మునుపటి నా మాట
శ్రీరామ నవమి వచ్చి వెళ్లిపోతేనేం శ్రీరామా...నీ నామ ధ్యానం ఒక్క శ్రీ రామదాసు ఆ సుందర హనుమకే కాదు మాకూ నిత్య సంతోషమే. ఇదిగో ఇవాళ చైత్ర పౌర్ణమి! అయ్యో రామచంద్రా... పాక్షిక చంద్ర గ్రహణం అర్ధ రాత్రి దాటాక వస్తోంది. సూర్య వంశానికి చెందినవాడివి, శ్రీరామ చంద్రుడివి, పైగా భూమిజను స్వీకరించిన వాడివి - నీకు గ్రహణాల గురించి చెప్పాలా? అయినా- ఒక్క మంధర లాంటి వ్యక్తి చాలు స్వామీ వందలతో పనిలేదు, సాఫీగా సాగిపోయే సంసారాలకి గ్రహణం పట్టించడానికి, అల్లారు ముద్దుగా నిన్ను అడ్డాలనాడు చూసుకున్న ఆ కైకమ్మ వంటి అమ్మల బుద్ధి పక్క దార్లు పట్టించడానికి. ఏమైతే నేం! మీ నలుగురు సోదరులు మంచివారు. లక్ష్మణుడు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునేందుకు మీతో కదిలి వచ్చాడు. నీకు భరతుడంటే మక్కువెక్కువ! అతను వచ్చీ రాగానే నువ్వు అడవులకు వెళ్ళిపోయావని విని అడలి పోయాడు. 'తల్లి దురాశాయు, తండ్రి వియోగము(1)' విని నొచ్చుకుంది అతని నిష్కల్మష మది. నువ్వే రాజువి కావాలని బతిమిలాడాడు. ఆడి తప్పడం ధర్మం కాదన్నావు. పాదుకలిచ్చావు. వట్టి పాదాలతో వనవాసం చేశావు.
1 Comment
రెండేళ్ళ క్రితం 'దివి' సీమ వైపు హుటాహుటిన వెళ్ళిపోయిన ముళ్ళపూడి వెంకట రమణ గారు వందేళ్ళకైనా మరవలేని ఒక శ్లేష పలికారు- అడ్జస్ట్ 'మెంటాలిటీ' అని. ముళ్ళపూడి వారంటే బుడుగు ద్వారా బుడుగు తల్లి తండ్రుల భోగట్టాలు రాబట్టేలా తెలుగు వారికి కొత్త ధర్మం నూరిపోసిన రచయితా, సినీ రచయితానూ. అయితే 'తెలుసో ఏమో అందానికి అలకే అందం', 'మేడ మీద మేడ కట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందూ..హలో హలో కమ్ అవుట్ ..రా ముందూ' లాంటి తొలి పాటలు రాసిన సినీ కవి అని కొందరికే తెలుసో ఏమో. అది ఆయన అడ్జస్ట్ మెంటాలిటీ. ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటే మేలు అన్నిటా కాలు పెడితే విరుగును కీలు - అని ఏ పెద్దాయనా చెప్పనట్టు జ్ఞాపకం. కాని ప్రతివాది భయంకర శ్రీనివాస్ ముళ్ళపూడి వారి ఈ రెండు పాటలూ పాడక ముందు నుంచీ ఒక అడ్జస్ట్ మెంటాలిటీకి అలవాటు పడిపోయారు. తన పేరు పొడి పొడిగా 'పి.బి.ఎస్' కదా, పి.బి. అంటే ప్లే బ్యాక్ అని శ్రీనివాస్ కాస్త శ్రీని 'వాయిస్' అని సినీ సీమ ముద్ర వేయగానే నవ్వుతూనే తన అడ్జస్ట్ మెంటాలిటీని కనపరిచారు. అయితే అసలే ఇండియా అందునా భాషలెక్కువ కాబట్టి పి.