మునుపటి నా మాట
‘బావా ఎప్పుడు వచ్చితివీవు?...’ ‘ఇదిగో..ఇప్పుడేనండీ.. కాని ...బావగారూ..మరీ శ్రీకృష్ణ రాయబారం నాటకంలోలా వస్తూనే పజ్యం అందుకున్నారు మీరు ..’ ‘అంతేనోయ్.. పద్యం మా నేపధ్యం’ ‘కనక.. బంగారంలాంటి మరో పజ్యం అందుకోండి’ ‘చెల్లియో.. చెల్లకో..’ ‘అదిగో..మాటల్లో వచ్చేసింది మా చెల్లి..ఏమ్మా .. బావగారి పద్యాలు విని విని వంటలన్నీ మహా బాగా చేస్తున్నట్టున్నావ్’ ‘ఏం వంటో.. కంద పద్యం అందుకుంటానా ..కంద కూర వండేస్తుంది..’ ‘నయం కదండీ.. సీసం అందుకోలేదు మీరు’ ‘అప్పుడూ అంతే.. సీసాడు నూనె ..ఊ .. తెగ దుంపల వేపుడు ... సీసానికి తేటగీతి తోడైనట్టు వేపుడుకి తోటకూర ఒకటి!’ ‘చూడబోతే .. భరనభభరవ అంటే ఇడ్లీ రవ్వ , నజభజజజర అంటే జంతిక కరకర అనేట్టున్నారు మీరు’ ‘ఉత్పలమాల, చంపకమాల అటుంచి చెంగల్వ పూదండ గానీ తీసుకొచ్చావుటోయ్?’ ‘కృష్ణాష్టమి,జన్మాష్టమి, గోకులాష్టమి... మూడు రకాలుగా అనుకుంటూ వస్తున్నా .. గుర్తుందిలెండి బావగారూ.. అందుకేగా మీ దగ్గరికొస్త..’ ‘కొమ్ము మిఠాయి ఉంది.. మీ చెల్లి నువ్వొస్తావని చేసిందిలే’ ‘ఆహాహా.. అమ్మ గుర్తొచ్చింది.. నా పుట్టినరోజుకి అమ్మ కొమ్ము మిఠాయి చేసేది’ ‘ఇవాళ నీ పుట్టిన రోజే అనుకో.. కానియ్ మరి..అయితే మీ అమ్మమ్మ పంచినట్టు వడపప్పు లేదోయ్’ ‘అందరికీ శ్రీరామ నవమి నాడే వడపప్పు ..కానీ.. మా అమ్మమ్మ చిన్నా పెద్దా పండగేదొచ్చినా వడపప్పు చేసేది. ఒకసారి లొట్టలేస్తూ నేను తినడం చూసి ఇక అస్తమానూ నాకోసమే ఉంచేది ఆ కాస్త వడపప్పూ..’ ‘మరి..ఇప్పుడూ వడపప్పు అదీ?’ ‘మహారాష్ట్ర లో పడ్డాకా వడపప్పు కాదండీ వడా పావు లే మిగిలాయి’ ‘నువ్వు తింటుండూ..ఈ లోగా పద్యాల పుస్తకం తెస్తాను’ ‘పుస్తకం ఎందుకండీ.. మీ మస్తకం లో అవన్నీ మీకు కొట్టిన పిండే కదా’ ‘పిండి కొద్దీ రొట్టె.. చూద్దాం ఎన్ని గుర్తొస్తాయో’ ‘నాటకాలవి వద్దండీ.. కాస్సేపు సినిమాలవి వినిపిద్దురూ..’ ‘అవునూ.. మీ తాత గారు సినిమా పాటలు అసలు వినేవారు కాదట కదా’ ‘నిజమే.. కాని ఆయన రాత్రులు పద్యాలు పాడుకునేవారు’ ‘విన్నా.. విన్నా.. అదే ఆయన పాడిన పద్యాలు కాదు.. ఆయన పద్యాలు పాడుకునేవారనీ.. మీ అన్నయ్య కవిత రాసేడట కదా.. రాత్రి తెల్లార్లూ ముసలాయన బ్రహ్మం గారి గీతాలు పాడుతూనే ఉన్నాడు.. అనీ’ ‘తాతగారు మా పాతింటి నల్ల చావిడి గది ద్వారానికి పైనుండే ఆర్చి లాంటి ప్రదేశంలో చక్కా..గుండ్రంగా పద్యాలు ఒకటి రెండు రాశారు..’ ‘ఏమిటీ..స్వంతంవా?’ ‘అబ్బే.. పోతన పద్యాలు ...అంబుజోదర దివ్య పాదారవింద. దాని పైన ఎవ్వనిచే జనించు .. అన్నవి’ ‘సంధులూ అవీ తెలియని వాళ్ళు జోదర, వింద అనే మాటలకి అర్థాలు వెతుక్కునేవారట నిఘంటువులు తెరిచి’ ‘అంతేనండీ బావగారూ.. చాలామందికి పద్యాలంటే భయం కూడా. గణాలు, గణ విభజన, పద్యం అల్లిక భలే ఉంటుంది. అయినా ఎందుకో భయపడతారు.. అప్పటికీ మా వేదుల మాస్టారు ఓ చిట్కా చెప్పారు మా స్కూల్లో .. ప్లస్ మీద ఓ ఇంటూ వేసి మొత్తం ఎనిమిది పాయింట్ల చివర వరసగా ‘య మా తా రా జ భా న స’ అని ఒక్కొక్కటి రాసి పొట్టి అక్షరానికి లఘువు గుర్తు, దీర్ఘానికి గురువు గుర్తు వెయ్యమనేవారు. తరవాత క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళుతూ యమాతా అంటే యగణం, మాతారా అంటే మగాణం, తారాజ అంటే తగణం .. అలా నసయ అంటే నగణం, సయమా అంటే సగణం అని తెలుసుకోండని ఇప్పటికీ జ్ఞాపకం ఉండేలా అప్పుడే నేర్పారు. మన అదృష్టం- జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అత్యంత సులభ శైలిలో పద్యాలు అనే కంటే పద్య గల్పికలు రాయటం, అవి అత్యంతంగా జనామోదం