మునుపటి నా మాట
జా: హాయ్ గోప్యం గో: హాయ్ జాప్యం.. అయినా ఏం హాయిలెద్దూ.. వానలా సరిగా లేవు. ఉక్క పోత తగ్గదు..ఎలాగో మరి ఏడుకొండలవాడా! జా: ఏడుకొండలవాడా ..అంటే గుర్తొచ్చింది. వారం కిందట నేనడిగింది... శ్రీరంగం గోపాలరత్నం గారి పాట. ఏదో అరుదైన గాయకుల గురించి చెబుతున్నావు కదా అని అడిగా. వచ్చే వారం, కృష్ణ పక్షం అంటూ దాటేశావ్. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట... గో:ఎవరూ.. నేనా? జా: జోకా.. పాహిమాం.. ఆ పాట పాడుకుంటున్నానోయ్! గో: తెలుసులే.. సీనియర్స్ అవుతున్న కొద్దీ సీరియస్ అయిపోనక్కర్లేదులే... జా: ఇంతకీ.. ఆ పాట అప్పుడెందు కివ్వలేదూ? సదా ఇస్తానూ.. అని అనక పొతే ఇదిగో ఇలా సతాయిస్తాను. గో: పట్టువదలని విక్రమార్కుణ్ణి పట్టి విడవని బేతాళుడిలా..నువ్వున్నావే ..అమ్మమ్మమ్మ ...చెబుతాలే ఉండు.. అప్పుడన్ని పాటలిచ్చా కదా..సర్లే ..ఈ వారం ఈ పాట ఇద్దామని..వాయిదా వేసా. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ 'ఒక పిలుపులో పిలిచితే' పాట ఎవరు రాసి ఉంటారంటావ్? జా: అది ..నాకు తెలిసి డబ్భైల నాటి సినిమా శ్రీ వెంకటేశ్వర వైభవం లోనిది కాబట్టి ..అందులో ఏడు కొండల శ్రీనివాసా మూడు మూర్తుల తిరుమలేశా, తెర తీయరా తిరుపతి దేవరా, కోటి ప్రభలతో స్వామి కోనేటి అలలపై ..లాంటి భేషైన పాటలు రాసారే ... ఆ ఆచార్య ఆత్రేయ గారే ఇదీ రాసి ఉంటారు’ గో: నువ్వు అస్తమానూ కాలు వెయ్యడానికి ఇక్కడ రెడీగా పప్పు లేదు నాయనా..
జా: పప్పు...ఇక్కడెందుకుంటుంది చెప్పు ...అది ఆకాశం లో చవగ్గా ఉంటేనూ.. గో: ఆకాశం అంటుకునే ధరలొక వైపు..అంటావ్! జా: శ్రీరంగం నుంచి శ్రీశ్రీ వరకొచ్చేవా..నా తండ్రే ...ఏదిడా ...తమిళం తెలుగు కలిపి అడుగుతున్నా ... చెప్పు..చెపు .. ఎవరు రాశారో? గో: రెండు భాషలు కలిపి అడిగి నీకు నువ్వే కాస్త పజిలింగ్ పద్ధతిలో సమాధానం చెప్పుకున్నావ్! జా: అర్ధం కాలే.. పజిలేమిటీ.. గో: ఏదిడా అన్నవా.. కాస్త అక్షారాలూ, గుణింతాలూ మార్చు.. ఏడిదా అవుతుంది. ఆ పాట రాసినాయన ఏడిద కామేశ్వరరావు గారు. ఈయన సోదరుడు ఏడిద గోపాల రావు ఒకప్పుడు డిల్లీ నుంచి తెలుగులో వార్తలు చెప్పేవారు. ఇంకో సోదరుడు ఏడిద నాగేశ్వరరావు .. శంకరాభరణం సినిమా నిర్మాతల్లో ఒకరు. అరుదైన సినీ గాయని శ్ర్రీ రంగం గోపాల రత్నం గారు కదా, అందుకని ఆవిడ పాడిన ఈ అరుదైన రచయిత పాటని ఇప్పుడు వినిపించాలని అప్పుడలా దాటేశా. ఆయనలాంటి ఎందరో అరుదైన రచయితలు.. ఈ పూట నా మాట గా మన ముందు రెక్కలు గట్టుకు వాలుతున్నారు. జా: ఆగాగు.. మాటల్లో ఆకాశం అన్నావ్. శంకరాభరణం సినిమా మరో నిర్మాత పేరు ఆకాశం శ్రీరాములు. అవునా?’ గో: టు హెడ్స్ ఆర్ బెట్టర్దేన్ వన్ ..అన్నారు. శంకరాభరణం విషయంలో ఇది నిజమైంది. సినిమా కాల విభజనకి శంకరాభరణం ఒక కొండగుర్తైంది కూడా. నాగయ్య గారి త్యాగయ్య వరకు ఒక కాలం, బి ఎన్ రెడ్డి గారి మల్లీశ్వరి వరకు ఒక కాలం, పుల్లయ్య గారి జయభేరి వరకు ఒక కాలం, విశ్వనాథ్ గారి శంకరాభరణం వరకు ఒక కాలం అని హాయిగా విడదీసి పరిశోధన చేసుకోవచ్చు. జా: కాని... ఇవన్నీ సంగీత పరంగా ఉత్తమోత్తమమైనవని కాబట్టి ఆ రకంగా విభజన చేస్తున్నావేమో.. గో: అంతే కదా..అంతేగానీ ...ఏ ఒక్కరి భజనో చెయ్యట్లేదు కదా, సంతోషిద్దూ.. జా: సంతోషించాం గానీ ...గురుడా.. సింగర్స్ ని తీసుకొచ్చి ఆస్ట్రానామీ లో దించావ్. ఇప్పుడు రచయితలని ఏ నామీ లో దించుతావో ఏమో... గో: సునామీ లో మటుకు కాదులే. అయితే ప్రతి సినీ రచయిత ఒక జలాంతర్గామి అంటాను. రచన అనేది ఓ ప్రవాహం. మదిలో ఎక్కడో ఓ ఊహ మొదలై అక్షర శిల నుంచి జారి కాయితం మీద పడి సిరా చుక్కల రూపంలో ప్రవహించడం మామూలు విషయం కాదు. మన చిన్నా ఒకసారి అన్నాడు- నువ్వూ నేనూ చూసే దృశ్యం ఒకటే ..అయితే నేను కేవలం బావుంది అని మాత్రం చెబుతాను, నువ్వు ఎంత బావుందో వర్ణిస్తావు.. అదీ తేడా.. అని. సినిమా రచన ఓస్ ఎంత సేపు అనే ఆలోచన ఎందరికో ఉంది. అమలా పురం,ఆహాపురం,ఇచ్ఛా పురం అంటూ బస్ స్టాండ్ లో అరిచినట్టు అరవడమేగా తెలుగు సినిమా పాట అని కొందరి అభిప్రాయం. తప్పదు. సామాన్యుడికి ఇంతకన్నా అర్థం కాదులే అని తల వంచేస్తే ఇలాంటి తలవంపులొస్తాయి. ‘క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధరించరా ..విని తరించరా’ అనేలా అర్థమయ్యే లెవెల్ కి తీసుకు వెళతాను అని చెప్పి తలెత్తుకు తిరగలిగితే అది అహంకారం కాదు.. జా: ఎక్కువగా కొత్త రచయితలే ఏదేదో రాస్తూ .. గో: తప్పు తప్పు .. అవకాశం, అవసరం, అభిలాష ఉన్నప్పుడు వారూ మంచి మంచి పాటలు రాస్తున్నారు. సినిమా సందర్భం, సన్నివేశం సరిగా చెప్పక ఏదో నాలుగు కాలేజీలు తిరిగేసి వచ్చి వాళ్లనుకునే మాటలు తిరగేసి రాసేద్దురూ అని బలవంత పెడితే క్వాలిటీ ఏముంటుందీ. 'గుంటా గుంటా లావు తగ్గి సన్న గుంటా ..నువ్వు లవ్వు చేస్తే తిన్నగుంటా' అనే పాటలొచ్చే అవకాశం ఉంది. ఆ మాటకొస్తే పాత కవులంతా మేటి పాట కవులని అనలేం. అక్కడక్కడా వారూ అవాక్కులు రాయకుండా ఉండలేదు. మేటి – అంటే భాషా, భావం అన్నీ సక్రమంగా ఉండడమేగా? అది ఎవ్వరికీ సాధ్యం కాదు. సినిమా పాట అనేది పూర్తిగా సినిమా కథ, కథనం మీద ఆధార పడి ఉంటుంది. ఒక భావం చెప్పగానే దానికి ఎవరు ఎంతబాగా నగిషీ పెడతారన్న దాని బట్టి ఉంటుంది. అప్పటి కవుల్లో కేవలం ఒకటీ అరా రాసినా ఆ రాసిన వాటితోనే కలకాలం గుర్తుండిపోయిన వాళ్ళూ ఉన్నారు. ఒకటీ అరా రాసి ఎందుకూ పనికిరాని పాటలు రాశామే అని కలవరపడిన వాళ్ళూ ఉన్నారు. ఎప్పుడూ కొందరి పేర్లు నోట నలుగుతూ ఉంటాయి కానీ కొంచెం శ్రద్ధగా వెతికితే ఓ పది పదిహేను మంది పేర్లు దొరుకుతాయి. వారు కూడా చక్కని పాటలు లెక్కలేనన్ని కాకపోయినా కొన్నైనా రాశారని తెలుస్తుంది. వాళ్ళలో కొందరు ఎవరో మొహమాట పెట్టి రాయించుకుంటే రాసినవారైతే, మరి కొందరు రాసి రాసి ఎలాగైనా తామూ గుర్తుండాలని ప్రయత్నించిన వారు. ఏదో ఒకటి రాసి ఆగి పోయిన వైనం కూడా కొందరిలో కనిపిస్తుంది. వీరనీ వారనీ పేరు పెట్టి చెప్పడం అంత భావ్యం కాదనుకో.. జా: నిజమే.. దైతా గోపాలం , తాపీ ధర్మారావు, సముద్రాల సీనియర్, కొసరాజు , సదాశివబ్రహ్మం, పింగళి, మల్లాది, దేవులపల్లి, శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, సినారె, దాశరథి, అనిసెట్టి, సముద్రాల జూనియర్... ఇలా ఓ పదిహేనుమంది ప్రముఖుల పేర్లు.. శుక్ల పాడ్యమి నుంచి పున్నమి వరకు రోజుకొక్కరు చొప్పున స్మరించుకోవడానికి వీలైనట్లు .. గుర్తుకొచ్చినా వాళ్ళ టైములోని మిగతా వాళ్ళు జ్ఞాపకం ఉండక అమావాస్య వైపు రోజులు దొర్లి పోతుంటాయి. . ఏమిటో కవులది జల సంబంధం అన్నావ్ కదా అని నేనూ ఇలా ఊదేస్తున్నాను. గో: మంచిగ అన్నవ్ బిడ్డా. ఇప్పుడు చెప్పిన వాళ్ళ రాత ముద్రలు మన మనస్సులో పడిపోవడం వల్ల కొంతా, వీరే ఎక్కువ పాటలు రాయడం వల్ల కొంతా .. కారణంగా.. వీరి వీరి పాటలే ఎక్కువగా గుర్తుండి పోతున్నాయి. వీరి మధ్య వేరే ఏ కవి రాసినా వారిని ప్రత్యేకంగా గుర్తించలేక పోతున్నాం. వీళ్ళలో ఒకరిద్దరు ఎంత బాగా రాసినా ఆ తెల్సిన పదిహేను మందిలో ఎవరో ఒకరు రాసి ఉంటారని సరిపెట్టుకుంటాం. కాని ..రచనా విధానం కొంచెం వేరుగా ఉందే..ఎవరీ కవి అని శోధించే వాళ్ళు ఎందరుంటారూ? జా: ఇలా జ్ఞాపకాలు నెమరేసుకోబట్టి నాకు మనసులోంచి మరి కొందరు కవులు బయటపడుతున్నారు. గో: చెప్పు చెప్పు.. ఎవరూ? జా: వీటూరి, జి.కె.మూర్తి, ముళ్ళపూడి, రాజశ్రీ, గోపి! గో: వీరేం తక్కువ కాదు. వీరిలో మొదటి ఇద్దరూ జానపద చిత్రాలకి ఎక్కువగా అంకితమయ్యారు. వీటూరి వారి పాటలు పున: ముద్రించి కొందరు ఒక క్షమించరాని తప్పు చేస్తున్నారు- వేటూరి అని పొరపాటుగ ముద్రించి. వీటూరి వేరు, వేటూరి వేరు. వీటూరి కలం నుంచి ‘కన్నుల్లో మిసమిసలు కనిపించనీ’, ’తొలి వలపే పదే పదే’ (దేవత) వంటి పాటలోస్తే విన్నవాళ్ళు ‘రాసింది సినారె కాదూ?’ అని నాలిక కరచుకున్నారట. అదే సినిమాలో ‘నాకు నీవే కావాలిరా’ అనే సినారె వారి పాట కొంచెం వెనక పడిపోయిన మాట నిజం. వీటూరి వారు ఆనాడు జానపదాల్లోనే మంచి ప్రబోధ గీతాలు రాసి తన లోని అభ్యుదయ భావాలు పంచులోగలిగారు. భావి పాలకులనబడే నేటి బాలకులు జగదేకవీరులై, విశ్వదాతలై, బాల చంద్రులై, అభిమన్యులై భారతజాతిని నడపాలి అని ఎంతో ఆశగా ఒక పాటలో కాంక్షించారు (ఉక్కుపిడుగు) . ఈ పాటలో వీరు 'జయహో' అనే నినాదం వాడారు. అంతకుముందు భక్త ప్రహ్లాద లో దానవ శూరుణ్ణి 'జయహో' అంటూ కీర్తించారొక కవి. అప్పట్లోఆస్కారాలకి ఆస్కారమేదీ? ఇప్పుడంటే రెహమాన్ గారి చలవ వల్ల 'జయహో' అనేది ఒకటుందని తెలుసుకున్నారంతా. జా: 'పూలు పూచెను నాకోసం' ... గో: నిజంగా నీకోసమే పూసాయంటావ్. జా: ఇదిగో మళ్ళీ నీ హ్యూమరసం పక్కన పెట్టి ఆ వీటూరి వారి పాట వినిపించు. నా కసలే నీరసం.. గో: చిక్కొచ్చిందోయ్ బాబూ ..