మునుపటి నా మాట
‘వందే మాతరం’ అని పేపర్లో పెద్ద శీర్షిక, ‘వందే’ మాటని చిక్కని ఎర్ర రంగులో ముద్రించి మరీనీ. ఎందుకూ అంటే .. 09 సెప్టెంబర్ ఆదివారం నాడు ఈసురోమంటూ ఉండని శాస్త్రవేత్తలున్న మన ఇస్రో వారి నూరవ గ’ఘన’ వీధి విహారం విజయవంతమైంది కనుక. శ్రీహరికోట గట్టి మేల్ తలపెట్టితే శ్రీ కాళహస్తీశ్వరుడు ఎట్టి ఆపదా రాకుండా కాచాడు. అప్పుడనిపించింది ఇస్రో వారికి ఈ ‘వంద ...ఏ మాత్రం?’ లక్ష్యసిద్దిలో వెయ్యికి చేరగలరని! అందుకే ప్రస్తుతానికి ఎస్వీ రంగారావు ..అదే ..మన సినీ ఘటోత్కచుడు అన్నట్టు ‘వెయ్యి వీరతాడు’. -------- టీవీలో మళ్ళీ వీకెండు కోలాహలం ఓ వీశెడు. ఎందుకూ అంటే...అమితాభ్ బచ్చన్ మళ్ళీ కరోడ్పతుల్ని సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు కనుక. తాతగారైన ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఒక బుజ్జిపాపతో టీవీ షోలో ఆడుకున్నారట కూడా. పృథ్వీ రాజ్ కపూర్, రాజ్ కుమార్, సంజీవ్ కుమార్, అమితాభ్ బచ్చన్, శత్రుఘ్న సిన్హా, ఓంపురి, అమ్రీష్ పురి ల నటనతో పాటూ ఆకట్టుకునేది వారి వారి వారేవా అనిపించే వాచకం. అలా భేషైన మాటల వల పన్ని అమాంతం తెలుగువారిని దోచేసిన ఏకైక భారీ జీవి మన యశస్వీ రంగారావు గారొక్కరే. ఆ రోజుల్లో టీవీలుంటే తప్పక మన రంగారావు గారు ‘ఎవడురా కోటీశ్వరుడు?’ అనే కార్యక్రమం బుల్లి తెర మీద చూపేవారేమో. నేపధ్యంలో ‘ధనమేరా అన్నిటికి మూలం’ అని ఒకే ఒక్క లైన్ వినపడేదేమో, అన్నిటికి ధనమే మూలం కాకపోయినా. హఠాత్తుగా రంగారావు గారు గుర్తుకు రావడం ఏమిటీ? జయంతి గానీ వర్ధంతి గానీ వస్తోందా? కొందరంతే.. వారికివేవీ చెల్లవు. నిత్య స్మరణీయులు. ------ ఇప్పుడు ఎటు విన్నా ఒకటే నామం – శిరిడీ సాయి! నాగార్జున సినిమా.. రాఘవేంద్రరావు సినిమా .. కీరవాణి సినిమా.. ముఖ్యంగా మహేంద్ర రెడ్డి సినిమా. కుటుంబ సమేతంగా సినిమా చూసి వస్తుంటే కాస్త ఇన్నాళ్ళకి మనసునిండా ‘రెట్టించిన హాయి’ దట్టించినట్టయింది. ‘నీకెట్టుందో కాని’ అని ఒక పాత పాటలో అన్నట్టు మహారాష్ట్రలోని తెలుగువాళ్ళ మైన మాకు హాలు సమీపించగానే తెలుగు ముఖాలు కనిపించడం మటుకు హాయీ ముప్పావే. ఈ హాయి ఎంత పని చేసిందంటే ఇంటర్ వెల్ లో హాలు బయట నున్న అమ్మకాల స్టాల్ కుర్రవాడిని ‘ రెండు కాఫీలు ఇవ్వు బాబూ’ అని తెలుగులో అడిగేంతవరకూ వెళ్ళింది. తెలుగు తెలియని ఆ అబ్బాయి ఆదిత్య 369 లో చంద్రమోహన్ ‘ మీరంటున్న మాటల్లో ఒక్క పొట్టా, పొట్టి తప్ప నాకేవీ అర్థం కావట్లేదు’ అన్నట్టు