సూర్యుడు దక్షిణం వైపు వెళుతూ వెళుతూ ఈ రోజు
ఇరవై మూడు డిగ్రీల ఇరవై ఆరు మినిట్స్ దగ్గర చేరుకొని ఎవరెస్టు శిఖరం ఎక్కినంత సంబర
పడి, ఇహ చాల్లే అని ఉత్తర దిశ వైపు తిరుగు ముఖం పట్టడమే ఇవాళ్టి విశేషం.
దీన్నే మనం....ఏదీ జనవరి పదిహేనుకి వస్తుందే...మకర సంక్రాంతి
అనేది ....దానితో పోల్చవచ్చు.
ఉత్తరాన ఉన్న పాశ్చాత్య ప్రపంచం అంతా ఈ రోజు
నుంచే శీతాకాలం ప్రారంభం అని ఘోషిస్తుంది.
పైగా..మరో నాలుగు రోజుల్లో జీసస్ జననం కనుక
కొత్త సంవత్సరం రావడం, కొత్త ఆశలు, కొత్త సంతోషం కలగడం ఈ రోజు నుంచే మరి.
శీతవేళ రానీయకు రానీయకు..శిశిరానికి చోటీయకు
చోటీయకు ...అని దేవులపల్లి కవి మనసు పదేపదే కోరుకుంది.
ఆ మనీషికి ఆమని ఒక్కటే ఆదర్శం. ‘ఆరు ఋతువులు
ఆమని వేళలే మన తోటలో’, ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ అని ఆయన కలం
విన్నవించుకున్నది ఇందుకే.
అలా ఆశించడం బాగానే ఉంటుంది. కాని అది – భూ
పరిభ్రమణాన్ని శాసించినట్టే కదా.
తనలో తాను భూమి తిరుగుతుంది కనుక తూర్పున ఉదయించి పడమట
అస్తమించడం సూర్యుడి దిన చర్య. అదే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది కనుక ఆరు
నెలల ఉత్తరాయణం, ఆరునెలల దక్షిణాయనం అనేది
సూర్యుడు సమర్పిస్తున్న annual report.
ప్రతి ఏడూ కొంత మంచి, కొంత చెడు చవి చూడడం
మానవ మాత్రులమైన మనకి సహజం. ఒకరింట ప్రమోదం, వేరొకరి ఇంట ప్రమాదం, ఒకరి కంట పన్నీరు
మరొకరి కంట కన్నీరు....ఇలా ఎన్నెన్నో.
ఈ ఏడాది తెలుగు వాళ్ళు నట దిగ్గజాల్ని
కోల్పోయారు. శ్రీ హరి, ఏవీ ఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఏదో ఒప్పందం చేసుకున్న
వారిలా ఒకరి తరువాత ఒకరు హడావుడిగా వెళ్ళిపోయారు. తలా ఒక పేరులో యస్ అనే అక్షరం
ఉంది. అందుకే అలా యస్ యస్ యస్ అనుకుంటూ ఒబీడియంట్ గా ఒకర్నొకరు అనుసరించారు.
హిందీ గాయకుడంటే యావత్ భారత దేశానికే గాయకుడని అర్ధం. అలాంటి
వారిలో ఓ మణి పూస మన్నా దే.
మన్నాడే అని పిలవటానికి మనమంతా అలవాటు పడ్డాం
కాబట్టి అలానే పిలుద్దాం.
అయినా మన పిచ్చి గానీ.. ఇప్పుడెంత ఎలుగెత్తి
పిలిచినా పలకరాయన.
గాన గాంధర్వ సభలో క్షణం తీరిక లేని ఆయనకి మన
పట్ల కోరిక ఉండనే ఉండదింక.
ప్రపంచం మొత్తం సెల్యూట్ చేసిన మండేలా లాగ
మన్నాడే కూడా అడపా దడపా ఆస్పత్రి పాలౌతూ మళ్ళీ శ్వాస సరి చేసుకుని మా హృదయ
స్పందనలే వేరయా అని చాటి చెబుతూ వచ్చి చివరికి విధి లేక ఈ ఏడు విధికి తలవంచారు.