చిక్కొచ్చింది. ఎందుకంటే ఆ పాట బిగినింగ్ లో మురళీ నాదం ఉంది కదా.. అది కృష్ణప్రేమ థీం మ్యూజిక్ కింద అప్పచెప్పేను. ఈ మధ్య ఆడియోలు ఇవ్వడం ఇబ్బందికరమౌతోంది అని తెలిసి మొన్న మొన్నటి వరకు ఆ నాదం వినిపించిన వాణ్ణి కాస్త విరమించుకున్నాను. పాట వినిపించమంటావు ..గుడ్..కాని, ఈ సారికి వాయిదా వేస్తున్నా, సారీ. జా: సరే కానీ .. రెండు స్వరాల క్షమా హృదయులమే అందరంనూ! గో: మ్యూజోకా? ఫరవాలేదే! విను.. జి.కె. మూర్తి గారు ‘ఏడేడు జన్మలనుండి పడి ఉంది బ్రహ్మ ముడి’ (గురువును మించిన శిష్యుడు) అని రాస్తే అది ఆరుద్ర గారి రచన అని ఆ రోజుల్లో పొరబడిన వారూ ఉండేవారు. చాలా ఏళ్ళ తరువాత ఆయనే ‘పూచే పూల లోన వీచే గాలిలోన’ అని గీత కోసం ఓ భావ గీతం రాస్తే ఎవరీయన? అని అడిగిన వారూ ఉన్నారు. గమ్మత్తు – కనకదుర్గా పూజా మహిమ చిత్రంలో మిక్కిలినేని వారికి ఘంటసాల వారు పాడిన పాట ఒకటి ఉంది. ఇది అరుదైన కలయిక. సాధారణంగా మిక్కిలినేని వారికి పద్యాలూ ఉండవచ్చు కాని పాటలుండడం అరుదు. ఆ పాట – జీవనమే పావనం. అది జి.కె.మూర్తి గారు రాసినదే. జా: మూర్తి గారు పూచే పూలలోన అని రాస్తే వారిదే ఒకనాటి ఇంకో పూల పాట గుర్తొచ్చింది. ‘పువ్వులు పూయును పదివేలు’.. గో: అది కూడా వినిపిస్తే అదే పదివేలు అంటావ్. అదీ ప్రస్తుతానికి వాయిదావే. ఆ మధ్య జి.కె. మూర్తి గారి యుగళ గీతం ‘నాలోని స్వప్నాల అందాలే నీవు’ .. అన్నది మళ్ళీ క్యాసెట్స్ లో రిలీజ్ చేశారు కాని కంపెనీ వాళ్ళు రికార్డింగ్ క్వాలిటీ చూసుకోలేదు. ఒక చరణంలో ట్రాక్ స్లో అయిపొయింది. ఎప్పుడో లక్కీగా రేడియో నుంచి ఉండుండి వచ్చే గరగర్ల మధ్య గుర గుర్ల మధ్య రికార్డ్ చేసుకున్న అసలు వెర్షన్ ఉంది కాబట్టి ఇలా చెప్పగలుగుతున్నాను. జా: ఆ లెక్కన .. ఇవాళ ఆడియోలూ వీడియోలూ ఉండవా ఏమిటి కొంపదీసి? గో: ఇవ్వాలనే ఉంటుంది .. బాగా వేగిన ఆ గార్లు .. వంటింటి నుంచి గంప తీసి! మళ్ళీ అదే కూత- ప్రస్తుతానికి వాయిదా. సరే..విను.. ‘జీవితం ఎంతో తియ్యనిది’ (మళ్ళీపెళ్ళి), ‘ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, 'మనసా కవ్వించకే నన్నిలా ’(పండంటి కాపురం), ’నవ్వూ నవ్వించు నవ్వలేని వారికి నీ నవ్వులు పంచు’ (భాగస్తులు) – ఈ పాటలు బాగా గుర్తున్నాయా? జా: వావ్...లేకేం? ఎవరు రాశారని మాత్రం అడగొద్దు. బాలు ఒకటి, కోదండపాణి ఒకటి, సుశీల ఒకటి, వాణీజయరాం ఒకటి పాడిన పాటలవి. ఏ కవి అన్నది గోప్యంగా ఉంచకు. గో: జాప్యం కూడా ఎందుకూ? మైలవరపు గోపి....అని చెప్పేద్దాం. ఆ పాటలన్నీ ఆయనవే. బాలు గారికి ఈయన మంచి స్నేహితుడు. ‘గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం’ అనే ప్రబోధ గీతం గోపి రాయగలరని ఎవ్వరూ ఊహించలేదు. ‘బానిస భావం విడనాడి ఏ జాతి నడచునో అది జాతి’ – ఎంత ధైర్యంగా అన్నారాయన! ఈయనే ‘దారి చూపిన దేవత’ పాట రాసారా ...కాని ఒక మోహన్ బాబు, ఒక ఏసుదాస్ ని గుర్తుంచుకున్నంతగా ఈ రచయితని ఎంతమంది గుర్తుంచుకున్నారూ? మన దురదృష్టం కాకపొతే .. చిన్న వయసులోనే సుదూర లోకవాసి అయిపోవడం ఏమిటి చెప్పూ? జా: అదే విచారం... చిన్నారి రాణి సిరిమల్లె పువ్వు ... పాట మరోసారి పాడుకో నివ్వు.. ఇప్పుడు ఒక్కొకటీ స్కూల్ రోజుల్లో ఎస్ ఎస్ వీ టీ సినిమా హాల్లో రీళ్ళ లా గుర్తొస్తున్నాయి.. నీ చెయ్యీ నా చెయ్యీ పెనవేసి బాస చెయ్యి .. పాట తెగ పాడుకునే వాళ్ళం కదూ. అది గోపి రాసినదని నాకైతే పండంటి కాపురం తరువాతే తెలిసింది. గో: ఓ..అంటే ..పెళ్ళయ్యాక తెలిసిందా? జా:అబ్బబ్బ ... మళ్ళీ కు.జో నా? అలాంటి కవి ఒకడున్నాడని పండంటి కాపురం సినిమాతోనే తెలిసింది. గో: బాసికం కట్టక ముందు ప్రేమికుల బాసలు ఎలా ఉంటాయో తేలికైన భాషలో ఆయనలా చెప్పగలగడం అందరికీ సాధ్యం కాదు. అలాగే మరో జంట ‘నింగి సాక్షి..