మొహం పెట్టి ఒక్క కాఫీ అనే మాటనే అర్ధం చేసుకునీ మనల్ని వెర్రి గా చూడటం! అది హాయీన్నర. సినిమాలో సాయిబాబా ఇంగ్లీష్ మాట్లాడం హాయీమ్పావు. -------- యువి అనగానే అల్ట్రా వాయిలేట్ కిరణాలు అనుకునే అమాయకులుండరు ఇండియాలో, అదీ ఈ రోజుల్లో. ఎవడిక్కావాలి రేడియేషన్ , ముందుండగా క్రికెట్టు మెడిటేషన్! ‘యువరాజ్’ ని ముద్దుగా ‘యువి’ అని పిలుస్తారని కడుపులో ఉన్న బిడ్డ కూడా కాలు తన్ని మరీ చెప్పగలదు. క్యాన్సర్ రక్కసి నుంచి ముక్తి పొంది కాలుణ్ణి జయించి మళ్ళీ మైదానంలో అడుగు పెట్టిన యువికి విశాఖ ..‘పట్టం’ కట్టి బహుమతీ ప్రదానం చేసి అనంతరం ఆయన ఆడితే చూద్దామనుకుంది. ఇంతా చేస్తే మేఘావృతమై బెదిరించిన ఆకాశం ఆఘ మేఘాల మీద వాన కురిపించి ఆశ నిరాశ చేసింది. కాదు.. ఆంధ్ర ఆకాశం కురిపించిన ఆనంద బాష్పాలేమో అవి. బంతులబ్బాయి మీద ప్రేమతో మంచుకణాల పూబంతులు విసిరేసిన స్ఫటిక పుష్పాలేమో అవి! ---------- ఆమూలాగ్రం బొద్దుగా తెల్లగా ఉండే అమ్మణ్ణి ‘అమూల్ బేబీ’ అని ఆమె ఎదుట అనకుండా ఫ్రెండ్స్ మధ్యనే ఆమె దాటిపోగానే అనుకునే వాళ్ళం కుర్రతనంలో. ఏడాది పిల్లలకి అమ్మలా ఇష్టమైనది అమూలొకటి ఇప్పటికీ. పాపల బాగే తప్ప పాలంటే అసలు నచ్చని కురియన్ గారు గుజ’రాత్ ఔర్ దిన్’ ‘పాల’పుంతలోనే తిరుగుతూ దేశంలో పాల క్రాంతి తీసుకొచ్చి పాల పొడి పరిశ్రమ పరిధికి పరిపాలకులయ్యారు. అలా వచ్చినదే అమూల్. తొంభై పై చిలుకు వయసులో మొన్న మొన్ననే ఈయన దివంగతులయ్యారు. నిజం పాల పుంత వైపు తరలిపోయిన కురియన్ అమృత హస్తాల నుంచి ఇకపైన కూడా క్షీరధారలు కురియునా లేదా అని పిల్లలు బెంబేలు పడుతున్నారు. పాల కడలిలో శేషతల్పమున పవ్వళించే శ్రీహరి కురియన్ పేరు మార్చి ‘కురియున్’ అని భరోసా ఇస్తున్నాడు. పాల వెన్నెల్లో, మురిపాల వెన్నెల్లో మల్లాది రామకృష్ణులు కూడా అదే సెలవిస్తున్నారు
------- పాలపుంత అనగానే చప్పున గుర్తుకొస్తాయి గుంపులు గుంపులుగా నక్షత్రాలు. అశ్విని, భరణి,కృత్తిక, రోహిణి.... ఆ పైనవి గుర్తుకు రాక ఆగిపోలేదు. రోహిణి మాట వినగానే కడవ వంటి కంటి నుంచి కన్నీరాగలేదు. అవును.. కొడవటిగంటి రోహిణీ ప్రసాదు మనకింక లేరు. దిక్సూచి లా ఉండే మేధావి లేక ముంబై వాసులకింక దిక్కు తోచటం లేదు. అణుశాస్త్రవేత్త రక్తంలో అణువణువునా సంగీతం, సాహిత్యం కూడా కలిసి పోయి ఉండడం గొప్ప విశేషం, విడ్డూరం. కీబోర్డు వాయించే పద్ధతిని ఓపిగ్గా వివరించగలిగేది ఆయనే, సితారని అవలీలగా వాయించగలిగేది ఆయనే. స్టేజి మీద గాయకులకి ఆసరాగా ఉంటూ సరదాగా ప్రోగ్రామ్స్ నడిపించడం ఆయనకే చెల్లింది. ‘ఈమాట’ అనే నెట్ మేగజైన్ తిరగేసినా, మహారాష్ట్ర లో తెలుగు ‘కాల నిర్ణయ్’ క్యాలెండర్ కదిపి చూసినా అవన్నీ రోహిణీ ప్రసాదాలే. కీ.