మునుపటి నా మాట
శ్రీవేంకటరమణ – ఏడుకొండల సాక్షిగా ఏడక్షారాల ఆంధ్ర దేవుడు, తెలుగువారి ఇలవేల్పు. వెంకటేశ్వరరావు – కూడా అంతే..అదే ఏడక్షారాల ఆంధ్రుడు, తెలుగువారికి మరో రకంగా వేలుపు. అలా చెప్పే కన్నా ‘పద్మశ్రీ ఘంటసాల’ అని మార్చితే, అవీ ఏడక్షారాలై ఒద్దికగా ఉండి, బొద్దుగా ఉండి ఏడు స్వరాల రూపం దాల్చి ‘తెలుగువారి గళవేల్పు’ రూపంగా పరిచయమైపోవూ? అంతా ఆ ఏడుకొండలవాడి లీల అని అనుకుంటే లీల అనే మలయాళం మాతృభాషైన గాయని ఎంచక్కా తెలుగు వారికి తన సుస్పష్ట నవ్య దివ్య గాత్ర ‘సుమ’ పరీమళం అందించారూ.. అలా ఆమెను పరిచయం చేసినది ఘంటసాల వేంకటేశ్వరుడే! (సావిత్రి నటనకి జానకి స్వరాలా అని సంశయించే వారికి ‘తనకన్నా జానకి బాగా పాడుతుంది ఇలాంటి స్వర రచన’ అని ‘నీ లీల పాడెద దేవా’ పాటని జానకికి అందేలా చేసిన లీల గొప్పతనం సంగీత ప్రపంచానికి ఒక ధర్మ ప్రవచనం. కాకతాళీయంగా ప్రాసకవి ఆరుద్ర రాసిన ఆ పాటలో ‘లీల’గా పదం పడడం ఏడుకొండలవాడి లీల! ఆ పాట జానకి సంగీత గగనంలో వెన్నెలలు తీసుకొచ్చింది. అసలు వెన్నెల మహిమలు ‘లీల’గా తెలియడం అన్నది పింగళి వారి లీల. సావిత్రికి లీల నేపధ్యమే సరి తూగేది అని నిర్ధారించుకున్న రోజులవి కనుక చిత్రంలో నటించబోయి తప్పుకుని ‘మిస్సమ్మ’ అయిపోయారు భానుమతి . ఏమిటో ఈ మాయ.. అంతా నాగిచక్రనాగేంద్ర మాయ!) అప్పట్లో తెలుగు సినిమాలు పెళ్లి చేసి చూడు, పెళ్లినాటి ప్రమాణాలు, పెళ్లి సందడి అంటూ ఒకటే పెళ్లి హడావుడి చేసేవి. ఒక సినిమా అంతా రావణ మయమే అయినా అందులోని ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ అనే ఒకే ఒక్క పాట తెలుగు పెళ్ళివారి జాతీయ గీతమైపోయింది. ఆ స్వరకర్త గాలి పెంచల నరసింహారావు. అది ఆయన ఆఖరి చిత్రం. గాలి-ఇంటి పేరు, గాలిపెంచల కాదు. పెంచల నరసింహుడి పేరది. పెను అచలము అంటే పెద్దకొండ. ఆయన చలవ వల్ల సినీ సంగీతసీమ వైపు కొత్త కొండగాలి తిరిగింది. సి.ఆర్.సుబ్బురామన్, ఘంటసాల వీరంతా ఆ ‘గాలి’ వీవనలే. సినీ ప్రపంచంలో అడుగుపెట్టిన ఘంటసాల వారి తొలి ప్రయత్నాల్లో ‘బాలరాజు’ సినిమా ఒకటి. నరసింహారావు గారితో పాటు తాను కూడా కొన్ని పాటలు ఘంటసాల వారు ఆ చిత్రంలో స్వర పరిచారు. అక్కినేని గొంతు ఇకపై ఘంటసాల వంతు అని స్పష్టం చేసిన బాలరాజాజ్ఞ ఆ సినిమాతోనే మొదలైంది. అక్కినేని అనగానే నాగేశ్వరుడు గుర్తుకొస్తాడు. అది సరే.
