మునుపటి నా మాట
‘నమస్కారం మాస్టారూ ... మీకు తొంభై ఏళ్ళు..’ ‘అవునా బాబూ... భూమ్మీద ఉంటే కదూ .స్వర్గ సీమలో ఈ గంధర్వ లోకంలో వయో పరిమితులు లేకుండా సుఖంగానే ఉన్నాను’ ‘మాస్టారూ.. భూమ్మీద సుఖపడితే తప్పు లేదురా అని మీరన్నారు. అదే.. పాడారు. కానీ మీరు లేక ఈ భూమ్మీద మాకేం సుఖం ఉందనీ? 1944 లో స్వర్గసీమ సినిమాలో తొలిసారిగా నట గాయని, బహుముఖ వరదాయిని భానుమతి గారితో యుగళ గీతం పాడి ..’ ‘అవును అలా సినిమాల్లో గాయకుడిగా అడుగు పెట్టాను. అప్పటికి నా వయసు ఇరవైరెండేళ్ళు’ ‘చిన్నవయసులోనే, సినీసీమలో ప్రవేశిస్తూనే గాయకుడిగా ఉంటూ సంగీతదర్శకత్వ బాధ్యతలూ భుజాన వేసుకోవడం మీ వంటి ప్రజ్ఞావంతులకే సాధ్యం. కాని మా బాధల్లా మీరు అయిదుపదుల వయసు చాలనుకునీ స్వర్గసీమకి వెళ్లిపోవడం’ ‘అంతా ఆ ఏడుకొండలవాడి నిర్ణయం బాబూ..మూడు దశాబ్దాలు అన్ని రకాల పాటలు పాడాను, స్వరాలూ సమకూర్చాను ......అది చాలు బాబూ..’ ‘మల్లాది రామకృష్ణ శాస్త్రి కవి గారు ఏడుకొండలవాడిని తెలుగు వారి ఇలవేల్పుగా కీర్తించారు. మేమంతా ముక్త కంఠంతో మిమ్మల్ని తెలుగువారి గళవేల్పు అని నిత్యం స్మరిస్తున్నాం. మీ అమూల్యమైన పాట సంపద ముందేసుకుని తరిస్తున్నాం’ ‘అంతా ఆ ఏడుకొండలవాడి నిర్ణయం బాబూ..మూడు దశాబ్దాలు అన్ని రకాల పాటలు పాడాను, స్వరాలూ సమకూర్చాను ......అది చాలు బాబూ..’
‘మల్లాది రామకృష్ణ శాస్త్రి కవి గారు ఏడుకొండలవాడిని తెలుగు వారి ఇలవేల్పుగా కీర్తించారు. మేమంతా ముక్త కంఠంతో మిమ్మల్ని తెలుగువారి గళవేల్పు అని నిత్యం స్మరిస్తున్నాం. మీ అమూల్యమైన పాట సంపద ముందేసుకుని తరిస్తున్నాం’ ‘మీ అభిమానధనం నాకు చేరుతూ ఉంటే నేను గొప్పవాణ్ణి అయిపోతున్నట్టు ఉంది’ ‘మీ పేరులోనే వేంకటేశ్వరుడు ఉన్నాడు.. మీ పాటలహుండీ మహిమ అంతటిది’ ‘వెంకటేశ్వరుడంటే నాకెంతో ఇష్టం. తిరుపతిలో ఒక లలిత సంగీత కళాశాల నెలకొల్పాలన్నది నా కల.. కల ఇదనీ నిజమిదనీ తెలియదులే’ ‘అదే తిరుపతిలో అట్టహాసంగా ప్రపంచ తెలుగు మహాసభ జరగ బోతోంది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మీరు కన్న కల నిజం చేస్తే కళ బ్రతుకుతుంది, కళాకారులు బ్రతుకుతారు. అయినా మాస్టారూ... ఇప్పుడు సినీ సంగీతం రూపు రేఖలు ఎంతగా మారిపోయాయంటే లలిత సంగీతం దాఖలు మచ్చుకైనా కానరావు. పాలగుమ్మి విశ్వనాథం గారు కూడా ఇప్పుడు లేరు. ’ ‘లోకో భిన్న రుచి: అన్నారు కదా బాబూ. సంగీత లోకంలోనూ భిన్నరుచులున్నాయి. మార్గ సంగీతం, దేశి సంగీతం అని రెండు భాగాలున్నా దేశి సంగీతంలో జానపద సంగీతంతో పాటు లలిత సంగీతం, సినిమా సంగీతం వచ్చి చేరాయి. ఒకే తోటలో ఎన్నో పూల మొక్కలు, ఎన్నెన్నో పక్షి జాతులుంటేనే తోటకి అందం. ప్రకృతిని వికృతంగా మార్చకపోవడమే భావి తరాలు చూడాల్సిన పని’ ‘నిజమే మాస్టారూ.. పాశ్చాత్య సంగీతం, మన దేశ సంగీతం అనే హద్దులు మీ కాలంలోనే మెల్ల మెల్లగా చెరిపేస్తూ మమేకం చేసినా మెలోడీ ..అదే శ్రావ్యత చెడకుండా చూశారు. ఇప్పుడేమిటో మెలోడీ అంటే గజల్స్ కి మాత్రమే ఒక అలంకారం అన్నట్టు చూస్తున్నారు’ ‘గజల్స్ గుర్తు చేశావు బాబూ.. మా అదృష్టం .. బడే గులాంఆలీ ఖాన్ వంటి మేధావికి మా ఇంట ఆతిధ్యం మా దంపతులం ఇవ్వగలగడం.. ఆయన ద్వారా ఎన్నో తెలుసుకున్నాను. రాగేశ్రీ రాగాభిమానిని నేను. అందులో స్వర పరుస్తూ ఉంటే నాకు తెలుగు వారికి గజల్స్ ఇవ్వగలిగినంత తృప్తి కలిగింది’ ‘అవునండీ ..