేస్తాడు మహేశ్వరుడు. యోగి కనుక ధ్యాన ముద్రలో ఉంటూ కళ్ళు మూసుకునే ఉంటాడు. ‘గౌరీ సగం శివుడు సగం అర్ధ నారీశ్వరమే అఖిల జగం’ అని ఆ ‘రుద్ర’ కవి సరళంగా చెప్పినా లోతైన భావం ఉంది అందులో. సగం సగం వెరసి ఒకటి కనుక అర్ధనారీశ్వరుడివి రెండు కళ్ళే. వాళ్ళకైతే కైలాస విలాసమే తప్ప అనురాగం లెక్కల్లో తేడాలు రావు. లాసా, గెయినా అనే ఆలోచనే రాదు. కాని మామూలు వాళ్ళమైన మనకే కొన్ని లెక్కలు అర్ధం కావు. ‘నాలుగు కళ్ళు రెండైనాయి ..రెండు మనసులు ఒకటైనాయి... ఉన్న మనసు నీకిచ్చేసి లేనిదాననయ్యాను’ అని మనసు కవి జీరో బ్యాలెన్స్ కి చేరిన ‘మనసు గతి ఇంతే’ అని లెక్కలు వేసి చెప్పింది ఒంటి మీద తెలివుండేలా కంటి చూపు ‘దూర దృష్టి’ ని అలవర్చుకోవాలని హిత బోధ చెయ్యడానికే. భ్రుగు మహర్షికి పాదంలో ఒక అదనపు కన్ను ఉండేది. అహంతో విష్ణువు ఛాతిని తన్నాడు. ‘అయ్యో మీ పాదాలెంత కందేను’ అంటూ విష్ణువే తెలివిగా ఆ చాటు కన్నుని నొక్కి పారేసి మహర్షిలోని అహాన్ని నియంత్రించాడు. ఎవరైనా పేట్రేగి పోతుంటే ‘ఏం, కళ్ళు నెత్తినెక్కాయా?’ అని దూషిస్తాం. మరి కొందరి తెంపరితనం చూసి ‘కన్నూ మిన్నూ కానరావట్లేదు వీడికి’ అని భాషిస్తాం. బలి చక్రవర్తి దాత అయినా దాన గుణం మితి మీరి అహం పెరిగింది.ఆ అహం అణచేందుకు విష్ణువు వామన రూపంలో వచ్చి బలి తలపైన పాదం మోపాల్సి వచ్చింది. తిన్నడు (కన్నప్ప) ఈశ్వర కటాక్షం కోసం తన రెండు కళ్ళూ పెకిలించుకున్నాడు. గొప్ప భక్తులు శరీరంతో కాక హృదయంతో ధ్యానిస్తారు. అందుకే పామూ, సాలీడు, ఏనుగు కూడా శివ సన్నిధిలో తరించాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు శివుడు నీటి దొర. తుపానులు పాముల్లా మెలికలు తిరిగి ఉంటాయి. భారీ వర్షం ఏనుగంత. ఇక ఇప్పటి ప్రపంచమంతా ‘సాలీడు’ (వెబ్) అల్లికే. సాటిలయిట్ శివుడి మూడో కన్ను. అది ఎంత మబ్బుల్ని పట్టి చూపించినా ఈశ్వర కటాక్షం కాలేక నీరివ్వనంత వరకూ ఆ మబ్బులు ఎందుకూ పనికి రావు. ఇక మేధావి అయినా రాక్షస గుణాలున్న రావణుడికి ఉండేవి పది తలలు కదా, అంచేత ‘దశ కంఠడు’ అన్నారు తప్ప ఇరవై కన్నులుండేవని ‘వింశత్యక్షుడు’ అని అనలేదు. ఎందుకంటే- కళ్ళు ఎన్నైతేనేం, అతని చూపు సరియైనది కానప్పుడు! ఇక మానవుల మైన మనకి రెండు కళ్ళ కన్నా ఎక్కువే ఉంటే గుడ్లగూబలా గుండ్రంగా మొహం తిప్పే అదృష్టమే ఉంటే లేని ముందు చూపు గురించి ఆలోచించక పోగుట్టుకున్న వెనక చూపుతో ఏదీ పోగొట్టుకో కూడదనీ, అప్పటికప్పుడు అన్నీ చూసేయాలన్న ఆత్రమెక్కువుతుంది. అందుకని అటువంటి ఆలోచన రానివ్వలేదు చతుర్ముఖుడు. ఇది రంగుల ప్రపంచం. ప్రకృతి పచ్చదనంతో పాటు ఎన్నెన్నో