కొండగాలి తిరిగింది- అని ఇప్పడిప్పుడే అన్నాను కదా అని 'ఉయ్యాలజంపాల' సినిమా పాట గుర్తు చేసుకునే ఉంటారు మీరు. అది మరో నాగేశ్వరుడు ..పెండ్యాల నాగేశ్వరరావు వారి అద్భుత సృష్టి. అయితే దానికి తోడైంది ఘంటసాల వారి దూరదృష్టి. పెండ్యాల వారు మోహన రాగంలో స్వర పరచి వినిపించబోతే, ‘కొండగాలి అంటే మలయ మారుతం కదా ...ఆ రాగం బావుంటుందేమో..’ అని సూచించారట ఘంటసాల. ఆ రోజుల్లో అరమరికలు లేని భోళా స్నేహ బాంధవ్యాల వల్ల పెండ్యాల ‘భళీ’ అనే అన్నారే కాని ఈ రోజుల్లోలా ‘నువ్వా నేనా’ అని అనుకోలేదు. ఘంటసాల వారి ఔన్నత్యం గురించి తెలియాలంటే ‘తిరుగులేని మాట’ వైపు ఒకసారి కన్నులు తిప్పాల్సిందే. ఏడుకొండలవాడి మీద పదసంకీర్తనలు వేలకొలది రాసిన అన్నమయ్య ( 14-15 వ శతాబ్దం) కంటే ముందే ( 12వ శతాబ్దం) కృష్ణమయ్య సింహాచల వరాహ నృసింహుడి మీద ‘పదములు’ రాశాడని ఇటీవల (ఐ.టీ. వల వేసి తెచ్చినది కాదు) పరిశోధనలు చెబుతున్నాయట. ఆహా సింహాచలం అని అనుకునే లోగా ‘వినుకొండ’ అనే విశాఖ ఆయన వచ్చి తన స్వర మురళీ రవళితో ఆ పదాల ప్రతిధ్వనిని యూట్యూబ్ మార్గం మీదుగా వినిపించి ‘వినుకోండి’ అని చెబుతున్నారు. ఎవరు ముందు ఎవరు వెనుక అనేది అంతా మహేంద్ర జాలమే. అందుకే పింగళి నాగేంద్రరావు తన చిలిపి కలంతో ఏడుకొండలవాడి ముందు బీబి నాంచారమ్మ ప్రస్తావన తీసుకు రావాలనిపించి ‘పెళ్ళిచేసి చూడు’ సినిమా కోసం ఒక పాట రాశారు. కొండలు కాబట్టి మలయ, ఏడు కాబట్టి స్వరాలూ తోడై ఘంటసాల మాస్టారు ‘మలయమారుతం’ రాగంలో ఆ పాటను స్వర పరిచారు అని నా జ్ఞాన ప్రభోదం. కాని విజ్ఞులు అది ‘చక్రవాకం’ అని తమ వాక్చక్రం తిప్పుతున్నారు. ఏది సబబో చెప్పేందుకు, అబ్బబ్బ ఘంటసాలవారు లేరాయే! గాయకుడు ఘంటసాల, గాయని లీల పాడిన యుగళగీతం ‘ఛమక్ ఛమక్ తారా ...ఝణక్ ఝణ సితారా ...ఈ తారను విడిచి పోతారా?’ అనేది గుర్తు చేసుకుంటే అది ‘పెళ్లి సందడి’ సినిమా కోసం సముద్రాల జూనియర్ అనబడే రామానుజాచార్య రాసిన పాట అని జ్ఞాపకాల దొంతర్లలో దాచుకున్న పాట ఫైల్ బయటపడుతుంది. ఈ పాట ఇవాళ ప్రత్యేకంగా వినిపించడానికి కారణం ఉంది లెండి. అయితే ‘కనులు మూసినా పాటే’ అనుకునీ ఆ వైపు వెళ్లి విని వస్తారూ? ‘మంచి మనసుకు మంచి రోజులు’న్న ఆ రోజుల్లో ఈ రామానుజ కవి ‘రావే నా చెలియా..’ పాటకి సాకీ లాగ ఒక పద్యం రాస్తూ సితార ప్రసక్తి కొంచెం ముందే తీసుకొచ్చారు. సినిమా సన్నివేశం (కనులు చూసినా పాటే) లో మగడు తననే వర్ణిస్తున్నాడనుకుని మురిసిపోతున్న మగువ ఒక్క క్షణం సితార ప్రసక్తి రాగానే నొసలు చిట్లించడం అనేది చూడవచ్చు. రమణమూర్తి (శంకరాభరణం సోమయాజులు గారి తమ్ములు), రాజసులోచన అనే రెండు 'ర'కారాల మీద పాట అనేసరికి రామానుజానికి రావే చెలియా అనే మాటలు స్ఫురించడం దైవేచ్ఛ కాబోలు. కళ్యాణిలో స్వర పరిచి ఘంటసాల మాస్టారు అద్భుతంగా పాడిన (ఆయన ఏ పాట అద్భుతంగా పాడలేదు కనుక?) పాటల్లో ఇది ఒకటి. గీతాలే, భోగాలే అనే ముగింపులు ఎంత ఇంపుగా పలికారాయన! సితార నాదం సింగారమైన శృంగార గీతం ఆ తరువాత ఎన్నో భావగీతాలకి వరవడి అయింది. సంగీత దర్శకులు తాతినేని చలపతి రావు (అదుగో మళ్ళీ మరో కొండ) ఘంటసాల వారిని ‘మిత్రమా’ అని సంబోధించేవారు. మహాకవి శ్రీశ్రీ గారిది ఉగ్ర సాహిత్యం అని అనుకునేవారిని ఆయన నిగ్రహించి వినండి ఈయన సత్తా ఏమిటో అన్నట్టు అదే కళ్యాణి రాగంలో ఒక పాటకి ‘పునర్జన్మ’ నిచ్చారు. ‘ఎవరివో నీవెవరివో..’ పాట ఎవరికి తెలియదు? శ్రీశ్రీ గారు స్వతహాగా అభ్యుదయవాది కనుక భావ గీతంలోనూ చివరికి ‘రావే నూతన తేజమా’ అనే ఆశావాదం వినిపించారు. పైగా ‘నా భావనలో (theory/imagination), నా సాధనలో (practice)’ అనే విజ్ఞాన శాస్త్ర పద మైత్రిని ఆయన ఆ పాటలో పరిచయం చేశారు. ఇక ఘంటసాల వారి గాత్ర ప్రభంజనం, పండిట్ మిట్టా జనార్దన్ (తీరైన మాట - చూడండి) గారి ధనాధన్ సితార సంచలనం ఆ పాటని జన గీతంగా మార్చి సితార వాద్య ప్రతిభని తార స్థాయికి చేర్చాయి. ప్రస్తుతం తారస్థాయి కోసం కనులు తెరిస్తే లాభం లేదు. కనులు మూసినా పాటే- కనుక శిల్పం, ఆ శిల్పం వెనక ఉన్న తార సితార సొగసులతో ఊహల్లోకి దిగి వస్తారు. అలా వినగలరు ఆ పాట. ‘పాడుతూ ఉన్నంతకాలం బ్రతకాలి, బ్రతికినంతకాలం పాడుతూనే ఉండాలి’- ఇది ఘంటసాల వారి ఆశయం. సినిమా పాటలూ, సినిమా సంగీతం బ్రతుకు తెరువు కోసమే అయినా ఆయన మనసు పెట్టి అందులో రాణించారు. పాట మనసుకి నచ్చితే ఇంటికొచ్చి మళ్ళీ భార్యాబిడ్డల ముందు పాడేవారట. అందుకేనేమో