మునుపటి నా మాట
మాస్టారూ.. కొత్త సంవత్సరం 2013 రానూ వచ్చింది. కాని గత ఏడాది డిసెంబర్ నెలలో యుగాంతం పెట్టిన భయం కన్నా అమానుష త్వం కలిగించిన జుగుప్స మరచిపోలేనిది. పుణ్యభూమి నా దేశం అని మురిసిపోతున్న దేశంలోనే, దేశ రాజధానిలోనే మానవత్వం తలదించుకునే సంఘటన జరిగింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఆరు పదులు దాటినా స్త్రీ పట్ల పురుషుడు గొప్ప స్వతంత్రుడై పోతూ చూపిస్తున్న హేయమైన, అనాగరికమైన, హింసాత్మక ధోరణి రవంతైనా సమసిపోలేదు. డిసెంబర్ పదహేడున డిల్లీ లో రాత్రి వేళ ఒక కన్య జీవితం తల్లడిల్లింది. అరిషడ్వర్గానికి ఒక్కొక్క ప్రతీక అన్నట్టు ఆరుగురు కీచకుల బారిని పడి ఆమె దారుణమైన అత్యాచారానికి గురైంది. ....చెప్పలేను మాస్టారూ... చెప్పకూడదు ....గాయపడిన హృదయాలను జ్ఞాపకాలే అతుకునోయ్ అన్నారొక కవి. కాని గాయపడిన ఆ కన్య జ్ఞాపకాలు మా హృదయాల్ని ఇంకా ఇంకా ముక్కలు చేస్తున్నాయి... ఆ మరుసటి రోజే ఉవ్వెత్తున లేచింది ప్రజా వెల్లువ.. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. .. ప్రభుత్వ మెతకతనం మీద, పోలీసు సుషుప్తావస్థ మీద రాజధానిలో గొంతులు ఏకమై పెట్టిన కేకల వెనక న్యాయ విచారణ పలాయనం సాగించలేక పోయింది. మానవత్వం నమ్ముకున్న వారంతా ఆడా, మగా,పెద్దా, చిన్నా అనే భేదం లేకుండా అంతటా కదిలి వచ్చారు. ఆ నరరూప రాక్షసులకి మామూలు శిక్ష చాలదు.. ఉరితీత ఒక్కటే మార్గం.. ఏ నోట విన్నా ఇదే తీర్మానం. సఫ్దర్జంగ్ నుంచి సింగపూరు వరకు పన్నెండు రోజులు సాగిన ఆ జీవచ్ఛవం లోని కొన ఊపిరి సమాధానం లేని సూటి ప్రశ్నలు వేసి ఇరవై తొమ్మిదవ తేదీని శాశ్వతంగా ఆగిపోయింది. ఆమె అసలు పేరుతో పని లేదు. ఆమె ఒక సగటు భారతీయ మహిళ. నిర్భయ, దామిని, అమానత్, Delhi brave heart, Daughter of India – ఎవరెలా పిలిచినా పలకలేదు ఆమె. గోదాదేవి తండ్రి పెంచుకున్న పాప. ఆ కన్య పూలల్లి తాను ముందు ధరించి విష్ణు మూర్తి మెడలో వేయించి దైవాజ్ఞ పొంది విష్ణు సాయుజ్యం పొందింది. ఎప్పటి కాలం అది! ఎంత మంచి కాలమది! ఇప్పడు చూస్తే- దగ్గరౌతున్న పెళ్లి ముహూర్తం కోసం మధురూహల్లో తేలుతున్న తలపులు దామినివి. మగవారిలో ప్రేమ నశించిపోతోంది, ద్వేషం పేట్రేగిపోతోంది అని ఊహించలేని అమాయకత్వం అమానత్ ది. ఆ కన్య తలపులకి ఏ స్వర్గ ద్వారాల తలుపులు తెరుచుకున్నాయో? ఆ అమాయకత్వం ఏ మొగసాల నిలిచిన మందారమో?