బి.ఎస్ మనసులో శత భాషలు శతభిషలు మొదలెట్టాయి- నన్నంటే నన్ను నీ 'వాక్కు'న చేర్చుకో అని తామంతా సతాయిస్తుంటే ఈయన కున్న అడ్జస్ట్ మెంటాలిటీ దేన్నిస్వీకరిస్తుందా అని. గొల్లప్రోలు వాడైనా గోపాలుడు కాదు. తెల్ల కాగితాలే తప్ప తెంపరితనం ఎరగడు. అందుకే ఆచి తూచి ఎనిమిది భాషలు పూర్తిగా నేర్చుకోవడమే కాక ఆయా భాషల కవిత్వ స్పూర్తితో తానూ వ్రాయడం మొదలెట్టాడు. ఇలా కాయితం, కలం తో భాషా అడ్జస్ట్ మెంటాలిటీ కన పరిచిన ఏకైక వ్యక్తి బహుశ: పి.బి.ఎస్ ఒక్కరేనేమో. ‘అయ్యా గోపాలం గారూ ...కొంచెం ఆలస్యమైనా...ఉగాది శుభాకాంక్షలు...’ ‘ప్రకాశం గారూ.. రండి రండి... శ్రీ విజయ నామ సంవత్సర శుభాకాంక్షలు...ఒక్క రోజే కాదు ఏడాది పొడుగునా...’ ‘చెప్పండీ.. మనం గానీ ఉగాది అని తప్పుగా అంటున్నామా? యుగాదియే కరెక్ట్ అనుకుంటా’ ‘ఉగాది అంటే యుగాదియే. యుండెడిది అనేది వ్యావహారికంలో ఉండెడిది అయినట్టే యుగాది కాస్త ఉగాది అయింది. కన్నడ వారు ‘యుగాది’ అనే అంటారు. మహారాష్ట్రలో గుడిపాడ్వ అంటారు. బ్రహ్మ యుగాన్ని ప్రారంభించేడని కృతజ్ఞతగా ఇంటింటా చిన్న గుడి కట్టి ఆహ్వానిస్తారు. ఇతరత్రా బ్రహ్మకి గుళ్ళు ఉండవు కదా.’ ‘బ్రహ్మ దేవుడు సరే..ఆయన గురుబ్రహ్మ. గోపాలం గారూ.. ఉగాది గురువారం నాడు వచ్చిందని అంటున్నానని అనుకోవద్దు..నిజంగానే మీరు మా గురువులు..’ ‘ఈ ఏడు ఉగాది గురువారం నాడు వచ్చింది కాబట్టి గురు గ్రహమే ఈ ఏడాదికి రాజండీ. అంత పెద్దవాడు సైతం... గురు అన్నా బృహత్ అన్నా పేద్ధ అనేగా అర్ధం ---అందుకే అతను బృహస్పతి... మరి ఈ పెద్దాయన సైతం సూర్యుడి చుట్టూ తిరగాల్సిందే. అంచేత ప్రకాశం మీరైనప్పుడు, మీదైనప్పుడు మేమెంతండీ.’ పాణికి గ్రహణంకి మధ్య ఓ గీత ఉంది గమనించండి. పాణి అంటే కోదండపాణి అని పాతిక శాతం మంది గ్రహిస్తే ఈ 'కృష్ణప్రేమ' జన్మ సార్ధకమైనట్టే లెక్క. కోదండపాణి అంటే సినీ సీమ మట్టిలో స్వర మాణిక్యం అని మరో పాతిక శాతం అనుకుంటే పాణి జన్మ ధన్యమైనట్టే. మిగతా యాభైశాతం మందికి ఆయన ఎవరో తెలియక పోతేనేం, అదీ ఎంతో మంచిదే. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆయన గురించి చెప్పే అవకాశం కలుగుతుంది కనుక. మరి ఆ గ్రహణం మాటేమిటీ? పున్నమి కాదు-చంద్ర గ్రహణం అనడానికి. అమావాస్య కానే కాదు – సూర్య గ్రహణం అనడానికి. రాహుకేతుల హాహాకారాలు అవన్నీ. ఇక్కడ ఆరుద్ర గారన్న మాట గుర్తొస్తోంది. ‘పరిగెత్తి వస్తోంది రాహువు- అయ్యో తరిగి పోతోంది ఆయువు’. అలా కోదండపాణి ఆయువుకి గ్రహణం పట్టిన రోజిది. 