శ్రీశ్రీ గారు ఒక ‘సాంఘిక ప్రవచనం’ అనదగ్గ పాట –‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము’ – రాసి ఇస్తే, స్వర రాజేశ్వరుడు అద్భుతంగా జయజయవంతి రాగంలో స్వర పరిస్తే, ఘంటసాల హృద్యంగా ఆలపించారు. అక్కినేని, ఆదుర్తి గార్ల ఆ సినిమా పేరు ‘డాక్టర్ చక్రవర్తి’. ఆ ‘చక్రవర్తి’ పేరే తర్వాత అక్కినేని,ఆదుర్తి గార్ల నిర్మాణ సంస్థ పేరైంది. చిత్రంగా లేదూ ఈ జోడీ. అలాగే ఆ పాట జయజయవంతి అనే రెండు జయ శబ్దాలున్నటువంటి రాగంలోనే రాజేశ్వరరావు ఎందుకు స్వర పరచినట్టు? ఒకటి- రాసినది శ్రీశ్రీ ...ఉభయ శ్రీ! రెండోది- మనసు,బ్రతుకు అనే కొత్త జంట పదాలు కవి తీసుకు వచ్చినందుకు. మూడోది- భాగ్యం,స్వర్గం అనే మరో కొత్త పద యుగం (యుగం అంటే రెండు అని కూడా అర్థం) కవికి తోచినందుకు. నాలుగోది-మనసు రెండుసార్లు, బ్రతుకు రెండుసార్లు వచ్చి పాటలోని భావం ద్విగుణీకృతం అయినందుకు. సినిమా పరంగా ఒకే ‘తోడు’ ఆ స్త్రీ - ఒకరికి అర్థాంగి, మరొకరికి సోదరి. పైగా ‘జయ’త్వం, కోమలత్వం రెండూ సమపాళ్ళలో మూర్తీభవించే ఆ నటి ఎవరో కాదు- సావిత్రి! ఆ తారామణికి తగిన సితార నాదం మళ్ళీ జానర్దన్ తప్ప వేరెవరు అందించగలరూ? కనులు చూసినా ఆ పాటే – చూస్తూ వినండి. ‘అలుక’ సత్యభామ పేటెంట్. సత్యభామగా ఆంగికాభినయంలో నటిమణి జమున తర్వాతి కాలంలో పేరుపొందినా అంతకు ముందు నటీమణి సావిత్రి ‘దీపావళి’ చిత్రంలో సత్యభామే. కోమలత్వం అని ఇప్పుడే అనుకున్నాం కదా. ఏ.పి.కోమల తప్ప ఆ విలాసమైన సత్యభామ దరహాసం ఇంకెవ్వరూ స్వరంలో బంధించలేరని ఘంటసాల మాస్టారు గారికి తెలుసు కనుక ‘సరియా మాతో సమరాన...’ పాటను ఆమె చేత పాడించారు. సావిత్రి నటనకి దీటుగా ఎవరు పాడగలరో ఏమో అని నిర్మాత ఊగిసలాడుతుంటే (ముందుగా తయారయ్యేది పాట , ఆ తరువాతే పాటకి అనుగుణంగా నటన కదా) చూసి మాస్టారు ఏ మాత్రం ఆందోళన పడక ‘హిందోళం’లో స్వర పరిచారు. కనులు మూసినా ఆ పాటలో కోమల స్వరాల మధ్య సావిత్రి విలాసాభినయం కళ్ళకు కట్టినట్టుంటుంది. సితార అనగానే లలితమైన శృంగార భావనల్ని మెరుగు పరచే వాద్యం అయితే అలుక సరదాలు తీర్చడంలో దానిదే పై చేయి కావాలి. ‘రా వెన్నెలదొరా కన్నియను చేర’ అని డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు చేత కలం పట్టి గేయ శిల్పం చెక్కితే కోదండపాణి జనార్దన్ గారి చేతి సితార్ ను పరుగులెత్తించి అంతా ‘లక్ష్మీ కటాక్షం’ అనిపించారు. ఘంటసాల గారిలో ఎన్టీఆర్ గారు పరకాయ ప్రవేశం చేసేవారు అని ఊరికే అంటే ఎలా? కనులు మూసినా ఆ పాటే- వింటూ ఆ అనుభూతి పొందాల్సిందే. కె.