మునుపటి నా మాట
‘సూర్య ‘భగభగ’ వానుడు అని ఈమధ్య ఓ ప్రముఖ న్యూస్ పేపర్ లో వచ్చిన హెడ్డింగ్ చూశాను. ఎవరి ‘పన్’ డిత్యమో గానీ , బాగానే ఉంది!’ ‘ఏం బాగో? ఎండలు మాడి మసి చేస్తుంటే’. ‘ఇదేం కొత్తకాదు, మన అమ్మమ్మల చిన్నతనంలో ఉన్నట్టే ‘రోహిణీ కార్తుల్లో’ ఎండలు ఇప్పుడూ ఉంటున్నాయి. అయితే ఓ పదేళ్లుగా ఏ ఏటికి ఆ ఏడే ‘ఈసారి ఎండలు నెత్తిని నిప్పుకుండలు’ అని ఉక్క భరించ లేక తిక్క తిక్కగా ప్రవర్తిస్తున్నాం. ఎండల్లాగే పుచ్చు రాజకీయాలు మన బుర్రల్ని దొలిచేస్తున్నాయి. అలా ఊడిపడిన పెచ్చులు ‘భూగోళ తాప ప్రభావం’ అని సరిపెట్టుకుంటే సరి. పాత ఊరే మన కొత్తగూడెం. కాని అత్యధిక ఉష్ణోగ్రత 51 డిగ్రీలకి చేరుకునీ ఎప్పటికప్పుడు కొత్తగా గిన్నీస్ రికార్డ్ కెక్కబోతుంటే తన్నేసి పోతున్నారు. కొన్నేళ్ళ క్రితం కూడా రామగుండం లో ఇలాగే 50 డిగ్రీలు దాటితే అది రికార్డ్ కెక్కడం చూశామా? సూర్యుడు పాపం ఎండలో రథమేసుకునీ సంవత్సరం పొడుగునా తిరగాలి. ఆ రథానికి ఏడు గుర్రాలు.’
‘మీరు మరీనూ, ఏ కాలం నాటి కబుర్లండీ మీవి! మన కంటికి గోచరించే ఏడు రంగులనే ఏడు గుర్రాలన్నారనండి’. ‘పన్నెండుగురు సూర్యుళ్ళు ఉంటారట’ ‘ఇదిగో, మళ్ళీ పాత వాసన! పన్నెండు నెలల్లో ఒక్కో నెలా నేల మీద ఒక్కో రకం తాపం ఉంటుంది కాబట్టి అలా ఏడాది పొడుగునా పన్నెండు మంది సూర్యుళ్ళు ఉన్నారని చెబుదురూ. సర్లెండి. ఈ పూట మీ మాటే వేదం’. ‘మబ్బులు వస్తే సూర్యుడి నుంచి తిన్నగా వచ్చే ‘వికిరణం’..’ ‘రేడియేషన్ అందురూ సింపుల్ గా’ ‘...కాస్త మనమీద పడక అలా వెనక్కి మళ్ళీ శూన్యంలోకి పోతుంది. వాయు మండలం ఉంది చూశారూ అది మనకి రక్షా కవచం. మబ్బులుంటే సరా, గాలిలో తేమా, గాలి వేగం, గాలిలో తేలే చిన్న చిన్న కణాలూ ఇంత సంతాన సౌభాగ్యం లేందే ఆ పిసరు నీళ్ళ భాగ్యమెక్కడిదీ? సూర్య దేవుడు, వరుణదేవుడు కూడబలుక్కోవాలి. ‘కరుణించవా వరుణ దేవా’ అన్నప్పుడే బొచ్చెడంత జల దయా భిక్ష వచ్చి పడేది’ ‘ఇదిగో మళ్ళీ పురాణాల్లోకి వెళ్ళిపోతున్నారు. నాకు వానలో ఇంద్ర ధనుసు చూడాలని ఉంటుంది. ఎంచక్కా ఏడు రంగుల ‘చాపం’ అమాయక పల్లెటూరి అమ్మాయి చెవి రింగులా అందంగా ఉంటుంది కదూ. ష్, ‘ధనుష్’ అని అనలేదండీ .. మళ్ళీ కొలవరి డీ.. అనుకుంటూ కుర్రతనం వెర్రితనం మొదలౌతుంది’ ‘ఇంద్ర.... పేరెత్తి మీరు మాత్రం పురాణాల్లోకి వెళ్లడం సబబే అన్నమాట’ ‘అబ్బబ్బే. అలవాటు చేశారు