1974 ఏప్రిల్ 5న ఆయన్ని గుటుక్కున మింగేశారు గంధర్వ లోక వాసులు. ఆ ఏడాది అప్పటికే ఫిబ్రవరి 11న గంధర్వుల దృష్టి ఘంటసాల మాస్టారు పైన పడింది. ఏమిటో... ఒక వైపంతా టీవీ చానెళ్ళ గోల! మరో వైపు మొబైళ్ళ రొద! ఇంకొందరికి కంప్యూటరూ, ఇంటర్నెట్టూ....పిచ్చి పిచ్చిగా ఉంది కదండీ ఈ ప్రపంచం, విశ్వం గారూ’
‘గట్టిగా అనకండి లోకనాథం గారూ. మనవలు వింటే మనల్ని వేరే గ్రహం నుంచి ఊడిపడిన జీవుల్లా చూస్తారు. అయినా ఒక్క క్షణం టీవీ గానీ, మరేదైనా గాని లేని చోట ఒక్క గంట ఉండనిస్తే మీరు ఉండగలరా చెప్పండీ. చుట్టూ సందడిగా ఉన్నా మనలో మనం నిశ్శబ్దం అనేది సృష్టించుకోవాలి. మనకెంతవరకు అవసరమో అంత వరకే ఈ పరికరాలు ఉపయోగించాలి.’ ‘ఒహో ఒహో నిన్నే కోరెగా ...కుహూ కుహూ అనీ కోయిల’- పాట వింటుంటే సలీల్ చౌదరీ, ‘ఈ ముసిముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో’ –పాట వింటుంటే నౌషాద్ గుర్తుకొస్తారు. ఎందుకంటే కళ్ళు మూసుకునీ వింటున్నాం కనుక. ఒక్కసారి కళ్ళు తెరిచి ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలోని ఈ రెండు పాటలు చూస్తూ వింటే అప్పుడనిపిస్తుంది ‘అరె....ఇవి ‘ఈవిడ’ మీద పాటలా?’ అని. అక్కడ మన స్వరకర్త రాజేశ్వరరావు గుర్తుకు రానే రారు. పైగా దృష్టి అక్కినేని మీద నుంచి ఆవిడ మీదికి పోతుంది. 'ఈవిడ' చిరునవ్వు అలాంటిది, ఒక కోయిల గొంతులోని పంచమ స్వరంలా, ఒక పూవు పరచే పరిమళంలా. ఇంటిగుట్టు – సినిమాలో హీరో రామారావు, హీరోయిన్ సావిత్రి. అయితే అందులో ‘నాయుడోరింటికాడ నల్ల తుమ్మ సెట్టు కాడ సిటారు కొమ్మ మీద సెటాపటా లేసుకోనీ సిలకలల్లె కూకుందాము రాయే’ వంటి జానపదం చూడకుండా వింటే మల్లాది వారి రాతకి అబ్బుర పడడమెంత సహజమో, చూస్తూ వింటే ‘అరె ..ఇది 'ఈవిడ' మీది పాటా, పైగా గిలిగింతల జంబలకడి పంబ రేలంగి కూడా ఉన్నాడు’ అని విడ్డూరంతో విజిల్స్ వెయ్యడమూ అంతే సహజం. ఇదే సినిమాలో మరో చిలక పాటుంది. ‘బలు వన్నెల చిన్నెల దాన, వనరైన దాన’ అని ప్రారంభమౌతుంది ఆ పాట. వినగానే పల్లవి లోని పదాలబట్టి మల్లాది వారి రాతే అని ఈసారికి పసిగట్టేసినా, చూడగానే మాత్రం ‘అరె..ఇదీ 'ఈవిడ' మీది పాటేనా?’ అని పసితనపు అమాయకత్వం ముసిముసి నవ్వులు రానిస్తుంది. ‘చిట్టి తమ్ముడు’ సినిమా ఒకటుందని ఎప్పుడో మరచిపోయాం. (యూ ట్యూబు వింత ఏమిటంటే అక్కడ మనకి బాగా తెలిసిన సినిమాల పాత దృశ్యాలు లభించడం గగనమౌతుంటుంది. ఎప్పుడూ విననివి మాత్రం కోకొల్లలు). ఈ సినిమాలో ఇంతవరకూ చెప్పుకున్న ‘ఈవిడ’ పాటలు విడివిడిగా రెండున్నాయి. ‘మెరుపు మెరిసింది’ –పాటలో పాపం ఎప్పుడూ ఒక్క పాటకైనా నోచుకోని కండల విలనుడు రాజనాల కనిపిస్తారు (డబ్భయిల కాలంలో ఆంజనేయ వేషం వేయడంతో ఈయనకి పాటలొచ్చాయి అనుకోండి, అదృష్టవంతుడు). ఈ పాటలో మెరుపు,ఉరుము – వీటి అభినయం ‘ఈవిడ’ ద్వారా చూడగానే మనం కూడా కళ్ళూ చెవులూ తెరుస్తాం. అదీ 'ఈవిడ'కి తెలిసిన విద్య. ‘జమిందారీతనం వల్ల వచ్చిన వల్లమాలిన బద్ధకం’ తనకుందని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎన్నో సందర్భాల్లో అంటూ ఉండేవారు. పాట వ్రాసి ఇవ్వండి శాస్త్రి గారూ అని హడావుడి చేసే ఏ నిర్మాతా ఆయన చుట్టూ తిరగలేదు. ఆయన పాట కావాలనుకునేవారు ఆగేవారు. అది ఇన్స్టంట్ కాఫీ కాదాయె. అమృతం ధార. ఆగాల్సిందే. ‘ఎందుకే నీకింత తొందర?’ అని ఆయన తన తొలి సినిమాతోనే స్పష్టం చేయడంతో తరువాత ఏ నిర్మాత కూడా ఆయన్ని తొందర పెట్టలేదు. ఆగితే మంచి చిలక పలుకులు దక్కుతాయని వారికి తెలుసు. అలాగని శాస్త్రిగారు తన ధోరణిలో ఏదో రాసుకుంటూ పోలేదు. సినిమాలో సందర్భానికి సరిపోయేలా రాస్తూనే తన శైలిని మాత్రం త్యాగం చెయ్యలేదు. ఆయన తన చుట్టూ టేప్ రికార్డర్ పట్టుకు తిరిగేలా ఎవర్నీ శాశించలేదు. ఇక్కడో ముక్క అక్కడో ముక్క చెప్పి పాట అయిందనిపించే సవ్య సాచి కారు ఆయన. అయినా పాటలందు కృష్ణశాస్త్రి పాటలు వేరయా అని ఇటు నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులతో పాటు శ్రోతలకు కూడా తెలుసు. రికార్డులున్న రోజుల్లో ఎక్కడో దూరాన్నుంచి సినిమా పాట వినిపిస్తుంటే ‘కృ.శా. గారి పాటలాగుంది’ అని చెవులు తొందర పడేవి. నిజానికి ఆయన పాటకెటువంటి దృశ్యం అక్కర్లేదు. అదృశ్యంతోనే మనో చిత్రాన్ని దర్శించుకోవచ్చు. ఆ మనో చిత్రానికి న్యాయం కూర్చాలని ప్రతి స్వర కర్తా మడి కట్టుకుని మరీ స్వర పరిచేవారు. ఉదాహరణకి- చక్రవర్తి సంగీతంలో కొన్ని వేల పాటలు వచ్చి ఉండవచ్చు. ఆయనదో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఉండి ఉండవచ్చు. అన్ని వేలపాటల్లో కొన్నిటిని వేళ్ళమీద లెక్కించాల్సి వస్తే అందులో రెండు వేళ్ళ మీద వెంటనే వచ్చి వాలే పాటలు కృష్ణశాస్త్రి రచనలే. అవి- చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు, కుశలమా నీకు కుశలమేనా ...