ఆర్. విజయోస్తు! సితార లో పరుగులు అన్ని వేళలా సాధ్యమా అని సందేహపడేవారికి మామ మహదేవన్ అంతకు ముందే ‘దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే’ చూపించి సముద్ర తీరంలో పాడుకునే పాటగా ముద్ర వేయించారు. ఖాన్ సాబ్ అని పిలుచుకునే ఉస్తాద్ అహమ్మద్ హుస్సేన్ ఖాన్ గారి సితార తళుకులు కనిపించకుండా ఆ పాటలో వినిపిస్తాయి కనుక ‘కనులు మూసినా పాటే’ గా వింటే సరి. సితార ధ్వనించిన ఈ కొద్దిపాటి పాటల్లో ఎన్నో ‘కళ్యాణి’ రాగంలో ఉన్నవే అని అనిపించడం లేదూ? అంతెందుకూ? ఒక సందర్భంలో మనసున మల్లెల మాలలూగితే, కన్నుల వెన్నెల ‘డోల’లూగితే అక్కడ హిందోళం రాలేదు, అలలు కొలనులో గలగల మన్నాయి కనుక యమునా కళ్యాణి స్వర తరంగాలే కదిలాయి. రాగాలకి సమయ నియమం ఉన్నా సినీ రాగాలు ‘మూడ్’ ననుసరిస్తాయి. కళ్యాణి,జయజయవంతి వంటి మనోహర రూపాల ముందు ‘పట్ దీప్’ వంటి రాగం వెలిగిస్తే ఆ వెలుగులో ‘నా మది పాడిన వేళలో’ ఘంటసాల మాస్టారే కనిపిస్తారు. ఆ వెలుగు రేఖలకి జనార్దన్ సి’తార’ తళుకులు తోడైతే, ఇంక అంత వెలుగు చూడలేమని కనులు మూసినా పాట వినిపించమని అర్ధిస్తాం. ఈ పాటలో కవి నారాయణ రెడ్డి గారి దూర దృష్టి ఎంత గొప్పదీ.. పాటలో సితార వాద్య గుబాళింపు ఉంది, దానితో ఆయనకేం పని? ఒక లైను మాత్రం రాశారు- ‘మీరా’ బ్రతుకున నిండిన రాగం...అనేది. ఆనక ఏడేళ్ళకి ‘మీరా’ అనే చిత్రం కవి గుల్జార్, సుప్రసిద్ధ సితార్ మేధావి తీర్చి దిద్డగా వచ్చింది. ‘శుద్ధ హిందోళంలో ఆ రిషభం ఎలా వచ్చింది?’ అని విశ్వనాధుల వారు శంకరాభరణం శంకరశాస్త్రి గారి చేత కేకలు (అప్పటి తరం మాట – ఇప్పటి కేక కాదు) వేయించడం వల్ల ఒకటి అర్ధమైంది. ‘రిషభం’ లేనప్పుడు అంటే నంది ఆజ్ఞ లేనప్పుడు ఇంక కాశీ విశ్వనాథుడుకి (శంకరుడికి) మన మొరలు ఎలా చేరేది? లోక కళ్యాణం కోరే అమ్మను శరణంటే సరి. ఆమెయే అసలైన శంకరాభరణం. ఇది తెలియక రావణుడు చిక్కుల్లో పడ్డాడు. అయ్యో పాపం అని గాలి పెంచల