మునుపటి నా మాట
అమ్మవారు శక్తి స్వరూపిణి. ఈ శారద రాత్రులన్నీ శక్తి మయమే. ఎర్ర రంగు శక్తికి చిహ్నం. ఆ రంగు విప్లవానికి ప్రతీక అని కొన్నాళ్ళు భ్రమలో పడ్డాం. చెడు మీద దాడి చేసి మంచిని బ్రతికించడమే విప్లవమైతే మన లోని ఎర్రటి రక్తం అడుగంట కూడదు, ఉడుకు రక్తం కావాలి. అదే అమ్మవారు నేర్పిన శక్తి పాఠం. కాళీ మాత అనగానే కన్నెర్ర చేసే శక్తి గా, నల్లని రూపంగా భయపడతాం. జేజమ్మ పేరు చెప్పి అనవసరంగా పిల్లల్లో భయం కలిగిస్తాం. మనం సహితం భయంతోనే పూజలు చేస్తాం, భక్తితో చెయ్యాలి అని తెలిసి కూడా. మన అమ్మ కున్నట్టే అమ్మవారిది కూడా చల్లని చూపే. ఇది తెలిసి కూడా నమ్మకం కలగదెందుకు? దేవులపల్లి వారు ‘కోవెల్లో వెలిగే దీపం దేవి మా తల్లి (సుఖదు:ఖాలు, 1967)’ అని ప్రకటించారు. వీటూరి వారు ‘లోకాలేలే చల్లని తల్లీ (ఉక్కు పిడుగు, 1969)’ అని కొనియాడారు కదా ఇంకా సందేహమెందుకు? దాశరథి వారు ఇలా కాదని ‘అమ్మా నీవు లేని తావే లేదు..మా మదిలో నిలిచిపోవమ్మా(పచ్చని సంసారం,1970)’ అని కోరుతూ ‘ఈ లోకులంతా నీ పాపలమ్మా లాలించవమ్మా పాలించవమ్మా’ అని అభ్యర్ధించారు కదా. పాపల్ని లాలించే అమ్మ దెప్పుడూ చల్లని మనసే. అమ్మ దృష్టిలో అంతా సమానులే. ‘పాపులూ పుణ్యులూ నీ పాపలే (కనకదుర్గ పూజా మహిమ, 1960)’ అని అమ్మతో నివేదించుకున్నారు జి.కె. మూర్తి గారు. కాని వింత సృష్టిలో కొందరే మంచివారు, ఎందరో చెడ్డవారు. అసురులు అనండీ రాక్షసులు అనండీ వారిలోనూ మహత్తరమైన జ్ఞానం ఉన్నా అహం పాళ్ళు ఎక్కువ. ఆ విర్రవీగుడు తనమే వారి చేత వెర్రి పనులు చేయిస్తుంది. సురల వ్యధ తీరాలంటే అసురుల కథ ముగియాల్సిందే. అసురల కథ ముగియడమన్నది వారి వధతోనే సాధ్యం. విష్ణువు కొందరిని, పరమశివుడు కొందరిని, శ్రీకృష్ణుడు కొందరిని, శ్రీరాముడు కొందరిని ఇలా పురుషులు వధించిన అసురులు కొందరైతే అమ్మ మాత్రమే వధించగలిగిన అసురులు ఎందఱో ఉండేవారు. అందులో ప్రముఖుడు మహిష ముఖుడు మహిషాసురుడు. ఒక్కొక్క రాక్షస పీడ నుంచి విముక్తి చేసిన దేవికి కృతజ్ఞతగా హారతి పట్టడమే దసరా నవరాత్రుల సంబరం. రాక్షసులు దైవత్వం విషయంలో తామస వాదులు. కనుక వారి వల్ల పేరుకున్న తమస్సునుంచి బైట పడగలిగేందుకు గుర్తింపుగా దేవి పూజలు రాత్రులే జరుగుతాయి. దేవి కన్నుల్లో ఒక కంట సూర్యుడుంటే మరో కంట చందురుడుంటాడు. సూర్య తేజంలో కన్నా చంద్ర తేజంలో దేవి జ్వాలా తప్త రూపాన్ని శాంతింప చేయడం అనువైనది కదా.