మీరు. అలా అనేశాను’ ‘సూర్యుడు ఒక్కొక్క నక్షత్ర మార్గంలో రథయాత్ర చెయ్యడానికి పదమూడు రోజులు పడుతుంది. దీన్నే ‘కార్తె’ అంటాం. ఇప్పుడిది ‘రోహిణీ కార్తె’. రోహిణిలో రోకలి బద్ధలు కావడం – సామెత. చండ ప్రచండ మార్తాండ తేజం అన్ని వైపులా ‘ఉష్ణ తరంగాలు’ మోసుకొస్తుంటే ఇప్పుడే అందిన శుభవార్త – అండమాన్స్ లోకి మాన్ సూన్ బుడి బుడి అడుగులు వేసిందని. ఇంక దాని జబ్బ మీద ఒక్క దెబ్బ వేసి కొబ్బరి తోటల కేరళ వైపు లాక్కు రావాలి. ఎవరు చెయ్యగలరా పని? వాయుదేవుడా? వరుణుడా? ఎంత ఎదురు చూపు, ఆకాశ మార్గం నుంచి పడే వాన కోసం. వేటూరి వారు ‘గోదావరి’ సినిమాలో అన్నట్టు ఆకాశమనే దుప్పటి చిల్లులనుంచి నీరు ఒలకబోస్తే నేనన్నట్టు జల్లుల జల్లెడ కనిపిస్తుంది. వానొస్తే ఏదో ఆనందంలో కేరింతలు కొడుతూ తడిసి ముద్ద కావడం సినిమాల్లోనే కానీ బయట బావుండదు. పైగా కొందరు దోసిలి పట్టి వాన నీరు తాగేస్తుంటారు కూడా. మంచిదికాదు. తెలుగు సినిమాల్లో మొట్టమొదటి ‘వాన’ సీను ‘జగపతి’ వారి పుణ్యమా అని ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే ..’ మొదలైంది. అలా వాన ‘ఆత్మ బలం ’ ఎక్కువై ఆత్రేయ గారు అలాంటి పాటలెన్నో అవలీలగా రాసి పారేశారు. ఆత్రేయ గారు ఉరుములు, మెరుపులు ఉన్న వేళ చెట్టు నీడకై పరిగెడితే ‘చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుంద’ని ఉపదేశించారు. వానా కాలం వాన జల్లుల్లో ఫరవాలేదు కానీ మెరుపుల వానలో అలా చెట్టుకింద తలదాచుకోవడం మంచిది కాదు. ‘భస్మాసుర’ భస్మం అయ్యే ప్రమాదముంది. అక్కినేని, సరోజాదేవి గార్లు మన కోసం ఆ వాన సీనులో తడిసి తడిసి పాపం వారం రోజులు రొంప తో ‘రొంబ’ కష్టాలు పడ్డారు మదరాసులో’. ‘అంతకు ముందే ఎస్.రాజేశ్వర రావు గారు ‘గాలివానలో ఎటకే ఒంటిగ కాలి నడకన పోయెదవబలా’ అని ఒక ప్రైవేట్ సాంగ్ పాడారండోయ్ . అది కేవలం రేడియోలో వచ్చిన ఆడియో కనుక, వాన అంటే వీడియో స్పెషల్ కనుక, కనులు పొందే మజా చెవులు పొందలేవు కనుక, అది అప్రస్తుతం వీక్షకులకి’ ‘కొన్నాళ తరువాత ఇదే దేవి గారు మళ్ళీ వాన బారిన పడి ‘వాన కాదు వాన కాదు వరద రాజా’ అంటూ రాజా గారి ‘భాగ్య చక్రం’ తిప్పారు. ఒక లలితమ్మ ‘ముత్యాల జల్లు కురిసే, రతానాల మెరుపు మెరిసే’ అని నవరత్నాల వాన పట్ల ఆసక్తి చూపించారు. ఇంకొక విజయ లలితమ్మ ‘కురిసింది వాన నా గుండెలోన’ అని గుండెని కుండగా