అన్నవే. రెండు పాటలూ యుగళ గీతాలే. ఆ రెండు కూడా బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడినవే. చీకటి వెలుగులు పాట శ్రావ్య రాగమాలిక. అది చక్రవర్తి గారిని ఉన్నత శిఖరాన కూర్చోబెట్టింది. కుశలమా – పాట ఎంత ఆధునికమో అంత శ్రావ్యమైనది కూడా. మరొకరు సత్యం. వీరు ఎప్పటినుంచో చిత్రసీమలో ఉన్నా, ఎన్ని పాటలకో హిందీ బాణీలు ప్రేరణగా తీసుకున్నా శాస్త్రిగారి పాటలు తన చేతిలో పడేసరికి తన స్వంత బాణీలోని సత్తా చూపించుకున్నారు. ఎదుటనుంచి కదలను పదములింక వదలను, నేటికి మళ్ళీ మా ఇంట్లో ఎంచక్కా పండుగ, దూరాకాశ వీదుల్లో తారా దీపాలు, రామా ఓ రామా రావా కనరావా - ఈ పాటలన్నీ ఆయన చక్కగా చెక్కిన స్వర శిల్ప రూపాలు. ‘అవునా నిజమేనా?’ రేపటి రేయి పున్నమి రేయేనా? ‘రేయైతే వెన్నెల బయలంత’ నిండేనా? అయితే ‘పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే?’ అసలు ‘ప్రతి రాత్రి పున్నమి’ కాగలిగితే ఎంత బావుణ్ణు! ఆ పాన్పుపైన పరుండి నా స్వామిని చూడాలి. నా చందమామను చూడాలి. ‘అనుకోనా ఇది నిజమనుకోనా?’ ‘చందమామ ఈ కనులకు విందేనా?’ ‘ఎందుకు ఆ చందమామ? ఎవరి విందుకోసమో?’అని ‘ఎవరు ఏమని’ గుసగుసలాడినా... ‘ఔరా! కోరికలు,కలలు తీరా నిజమైతే?’ ‘జాబిలి కూన’ ‘ఎదుటనుంచి కదలను’... ‘గగన సీమల తేలు ఓ మేఘమాలా’, ‘కాస్త ఆగు’.. ‘ఆగు ..రవంత ఆగు’....‘ఆకాశపు అంచుల విహరించే చందమామ.. అవును..ఆ ‘చందమామ పైని ఏ మబ్బులు ముసరరాదని’ ... ‘మరి మరి విన్నానులే’. అటువంటి ‘తరగని తగ్గని జాబిలి’ వస్తుంటే ‘వాకిటిలో నిలబడకు’ ఏదో..‘మోయలేని ఈ హాయిని మోయనీ ఒక్క క్షణం!’ ‘అవునే.. తానే..నన్నేనే...నిజమేనే’ చూడ వస్తున్నాడు. ‘ఒరిగింది చంద్రవంక...ఒయ్యారి తార వంక’ అనో, ‘నెలవంక పక్క ఈ తళుకు తార మెరవాలి’ అనో అక్కడెక్కడో ‘ద్వారానికి తారామణి హారం..హారతి వెన్నెల కర్పూరం’ అమరిన చోట అనుకుంటే విన్నాను. కాని ఇప్పుడో.. ‘అందేనా ఈ చేతుల కందేనా? పోనీ ‘నింగి పైకి ఆశలనే నిచ్చెన’ వేస్తేనో? అమ్మో.. అది నా వల్లనయ్యే పనేనా? అయినా ‘మాటలాడగానే సరా? మనసులో నిజం పలకాలి’ ‘కృష్ణప్రేమ’ రూపం మారింది కదూ... చిన్నప్పుడు పుట్టిన రోజు నాడు కొత్త బట్టలు వేసుకుంటూ ఎంత మురిసిపోయే వారమో కదా.. అలాంటిది ‘కృష్ణప్రేమ’ కి కూడా పుట్టిన రోజు వస్తే కొత్త ముస్తాబు తొడగడం సమంజసమే. ఇప్పుడు ముచ్చటైన మూడో యేట