శే. మహీధర నళినీ మోహన్ వారిలా చక్కని తేట తెలుగు లో సైన్స్ వ్యాసాలు రాయడానికే ఈ మరో మేధావి శాస్త్రవేత్త పుట్టారేమో. యాభై సైన్స్ అంశాల్ని ఒక్కొక్క పుస్తకంగా ప్రచురించాలన్నదే రోహిణీ వారి సంకల్పం. కొడవటిగంటి కుటుంబరావు గారి అవరోహణం వారి పుత్ర రత్నం రోహిణీ ప్రసాదు గారు. ఇప్పుడు రోహిణీ వారి గాంధర్వ లోకారోహణం.. ప్చ్.. విధికి సంగీత జ్ఞానమే తప్ప ఇంగిత జ్ఞానం లేదే! ------- ఇదీ వర్తమానం. కాస్సేపు కిలకిలా నవ్వుతాం. కాస్సేపు వలవలా ఏడుస్తాం. పుస్తకం తెరుస్తే (భవిష్యత్తు) వచ్చే పేపరు వాసన వల్ల పులకింత కొందరికి .. పుస్తకం మూసేస్తే (గతం) వచ్చే పుట్టెడు దు:ఖం వల్ల చింతా వంత కొందరికి. పుస్తకం ఒక్కటే వాస్తవం (వర్తమానం). ------ మూసి తెరిచిన డైరీ ఈ రోజుని మార్క్ చేసింది- మల్లాది వారి వర్ధంతి అని, బ్రహ్మశ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి స్వర్గాగమ తిథి అని, రెండు వందలు మించని సినిమా పాటలు తనకంటూ మిగుల్చుకునీ, తనవంటూ చెప్పుకునీ పండు ముసలి కాక ముందే పడమటి సూర్యుడి వైపు పరుగు తీసిన ధన్య జీవి పరమానందయ్యని గుర్తుకు తెచ్చే పుణ్య తిథి ఇది అని. ఈ నెలలో ‘రచన’ (మాస పత్రిక) లో రావాల్సిన నా రచన మరో నాటికి వాయిదా పడింది కనుక (‘నెల’ తప్పింది – అనడం బాగోదండీ) అదే రచన ఇక్కడ ఇవ్వడం భావ్యం కాదు కనుక (ప్రచురించను పొండని రచన శాయి గారు ప్రకటించలేదు కనుక) మల్లాది వారి మార్గదర్శకత్వాన్ని మాత్రమే చూచాయగా సూచించి.....ఆకాశ వీధిలో హాయిగా ఎగురుతున్న ఆ ‘తేట తెలుగు జిలుగు రెక్కల పులుగు’ (పులుగు అంటే పక్షి.. మల్లాది వారు ‘చిలక’ మాటని అధికంగా ప్రయోగించేవారు తన పాటల్లో) వైపు ఆశ్చర్యంగా చూస్తూ నివాళి సమర్పిస్తున్నాను. ఆయన చేతి నిమురుల చిలుకలు ఎన్ని ఉన్నాయో తెలియాలంటే ....అచ్చం అవే అచ్చులు .. చూడాల్సిందే. ఇక మార్గ దర్శకత్వం అనడం ఎందుకంటే... మల్లాది వారు తానుగా తొలిసారిగా సినిమా పాటలు రాసిన సినిమా పేరు ‘చిన్న కోడలు’ . ఆయన లేని లోటు తీర్చడానికి ఒక అభిమాన నిర్మాత కోరి వెతికి ఆయన రాసిన లలిత గీతాన్ని తన సినిమాలో పెట్టుకున్నారంటే మల్లాది వారి మార్గమెంత అనుసరణీయమో అర్ధమౌతుంది. అంతేనా? అలా వచ్చిన మల్లాది వారి ఆఖరి సినిమా పేరు ‘అత్తగారూ కొత్త కోడలు’ కావడం విశేషమే కాదు, విడ్డూరం కూడా. ఆది లోనూ ఆఖరి లోనూ ‘కోడలు’ సేవలు పొందిన ‘మరు మల్లెల మామయ్య’ మన మల్లాది రామయ్య. అందుకేనేమో మధ్యలో ఆ ‘మా ఇంటి మహాలక్ష్మి’ సేవలు మెచ్చి ఆయన ‘మారాకు వేసే ప్రేమ రాక’ గురించి ప్రస్తావించారు. భార్యా భర్తల మధ్య నిరంతరం ప్రేమ మారాకు వేస్తూ ఉండాలి. అటువంటి భార్య తన ప్రేయసి కావాలని ప్రియుడి ఆశ. అటువంటి ప్రేయసి రాక కోసమే అతడి నిరీక్షణ.... వీటినే గ్రహించి (సంగ్రహించి అనడం తప్పు.. అనుసరణీయం ఆమోదమే కాని అపనిందార్హం కాదు) ఒక వీటూరి వారు, ఒక వేటూరి వారు తమ తమ పాటల్లోనూ వ్యక్తం చేసుకున్నారు. అనుసరించిన ఏకలవ్య శిష్యుల ఇంటి పేర్లలోనూ సారూప్యం కన్పిస్తోందంటే అదీ మల్లాది వారి మార్గ నిర్దేశమేమో. ‘మా ఇంటి మహాలక్ష్మి’ , ‘దేవత’, ‘పంతులమ్మ’ ---- ఇవి వరుసగా వచ్చిన సినిమాలు. మూడింటి పేర్లలో స్త్రీ వాచకమే ఉండడం మరో విశేషం. 'మా ఇంటి మహాలక్ష్మి ' సినిమాలో మల్లాది వారి పాట – మత్తుకి బానిసైన వాడిని గమ్మత్తుగ ఎత్తి పొడుస్తుంది. ‘ఆమనీ మధు యామినీ’ అని ఆ పాట మొదలౌతుంది. ఆమని వనిలో మధువే ఆనే వ్రతధారి రోలంబ (తుమ్మెద) కాక మరేమిటీ? అయితే అది ఎటువంటి బంభరమంటే (తుమ్మెద) దాని రాకతో ప్రేమ మారాకు వేసిందట. కాని ..పాడే ఈ తుమ్మెదకి పానం పెద్ద వ్యసనమే! అందుకే తుమ్మెదని రమ్మన్న ఆ పూబంతి ‘నీ తీరు మాకు నచ్చదోయ్’ అని మొహమాటం లేకుండా తిరస్కరిస్తుంది. అంతటితో ఆగక ‘విరిసింది నీ విందుకు కాదోయ్, జవరాలి సిగలో మురిసేందుకోయ్’ అని హెచ్చరిస్తుంది. మల్లాది వారికి మరుమల్లెలూ, విరజాజులూ కావ్య వస్తువులు. ఇక్కడ ఈ పాటలో మాత్రం ‘మల్లిక’ ని ప్రస్తావించారు. తుమ్మెద డీలా పడుతుంది. అప్పుడు పూబంతులు ముక్త కంఠంతో అంటాయి – ‘మధుపానం మానేయ్, ధోరణి మార్చుకో, లలిత కళలకి విలువ కోరకు, నీ గానాన్ని లోకానికి దానం చెయ్’ అని. పరువును మించిన మధువు లేదంటారు మల్లాది వారు. అలాంటి పరువులో మునిగి తేలడమే అవసరం. ఇక పూర్తిగా భిన్నమైన సన్నివేశం వీటూరి వారికి ‘దేవత’ సినిమాలో దక్కింది. భార్యా భర్తలు తమ పెళ్లి రోజును జరుపు కోవడానికి ప్రకృతి నాశ్రయిస్తారు. ఇకనేం.. ఆమె కన్నుల్లో మిసమిసలు, గుండెల్లో గుసగుసలు అతన్ని అలరిస్తాయి. తన జీవితంలో ఆమె రాక పట్ల అతనెప్పుడూ కృతజ్ఞుడే. అందుకే అతని మనసు ‘మనలోని ప్రేమ మారాకు వేయనీ’ అని అర్ధిస్తుంది. కథ ప్రకారం ‘ఆమె’ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయినా ఆమె రూపాన్ని పోలిన