‘దినరాజు గానీ, నెలరాజుగానీ నీ సైగతోనే నడిచేరు తల్లీ (పచ్చని సంసారం, 1970)’ ...అని దాశరథి కవి అమ్మకున్న శక్తిని అమ్మకి నివేదిస్తున్నట్టే చెబుతూ మనం మరచిపోయినది గుర్తుకు చేశారు. దేవా కరుణా మయా కమలా ప్రియా శేషగిరి నిలయా మా ఇలవేల్పు నీవయా ...సూర్య చంద్రులే నీ నయనాలు (దేశమంటే మనుషులోయ్,1970) అని మరో కవి విష్ణు అంశమైన శ్రీనివాసుని, కమలా ప్రియుని, కరుణామయుని గురించి అన్నారు. వీరిద్దరి దృష్ట్యా చూస్తే శివకేశవుల భేదం అనేది లేదని నిరూపణ అయినట్టే కదా. శ్రీ వెంకటేశ్వరుడు గురించి ఆత్రేయ మూడు ముక్కల్లో ఏమన్నారూ? ‘శివుడవో, భవుడవో, మాధవుడవో నీవు?(శ్రీవెంకటేశ్వర వైభవం,1971)’ అనేగా. దాశరథి వారూ మూడు వాక్యాల్లో ఏమన్నారూ? ‘తిరుమల మందిర సుందరా.. పాల కడలిలో శేష శయ్యపై పవళించిన శ్రీపతివో, వెండి కొండపై నిండు మనసుతో వెలిగే గౌరీ పతివో, ముగురమ్మలకే మూలపుటమ్మగా భువిలో వెలసిన ఆదిశక్తివో (మేనకోడలు, 1972)’ అనేగా. వీరందిరికన్నా ముందు మన త్యాగయ్య గారు శ్రీరాముని ఇలా ప్రశ్నించారు- ‘ఎవరని నిర్ణయించిరిరా నిన్ను శివుడనా , మాధవుడనా , కమలభవుడనా (బ్రహ్మ అనా?), పరబ్రహ్మ అనా?’ అలాగని ఊరికే ప్రశ్నించి వదిలేయలేదు ఆయన. ‘రామ’ నామం అన్నది శివ పంచాక్షరి నుంచి, నారాయణాష్టాక్షరి నుంచి వచ్చిన రెండు జీవాక్షరాలు అని స్పష్టం చేశారు. మ – అనే జీవాక్షరం లేని శివ పంచాక్షరి- నమ:శివాయ కేవలం న శివాయ అవుతుంది. అంటే శుభం కాదని అర్ధమిస్తుంది. రా- అనే జీవాక్షరం లేని నారాయణాష్టాక్షరి- ఓం నమో నారాయణాయ కేవలం నా యణాయ అవుతుంది. ఇదీ అంతే –శుభం కాదనే అర్ధమే ఇస్తుంది. ఈయన కన్నా ముందు అన్నమాచార్యులు శ్రీవేంకటేశ్వరుడి పరంగా ‘ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు’ అనే సంకీర్తనలో ‘కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని, తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు,సరి నెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు’ ..అటువంటి నీవు ‘అల్ప బుద్ధులకు అల్పుడవు, ఘన బుద్ధులకు ఘనుడవు...నీటి కొలది తామరవు’ అని భేద వైషమ్యాలన్నవి మానవులు కల్పించుకున్నవే అన్న సత్యాన్ని తేటతెల్లం చేశారు. త్యాగయ్య కాలానికి, అన్నమయ్య కాలానికి కనీసం రెండువందల సంవత్సరాల తేడా ఉంది. అదే మన దురదృష్టం- భక్తిలోనూ, పరిపాలనలోనూ మనల్ని వందల ఏళ్ళ ‘పీడ’లు వదిలి పెట్టలేదు. అమ్మలో వెంకన్నని చూడ వచ్చు. వెంకన్నలో అమ్మను చూడవచ్చు. అందుకే దసరా నవరాత్రుల్లోనే స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అమ్మల గన్న యమ్మ ముగురమ్మల యమ్మ ....