నరసింహారావు గారు ‘కానరారా కైలాస నివాసా’ అని రావణుడి మొరలన్నీ పాడించారు శంకరాభరణ రాగంలో (రాగమాలికలో). ఘంటసాల వారు పాడితే శంకరుడు ప్రసన్నుడైపోయి కానడా? (ఆ భరోసాతో దేవీ ప్రసన్నం కూడా కావడం తధ్యం అని అదే యేడు ‘శివశంకరి శివానంద లహరి’ని (పెండ్యాల) నాగేశ్వరులు ఘంటసాల చేతే దర్బారీ కానడా రాగంలో పాడించారు). తెలుగు సినిమా పాటల్లో సితార్ అనే అంశం నుంచి, ఉద్దండ సినీ పండితులనుంచి, ఉస్తాదుల నుంచి, మీరా నుంచి శంకరుడి వరకూ వచ్చేశాం. ఎవరో మనసులో మెదులుతూ ఉన్నారు. ఎవరదీ? ఆ(...పండిట్ రవిశంకర్..సితార్.... అవునవును...మొన్న 12-12-12 అనే మూడు పన్నెండులు ఒకే వరసలో ఉండేలా రోజొచ్చి కొందరికి ఆనందాన్ని, మరి కొందరికి భయాన్ని ఇచ్చింది. ఆనందం ఎందుకంటే- మళ్ళీ నూరేళ్ళకి గానీ ఆ వరస సాధ్యం కాదు కనుక, అది ఇప్పుడు మనకే దక్కింది కనుక. భయం ఎందుకంటే – అదేదో యుగాంతం వచ్చి మన పెరట్లోనే జరిగిపోతుంది అని. కాని ఆనందం, భయం రెండూ కాక ఎందరికో విషాదం పులిమింది ఆ రోజు ఉదయం. ఉదయాన్నే రవి ఉదయిస్తాడు అన్నది ఎవరి సాయం లేకుండా తెలిసే వార్త! కాని ఆ రోజు పడమట దిక్కున రవి అస్తమించాడని ఒక వార్త వచ్చింది. అందులో వింతేముంది, సూర్యుడు పడమర లోనే కదా రోజూ అస్తమించేదీ? అని విసుక్కున్నవారు లేకపోలేదు. కాని తెలుసుకున్నాక అయ్యో అన్నారు. ఆ రవి – రవిశంకరుడు. ఆయన కన్ను మూశారు. సితార వాద్యంతో ఇండియన్ మ్యూజిక్ అండ్ మెలోడీకి విదేశాల్లో స్థానం కల్పించినవారు ఆయన. నవంబర్ నెలలో కూతురుతో జుగల్బందీ కచేరీ చేసి ఇంక శరీరం నా మాట వినటం లేదని సితార వైపు జాలిగా చూసిన సుర్ మేధావి డిసెంబర్లో సురలోకానికి లేదా సితారా లోకానికి తరలి పోయారు. ఆయన సంసార భవనం ఒక నాలుగు స్తంభాల మీద నిలిచినా పునాది మాత్రం సంగీతమే. అన్నపూర్ణా దేవి గొప్ప సితార విద్వాంసురాలే. సుకన్య గారిది కూడా సంగీత ప్రపంచమే. రవిశంకరుడి కుమార్తె అనౌష్క గారిది కూడా సితార వారసత్వమే. బహుశా అన్నపూర్ణ పేరు లోని సగం, సుకన్య పేరులోని సగం చేరి ‘అనౌష్క’ పేరు జనించిందేమో. (శంకరుడికి అన్నపూర్ణ తో పాటు గంగ కలిసి రావడం కేవలం పురాణమే అంటే ఎలా? కొందరికి కొన్ని నిజమౌతాయి.) రవిశంకరుడికి పద్మశ్రీ రాలేదు. ఎందుకొస్తుందీ? అంతకు మించినవి