మునుపటి నా మాట
గాన వట వృక్షం గంధర్వ లోకం చేరిన రోజు మంచి పుస్తకం చేతికొస్తే దాని మీద బావుండే అట్ట చూస్తూ మురిసి పోవడం సహజం. ఈ సహజగుణం వల్ల లోపలి పేజీలు అలా అలా తిరగేస్తున్నా మళ్ళీ అట్ట చూస్తే బావుణ్ణు అని అనిపిస్తుంది. ఈ వింత క్రియకి నవ్వు వస్తే దాన్ని ‘అట్టహాసం’ అనాలి. ఘంటసాల గానం అటువంటి ఒక మంచి పుస్తకం. అతని తలపు అలా మురిపించే అట్ట. లోపలి పేజీల నిండా పాటలే. అకారాది క్రమమా, నవరస విభజనా, నటీ నటుల బట్టీ వేర్పాటా, శివుడా కృష్ణుడా ఆంజనేయుడా తిరుమల వెంకటేశ్వరుడా అనే దేవుళ్ళ ఏర్పాటా, పద్యాలా, దండకాలా, జానపదాలా, జాణ తనాలా? –ఇలా ఓ పదివేల పై చిలుకు పాటల కెన్ని పేజీలు కావాలి? ఈ లెక్క తేలక మళ్ళీ మళ్ళీ అట్ట వైపే చూస్తుంటే ఘంటసాల మందస్మితం కనిపిస్తుంది. అట్టహాసం కాదది- అట్టహాసం ఎరుగని గానం అమర గాయకునిది. ----ఇంటి పేరే తన పేరు ఘంటసాలఅనేది ఒక ఊరు. ఒక్క వెంకటేశ్వరరావుకే అది ఇంటి పేరు. అదే వెంకటేశ్వరరావు కి ‘ఘంటసాల’ అన్నదే పేరు. తొలి నాటి సినిమాల్లో ఘంటసాల జి.వి.రావు గానే ఉండిపోయుంటే ఎంత అనామకుడైపోయేవారో? ఆయన గానం సినిమాలను బతికించింది. ఆయన సంగీత ప్రతిభ సినిమాలకు గౌరవం తెప్పించింది, -----వై దిస్ ఫిబ్రవరి లెవెన్ అండీ
గ్రెగోరియన్ ఫిబ్రవరి నెల చివర్లో ఎలాగూ కొన్ని రోజులుండవు. 1974 లో ఫిబ్రవరి 11 గనుక లేకపోయుంటే గంధర్వలోకానికి గర్వమణిగి ఉండేది. ‘అమరగాయకుడు ఘంటసాల’ అని మనం అనాల్సిన అవసరమే ఉండేది కాదు. కాని కాలం మన చేతుల్లో లేదే! ‘ఈ జీవన తరంగాలలో’ ‘కళ్ళు తెరచినగాని’ ‘కళ్ళు మూసిన గానీ’ ఆటుపోట్ల కిందే లెక్క. అదే దైవ నిర్ణయం. ‘మళ్ళీ తెరవనే తెరవను’ అని మొండిగా కన్ను మూసారు ఆరోజున ఘంటసాల మాస్టారు. -----చదరంగం చతుర్భుజం, అందులో ఒక వట వృక్షం ‘ఆ దేవుని చదరంగంలో’ దేశి సంగీతం , మార్గ సంగీతం రెండు భుజాలైతే వాటిని ఆనుకున్న మరో రెండు భుజాలు లలిత సంగీతం , సినీ సంగీతం. అందులో ‘తెలుగు పద్యం’ అనే మధ్య బిందువు మీద ఒక వటవృక్షం లా నిలబడ్డ వారు ఘంటసాల. చిన్ననాటి ‘బాల భరతుడు’ అనే వటుడింతై ఇంతింతై ఎదిగి మూడు పదుల కాలం ‘ఘంటసాల’ గా తన విశ్వ రూపం విస్తరిస్తూ గంధర్వ లోకంకి చేరువ కావడంతో గంధర్వులు