ఆమె కన్నులు విశాలమై ఆకాశ మంతటా వెలుగులు ప్రసరిస్తున్నాయి. అందుకనే ఆమె కాశీ విశాలాక్షి. ఆమె కన్నులు కోరికల కంచె దాటనివ్వక కంచి పట్టున ఉంచుతాయి. అందుకే ఆమె కంచి కామాక్షి. ఆమె కన్నులు చేప వంటి చంచలమైన మనసుని మధురమైన సన్మార్గంలో పెట్టి సరి చేసుకొమ్మని సూచిస్తాయి. అందుకే ఆమె మధుర మీనాక్షి. జగన్మాత మహాలయ అమావాస్య నుంచి ఎన్నెన్ని రూపాలో ధరిస్తోంది. మహంకాళి(దుర్గ), మహాలక్ష్మి, మహా సరస్వతి అన్నవి మనకి పరిచయమైన మూడు రూపాలు. కలకత్తాలో కాళీ, కొల్హాపూర్లో మహాలక్ష్మి, బాసరలో సరస్వతి ఆయా క్షేత్రాల్ని పరమ పావనం చేయడానికా అన్నట్టు వెలిశిన రూపాలు . చతుర్వేదాలకి, చతుర్వర్ణాలకి దేవతగా సావిత్రి నామధేయతో నాలుగో రూపం కూడా ఉంది. ( సైడ్ ట్రాక్: మహానటి సావిత్రి – పేరుకు తగ్గట్టే దేవత, మాతృ దేవత, నవరాత్రి చిత్రాల్లో నటించడం చూస్తే ఔరా అదంతా అమ్మ ఆశీర్వాదమేనేమో అని అనిపించక పోదు). అమ్మ ఐదో రూపం రాధాదేవి (బృందావనం లోని కృష్ణుడి ఆ రాధే ఈ రాధ) అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. అయిదుకు తగినట్టే ఆమె పంచ ప్రాణాల దేవత. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పేరుతో దుర్గమ్మ కొలువై ఉంది. ఇంద్రకీలాద్రి పైన కనకదుర్గమ్మ మనమెరిగినదే. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ కొలువు తీరి ఉంది. (సైడ్ ట్రాక్: భ్రమరాలు అంటే తుమ్మెదల్ని పంపి దేవి ఒక రాక్షసుడిని వధించి భ్రమరాంబగా పేరు పొందింది. ఇవాళ ఈగ పగ తీర్చుకోవడం ఒక సినిమా వెర్రిగా అనుకుంటాం గానీ పురాణంలో చెప్పినవే కథలుగా సినీ దుకాణంలో అమ్ముడుపోతుంటాయి. ఇవాళ ప్రపంచంలో నరరూప రాక్షలున్నారు. నరుల్ని ముప్పు తిప్పలు పెట్టిస్తున్న స్వైన్ ఫ్లూ, డెంగ్యూ వంటి మహమ్మారీలున్నాయి. పగలు ఏ చప్పుడూ చెయ్యకుండా డెంగ్యూ దోమ కుట్టి పోతుంది. పాపం ఎనభై ఏళ్ళ వయసులో ఎప్పుడూ ఏ శరీర బాధ ఎరుగని సినీ నిర్మాత,దర్శకుడు వలపు రేడు అని పేరు పొందిన యశ్ చోపడా గారిని ఇటీవల డెంగ్యూ బలి తీసుకుంది. ‘పన్నగపు దోమతెర పైకెత్తవలె’ అని అన్నమయ్య అన్నారంటే దానర్ధం అయిదువందల ఏళ్ళ నుంచి దోమల బెడద మనకుందన్నమాట. ఎటొచ్చీ ఆ రోజుల్లో లేని జబ్బులు మాత్రం ఈ రోజుల్లో విజ్రుంభిస్తున్నాయి. అమ్మ కరుణించి ఈ రకం