రంగుల్ని వెంట తెచ్చుకుంది. మనకున్న రెండు కళ్ళతో వీటిని చూడగలిగి, ఏ రంగు పేరు ఏమిటన్నది రకరకాల భాషల్లో చెప్పగలిగే అదృష్టం మనకి మాత్రమే ఉన్నందుకు గర్వ పడక సర్వేశుడికి కృతజ్ఞత చెప్పాలి. అందం ఒక ఆకర్షణ. రంగు అందాన్ని మెరుగు పరుస్తుంది. మల్లె రంగూ పెరుగు రంగూ తెలుపే. ఒకటి ముక్కుని, ఒకటి నాలుకని ఆకర్షిస్తాయి. అంటే .. కన్ను చూసినది ఒకే రంగైనా మెదడు రుచిని తెలుసుకోమని చెబుతోంది. శ్రీరాముడి మూర్తి కంటి కింపు అయినా ‘శ్రీ రామ నీ నామ మెంత రుచిరా’ అన్నారు త్యాగయ్య. మోము రంగు తెలుపనీ , బుగ్గల రంగు గులాబీ దని క్షణకాల మాయా విలాసం కళ్ళని మోసం చేస్తుంది. బంగారు కిరణాల సూర్యుణ్ణి ఉదయాద్రి మీద చూస్తూ పరవశిస్తాం, అదే తెల్లటి వెలుగులో రవిగారిని చూడగలమా, కళ్ళు పోతాయని భయ పడమూ? నలుపు లోనూ ఉంది గరిమ. చీకటి నలుపు లేనిదే మన కళ్ళకి విశ్రాంతి ఏదీ? ఏకాగ్రత కోల్పోక దీక్షలో ఉండగా ఎటువంటి రంగుల మాయలో పడకూడదనేగా అయ్యప్ప స్వామి ‘నలుపు’ వస్త్రాన్ని ధరించమన్నది! సంక్రాంతి (మకర సంక్రమణం) పురుషుడు కూడా నలుపునే ఇష్టపడేది. శని బాధలు పెడతాడని భయ పడుతూనే అతని కిష్టమైన నల్ల రంగు వస్త్రాలు ధరించి ఉపశమనం పొందే వాళ్ళు ఉన్నారు. శనివారం దేవుడు వెంకన్న ‘ఇచ్చేయండి’ అని తలనీలాలు (నలుపు వెంట్రుకలే) తీసుకోవడం లేదూ? పచ్చ ద్రాక్షల కన్నా నల్ల ద్రాక్షలేగా తియ్య తియ్యగా ఉండేదీ? చీమ చూస్తే ఓ ఉప్మా రవ్వలోని కణమంత ఉండదూ? ‘ఓ హృదయం లేని ప్రియురాలా’ అని మనసు కవి తిడుతున్నారంటే చీమలా కుట్టి పారేశావే అని ఎద్దేవా చేస్తున్నారని అర్ధం. ఎందుకంటే చీమలకి హృదయం లేదు. ‘కందిరీగ నడుముదానా’ అని పొగడడం ఇష్టమే అయితే ఒకటి తెలుసుకోవాలి. చీమ కూడా కందిరీగ జాతి నుంచి విడి పడినదే. చీమలకి కళ్ళు మాత్రం బోలేడుంటాయి. జాగర్తగా చూసినా మనకి రెండు కళ్ళే కనిపిస్తాయి. లోలోపలి కళ్ళ విషయంలో ఇవి శివుడి వాత్సల్యానికి దగ్గరయ్యాయి. కనుకనే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు! దోమలూ అంతే. బహు కళ్ళతో బహు కాలాలు దొరక్క తప్పించుకుంటాయి. ‘దొరికింది...చచ్చింది’ అని రెండు చేతులతో మొత్తితే చప్పట్లే తప్ప దోమ చావడమంటూ ఉండదు. విష్ణుమూర్తికి సర్పమే శయ్య కనుక దోమల బెడద ఆనాడూ ఉండేది. ఉండేది కనుకనే అన్నమయ్య ‘పన్నగపు దోమతెర పైకెత్తవలెరా’ అని అనగలిగారు. కనుక దోమలకీ, చీమలకీ అన్ని కళ్ళిచ్చినా విష్ణువు కుండేవి రెండే కళ్ళని తేలిపోయింది. విష్ణు అంశాలైన రాముడూ, కృష్ణుడూ ... వీరికి ఉన్నవీ రెండు కళ్ళే. అయితే వాళ్ళెంత సుందరులంటే వారిని చూడ వేయి కళ్ళు చాలవు. ‘నీల