ఎత్తుకుపోయారు కానీ లేకపోతే ఆయన పాడిన పదాలు - ‘టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు’ – ‘రానిక నీ కోసం సఖీ రాదిక వసంత మాసం’ అన్నవి నిజం కాలేవనే భ్రమలోనే ఉండేవారం. ‘కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది’ అని ఆయన ఆవేదనతో అంటే జాలిగా కళ్ళు మూసేసాం. తానే శాశ్వత నిద్రలోకి జారుకున్నాక బావురుమంటూ కళ్ళు తెరిచాం. ‘భూమ్మీద సుఖపడితే తప్పు లేదురా’ అని అన్న ఘంటసాల వారే ఇక్కడ ‘మనసున్న మనిషికి సుఖము లేదంతే’ అని తెలుసుకునీ ‘స్వర్గ సీమ’ వైపు తరలిపోవడమేమిటీ? ఏమో- గాయకుడిగా తన తొలి చిత్రం ‘స్వర్గ సీమ’ అయినందుకు చివరి మజిలీ అక్కడే కదా అని సర్దుకుపోయిన తాత్వికుడా ఆయన? ------- ఘంటసాల వారికి ఘంటగళమే బిరుదు ఆలస్యంగా ప్రభుత్వం కొందరికి ‘పద్మశ్రీ’ ఇస్తే నవ్వొస్తుంది. విభూషణుడు అనదగ్గ మహానుభావుడికి శ్రీకారమిచ్చి ఊరుకుంది ఆనాడు. అదంతా ఆయనకి నచ్చని పబ్లిసిటీ. ఆయనకి ‘సింప్లిసిటీ’ ఇష్టం. అందుకే తెలుగు వాళ్ళు ‘మా ఘంటసాల’ అన్నారు. సినీ పరిశ్రమలోని వాళ్ళు కాస్త పొడిగించి ‘మాస్టారు ఘంటసాల’ అన్నారు. ఆయన ఎవరినైనా సరే ‘నాయనా, బాబూ’అనే పిలిచేవారట. ఒక్క బాలాంత్రపు రజనీ వారిని మాత్రం సరదాగా ‘నాన్నగారూ’ అనేవారట. ఘంటసాల వారిని వట వృక్షం అన్నామే కానీ నిజానికి ఆ వటవృక్షం వ్రేళ్ళు – సముద్రాల రాఘవాచార్య, బి.ఎన్.రెడ్డి, చిత్తూరు నాగయ్య, సి.ఆర్.సుబ్బురామన్, బాలాంత్రపు రజనీకాంత రావు, ఊడలు- పామర్తి, సంగీత రావు, రాఘవులు. ---------ఘంటసాల : నీ గుణ గానమే అమృత పానం ఘంటసాల గానం అంటే ఆగకుండా వెళ్ళిపోయే ఆర్టీసి బస్సు కాదు. ఘంటసాల గానం అంటే ఆగాల్సిన చోట ఆపి, సాగాల్సిన చోట సాగ మని మార్గం చూపించే సిలబస్సు. ఘంటసాల తెలుగు పదాల ‘అమరిక’ కనిపెట్టిన ‘కోలం’బస్సు. ఘంటసాల గాయకుడు, సంగీతదర్శకుడు అనే ఎదురెదురు కోణాలు సమానంగా సూచించే రోంబస్సు. ఓవారాల్ గా ఘంటసాల పిల్లలకే కాదు పెద్దలకీ ‘పాటశాల’ అనే ఓ పాఠశాల. ఘంటసాల ఒక సముద్రం అని అనుకుంటే కొన్ని తరాల వరకు యువతరంగాలు అయిన ఎన్టీ ఆర్, ఏ ఎన్ ఆర్ అనే తరంగాలు , ఎస్వీ ఆర్, జగ్గయ్య, కాంతారావు, గుమ్మడి, మిక్కిలినేని, రాజనాల, నాగభూషణం, త్యాగరాజు అనే కెరటాలు; రేలంగి అనే లైట్ హౌస్, రమణమూర్తి, హరనాథ్, శోభన్, కృష్ణ, రామ్మోహన్, కృష్ణంరాజు, రామకృష్ణ , చంద్రమోహన్ అనే చల్ల గాలులు అన్నీ ఆ సముద్రం సొత్తు. ఘటోత్కచుడిగా కాసేపు నటించడం మహానటి సావిత్రి వంతు. మహిళకి మగవాని (ఘంటసాల) గొంతు? అదే కె.