మార్చేశారు. ఏ హీరోయిన్ అవసరం లేకుండా వానలో తడిసిపోతున్న హీరో ఒక్కరే ‘గాలివానలో వాన నీటిలో’ అని వెనక నుంచి వస్తున్న ఏసుదాస్ కంఠంతో పాడడం ఒకాయన కార్లో కూర్చొని గమనించి పాట పూర్తవ్వగానే ‘నాతో రావోయ్’ అని సైగ చేశారు, తరువాత ఆయన హీరోని మారుస్తారో, ఏమారుస్తారో వెండి తెర మీద చూడవలసిందే. మరొక జంట, జనం లేని చోట వానలో తడిసి తడిసి ముద్ద అయ్యి ‘జోహారు జోహారు ఈ వానకి’ అని ప్రకృతికి నీరాజనం పలికింది. ఇక అక్కణ్నుంచి ఆకుచాటు పిందె, కోకచాటు పిల్ల తడవడం మామూలై పోయింది’. ‘ఇవన్నీ సినీ ప్రేక్షక జనాకర్షణా శక్తికి కొలమానాలు’. ‘హిందీ సినిమాల్లో ముఖ్యంగా రాజ్ కపూర్ సినిమాల్లో వాన గానీ పడితే హీరోయిన్ మీదే పడాలా పాపం?’ ‘రోటీ కపడా ఔర్ మకాన్’ అనే మనోజ్ కుమార్ సీరియస్ సినిమాలోనూ హీరోయిన్ బందీ అయి వానలో తడిసి తడిసి పాడుతుంది’ ‘సినిమాల్లో ఇంకో రకం వశీకరణ విద్య ‘ఈత కొలను’ కలిగిస్తుంది. ‘అరెరెరె... ఎట్టాగో ఉన్నాది ఓ లమ్మీ’ అని మొలబంటి నీళ్ళలో మొగ్గల్లే ఉన్న హీరోయిన్ ముందు దసరా బుల్లోడు తన తాపాన్ని వెళ్ళబోసుకుంటాడు. ‘తడి తడి చీరా తళుక్కు మంది’ అని మరో షైనింగ్ స్టార్ ఒడ్డునే ఉండి బొద్దుగా ఉన్న హీరోయిన్ ని కవ్విస్తాడు. వద్దు వద్దు అని హీరోయిన్ అనదేం? రాజ కపూర్ ఓ వాయిద్యం వేసుకునీ చెట్టు కొమ్మెక్కి కూర్చునీ నదిలో ఈత కొడుతున్న వైజయంతిని ‘ నా మనసే గంగైతే , నీ మనసే యమునే కాదా .. చెప్పు రాధా చెప్పు.. సంగమం కుదిరేనా లేదా?’ అని సతాయిస్తుంటే ఎన్ని సార్లో ఆ సీన్ చూసి ‘పిప్పిరిపిప్పిరిపీపీపీ’ అని ఆ పాట మ్యూజిక్ తో సహా అన్నిసార్లూ ఇంటికొచ్చి పాడుకునేవారు. ఆ రోజుల్లో సిలోన్ నుంచి ప్రసారమయ్యే బుధవారం నాటి ‘బినాకా’ గీత్ మాలాలో ఈ పాట ‘టాప్’ అయింది కూడా. ‘తడుపుడు పాట ‘ వీడియో గానే కాదు ,ఆడియో గానూ హిట్టు కావడం ప్రారంభమైంది అప్పటినుంచే. మళ్ళీ చెప్పాలంటే రాధ పేరు వినగానే కృష్ణుడు గుర్తొస్తాడు’. ‘దేనికైనా పాపం కృష్ణుడే రిఫరెన్స్ మనకి’ ‘‘కొలనులోన మును గోపికలు మొలక నవ్వుల నిను మ్రొక్కిరి’ అని అన్నమయ్య గుర్తు చేశారు. కొంటె కృష్ణుడు అలా కొలనులో మునిగి తేలుతున్న గోపికల చీరలు తస్కరించాడట. తెలుగు కవి సినిమా కోసం ఏం రాయాల్సి వచ్చిందీ.. ‘ చీర దొంగిలించి అమ్మీ చిటారు కొమ్మన ఉన్నాను ..’ అనేగా? అంటే కత్తిలాంటి హీరో తన అడ్రస్ చెబుతుడాన్నమాట. ‘ముందు నా డ్రస్ ఇవ్వవయ్యా బాబూ’ అని మనసులో అనుకున్న హీరోయిన్ పైకి మాత్రం ‘కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా’ అని లంచమిచ్చి మొత్తానికి చీరనీ, హీరోనీ సాధిస్తుంది. హీరో కత్తి సంగతి మరచిపోతాడేమో, తెలియదు. పనిగట్టుకునీ అన్ని సినిమాలూ ఎవడు చూస్తాడూ..’ ‘అందుకే కదా ముందస్తుగా ఆరోజుల్లో రికార్డులూ ఈ రోజుల్లో ఆడియోలూ రిలీజ్ అయ్యేది. పాటల్లో తడిసిన చీరలూ, విడిచిన నీళ్ళూ అన్నీ ఉండడం విని వెర్రెత్తిపోయి జనాలు ఆనక సినిమా చూస్తారనేగా?’ ‘సముద్రపొడ్డున నిక్కర్లు వేసుకునీ హీరో, హీరోయిన్లు పరుగులు తీయడం మరో వశీకరణ విద్య. కూలింగ్ గ్లాస్ తగిలించుకునీ ఎండలో చిరునవ్వులు చిందిస్తూ విదేశీ వనితలు ‘గో ఎహెడ్’ అన్నట్టు వీళ్ళకి ‘హాయ్’ చెబుతారు. ‘నేనసలు ఇలాంటివి చూడను అని మడి కట్టుకున్నవాడు కూడా ‘బోనస్’ రోయ్ అని ఎవడో చెబితే గప్ చుప్ గా సినిమా చూసొచ్చి గులాబ్జాం కలల్లోకి జారిపోతాడు. తెలుగులో తొలి వాన సీన్ వచ్చిన తరువాత స్విమ్మింగ్ పూల్ చూపించే ధైర్యం వచ్చేసింది నిర్మాతలకి. ఒక హీరోయిన్ తొలిసారిగా పరిచయమౌతూనే ‘సిగ్గేస్తోందా ..మొగ్గ వంటి చిన్నదొచ్చి’ అని స్వి.పూ దగ్గర ముడుచుకు కూర్చున్న హీరో గారిని ఆట పట్టించింది. ఈ ఫార్మూలానే రివర్స్ చేసి స్వి.పూ లో చేప పిల్లలా ఈదుతున్న మరో నాజూకు హీరోయిన్ ని చూసి హీరో ‘చిన్నారీ బుల్లెమ్మా సిగ్గెందుకు లేవమ్మా’ అని ఆట పట్టించాడు తరువాతి కాలంలో. ఆమె మధ్య మధ్యలో పైకి లేస్తూ తారసిల్లి ‘యూ సిల్లీ’ అనడం ప్రేక్షకులకి మరీ బావుండేది. ఎవరైనా ఒక విషయం అమయాకంగా కనిపెట్టి ‘ సార్ ..సార్ ..సినిమాల్లో ‘ఈత కొలను’ లో ఆడవాళ్ళే ఎందుకుంటారూ?’ అని అడిగితే మీరైనా సరే ‘‘వీడెవడండీ బాబూ, ‘కలాపోసన’ బొత్తిగా తెలీని రకంలా ఉన్నాడు’’ అని అనుకుంటారా లేదా?’ ‘అసలు పురాతన కట్టడాలున్న ప్రదేశాలకి వెళితే టూరిస్ట్ గైడ్ తనకే అన్నీ తెలుసు అన్నట్టు ‘ఇది ఈ ఫలానా రాజుగారి దర్బారు, ఆ వెనక రాణి గారి అంత:పురం, ఆ మూల అదుగో ఆ ఖాళీ స్థలంలో బావిలా ఉందే అక్కడ రాకుమార్తె జలకాలాడేది’ అని చెబుతూ ఉంటే తలలాడిస్తూ వింటూ, వేలు చూపే చోటుని వెర్రిగా చూస్తూ గడిపేస్తాం’. ‘నా మనసులోని మాట పసిగట్టేశారు... వస్తున్నా అక్కడికే... తెలుగు సినిమా తొలిదశకంలో భక్తి పాళ్ళు ఎక్కువై మలి దశలో మెల్లగా ‘జానపద చిత్రాలు’ తీయడం మొదలెట్టారు. అమాయక రాజు, ఆరిందా రాణి, చెడ్డ బావమరది, సౌమ్య రాకుమారీ, ఓ గడుసు పేదవాడు ... ఇలా ఓ పంచ పాత్ర తో చండీ చాముండీ పూజలతో చాలా సినిమాలొచ్చాయి. గొప్ప మేధావి కె.