పొందడం’ ‘అంతేకాదు.. ఘంటసాల మాస్టారు కరుణశ్రీ వారి పద్యాలు ఇంటింటా కొలువు తీరేలా రికార్డులు పాడడం మన మరో అదృష్టం. ఒకటి గమనించావో లేదో.. వృత్తాలు .. అంటే చంపకమాల, ఉత్పలమాల, శార్దూలము, మత్తేభము .. రాయడం సులభం అంటారు కొందరు. కాదు జాతుల్లో వచ్చే కందమే మాకందం అంటారు మరి కొందరు. ఉపజాతులు తేటగీతి, ఆట వెలది, సీసం రాయడం సులభం అంటారు మరి కొంతమంది’ ‘ఇన గణాలు, ఇంద్ర గణాలు .. ఆ లెక్కలు కొందరికిష్టం. అవన్నీ వచ్చేది ఈ జాత్యుపజాతుల్లోనే. అయినా బావగారూ.. మీరు సంగీత విద్వాంసులు.. తెలియంది కాదు మీకు.. పద్యాలు స్వరపరచడం అంత సులువు కాదు కదండీ. ఇప్పుడీ చంపక,ఉత్పల మాలలు వగైరాలున్నాయే ..ఇవి దీర్ఘాంతాలు. అంటే చివర దీర్ఘాక్షరం ఉంటుంది వీటికి. స్వర రచనల్లో దీర్ఘాలు అనువుగా ఉంటాయి. చిట్టీ పొట్టీ అని, కోతీబావకు పెళ్ళంట అని దీర్ఘాలు తీయాల్సి వస్తుంది. కృష్ణశాస్త్రి గారు పాటల్లో హ్రస్వాక్షరాలు ఉపయోగించేవారు. రామ అనడంలోనూ రామా అని అనడంలోనూ తేడా ఉంది. పదములే చాలు రామా ... అన్నప్పుడు మా మీద దీర్ఘం, నీ దయ గౌతమి గంగ రామయ నీ దాసులు మునుగంగ అన్నప్పుడు మ మీద లఘువు ఉన్నాయి. పాడేవారు గమనించాలి. మల్లాది కవి గారు చిట్టి, పొట్టి అని వత్తి పలికే మాటలని చిటి, పొటి అని ప్రయోగించేవారు. ఇవి పద్యాల్లో బాగానే ఇముడుతాయి. ఆటవెలది,తేటగీతి, సీసం – ఇవి చివర్లలో ఒక లఘువు ఉండి తీరాలని కండిషన్ పెట్టాయి. వీటిని స్వర పరచినప్పుడూ, గాయనీ గాయకులు పాడినప్పుడూ లఘు అంతాలు దీర్ఘాలు కాకుండా చూసుకోవాలి’ ‘అలాగే .. ఒక్కొక్క సారి ఎంత శాస్త్రీయంగా పద్యం రాసినా స్వర రచన రీత్యా సంధి విచ్ఛేదాలూ, మాట విరుపులూ చెయ్యాల్సి వస్తుంది. ఈ కష్టాలు అంటే ఇష్టం లేనివాళ్ళు పద్యాలు మానుకున్నారు’ ‘సినిమాల్లో అయితే సందర్భం బట్టి మార్పులు తప్పవు కదండీ’ ‘సినిమాల్లో .. అవి సన్నివేశ పరంగా ఉండాలి కాబట్టి అక్కడ మార్పులు అనివార్యం. సినిమాల్లోని పద్యాలు అనగానే .. చప్పున గుర్తొచ్చేవి కృష్ణుడి పద్యాలూ, ఎన్టీఆర్ సినిమాలూనూ’ ‘నిజమే.. అవి వింటుంటే కంటికెంత ఇంపో చెవికీ అంతే ఇంపు. ఒక విచిత్రం జరిగింది కదండీ.. మాయాబజార్ సినిమాలో కృష్ణుడికి పద్యాలు లేవు. ఉన్న ఒకటీ రెండూ ఘటోత్కచుడు పాత్రలో ఎస్వీఆర్ పాడినవే’ ‘అంతే కాదు ఆ సినిమాలో పాండవులు కూడా ఉండరు.. అది అలా ఉంచితే ... కెవి రెడ్డి, కమలాకర కామేశ్వరరావుల తరువాత రామానాయుడు శ్రీకృష్ణ తులాభారం , మల్లెమాల శ్రీకృష్ణ విజయం సినిమాలు తీసారు. బాపు రాముడి చుట్టూ కథలు అల్లినా బుద్ధిమంతుడు లో కృష్ణ పాత్ర ప్రవేశ పెట్టారు. అక్కడా త్యాగరాజ కృతి నుంచి ప్రేరణగా తీసుకునీ ‘ననుపాలించగ నడచీ వచ్చితివా ..గోపాలా’ అని దాశరథి వారి చేత పాట రాయించుకున్నారు. ఓ పద్యం పెట్టి ఉండాల్సింది. బాపు శ్రీరామాంజనేయ యుద్ధం సినిమా సగభాగం ఊ ఇద్దరి మధ్యా వాదోపవాదాలు పెట్టి కొంచెం విసిగించారనుకోండి. అదేమిటో ..పద్యాలకి కాలం చెల్లింది అనడానికి మొన్న మొన్నటి బాపు గారి శ్రీరామ రాజ్యం సినిమా ఉదాహరణ. ఇళయరాజా వారు పద్యాలు ఎలా స్వరపరుస్తారో వినాలని ఆశిస్తే ఆశాభంగమే అయ్యింది. లవకుశులు ..