పద్మభూషణ్, పద్మ విభూషణ్, భారత రత్న ఆయన్ని వరిస్తే! ఆయన కన్ను మూసిన నాటికి ఆయన వయసు తొంభై రెండేళ్లు. అంటే- ఇంతసేపూ మనం చెప్పుకుంటున్న తొంభై యేళ్ళ ఘంటసాల గారు ఇప్పుడు గానీ ఉంటే? మనం సమకాలికులం, మనది సంగీత కులం అని ఒకరి పాటకి మరొకరు సితార వాద్య సహకారమందించుకునేవారేమో. ఘంటసాల వారు ‘పద్మశ్రీ’ చాలనుకునీ మిగతావి రవిశంకరుల వారికి దక్కడమే మేలనుకున్నారు. ‘ఘంటసాల అనే గొప్ప గాయకుడు దక్షిణాదిని ఉన్నాడు’ అని ఆ రోజుల్లో (1940-50ల మధ్య కాలంలో) బడే గులాం ఆలీ ఖాన్ ఉత్తర దిశలో ఎలుగెత్తి చాటడం వారణాసి వాసి అయిన రవిశంకరులకి తెలిసే ఉంటుంది. అంతటి సితార విద్వాంసుడు, అప్పటి మూడు గ్రామీ అవార్డులతో పాటూ ఇప్పుడు మరణానంతరం గ్రామీ లైఫ్ టైం అవార్డ్ పొందిన వాడు సినిమాలకూ పని చేసి వాటికి ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టారు. అనురాధ, గోదాన్, మీరా, గాంధి సినిమాలు ఆయన సంగీతాలంకరణలే. ఆయనకెందరో శిష్యులు. అందులో ఒకరు- గాయని వాణీ జయరాం భర్త శ్రీ జయరాం గారు. ఏకలవ్య శిష్యులు జనార్దన్ గారు. అనురాధ లో లతా మంగేష్ కర్, మీరా లో వాణీ జయరాం ఎవరికివారే రవిశంకరుల సంగీత ప్రతిభని తమ తమ గళాల ద్వారా గీత మాధుర్యంగా మలచారు. లతా మంగేష్ కర్ అన్ని వేలపాటలు పాడినా ఒకే ఒక్క తెలుగు పాట తను పాడినట్టు చెప్పకుండా ఉండగలరా? విశేషం –ఒకటి పూర్తిగా ఆమె పాడిన పాటైతే, మరొకటి మధ్యలో ఘంటసాల వారు అందుకున్నది. రాగం, ‘సంతానం’, పల్లవి.. ‘నిద్దురపోరా తమ్ముడా’ అన్నారు దీదీ, ఘంటసాల,సుసర్ల, రవిశంకర్ .. ఈ ముగ్గురికీ నివాళిగా. అయితే పాటలో సితార నాదం లేదు. ఘంటసాల మాస్టారు మాత్రం ‘పాడుతా తీయగా సల్లగా’ అన్నారు, ఉస్తాద్ అహమ్మద్ హుస్సేన్ ఖాన్ సితార సహకారంతో, పండిట్ రవిశంకర్ విడిచి పెట్టిన జ్ఞాపిక సితార వైపు చూస్తూ. ఘంటసాల గారితో ఒక పాటైనా పాడలేదే అని బాధ పడే వాణీ గారు అభినవ ‘మీరా’ రూపంలో వినిపించిన రవిశంకర్-గుల్జార్ ల సృష్టి వైపు దృష్టి మళ్లిస్తే చాలు – మంచి గొంతు ఎక్కడ వినిపించినా సరే మనసారా ఆశీర్వదించే - ఘంటసాల వారు తప్పక దీవెనలు అందిస్తారు. -డా. తాతిరాజు వేణుగోపాల్ , 16 డిసెంబర్ 2012
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|