మునుపటి నా మాట
జూన్ 17...జూన్ 15....జూన్ 13 అలా చదువుతూ పోతుంటే కేలండర్ రెండేసి రోజుల తేడాతో వెనక్కి పోతున్నట్టు అనిపించడం సహజం. కాల గమనంలో ఒక్కసారి జ్ఞాపకాల దారుల్లో ఆగి వెనక్కి చూస్తే ఆ మూడు రోజులు మన మధ్య లేని మహా పురుషులు ముగ్గురుని గుర్తు చేస్తాయన్నది నిజం. జూన్ పదిహేడున ‘అచ్చ తెనుగుభాష’ పుట్టింది, ఎప్పుడూ, 1905లో. జూన్ 15 న ‘విప్లవ భాష’ కనుమరుగైంది, ఎప్పుడూ, 1983లో. జూన్ 13న ‘గజల్ షాయరీ భాష’ మరో రూపంలో మూగ బోయింది, ఎప్పుడూ ... మొన్న మొన్ననే. అచ్చ తెనుగు భాష కి తెలుగువాళ్ళు పెట్టిన ముద్దు పేరు – మల్లాది రామకృష్ణ శాస్త్రి . విప్లవ భాష తెలుగు వాళ్ళకి నేర్పిన పెద్ద పేరు – శ్రీరంగం శ్రీనివాసరావు. ఇక్కడ దేశం లోని రాజస్తాన్ లోని ‘లూనా’ లో పుట్టి, పొరుగు దేశానికి వలస పోయి కుస్తీ పట్టు తో పాటు పట్టుదలతో గళం సవరించి ‘గజల్ షాయరీ’ భాషకొక రంగు, రుచి, వాసన ఉంటుందని తెలియజేసిన గాయక శిఖామణి పేరు- మెహదీ హస్సన్. మల్లాది వారి తెలుగు కరువై దాదాపు యాభై ఏళ్ళవుతోంది. మహాకవి కదిలించిన సాహితీ విప్లవ రధం ఆగిపోయి ఇంచుమించు మూడు దశాబ్దాలౌతోంది. మెహదీ హస్సన్ ‘శారీరం’ కొద్దికాలంగా పాడలేనని మొండి కేస్తున్నా శరీరం శాశ్వతంగా గంధర్వ పథం వైపు వెళ్ళిపోయి మూడు రొజులౌతోంది.
‘జిందగీ మే( తో సభీ ప్యార్ కియా కర్తే హై(...మై( తో మర్ కర్ మేరీ జాన్, తుఝే చాహూంగా’ అని ఒకనాడు ఆయన పాడినది ఇప్పుడూ నిజమే... ఆ జాన్ ... ఎవరో కాదు ....గజల్! దానికి మరణం లేదు. ‘కభి నగ్మా బన్ కె కభి బన్ కె ఆ(సూ’ – అన్నాడాయన. పాట మిగిలింది. పాట వెనుక పాడే అసలు గుండె లేక కన్నీరు మిగిలింది. మెహదీ పాట వింటుంటే ఒక తలత్, ఒక ముకేష్, ఒక కిశోర్, ఒక మన్నాడే పాడుతున్నారు కాబోలు అనిపించి అయోమయంగా విని మళ్ళీ మళ్ళీ వింటాం. విన్నప్పుడు మెహదీ ‘పదాలే’ వినిపిస్తాయి, అవి ఎవరి పెదాలన్న ధ్యాస రానే రాదు. కభీ న బాతో(మే( ఆయా జో మేరా –తో బేచైన్ హో హోకే దిల్ థామ్ లోగే... అని ముందే తెలియ పరిచాడు హస్సన్. (చూ. కనులు చూసినా పాటే, వి. కనులు మూసినా పాటే) మెహదీ చివరి కోరిక తన పుట్టిల్లు ‘లూనా’ మట్టి మీద ఒక్కసారి కాలు మోపాలని. ‘నా గానాలూ నా గజళ్ళూ’ ఇదే నా లోకం అనుకున్న ఎనభై నాలుగేళ్ళ మెహదీ కరాచీలో కనిపించని ఏ లూనా ఎక్కి అంత హడావుడిగా వెళ్ళిపోయారో? మెహదీ మావి కొమ్మ, లత కోయిలమ్మ అయితే వసంత గానం ఎంత బావుండాలీ? ఎప్పటికైనా ఆమె తో పాడాలని అతని కోరిక. అతనితో ఎప్పటికైనా పాడాలని ఆమె ఆశ. కాని పదేళ్లుగా మెహదీ శరీరం అవస్థల పాలైంది. నడుం సహకరించక పోతున్నా అనుకున్న ‘యుగళ గీతాలకి’ నడుం కట్టి ఆయన 2009లో తన వంతు పాట (తేరా మిలానా) పాడి ఆ దేశం నుంచి ఈ దేశానికి ట్రాక్ అందించి ఇక పాడాలి నీ గొంతు అని ఆమెని అభ్యర్ధించారు. లత 2010లో తన వంతు పాడితే ఆ రెండు గళాల మిశ్రమ గీతం- సర్ హదే( - ఆల్బం గా శ్రోతల ముందుకొచ్చింది. ఒక దశలో మెహదీ తన ఫోటో నే తాను గుర్తు పట్టలేనంత మతి మరపులోకి జారిపోయినా చికిత్సతో మెల్లగా కోలుకో గలిగారు. గొంతు మూగ బోతోందే అని దిగులు పడుతుంటే మెల్ల మెల్లగా ఆ దశలోంచి కూడా బయట పడ గలిగారు. భారత్ వెళ్ళి వైద్యం చేసుకోవాలని భావిస్తున్న తరుణం లోనే హస్సన్ హాస రేఖ విషాద ఛాయ గా మారింది. బాపు బొమ్మ మనందరికిష్టం. బాపు గారికి మాత్రం మెహదీ పాటంటే ఇష్టం. ఆ ఇష్టం తోనే స్వర కర్తల్ని కష్ట పెట్టి ‘చుట్టూ చెంగావి చీర కట్టావే చిలకమ్మా’, ‘ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు’ వంటి పాటలు చేయించుకున్నారు. వయోలీన్ కదలికల్లో మనల్ని లీనం చేసే లాల్ గుడి జయరామన్ గారికి మెహదీ పాట వింటూ అందులో లీనం అయి పోవడమంటేనే ఇష్టం. అలా ఒక ‘తిల్లానా’ మెహదీ బాణీ ప్రేరణ తో రావడంలో ఆశ్చర్యమేముందీ? మెహదీ వాయించిన హార్మోనియం తన దగ్గరుందని పంకజ్ ఉధాస్ పరమానందం పొందుతారు. భూపెందర్ అంటారు- ‘అతని గొంతులో ప్రౌఢత్వం తో పాటు స్థిరత్వం ఇమిడి ఉంటాయి’ అని. మెహదీ గజల్స్ అంటే స్వర జానకి గారికి అమితమైన ఇష్టం. లతా మంగేష్కర్ దృష్టిలో మెహదీ ‘సంగీత వేల్పు’, ఆయన శాస్త్రీయ సరళి , రాజస్థానీ పరిమళాల కలగలుపు. ‘సంగీతం అందరినీ చేరువ చేస్తుంది, పాడే వారు ఒకరికొకరు ఎప్పుడూ సన్నిహితులే’ – లతా దీదీ వాక్కు అక్షరాలా నిజం. పర్వీన్ సుల్తానా, మెహదీ హస్సన్ ‘కిరానా ఘరానా’ గాయకులు. అయితే- పర్వీన్ శాస్త్రీయ సంగీత మార్గాన్నీ, మెహదీ ‘గజల్’ మార్గాన్నీ అనుసరించారు. ‘హమే తుమ్ సే ప్యార్ కిత్ నా ...’ అని పర్వీన్ పాడిన ఆర్డీ బర్మన్ వరస మెహదీ ఒకనాడు పాడిన వరసకు దగ్గరగా ఉన్నది ఇందుకేనేమో. తలత్ అజీజ్ – తను మెహదీ హస్సన్ శిష్య రత్నమైనందుకు గర్విస్తాడు. పని గట్టుకునీ తప్పులెన్నక ‘ స నుంచి సం వరకు శృతి లో ఉండాలి’ ... ఇదీ గురువుగా మెహదీ శిష్యులకిచ్చే ఆదేశం. లాహోర్ కి చెందిన గజల్ రాజు గులాం ఆలీ గారికి కరాచీ గజల్ చక్రవర్తి మెహదీ పెద్ద మనసున్న పెద్దన్నయ్య గారుగా కనిపించేవారు. చిన్నా, పెద్దా అందరినీ సమాదరించే దొడ్డ గుణం హస్సన్ గారిది. కవి రవి గుల్జార్, గజల్ సార్జా మెహదీ ల మధ్య పోలిక ఉంది, తేడా కూడా ఉంది. పోలిక- మెహదీలో అంతర్లీనంగా భావ కవి ఉంటే, గుల్జార్ లో గాయకుడున్నాడు. గుల్జార్ అలనాడు పాక్ నుంచి ఇండియా కొచ్చేస్తే మెహదీ అదే సమయంలో ఇండియా నుంచి పాక్ వైపు తరలి పోయాడు. ఆరంభంలో మరో రూపం మూగబోయింది .. అని రాయడం గమనించే ఉంటారు. ‘మరో’ మాటకి కారణం- గతేడాది జగ్జీత్ సింగ్ అకాల మరణం. జగ్జీత్ తొలినాళ్ళలో మెహదీ తమ్ముడైన జమాల్ ఖా( దగ్గర సంగీత శిక్షణ పొందడం విశేషం. ఉభయ దేశాల గజల్ సామ్రాట్ లు ఇక లేరనే భయం అటూ ఇటూ ఒక్కొక్క యువ గజల్ సామ్రాట్ కదిలివస్తే గానీ తీరదు. తెలుగు వారికి భావ కవిత్వం తెలుసు. ఎంకి, నాయుడుబావ కవిత్వం తెలుసు. గజళ్ళు ఉర్దూలోనే అందంగా ఉంటాయి. హిందీలో కాస్త .. సరే. తెలుగులో ఎందుకో ఇంకా కుదరడమే లేదు. ఏవో మెహదీ కూర్చిన బాణీల్లో తెలుగు మాటలు పేర్చితే ఒకటీ అరా అలా వచ్చాయే కానీ ‘ఇదీ గజల్ వరస’ అనేలా ఒక్కటి కూడా లేదు. దాశరథి గారు గాలిబ్ గజళ్ళు అనువదిస్తే రెండేసి పాదాల్లో వచ్చిన ఆ తెలుగు మాటలతోనే తృప్తి పడ్డాం. సఖియా వివరించవే (నర్తనశాల), అన్నానా భామిని (సారంగధర), మనసా తుళ్ళి పడకే (శ్రీవారి ప్రేమలేఖ) వంటివి ఒకటీ అరా గజల్స్ కి దగ్గరగా వచ్చిన పాట వరసలని భావించి సంతృప్తి పడాలి. పాట కూర్పులో శిల్పం, పాట రాతలో సాహిత్యం, పాడే విధానంలో శాస్త్రం, పాట పాడుతుంటే గాంధర్వం.. ఇన్నిటితో కూడిన పాట .... స్వప్నం లా కనిపించినా కళ్ళ ముందు ‘ప్రేమ’ అనే వెలుగు రేఖ వైపు ప్రస్థానమౌతుంటే అదే దిగ్విజయంగా మెహదీ భావించడమే మెహదీ పేరు ప్రపంచంలో నినదించడానికి కారణం. అతని పేరు - ఇరు దేశాల చరిత్రకొక గర్వ కారణం. [మెహదీ హస్సన్ చరిత్ర: జన్మ స్థలం: లూనా (రాజస్థాన్, భారత్), జన్మ దినం: 18 జులై 