పూలతో స్త్రీ మూర్తుల్ని పోలుస్తారు. మగువని పూబోడి అంటారు. ఒక కవి సినిమా కోసం రాస్తే రాసి ఉండవచ్చు కాక.. కాని అవి చాలా దారుణమైన మాటలు- ‘ఒక్కలాంటి వాళ్ళురా ..జాజిపువ్వు, ఆడపిల్ల .. వాడిపోక ముందే వాటిని అనుభవించరా’ అన్న ఆ మాటలు సమాజాన్ని పెడదారిలోకి తోసెయ్య గలవు. దురదృష్టవశాత్తు ఆ పాట మీ మధురగళంలో విన్నాం. క్షమించండి. సినిమా తీసినవాళ్ళ ఉద్దేశ్యం వేరు కావొచ్చు. ఇప్పుడా పాట ఉన్న ‘బుద్ధిమంతుడు’ సినిమా గుర్తొచ్చింది ఎందుకంటే...తిరుపతిలో ఇటీవల నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి చూడండి, అందులో A ఫర్ అక్కినేని, B ఫర్ బాపు అన్నట్టు ఈ ఇద్దరు కళామేధావులకి సన్మానం జరిగింది. వీరి కాంబినేషన్ లోనే కదండీ బుద్ధిమంతుడు సినిమా వస్త! అసలు తెలుగులో ‘మరునాడు’ అనే ఆశావాదం ధ్వనించే ఒక ఇంగ్లీష్ మాటకి డబ్భైల కాలంలో సినిమాలు బాగా కట్టుబడిపోయాయండి. అంత గొప్ప దేవానంద్ నటించిన జానీమేరానాం హిందీ సినిమాలో కర్కసిగా ప్రేమనాథ్, పాడుతూ వలువలు ఒక్కొక్కటీ విడుస్తూ పద్మాఖన్నా,నిస్సహాయుడిగా బందీ అయిన దారాసింగ్ ..ఎంత జుగుప్సాకరమైన సన్నివేశం! ఇప్పటి సెన్సారు తిరిగి కత్తెర వేసింది కనుక మంచిదే అయింది. లేకపోతే అప్పటి యువత లాగే ఇప్పటి యువతకి పెడబుద్ధులు పెరిగేవే! ఇక ఈ శతాబ్దం డిజి’టాల్’ గా ఎంతగానో ఎదిగి పోయింది కాని మనిషిలోని పశుత్వం కొంచెమైనా క్షీణించలేదు సరి కదా అంతకంతకు కొమ్ములు పెంచుకునీ రొమ్ము విరుచుకునీ వీరవిహారం చేస్తోంది. మీరు గానం చేసిన కరుణశ్రీ వారి పుష్పవిలాపం విని ఆడవాళ్ళు పూలు ముడుచుకోవడం మానేసేవారట ఆ రోజుల్లో. అందులో ఒక పద్యం మీరు ఎంత హృద్యంగా పాడారో... మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకయి త్యజించి కృశించి నశించి పోయె; మా యౌవన మెల్ల కొల్లగొని ఆపయి చీపురు తోడ చిమ్మి మ మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతియున్నదా? అలా పద్యం ముగిసినంతలోనె గుండె బరువెక్కిందో లేదో మరో పద్యం బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి? అందమును హత్య చేసేడి హంతకుండ! మైలపడిపోయెనోయి నీ మనుజ జన్మ.... అన్నది వినిపించి వెక్కివెక్కి ఏడ్చేలా చేశారు మీరు... అవును మాస్టారూ... కీచకుల్లాంటి ఆ ఆరుగురు పురుషాధములు నిర్దాక్షిణ్యంగా ఒక బేల అందాన్ని ఇనప