వి.రెడ్డి సృష్టించిన ‘మాయా బజార్’ తంతు. పంతొమ్మిదొందల డబ్భైల నాటికి హీరోల తరువాత హీరో అంతటి ఎత్తుకి ఎదిగిపోయిన హాస్య చక్రవర్తి రాజ్ బాబు. అంతకు ముందే ఆయనకు ఒకే ఒక్క పాట ( అగ్గిదొర: పిలిచిన పలికేవు స్వామీ) పాడిన దెవరన్నది ప్రశ్న ? ఘంటసాల అన్నదే జవాబు. నాగయ్య ,రాజా, శ్రీనివాస్, రఘునాథ్ పాణిగ్రాహి,మాధవపెద్ది, పిఠాపురం, ఘంటసాల - అదో గాయక సప్తర్షిమండలం. బి ఎన్ ఆర్, రజనీ, సుబ్బురామన్, గాలి పెంచల నరసింహా, వేణు, విశ్వనాథన్, సాలూరి సోదరులు, పెండ్యాల, సుసర్ల, రాజు, మహదేవన్, అశ్వత్థామ, ఆదినారాయణ, చలపతి, ఘంటసాల - అదో స్వర షోడశోపచారం. -----కనులు చూసినా 'ఘంటసాల' పాటే సినిమాకి కథ కుదిరితే చాలదు. కథనం ఉండాలి. సినిమా కోసం కష్ట పడే కళాకారుడుకి కాస్తంత అంతర్మధనం ఉండాలి. అప్పుడే అది కాసులతో పాటు ప్రేక్షకుల,శ్రోతల అభిమానధనం కూడా పొందుతుంది. ఘంటసాల మనసు లో 'ఎలా తీస్తారో ఊహకందని' సన్నివేశం పరకాయ ప్రవేశం చేస్తే , రక్తి కట్టిన సినిమా సన్నివేశం లో 'ఘంటసాల ముందే ఎలా ఊహించగలిగారో' అన్న సందేహం చర్చకొస్తుంది. సినిమా పాట అంటే అప్పచెప్పడం కాదు. ఎందరికో నచ్చ జెప్పడం. పాట ధ్వని ఐతే గాయకుడు ప్రతిధ్వని. 'ఘంట'సాల పేరు నిలబెట్టిన వారు. మూగమనసులు, ముద్దబంతిపూవులు ఆచార్య ఆత్రేయ మలచినవే అయినా ఘంటసాల గళం లో 'బాసలు' తెలిసాయి.'ఎనక జనమలు' వెలిసాయి. 'సేసలు' చల్లాయి. 'ముద్దబంతి పూవులో' పాట- సన్నివేశపరంగా ఒక 'డప్పు' చాటుగా ఇరు వైపులా కన్నీళ్లు తెలియక పోవడం అనేది అద్భుత చిత్రీకరణ. సావిత్రి డిసెంబర్ ఖాతా లోనే 'జ.మ' అయిన నటీమణి. ఘంటసాల వారిది డిసెంబర్ లో జననం. అందుకే ఆ కాంబినేషన్ తలచుకుంటూ కనులు చూసినా ఆ పాటే! రెండవ పాట 'పండంటి కాపురం' పలికించే కథ ఒకటి! ఎస్ వి రంగారావు కవళికలు మాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఏ ఎన్ ఆర్ వారికి కి పాడిన ఘంటసాలలో ఏ ఎన్ ఆర్ నే విన్నాం. ఎస్ వీ ఆర్ వారికీ వారే పాడుతుంటే అందులో ఎస్ వీ ఆర్ నే విన్నాం. 