మేఘశ్యాముడు’, ‘నల్లనివాడు’, ‘నీల గగన ఘన శ్యాముడు’, ‘కాలియా’ అని పిలిచినా ‘శ్యామ సుందరుడు’ కదా శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా. తొలి వెలుగుల మాసం (చైత్రం) ‘శుక్ల’ పక్ష నవమి నాడు పుట్టాడు కనుక రాముడు తెలుపని, వెలుగు తగ్గిన శ్రావణ కృష్ణ అష్టమి నాడు పుట్టాడు కనుక కృష్ణుడు నలుపనీ కొందరి విశ్లేషణ. రాముడైనా, కృష్ణుడైనా ‘హరి’ అవతారాలే కనుక శ్రీరంగ కవి అన్నట్టు ‘తెలుపో నలుపో జాన్ దేవ్ ... ఆ తేడా లిక్కడ లేనేలేవ్’. ఆషాఢ మాసంలో మేఘాలు వెలుతురుని కప్పి పుచ్చి సూర్యుడితో దోబూచులాడుతుంటే లక్షలాది ‘వార్కరీ ’ భక్త జనం ‘పండరీ పుర యాత్ర’ చేసి విఠలుడి (పాండు రంగడి) సేవలో తన్మయులౌతారు. ‘కన్నయ్యా నల్లని కన్నయ్యా ..నిన్ను కనలేని కనులుండునా’ అని వారు పాడుతుంటే ఆ చిద్విలాస రూపాన్ని అక్కడికి వెళ్ళి చూడలేకపోతున్నామే అని బాధపడే వారు వారికెదురొచ్చి వారిలో రంగని చూసుకునీ తృప్తి పడతారు. వారు తిరిగొస్తే మళ్ళీ వాళ్ళ కళ్ళలో దాగి ఉన్న రంగ ప్రతిమని చూడాలని ఎదురొస్తారు. ఇదిగో, మన నాద యోగి త్యాగయ్య తన నిత్య నామ స్మరణం శ్రీ రాముడే అయినా రెండు కీర్తనల్లో ‘వేయి కనులు కావలెనే, పదివేల కన్నులు కావలెనయ్య’ అన్నారు- ఎవరిని చూడడానికీ? వేణుగానలోలుని, వేంకటేశ్వరుడిని.... ఆశ్చర్యంగా ఉందా?[చూ. కనులు చదివినా పాటే]. ఆయనంటారూ .... అలివేణులు మ్రొక్కుచు రాగా , పంకజ వదనలు ఆడగా, మంచి వాక్కుల తరుణులు పాడగా దర్శనమిచ్చే ‘వేణుగాన లోలుని గన వేయి కన్నులు కావలెనే’....అని. వీటన్నటిని మించి ‘సకల దేవతలు అతనిని త్యాగరాజ సఖుడని కీర్తిస్తుంటే’ వచ్చి నిలిచిన శ్రీరామ కృష్ణుని గన వేయి కన్నులు కావలెనే.. అదే పరమార్ధం [వి. కనులు చూసినా పాటే- ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గాత్రం]. వేంకటేశ్వర స్వామి ఎదుట తెర తొలగగానే ఆ దివ్య మూర్తిని ఒక్కసారి అలా చూడకుండా వెళ్ళలేం. అంతలా పూల మాలలతో ఆకట్టుకునే విగ్రహం అమ్మవారి లాగే స్వామి వారిదీనూ. ‘తళుక్కున మెరసే చక్కదనము గల వేంకటేశుని సేవింప పదివేల కన్నులు కావలెనయ్య’ అని త్యాగరాజ స్వామి వారు అన్నారు. శ్రీవారి నామామృతం త్యాగయ్య నోము ఫలం. అదే మోక్షమనే సౌధానికి తొలి మెట్టు. ఆ మోక్షం దక్కాలంటే దివ్యంగా శోభిల్లే శ్రీవారి పాద దర్శనం కావాలి. అటువంటి మూర్తిని చూస్తూ సేవించడానికి పదివేల కన్నులు కావలెనయ్య అని చమత్కరిస్తారు త్యాగయ్య. నాదయోగి త్యాగయ్య వారు సంగీతంలోనే కాదు సాహిత్యంలోనూ ఎందరికో ప్రేరణ కల్పించారు. ఆచార్య కవి ‘ వేణుగాన లోలుని గన వేయి కనులు చాలవులే’ అని మకుటంలో త్యాగయ్య వారి మధురవాక్కులే పొదిగినా ఎటువంటి గోపాలుని గన వేయి కన్నులు చాలవో చెప్పిన తీరు ప్రశంశనీయమే. సురలు, నరులు మురిసిపోవ ధరణి నేలు గోపాలుని గన వేయి కనులు చాలవట. కలసి మెలసి అలసి సొలసి వలపు తెలుపు వేళలలో వేణుగాన లోలుని గన వేయి కనులు చాలవట [చూ.