మరొక ‘దేవత’ కదలి రావడం ‘మారాకు’ ని సమర్ధిస్తోంది. అది ముందస్తుగా సూచించడం వీటూరి వారి ప్రతిభ. వీటూరి వారి పాటల గొప్పతనం వెలుగిచ్చి చూపించినది ‘దేవత’ సినిమావే. మార్గం వేసినది మల్లాది వారైతే, సక్రమంగా ఆ మార్గంలో నడిచి ఆ మార్గం అవసరాన్ని గుర్తుకు చేసిన వీటూరి వారికి జేజేలు. ఇక ‘పంతులమ్మ’ విషయానికొద్దాం. వీటూరి లోని గుణింతం మార్చితే వేటూరి అవుతుంది. మల్లాది వారి బాటలో నడవాలని ముందే తీర్మానించు కున్నారు కాబోలు వేటూరి వారు, అందుకే ఆయన కిష్టమైన ‘మరుమల్లె’ మాటని ఈయన ముందు స్వీకరించారు. తరువాత వీటూరి వారు స్వీకరించిన ‘ప్రేమ’ పదాన్ని పక్కన బెట్టి మల్లాది వారన్న ‘రాక’, ‘మారాకు’ పదాల్ని మాత్రమే ఎంపిక చేసుకున్నారు వేటూరి వారు. ‘సిరిమల్లె నీవే’ అని ఆమెని పొగిడితే అది ‘ప్రేమ వనమే’ కదా అని వేటూరి వారి భలే ఎత్తుగడ. ‘మరుమల్లె తోట మారాకు వేసే ... మారాకు వేసే నీ రాక తోనే’ అని ముగించారు. భళీ.. ఉద్దండుడికి ఒద్దికైన దండాలు. ఈ త్రివేణీ సంగమాన్ని ‘కనులు మూసినా పాటే’ గా సంస్మరించుకుందాం. మూడు పాటలు విన్నాం సరే.. మననం చేసుకోవాలి ..అంటే చదవాలి.. ఎలా? మీ సందేహం తీర్చేది ‘పాట = తిరుగు టపా’. పాటలీ పుత్రా అన్న తండ్రులకి ఏరేరి పాటలిచ్చాను. ‘రాగమయీ రావే’ (జయభేరి, 1959) అని ప్రేమికుడు పిలిచినా , ‘రావోయీ మనసైన రాజా’ (టాక్సీ రాముడు, 1961) అని ప్రేయసి పిలిచినా, ‘నిను నమ్మి కన్నె నిచ్చుకొన్న వారియింటికి దారి ఈనాటికి తెలిసినదా’ (పల్నాటి యుద్ధం, 1966) అని అమాయక విరహిణి అనురాగ మూర్తికి విన్నవించుకున్నా .... అదంతా మల్లాది వారి కలం నుంచి మనోహరంగా వెదజల్లుతూ ఎదనల్లుతూ వచ్చిన మాటల ముత్యాల జిగి బిగే. అందుకే కనులు చూసినా పాటే ... ఈ పూట పరిమళాల బాటే! టపాసులకింకా చాలా సమయముంది కనుక తిరుగు టపా లో వెంటనే మీ అభిప్రాయం చెబితే కృష్ణ ప్రేమలో మీ రాక మారాకు వేయిస్తుంది. అంతవరకూ ..... ఇంటింటా కొలువుండే గం గం గణపతి దేవుని సగం సగం (అధిక భాద్రపదం, నిజ భాద్రపదం కనుక) వెరసి పూర్తి ఆశీస్సులు అందరికీ దక్కాలని ..మల్లాది వారి తెలుగు ఇంటింటా వినిపించాలని కోరుతూ ... ఆల్వేస్ సే లవ్ ..(అయ్యో తెలుగా, నీకింక సెలవా?) ముక్తాయింపు : ఈ ఏడాది ఈ రోజు గణితంలో మంచి గుణింతాన్ని సాధించింది – 12912… పన్నెండు రాశుల, పన్నెండు మాసాల మధ్య నవ గ్రహాల్లా ! -డా. తాతిరాజు వేణుగోపాల్ , 12 సెప్టెంబర్ 2012
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|