'వినరా' లోని గమకం కోదండపాణి వారిద్దరికీ (ఘంటసాల, ఎస్.వీ.ఆర్) పెట్టిన పరీక్ష. ఇద్దరూ నూటికి నూరు తెచ్చుకున్నారు. ఎవరు ఎవర్ని అనుసరించారో పాట పరంగా చెప్పలేం కానీ మృత్యు బాటలో కోదండపాణి, ఎస్.వి.ఆర్ మాత్రం ఘంటసాల వారిని అనుసరించారు. 1974 ఫిబ్రవరి 11 న ఘంటసాల అమరులైతే ఏప్రిల్ 05 న పాణి, జులై 18న ఎస్వీఆర్ వారిని అనుసరించారు. సావిత్రి ఎస్ వీ ఆర్ ని 'ఫాదర్' అని అంటూ ఉండేవారట. ఈ ఫాదరూ అంతే తన 'జ మ' జులై ఖాతాకే పరిమితం చేసుకున్నారు. ------కనులు మూసినా 'ఘంటసాల' పాటే 'నభూతో న భవిష్యతి' అన్నట్టుగా ఒక్క తెలుగు లోనే కవయిత్రీ సాహస మహిళా, స్వాతంత్ర సంగ్రామ స్త్రీ నేతా అయినా సరోజినీ నాయుడు గురించి చెప్పే లలిత గీతాలున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఈ బెంగాలీ బ్రాహ్మణ స్త్రీ తెలుగు నాయుడు గారిని వివాహమాడదలిస్తే తండ్రి నిండు మనసుతో దీవించడం ఆనాటి పరిభాషలో 'ఒక దుర్లభమైన సాహస కృత్యమే'. ఆమె కవితలన్నీ ఆంగ్లం లోనివే. అందులో హృదయం మాత్రం భారతీయం. అందులో సంస్కృత శబ్దాలు (పక్షుల పేర్లూ, మనుషుల పేర్లూ) కొల్లలు. బహు భాషీయురాలు ఆమె. మహాత్ముని 'మిక్కీ మౌస్' అని వెక్కిరిస్తూనే అతని అహింసా మార్గంలోకి మహిళాశక్తికి రప్పించిన పులి ఆమె. ఆమె నిలా తలచుకోవడం ఎందుకంటే ఈ ఫిబ్రవరి 13 న ఆమె జయంతి కనుక. ఘంటసాల వారు పాడిన ఆ రెండు పాటలూ ఇప్పటికీ నవ్యం గానే , అంతే శ్రావ్యంగానే వినిపిస్తుంటాయి. ఆ మర్నాడే 'ప్రేమికుల రోజు'. ఘంటసాల వారు పాడినన్ని 'ప్రేమ' గీతాలు ఎవరూ పాడి ఉండరు. 'హాయి హాయిగా ఆమని సాగే' అని ఎంత శాస్త్రీయంగా ప్రేమ వ్యక్తం చెయ్యగలరో , 'రెక్కలు కట్టుకుని రివ్వునా వాలాను' అని అంతే సరదాగా ప్రేమ పండించగలరు తన జీవనదీ సేద్య గళంతో. ముచ్చటైన మూడు పాటలు- అవీ మూడేళ్ళ అంతరంలో విడుదలైన సినిమాల లోనివి- వింటుంటే ఒకే రాగ ఛాయలో ఉన్నట్టే ఉండదూ. 'రాగేశ్రీ' మహిమ అది. ఘంటసాల వారికి అతి ప్రియ మైన రాగమది. బడే గులాం ఆలీ ఖాన్ వంటి గజల్ ఉస్తాద్ నుంచి మెళకువలు నేర్చుకున్న ఘంటసాల వారు హిందుస్తానీ రాగాలతో అద్భుతమైన వరసలు కూర్చారు. ప్రేమికులు పార్కుల్లో తిరిగి మార్కులు పోగొట్టుకోకుండా నచ్చిన పాటలకి రిమార్కులు రాసుకుంటే మేలు కదా. 