అదేదీ విశ్వనాథ్ గారి సినిమాలో మిత్రా అన్నట్టు స్టెప్పులండీ స్టెప్పులు.. వేశారు పైగా' ‘ఆదిత్య 369 మరచిపోయారు బావగారూ.. అందులో కాల చక్రంలో వెనక్కి వెళ్ళిపోయి కృష్ణదేవరాయల కాలంలో తేలినట్లు చూపించారు కదండీ.. అప్పుడు మన తెనాలి రామలింగడి పద్యాలు మళ్ళీ వినిపించారు కదా రాజా వారు’ ‘అయినా అవి ఒకనాటివే కదా. విశ్వనాథన్-రామ్మూర్తి ల నుంచి విన్న వరసలే’ ‘పద్యాలు అందరూ పాడలేరు. సి ఎస్ ఆర్ గారి గళ విన్యాసం తెలిసినదే. నాగయ్య గారు యోగి వేమన సినిమాలో వేమన పద్యాలు నెమ్మదిగా పాడారు. రఘురామయ్య గారు ఖంగు మంటూ పద్యం పాడినా ఆలాపన నిడివి ఎక్కువగా ఉంటుంది (కనులు చూసినా పాటే). ఘంటసాల మాస్టారూ, మాధవపెద్ది సత్యం–ఈ ఇద్దరూ పద్యాలు పాడడంలో ఒక వరవడి తీసుకొచ్చారు (కనులు చూసినా పాటే). వీరి పుణ్యమా అని ఎన్టీఆర్, ఎస్వీఆర్ ఇప్పటికీ జనం కళ్ళలో మెదులుతూనే ఉన్నారు. నిజానికి మాస్టారే పద్యాలకి ఒక కొత్త మార్గం చూపించారు అని అంతా చెప్పుకున్నదే. ఏకగ్రీవంగా ఒప్పుకున్నదే. ఇంకా పిఠాపురం నాగేశ్వరరావు, పి బి శ్రీనివాస్ లు పద్యాలు బాగా పాడేవారు. బాలు గారు తనవంతు కృషి తాను చేసినా ఎక్కువగా పద్యాలు పాడే అవకాశం రాలేదు ఆయనకి (కనులు మూసినా పాటే). సంగీత దర్శకుల్లో సుసర్ల వారు, విశ్వనాథన్-రామ్మూర్తి, పెండ్యాల వారు, సాలూరు వారు,టి వి రాజు, అశ్వత్థామ,గాలి పెంచలనరసింహారావు, మహదేవన్, కోదండపాణి పద్యాలకి చక్కని వరసలు కూర్చారు. పద్మనాభం హరి కథలు చెప్పగలిగే వారు. ఆయన తన స్వంత సినిమాల్లో పద్యం ఒక్కటైనా ఉండేలా చూసుకునేవారు. ఆయనకో నాటక సంస్థ ఉండేది. అందులో కోదండపాణి పద్యాలు వరసకట్టి వన్స్ మోర్ అనిపించుకునేలా పాడేవారట. ఇక పద్యాలు రాసే విషయంలో...పౌరాణిక సినిమాల్లో సముద్రాల వారిదే పై చేయి. తరువాత సదాశివబ్రహ్మం గారు. శ్రీశ్రీ గారిది ఆధునిక విప్లవ సిద్ధాంతమే అయినా సంప్రదాయ బద్ధంగా పద్యాలు రాయడం ఆయనకి ఇష్టంగానే ఉండేది. అవకాశమొస్తే పద్యాన్ని అగ్గిపెట్టె మూత మీద కూడా రాసివ్వగల సత్తా ఆయనకుండేది (ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి భార్యాభర్తలు)( తిరుగులేని మాట )’ ‘ఎన్టీ ఆర్ నటించిన పౌరాణిక సినిమాల్లో చెప్పుకో దగ్గ విశేషమేమిటంటే – నర్తనశాల లో తిక్కన భారతం (కనులు చూసినా పాటే) నుంచి, శ్రీకృష్ణార్జునయుద్ధం లో ముక్కు తిమ్మన వారి పారిజాతాపహరణం నుంచి, శ్రీక్రిష్ణపాండవీయం లో పోతన భాగవతం నుంచి పద్యాలు తీసుకున్నారు. శ్రీరామ పట్టాభిషేకం లో పానుగంటి వారి పద్యాలున్నాయి. అలాగే ఆయన నటించిన చారిత్రాత్మక చిత్రం పల్నాటి యుద్ధం లో గుఱ్ఱం జాషువా, బసవలింగ దేవర వారి పద్యాలున్నాయి. బి ఎన్ రెడ్డి గారి మల్లీశ్వరి లో దేవులపల్లి వారు ఒక పద్యం రాశారు. మల్లాది వారు శ్రీ గౌరీ మహాత్మ్యం లో ఒకటి,రెండు పద్యాలు రాశారు. ఇవి రెండూ ఎన్టీఆర్ సినిమాలే. విశ్వనాథ సత్యనారాయణ గారి మీద గురు భక్తి వల్ల వారి నవల 'ఏకవీర' సినిమాగా తీస్తే ఎన్టీఆర్ నటించారు. అయితే అందులో తలచుకుంటే ఎన్టీఆర్ విశ్వనాథ వారి కిన్నెరసాని రచన రూపకంగా చూపమనేవారే. కాని అలా జరగలేదు. ఒకటీ అరా పద్యాలున్నా అవి డా. సి.నా.రె వారివి’ ‘పద్యం అనేది మన సొత్తు అని మనం ఎంతైనా గొప్పలు చెప్పుకోవచ్చు. హిందీ రామాయణం మళ్ళీ తీసినా, హిందీ భారతం తిరగేసి రాసినా పద్యాలు కనపడవు, వినపడవు. ఇటీవల స్వర్గస్తుడైన పహిల్వాన్ దారాసింగ్ ఎన్నోసార్లు హనుమంతుడిగా నటించినా పద్య పఠనం లేక చిన్నబోతున్నాడు. అదే మన అర్జా జనార్దన రావు కానివ్వు, రాజనాల కానివ్వు ఆంజనేయుడి వేషం అద్భుతంగా వేసి సాక్షాత్తు ఆ ఆంజనేయుడే పాడుతున్నాడా అన్నట్టు పద్యాల్ని అభినయించారు’ ‘వీలైనన్ని మన సినిమా పద్యాలన్నిటినీ ఒక మాల గా కట్టి ‘చెంగల్వ పూదండ’ గా తీసుకొచ్చాను బావగారూ..’ ‘వారెవ్వా .. అదే చూస్తున్నా.. ఎక్కడా చెంగల్వ వాసనే లేదు ..ఎక్కడ దాచాడబ్బా మాల అని ఒకటే నీ చుట్టూ వెతుకుతున్నా’ ‘చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ ...అని కృష్ణాష్టమి నాడు, తొండము నేక దంతము తోరపు బొజ్జయు .. అని వినాయక చవితి నాడు, తల్లీ నిను దలంచి పుస్తకమ్ము చేతంబూనితిన్ అని శ్రీ పంచమి నాడు, శ్రీ రాముని దయ చేతను .. అని రామనవమి నాడు పిల్లల చేత పాడించక పొతే మన పద్యాలు ఇంక హుష్ కాకి అయిపోతాయండీ బావగారూ’ ‘ఇవన్నీ సంప్రదాయ పద్యాలు.. శ్లోకాలు ఎలాగూ ఉన్నాయి. ఏదో ఒక పూజ సందర్భంలో ఏదోలాగ శ్లోకాలు అప్ప చెప్పే స్తున్నారనుకో. ఇంకా పద్యాల్లో తమాషాలు కావాలంటే అష్టావధానం పద్యాలు చదవాలి. కొన్నాళ్ళు పద్యాలతో హాస్యమాడారు సినిమాల్లో.. ఏదీ.. అసలు తెలుగే కను మరుగౌతుంటే ఇంకా పద్యం పద్యం అని భోరుమనడం చాదస్తం అంటారేమో’ ‘అనుకోనీండి .. ఇష్టమున్న వాళ్ళు పాపం పద్యాలు అందుబాటులో లేక సంపాయించుకోవడం లో బద్ధక పడి దాటేస్తుంటారు. ఎందుకైనా మంచిదని కొన్ని హాస్య పద్యాలు ..సినిమాలవే... తీసుకొచ్చాను ఇవాళ. చదువుతారా (కనులు చదివినా పాటే).. మీ అంత బాగా పాడలేను కాబట్టి ఆ ఒరిజినల్ గొంతుల నుంచే వినిపిస్తాను. నవ్వుకోండి. ఈ లోగా ముక్కు తిమ్మన గారి పద్యం వినాలని మక్కువగా ఉంది . ఏదీ సునాయాసంగా పాడేద్దురూ’ ‘నను భవదీయదాసుని మనంబున నెయ్యపు కిన్క బూని-తా చిన యది నాకు మన్ననయ, చెల్వగు నీ పద పల్లవంబు- మ త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే ననియెద అల్కమానవు కదా ఇకనైన అరాళ కుంతలా!’ ‘చూశారా బావగారూ .. ఘంటసాల గారు పాడిన ఈ పద్యం శ్రీకృష్ణార్జున యుద్ధం లో అంటే 1963 లో విన్నామా.. పిఠాపురం నాగేశ్వరరావు పాడారు మరో సినిమాలో ఇదే పద్యం’ ‘ఎందులో ఏమిటీ’ ‘కీలు బొమ్మలు లో. ఇది 1965 లో వచ్చింది. జగ్గయ్య హీరో ఇందులో’ ‘జగ్గయ్య గారు పద్యాలు రాసేవారు తెలుసా’ ‘ఔనౌను .. 1962 లో వచ్చిన పదండి ముందుకు సినిమాలో ఆయన రాసిన పద్యాలున్నాయట. దొరకడం లేదండీ బావగారూ.. అద్సరే.. మరీ నాది పెత్తనం అనుకోక ఒక మాంఛి పోతన పద్యం అందుకోండి’ ‘నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు నవ్వు రా- జిల్లెడు మోమువాడు- మనసిచ్చిన కోరికలిచ్చువాడు శ్రీ వల్లభుడైన శౌరి యదు వల్లభు భక్తిని పూజ సేయుమా ‘ ‘పి.బి.శ్రీనివాస్ శ్రీక్రిష్ణపాండవీయం లో పాడారిది. నారదుడు పాడినట్టు చూపించారు రామారావు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సప్తగిరి మాస పత్రికలో డా సి.నా.రె పోతన పద్యాల సొబగుల్నిభలే విశ్లేషిస్తున్నారండీ బావగారూ.. సరే .. ఏదీ .. మీ మధుర కంఠం తోనే మరొక్క పద్యం..పోతన, తన, మన అని అడగను తపోధనా’ ‘సీ|| చిదిమిన( బాల్గాఱు చెక్కుటద్దములపై / జిలిబిలి చిఱునవ్వులొలయు వా(డు కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లు మనంగ నం /దరి కనుల్చల్లగా( దిరుగు వాడు బుడిబుడి నుడుపుల (బూర్వభూపాల గా/ధల నేను గుడుగుచో (బలుకువా(డు రాఘవా! ముద్దీయరా! యన్న నెగిరి గం/తిడుచు హాయిగ( గౌ(గి లించువాడు తే.గీ|| నట్టి పదునాలుగే(డుల బొట్టెనెట్టు/లసుర భీకర వనసీమ కంపువా(డ ననుచు నేడ్చితి నెప్పుడో యపుడు; మరల /నిపుడు నీ మూలమున నట్టు లేడ్చుచుంటి’ ‘ఆహాహా .. సీస పద్యం చివర్న తేటగీతి వస్తుందని చదూ కున్నాం. ఏనుగంటి ఇంత దీటైన పద్యం ఎవరిదని ఉండండి చెల్లిని అడిగి చూస్తాను ..చెబుతుందో లేదో?’ (లోపలనుంచి) ‘పానుగంటి వారిది’ ‘ అమ్మో.. కనిపెట్టేసిందే.. మూడు అర్థాలున్న మాట ఏది అని అదేదో టీవీ షోలో ఆదివారం అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు మూడవ మాట అని చెప్పకనే చెప్పినట్టు ‘ఏనుగంటి’ అని ముందే క్లూ ఇచ్చినట్టు ఉన్నానే. శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమాలో బాలు పాడారు ఈ పానుగంటివారి పద్యాన్ని’ ‘నీ నట్లూ బోల్ట్లూ సరేనయ్యా... ఇంత మంచి సీసం కవులందరికి మహా ఇష్టం. మహాకవి శ్రీశ్రీ మామ మీసాల మీద సీసం పోశారు (కులగోత్రాలు, 1962).. అదే.. సీస పద్యం అల్లారు తెలుసు కదా (కనులు చదివినా పాటే)’ ‘సీసం కాదు గానీ వృత్తం లోనే ఆరుద్ర గారు ఒక పేక ముక్కల పాట లో జాకీ మామ చేత ‘నిటాలాక్షుండు’ అని పేరడీ పద్యం చెప్పించారు. అందులో విటమిన్ ఎం (మనీ) కూడ కనిపిస్తుంది . సినిమా .. పొట్టి ప్లీడరు (1966) (కనులు చదివినా పాటే). ఇంకా ఎందరో కవుల తమాషా పద్యాలు, సీరియస్ పద్యాలు మోసుకొచ్చాను. తీరిగ్గా కొన్ని విందాం. కొన్నిటిని చదూ కుందాం’ ‘లవకుశలో సదాశివ బ్రహ్మం గారు ..ఎంత మంచి పద్యాలు రాశారూ.. ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మ రుద్రా సు/త్రాములు హవ్య వాహనుడు ప్రస్తుతి చేసిరొ, అట్టి తల్లి సీ /తా మహిళా శిరోమణిని, దారుణ కాననవీధి కంపగా/ నీ మది యెట్టులొప్పె? నెటనేర్చితి వీ కఠినత్వ మగ్రజా.. .’ ‘చెబితేనే గాని తెలియదు ఈ పద్య రచన సదాశివబ్రహ్మం గారిదని. అంతగా తెలియని ఒకాయన రాసిన పద్యం బాపు గారి (సీతా కళ్యాణం) చేతిలో పడి దృశ్య కావ్యమైంది. ఆయన గబ్బిట వెంకట్రావు. ఆ పద్యం- ||నా తండ్రి వనసీమ నడయాడు సమయాన / వసివాడనీకు మా వసుధ మాత! సంచార పథములో శ్రమ నందునో యేమో /అలసట తీర్చుమా మలయ పవన! ఆకొన్న తరుణాన అమృతంబు వర్షించి /కరుణ కాపాడుమా వరుణ దేవ! అసమాన తేజస్వి యాగరక్షణ సేయ /ఆశీర్వ దింపుమా అగ్నిదేవ! ||ఎండ కన్నెరుగని వానికెల్ల వేళ / ఆకసమ! వెల్ల గొడుగువై అలరవమ్మ పంచ భూతములార! ఓ ప్రకృతి దేవి!/సర్వ రక్షగ మా రాము సాక రారె!’ పంచ భూతాల సాక్షిగా బాపు గారి కోసం గబ్బిట వారు ఎంత చక్కని పద్యం రాశారూ ! అలాగే కొండవీటి వెంకట కవి గారి పేరు మనకి ఎక్కువగా విన్పించింది ఎన్టీఆర్ వారి బ్రహ్మంగారి చిత్రం లోనే కదండీ బావగారూ’ ‘పద్యాల మీద ఇప్పటి తరం వారు మనసు పడాలోయ్ .. ముందు ఓపిగ్గా వినడం నేర్చుకోవాలి, అర్ధాలు అడిగి తెలుసుకోవాలి’ ‘మనసు అని మహా బాగా గుర్తు చేశారు బావగారూ. మన మనసుకవి ఆత్రేయ తొలి రోజుల్లోనే ఒకటి రెండు పద్యాలు మనసు పడి సినిమాకి రాశారు. పుట్టిన దాదిగా లచ్చినె / కట్టుకొనాలని తపస్సు గావించితి.. నే/ పట్టిన వీడని కోతిని / తిట్టిన కొట్టినను నేను దీని మగండన్ ----అనేది ఒకటి, ఇది పారిజాత కుసుమము/ సదమల దివ్యానురాగ సంపూర్ణము.. నీ/ మది కెక్కిన సతి కొప్పున /పదిలముగా నుంచుమయ్య పావన చరితా ... అనేది మరొకటి అలాగే నారదుడు అంటాడట .. ఆ పద్యం ఇలా ఉంటుంది .. తెచ్చితి పారిజాతమును దేవకి పుత్రున కిచ్చినాను.. నీ /కిచ్చకమైన భార్యకిది ఇమ్మన రుక్మిణి కిచ్చినాడినీ .. మల్లాది వారు ఒకటి రెండు సరదా పద్యాలు రాస్తే సి.ఎస్.ఆర్ గారు పాడారు. నేనే ఒక్కటి రెండు సారులు వివాహోత్సాహమున్ జెందితిన్ /గానా? గణ్యుడ నైతి గాన ధరణీ రాజన్య మాన్యుండనై ... అనేది ఒకటీ, నీవున్నేనును మామ అల్లుడవుటల్ నిక్కంబు నిక్కంబుగా ... అనేది మరొకటి. దేవులపల్లి వారు గోదాదేవి కథని మొల్ల నోట పద్యంగా పలికించారు. విందువా వీనుల విందుగా గోవిందు/ నాండాళ్ళు పరియణమ్మైన గాథ అనేది. ఈయనే దేశభాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణ దేవరాయల నోట నుంచి ‘భళిరా ఎన్నడు జారెనీ భువికి’ పద్యాన్ని పాడించారు (మాధవపెద్ది)’ ‘ముందుది మొల్ల సినిమాలోనిది. తరువాతది మల్లీశ్వరి లోనిది. మల్లెలూ,మొల్లలూ ఆ మహాకవి పేటెంట్లు. అదేమిటి .. చక్కగా డైరీలో ఎప్పుడో రాసుకున్నట్టున్నావ్ .. గణాలూ, వృత్తాలూ, జాతులూ, యతి మైత్రీ.. ఏదీ.. నన్నూ రాసుకోనియ్యి ( క్లాస్ రూమ్) . అద్సరే .. నువ్వు అప్పుడప్పుడూ పద్యాలు రాస్తుండే వాడివి.. తెచ్చావా ఖజానా?’ ‘అబ్బే .. ఏదో ఒకటీ అరా.. పన్నెండేళ్ళ క్రితం అంటే 2001 లో వృష నామ సంవత్సరమొస్తే .. వృష అనేది నందికి సంబంధించిందని కదా అని శివుడి పరంగా ఒక పద్యమల్లాను .. అది ఇలా ఉంటుంది.. ఉత్పలమాల లో .. ధర్మం వృషభ రూపం లో ఉంది. కలియుగానికి ధర్మం కేవలం ఒక్క పాదం గానే మిగిలింది. దాని పేరు సత్యం. నందికి విన్నవించుకుంటే శివుడు విన్నట్టే కదా. శ్రీవృష! భారకా! బసవ! సాంబ శివోచిత పాద ధారకా! ఆవృత మాయెనా మరల ఆ శివ యానతి ధర్మ కారకా! ఏ వృతి పోలునో తెలియ, ఏక పదాచరణావతారకా! గోవృ త! నిల్పుమా కలి యుగాదిని రక్షణ, సత్య పూరకా ! (ఆవృతమగు: ఆవరించు; వృతి: వర్ణన; గోవృత: గోవు వరించిన) మరొక్కటి – 1992 మార్చ్ నెల ఆంధ్రజ్యోతి వార పత్రికలో ఒక సమస్య ఇచ్చి పద్యం పూరించ మన్నారు. సమస్య: జమునను చూడగా విజయశాంతి లభించె జయప్రదమ్ము గన్ ముగ్గురు సినీ తారల పేర్లు ఇందులో ఉన్నాయి కదా. అయినా వారి ప్రసక్తి తేకూడదు. అదీ షరతు! నా పూరణం: చం|| సమయము మించిపోయి ధర సుందర సూర్య సుతీక్ష్ణ మంతమై తిమిరము నిల్చు అర్జున! సుధాంశు వికాస ముఖార వింద తే జము నను చూడగా విజయ! శాంతి లభించె, జయప్రదమ్ముగన్ సమరము పూర్తి గావలె, విషాదము వీడి విదుల్చు బాణముల్! ఇంకొక్కటి – 1991 లో రాసిన పద్యం ...శివుడి జటలో గంగ ఉండగా ఆ హోరులో ఆయన చెవికి మునుల విన్నపాలు వినపడేట్లు లేవని పార్వతీదేవి గ్రహించి , ఈయన వల్ల లాభం లేదని తనకు తానే మహిషాసురుణ్ణి కూల్చే ప్రయత్నం చేస్తుంది. హరహర ! శంకరా! శివ! మహాపురుషా ! పరిమార్చు మయ్య హే గిరిశిఖరాగ్ర వాసిత జగాధి పతే, మము గూల్చు దానవున్ , ధర మహిషాసురాధముని..ధీర పరాక్రమశాలి నెట్టులో మరిమరి వేడుచుంటిమి, నమో ..గిరిజా రమణా! కై మోడ్చి నిన్ శిరమున జుట్టు వంపుల వసించెడి గంగ చరించెనెప్పుడో హరునకు విన్నపములిక హేయము గావున, చూచి తానుగా తరలెను శక్తి రూపిణియై తాండవమూర్తియై దుర్గ మాతయే... నరబలి కోరు రక్కసుల నాశనమే యిక మేలు ధాత్రికిన్ ’ ‘బావున్నాయి. చివర్లో స్లోగన్ ఇచ్చావ్. చిన్నప్పుడు తెలుగు పరీక్షలో ఈ క్రింది పద్యము ఎందునుండి గ్రహించబడినది? అన్నట్టు ఉంది. సముద్రాల వారి ఒక పద్యం ఉంది – వందే మాతరం సినిమాలో. రాసుకోచ్చావో లేదో? ఉండు పాట వెదికి వినిపిస్తాను...’ ‘బావగారూ.. మాబాగా గుర్తు చేశారు... మా బెంగళూరు భాను ప్రకాష్ ఒకసారి మా సొసయిటీ పోటీలకి ఓ స్లోగన్ తయారు చేశాడు- ఎలా అంటే... వుయి బిగ్ గన్స్ డోంట్ నీడ్ స్లో గన్స్ అని... ఎందుకీ పద్యాయణంలో స్లోగన్ వేట కానీ .. బొల్లిముంత శివరామకృష్ణ గారు తెలుసు కదా.. సినిమాలకి కథా, మాటలూ రాసేవారు. ఈయన మా మంచి అక్కయ్య సినిమాలో గయుడి మీద ఒక పద్య గల్పిక రాశారు. అసలు మంచిరోజులు వస్తాయి అనే సినిమా ఒకటుందా అని అనుమానించే సినిమాలో ఆరుద్ర తమాషా పద్యాలు కొన్ని రాశారు. ఇందాక మీరు పాడబోతుంటే అడ్డుపడ్డానే ఆ చెల్లియో చెల్లకో పద్యానికి పేరడీగా ఈయనొకటి రాశారు. అది ఇలా ఉంటుంది- చెల్లియో చెల్లకో మునుపు చేసిన మోసము సైచినాను మే/నల్లుడు మల్లుడౌను ప్రళయాకృతి దాల్చును చిత్తు చేసి నీ/ కల్లలు బైట పెట్టు మది గ్రమ్మిన పైత్యపు చిమ్మ చీకటుల్/ తెల్లగ తెల్లవారె ..