మీరు రాగేశ్రీ రాగం లో కూర్చిన మంచి మంచి పాటలు కొన్ని ఎంచి మా కృష్ణప్రేమ లో వినిపించాను. మీలో ఉన్న గొప్పతనం శాస్త్రీయ సంగీతం పట్టు తప్పక అలాగని మొత్తం పాటంతా శాస్త్రీయతో నింపేయక లలిత సంగీతం స్థాయిని పెంచి సినిమా పాటకి వన్నె తీసుకు రావడం. మీ కాలంలో ప్రతిభావంతులైన సంగీత దర్శకులు ఎందరో ఉండేవారు. ఒక్కొక్కరిది ఒక్కో బాణీ. వారి స్వర రచనలు పాడుతున్నా మీరు సంగీతం ఇవ్వాల్సివచ్చినప్పుడు మీ బాణీని మీరు చూపేవారు. ముఖ్యంగా ఏదైనా పాటలో ‘హాయ్’ అనే ఒక మాట వినపడితే ఇదిగిదిగో ఇది ఘంటసాల వారి పాట అని తెలిసి పోయేది. హిందీ లో ఓపీ నయ్యరు గారు కూర్చిన బాణీని అనుసరించాల్సి వచ్చినా మీరు మీదైన ‘హాయ్’ ముద్ర వేశారు. ఏ పాటకైనా సన్నివేశం, సందర్భం అనేవి అవగాహన చేసుకొని తగిన భావాన్ని, అనుభూతిని అవలీలగా పలికించేవారు మీరు. డబ్భయిల కాలం ప్రవేశిస్తున్నప్పుడు మీవి ఎక్కువగా విషాద గీతాలు వింటూ ఉండే సరికి మీరు వాటికే పరిమితం అనుకునే అమాయకపు యువకులం అప్పుడు. తరువాత వినగా వినగా, వారూ వీరూ చెప్పగా, వినిపించగా మీరంటే, మీ పాడే తీరంటే విపరీతమైన పిచ్చి ఏర్పడిపోయింది. ఇప్పుడు కంప్యూటర్ యుగం నడుస్తోంది. మునుపటికన్నా మిన్నగా మీ పాటలకి ఆదరణ పెరిగిపోయింది. ఈ ఇరవై ఒకటవ శతాబ్దం తొలినాళ్ళలో గాయకుల్లో మీ పేరు, గాయనిగా స్వర జానకి పేరు ఎంపిక కావడం జరిగింది’ ‘నాకు తెలుగువారి గాయకుడిగా వరమిచ్చాడు ఆ ఏడుకొండలవాడు. నా తొలి గీతం భానుమతమ్మ తో కలసి పాడిన యుగళగీతమైతే జానకమ్మ తొలి తెలుగు గీతం నాతో కలసి పాడిన యుగళ గీతం. అదొక విషాద గీతం. తొలిసారిగా మిత్రుడు తాతినేని చలపతిరావు ఆమెను తమిళంలో పాడించారు. అదీ విషాద గీతమే. అప్పట్లో ఆమె గాత్రాన్ని వరసగా విషాద గీతాలకే పరిమితం చేసేవారు. లీల,సుశీలమ్మలతో పోలిస్తే జానకమ్మతో పాడిన నా యుగళ గీతాల లెక్క చిన్నదే’ ‘అయినా ...మీరు పాడిన ఎన్నో వెంకటేశ్వర గీతాల మధ్య మీ యుగళ గీతం నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగి వచ్చునో పాట కీర్తనలా వ్యాప్తి చెందింది మాస్టారూ. తిరుమల వెంకన్నని తలచుకున్నాం కనుక మరో పాట గురించి చెప్పాలని ఉంది. అది తిరుమల మందిర సుందరా అన్న మీ పాటే. మొదట మీరు సన్నివేశపరంగా సుశీల గారి చేతనే పాడించినా మీకు బాగా నచ్చి వేరుగా పాడి ట్రాక్ తీస్తే ఆ చిత్ర నిర్మాత మీ పాట కూడా రికార్డ్ గా విడుదల చేయించారని విన్నాం. ఆ రికార్డే రాకపోయుంటే మీ గళం కదిపిన అంత మంచి పాటని ఎంత కోల్పోయేవాళ్ళమో కదండీ. ఇప్పటికి తిరుమల షెడ్స్ లో స్వామివారి దర్శనం కోసం కూర్చుని టీవీలు తప్పని సరై చూస్తున్నారేమో కాని పదిమందిలో ఎవరో ఒకరు మీ ఏడుకొండల శ్రీనివాసా మూడు మూర్తుల తిరుమలేశా పాటని ఒకవైపు లోలోపల అనుకుంటూనే ఇంకా ఆగలేక బయటకి పాడకుండా ఉండలేరండీ. ఒక్కోసారి మాకో అనుమానం వస్తుంది. మీరు మాకు దూరమై పోగానే వేంకటేశుడు అన్నమయ్య గారికి ప్రాచుర్యం కల్పించాడేమో అని. మీలో కవి, నటుడు ఉండబట్టీ, మీ కాలం నాటి పెద్దల పట్ల మీకు గౌరవం ఉండబట్టి మీరు ప్రతి సినిమా పాటని సరియైన పద్ధతిలో శ్రోతల దగ్గరికి చేర్చగలిగారు. ఈ వినయం,విధేయత ఇప్పటి తరంలో లోపిస్తోంది. వారికి మార్గ దర్శకత్వం జరుగుతున్నా వేరే రూపంలో జరిగి పోతోంది’ ‘నాకు జగమే మాయ బ్రతుకే మాయ వంటి ఆర్ద్ర గీతాలు పాడవలసి వచ్చినప్పుడు ఏదో లోలోపలి ఆవేదన పొంగి వస్తుంది. నాకు తెలియకుండానే ఆ గీతాల్లో లీనమైపోతాను. అటువంటిదే – మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే. కవి, గాయకుడు, స్వర కర్త –ఈ త్రిమూర్తులది విడరాని అనుబంధం. వీరంతా తెర వెనుక ఉండి ఒక పాట నిలబడేందుకు ఎంత కృషి చేస్తారో అంత కృషి సినిమా తెర మీద నటీనటులు చూపాలి. అప్పుడే ఆ పాట పదికాలాలు దృశ్య రూపంగా, శ్రవ్య రూపంగా మనగలుగుతుంది’ ‘విషయం వచ్చింది కనుక మిమ్మల్ని అడగాలి- మీరు మిమిక్రీ చేస్తారా? మరి అచ్చం ఒక ఎన్టీఆర్ లాగ, ఒక ఏఎన్నార్ లాగ ఎలా పాడేవారు?’ ‘అది మిమిక్రీ కాదు- ఆ మాటకి అర్ధం అనుకరణ. నటుల వాక్ ధోరణి, మాటలో వారిచ్చే విరామం గానీ, వేగం గానీ గమనించి పాడితే చాలు. ఉదాహరణకి- తీయని కలలే ఫలియించెనే అన్నప్పుడు అక్కినేని వారి వాక్ ధోరణి కన్పిస్తుంది. అలాగే పగలంతా నా మదిలో సెగలై రగిలె ... అన్నప్పుడు నందమూరి వారి వాక్ ధోరణి కన్పిస్తుంది. ఇద్దరికీ ఒకేసారి పాడవలసి వచ్చిన సందర్భాలూ ఉండేవి’ ‘అవి చాలు- మీ ఏక గళంలో ద్విగాత్రాభినయానికి ఉదాహరణలు. గుండమ్మ కథలో కోలు కోలో యన్న కోలో నా సామి అనే ఎన్టీఆర్ వారి పాట మధ్యలో ఏఎన్నార్ వారి ఆలాపన, భూకైలాస్ లో దేవదేవ ధవళాచల మందిర గంగాధర నమో నమో పాట పల్లవిలో ప్రతి అక్షరం ఒద్దికగా గుమికూడి ఉన్నట్టు పలికి మీరు ఇది ఎన్టీఆర్ వెర్షన్ అని, నారాయణ హరి నమోనమో అన్నప్పుడు అక్షారాలని విశాలం చేసి పలికి ఇది ఏఎన్నార్ వెర్షన్ అని మాకు మెళకువలు నేర్పారు. ధన్యులం. అలాగే లవకుశ చిత్రంలో ఏ నిమిషానికి ఏమి జరుగునో పాటలో కాంతారావుగారిని, స్త్రీ బాల వృద్ధుల తెగవేయ బూనుట... అనే పద్యాలప్పుడు ఎన్టీఆర్ గారిని, సందేహించకుమమ్మా పాటలో పెద్దలు నాగయ్య గారిని, ఒల్లనోరిమామా నీ పిల్లని పాటలో హాస్యనటుడు రేలంగి వారిని ....ఇలా ఒకే సినిమాలో నటించిన ఎందరికో ఒకే గొంతు నుంచి వైవిధ్యం తీసుకు రావడం సినీ చరిత్రకే గర్వ కారణం. పద్యాలకు కొత్త ప్రాణ మిచ్చిన దైవ వైద్యులు మీరు. వత్తులు పలకలేక, ఉత్తుత్తి మాటల కలగలుపుతో పాట మనుగడ సాగుతున్న ఈ తరంలో పద్యాలు అంటే పురాతన వస్తుసంపద అని అర్ధం. మిమ్మల్ని స్పూర్తిగా తీసుకునీ సాధన చేస్తే పద్యాలు మళ్ళీమళ్ళీ పాడే అవకాశముంది నేటి యువతకి. మీరొక సిలబస్ అని అన్నవాళ్ళే అసలు పద్యాలు సిలబస్ లో ఉంచారా అని మా అనుమానం. బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాటకి మీరు..’ ‘నాయనా పొగడ్తలు సరే.. తెగడ్తలు కూడా ఉండాలి. లేకపోతె కవి గానీ, గాయనీ గాయకులూ గానీ, స్వర కర్తలు గానీ అహంభావులైపోయే ప్రమాదం ఉంది. ఏ గాయకుడైనా గాయని అయినా మానవ మాత్రులే. తప్పులు తెలిసో తెలియకో దొర్లిపోతుంటాయి.కొందరివి ఉచ్చారణ దోషాలు, మరి కొందరివి అనవసర వేషాలు. శ, ష, స ల విషయంలో తెలుగు వారికెప్పుడూ సందేహమే. పద జ్ఞానం ఉంటే అక్షర ఉచ్చారణ అందులోనే కలిసి బయట పడుతుంది. దానికోసం ఆ అక్షరాన్ని వేరుగా పలక నక్కరలేదు. స –సరే. ష –షరా మామూలే. ఎటొచ్చీ శ-కారం శ్శ గా పలికితే చాలు. శంకరా బదులు షంకరా అని పలకడం తెలుగుతనం కాదు. కొంతమంది ఇప్పుడే తెలుసుకున్నట్టు ఇది వరకు శ-గ పలికినా ఇప్పుడు ష-గా పలుకుతున్నారని తెలిసింది. గంధర్వులు గుసగుసలాడుతున్నారు’ ‘గుసగుసలు అంటే మీరు స్వర పరిచిన ఊహలు గుసగుసలాడే పాట గుర్తొచ్చింది మాస్టారూ. ఆ పాటని ఏ రాగంలో స్వర పరిచారో మీరు చెప్పలేదు. మరో తరం అడిగే లోగా మీరు వెళ్ళిపోయారు. కొంత మంది వారి వారి మేధో మధనంతో అంతగా తెలియని ఒక రాగం పేరు - సుమనేశ రంజని-ని సూచించారు. నన్నడిగితే హాయిగా ఆ రాగం పేరు ఘంటసాల అని అంటాను. అయినా నా గోడు ఎవరికి చేరాలి కనుక? పిల్లకాకివి పోవోయ్ అంటారు. ఈ రాగంలో సినీగీతాలు అట్టే రాలేదు. మీ శిష్యుడు రాఘవులు ఒకసారి ప్రయత్నించారు. బహుశా వగలరాణివి నీవే అనే సోలో పాట శివరంజని కాగా ఈ యుగళ గీతం విష్ణువుకి