దోమ రాక్షసులనుంచి మానవాళిని రక్షించాలి. అలాగని అమ్మ రక్షిస్తుందిలే అని కూర్చోవడం తప్పు. ముందు మానవాళి తమ పరిసరాల పరిశుభ్రత పట్ల శ్రద్ధ చూపాలి. మనకి తాగే నీరు లేకపోయినా ‘నిలవ నీటి’కేం కొరత లేదు. రోడ్ల పక్కన సర్వ విసర్జనకి లోటు లేదు. ఈ అలవాట్లు మాన్పించే విప్లవ మార్గాలు ఎంచుకోవాలి మనం. మనం బాగులేక మనల్ని పాలించే వారు బాగు లేక మన బాగోగుల్ని తల్లే గమనించమంటే చాలదు. మన ధృఢ ప్రయత్నం చూశాకనే తల్లి గమనం ఆరంభమౌతుంది). భవానీ అన్న పేరు చెబితే మనకి జగద్గురు ఆది శంకరులు గుర్తుకు రావాలి. వారు శిష్యుల కోరిక మీద తీర్థ యాత్ర చేస్తూ కొన్ని క్షేత్రాల పున:ప్రతిష్ట కి దారి చూపారు. ఉగ్ర రూపిణిని శాంత స్వరూపిణి గా మార్చే స్తోత్ర పఠనం చేశారు. సృష్టి రహస్యమంతా శివ శక్తి కలయికలోనే ఉందని గ్రహించారు. యావత్ కాల స్వరూపం ఈ శివ శక్తియే అని విశ్వానికి తెలియజేశారు. అర్థనారీశ్వర తత్వమంటే అంతేగా- పగలు,రేయి సమభాగాలు, ఉత్తర,దక్షిణ ఆయనాలు! అందుకే జగజ్జనని ‘రాత్రి’ దేవత, దక్షిణాయన దేవత. ఉత్తరాన కాశీనాధుని పత్నీ రూపమే కాని దక్షిణాన కంచి,మధుర ల ప్రత్యేక స్త్రీ మూర్తి ఆమె. దుర్గాష్టమి, నవమి, దశమి తిధులలో విధిగా లలితా సహస్ర నామ పఠనం చేయమని విజ్ఞులు,దైవజ్ఞులు అంటారు. లలితా సహస్రనామాలు ఉగ్ర రూపిణి అయిన దుర్గమ్మని కారుణ్యమూర్తిగా మార్చి దేవి కరుణా కటాక్షాలు మనకి ప్రాప్తించేలా చేస్తాయని ఆదిశంకరులు ప్రవచించారట. స్తోత్రాలు, పూజలు ఇళ్లలో మాత్రమే కాదు జన బాహుళ్యానికి నచ్చే సినిమా మాధ్యమం లోనూ సాధ్యమే. బహుశా తొలిసారిగా తాపీ ధర్మారావు గారే ‘ఎంత కృపామతివే భవానీ’ (కీలుగుర్రం, 1949) అన్న దేవీ కటాక్ష గానానికి స్వీకారం చుట్టడంతో ఆ తరువాత జి.కె.మూర్తి గారు ‘భవానీ స్తుతి చేస్తూ (కనకదుర్గ పూజా మహిమ, 1960) గౌరి , శంకరి , భవాని , కాళి , కల్యాణి, గీర్వాణి, హ్రీం కారిణి, అన్నపూర్ణ, అపర్ణ, అంబ,కాత్యాయిని, శ్రీ చక్ర సింహాసిని,శాంభవి, భ్రమరాంబ,కామాక్షి మీనాక్షి,జ్వాలాముఖి, దాక్షాయణి వంటి అష్టా దశ నామాలు పేర్కొన్నారు. పింగళి నాగేంద్రరావు గారు ‘శివశంకరి శివానందలహరి’ (జగదేకవీరునుకథ, 1961)అని రెండు మూడు ముక్కలతోనే దేవి కరుణను ఆశించారు. వీటూరి వారు అమ్మవారిని జగదీశ్వరి, కళాసాగరి, మంగళదేవి అని ముత్యం మూడు నామ ముత్యాలతో అలంకరించారు (స్వర్ణగౌరి, 1962). సీనియర్ సముద్రాల వారు జననీ, శివకామినీ, శుభకారిణీ, విజయరూపిణీ, భవానీ అనే నాలుగు పిలుపులతో దేవి దయను కోరుకున్నారు (నర్తనశాల, 1963). మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు (రహస్యం, 1967) దేవీ కరుణా కటాక్ష రహస్యం ఎరిగిన వారు కనుక రెండు అద్భుతమైన గీతాలు ఒకటి త్రిదేవి పరంగా స్తుతించినది, ఒకటి ఆరతి పట్టి అమ్మ పరంగా నుతించినది రాశారు. త్రిదేవి పరంగా రాసిన పాటలో- బ్రహ్మలోకంలోని వరవీణా పాణి (సుమరదన, విధువదన, దేవి, శారదాభ్ర రూపిణి, శారదాంబిక- అనే అయిదు నామాలు చెప్పారు. పంచమి అంటే అయిదవ తిధి సరస్వతీ దేవి తిధి), వైకుంఠం లోని శ్రీదేవి లతో పాటు కైలాసంలోని అంబని లలిత, జగదీశ్వరి, చిదంబరేశ్వరి, శ్రీ రాజరాజేశ్వరి, భువనేశ్వరి, కామేశ్వరి, సుందరి, భ్రామరి, పరమేశ్వరి అనే తొమ్మిది నామాలతో కొలిచారు. అంటే పదకొండు నామాలు (బహుళ) అమావాస్య నుంచి శుక్ల దశమి వరకు పదకొండు తిథుల కాలంలో దేవీ స్తుతికి సరిపోతాయని మల్లాది కవి పుంగవులు ఆశించారేమో. వారిదే జన ప్రాచుర్యం పొందిన ఆరతుల పాట- ‘శ్రీలలితా శివజ్యోతి సర్వ కామదా’ అనే మకుటంతో ప్రారంభమయ్యే గీతం. ఇందులో వారు ప్రయోగించిన జగముల చిరునగవుల పరిపాలించే జనని, అనయము కనికరమున కాపాడే జనని, చక్కని తల్లి, చల్లని తల్లి వంటి పిలుపులు వినగానే అమ్మ కరుణించకపోతుందా? వీటూరి వారు చల్లని తల్లిని కల్పక వల్లి, హరుని పూబోణి, జనని, శార్వాణి, ఓంకార స్వరరూపిణి అనే మెత్తటి పిలుపులతో ప్రసన్నం చేసుకునీ చండ ముండ భండాసుర భంజనిగా ఉగ్ర రూపానికి పిలుపునిచ్చారు (ఉక్కు పిడుగు, 1969). ఎందుకనీ? శుంభ నిశుంభుల వధించిన సౌర్యం తో మళ్ళీ తల్లి దిగి వచ్చి అరాచికాలు అంతం చెయ్యాలని. ఆదిశక్తి పట్ల భయమెంతో ఆది దంపతులైన శివ పార్వతుల పట్ల అంత గౌరవం ఉండాలి. శివపార్వతులే ప్రేమ మూర్తులు. గంగమ్మ ఏదో పని మీద వచ్చి వెళ్లిపోయిందే తప్ప శివుని ఆలి కాదు. ఆ విషయాన్ని జానపద రీతిలో చక్కగా ఆవిష్కరిస్తూ కొసరాజు రాఘవయ్య గారు ‘ఎవరో పిలిస్తే వచ్చింది, ఎవరికోసమో పోతోంది, మాయాన మజిలీ యేసింది, సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే, పళ్ళు పదారు రాలునులే (మూగమనసులు, 1966)’ అని చమత్కరించారు. అసలే ఆ’రుద్ర’ మూర్తి కనుక ఆరుద్ర కవి ‘గౌరి సగం, శివుడు సగం, అర్ధ నారీశ్వరమే అఖిల జగం’ అని కట్టే,కొట్టే, తెచ్చే పద్ధతిలో విశాల భావాన్ని మూడు ముక్కల్లో తేల్చేశారు (పవిత్ర బంధం, 1971). శివపార్వతులం మనం అనుకునే జంటలు కూడా అడపా దడపా ఎడమొగం పెడమొగం కావడం సహజం. అయితే అది గడప దాటి పోనివ్వక ఉంటేనే మేలు. డాక్టరు కవి సి.