'మౌనముగా నీ మనసు పాడిన వేణుగానము వింటిలే'- ఇంతకన్నా గట్టి సందేశం ఎవరివ్వగలిగేరూ? తిరగెయ్యండి పాత పాటలు- కనిపెట్టండి అందకుండా దాగి ఉన్న నిక్షేపాలు. అప్పుడే ఘంటసాల వంటి గాయకులే నాయకులై కీర్తింప బడతారు. స్వర జానకి పాడిన సినియేతర రచన వినండి. (ఇటీవల స్వర జానకి తిరుపతిలో జారిపడి గాయపడ్డారు. కోలుకున్నారు. ఆమెలోని గొప్పతనం 'చిరునవ్వు'. అమ్మా - అదే మీకు రక్ష. ఘంటసాల వారితో నేను తక్కువే పాడేను అని మీరనే వారు. కానీ మీ తొలి తెలుగు పాటే ఆయనతో కలిసి పాడిన 'నీ ఆశా అడియాశ' కదా. పైగా ఆ తరువాత 'నీలి మేఘాలలో గాలి కెరటాలలో' రెండు వెర్షన్స్ మీరొకటీ, మాస్టారొకటీ వేర్వేరుగా పాడారు. ఆ బాణీ మదన్ మోహన్ గారికి నచ్చి హిందీ 'మేరాసాయా' లో ఉపయోగించారు. అన్నిటికన్నా మీరే కాదు మేమూ గర్వపడతాం ఎలా అంటే-మాస్టారు తిరుమల పైన సంగీత కచేరీ చేస్తున్నారు. మీరూ, మీ భర్త తిరుమల దర్శనం కోసం వస్తునారని ఆయనకి ఎవరో చెప్పారట. వెంటనే ఆయన మీ దంపతులకి కబురు పెట్టి మీ చేత 'నడిరేయి ఏ జాములో ' (బి.ఎన్.రెడ్డి వారి రంగులరాట్నం) పాడించుకున్నారట కదా. వెంకన్న భలే వాడు. తెలుగు వాళ్లకి మరో అన్నమయ్యని ప్రసాదించాడు. ఇప్పుడిప్పుడే ఇది కోకిల కాలం. మీరు కోలుకోండి, కోయిలకి పంచమం మీరే కదా నేర్పాలి) - డా. తాతిరాజు వేణుగోపాల్, 11 February 2012
1 Comment
Subba Rao Tulasi
13/2/2012 10:14:58 am
ఘంటసాల వారు ఎంత గొప్ప గాయకులో అంత గొప్ప మానవతా వాది అని సావిత్రమ్మ గారి మాటల వల్ల తెలిసింది. 1956 లో జాషువా గారు వ్రాసిన పాపాయి పాటలు మాస్టారు పాడగా రికార్డు గా విడుదల అయ్యాయి. ఆ సందర్భం లో జాషువా గారు తమ ఇంటి కి వచ్చి బయట వరండా లోనే కూర్చుని వుంటే( అంటరాని వాడిననే భావన తో ) మామయ్య స్వయంగా లోపలి కి తీసుకుని వచ్చి అతిథి మర్యాదలు చేసేవారని, మామయ్య కి కుల మత భేదాలు లేవు అనడం కంటే అసలు తెలియదు అని చెప్పడం సబబు అని సావిత్రమ్మ గారు వ్రాసుకున్నారు.
Reply
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|