నేల సాక్షి .. నిను వలచిన నా మనసే సాక్షి’ అని తీర్మానించుకోవడంలో పంచ భూతాల కన్నా స్వంత మనసే ఎక్కువ అన్నట్టు ఎంతబాగా రాశారూ.. జా: నువ్ చెప్పింది కార్తీక దీపం సినిమా పాట- 'నీ కౌగిలిలో తలవాల్చి' ..-కదూ. జానకి పాడుతున్నారా, శ్రీదేవియే పాడుతున్నారా అనే సందేహంతో కొట్టు మిట్టాడి ఇప్పటికి వంద సార్లా పాట విన్నా. ‘తలవాల్చి’ అన్న పద ప్రయోగం కొత్త అని నా అభిప్రాయం. గో: పచ్చని సంసారం లో 'పాడమని పాట వినే రాజు ఎవ్వరు?' అని ప్రశ్నించిన కవి గోపియే. 'ఎంకినై పుట్టాల ఏ జనమకైనా' ..లలితగీతం కూడా ఈయనదే. జా: 'దారి చూపిన దేవత' .. గోపి పాట నెమరేసుకుంటే ఓ దారి దొరికింది. ఏసుదాస్ పాట ఇది కాబట్టి మరో పాట నోటి దాక వస్తోంది. వచ్చేసింది. సాగర తీర సమీపాన.. గో: మేరీమాత సినిమాలోనిదీ పాట .. ఇంతకీ ఎవరు రాశారో తెలుసా ఆ పాట? రాజశ్రీ ...తమిళంలో టి.ఎం.ఎస్. పాడారు. జా: ఆడియో ప్లీజ్.. గో: ప్లీజింగ్ యూ విత్ టెల్గూ సాంగ్. సరేనా? కనులు మూసినా (ఆ) పాటే కదూ.. ఆనాటి రాజశ్రీ వారిని నేటి భువన చంద్ర గారు మహారాజ రాజశ్రీ అని హాసం పత్రిక లో చమత్కరించారు. రాజశ్రీ అనగానే ‘మామా చందమామా ..వినరావా నా కథ’ (సంబరాల రాంబాబు), ‘ఆనాటి చెలిమి ఒక కల’ (పెళ్లిరోజు) వంటి పాటలు గుర్తొస్తాయి. అలాంటి ఈయన ఎనభైల కాలంలో ‘డబ్బింగ్’ సినిమాలకే పరిమితమైపోయారు. చిన్న చిన్న మాటలు..చిరకాలపు పాటలు ఈయనవి. విజీనారం ఈనది. జా: ముద్ర ఉండనే ఉంది.. సంబరాల రాంబాబు లోని పాట ఉదాహరణ.. కన్నులే నవ్వేయి..వెన్నెలను చిందేయి..సిగ్గులే పాడేయి.. ఏత్వ క్రియాత్మకాలు.. గో: వహ్వా.. శ్రీశ్రీగారు ‘దొరికేరు దొరగారు’ అని ప్రేమించి చూడు సినిమాలో అన్నట్టు. అయినా మాండలికం అనేది పాట అనే వంటలో పెసరట్టు, దాన్ని పల్లవి అనే ఉప్మాతో జతకట్టు. సినిమా అనే ఎస్టేటుకి మాండలికంలో రాసిన పాట పెద్ద ఎసెట్టు. ఈ కన్నులే నవ్వేయి పాటని ఇంత బాగా వి.కుమార్ అనే ఆయన స్వర పరిస్తే .. సినిమాలో కోత వేశారు. బహుశా నిడివి ఎక్కువయ్యో ఏమో ... జా: నాకు తెలిసి ఒక విశేషం ఉంది ...ఏమిటో తెలుసా.. శ్రీశ్రీ గారితో తొలి డబ్బింగ్ సినిమా హిందీ నుంచి తెలుగులోకి వచ్చింది. రాజశ్రీ కాలం నాటికి తెలుగులో ఉన్నవన్నీ తమిళం డబ్బింగులే. గో: ఫలానా సినిమా నుంచి డబ్ చేస్తున్నాం అంటే ఇంతకీ అది ఎంత డబ్బు చేస్తుంది? అని జోకినవారు ఉన్నారు. ఎనభైల్లో తమిళం డబ్బింగులకి కారణం ఇళయరాజా వారి జోరప్పుడు సాగుతోంది మరి... జా: రాజశ్రీ సంగీతం కూర్చడం విన్నాను. దర్శకత్వం కూడా చేసినట్టనిపిస్తోంది. గో: వీటూరి వారు భారతి అనే సినిమాకి దర్శకత్వం వహించారు. రాజశ్రీ గారు కూడా సినిమాలు డైరెక్ట్ చేశారు. వీళ్ళ కోవలోకి కథా రచయిత పాలగుమ్మి పద్మరాజు గారినీ చేర్చాలి. పా.ప గారు అని రచయితలు పిలుస్తారు ఈయన్ని. దేవుడిచ్చిన భర్త సినిమా డైరెక్ట్ చేశారు. ఇది వరకు పా.ప. గారి పాటలు స్మరించుకున్నాం కనుక ఓ సారి కృష్ణప్రేమ పాత ఖజానా కదిపితే మేలేమో! జా: ఆయన ఆఖరి పాట బహుశా బాపు గారి శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ లోని ‘రాకోయి అనుకొని అతిధి’ అనే అనుకుంటాను. గో: అప్పుడు వీడియో ఇచ్చాను. ఈ పాట విని దేవులపల్లి వారు రాశారేమో అని పొరబడినవారూ ఉన్నారు. జా: కథలంటే జ్ఞాపకమొచ్చారు.. బుడుగుని కనిపెట్టిన ముళ్ళపూడి వారు. ఈయన చాలా పాటలు రాశారట. నాకు మాత్రం ‘మేడ మీద మేడ కట్టి’ .... గో: అందులో వెంకట రమణుడిని పూజించాలని ఉంది అంటావ్. ముళ్ళపూడి వారు చాలా అనే కంటే ‘ఇవి చాలా’ అన్నట్టు కనీసం అరడజను పాటలైనా రాసి ఉంటారు. తొలి పాటలు ‘పక్కలో బల్లెం’ సినిమాలో ఉన్నాయి. విననోచుకోలేదు ఇంతదాకా. నువ్వన్న 'మేడ మీద మేడ కట్టి' .. (ప్రేమించి చూడు) పాట బాగా పాపులర్. అయితే అది అనువాద గీతం. అసలు కన్నా వడ్డీ ముద్దు అన్నట్టు ఒక్కోసారి అనువాదాలు బాగా హిట్ అవుతాయి వాటి అసలు స్వరూపాల కన్నా. స్వంత కొత్త సినిమాలకి రమణ గారు రాశారు. ఆయన కల గన్న శ్రీరామరాజ్యం సినిమాగా రాగలిగినా అందులో ఆయన పాట లేకపోవడం అభిమానులకి నిరాశే. జా: ముళ్ళపూడి వారి పేరులో ముళ్ళే కాని మనసు గులాబీ రేక. కలంలో హాస్యం, కళ్ళలో దరహాసం ఆయన స్పెషల్. గో: హాస్యం అని గుర్తు చేశావ్ ..