1927; స్వాతంత్ర్య మనంతరం ‘కరాచీ’ కి పయనం, తండ్రి: ఉస్తాద్ అజిమ్ ఖా(, ద్రుపద్ గాయకుడు, హస్సన్ తొలి గురువు; హస్సన్ మరో గురువు: ఉస్తాద్ ఇస్మాయిల్ ఖా(; చిన్నాన్న: జమాల్ ఖా(, గాయకుడు, భారత్ వాసి ; మెహదీ చిన్నతనంలో పేదరికం చవి చూసిన వాడు; మెకానిక్ గా పని చేస్తూ గానం పట్ల శ్రద్ధ చూపించిన వాడు; గాత్రంలో తొలుత పలికించినవి తుమ్రీలే; గానం తో పాటు కుస్తీ కూడా నేర్చిన వాడు; కరాచీ రేడియో ద్వారా ‘గజల్’ గళానికి తొలిసారిగా తెర తీసింది 1957 లోనే; 1980 ల్లో ఉస్తాద్ ఫతే ఆలీ ఖా( తో మెహదీ హస్సన్ ‘సర్ గమ్’ అనే కచేరీ నిర్వహించారు; హమీర్ రాగం మెహదీ గళంలో బాగా పలుకుతుంది అని అభిమానులంటారు; తమ్ఘా –ఏ-ఇమ్ తి యాజ్ (పాకిస్తాన్) , హిలాల్ –ఏ- ఇమ్ తియాజ్ (పాకిస్తాన్), గోర్ఖా దక్షిణ బాహు (నేపాల్), సైగల్ అవార్డ్ ఆఫ్ ఇండియా – మెహదీ పొందిన కొన్ని బిరుదులు; ఉర్దూ, బెంగాలీ, పంజాబీ, పాశ్తో భాషల్లో ఇరవై వేల పాటలు పాడిన ఖ్యాతి మెహదీ కుంది; తుది శ్వాస: జూన్ 3, 2012, కరాచీలో]. సరిగ్గా ఇవే మన మహాకవి 1930 ల నాటి దేశ కాల పరిస్థితుల్లో కృంగిపోక నిటారుగా నిలబడి ప్రశ్నించినవి. ఆయన ఏమని ప్రశ్నించారూ? ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం!’ అప్పటికే పెను నిద్ర ఆవహించి ఉన్న జాతిని ఒక్క కుదుపు కుదుపిన ఈ వాక్యాలే ఇంత చైతన్యవంతంగా ఉంటే ఆ కవి ఆ సుదీర్ఘ కవిత చివర్లలో సంధించిన ప్రశ్నలు ఎంత ఆలోచన రేపి ఉండాలీ? ఏమిటా ప్రశ్నలు? ‘ఏ శిల్పం ? ఏ సాహిత్యం? ఏ శాస్త్రం? ఏ గాంధర్వం? ఏ వెల్గులకీ ప్రస్థానం? ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?’ అంతా రామమయం – ఒక భక్తుడి తాదాత్మ్యంలో. భగవంతుడి పట్ల ప్రేమ లేనిదే అలా అనడం కష్టమే. అలా ప్రేమతో భగవంతుడి కృపకి పాత్రం కావడం దిగ్విజయంగా భావించి ఆ కనపడని వెలుగు వైపు ప్రస్థానమవ్వడం నిజమైన భక్తుడి సదాశయం. ఈ జగమే సుందర ప్రేమాలయం – ఒక భావుకుడి తత్త్వం. సాటి మనిషి ప్రేమ లో భగవంతుణ్ణి కనుగొనడం కూడ కష్టమే. అటువంటి ప్రేమ కల గనడం, ఆ కలల వెలుగువైపే తన ప్రస్థానం అని తీర్మానించుకునే నిత్య సంతోషి భావుకుడు. ‘మహా ప్రస్థానం’ రచన నాటికి మహాకవి ఇంకా సినిమాల్లోకి రాలేదు. ఆయన చేత అంత పనీ చేయించి చేయందించినది