రాడ్డుతో కుళ్ళబొడిచి వివస్త్రను చేసి మృత్యుశకటంగా మలుచుకున్న తమ బస్సు నుంచి విసిరేశారు. అబలత్వం, అమాయకత్వం, అసహాయత అనే మూడుమూర్తుల ‘అందాన్ని’ నిలువునా హత్య చేశారు. వాళ్ళ వల్ల ఇవాళ మొత్తం మనుజ జన్మ మైలపడి పోయింది. కసాయి మగతనానికి కటకటాల ఊచలు కాదు కంబమెక్కించి కామనాడులు వేలాడదీయాలి. నూట ఇరవై కోట్ల జనాభాలో ఆరుగురు తగ్గిపోతే దేశానికి ఒరిగే నష్టం ఏమీ లేదు. పాత సంవత్సరాన్ని పాతర వేసి కొత్త సంవత్సరానికి కోలు కోలు అని అనాలనిపించడం లేదు. మీరు చివరి సంవత్సరాలలో ఆర్ద్రంగా స్వరపరచిన పాటలూ, ఆవేదనగా పాడిన పాటలు మననం చేసుకుంటే అనిపిస్తోంది- కాలం వేగం మారింది తప్ప కాలకూట విషం తన ధర్మం విడవలేదని, అది మనిషిలో మృగత్వం అనే రూపాన్ని భద్రపరచుకుందనీ! నచ్చే అమ్మాయిని వెంబడించి కాసేపు మాటలతో ఆట పట్టించినా ఆమెలో ‘ప్రేమ’ మొలకెత్తించినట్లు సినిమాల్లో చిత్రీకరించిన రోజులుండేవి. నిలువవే వాలు కనులదానా (ఇల్లరికం), కనులు కనులు కలిసెను కన్నె మనసు తెలిసెను(మురళీకృష్ణ), వగలరాణివి నీవే సొగసుకాడను నేనే (బందిపోటు), మరదలుపిల్లా ఎగిసిపడకు (గండికోట రహస్యం), మిడిసిపడకు మిడిసిపడకు అత్తకూతురా(ఆస్తి పరులు), బులిబులి ఎర్ర్రని బుగ్గలదానా (శ్రీమంతుడు), ఏమండీ ఇటు చూడండీ (మంచి మనిషి), హవ్వారే హవ్వ హైలేసో (బుద్ధిమంతుడు) ...ఇలా ఎన్నో పాటలు మీరు పాడినవే. వీటిని అన్ని వయసులవారూ పాడుకుంటూ ఇప్పటికీ ఆనందిస్తున్నారు. భూమ్మీద ఇటువంటి పాటలు పాడితే తప్పే లేదురా...అని కొందరి ప్రవచనం కూడా. బులపాఠం తీర్చుకోమనడమే తప్పు. ప్రేమ పొందడం ఎంత కష్టమో ప్రేమ పంచడం కూడా అంట సులభం కాదు. ప్రేమ నిర్వచనం ఇదీ అని ఎవ్వరూ చెప్పలేరు. అది ఒక ‘మధురభావన’. అది రసాయన చర్య కాదు, భౌతిక ఆకర్షణ కానే కాదు. ఎవరికివారౌ స్వార్థంలో ..హృదయాలరుదౌ లోకంలో అమృతం తెచ్చిన జాబిలివే... అని ఒక పురుషుడు ప్రేమ విలువని ఎలా ఎలుగెత్తి చెప్పగలడో మీరు పాడి వినిపించారు. పాట పాడనా ప్రభూ...నీ కౌగిట వీణను నేనై, నీ పెదవిని వేణువు నేనై పొంగిపోదునా ... అని ఒక స్త్రీ తన ప్రేమలోని దివ్యత్వాన్ని ఎలా గోదాదేవిలా ధైర్యంగా చూపగలదన్నది తెలిసేలా మీరు కల్యాణి రాగ స్వరాలతో పాడించారు. ‘సాధించనౌనా జగానా... పలు పంతాలతో బలవంతాలతో చెలుల స్వాంతాలు భూకాంతులైనా’ ...