అప్పలాచార్య అనే కవిని. ఇందాక నీ చెయ్యి నాచెయ్యి .. పాట చెప్పావు చూడు.. ఆ జాతకరత్న మిడతంభొట్లు చిత్రంలోనిదే 'బంగారు తల్లి నా చెల్లెలు' అన్న అన్నయ్య పాట ఒకటుంది. అది ఈయన కలం చలువే. కనులు చూసినా పాటే .. వైపు వెళితే వీడియో ఆఖర్లో ఉంటుంది. రెండు వైపులా పదునున్న పాళీ ఈయన కలానిది. గాడిద మీద రాయగలరూ (జా.ర.మి.భొ. లో 'దయ చూడవే గాడిదా') .. గారాల బాల మీదా రాయగలరు (అదే జా.ర.మి.భొ. లో 'చెలియా సఖియా ఈ వేళ చలిగా ఉన్నదే'- పాట ). జా: సినీ సంగీత ప్రపంచానికి స్వాగతించి ఇలా ఒకటీ అరా పాటలు రాయనిచ్చి తొందరలోనే వాళ్ళని మరచిపోయేది నిర్మాతలేనా? వీటూరిని, అప్పలాచార్యని హాస్య నటుడు, నిర్మాత, గాయకుడు అయిన పద్మనాభం; గోపి గారిని నటుడు, నిర్మాత, కథకుడు అయిన డాక్టర్ ఎం. ప్రభాకరరెడ్డి వారివారి సినిమాల్లో బాగా ప్రోత్సాహించారు కదూ. గో: అవును. ఫలానా రచయిత బిజీ కనుక నువ్వు రాయవోయ్ అన్న ధోరణితో కాకుండా ఫలానా పాట ఈయనైతే బాగా రాయగలడు అన్న నమ్మకంతో నిర్మాత కొత్తవారిని ప్రోత్సాహించాలి. శ్రోత లేదా ప్రేక్షకుడు ఫలానా కవి గారే రాయాలి అని ఎప్పుడూ అడగడు. పాట బావుంటే ఆహా అంటాడు. పాట మొత్తం రూపంలో బాణీ, రచన, తెర మీద నటన అన్నీ బావుంటే పది కాలాలు వినిపిస్తూ ఉంటుంది. అవునూ.. ఈ మధ్య అందరికీ ‘స్వాగతించి’ అని అనడం అలవాటైపోయింది. అలా క్రియాత్మకంగా ఇది వరకు అనేవారు కాదు. స్వాగతం చెబుతున్నాం, స్వాగతం పలుకుతున్నాం అనేవారు కాని ఫలానా వారినో, ఫలానానో స్వాగతిస్తున్నాం అని అనేవారు కాదు. ఇలా కొత్త ప్రయోగం చేసినది సిరివెన్నెల కవి గారే. నాకు నవ్వొస్తుంది. గతించు – అంటే పోయిన అనే అర్థం కదా.. స్వాగతించు... ఎంత ఎబ్బెట్టుగా ఉందో.. సరే కానీ.. ఎలాగూ స్వాగతం ..అనే చక్కని మాటకి స్వాగతం చెప్పావ్. నా స్వగతంలో ‘ఒకాయన గురించి చెప్పడం మరచిపోకేం’ అని అనుకుంటూ ఉన్నాను. జా: అరుదైన రచయితా? అదుర్స్ రచయితా? గో: ఒక మాటల రచయిత పాట రాయడం ఎవరూ ఊహించనిది. ఆయన... మోదుకూరి జాన్సన్. గొప్ప నాటకాలు రాశారు. సినిమాల్లో ఈయన వాడిన మాటలు తూటాలే. ఎన్టీఆర్ వారి దేశోద్ధారకులు సినిమా ఉండేది చూడు.. జా: పాతది బహువచనం. తరువాతో ఏక వచనం సిన్మా వచ్చింది కూడా. గో: ఆ బహు వచనం సినిమాలోనే ‘స్వాగతం దొరా సుస్వాగతం’ అనే చక్కని పాట రాసి అందులో ‘ఆంధ్ర’ని అందంగా వర్ణించారు. కనులు మూసినా పాటే.. లో ఆ పాట రెడీ. ఇదీ మహదేవన్ బాణీ అని చెప్పటానికి కూడా ఈ పాట ఓ చక్కని ఉదాహరణ. జా: అవునూ.. సినారె వారు 'స్వాగతం సుస్వాగతం ..స్వాగతం కురు సార్వభౌమ' అని ఎంతో హుందాగా రాశారు. ఆయనంటే అందరికీ చిరపరిచితుడు. మరి అంతగా తెలియని రచయితలు సైతం ‘స్వాగతం’ పాట ఒక్కటైనా రాయకుండా ఉండలేదనిపిస్తోంది. ఇదేమైనా సినీ సెంటిమెంటా? గో: యూ ఆర్ అబ్సల్యూట్ లీ కరెక్ట్. ముళ్ళపూడి వారన్నట్టు అది సెంటి 'మెంటాలిటీ'. సార్వభౌమ లాంటి ఎన్ టీ ఆర్ రూపం ఊహించగానే సినారె వారికి స్వాగత వాక్యాలు చెప్పాలనిపించింది. అలాగే దొర లాంటి శ్రీవారి విషయంలోనూ ఆరుద్ర గారు స్వాగతం చెప్పారు..'స్వాగతం ఓహో చిలిపినవ్వుల శ్రీవారూ.. దొరగారూ' .. ఆత్మీయులు సినిమాలో విన్నదే కదా. ఆ దొరగారక్కడ ఎ ఎన్ ఆర్. దాశరధి వారి ‘కన్నులైనా తెరవని ఓ చిన్నిపాపా స్వాగతం’ పాట కృష్ణ గారు పియానో వాయిస్తూ పాడుకునే పాట. చిల్లర భావన్నారాయణ గారు ‘లక్ష్మీ కటాక్షం’ చిత్రంలో ‘స్వాగతం స్వాగతం శాత్రవ జన జైత్ర స్వాగతం’ అని ఎన్టీ ఆర్ వారిని స్తుతిస్తే హుందాగా చూపించారు ఆయన్ని ఆ పాటలో. కనులు చూసినా పాటే... లో పాట రెడీ. చిల్లర వారు శుక్రవారపు పొద్దు బువ్వ నెట్ట వద్దు అన్న సూక్తి దండకం (లక్ష్మీ కటాక్షం) రాసి తన పేరు అనే ధనం స్థిరం చేసుకున్నారు. జా: పెద్ద కవులు బాగా రాయనప్పుడు, రాసేందుకు సమయం లేనప్పుడు తళుక్కుమని మెరిసే చిన్న కవుల పాటలు కూడా అందలం ఎక్కుతాయి. అందులో ఏ మాత్రం సందేహం లేదు. స్వాగతం అనగానే మరో గొప్ప చిన్నకవి