మరో చేయి తిరిగిన రచయితా, కవీ – మల్లాది వారే. కావొచ్చు – అది ‘నీరా ఔర్ నందా’ హిందీ సినిమాకి వచ్చిన ’ఆహుతి’ అనే అనువాదం, అయినా అందులో పాటల కోసం పదాలు వెతుక్కోవడం, ఏదో ఒకటి పెట్టి అతికించడం మహాకవి చెయ్యనే లేదు. ఆపైన కూడా ఆయన పాటల కోసం మాటల్ని ఎప్పుడూ ఆహుతి చెయ్యలేదు. మహాకవి తొలి సినీ గీతం లో ‘ప్రేమ’ అగ్ర తాంబూల మందుకుంది. ‘ప్రేమయే జనన మరణ లీల.... యువ ప్రాణుల మ్రోల’ – పాట మహాకవిలోని తాత్వికుణ్ణి బయట పెట్టక తప్పలేదు. ‘ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోస పోకుమా’ అని భుజం తట్టి మేల్కొల్పే తత్త్వం ఆయనదని క్రమేణా అర్ధమైంది తెలుగు ప్రజకి. అరవైల నాటి స్వాత్రంత్ర్య దినోత్సవ సంబరాల్లోనే అంబరాన్ని అంటుతున్న ధరలు, అవినీతి, బంధు ప్రీతి, చీకటి బజారు.. అనే నాలుగు స్తంభాల ఆటలో దేశం కోల్పుతున్న అస్తిత్వాన్ని గుర్తు చేశారు. అవి చిరభాష్యాలయ్యాయి. శ్రీశ్రీ – అని కుదించి పలికితే ‘ఎటు తిప్పినా నేనే’ అనే అర్థమొస్తుంది. అందుకే ‘ఈ (ఇరవై) శతాబ్దం నాది’ అని ఆయన అనగలిగింది! అది ఆయనలోని అహం కాదు. ఆత్మ స్థైర్యం! ఒక్కసారి ఆలోచిస్తే ఒక శ్రీ –లో భావ కవి, మరో శ్రీ-లో విప్లవభావ కవి ఉన్నట్టే తోస్తుంది. ఆ ఒక శ్రీ-మంతుడిగా మహాకవిని చూడ దలిస్తే ఆయనకున్న పద సంపదలో ‘సోన , వెన్నెల సోన’ అనేవి మనకి కొసరి కొసరి కొన్నేళ్ళు పంచి పెట్టేసి ఇంక ఇవ్వను గాక ఇవ్వను అని తీర్మానించుకున్నట్టు కనిపిస్తుంది. తరువాత కాలమంతా రెండో శ్రీ-కారాన్నే ఆయన స్వీకరించినట్టు తెలుస్తుంది. ‘నా హృదయంలో నిదురించే చెలీ ..కలలలోనే కవ్వించే సఖీ’ అని నిస్సందేహంగా ప్రకటిస్తూ ‘నీ కన్నుల లోన దాగెనులే వెన్నెల సోన’ అనే ‘ఆరాధన’ రహస్యం బయట పెట్టారు (చూ. కనులు చూసినా పాటే). ‘ఎవరివో నీ వెవరివో.. నా భావనలో నా సాధనలో నాట్యము చేసే రాణివో’ అని సందేహిస్తూనే ‘దివినే వదలి భువికేతెంచిన తేనెల వెన్నెల సోనవో’ అనే ఆహ్వానం పంపారు. ప్రేమ ‘పునర్జన్మ’ ఎత్తింది (వి. కనులు మూసినా పాటే). ‘నెలబాలుని చిరునవ్వుల తెలి వెన్నెల సోనలలో –చెలరేగే అలల మీద ఊయలలూగి ... పయనించే మన వలపుల బంగరు నావ’ అని సంతోషంగా జీవిత గమ్యం చేరుకున్న ‘బావా మరదళ్ళు’ ఆయనకి నచ్చారు (వి. కనులు మూసినా పాటే). ‘జననీ నయనాల వెలిగించే రోజు నేడు’ అయితే ఒకరికి తల్లి ప్రేమ వెన్నెల సోన గా , మరొకరికి ‘కన్నీటి మంచు సోన’ గా దక్కడం ఆశ్చర్యమనిపించదూ? మల్లాది వారి రచనల్లో ‘చనువు’ తీసుకున్నంత చొరవ అందరిలోనూ కనపడదు. శ్రీశ్రీ గారు ఒకే ఒక జావళీ (చిత్రం: బొబ్బిలి యుద్ధం) ‘ నిను చేర మనసాయెరా నా స్వామీ ...చనువార దయ సేయరా..’ అన్నది రాస్తే అందులో ‘చనువు’ చొరవ తీసుకుంది. అది మల్లాది వారి శైలికి ప్రేరణ యేమో ! ఇక మల్లాది వారి శైలి గురించి ఎంత చెప్పుకున్నా ‘మళ్ళా ఆది’ లోకే వస్తాం. ఆయన రాసిన సినీ గీతాల్లో ఉయ్యాలూగే చిటి రాచిలుక వంటి పసి పాపలు, బడి బరువనిపించే చిన్న పిల్లలు, తలచిన వలచే కన్నెజాణలు, గానాల తేనెలు చిందు వాళ్ళు, బెడదలన్నీ తీరిన రాచిలుకలు, వనరైన సిలకలు, మబ్బులకు సరాసరి ఎగిరే పావురాలు, కోగ్గట్టిన చందమామలు, వెంపరలాడే పున్నమితో వేగలేని యువ జంటలు, మనసైన మహరాజులు, సురతాణులైన అందాల రాణులు, వన్నెల సొమ్ములు, నవకాలొలికే చిరునవ్వులు, సెకేలు నవ్వులు, చనవైన గారవము, మరుమల్లె దొంతరలు, మామిడి పందిళ్ళ నీడలు, మారాకు ప్రేమలు, ఓరుగాలులు, చలి పిడుగులు, పదునైన వేదనలు, కనుచాటైన మోహనులు, మాయని మారని మమతలు, కొనసాగు వేడుకలు, చిరాకు పెడితే చిక్కున పడతావ్ అని చెప్పే హెచ్చరికలు, రామనామమనే మిఠాయీ.... దేనికీ, వేటికీ కొరత లేదు. అన్నీ ‘గజల్ గుండె’ చప్పుళ్ళే. అయితేనేం, అన్నీ ‘గజల్’ వరసలు కాలేదు. ‘చివరకు మిగిలేది’ సినిమా పేరైనా ‘గజల్’ కి చేరువగా వచ్చిన పాటలున్న చిత్రానికి ఉదాహరణగా చివరకు మిగిలేది ఆ చిత్రమే. అందులోని పాటలు- అని నీవన్నది విన్నానోయి, కవి కోకిల తీయని పలుకులలో, చెంగున అలమీద మిడిసి పోతది మీను, అందానికి అందం నేనే, సుధవోల్ సుహాసినీ – అశ్వత్థామ గారు మలచిన అమృత గుళికలు. (చూ. కనులు చూసినా పాటే – ఒక్కటే కాదు నాలుగు) చొరవ తీసుకునీ ‘విన వేడుక’ కలిగించే మల్లాది వారి రచనలు కరువు తీరా చదివితే చాలు తెలుగు వాళ్ళమైనందుకు గర్వ పడతాం, ఇప్పటి తెలుగు అప్పటిలా లేనందుకు దుప్పటిలో దూరి విలవిలలాడతాం. (ఈ ముగ్గురి ప్రత్యేకతల ఫోటోలు 'ఆల్ -బొమ్మ-లే' లో చూడవచ్చు...) -డా. తాతిరాజు వేణుగోపాల్ , 16 జూన్ 2012
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|