వి.రెడ్డి గారు ‘పాతాళ భైరవి’ సినిమాని ఓ అద్భుత దృశ్య కావ్యంగా మలిచి జానపదాల పట్ల ప్రజల్లో కొత్త రకం ఆసక్తిని కలిగించారు. అందులో రాకుమారికి తోటరాముడు ఎలా పరిచయమవ్వాలో మంచి స్క్రీన్ ప్లే అల్లారు రెడ్డి గారు. రాకుమారి తోటలో వసంత శోభ గురించి పాడడం మాత్రమే చూపించారు అప్పటికి. ఇదే రెడ్డి గారు తొలిసారిగా ‘జగదేకవీరుని కథ’లో ఒక చిన్న వనంలో ఒక కొలనులో నలుగురు దేవకన్యలు ‘జలకాలాడడం’ అనే ‘కాన్సెప్ట్’ ప్రవేశ పెట్టారు. అప్పుడే మానవవీరుడు హుటా హుటిని ఆ వైపు వచ్చి పాటంతా విని కబుర్లాడతాడు ఆహా ఏమందం అని మురిసిపోతాడనుకుంటాను. దివ్య రమణీమణుల్లో సరోజాదేవిని ఎల్విజయలక్ష్మీ, జయంతీ, మరొకామె మళ్ళీ జలకాలాడి ‘వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా?’ అని సతాయిస్తారు. ఈసారి కాబోలు మానవుడవ్వడం వల్ల వీరుణ్ణి శిలగా మార్చి వెళ్ళిపోతారు. ఒకే సినిమాలో రెండు జలక్రీడలు నిజంగా ఒన్ ఆఫ్ ది సర్ప్ర యిజింగ్ థింగ్స్ ఆఫ్ ది టయిమ్ సుమండీ. మీకు తెలుసా.. పాపం అమ్మాయిలకి చన్నీళ్ళయితే ఇబ్బంది కదా అని సిబ్బంది చేత గోరు వెచ్చని నీళ్ళు పోయించారట రెడ్డి గారు’. ‘ఇప్పుడా... ఎంత వణికిస్తే అంత విపణి సినిమాకొస్తుంది’ ‘జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా’ అన్న ఆ పాట ఆ రోజుల్లోనే కాదు ఇప్పటికీ జనాల నీరాజనాలు ...నీరు సంబంధమని కాదు.. నీట్ నెస్ పరంగా....అందుకుంటోంది. పింగళి నాగేంద్ర రావు కలం నుంచి వచ్చే మాటలే కాదు పాటలూ స్పెషలే కదా. ‘హలా’ అంటే ‘హలో’ కి వికృతి పదం అనుకునే వారు. తరువాత తెలుసుకున్నారు ‘సఖీ’ అనే అర్ధం దానికుంది అని. నిజానికి సంస్కృత ‘హలా’ ని ఆంగ్లేయులు ‘హలో’ కరించుకున్నారేమో! పింగళి వారు ఈ పాటలోనే ‘ఉన్నది పగలైనా ..అహ.. వెన్నెల కురిసేనే’ అని చమత్కరించారు. అంతకు ముందే ‘మాయాబజార్’ లో కె.వి.రెడ్డి గారు ‘నౌకా విహారం’ అనుకోవడం, ఈయన పాట రాయడం జరిగి పోయాయి. మార్కస్ బార్ట్లే అనే మరో మేధావి మిట్ట మధ్యాహ్న ఎండలోనే ‘వెన్నెల’ షాట్ తీశారు. ఆ పాట ఇప్పటికీ పాత బడని కొత్త పాట, కొత్తగా రంగు పూసుకొచ్చిన పాత పాట! ఈ సందర్భమే పింగళి వారి చేత ‘జలకాలాటల’ పాటలో ‘పగటి వెన్నెల’ భావం పలికించేందుకు ప్రేరణ అయ్యి ఉండాలి. ‘పగటి వెన్నెల’ అని అనలేదు కానీ అంతకు ముందే శ్రీశ్రీ ‘మాంగల్య బలం’ చిత్రంలో ‘ పగలేజాబిలి ఉదయించె నేల?’ అని ప్రశ్న వేశారు. సమాధానం ఇలా ఇచ్చారు- ‘తేటనీటను నీ నవ్వు మొగమే తెలియాడెను నెలరేని వలెనే’. అయితే- అక్కడో చిన్న కొలను దగ్గర హీరోహీరోయిన్లు ఇలా సరస భాషణలతో ముచ్చటించుకున్నారే కాని నీళ్ళలో మునగలేదు. ఇక్కడ కేవలం ‘అద్దంలా ఉన్న తేట నీటి ప్రసక్తి వచ్చింది. అంతే. బహుశా అక్కడ జగదేక కన్యల జలకాల నీటికి ఈ భావం తోడై పింగళి వారికి లాభం కలిగిందేమో. ఇక ‘జలకాల’ సీన్లు ఇతర జానపద చిత్రాల్లోనూ త్వరత్వరగా అమలు కావడం ప్రారంభమైంది. జానపద బ్రహ్మ అని బి. విఠల ఆచార్య వారికి బిరుదుంది. ఆయనే కాదు- గిడుతూరి సూర్యం, కె.ఎస్.ఆర్.దాస్, జి.విశ్వనాథం, హెచ్.ఎస్.వేణు, పింజల సుబ్బారావు, ఎస్.భావనారాయణ, పి.మల్లికార్జునరావు మొదలైన దర్శక నిర్మాతలకది మంచి కాలం. మధ్యలో పుల్లయ్య గారు ‘జయభేరి’ మ్రోగించారు. జాను తెనుగు కవి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు పాటలతో ప్రతిధ్వనించారు. పొదుపు మాటలతో పొడుపు కథలు చెప్పాలంటే మల్లాది వారే ఆదీ ఆఖరూనూ. అందులో ఇలా ఉంది- నీటిపైన కలకలా కొమ్మమీద కిలకిలా విలవిలా కిలకిలా ఏమిటా కథ? చినదానా ఏమిటా కథ? చేపలు పచ్చులు చెప్పు ! కాదు- కప్పలు కోతులు , యహే.. అది బెకబెకా యికయికా .. ఏం, చెప్పనా ... చెప్పనా? చెప్పరాదో...ఆ( ఆ(... చలిలో యమునా నదిలో జలకాలాడే కన్నెలు కలకల వలువలు దాచిన కృష్ణుడు కిలకిల ... కిలకిల తెలిసిన కన్నెలు విలవిల.. అక్కడ విలవిల ..ఇక్కడ కిలకిల... చివరికిదీ కథ చినదానా ...’ ‘ఆహాహా... మళ్ళీ జన్మంటూ ఉంటే ఇప్పటి తెలుగువాణ్నిగా కాదు అప్పటి మల్లాది వారిగా పుడతానండీ’ ‘బేష్.. పింగళి వారినీ, దేవులపల్లి వారినీ విన్నప్పుడూ అదే కోరిక కలుగుతుంది. వాళ్ళ అదృష్టం అది. ఓ పేద ముంగిట వాలిన రాచిల్క అవస్థను చూసిన గోరింక చిలకతో ‘జలకాలాడగ పన్నీరు’ లేదు’ అని వాపోవడం విన్నారా...’ ‘అది.. సినారె వారన్నారా?’ ‘అంతకన్నా బాగా అనగలిగేవారు ఇపుడు ఉన్నారా? ఎన్నో జానపదాల చిత్రాలకి ఆ రోజుల్లో టి.వి.రాజు, ఎస్.పి.కోదండపాణి, విజయా కృష్ణమూర్తి త్రయం సంగీతమిచ్చి అద్భుతాలు సృష్టించారు. నీళ్ళ శబ్దాలు లేకుండానే వాళ్ళ స్వరాల చలువతో పాటలు పేట్రేగిపోయాయి. టి.