వీరిద్దరిలో ఉన్న విద్వత్తు నిధిని మనం తలెత్తుకు మరీ చూశాం.
వీరిలో ఒకాయన వర్ణ వివక్ష అనే విష వృక్ష
శాఖల్ని చీల్చి చెండాడి ‘మనిషి మనిషిగా బ్రతకాలి’ అని మన కవి
గోపి ఆశించినట్టు ఆశించడమే కాకుండా ప్రపంచాన్ని అలా ఉండమని శాసించాడు. ఆ ఒకాయనే
మండేలా. ఆయనదే లెద్దురూ బ్రతుకంటే... కలకాలం మనసుల్లో కాపురం ఉండేలా!
రెండో ఆయన గొంతులో ఒక నమ్రత ఉండేది. ఒక విధేయత
ఉండేది. విలక్షణం గాన లక్షణం అనుకుంటే అది ఆయన స్వర పేటికలో భద్రంగా ఉండేది.
ఆర్ద్రత నుండి ఆహ్లాదం వరకు, శాస్త్రీయత నుంచి ఖవ్వాలీ వరకు, తత్త్వం నుంచి తళుకుల
వరకు ...ఒక వేయి పాటలు చప్పున గుర్తొస్తే
అందులో ఓ వంద వేరే వారి ఖాతాలోకి పోతాయి.
‘దా’ అన్నది బెంగాలీ భాషలో ఆత్మీయుడైన
అన్నయ్యని పిలుచుకునేందుకు వెలసిన ఏకాక్షరం.
మన్నా అసలు పేరేమన్నా వేరుగా ఉందా? అని అనుమానించే వారి కోసం ఆయన తన
అసలు పేరు గుర్తుంచుకున్నారో లేదో? ఆయనకంత శ్రమ ఎందుకని అభిమానులు వీలు దొరికితే
అరిచేస్తుంటారు-‘ప్రబోధ
చంద్ర’ అని.
ఇది విడ్డూరమే. హిందీ సంగీత దర్శకుడు,
మహరాష్ట్రీయుడు రామ చంద్ర ఉండేవారు. తెలుగు సినిమా కవి భువన చంద్ర ఉన్నారు. ఎందరినో
‘దేవ దాసో’హం కావించిన బెంగాలీ
మహా రచయిత శరత్ చంద్ర ఉండేవారు. ఇంతగా
చంద్ర వంశం తళుకు మంటుంటే ఈయన తన పేరుని అలా కుదించుకున్నారెందుకో? అయితే ఒకటి-
ఆయన కంఠం ఏనాడు కళ తప్పి తల దించుకోలేదు. పైగా – తన భార్య సులోచన జ్ఞాపకాల వెన్నెల్లో,
ఆలోచనా పథంలో విహరిస్తూ భావ గీతాలు పాడి ఆమె కంకితమివ్వాలి అని చివరి వరకు
కలవరించిన వాడు.
ఆమె గాడ్స్ ఓన్ కంట్రీ, నైరుతి ఋతు పవనాల ముఖ
ద్వారం అనబడే కేరళకి చెందినది. అతనేమో రసగుల్లా ఖని, గీతాంజలి గుడి అయిన పశ్చిమ బెంగాల్ కి చెందినవాడు. అటూ ఇటూ
సముద్రమే వారిని కలిసి ప్రయాణం చేయమంది కాబోలు. ఎంతైనా (ప్రబోధ) చంద్రుడు కదా.
ఆయన అసలు పేరు మార్చిన వాడు తక్కువేమీ కాదు-
మహా గాయకుడు, ఈయన బాబాయి గారు కె.సి. డే! ఆయన’కేసి’ చూస్తూనే
చిన్ననాడే ఉంగా ఉంగా కి బదులు గావుంగా గావుంగా అని అన్నాడేమో మన్నాడే.
అసలు మన్నాడే కుస్తీ పట్లు చాలనుకున్నాడే,
అటువంటిది సినీ గాయకుడిగా అవతారమెత్తడం ‘తమన్నా’(1942) సినిమాతో జరిగింది. అంటే- మన్నాడే గాయకుడిగా పుట్టిన రోజుని ‘తమన్నా Day’ అని అనవచ్చునేమో.
