మునుపటి నా మాట
ఏవీఎస్ అన్నట్టు అదో తుత్తి........ డాక్టరూ, సంగీత జ్ఞాని అయిన కీర్తిశేషులు శ్రీపాద పినాకపాణి గారు తృప్తిగా నిండు నూరేళ్ళు జీవించినట్టే భావించాలి. ఎందుకంటే వృత్తిలో తృప్తి లేనిదే పరుల బాగు కోసం వైద్యసేవ చేయడం కష్టం కనుక. ప్రవృత్తిగా సంగీత విద్య నభ్యసించి పదిమందికి నేర్పడంలోనూ ఎంతో తృప్తి ఉంది కనుక. రోగాలు మాపేవి రాగాలు అని ఆయన ద్వారా తెలుసుకున్న వారంతా ఎప్పుడో ఒకప్పుడు ఆయన్ని రెండు చేతులా నమస్కరించి తృప్తి పొందే ఉంటారు. తృప్తిగా బతక నిచ్చేది మంచి నీరు కాబట్టి ఆయన వల్ల బతికి బట్ట కట్టిన ఉత్తరాది వారొకాయన పినాకపాణి అంటే ‘పీనేకా పానీ’ అని తృప్తిగా చమత్కరించారు. డాక్టరూ, రచయితా అయిన కీర్తిశేషులు కొమ్మూరి వేణుగోపాలరావు గారు ఒకనాటి జ్యోతి మాస పత్రికలో ‘మనిషికి ఏం కావాలి?’ అనే సీరియల్ పూర్తి చేస్తూ చిట్ట చివర్న రెండంటే రెండే అక్షరాలున్న, బోలెడంత అర్థమున్న పదం వాడారు - అది ‘తృప్తి!’. నిజమే మనిషికి ఏం కావాలనే ప్రశ్నకి ఇవ్వాల్సిన సమాధానం ‘తృప్తి’యే.
0 Comments
లో:‘విశ్వం గారూ...విశ్వం గారూ... నేనేనండీ...నన్ను చూసి కెవ్వు మని అరుస్తారేమో అని భయ పడుతూనే ఉన్నా. అలా నోరెళ్ళబెట్టకండీ. ఆషాఢ మాసం...ఈగల కాలం. హమ్మా..పాడు దోమ..పగలు కుడుతోంది... ఈమధ్య ఇదో భయం. దోమల టైం టేబిలు కూడా తెలుసుకోవాలి...ఏది కుడితే ఏమొస్తుందో తెలియదు. అహ(.. మీ ఇంట్లోనే ఉన్నాయని దెప్పుతున్నానని అనుకోకండి..భలేవారే.. ఏ ఇంట చూసినా ఇదే తంతు. అవునండీ.. వార్కరీలు, జ్ఞానేశ్వర్ పాదుకలు, తుకారం పాదుకలు, పండరీపుర యాత్ర... ఆహాహా... ఎంత క్రమ శిక్షణ .... ఎంత నిబద్ధత... ఎంత గొప్ప ఆపన్న హస్తాల ఉచిత సేవ .....మహారాష్ట్రలోఆషాఢ ప్రారంభంలో పుణే పరిసరాల్లో కనువిందు కదండీ ఈ విష్ణు దర్శన దృశ్యం! అలాగే ఇదే ఆషాడ మాసం రెండో తిథిని ఒడిశాలో పూరీ క్షేత్రంలో జరిగే శ్రీ జగన్నాథ రథయాత్ర ..అంతే కనువిందు కదండీ. విప్లవ కవి అయినా శ్రీశ్రీ గారిలోనూ కొన్ని సంప్రదాయ పోకడలు లేక పోలేదు... వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్ ...రథ చక్రాల్ అంటూ ఓహోహో...