వి. కనులు చదివినా పాటే , కనులు మూసినా పాటే.. ‘రెండు కుటుంబాల కథ (1970)’ చిత్రం లోని పాట]. ఆచార్య కవి గారే మరో సందర్భంలో తన రాజు వచ్చే పున్నమి రాతిరి కాంతుల్లో ఒక కాంతామణి మురిసి పాడుకునే తీరును ప్రస్తావిస్తూ అతని రాకని ‘వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను’ అంటారు. ‘వేల’ అనే బహు వచనం వల్ల ఎన్ని వేలు అనేది మన ఊహకే వదిలి పెట్టేరు [చూ. అల్లూరి సీతారామరాజు (1974)- వస్తాడు నా రాజు ఈ రోజు][ ఆ పాటలో ‘వేయి కనులు’, ఈ పాటలో ‘వేల తారకల నయనాలు’ ఉండడం, రెండు పాటల్లో నటించిన నటీమణి విజయ నిర్మలయే కావడం కాకతాళీయం అందామా? రెండు సినిమాల్లోనూ నటశేఖర కృష్ణ హీరో కావడం కూడా అంతే కాకతాళీయం]. త్యాగరాజ స్వామిలోని భక్తినీ, ఆచార్య కవిలోని రక్తినీ గమనించాం. మల్లాది రామకృష్ణశాస్త్రి గారు మాత్రం ఒకే ఒక్క పాటలో జోజోల పసితనం నుంచి పెళ్లీడు కోర్కెల వరకూ కుదించి ‘చినదాని అందం చూడాలంటే వేయి కనులు కావాలి’ అని సౌందర్య లహరిలో తేల్చారు[చూ వి. కనులు చదివినా పాటే, కనులు మూసినా పాటే – మా ఇంటి మహాలక్ష్మి (1959) లోని ‘పలికే చక్కెర చిలకలు, కులికే రాజహంసలు’]. [పాట రచనలో ‘వేయి కనులు’ అని ఉంటే పాటలో ‘వెయ్యి కనులు’ అని వినబడుతుంది]. ఆ చిన్నదే సీతమ్మ అయితే ‘కన్నవారి కన్నుల చల్లగ ఆటల నాడే సీతను చూడ వేయి కన్నులు చాలవుగా’ అని ఒకసారి, వింతవింత పూబంతులాటల వేడుక చూసే సీతను చూడ వేయి కన్నులు చాలవుగా’ అని మరొకసారి చమత్కరించిన సముద్రాల కవివర్యులవి ఆణిముత్యపు పలుకులు కదా [చూ వి కనులు చదివినా పాటే , కనులు చూసినా పాటే : సీతారామ కళ్యాణం(1961)- ‘వేయికన్నులు చాలవుగా.. కన .. వేయి కన్నులు చాలవుగా’]. లలిత గీతాల్లోనూ ‘వేయి కన్నుల’ అతిశయం వచ్చింది కాని అన్ని కన్నులు చాలవని గానీ, కావాలని గానీ ఎవరూ చమత్కరించినట్టు లేదు. శ్రీమతి శారదా అశోక వర్ధన్ గారు తన ‘మనసాయెరా మాధవా’ గీతంలో అక్కడక్కడా కృష్ణశాస్త్రీయ ధోరణి కనపర్చినా ఏఏ వేళల్లో మాధవుని చూడ మనసౌతుందో చక్కగా చెప్పారు. బృందావనంలో పూల మధ్య అల్లరి చేస్తూ ఆడే వేళ, భామలు, యమున, మురళి అంతా నడిరేయి వెదకే వేళ, ప్రేమ సుధల రాధ, మాట పట్టింపుల సత్య, పతిసేవల రుక్మిణి ...