గుర్తొచ్చాడు. గో: ఎవరో చెబితే మేం అదృష్టవంతులం. జా: నీ మాటలోనే ఉంది.. ఆ పేరు.. నన్ను చెప్పొద్దని ఆపేరు (ఆపారు). దీపం వెలిగించి కనుక్కోవడం నీ వంతు.. గో: హతవిధీ.. నాకే పజిలా.. జా: నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా.. గో: చెప్పనా.. ఆయన పేరు అదృష్ట దీపక్.. అవునా.. ఈయన 'మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం' అనే అద్భుతమైన పాట రాశారు. చక్రవర్తి మాల్ కౌ(జ్ రాగంలో అద్భుతంగా స్వర పరిచారు. ఇంకా ఉషశ్రీ, దాసం గోపాలకృష్ణ, మల్లెమాల (ఎం ఎస్ రెడ్డి), జాలాది, దాసరి నారాయణరావు(పెద్ద దర్శకుడు .. కాని చిన్న కవి, మంచి పాటలు అందించిన మేధావి), గబ్బిట వెంకట్రావు ...ఇలా ఎందఱో కవులున్నారు, ఉండేవారు. అందరి గురించి చెబుతూ పోతుంటే తెల్లారి పోతుంది. 'తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే'.. జా: 'తగువెట్టా తీరేదె తలుపుతీయవే భామా'.. ఓహ్.. ఎన్నాళ్లకెన్నాళ్ళ కి! ఏసుదాస్ గొంతు నుంచి యాస ఎంత బాగా వచ్చిందీ! గో: ఎవరా పాట రాశారో అడగవాయే. ఉషశ్రీ నాయనా. జా: అంటే.. ర్రేడియో ఆయనా?... గో: ర్రే అని ఎంత నొక్కి వక్కాణించినా రేడియో ఉషశ్రీ , ఈయనా ఒకరు కాదు.. 'జీవితమే ఓ పూబాట ఆడుకో సయ్యాట' ..పాట ఈయనదే. 'జోరుమీదున్నావు తుమ్మెదా' అని దాసం, 'తెల్లావారక ముందే పల్లె లేచింది' , 'సంగమం సంగమం అనురాగ సంగమం', 'చీటీకి మాటికి చిటపట లాడే చిన్నది ఇపుడేమన్నది' అని మల్లెమాల, 'యాతమేసి తోడినా యేరు ఎండదు', 'ఘల్లు ఘల్లు మని కాలి అందెలు', 'సందె పొద్దు అందాలున్న చిన్నది', 'పుణ్యభూమి నాదేశం నమో నమామి' అని జాలాది, 'తొలిసంజ వెలుగులో తొలి పొద్దు పొడుపులో' అని దాసరి , సాకేత సార్వభౌమా, నీల మేఘశ్యామా అని గబ్బిట వారలు –ఎన్నెన్ని చక్కని చక్కెర చిలక పలుకులు పలికించారూ!! వీరి సంగతి సరే.. సరోజిని, రామచందర్, వేణుగోపాల్ , విజయరత్నం, విశ్వప్రసాద్, నాగశ్రీ ....వంటి పేర్లు చెబితే అసలు వీళ్ళంటూ ఒకరు సినీ రంగంలో ఉండేవారా అని ఆశ్చర్య పోతారేమో. జా: నేనిప్పుడు ఆశ్చర్యం లోనే ఉన్నా.. గోపి అన్నావ్. ఓకే. ఈ వేణుగోపాల్ ఎవరూ? గో: నిర్మాత. అమాయకుడు .. అదే .. ఆ పేరుతో ‘అనాడీ’ హిందీ సినిమాని తెలుగులో తీశారు. అందులో అర్జంటైతే ఓ పాట రాశారు. హిందీ కి శంకర్-జైకిషన్ లైతే అరుదైన స్వర కర్త బి.శంకర్ తెలుగు వెర్షన్ కి స్వర కర్త. హిందీలో లేని పాటకి కట్ట్టిన తెలుగు జానపద బాణీ అదిరిందహో!. జా: పట్నంలో శాలిబండ ...అవునా? ఎల్లామా ఎల్లారీశ్వరి కృపదా! గో: కొసదాక పాట విన్నవాళ్ళు అది కొసరాజు వారి గీతం అనే అనుకున్నారు. జా: ఎల్లారీశ్వరి పాడిన ‘ ఆగేదెట్టాగా ... అందాకా ఏగే దేట్టాగా’ పాట విన్నా కొసరాజుగారిదే అని అనిపిస్తుంది. గో: కాని అది సి.నా.రె. వారిది. అంతబాగా జానపదం పలికించిన రమేష్ నాయుడు గారికి హాట్సాఫ్. జా: విజయరత్నం, విశ్వప్రసాద్ .. పేర్లు డిటెక్టివ్ రచయితల పేర్లలా సీక్రెట్ గా వినిపిస్తున్నాయి. పాటలు చెప్పవూ.. గో: పాటలు చెప్పడమంటే పాఠాలు చెప్పినంత. జగత్ జెంత్రీలు చిత్రంలో విజయరత్నం హీరో శోభన్ కి రాసిన ‘నీ మనసులోకి రావాలి కాపురానికి’ పాట ,కొసరాజు వారు రాసిన ‘పచ్చజొన్న చేను కాడ చూశానమ్మీ’ పాట తో సరి సమానంగా నిలదొక్కుకుంది. విశ్వప్రసాద్.. జగత్ కిలాడీలు లో ఓ డాన్స్ పాట రాశారు. నాగశ్రీ ఇట్టే మరచిపోయే బస్తీ బుల్ బుల్ సిన్మాకో పాట రాశారు. ఇదే సినిమాలో రాజశ్రీ వారు ‘ఏ ఎండకా గొడుగు పట్టు రాజా..నువ్వు పట్టకుంటే నీ నోట మట్టి రాజా’ అని వ్యంగ్యం ఒలకబోస్తూ రాసిన పాట కొసరాజు వారిదా అన్నట్టు ఉంది. జా: శ్రీశ్రీ నుంచి రాజశ్రీ వరకే అనుకుంటే ఒక నాగశ్రీ కూడా ఉండేవారన్న మాట.. గో: అంకిశ్రీ కూడా. జా:బాపురే గో: రమణీయం .. బాపు అని గాంధీ గారిని గుర్తు చేశావు. ఈ అంకిశ్రీ గారు ‘నేనూ నా దేశం’ అంటూ గాంధీ నుంచి ఇందిరా గాంధీ వరకు అందరి గురించి ప్రస్తావిస్తూ ఎంత బాగా రాశారూ! సత్యం అద్భుత స్వర కల్పనా, బాలు చక్కని గళ స్పందనా .. ఈ పాట సిరులు. పెద్ద పాటే అయినప్పటికీ అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది. వింటావా? కనులు చూసినా పాటే .. అని వెతికితే ఆశాభంగమే. అంత అదృష్టమా మనకి. కనులు మూసినా పాటే..