ఆ రోజుల్లో ఆయన వినిపించిన ఆ సుదీర్ఘ గేయం అందరికీ కంఠోపాఠం కదండీ. .. ఆషాఢ ఏకాదశి నాడు పాండురంగ సన్నిధి పరమ పుణ్య పెన్నిధి. ఆ తిథికి ఒక రోజు ముందు జగన్నాథుడు పూరీలో తన రథయాత్ర ముగించుకుంటాడు. సరిగ్గా ఇలాగే తమిళనాట చిత్ర లోకం చుట్టిన కవి ‘వాలి’బన్ ఆషాఢ ద్వాదశి నాడు (జూలై 18,2013) తన సుదీర్ఘ రాత యాత్ర ముగించుకున్నాడు. అవును.... ఎనభై రెండేళ్ళ కవి ‘వాలి’ రెప్పలు అలసి సొలసి వాలి అపుడే ఇది మూడవ రోజు అయిపొయింది. వాలి చుట్టూ తిరిగిన చిత్ర లోకం ఇక పైన ఎవరిని పిలవాలి? నాటి మహోన్నతుడు ఎమ్జీ ఆర్ నుంచి నేటి డాషింగ్ ధనుష్ వరకు అందరి పెదవుల మీద కదిలిన పాటల్లో ఎక్కువ వాటా ఉన్నది వాలికే. ‘ఉలగం సుట్రుం వాలిబన్’ (1973) చిత్రంలో పాటలు వ్రాసిన నాటికి ఆయన చిత్రసీమ వయసు రెండు దశాబ్దాలే. మళ్ళీ మకుటం మారి ‘వాలిబన్ సుట్రుం ఉలగం’(2010) కనిపిస్తే అక్కడా వాలి వాక్కు వినిపించింది. నాటి నట భూషణ జెమిని గనేషణ్ మనవడు గణిత మేధావి ‘రామానుజన్’ గా నటిస్తున్న చిత్రమే వాలి చివరి చిత్రం. వాలి అసలు పేరు ‘రంగస్వామి’ అని అంటే ఆశ్చర్యంగా ఉండదూ? వట్టి రంగస్వామియే కాదు- టి.ఎస్. అనే రెండక్షరాలు ముందుంటాయి. టి – అంటే తిరుచ్చి, ఎస్- అంటే శ్రీరంగం కాబోలు. ఎందుకంటే ఆయన జన్మస్థలం- తిరుచిరాపల్లి సమీపంలో ఉన్న శ్రీరంగమే. లాభం లేదండీ... ఈ ఏడాది మనల్ని ఇబ్బంది పెడుతోంది. దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ఇపుడిపుడే గాయం మాయం అవుతోందనుకుంటే మరో గాయం సాయం రావడం ఏమిటీ? అదైనా మూడు రూపాల్లో రావడం ఖాయం అని మనమేమైనా కల గన్నామా? కల కనేందుకు కన్ను ఎప్పటిలా నిద్ర పోతూనే ఉంటుంది. నిద్రాభంగం కాగానే తెలుస్తుంది ఏదో ఉపద్రవం పొంచి ఉందనీ. ‘కన్ను తెరిస్తే జననం- కన్ను మూస్తే మరణం – రెప్పపాటే కాదా ఈ ప్రయాణం’ అని చంద్రసేన్ గారు రాసిన మినీ కవిత (భారతి, సెప్టెంబరు 1980) కి శీర్షిక – కంటి తెలివి. ఇది ఎంత వాస్తవమో – ఆది శంకరులన్నట్టు ‘పునరపి జననం పునరపి మరణం’ కూడా అంతే వాస్తవం. అసలు కంటి తెలివి అనే కన్నా ‘ముక్కంటి తెలివి’ అనడం సబబు. జననంకి బ్రహ్మ, మరణంకి శివుడు, ప్రయాణం కి విష్ణువు – ఈ మూడు నేత్రాల తెలివే ఇదంతా. అదేమిటో...ఈ భూమ్మీద రోజుకొక్కరైనా పుడుతుంటారు, రోజుకొక్కరైనా పోతూ ఉంటారు. తెలుగువారి ‘బాల’ ఇష్టాలు: తెలుగువారి సినీ సంగీత ప్రపంచ ప్రముఖత్వమంతా ‘బాల’ మయమే, ఔనా కాదా అంటే ఆబాలగోపాలం ఔననే అంటారు. ఘంటసాల మాస్టారు గారిని చిన్నతనంలో ‘బాల భరతుడు’ అనేవారు, ఎందుకంటే ఆయన చిన్న చిన్న పాత్రలు పోషించి పాడుతూ ఉండేవారు కనుక. ఆ తరువాత ఆయన తెలుగు సినిమా చరిత్రలో ఒక గాయకుడిగానూ, సంగీత దర్శకుడిగానూ తనదంటూ ఒక విశేష ముద్ర సృష్టించి ‘ఘంటసాల యుగం’ అనేది ఒకటి ఉండేదనటానికి నిదర్శనంగా ముప్ఫైఏళ్ల కాలం మనముందుంచారు. అక్కినేని ఆఖరు సారిగా తన పాత్రకి తానే పాడడం, ఆ పాట