అనే సత్యాన్ని గ్రహించమని, ప్రేమ అంటే పురుష అహంకారం ఆదేశించే ‘డిమాండ్’ అని అనుకుంటే అది తప్పని మీరు ‘మాండ్’ రాగంలో ఉద్బోధించారు. ‘ఏనాటికైనా ఈ మూగవీణ రాగాలు పలికి రాణించునా?’ అని దైవ సన్నిధిలో ప్రశ్నలు కురిపిస్తూ బాధపడుతున్న స్త్రీ లోని ప్రేమ జలధిని ‘సింధు భైరవి’ స్వరాలతో ఓదార్చి ఒడ్డున చేర్చారు. 'చూస్తున్నావా ఓ దేవా చూస్తూ ఊరికే ఉన్నావా జరిగే ఘోరాలు, పెరిగే పాపాలు కనలేక మోము దాచుకున్నావా, ఏమనలేక మూగవై ఉన్నావా?' – అని పురుషపరంగా దేవుణ్ణి నిలదీసి మీరు ప్రశ్నిస్తే మీతో వంత కలిపి కన్నీటి పుంతలో మగవారు తమనితాము ప్రక్షాళనం చేసుకున్నారు. 'ఊరు మారినా ఉనికి మారునా ? మనిషి దాగినా మమత దాగునా?' – అని మీరు ఆవేదనతో వేసిన ప్రశ్నలు మగవారిని తప్పు తెలుసుకోమన్నాయి. 'చీకటిలో కారుచీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో' ప్రయాణించే నిస్సహాయుల్ని ఓదార్చిన మీ గానం ఎంత ఊరట కలిగిస్తుందీ! నిరాశాలోనే ఆశాదీపం వెలిగించుకుంటే ఆ చీకటి మటుమాయమౌతుంది అని తెలిపేదే ఊరట! 'కాలం మారుతుంది ..చేసిన గాయాలు మాన్పుతుంది... విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుంది ....' అని మీరు ఒక కవి రాసిన పాటో, ఒక స్వర కర్త అల్లిన స్వర మాలో, ఒక సన్నివేశానికి ఇస్తున్న బలమో అని కాక ఒక గాయకుడిలోని అంతర్గత వేదనకి అక్షర రూపం, స్వర రూపం రెండూ ఎలా ఇచ్చి పాడాలో ఉదాహరించారు. ఇవి వింటుంటే.. మానవ జన్మ పొందినందుకు మనిషి ‘బుద్ధి’ కలిగి ఉండాలి, అదే మనిషిని పశువు నుంచి వేరు చేస్తోందని తెలుసుకోవాలి అనే జ్ఞానోదయం అవుతుంది. మంచి చెడ్డలు ఎంచి చూడగ లోకమందు రెండు కులములు- అని మహాకవి గురజాడ అప్పారావు గారు ఎప్పుడో స్పష్టం చేశారు. ‘మంచి’ వైపు పయనించడం మనిషి అలవర్చుకుంటే చెడుదారి దానంతట అదే ఎటువంటి గుర్తింపూ లేక కనుమరుగైపోతుంది. సంక్రాంతి నాటికి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. చీకటి మరకలు రూపు మాపుతూ వెలుగుల వైపు చూపు మళ్లిస్తాడు. అప్పుడు మా ఘంటసాల మా‘స్టారు’ గారనే గోరువెచ్చని సూర్యుడి ముందు దివిటీలా అరడజనుకు మించని ‘చిటిపొటి’ పాటవెలుగులతో తృప్తి పడిపోతూ ఉంటాం. గళోపాసకులైన మీ దీవెనలే మాకు ఘనమైన రక్ష...ఘంటసాల మాస్టారూ!’ -డా.తాతిరాజు వేణుగోపాల్ , 01 జనవరి 2013
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|