అని సరిపెట్టుకుందాం. జా: లీలగా గుర్తున్నాయ్ ..ఎంతైనా డెబ్భైల కాలం నాటి సినిమాలు కదా.. సరే గానీ ..నాదో చిన్న డౌటు .. సినిమాలకి పాట రాసేది కేవలం రచయితలేనా? మొల్ల లాగ కవయిత్రులు లేరేం? గో: చెప్పాగా .. సరోజిని గారని. ఎవరనుకున్నావ్ ఈమె? వీరమాచనేని మధుసూదనరావు ..అదే దర్శకుడు విక్టరీ మధుసూదన రావు గారి భార్య. చిన్నారి పాపలు చిత్రానికి నేపధ్య రంగంలో స్త్రీలే పని చేశారు కాబట్టి అందులో వి.సరోజిని గారు ఉయ్యాల పాట ఒకటి రాశారు. కనులు చదివినా పాటే.. వెదికితే సరి. స్వర జానకి లలిత గీతాలు రాయగలరు. పూవులో ఒక పూవునైనా కాకపోతిని .. ఆమె రాసినదే.. రాయినైనా కాకపోతిని .. అన్నట్టుందా? ఇంకా.. శారదా అశోకవర్ధన్, అవసరాల అనసూయాదేవి వంటి వారు జానపదాలు రాయ గలరు. పాడగలరు. బాణీలు కట్టగలరు. జానకి గారు ‘మౌన పోరాటం’ చిత్రానికి సంగీతమిచ్చారు. అందులో పాట రాశారా? లేదేమో. జా: సంగీత దర్శకులు పాడడం విన్నాం. పాటలు రాశారా? గో: ఒకే ఒక్కరు- తొలితరం వారు...బాలాంత్రపు రజనీ కాంత రావు గారు. ఆయన రేడియోకే అంకితమైనా సినీ సంగీతంలో పెద్ద మార్పులు తెచ్చిన వారు. ఘంటసాల గారు సరే సరి. ఇక .. పాటలు రాసిన స్వరకర్తల్లో ప్రముఖుడు ..తాతినేని చలపతిరావు..ఈయన ‘ప్రతీకారం’ చిత్రంలో ఒక పాట రాశారని తెలిసింది. నేననుకోవడం అందులో జయదేవ్ పాడిన నిదురపో ..పాట రాసినది ఈయనేమో. పాతబంగారం వాళ్ళు పాట వినిపించారు కాని ఏ పాట చలపతి వారిదో చెప్పలేక పోయారు. జా: పాత తరం వాళ్ళ పేర్లు కొన్ని మరచిపోయామేమో అని పరమ దిగులుగా ఉంది. గో: దిగులేల నయ్యా, దిగాలు పడకయ్యా .. తోలేటి వెంకట రెడ్డి, సుంకర-వాసిరెడ్డి, రావూరి సత్యనారాయాణ రావు, చెర్వు ఆంజనేయ శాస్త్రి, ముద్దుకృష్ణ, నార్ల చిరంజీవి....ఒక్కొక్కరి బాణీ లో ఒక్కొక్క ఠీవి! తోలేటి వారు సంఘం లో 'ఇలలో సాటిలేని భారత దేశం' అనే దేశభక్తి గేయం , రావూరి వారు చక్రపాణి లో అన్ని పాటలూ, ముఖ్యంగా 'ఉయ్యాల జంపాల లూగరావయా', 'మెల్లమెల్లగా చల్ల చల్లగా రావె నిదురా హాయిగా' అన్నపాటలు , చెర్వు వారు బాలసుబ్రహ్మణ్యం గారికి పేరు తెచ్చిపెట్టిన ‘నారీ రసమాధురీ లహరీ’ పాట, విమలలో కన్నుల మీద రెండు పాటలు ఒక్క ముద్దుకృష్ణ గారే రాయడం విశేషం (కన్నుల్లో బొమ్మ చూడు, కన్నుల బెళుకే కలువలురా). ‘నీ చెలిమి కోరితిని’ ‘నీ కనుదోయీ’ అని ‘నీ’ తో పల్లవించిన కవి పేరు ‘నా’ తో మొదలు కావడం మరీ విశేషం... ఆ కవి పేరు నార్ల చిరంజీవి. కాని..వారిదే...‘వారసత్వం’ సినిమా పాట ‘చిలిపి కృష్ణుని తోటి చేసేవు పోటి’ వినిపించనా ఏమిటీ? కనులు మూసినా పాటే .. కనులు చూసినా పాటే.. జా: సుఖీభవ! ఏమి టీ... టీ తాగే ముందు తే నీరు...అయినా ఎవరివో ఒకటి రెండు పాటలు ఇంకా మిస్ అయిపోతున్నట్టు నా మనసులో ఒకటే గొడవ గొడవ... గో: ఒకటి నావ. ఒకటి పడవ. విను.. మనకి ఓ ఇద్దరు శాస్త్రులు కృష్ణా గోదావరి నీళ్ళంత తియ్యని తెలుగులో పాటలందించారు. ఒకరు మల్లాది వారైతే ఇంకొకరు దేవులపల్లి వారు. వీరి పాటల సంఖ్య తక్కువే. అయితేనేం – గంగి గోవు పాలు. అవి చాలు. అలాగే ఇద్దరు శర్మలు చాలా అపురూపమైన పాటలు చెరొకటి మాత్రమే సినిమాలకి రాశారు. ఒకరు ఆచార్య భుజంగ రాయ శర్మ, మరొకరు గుంటూరు శేషేంద్ర శర్మ. 'కలిమి నిలవదు, లేమి మిగలదు, కలకాలమ్మొక రీతి గడవదు'.. అన్నారు భుజంగ రాయలు రంగుల రాట్నం లో. 'నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది' .. అని అన్నారు శేషేంద్రులు ముత్యాల ముగ్గు లో (కనులు మూసినా పాటే). అప్పటికే పాటల్లో భావాలు లేక నిజంగానే అల్లాడి పోతున్నసినీ నందనంలో సమయానికి ఈ పాట ఒకటి వచ్చి పాట బతుకును నిలబెట్టింది. జా: కొందరి లలిత గీతాలు, జానపదాలు, పద్య కావ్యాలు సినిమాల్లోకి రావడం జరిగింది కదా. గో: అలాగే కొందరి కవుల పేర్లు ఇతర కవులు తలుచుకోవడమూ జరిగింది. గురజాడ వారి ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ కథా గానం బుర్రకథగా కన్యాశుల్కం సినిమాలో చూపించారు. మరోసారి పెళ్ళికూతురు సినిమాలో గల్పికగా చూపించారు. వేమూరి కృష్ణ గారి 'చేయెత్తి జైకొట్టు తెలుగోడా' దేశభక్తి గేయం పల్లెటూరు చిత్రంలో వినిపించారు. ఘంటసాల వారు పాడిన కొనకళ్ల వెంకటరత్నం గారి రావోయి బంగారి మామా ..