రికార్డ్ రూపంలో రావడం, చిత్రంలో ఘంటసాల వారి గళం వినిపించడం – అంటే అక్కినేని వారికి తొలిసారిగా ఘంటసాల వారు ప్లే బ్యాక్ పాడడం ఇవన్నీ చరిత్రకెక్కిన గొప్ప విషయాలైతే ఆ చిత్రం పేరు ‘బాలరాజు’! ఆకాశవాణికి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే చప్పున గుర్తొచ్చే పేరు- బాలాంత్రపు రజనీకాంతరావు గారు. వర్తమాన పుణ్య లబ్ది కోసం ఒకరు, భవిష్య మోక్ష ప్రాప్తి కోసం ఒకరు అక్కడికొస్తారు. తనువు రాల్చేముందు తనివారా ఆ లయకారుడి నొక్కసారి చూస్తే చాలు అనుకునే వయో వృద్ధులు కొందరు అక్కడికొస్తారు, చిన్నపిల్లల్ని బంధువులింట విడిచి పెట్టి రాలేక తమతో తీసుకు వచ్చిన దంపతులు కొందరు అక్కడ తారస పడతారు. వీరంతా ఒక టయిపైతే, అబ్బే పుణ్యం కాదు, మోక్షం కాదు ఆహా ఆ హిమాలయ సౌందర్యం కనులారా చూడాల్సిందే అని ఊరికే కెమెరాలుచ్చుకు బయలు దేరేవారు కొందరు అక్కడ చేరతారు. ఏటేటా ఆరు నెలల కాలం పాటు అక్కడి కొచ్చే జనం నిజంగానే ఒక ప్రభంజనం. శీతాకాలం అక్కడి రాకపోకలు నిషేధం. ఎక్కడ జన సంచారం ఉంటుందో అక్కడ వ్యాపార దృష్టి కూడా ఉంటుంది. కనుక ధనార్జనకీ తావే అనువైనదని, అలా సహాయపడడం తమ వైనమని సాహసించి బస చేసుకున్న విక్రయదారులు కూడా అక్కడ ఎక్కువే. కొండ చివర్లలో ఒరుసుకునీ నిలబడేలా వసతి గృహాలు ఎవరి అనుమతి మీద కట్టించారో ఆ శివుడికే ఎరుక. అది సహాయానికి పరా కాష్ట అనాలా? ఊహాతీతమైన విపత్తుకి వైతాళిక మనుకోవాలా? బెంగుళూరులో ఉన్నప్పుడు పరిచయమై ఇప్పటికీ స్నేహ హస్తం అందజేస్తున్న మంచి మిత్రులు సూర్యనారాయణ గారు. ఈయన అక్షరశిల్పి. గాయకుడు. ఈయన ఇటీవల తమ ప్రియమైన తండ్రిని కోల్పోయారు. అయ్యో అనుకున్నాను, అశ్రు నివాళి అర్పించాను. వీరి కుటుంబం సంగీతమయం. బహుశ: సూ.నా. గారి తండ్రి గారో, తల్లి గారో సంగీత సామ్రాజ్యాధి నేతలు కావొచ్చు. మా తండ్రి గారు నా రెండేళ్ళ వయసులో తన నలభై అయిదేళ్ళ వయసు లోనే కాలధర్మం చెయ్యటంతో అప్పటి అమాయక వయసులో లాగనే ఇప్పటికీ ఆ బాధ తీవ్రత అన్నది మనసులో నిలవలేదు. నాన్నగారికి 'స్పోర్ట్స్'తో పరిచయం ఉన్నట్టు ఒక పాతకాలం ఫోటో చెప్పింది. విషయాల్ని స్పోర్టివ్ గా తీసుకోవడమే తప్ప స్పోర్ట్స్ ఆడడంలో పెద్దగా ఆసక్తి మా తరానికి లేదు. సాహిత్యాభిలాష ఒకటి మాత్రం అందరికి దక్కింది. ఎవ్వరం తొలినాళ్ళలో భక్తికి పెద్ద పీట వెయ్యనే లేదు. అమ్మమ్మ,అమ్మలది నిండైన భక్తి సామ్రాజ్యం. మా నాన్న జ్ఞాపకాలు తనకు మాత్రమే మిగిలాయి కనుక కలిసినప్పుడల్లా ఏదో ఒక సందర్భంలో గుర్తుచేసేవాడు మా