ప్రియం కావాలని సుమనేశ రంజని అని అన్నారేమో’ ‘నాకు చేదోడు వాదోడుగా స- సంగీత రావు, రి- రాఘవులు ఉండేవారు. అలాగే మ- మల్లిక్ . నా పాట నా నోట పలికినా నా వెంట వారి ప్రమేయం కూడా నడిచింది. అదే పనిగా ప్రతి పాటకి ఈ రాగం,ఆ రాగం కట్టాను అని ఏ స్వర కర్తా చెప్పడు. ఒక్క త్యాగరాజ స్వామి కీర్తనలే ఆయన నిర్దేశించిన రాగాల లోనే పాడే ఆచారానికి తమిళనాడు నాంది పలికితే అంతా అలాగే ఆచరిస్తున్నారు,ఆదరిస్తున్నారు. ఇపుడేమైనా సడలిస్తున్నారేమో.. అలా చెయ్యకండి. అవి భగవత్కృపకి నోచుకున్నవి కదా. సినిమా పాటకి నలభైల్లో కన్నా యాభైలు, అరవైల్లో బాగా స్వేఛ్చ వచ్చింది. కర్నాటకమా, హిందూస్థానియా ఏ రకం సంగీతం అవసరమన్నది ఆ సన్నివేశం బట్టి ఉంటుంది. ఒక్కోసారి కొన్ని సాహసాలు చెయ్యాలనిపించేది. అలా చేసిన సాహసమే- వగలరాణివి నీవే అనే హుషారైన పాటని శివరంజని రాగంలో స్వర పరచడం’ ‘పెండ్యాల వారు పాడవోయి భారతీయుడా పాటని మోహన,శివరంజని రాగాల్లో కూర్చారు. కాని అంతకు ముందే మీరు కీలుగుఱ్ఱం చిత్రంలో తెలియవశమా పలుకగలమా పాటని శివరంజని,మోహన రాగాల్లో కూర్చారు మాస్టారూ’ ‘నా తొలి చిత్రాల్లో మా గురువులు సుబ్బరామన్ గారి స్వర విధాన ప్రభావం మా మీద ఉండేది బాబూ. ఆయన సినీ పరిశ్రమ పోగుట్టుకున్న దైవాంశం నాయనా’ ‘ఎమ్మెస్ విశ్వనాథన్ వంటి సంగీత మేధావులకి కూడా ఆయనే గురువులు కదండీ’ ‘దేవదాసు చిత్రం నాటికి గురువులు కాలం చేశారు. అప్పుడు మా విశ్వం, రామ్మూర్తి కొన్ని పాటలు చేశారు’ ‘మాయాబజార్ చిత్రం కోసం కొన్ని పాటలు చేసి రాజేశ్వరరావు గారు తప్పుకున్నారని అంటారు..మరి’ ‘ఎవరివి ఏ పాటలో అన్నదే నీ సందేహం కదూ బాబూ .. ఎవరి బాణీ ఎటువంటిదో తెలిసేవారికి అదంత కష్టం కాదు. అయినా ఆ రోజుల్లో మా మధ్య పొరపొచ్చాలుండేవి కావు. వారూవీరూ చేరి గుసగుసలాడుకోవడం అన్ని రంగాల్లో ఉన్న దుర్గుణం. దానికి మందు లేదు. గుసగుసలు మళ్ళీ గుర్తు చేస్తున్నాయ్ పాటల్లో తప్పుల తడకలు..’ ‘సారీ అండీ.. మాకెందుకో మీ గానం వింటూ తప్పులెంచకూడదనే అనిపిస్తుంది’ ‘అభిమానం అటువంటిది నాయనా. పాటలో తప్పు దొర్లిపోతే అది అలాగే నిలిచిపోయే విధానం నాటిది. ఒకసారి రికార్డ్ అయిపోతే ఇక అంతే. పద్యాలు, శ్లోకాలు పాడేటప్పుడు తాళభంగం రానీయకుండా సంధి విడగొట్టి పాడాల్సి వస్తుంది. ఉదాహరణకి అగజానన అనేది అగజా ఆననగా నేను పాడాను’ ‘ఈ శ్లోకం విషయంలో భరాగో (భమిడిపాటి రామగోపాలం) మాస్టారు మీరు తప్పు పాడారని చెప్పేవారు. అనేకదంతం అని రికార్డు కావడం అదే అప్పటి వర్ధమాన గాయనీ గాయకులు అనుసరించడం ఆయనకి నచ్చలేదు’ ‘నేను తప్పో ఒప్పో చెప్పను కానీ ఒక వివరణ ఇచ్చుకుంటాను... ఓ సారి ఆ శ్లోకం వినిపించు... చూశావా.. అనేకదమ్, తమ్ అని అనాలి. నేను స్వల్ప విరామం రెంటి మధ్యా ఇచ్చినా అనేక దమ్ అని మకారంతం ఇవ్వక అనేక దన్ అని నకారాంతం ఇచ్చాను.తరువాత తమ్ అనే అన్నాను. దీనివల్ల అది అనేకదంతం అన్నట్టు వినిపిస్తుంది తప్పు పాడారు ఘంటసాల గారు అని భరాగో వారు అన్నారే కానీ ఇలాంటి వివరణ ఇవ్వలేదనుకుంటాను. సవరణ,వివరణ రెండూ ఇస్తూ మార్గ దర్శకులు కావాలి విమర్శకులు' ‘మహాకవి శ్రీశ్రీ గారు పాడవోయి భారతీయుడా ..పాటలో ప్రతి మనిషి మరియొకని దోచుకొనేవాడే అని రాశారు కదా. అంటే ఏక వచనం ప్రయోగించారు. మీరూ సుశీలమ్మ గారూ పాడిన పాట ఇది. తరువాత మీరు పాడిన శ్రీశ్రీ గారి తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా పాటకి తొలిసారిగా జాతీయ బహుమతి దక్కింది. అయితే ఆ పాటలో ప్రతి మనిషి ....