వీరికి అతని రాక పండగైన వేళ ఏతెంచే మాధవుని చూడ మనసవ్వదా ఎవ్వరికైనా [ చూ ,వి . కనులు చదివినా పాటే, కనులు మూసినా పాటే – ఇక్కడ పాడిన వారు కొన్ని మాటలు అదనం చేసి, కొన్ని మినహాయించి కంగారు పెడతారు. మీ వంతు పాడ వలసి వస్తే ముందు పాట పూర్తిగా చదవండి. అప్పుడు సంతృప్తిగా పాడండి]. చూస్తే ..కాస్తో కూస్తో కొత్త సినిమా పాటల్లోనూ స్నేహం ఊసేత్తేసరికి మంచి మాటలు దొర్లుతున్నాయి అనే తృప్తి కలుగుతోంది. ‘నీ స్నేహం’ సినిమాలో ‘వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరగా నీ స్నేహం’ అని పల్లవించిన పాట ఉంది [చూ. కనులు చూసినా పాటే ]. ముందు ట్యూన్ ఇచ్చి పాట రాయించుకున్నా పాత పాటల్లో సాహిత్యం సిమ్మెంటు పూత చక్కగా ఉండేది. కొత్త పాటల్లో మాటల ఇటుకలే కనిపిస్తుంటాయి. కొత్త పాటలు పాడేవారికి తెలుగులో ప్రవేశం ఉన్నా లేకపోయినా చెల్లుతుంది. వీరే పాత పాటలు పాడితే మూలనున్న ముసలి అవ్వ కూడా 'అవ్వ ! మీ మొహం' అంటూ తప్పులు దిద్దుతుంది. ముక్తాయింపు: పత్రికల్లో నిత్య వార్తల్లో సరే, అచ్చయ్యే పుస్తకాల్లో తప్పులు సరిదిద్దాలంటే నిజంగానే ‘వేయి కనులు కావలెనే’ లేదా ‘వేయి కనులు చాలవుగా’ మా మంచి తెలుగు కవి మల్లాది వారి ‘జయభేరి’ పాటకు పట్టిన గతి చూడండి ( ‘పద్మశ్రీ ఘంటశాల మధుర గానసుధ’ , గొల్లపూడి వీరాస్వామి సన్, 2007) (రాజమండ్రి గోదావరి సేద తీర్చినా, రాదా మరి బాధ, ఇలా మాటలు పేర్చితే..) ‘మది శారదాదేవి మందిరమే మధురమైన నీ కుమార్తె నీ నామమున కొలిచే వారి రాగభావసుమరే ననుకమలా సాధసాధనచే దేవికి పూజ సాధసాధనివలె దేవికి పూజ వరదాలుని గురితెరిగిన ఘన’ అసలు పాట చెప్పకపోతే ఈ నకలు ఏ వేదిక పైకో మైకులో ఎక్కే ప్రమాదం ఉంది. ‘చంపేవ్ పో’ అనకుండా ‘చాంప్ వయ్యావ్ రా’ అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అసలు పాట: మది శారదా దేవి మందిరమే కుదురైన నీమమున కొల్చేవారి ||మది|| రాగభావ మమరే గమకముల నాద సాధనలె దేవికి పూజ తరళ తానములె హారములౌ వరదాయిని కని గురుతెరిగిన మన || మది || రెండేళ్ళ క్రితం అనుకుంటా ఒకానొక టీవీ చానెల్ లో ఒక వర్ధమాన గాయని ‘న్యాయ నిర్ణేత’ గానో అబ్జర్వర్ గానో ఉంటూ ఓ కుర్రవాడు ఇదే పాటని ఎక్కడా తప్పుల్లేకుండా పాడితే తన స్వంత తెలివితో ‘చివర్లో గురుతెరిగిన అన్నావ్. గురువెరిగిన అని ఉండాలి’ అన్నారు. పాపం ఆ కుర్రవాడు తెల్లమొహం వేశాడు. పోనీ మరోవారం ఆ గాయని ‘సారీ’ చెప్పొచ్చుగా, చెప్పనే లేదు. బాధ్యతా రహితమంటే ఇదే. ఆమె మాటే వేదం అనుకునీ ఆనక అభాసు పాలయ్యేవాళ్ళ సంగతి ఎవరిక్కావాలి? -డా. తాతిరాజు వేణుగోపాల్ , 10 జూన్ 2012
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|