నా.రె సరదాగా ప్రియురాలి ఉగ్ర రూపాన్ని పరమేశ్వరి, జగదీశ్వరి, రాజేశ్వరి, కాళేశ్వరి, మండోదరి, గుండోదరి, నీలాంబరి, కాదంబరి అంటూ పోల్చి , ఆమె రాజీ పడ్డాక ప్రాణేశ్వరి, ప్రణయేశ్వరి, హృదయేశ్వరి, మహదేశ్వరి, రాగేశ్వరి, భాగేశ్వరి, వాగీశ్వరి, నాగేశ్వరి అనే నామాలతో కోపం చల్లారినట్లు రాశారు (ధర్మదాత, 1970). అదీ గౌరమ్మ నామ మహిమ! పింగళి నాగేంద్రుల వారికి మళ్ళీ చాలా ఏళ్ళకి దేవిని స్తుతించే భాగ్యం కలిగింది. ఈశ్వరి, పరమేశ్వరి, శక్తి వర్దని, వరదాయిని, ఆదిశక్తి వంటి నామాలతో పాటు సరి కొత్తగా ‘నారాయిణి’ నామం తీసుకొచ్చారు(రాజకోట రహస్యం,1971). ఇక్కడొక విశేషం చెప్పాలి. పింగళి, కెవి రెడ్డి వంటి వారి అద్భుత సృష్టిగా చెప్పుకునే ‘పాతాళ భైరవి, 1951)’ చిత్రంలో దేవి మీద స్తుతి గానీ, పాటగానీ ఒక్కటి కూడా లేదు. నవ్య సినీ యుగంలో వేటూరి వారు నాట్య ప్రదర్శనా యోగ్యమైన గీతం రాస్తూ (సప్తపది, 1981) దేవిని శుభగాత్రీ, గిరిరాజపుత్రీ, అభినేత్రీ, శర్వార్ధ (శివునిలో సగం) గాత్రీ, సర్వార్థ సంధాత్రీ, జగదేక జనయిత్రీ, చంద్రప్రభా ధవళ కీర్తీ, (పదునాలుగు) భువనపాలినీ, కుంకుమరాగ శోభినీ, కుసుమబాణ సంశోభినీ, మౌన సుహాసినీ, గాన వినోదినీ, భగవతీ, పార్వతీ అని తొలి చరణమంతా స్తుతించి, తరువాత లక్ష్మీ సరస్వతులని పేర్కొని ఆఖరు చరణంలో ముగురమ్మల యమ్మగా దుర్గాదేవి ప్రస్తావన తీసుకొచ్చారు. సీతారామశాస్త్రి అనబడే సిరివెన్నెల కవి శివానీ,భవానీ, శర్వాణీ, గిరినందినీ, శివరంజనీ, భవభంజనీ (సంసార కష్టాల్ని ఛేదించేది),భద్రకాళీ,అభయపాణీ,భీషణాస్త్ర కేళీ అని అమ్మవారిని తొమ్మిది నామాలతో స్తుతించారు (స్వాతికిరణం, 1992), నవరాత్రికి సరిపోయేలా. ఉత్తర భారతమంతా శ్రీరామ నామ పఠనం తో పులకితమై ఉంటే దక్షిణ భారతంలో తిరువాయూర్ త్యాగయ్య శ్రీరామ నామ గానంతో పులకరించిపోయాడు. అంతమాత్రాన కేశవ పక్షము వాడనే ముద్ర వెయ్యకూడదు. ఆదిశంకరులు జగన్మాతలో తల్లిని చూసినట్లే త్యాగరాజస్వామి వారూ పంచనదీశ్వరుని నాయిక అయిన శ్రీ ధర్మ సంవర్ధనీ తల్లి చెంత కీర్తించారు. అంబ నిను నమ్మితినంటే. కరుణజూడవమ్మ కమలవైరి కలాధరుని కొమ్మ, నీవు బ్రోవవలెనమ్మ నను, పరాశక్తి మనుపరాద నాపై పరాకేలనమ్మా , విధి శక్రాదులకు దొరకునా ఇటువంటి సన్నిధి, సారి వెడలిన ఈ కావేరిని జూడరే – వంటి కీర్తనలు ఈ దేవి పరంగా