పెద్దన్నయ్య. ప్రతి విషయానికి తన వాక్ చాతుర్యం జోడించి భళ్ళున నవ్వేసే అన్నయ్య ఎక్కడ ఉన్నా ఉదయం కోడికూత గానీ, కాకి అరుపు గానీ అవసరం లేకుండా అలా ఠక్కున ఏ అయిదింటికో నిద్రలేచి ఒక్కడే ‘సీరియస్’ గా ఆరు బయట ఆరు వరకు మార్నింగ్ వాక్ చేసి వచ్చే వాడు. అటువంటిది మొన్న అంటే మే31 న పెద్దన్నయ్య అర్ధరాత్రి దాటాక ఒక్కసారి కన్ను తెరిచింది ఎటువంటి సంకేతం, అనుమానం అనేవి లేకుండా తీవ్రమైన గుండెపోటుతో కన్ను మూయడానికే అని తెలిసి అందరి కళ్ళు చెమర్చాయి. వయోభారమా అంటే ఏదీ ఇంకా డబ్భయి యేళ్ళే కదా – అంతలోనే అన్నయ్య ఆత్మని పరమాత్మ తొందర పెట్టేయడం ఏం బావులేదు. ఫోటోలో ఆ నవ్వుతున్నది మా అన్నయ్యే. ఎడమ ప్రక్క బొమ్మ ఎవరిదీ? ఎవరదీ? పేరు చెబితే మహాభారతంలో విన్న పేరులా ఉంటుంది. పేరు చెప్పకపోతే మనసు నిండా ఎన్నో పేర్లు పేరుకు పోవచ్చు. అయినా ఇంతటి మండుటెండల్లో ఏదైనా సరే అలా పేరుకు పోవడం అసాధ్యం. ఇంతకీ పేరుకు పోవడానికి అతనేమైనా కొబ్బరి నూనా? కాదే- పోనీ జారు జారుగా జారి పోయే కొబ్బరి నీరా? నిశితంగా పరిశీలిస్తే అతని వర్చస్సులో సరిగమల సరస్సు కానరావడం లేదూ? అయితే కచ్చితంగా అతని స్వర రచన నారీకేళ పాకమేమో? కాకపోతే శృతి లయలకి సరి తూకమేమో? ఆయన ఒక మిలటరీ కమాండర్ గారి అబ్బాయి కనుక 'సరిగమపదని' స్వరాల్ని సరిగ పదమని ఆదేశించే ప్రజ్ఞా 'పాట’వం అతనికుండేది. అటువంటి కన్నతండ్రి సన్యాసుల్లో కలిసిపోతేనేం, అమ్మ, మేనమామ, తాతయ్యల అండతో సంగీతాన్ని సన్యసించక అందులోని విన్యాసాలు ఆకళింపు చేసుకోవాలని పట్టుబట్టిన వాడు ఆయన. అతని పేరు పలకడమెంత కష్టమో వ్రాయడం అంతే కష్టం. చెప్పగా చెప్పగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ తప్పుల్లేకుండా అతని పేరు చూపగలుగుతోంది. ఉన్నట్టుండి ఆయన గురించి ఏమిటీ భోగట్టాలు? ఎందుకంటే 1975 మే 21 నాటి మాట. నాలుగు దక్షిణ భాషల్లో చక్కని పాటల మూటలు మిగిల్చి నలభై ఎనిమిది ఏళ్ళు పూర్తి కాక ముందే నాలుగు ముఖాలాయన పిలుపందుకొని సరస్వతమ్మ కొలువుకి ఆయన తరలి వెళ్లిపోయినది ఆ రోజే కనుక. ఇది మే నెల కనుక, ఆ రోజు సమీపంలో ఉంది కనుక... ఒక్కసారి మననం చేసుకోవాలని.. మనం మనం బరంపురం... అనుకున్నాం కనుక..... హృద్యమైన పద్యం: ‘నేనొక/ పూలమొ/క్క కడ/ నిల్చి చి/వాలున /కొమ్మ వం/చి గో రానెడు/నంతలో/న విరు/లన్నియు/ జాలిగ/ నోళ్ళు వి/ప్పి మా ప్రాణము/లు తీతు/వా యంచు/ బావురు/మన్నవి ……. తెలుగు పద్యాల్లో ‘వృత్తములు’ అనేవి నేర్చుకున్నప్పుడు, అంటే ఇలాంటి పద్యమొకటి చదివినప్పుడు, పద్యపాదంలోని