సింహాలై గర్జించాలి అనే ఏకవచన, బహువచన కలగలుపు పొరపాటున జరిగి పోయింది అని పాపం ఆయన వినమ్రంగా చెప్పడమే కాక తన ప్రచురణలో సింహంలా గర్జించాలి అని సవరించారు. అయితే మీరన్నట్టు రికార్డ్ అయిపోయినది దిద్దటం కుదరని పని’ ‘అలా అన్నారా మహాకవి? ఇంకో విషయం చెప్పనా? నేను ఆత్మ గౌరవం సినిమాలో అనుకుంటాను ప్రేమించి పెళ్లి చేసుకో అనే పాట పాడాను..’ ‘అవునండీ.. ఆత్మగౌరం సినిమాలోనిదే.. ఆరుద్ర గారు రాశారా పాట.. పల్లవికి ముందు సాకీ ఉందండి’ ‘ఏదీ ఆ సాకీ అను బాబూ..’ ‘ఓ సోదర సోదరీ మణులారా ..ఆదరించి నా మాట వింటారా..’ ‘అవునా? బహువచనమే కదా.. మరి పల్లవి ఏమిటీ..’ ‘ఏకవచనం..’ ‘ఇలాంటివి సహజం. నేను నవ్వని పువ్వే నవ్వింది అని ఒక యుగళ గీతం సుశీలమ్మతో పాడాను. నటసార్వ భౌముడు ఎస్వీఆర్ ...’ ‘ అవును మాస్టారూ.. ఆయన తీసిన చదరంగం సినిమాలోదండీ ఆ పాట’ ‘అందులోనూ ఒక చోట కమ్మని అనే మాట బదులు కర్మని అని రికార్డ్ అయిందంటారు. విని చెప్పు..’ ‘తప్పుల సంగతి మమ్మల్ని నొప్పిస్తోంది మాస్టారూ.. కాసేపు మరచి పోదాం. మీ గాత్రంలో ఉండే అక్షర క్రమశిక్షణ మాకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు తరచూ మీ స్వర సంవిధానం ప్రస్తావిస్తూ మల్లియలారా మాలికలారా పాట వినిపిస్తూ ఉంటారు. మీ గళంలో భావ ప్రకటన అనితర సాధ్యం. మీరు పాడితే తెలుగు భాషలోని అందం, సౌకుమార్యం అర్ధమయ్యి తెలుగు పట్ల గౌరవం కలుగుతుంది. ఆంధ్ర దేశం లోనే కాదు ప్రపంచ దేశాల్లో తెలుగు వారే కాదు, ఇతర భాషల వాళ్ళూ చెప్పే మాట ఇది’ ‘సరస్వతీ మాత పలుకు అనే వరం మనకిచ్చినప్పుడు ఆ దేవిని బాధ పెట్టకూడదు. నా ఆఖరి శ్వాస వరకు నేను కట్టుబడి ఉన్నాను’ ‘అందుకే .. ఇప్పటి యువ గాయకులు, పిల్లలు మిమ్మల్నే ఒక సిలబస్ గా ఎంచుకొనీ మీరు పాడిన పాటలు సాధన చేస్తుంటారు, ఇంకా చెయ్యని వారు చెయ్యాలని విన్నవించుకుంటాను’ ‘నీది మరీ పెద్ద కోర్కె బాబూ. ఏదో విన్నవించుకోనా చిన్న కోరిక అని పాడాను గతంలో. అంతే. నా పాటలో నా పాత్ర ఆ మాత్రం ఉందంటే అదంతా- సముద్రాల రాఘవాచార్యుల వారూ, పద్మనాభ శాస్త్రి, గాలి పెంచలనరసింహారావు, భీమవరపు నరసింహారావు, ఓగిరాల రామచంద్రరావు, సాలూరు రాజేశ్వరరావు, ఆయన సోదరుడు హనుమంతరావు, గోపాలం, మా గురువులు నాగయ్య, బాలాంత్రపు రజనీ, వేణు, సుసర్ల వారు, సుబ్బరామన్ గారు, పెండ్యాల నాగేశ్వరరావు, ఆదినారాయణ రావు, అశ్వత్థామ, టి.వి .రాజు, విశ్వనాథన్, రామ్మూర్తి, స్నేహితుడు చలపతిరావు, మామ మహదేవన్, కోదండపాణి, రమేష్ నాయుడు, గురజాడ వెంకటేష్, రాజన్ నాగేంద్ర సోదరులు, సత్యం,చక్రవర్తి వీరితో పాటు నాకు తొలి సినిమా పాట పాడే అదృష్టం కల్పించిన భానుమతి గారు, మాన్యులు బి.ఎన్ రెడ్డి గారు ... ఇంత మంది చలవే’ ‘ఇంతమంది సంగీత విద్వాంసుల పేర్లు చెప్పారు.. అందులో మీరు ఉన్నారు. మీ పేరు మీరు చెప్పరు, అన్నమయ్య కీర్తనలో లాగ’ ‘మా కాలానికి అన్నమయ్య అంతంత మాత్రమే తెలుసు... ఇప్పుడు ఆ మహానుభావుడు తెలుగిళ్ళలో పద సంకీర్తనలు వినిపిస్తూ ఏడుకొండలవాడిని మరింత దగ్గరగా తీసుకొచ్చాడు’ ‘మా దృష్టిలో అటువంటి ఉత్తమ వాగ్గేయ కారుల జన్మ మీది’ ‘జన్మల మీద మనసు పడి మనసు కవి ఆత్రేయ ఎప్పుడు వీలు దొరికినా ఏదో చెప్పడానికి ప్రయత్నించారు .. మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమౌతాయో ... అని నా చేత పాడించారు’ ‘అవును.. ఆ ప్రేమ నగరుకే పోతాను పోతాను ...