వచ్చినవి. త్యాగరాజ స్వాములు లాల్ గుడి క్షేత్రం (తపస్ తీర్థ నగరము, యారక పురము) లో వెలసిన శ్రీ ప్రవృద్ధ శ్రీమతి దేవి (పార్వతి అంశ)ని దర్శించినప్పుడు గతి నీవని నేగోరి వచ్చితి తల్లి పరాకా, లలితే శ్రీ ప్రవృశ్రీమతి లావణ్య నిధి మతి వంటి కీర్తనలు వారి నుంచి వచ్చాయి. బాలాత్రిపుర సుందరి ని వర్ణిస్తూ ‘సుందరి నిన్ను వర్ణింప బ్రహ్మాది సురలకైన తరమా', 'సుందరి నన్నిందరిలో జూచి', 'సుందరి నీ దివ్య రూపమును జూడ'- వంటి అరుదైన కీర్తనలు చేశారు. త్యాగయ్య ఆవేదనతో పాడుకున్న కీర్తనల్లో మాత్రం తల్లి దయకు పాత్రుణ్ణి కాలేక పోతున్నానే అనే చింత వ్యక్తం చేశారు. బహుశా ఆనాటి భక్తి భేద కాల పరిస్థితుల్ని ఎదురీదడంలో ఆయన తన నిస్సహాయతని అమ్మ ముందు ప్రకటించుకొని ఉంటారు. ‘అంబ నిను నమ్మితినంటే నీకు అనుమానమేమమ్మా’ , ‘నీ పద భక్తి నొసంగ పరాకా’, ‘నీవు బ్రోవవలె నమ్మ నను’, ‘పరాశక్తి మనుపరాద నాపై పరాకేల నమ్మా’ అని స్వామివారు విన్నవించుకోవడం గమనించ వచ్చు. శ్రీ ప్రవృద్ధ శ్రీమతి దేవిని దర్శించినప్పుడూ ‘గతి నీవని నే గోరి వచ్చితి తల్లి పరాకా?’ అని ఒక పర్యాయం , ‘తెలియని బాలుడ గాదా , అంబ ..చలము సేయ మరియాదా, చూచీ చూడక పరాకా’ అని మరో పర్యాయం మళ్ళీ ఆవేదనే వ్యక్తం చేశారు. అయితే ఈ దేవీ రూపాల కొలువుని ప్రస్తుతిస్తూ త్యాగయ్య స్వామి చేసిన వర్ణనలు ఆదిశంకరుల వారి వర్ణనల్లా ఒక దృశ్య నాటిక మన కళ్ళ ముందు కదిలేలా చేస్తాయి. జగన్మాత రూపమే అంత! వీక్షించినంతలోనే వాగ్దేవి వరమిస్తుంది. సుందర పద శబ్ద తరంగాలు సుధా కవితా జలధిలోంచి మార్మోగుతాయి. కమలవైరి (చంద్రుడు) కలాధరుని (చంద్రకళ ధరించిన శివుని)కొమ్మ(పత్ని) గా, అనేక జగదాధారి గా, కువలయ నయన గా , విదునిభవదన గా, ఉదారిగా, సదాశివ హిత గా, పరాశక్తిగా, పంచనదనగర నాయికను త్యాగరాజుల వారు ఆవేదనలో ఎంత రమ్యంగా ప్రస్తుతించారో ఆనందంలోనూ అంతే రమ్యంగా ఆమె కొలువును వర్ణించారు. ఇక్కడ చెప్పుకోదగ్గ బాంధవ్యాలు కూడా వినిపిస్తాయి. శ్రీ ధర్మ సంవర్దనీ దేవి అయినా, శ్రీ ప్రవృద్ధ శ్రీమతీ దేవి అయినా పార్వతి అంశాలే. పార్వతిని విష్ణు సోదరిగా చెబుతారు. అంబ నిను నమ్మితినే – అనే సంకీర్తనంలో త్యాగయ్య ‘శంబరవైరి జనక సోదరి’ అని అంబను సంబోధిస్తారు. శంబరుడనే రాక్షసుడి శత్రువు మన్మధుడు. ఆ మన్మధుడి జనకుడు విష్ణువు. ఆ విష్ణువు సోదరి ఈ అంబ. ‘కరుణ జూడవమ్మ కమల వైరి కలాధరుని కొమ్మ’ అనే సంకీర్తనలో ‘శంబరారికి