కడ తేరగ కాచుకొనుమ్ము కంసుడా... ఇంకా – వేటూరి అనుకునే ప్రమాదమున్న వీటూరి కవి దేవత సినిమాలో ఓ చక్కటి పద్యం రాశారు. భార్య కనపడక విలవిలలాడుతున్న భర్త ... రాముడు సీత కోసం వెదుకుతూ ప్రకృతితో ఎలా విన్నవించు కుంటాడో అలా రాశారు. జగమెల్ల పరికించు చల్లని జాబిల్లి/సుదతి సీతను నీవు చూడలేదా .. అని సాగుతుందా పద్యం’ ‘ఇందాక కరుణశ్రీ వారి పద్యాలు అన్నావ్ చూడు.. అవి సినిమాల్లోకి వెళ్ళనే లేదు. ప్చ్’ ‘ఫెళ్ళుమనె విల్లు ఘంటలు ఘల్లు మనె... పద్యం కరుణశ్రీ వారిదే. తన రామ కళ్యాణం హరికథ పాట కోసం శ్రీశ్రీ గారు ఉపయోగించారు’ ‘ఆత్రేయ నిర్మాత,దర్శకుడు అయిన వాగ్దానం సినిమా లో ...గుర్తొచ్చింది. బహుశా ఎలాగైనా మీ పద్యం సినిమాల్లోకి వచ్చేలా చూస్తాను అని కరుణశ్రీ వారికి శ్రీశ్రీ గారు వాగ్దానం చేసి ఉండాలి’ ‘కరుణశ్రీ వారిదేమో అనే భ్రమ కలిగించేలా సముద్రాల జూనియర్ ఓ పద్యం రాస్తే ఘంటసాల వారు పాటకి సాకీ గా దాన్ని ప్రయోగించారు. మాండ్ రాగంలో పద్యం పలికించడం ఘంటసాల మాస్టారుకి భలే ఇష్టం. చూపుల తీపితో కొసరుచున్ దరిజేరి మనోజ్ఞ గీతికా/ లాలన సేయు కూర్మి జవరాలొక వైపు, మరొక వైపునన్/ ఈ పసి కమ్మ తెమ్మెరలు ఈ పూవుదోటల శోభలున్నచో / రేపటి ఆశ నిన్న వెత లేటికి నేటి సుఖాల తేలుమా ’ ‘ఇంకా నయం ..ఇది ఉమర్ ఖయ్యాం పద్యం అని అనుకోలేదు’ ‘ప్రేమనగర్ సినిమాలో కదండీ ఏ ఎన్నార్ ప్లేన్ లో పాడగా అంటే ఘంటసాల వారి టోన్ లో విన్నాం .. అంతములేని ఈ భువన భాండ మ్మొక పురాతన పాంథశాల అందు ఇరుప్రక్కల వాకిళుల్ .. ’ ‘ఇవన్నీ సరే.. నాకు ఒక పాత నాటక సంఘటన గుర్తొచ్చి నవ్వొస్తోంది’ ‘చెప్పండి బావగారూ .. మేమూ నవ్వుకుంటాం..’ ‘ నాటకంలో ఒక పాత్రధారి జనం వైపు చెయ్యి చూపిస్తూ అదిగో రేపల్లె ఆలమందలవిగో అని సంగతులు వేసి మరీ వినిపిస్తే జనం కోపగించుకున్నారట.. మమ్మల్ని ఆలమంద లంటావుట్రా.. అని అరిచారట’ ‘హహ్హహ .. కాబట్టి పద్యం పాడడమే కాదు పద్యం పాడుతూ నటించడమూ ఒక పరీక్షే!..’ ‘బూర్లు పెట్టవోయ్.. మీ అన్నయ్యకి’ ‘అమ్మో.. వద్దండీ బావగారూ ..ఇన్ని కబుర్లు చాలవూ.. ఇంకెందుకు బూర్లు?’ ‘భలేవాడివే ...నా సంగతి ఆలోచించవేం?’ ‘బూర్లు తింటే లావెక్కుతారండీ..’ ‘పోవోయ్.. నా శరీరం ఎప్పుడూ ఇంతే.. లావొక్కింతయు లేదు ..’ ‘మరీ మంచిది. పత్యం ఉన్నాం అంటుంటారు కొందరు .. వాళ్ళంతా పద్యాలు పాడితే సరి.. అదే యోగ విద్య. సెలవా మరి బావగారూ. అన్నట్టు ఒక ముఖ్య మైన విషయం చెప్పాలి. ఒక పక్క రాగాల, స్వరాల నోట్స్ రాసిచ్చి గాత్ర సాధన చేయిస్తూనే, ఆప్యాయంగా పలకరిస్తూ జబ్బు నయం చేసే అచ్చమైన డాక్టరు సంగీత విద్వాంసుడు శ్రీపాద పినాకపాణి గారు ఇటీవలే నూరేళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆయనకి వందమంది వందసార్లు వందనాలు చేస్తే అదే ఆయనకివ్వగలిగే పుట్టినరోజు బహుమానం. ఆ వార్త చెబుదామని ఇంత దూరం వచ్చాను. ఈ లోగా మీరు పద్యం పాడి నా నేపధ్యం మార్చేశారు’ ‘శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు సాగింది పినాకపాణి డాక్టరు గారి సంగీత ప్రస్థానం, వైద్య సహకారం. నా సంగీత యాత్ర – అని ఈయన ఆంధ్రప్రభ సంచికల్లో పదిహేడేళ్ళ క్రితం గొప్ప గొప్ప సంగీత మేధావుల గురించి ప్రస్తావించారు. సంగీత మహావృక్షానికి ఆయన వేరు. ఆయన పద్ధతే వేరు. నూకల, నేదునూరి, శ్రీరంగం –ఇలా ఎందరికో ఆయన గురువు. ఆయన చేతి వైద్యం మంచి నీరంత గొప్పది. అందుకే ఆయన్ని పీనే కా పానీ అని పిలుస్తూ ఉండేవారట (ఆల్ 'బొమ్మ'లే , తిరుగులేని మాట, తీరైన మాట) ’ ‘బావగారూ.. ఒక విషాదం... కూచిపూడి (వెంపటి) సత్యం ఇటీవల కన్ను మూశారు. ఎంతటి నాట్యానికైనా పద్యం చాలా అవసరం. నర్తనశాల, పల్నాటి యుద్ధం, జయం మనదే, లవకుశ , ఆడ బ్రతుకు, శ్రీక్రిష్ణ పాండవీయం, శ్రీకృష్ణావతారం, వీరాభిమన్యు – ఇలాంటివెన్నో ఎన్టీఆర్ చిత్రాలు. రోజులుమారాయి, సువర్ణ సుందరి, జయభేరి, రహస్యం – వంటి ఎ ఎన్ ఆర్ సినిమాలు, ఇంకా ఎ వి ఎం వారి లేతమనసులు,భక్త ప్రహ్లాద .....ఒక్కొక్క మేలిమి ముత్యం వెంపటి సత్యం వారి నృత్య దర్శకత్వం తో మెరిసినదే . కూచిపూడి నృత్యం –మరో పేరు వెంపటి సత్యం అని ఒక నానుడి ఉంది’ ‘వీటిలో కొన్నైనా వీడియోలుంటే తీసుకు రాకూడదూ? వీలయితే ఆ చేత్తో పినాకపాణి వారి నా సంగీత యాత్ర కాపీ కూడా తీసుకు రద్దూ’ ‘శ్రీపాద వారికి భక్తితో నా ఈ పద్యం ..మనసుకి ఇంపుగా... ఈ మన మాటల ముక్తాయింపుగా...సమర్పించుకోవాలనుంది .... చ|| 'శతము' పినాక పాణి గురు శేముషి కిన్ 'వయమ'న్న నమ్మరే! అతడనురాగ 'వైద్యుడు'ను, ఆతనికున్నది 'రాగ' భావమే గత జనమందు ఎవ్వరి సుగాత్రము పొందెనొ గాని, బాపురే! వెతుక మహానుభావులను వారు మహేశు వరాన దక్కరే? ‘ ' ‘జనమందు అంటే జనంలో అని అనుకుంటారో ఏమో ఎవరైనా వింటే.. జనమ అనగా జన్మ అనే అర్థంలో కలిపేయాలి. మహేశు అని ఎందుకన్నానంటే అతను లయ కారుడు. శివ తాండవం నేర్పి ఈ జన్మలో ఒక వెంపటి వారిని పుట్టించాడు. శృతి కల్పించి ఒక పినాకపాణి గారిని సృష్టించాడు. పినాకమనేది శివ పరంగా ఒక విల్లే కదా' 'సంతోషం సగం బలం అయితే మిగతా బలం సంగీతస్తుందోయ్' 'బావగారూ.. మీరూ స్లోగన్లు...బావుంది వరస... ఇంత సంతోషం ,విషాదం ల కలగలుపులో మరో విషాద ఛాయ చోటుచేసుకుంది... అదే ..సామల సదాశివ ...గారి స్వర్గ ప్రాప్తి. ఎనభై నాలుగేళ్ల పెద్దాయన ...బహుభాషా కోవిదుడు, ముఖ్యంగా ఉర్దూ లో నిష్ణాతుడు, కవి, రచయిత, వ్యాసకర్త, మేలైన ఉపాధ్యాయుడు, సాహిత్య అకాడమీ బహుమతీ గ్రహీత, సంగీత వైతాళికుడు ... సదాశివ గారు ఇక లేరు. ఈయన మరాఠీ నుంచి తెలుగులోకి ఎన్నో అనువాదాలు చేశారు. పు.ల. దేశ్పాండే హాస్య వ్యంగ్య రచయితా అయినా మంచి స్వరజ్ఞాని కూడా. ఆయన స్వర పరచిన ఒక గీతాన్ని కీ.శే. భారతరత్నభీమ్సేన్ జోషి కచేరీల్లో పాడుతుండేవారు. ఇటువంటి వారెందరి గురించో సదాశివ మలయమారుతాలు పేరిట వ్యాసాలు రాశారు. ఈయన పద్యాలు రాసేవారు కూడా. ఎవరో వద్దు వచనం రాయమంటే వచన కవితలు కూడా సృజానాత్మకంగా రాశారు. యాది అనే ఈయన కథకి బహుమానం దక్కాల్సిందే, కాని సంగీత కళాకారుల మీద రాసిన వ్యాసాలకి దక్కింది. హిందుస్తానీ,కర్ణాటక, గజల్, టుమ్రీ ..సంగీత పద్ధతులు, అవి పాడడంలో ఎవరు ఎలాంటి మెళకువలు పాటించారో ఆయన ఎంతో స్పష్టంగా రాశారు’ ‘అయ్యో.. పద్యానికి ఉండే ఆ కాస్త పెద్ద దిక్కూ ఆవలి దిక్కుకి తరలిపోయిందన్న మాట. వారి ఆలోచనలు కాయితాల మీద నిక్షేపమై ఉన్నాయి. అవి చదువుకుంటూ తెలుసుకుంటూ ముందుకు సాగాల్సిందే...’ ‘సరేనండి.. బావగారూ .. సెలవా మరి’ ‘బావా.. ఇప్పుడు మెచ్చితి నిన్ను..’ ‘పేరడీ?’ ‘పద్యమంటే ..మనమెప్పుడూ రెడీ’ -డా. తాతిరాజు వేణుగోపాల్, 9 ఆగస్టు 2012 (శ్రావణ మాసం, గురువారం) [ఈ పూట ప్రత్యేకం: కనులు చూసినా పాటే: మూడు వీడియోలు , కనులు మూసినా పాటే: కొన్ని గంభీర, హాస్య పద్యాల ఆడియోలు; కనులు చదివినా పాటే: అరుదైన పద్య రచన; తిరుగులేని మాట: శ్రీశ్రీ, శ్రీపాద పినాకపాణి, సామల సదాశివ ; తీరైన మాట: డాక్టర్ పినాకపాణి వారి పైన అభిమాన జల్లులు; ఆల్ 'బొమ్మ'లే: డాక్టర్ పినాకపాణి వారి నూరవ పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రభ సౌజన్యంతో వారి 'నా సంగీత యాత్ర' నుంచి గ్రహించిన బొమ్మలు, కొత్తగా చేర్చినది: క్లాస్ రూమ్ - ప్రస్తుతం పద్య లక్షణాలు]
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|