పాట..సినిమాలోకి రాలేదు కాని కొనకళ్ల వారి మరో రచన మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో .. కొంచెం మార్పులు చేసి సుశీలమ్మ చేత నాట్యగీతంగా అదృష్టవంతులు సినిమాలో వాడుకున్నారు. అడివి బాపిరాజు గారు కథలూ, నవలలూ రాసినా ప్రముఖ చిత్రకారుడన్న సంగతి తెలుసుగా. అయితే .. ఈయన పాటలు సినిమాల్లోకి వచ్చాయో లేదో తెలియదు కాని గుడి గంటలు చిత్రంలో చిత్రకారుడు పాడుకునే సందర్భంలో ఓ పాటలో మాత్రం ‘మా బాపిరాజు శశికళ నీవే’ అని అనిసెట్టి వారు చక్కగా గుర్తు చేశారు. అలాగే వేటూరి వారు కొన్ని సందర్భాల్లో గుర్తు చేస్తూ వచ్చారు. ‘కిన్నెరసాని వచ్చిందమ్మా.. విశ్వనాథ కవితై ‘ (కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారి గేయం –కిన్నెరసాని). చెప్పగలవా అడిగితే?--పూజాఫలం లో జానకమ్మ కమ్మగా పాడిన, ఎల్విజయలక్ష్మి భిన్నంగా నాట్యం చేసిన ‘శివదీక్షా పరురాలనురా’ జావళీ ఎవరు రాశారు? పాటల పుస్తకంలో ఆయన పేరు లేదు. రికార్డ్ మీదా లేదు. జా: ఎనక్కు తెరియాదు .. వెనకటి ఆ సినిమాలో ఆ పాటకి ఎల్విజయలక్ష్మి చూపించిన హావ భావాలు వారేవా! భలే సీనయ్యా! గో: నీ మాటలోనే ఉంది .. కవి పేరు- శీనయ్య ! సీనో సీనో అంటున్నావ్- ఇక కనులు చూసినా (ఆ ) పాటే ఏమో నీకు. జా: బాలవాక్కు బ్రహ్మవాక్కు లా చూశావా.. నా వాక్ చాతుర్యం! గో: వాక్ చాతుర్యం చూడడమా? వినాలి కానీ. walk చాతుర్యం చూస్తా ... నడు.. జా: నడుం లాగేవరకు నడుద్దాం కానీ.. లావుపాటి అమ్మాయి వడ్డాణంలా రచనాభరణాలు పెద్ద ఎత్తున తగిలించావ్. ఇవన్నీ సరే కానీ .. పద్యాల మాటేమిటీ? వీటిలోనూ బాగా పేరున్న వారూ, అంతగా తెలియని వారు రాసిన పద్యాలనేవి ఉన్నాయా? గో : లావుపాటి అమ్మాయిలా అన్నీ ఒకేసారి భోంచేస్తే అజీర్తి. పద్యాలు గుర్తు చేసినందుకు థాంక్స్. నాటకాలకి ఒకనాడు పద్యాలే ఆధారం. నట గాయకులు స్వయంగా నటిస్తూ పాడుకున్నా, నటుడికి ప్లే బ్యాక్ ఇంకొకరు పాడుతున్నా కవి ఒక్కడే కనుక కవి స్వతంత్రుడు, అదృష్టవంతుడుకూడ. నటుడు గాయకుడు కావొచ్చు కాని కవి కూడా కావడం అరుదే. ఒకే ఒక్కడు – స్థానం నరసింహా రావు గారు మినహాయింపు. పౌరాణిక స్త్రీ పాత్రలు అవలీలగా పోషించిన ఈయనకి మైకు అవసరముండేదే కాదు. అలాంటి ఈయన రంగ స్థల వైభవానికి తగ్గ సత్యభామ పాత్ర పోషించి మగువలోని హుందాతనం నటిస్తూ మధురంగా ఆలపిస్తూ ‘మీరజాలగలడా నా యానతి’ అనే పాటని ఎంత ఠీవిగా ఆలపించారూ.. స్వయంగా ఎంత బాగా రచించారూ....దరిమిలా సినిమాల్లో ఇదే రచననని కొంత స్లో టెంపోలో ఎస్వరలక్ష్మి ఒకసారి, ఫాస్ట్ టెంపోలో సుశీల ఇంకొక సారి పాడినా అవీ రాణించాయి. కవిగా స్థానం వారి స్థానం అలా పదిలమైంది. అలాగే చందాల కేశవదాసు గారి ‘భలే మంచి చౌక బేరము’ పాట ప్రతి శ్రీకృష్ణ తులాభారం సినిమాలోనూ, నాటకంలోనూ ఉపయోగించడం వల్ల విశేష ఖ్యాతి పొందింది. జా: ఈసారి ప్రశ్న నాది. మొట్ట మొదటి తెలుగు సినీ కవి ఎవరు? చందాల కేశవదాసు గారా? దైతా గోపాలం గారా? గో: మొట్ట మొదటి తెలుగు సినీ గీతం శ్రీమాన్ ధర్మవరం రామకృష్ణమాచార్య వారిది. మొట్టమొదటి తెలుగు సినీ కవి కేశవదాసు గారు .. అని పైడిపాల వారు వివరించారు. తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద (1931) ’ నుంచే తొలి తెలుగు పాట లొచ్చాయి. స్వర్ణోత్సవాలూ, ఎనభై ఏళ్ళ ఉత్సవాలూ జరిగాయి. కేశవదాసు గారిని స్మరించారా? విస్మరించారా? జా: అమ్మ భడవకానా.. ప్రశ్న నాకే తిప్పి కొట్ట్టావూ... ఈ విషయంలో బీ సైలెంట్. సెలెబ్రిటీ, లెజండరీ గొడవల్లో హీరోలుంటే పాపం సినీ కవికి తల తిరిగినట్టయింది .. గో: అయింది కాబట్టి 'వికటకవి' గా ..ఎటు తిప్పినా ఒకేలా ఉండేలా.. మారిపోయాడు! (తీరైన మాట, కనులు చదివినా పాటే .... కూడా చూడాలండోయ్) -డా. తాతిరాజు వేణుగోపాల్, 15 జులై 2012
1 Comment
Sreenivas
27/11/2017 11:56:33 am
Marvellous
Reply
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|