అని మీరు ఆరుద్ర గారి పాట పాడి, తరువాత నిజంగానే ప్రేమ నగర్ సినిమా వస్తే అందులో మనసు గతి ఇంతే అనే ఆత్రేయ గారి పాట పాడి కొద్దికాలం లోనే కానరాని లోకాలకి వెళ్ళి పోయారు. ఆత్రేయ గారు మీరు లేని కాలంలో కోరికే ఒక జన్మ కావాలని, అది తీరకే మరు జన్మ రావాలని .. చిన్న చిన్న అక్షరాలతో ఎంత పెద్ద సత్యాన్ని చాటి చెప్పారూ... మీరు మళ్ళీ పుట్టాలి మాస్టారు..అదే ఆంధ్రుల చిరకాల కోరిక’ ‘పునర్జన్మ? ... ఆ సినిమాలో మా చలపతిరావు మా బాగా స్వర పరిచాడు. అంతా విప్లవకవి అనే శ్రీశ్రీ గారు చక్కటి భావ గీతం రాశారు...నా పాటలు పదికాలాలు వినిపిస్తూ ఉంటే అదే నాకు పది జన్మల భాగ్యం బాబూ’ ‘మీ కాలంలో అడుగు పెట్టినా మీతో పాడలేక పోవడం గాయని వాణీ జయరాం గారిని , మీ కాలంలో తాను కవి కాకపోవడం వేటూరి సుందరరామమూర్తి గారిని , మీ కాలంలో తానుండి జి.కె.వెంకటేష్ గారి దగ్గర ఉండి ఆయనకి సాయపడుతూ మీ పాట విన్నా తాను సంగీత దర్శకుడయ్యే సమయానికి తన స్వరాల్ని మీరు పాడాలని కాంక్షిస్తే మీరు భౌతికంగా లేకపోవడం ఇళయ రాజా గారిని ఎప్పుడూ బాధ కలిగిస్తూ ఉంటుంది. శ్రీరామరాజ్యం సినిమాకి స్వరాలు కూరుస్తూ ఇళయరాజా వారు ఒక్కసారి కళ్ళు మూసుకునీ మిమ్మల్ని తలచుకున్నారట. నాటి లవకుశ కి నేటి రూపం శ్రీరామరాజ్యం. మన బాపు గారు దర్శకులు’ ‘రమణ ఇక్కడే ఉన్నారు.. శ్రీరామ రాజ్యం సినిమా తీసే లోగా తొందరపడిపోయి ఈయన ఇటు వచ్చేశారట. స్వర్గంలోనూ ఈ రమణ హాస్య విరమణ చెయ్యరే ...ఈయనకి తన మిత్రుడు బాపు మీద భరోసా ఉంది’ ‘బాపు గారికి పద్మ బిరుదు ఇవ్వాలని ఇప్పుడే ప్రభుత్వానికి తోచిందని పేపరు వార్త మాస్టారూ..’ ‘తెలుగు లిపికి దక్క వలసిన గౌరవమది. అలాగే తెలుగు భాషకి, తెలుగు తనానికి ప్రాణం పోసిన మా గురువులు మల్లాది రామకృష్ణశాస్త్రి గారిని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆయన ముగురమ్మల మీద అద్భుతంగా రాసి రాగాలు నిర్దేశిస్తే రహస్యం సినిమాలో లలితభావ నిలయా ..పాటని అలాగే స్వర పరిచాను. అలాగే కూచిపూడి నృత్య గీతం..గిరిజా కళ్యాణం కూడా’ ‘ఒక లవకుశ, ఒక రహస్యం లోని మీ స్వర రచనలు సాధన చేస్తే చాలు ముప్ఫయి రోజుల్లో తెలుగు వంటి పుస్తకంలాగ సంగీతం కరతలామలాకం అవుతుంది’ ‘నేను గాయకుడిగా తొంభయి శాతం మంచి పాటలు, పదిశాతం ఓ మోస్తరు పాటల పాడి ఉంటాను కదూ.. ఆ పదిశాతం మరిచిపోండి’ ‘అయ్యాయ్యో .. ఇప్పటి పాటల ముందు ఆ పదిశాతం కూడా మరచి పోలేనివే. మీరు నూటికి నూరు పాళ్ళు సినీ సంగీతానికి న్యాయం చేకూర్చారు. సంగీత దర్శకుడిగా మీరు ఎన్నో రాగాల్లో అద్భుతంగా స్వరపరిచారు. మీకున్న ఆ సంగీత జ్ఞానాన్ని నా మిడిమిడి జ్ఞానంతోనూ, విడి విడి జ్ఞానం తోనూ ..అంటే...విడి విడిగా ఆ నోటా ఈ నోటా విన్నదీ, అక్కడా ఇక్కడా చదివింది మా కృష్ణప్రేమ చదువరులకి వినిపించే ప్రయత్నం చేస్తాను. అదే మేం మీ కిచ్చే నివాళి. మీ పాటల్ని మళ్ళీ మళ్ళీ వినమని కోరుతాను వర్ధమాన గాయనీ గాయకుల్ని. తలనిండ పూదండ దాల్చిన రాణి ..అన్న దాశరధి గారి లలితగీతం పల్లవిలో దీర్ఘాక్షరాల మీద మీరు కల్పించిన తాళ సౌందర్యం అనితరసాధ్యం మాస్టారూ. ఇదే తాళ సౌందర్యం మీరు నారాయణ రెడ్డి గారి సినీరచన మనసు పాడింది సన్నాయి పాట.. పల్లవిలోనూ చూపించారు. ఇద్దరు శాస్త్రుల ..అంటే దేవులపల్లి వారూ, మల్లాది వారూ ..