అర్ధ శరీరి’ అని ఉంది. తప్పు దొర్లిందని కొందరు గ్రహించారు, కొందరు ఆగ్రహించారు. శంబర వైరికి అంటే మన్మదుడికి అర్ధ శరీరి అనడం తప్పే. శంబరారి వైరి కర్ధ శరీరి అనడం వాస్తవం. అయితే ఇది తాళభంగం కలిగిస్తుంది. మరో కీర్తనలో ‘రామ సోదరి’ అని అంబను కీర్తిస్తారు. మరో సందర్భంలో ‘మీ అన్న దయకు పాత్రుడనే’ అని పునరుక్తం చేశారు. ఇంకొక కీర్తనలో ‘కామజనకుని సోదరి’ అని అంటారు. కామ= మన్మధుని, కామ జనకుని =మన్మధుని తండ్రి అయిన విష్ణువు యొక్క, కామ జనకుని సోదరి అంటే ఆ విష్ణుసోదరి = శివాని అని అర్థం కదా. త్యాగయ్య ఒక సంకీర్తనంలో వర్ణించినట్టు కమలవైరి కలాధరుని కొమ్మ – అంటే పార్వతియే. కమల వైరి ఎవరు? చంద్రుడు! ఆ చంద్రుడి కళ(సంస్కృతంలో ల ఉంది, ళ లేదు)ను ధరించేది ఎవరు?శివుడు( అందుకే చంద్ర శేఖరుడు)! ఆ శివుని దేవేరి ఎవరు?పార్వతి! (చంద్రుడి సోదరి లక్ష్మీ దేవి. సముద్రుడి సంతానం వీరు. పార్వతీ దేవి ,లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి – ఈ ముగ్గిరి ఏక రూపం శక్తి మాత. సరస్వతీ దేవి బ్రహ్మదేవుని నాలుక మొదలు లో నివసిస్తుందట.) ఆమె శివునిలో అర్ధ భాగం కనుక దేవి పైన చంద్ర కిరణాలు పడి ఆమె తెల్లని కాంతితో ప్రకాశిస్తుంటుంది. అందుకే దేవిని త్యాగయ్య ‘రాకాశశి వదనే’ , ‘రాజధరీ’ అని కీర్తించారు. ఈ నెలరాజును ధరించిన రాజు తన సగభాగమైన శివుడు కనుక అంబ రాజరాజేశ్వరి అయ్యింది. ‘నీవు బ్రోవ వలెనమ్మ నను’ అనే కీర్తనలో రాజరాజేశ్వరి నామం వినిపిస్తుంది. దసరా వేడుకల్లో పది రోజులకి తగ్గట్టు పది అమ్మవారి కీర్తనలు త్యాగయ్య రచించారు. అంబ నిను నమ్మితినంటే (ఆరభి రాగం), కరుణజూడవమ్మ కమలవైరి కలాధరుని కొమ్మ(తోడి రాగం), గతి నీవని నే గోరి వచ్చితి తల్లీ (తోడి రాగం), నీవు బ్రోవవలె నమ్మ నను (సావేరి రాగం), పరాశక్తి మనుప రాదా నాపై పరాకేల నమ్మా(సావేరి రాగం), లలితే శ్రీప్రవృద్దే శ్రీమతి (భైరవి రాగం), విధి శక్రాదులకు దొరకునా ఇటువంటి సన్నిధి (యమునా కళ్యాణి), సుందరి నిన్ను వర్ణింప బ్రహ్మాది సురలకైన తరమా (ఆరభి రాగం), సుందరి నన్నందరిలో జూచి బ్రోవవమ్మ (బేగడ రాగం), సుందరి నీ దివ్య రూపమును జూడ తనకు దొరకెనమ్మా(కళ్యాణి రాగం)- ఇవి నలుగురు చేరి కచేరి పెట్టుకున్నప్పుడు పాడితే సరి. దేవీ ప్రసన్నత సిద్ధించు గాక ! -డా. తాతిరాజు వేణుగోపాల్ , 24 అక్టోబర్ 2012 (విజయ దశమి)
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|