ప్రవేశించింది. ఏ(విటీ... అప్పుడే రెండేళ్ళు అలా అలా అవలీలగా దొర్లిపోయాయా? ఏళ్ళతో బాటు కబుర్లూ అంతే వేగంగా దొర్లిపోయాయి. ఈ కబుర్లెలాంటివంటే... గాంధి హృదయం నుంచి ఘంటసాల గుండె వరకు, మెహదీ మాధుర్యం నుంచి మహమ్మద్ రఫీ ఔదార్యం వరకు, నండూరి కలం నుంచి నటరాజ కాలి గజ్జెల వరకు, కృష్ణశాస్త్రి మాట నుంచి కోదండపాణి పాట వరకు, వీటూరిజం నుంచి వేటూరిజం వరకు, ఖలే సంగీతం నుంచి ఖన్నా నటన వరకు, జగ్జీత్ ఘజల్ ఫ్లో నుంచి జపాన్ సునామీ వరకు, సుసర్ల వారి గానం నుంచి అవసరాల వారి అవయవ దానం వరకు, మల్లాది మరుమల్లెల నుంచి మల్లెమాల విరిజల్లుల వరకు, రామారావు లోని ఎన్టీఆర్ అనే అక్షర విన్యాసం నుంచి రమణ లోని చెమక్కు అనే అణ్వాస్త్రం వరకు, దాశరధి శతకం నుంచి దేవానంద్ వాచకం వరకు... ఒకటీ రెండూ కాదు ..మూడు వందల అరవై అయిదు + మూడు వందల అరవై ఆరు ..అంటే ...ఏడువందల ముప్ఫై ఒక్క రోజులకి ..కాదు కాదు మూడువందల యాభై నాలుగు + మూడు వందల ఎనభై నాలుగు (అధికమాసం వల్ల) ఈక్వల్టూ ఏడువందల నలభై ఎనిమిది తిథుల వరకు ...ఇంత సుదీర్ఘకాలం ఇంట కూర్చొనీ ఇంటర్నెట్ ద్వారా ఇంటింటికి చేర్చిన కబుర్లు. ఎవరండీ రాజా సాబ్? ఏ సీమ నేలిన దొరలు వారు? ఎవరండీ రాజా? ఏ రాజ్యంలో సిరులు దొరలించిన వారు? ఎప్పుడైనా ‘శభాష్ రాజా’ అని ఎంతమంది చేత అనిపించుకున్న వారు వీరు? అప్పుడప్పుడైనా ‘రంగేళీ రాజా’ అని వెనకన చేరి వెక్కిరించిన ఏ నలుగురి దాడికో గురైన వారా వీరు ? రాజా అంటే తన రాజ్యం పట్ల, తన జాతి పట్ల అంకిత భావం ఉన్నవాడే ..వీరు అటువంటి వారా? రాజా అంటే రాగం, భోగం రంగులని జనం, జాగృతి వెలుగులని నమ్మి పాలించే వాడే...వీరు అలాంటి వారా? ఓహో...వీరిది ఊహా సామ్రాజ్యమా? అహో...వీరిది స్వప్న పరిపాలనమా? ఊహా సామ్రాజ్యమైతే గగన విహారి కావాలి వీరు. ‘నెలరాజా’ అని పేరు పొందాల్సిన వారు వీరు.. అమవస నిశినే తప్ప నెల పొడుగునా అంతో ఇంతో సూర్యుడినుంచి సంపాదించుకున్న వెలుగుని భూమాత సంతతికి పంచిపెట్టాలనే తపన ఉన్నవాడు కనకనే చిమ్మ చీకటి గగన సామ్రాజ్యానికి ‘వెన్నెలరాజా’వారు వీరు. ‘లే యెన్నెల ఇరజిమ్ము’ సందమామ నావోడు ఉండగా నా గృహమే కాదా ‘స్వర్గసీమ’ అని ఎలుగెత్తి చాటే జనపదం సంతోషాన్ని నిత్యం చూస్తూ అమవాస్యలో తన ఆయు దోషాన్ని దాచేసి మళ్ళీ ‘పాదయాత్ర’ చేపట్టే నిజమైన రాజా వారు నెలరాజా వారు. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|