వారి దృశ్య రచనలైన బొమ్మల పెళ్లి (కన్యాశుల్కం), గిరిజా కళ్యాణం లకి మీరు రాగమాలికలల్లారు. వదినగారిని నిష్కారణంగా అడవులపాలు చెయ్యాల్సి రావడాన్ని భరించలేక లక్ష్మణుడు ఎన్నో రకాలుగా కుమిలి పోవడం మీరు లవకుశలో ఏ నిమిషానికి ఏమి జరుగునో పాటలో విభిన్న రాగాలతో వ్యక్తం చేశారు. అలాగే విజయం మనదే సినిమాలో చెల్లెలు పెళ్లి కూతురు అవుతుంటే సంతోషం ఒక పక్క, అయ్యయ్యో మెట్టినింటికి వెళ్ళిపోతుందే అనే బరువైన బాధ ఒక పక్క ఒకే గళంలో రెండు రసాలు ఎంత హృద్యంగా పండించారూ... ఇవన్నీ ఈ తరం గాయనీ గాయకులు పరిశీలించాలి, పరిపక్వత లేకుండా ఏదో పాడేయడం లాంటి నిర్లక్ష్య వైఖరి మానాలి’ ‘ఒక్కోసారి అంత ఆర్ద్రత అదీ వద్దనే నిర్మాతలూ ఉండేవారు బాబూ. గాయకులు కేవలం నేపధ్యం కూర్చుతారు. ఇక గొంతు కదలికలు అవీ సరిగా పాటించి చూపడం నటుల పని. మల్లీశ్వరి సినిమాలో రామారావు గారు లోలోపల నాలా పాడుతూ నటించారు. చూడండి ఆయన గళసీమ ఎంత చక్కగా కదిలిందో. మల్లీశ్వరి అనగానే గుర్తొచ్చింది - సంగీతంలో హ్రస్వాలు దీర్ఘాలు కావడం సహజం. కోతీబావకు పెళ్ళంట ..అని రాస్తూ శాస్త్రిగారు తి-దీర్ఘం ఇచ్చారా, రాజేశ్వరరావు దీర్ఘమిచ్చి స్వర పరిచారా అనే మీమాంస పక్కన పెట్టాలి. ఇంకా నయం మా మల్లాది కవిగారు చిటి,పొటి అనే హ్రస్వాలు ప్రయోగించేవారు తన పాటల్లో. అవి అలాగే ఉంచాలని ఆయనకి అనిపించేది. వేణు గారు చిట్టీ పొట్టీ పాపలు అని ఒక పాట చేశారు. దీర్ఘాలున్నాయి కదా’ ‘మంచిని మరచీ వంచన నేర్చీ ...అని మీరు దీర్ఘాలతో ప్రారంభిస్తూ వెంటనే మంచిని మరచి వంచన నేర్చి అని హ్రస్వాలతో పల్లవి పాడారు. అదీ విశేషమే కదండీ మాస్టారూ’ ‘అది కోదండపాణి గారి ప్రజ్ఞ. సంగీత దర్శకుడు, గాయకుడు రచయిత మలచి ఇచ్చిన పాట రూపానికి రెండు కళ్ళు బాబూ. వీరుభయులు అనుకున్న ఎఫ్ఫెక్ట్ సాధిస్తే కవి కూడా గుర్తుండిపోతాడు. ఒక్కోసారి కవి ఎంత బాగా రాసినా సరియైన స్వరం కూర్చకనో, సరిగా పాడలేకనో ఆ పాట మరుగున పడిపోతుంటుంది’ ‘అలాగే ఇదే పాటలో మీరు పాతాళానికి జారాడు ...అని పాడి నప్పుడు ఒక్కక్క మెట్టు నుంచి జారుతున్న అనుభవాన్ని కళ్ళకు కట్టి చూపించారు. బొమ్మను చేసి ప్రాణము పోసి ..పాటలో పాతాళ లోకాన త్రోసేవులే ...అని మీరు పాడితే నిజంగా ఎవరో ఒకే ఉదటున తోసేస్తే అథోలోకాన పడిపోయిన అనుభూతి కలిగి భయమేసింది. ఇంతగా మీలా భావ వ్యక్తీకరణ అందరికీ సాధ్యం కాలేదు మాస్టారూ’ ‘మీరంతా నా పాటలతో ఎన్నో నేర్చుకుంటే మాస్టారు అని నన్నందుకు గర్వపడతాను’ ‘తారలలో ధృవతారగా మిమ్మల్ని ఎంచుకోవడం కూడా మా’స్టారు’ అని మిమ్మల్ని పిలవడానికి కారణం. మీ తరువాత గాయకుడిగా అంత పేరు తెచ్చుకున్న వారు బాలు గారు. తెలుగు అనే కాదు అన్ని భాషల మాధుర్యాన్ని ఆయన సమతుల్యంగా ఆస్వాదిస్తూ ఎదిగారు. తగినట్టే మీ కాలం నాటి సంగీత దర్శకులు వారున్నంత కాలం ఆయనకి పాట మెళకువలు నేర్పారు. మీరు రాగమాలికలో రామకథా గానం (వాల్మీకి సినిమాలో) చేస్తే కోదండపాణి గారు తానూ రాగమాలికలో సముద్రాల రాఘవాచార్యుల వారి ఆఖరి రచనైన రామకథని బాలు గారి చేత గానం చేయించారు (శ్రీరామ కథలో). మీకు తెలిసే ఉంటుంది. అలా తీర్చి దిద్దే వ్యక్తులు ఇప్పుడు లేరని చెప్పను కానీ ఉన్నా ఏదో నిర్లిప్తత ఆవరించి పోయింది వారిలో. ఎవర్ని ఏమంటే ఏం కొంపలంటుకుంటాయో అని కవి, గాయకుడు, స్వరకర్త అంతా మూగబోతున్నారు’ ‘అప్పుడైనా ఇప్పుడైనా సినిమాని ఒక వ్యాపార ప్రక్రియగా కాకుండా పరిశ్రమగా చూడాలి. ప్రతి ఒక్కరి శ్రమకి విలువ ఇవ్వాలి. మీకు టెక్నాలజీ మరీ ఎక్కువగా వచ్చి చేరింది. కీబోర్డుతోనే పని అయిపోతోంది. కీబోర్డు సంగతి తెలుసా- విజయా సంస్థ వారు షావుకారు సినిమా కోసం ఆ కాలంలోనే నూతనమనదగ్గ క్లే వయోలిన్ తెచ్చి పెట్టారు’ ‘షావుకారు సినిమాలో మీరు స్వర పరచి పాడిన పలుకరాదటే చిలకా, ఏమననే చిన్నారి ఏమననే ...పాటలు విని ఇప్పటి తరం వాళ్ళూ ఔరా అని ఆశ్చర్య పోతున్నారు మాస్టారూ. మాస్టారూ ..ఒకటి మాత్రం నిజం.. తెలుగు సినీ సంగీతం లో రెండు యుగాలు వచ్చాయి- ఒకటి ఘంటసాల యుగం (మూడు దశాబ్దాలు), మరొకటి బాలు యుగం (నాలుగు దశాబ్దాలు). మరో యాభై ఏళ్ళ కాలం అలా ఎవరి ముద్రా లేకుండా గడిచిపోతుందో ఏమిటో? అంగారక గ్రహం మీద మరో ఇరవై ఏళ్లలో ఎనభై వేల మంది వాసం ఏర్పరచుకోవడానికి అనువుగా ఉందని అంటున్నారు. చంద్రుడి మీద నీరుందని తేల్చారు. గాడ్ పార్టికల్ అనేది ఉందని ఒప్పుకున్నారు. ఇంత చేస్తున్న వారు గంధర్వలోకం జాడలు వెతకరేం? మీలాంటి మేధావి కళాకారుల్ని మాకు తిరిగి చూపరేం? మిమ్మల్ని శిలా విగ్రహాలుగా చూసుకోవడమే మా వంతా? అవీ ఏ దుర్మార్కపు దాడులకో బలి కాబోయే రోజులొచ్చాయి. మార్స్ శిలలు, చంద్ర శిలలు, ఎక్కడ వెతికినా దక్కేవి శిలలే... కొన్నాళ్ళకి మహానుభావుల శిలా విగ్రహాలకి రక్ష నిచ్చేవి ఈ కుజ చంద్ర గ్రహాలేనేమో! బహుదూరపు బాటసారీ ఇటు రావోయ్ ఒక్కసారి ....ఇది మీరు పాడిన లలిత గీతం. మీకోసం మా దారులన్నీ తెరచుకొనే ఉన్నాయి. మీ పాటల పుష్పాలు దారంతా పరచుకొనే ఉన్నాయి. ఎటొచ్చీ మీరే తిరిగి రావడం లేదు. మాస్టారూ..మాస్టారూ ...ఇంతసేపూ నాకు జ్ఞానం ప్రసాదించి అదేమిటీ శిలై పోయారూ ...మాట్లాడండి ప్లీజ్...జగదేకవీరుని కథలో మీ పాటకి శిలనుంచి ముని బయట పడ్డాడు. మీలా పాడలేక పోతున్నాం. మిమ్మల్ని శిల నుంచి తప్పించలేక పోతున్నాం. గంధర్వులెంత పని చేశారూ...వదలండర్రా మా మంచి మాస్టారు గారిని.. అలా కళ్ళు మూసుకుంటారేం? కళ్ళు తెరుస్తారా లేదా(?) కళ్ళు తెరిపిస్తారా?’ -కళ్ళు తెరుచుకున్నాయి. అంటే ఇంత సేపూ మాస్టారి శిలా విగ్రహం వైపు చూస్తూ కలగంటూ ముచ్చటించానా?.....డిసెంబర్ నాలుగున ఘంటసాల మాస్టారు గారి జయంతి అని నా మనసులో ఉన్నది బయట పెట్టుకున్ననా? మాస్టారు లేరు.. ఆయన పాట కి పుట్టిన రోజే కాని అనకూడని మరొక రోజు లేదు... కవిగా ఆత్రేయ అనే ఆయన ఉండగా గాయకుడిగా మన ఘంటసాల ‘గాత్రేయ’ కారా? పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు..ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు. మనమున్నాం- ఏం లాభం?తీపి కోటింగ్ తొడిగిన చేదు మాత్రలా..అలా ఉండి మన ప్రయోజనం మనం మరచిపోతున్నాం – తెలుగు పాటకి పట్టిన రుగ్మతకి మనమే ఔషధం అన్న సంగతి! (కనులు చూసినా పాటే- కనులు మూసినా పాటే--అంతటా సంగీత దర్శకుడిగా ఘంటసాల మాష్టారు గారిని స్మరించుకుందాం. ఘంటసాల యుగంలో సినీ సంగీతం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేది కాబట్టి మూడు వీడియో పాటలు, ఆరు ఆడియో పాటలు ప్రతి పదవ రోజున కృష్ణప్రేమలో దర్శనమిస్తాయి. అదేం? ప్రతి పదో రోజునేం? డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఎన్ని రోజులంటే 70 అని చెబుతాం కదా. డిసెంబర్ 4 కి ఒక రోజు ముందు, ఫిబ్రవరి 11 తరువాత ఒక రోజు అదనంగా చేర్చితే 72 రోజులౌతాయి కదా. అవి 72 మేళ కర్తలు అనుకుంటే ఘంటసాల వారు అనే గాన గంధర్వుడికి నివాళిగా ఆయన స్వర పరచిన పాటలు కొన్ని తొమ్మిదేసి రోజులకోసారి ఇవ్వడం ఒక మేలు క్రియ! అలా అష్ట దిక్కులా వినిపిస్తుంది ఆయన గాత్రం! పైగా ప్రతి రాశిలో తొమ్మిది నక్షత్ర(స్టార్) పాదాలుంటాయి. ఆయన్ని మా’స్టార్’ అని సినీ పరిశ్రమ ఊరికే అనలేదు, చూశారా? ఇన్నిరాశుల యునికి – అని అమ్మ పద్మావతిని కీర్తించాడు అన్నమయ్య. ఆ మాటే తగును మన గాత్రేయ అనదగ్గ పద్మశ్రీ వెంకటేశ్వరరావుకి (పదివేల పాట రాశుల యునికి కనుక!) -డా. తాతిరాజు వేణుగోపాల్, 04 డిసెంబర్ 2012
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|