వి.రాజు గారికి ఒక సాంఘీక చిత్రంలో కూడా జలకాల పాటకి వరస కట్టే అవకాశం దక్కింది. జలకాల పాటలో చరిత్ర పాఠం చెప్పే అవకాశం ఆచార్యులు డా. సి.నా.రె గారికి కలిగింది. ‘విచిత్ర కుటుంబం’ చిత్రంలో విన్న ‘ఆడవే జలకమ్ములాడవే’ – ఆ విధంగా ఒక వినూత్న ప్రయత్నం. ఒక విదేశీ యువతిని దేశీయుడు పెళ్లి చేసుకునీ, తేనెచంద్రుడి యాత్రలో భాగంగా ఆంధ్ర ప్రాంతం అంతా ఆమెకి చూపిస్తూ ఉన్న నదుల్లో ఒక్కొక్క దాని ‘నీటి’ ప్రశస్తి వివరిస్తూ ఆ నీళ్ళలో జలకాలాడమని చెప్పడం ఆ రోజుల్లోనే కాదు, ఇప్పటికీ అది నవ్యత్వమే. కోదండపాణి అందరికన్నా తనవే ఎక్కువ ‘జలకాల’ పాటలని పాపం ఏనాడూ నోరు విప్పి చెప్పలేదు. ఎవరూ పట్టించుకోరు ఇలాంటివి. తనవైన గమకాల ప్రత్యేకత చూపిస్తూనే భిన్న భిన్నంగా వరసలు కట్టి ఆయన ఓ పది దాక జలకాల పాటలు చేసి ఉంటారని చెప్పొచ్చు. అందులో మచ్చుకి కొన్ని- చెలియా సఖియా ఏమే ఈ వేళ చలిగా ఉన్నదే (జాతకరత్న మిడతంభొట్లు), ఉయ్యాలో ఉయ్యాలో ఉయాలో (గోపాలుడు భూపాలుడు), తుమ్మెదలు కొమ్మల ఝుమ్మని మూగే (గురువును మించిన శిష్యుడు), యేలుకోను రాజు ఎక్కడున్నాడో (భలే మొనగాడు), ఏనాడు లేనిదీ ఈనాడు అయినదీ (ఇద్దరు మొనగాళ్ళు ), జలకాల లోన పులకించి పోనా ( పేదరాశి పెద్దమ్మ కథ), ఏటికీ ఎదురీదకూ (మహాబలుడు). నా వయసు సుమగంధం (లక్ష్మీ కటాక్షం) . ఈ ‘మహాబలుడు’ పాట ‘నీళ్ళలో’ మనుషులు తిరుగాడుతుండే దృశ్యాన్ని చూపిస్తుంది. అంతే కానీ జలకాలు కాదు. ట్రిక్కుల రవికాంత్ నగాయిచ్ దీనికి దర్శకులు. మీనంలా జలకాలాడక పోయినా ‘నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు’ అని మీనాక్షి గట్టు మీద కూర్చునీ పాడడం ‘ఏకవీర’ లో చూపించారు. సినిమా నీట మునిగినా ఈ పాట ప్రేక్షకుల గుండెల్లో తేలింది. నీరు- మహాశివుడి చలవ అయితే ఈ నీటి పాట స్వరకర్త మహదేవన్ చలవ (నారాయణ కవి సహకారంతో)’ ‘ అరరే.. మండు వేసవి మాటే మరచిపోయాం. తొలకరి లోకి ఎప్పుడెప్పుడా మన పయనం అన్నది ఈ ‘జలకాల’ మాటల్లో పడి మరచి పోయిన మన వైనం అందరిదీనేమో..’ ‘నిప్పులు చెరిగే వేసవితోనే తేనెలు కురిసే వానొస్తుంది’ అని సి.నా.రె కవి నొక్కి వక్కాణించినా ఇంకా ఎందుకు ‘డౌటేహం?