తొలి అక్షరాన్నియతి అంటారని కొత్తగా చెప్పనక్కర్లేదు. ‘యతి మైత్రి’ అనేది ఇలాంటి పద్యాలు రాయడానికి ఎంత సహకరిస్తుందో మనకి తెలుసు. యతి స్థానం లో కొన్ని అక్షరాలకి మరి కొన్ని అక్షారాలతో మిత్రలాభం ఉంటుంది. ఉదాహరణకి- త-ద, ప-బ-వ, చ-జ-స, క-గ, ర-ల, న-ణ. ఉత్పలమాలలో పదవ అక్షరం, చంపకమాల,మత్తకోకిల వృత్తాల్లో పదకొండవ అక్షరం, శార్దూల వృత్తంలో పదమూడవ అక్షరం యతిస్థానం అని నియమం ఉంది. కరుణశ్రీ వారి ఈ పద్యం పూల మీద పద్యం కాబట్టి ఉత్పలమాల వృత్తంతో ప్రారంభించారు ఆ కవీశ్వరులు. ఇక్కడి పద్యంలో లావుపాటి అక్షారాలు ఆ యతిమైత్రిని చూపిస్తున్నాయి. ఈ వృత్త పద్యాల్లో ప్రతి పాదంలో వచ్చే రెండవ అక్షరం ప్రాస. ఇక్కడ పువ్వుల పద్యంలో నకారం అలా వచ్చినదే. నన అన్నా పువ్వే. బహుశా అందుకే పూల మీద పద్యాల్ని నకార ప్రాసతో ప్రారంభించారు కరుణశ్రీ కవి. ప్రాసలు ఆరు రకాలు. ‘నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే....ఎవరేమన్నా’ ‘ఆగండాగండి...ఇది మీ పాట కాదనుకుంటానూ.. పోనీ నా ఎదుట ఉన్నారు కదా కనీసం నా పాటైనా పాడుకుంటున్నారు అని అనుకున్నాను... ఈ 'పర' పాట ...మీ పొరపాటా?’ ‘అయ్యా... మాటలంటే మీవే. మీ కలం నుంచి ఒక మాట జారిందే అనుకోండి...ఇంక అది జనం నోట నానాల్సిందే. నిజమే ఇది పర పాటే. కవికి తన పాట కన్నా ఇతర కవుల పాటలే నోటికి రావాలి. అప్పుడే తన పాట లో వారి మాటలు రాకుండా జాగర్త పడతాడు ...అని నా చేత భూలోక వాసులకి చెప్పాలనేగా మీ ఎత్తుగడ?’ ‘ఎత్తుగడ లేదు ..తలగడ లేదు.. మనది స్వర్గ లోకం. అప్పుడు భూమ్మీద ఉన్నప్పుడూ స్వర్గ లోకమే. చచ్చి స్వర్గానికొచ్చినా స్వర్గ లోకమే. అయినా.. మీకెలా ఉందో కాని ఒక్క ఈగా, దోమా అనేది లేకుండా ఇక్కడ చస్తున్నాం కదా. అవుంటే ఎంచక్కా వాటిమీద మన వాళ్ళు సినిమాలు తీసేవారు, మనం పాటలు రాసేవారం’ ‘దోమ సంగతి తెలియదు కాని ఈగ మీద సినిమా వాలిందట. అన్నమయ్య మీద సినిమా వచ్చిందట కాని అందులో ఆయన కీర్తన ఉందే...పన్నగపు దోమతెర పైకెత్త వలె..అది మాత్రం లేదట.’ ‘ఇంకా భూలోకం వేపు తొంగి చూస్తూనే ఉన్నారన్నమాట. అవును మరి... నాకన్నా ఆలస్యంగా ఇక్కడికొచ్చారాయే.’ ‘అబ్బబ్బే... పాపం సుందర రామమూర్తి ఈ మధ్యనే ఇక్కడికొస్తే తెలిసింది.’ ‘ఆ రామమూర్తి కవే అనుకుంటే .. . అదేమిటో ... టి.కె. రామమూర్తి ....వయోలిన్ మేధావి, గొప్ప స్వర కర్త కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడి కొచ్చారు.’ |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|