‘నీరు లేని ఎడారిలో కన్నీరు తాగి బతకాలి’ అని ఆయనే కదా చెప్పారు. ఎడారిలా ఎండ ఎడాపెడా చిరాకు పెడుతున్నా అది చినుకు చిరునామా తెలిసిపోయాక అడ్రస్ లేకుండా పోతుంది. ‘కురియు నా కన్నీరు గుండెలో దాచుకొని వాన జల్లుగ కురిసి పోవా’ అని కృష్ణశాస్త్రి గారు వేడుకున్నట్టే ‘మేఘమాల’ ను వేడుకుందాం’. ‘Rain Rain Go Away ’ అని మనం అనలేం. ‘వానా వానా వల్లప్పా’ అని అనకుండా ఉండలేం. ‘వానా వానా వలదప్పా’ అంటే భరించలేం’. ‘చూద్దాం -‘వా వా వా’ అనే తమిళం మాట విని వానదేవుడు సీగ్రమ వస్తాడో, ‘నా నా నా’ అనే హిందీ మాట విని ‘దేర్’ చేస్తాడో ......మనకోసం! ఇప్పుడిప్పుడే ఈ ‘రోహిణీ కార్తె’ లో అండమాన్స్ లో వరుణుడు అడుగు పెట్టాడు. తరువాత కేరళ కొబ్బరి కాయ రుచి చూసి రాబోయే ‘మృగశిర కార్తె’ లోకి సూర్య రథం కదలగానే .....ఇక ‘జల్లులు జల్లులు జల్లులు ..తొలకరి వాన జల్లులు ...’ అక్కడక్కడా హరివిల్లులు....’ (జలకమ్ములాడగా ......కనులు చూసినా పాటే, కనులు మూసినా పాటే......) కొసమెరుపు: పరుగులు తీస్తున్న ట్రైన్ కిటికీ లోంచి బయటకి చూస్తే గేదెలు ఒక్కో చోట నీళ్ళలో కూల బడి నెమరేసుకుంటూ ఉండే దృశ్యం ఆహ్లాదకరంగా ఉంటుంది. సరిగ్గా తినడం చేతకాకపోతే ‘ఏమిటిది గేదేగొడ్డు మొదల్లాగ’ అని పెద్దవాళ్ళు తిడతారు కానీ, పాపం ఈ గేదెలు కాళ్ళు కదుపుతూ జలకాలాడక పోయినా నీళ్ళలో ఉంటూ నెమరేసుకుంటూ ఎంత హాయిగా ‘ఎంజాయ్’ చేస్తుంటాయీ! పాపం గత జన్మలో మనం మనుషులం కదా అని పూర్వ ఆలోచనలు అపూర్వంగా నెమరేసుకుంటాయో యేమో! గేదె సరే—దున్న పోతూ అంతే పాపం .. ‘దున్నపోతు మీద వాన’ అని అనిపించుకుంటుంది. నిజానికి ‘వృషభం’ శివుడి లెంక. శివుడు నీటి వనరుడు. వృ- ధాతువు నుంచే వృష్టి వచ్చింది. చంద్రుడు చిన్నబోయాడు. అసలు జలాధిపతిని నేనేగా, నాసా వాళ్ళూ ఇస్రో వాళ్ళూ నాలో నీళ్ళు ఉన్నాయని చెబుతున్నారుగా , మరచిపోతున్నారేం... భూమ్మీద నీళ్ళు కరువైపోతే భవిష్యత్తులో నేనే గతి.. అని గర్వంగా అలిగాడు. ‘చంద్రశేఖరుణ్ణి ... నా సిగలో కూర్చునీ నాకే పాఠాలు వప్పచెబుతావ్?’ అని శివుడు తాండవమాడాడు. శివుని కోవెల కొలనులో కాళ్ళు కడుగుకుంటేనే ఆ చల్లదనం అంత బావుంటుందే- ఇంక చెరువులో బుడుంగు మని రెండు మూడు మునకలు వేస్తే.. పైన ఉన్న సూర్యుడు కూడా ఎర్ర రంగు ఐసు ముక్కలా కనిపించడూ? విన్న సూర్యుడు ‘పకపక’ వానుడు (వాన కురిపించు వాడు) అయ్యాడు. భళ్ళున తెల్లవారింది. భొళ్ళున వాన కురిసింది. -డా. తాతిరాజు వేణుగోపాల్ , 30 మే 2012
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|