ఇప్పడీ
తమన్నా మాట వినగానే కుర్రకారులో
ఎంత హుషారో కదా.. ఎం’త మన్నా’డే గురించి చెబుతున్నా వింటారో లేదో...
సుప్రసిద్ధ బా(సురీ వాదక్ పండిత్ హరి ప్రసాద్
చౌరాశియా గారు కూడా కుస్తీ పట్లతో ఆగిపోయి ఉంటే ఎంత హృద్యమైన వేణుగానం ఎటు పోయేదో.
‘ఇదీ నీ దిశ....సరిగమ పద..నిస...అందులో సరిగ పద అహర్ణిశ’ అని ఆకాశవాణి
వీరి వీరి చెవుల్లో ఇల్లు కట్టుకు మరీ చెప్పేది కాబట్టి వీరి వీరి దిశలు
మారాయి....దేశి సంగీతంలో మార్గ దర్శులు కాగలిగారు.
మన్నాడేని ఆయన కూతురు సుమిత చిరు నవ్వుతో
చివరి వీడ్కోలు చెప్పింది. గులాబీ పూవుని ఆయన గుండె పైన నిలిపి ‘ఇదే నీకు
సమర్పిస్తున్న ఆఖరి పుష్పం నాన్నా’ అంది. మన్నాని చివరిసారిగా చూసేందుకు
వచ్చిన వారు ఇదేమిటని ముక్కున వేలేసుకోలేదు. ఆడవారు ఆమెని అక్కున చేర్చుకున్నారు.
ఎందుకు విషాదం? ఆయన అన్ని వేల పాటల మధ్య
నిత్య దర్శనం ఇస్తుంటే అసలు ఆయన ఇంక లేరు అనే తలపే రాదు. రెండవ తరానికి చెందిన
మహమ్మద్ రఫీ, ముకేష్, కిశోర్ కుమార్, తలత్ మెహమూద్, మహేంద్ర కపూర్ లతో పాటు సినీ
కళామతల్లి తీర్చి దిద్దిన ఆరవ చక్రవర్తి మన్నాడే. మొత్తానికి షట్ చక్రవర్తుల పాలన
షట్ డౌన్ అయిపోయిందనే చెప్పాలి, మన్నా కన్ను మూతతో.
మన్నా గాత్రానికే కాదు, ఆయనలోని
వ్యక్తిత్వానికీ గౌరవం ఉండేది.
తన గాత్రం పాత్రకి ప్రాణం పోస్తుందా లేదా అనే
సంశయం ఆయనలో ఉండేది కాదు. అలా పాడేస్తే చాలు- పాత్రధారులు కళ్ళ ముందు నిలుస్తారు.
రాజసంగా రాజ్ కపూర్ కనిపిస్తాడు. భరత్ భూషణ్ ఒక అలంకారమౌతాడు. ప్రాణ్ లోని
సాత్వికతకి ప్రాణం లేచొస్తుంది. మెహమూద్ లో తమిళం మిళాయిస్తుంది. సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా సముద్రపొడ్డున
నడుస్తున్న అనుభూతి కలుగుతుంది.
చరిత్ర చెబుతుంది- ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మభూషణ్ సత్కారాలు అందాయని, ఫిలిం ఫేర్ అవార్డ్స్ పదేపదే వచ్చాయని, బహు భాషా గాయకుడని! కలకత్తా
కాఫీ హౌస్ కి థీం సాంగ్ ఆలపించిన అమృత గళధారి అని...! పుట్టుక బెంగాల్ లో, గాన
ప్రపంచం బొంబాయి (ముంబై)లో, తుది మజిలీ బెంగళూరులో అని! ( ఇన్ని బకారాలు ఎంచుకుని
వాసి కెక్కిన వాడు కనుక భారత్ వాసి అని
దేశం గర్విస్తుంది)
చరిత్ర చెప్పదు- ఆయనది మన పి.బి.శ్రీనివాస్ లాంటి ‘అడ్జస్ట్ మెంటాలిటీ’ అని.
షట్ చక్రవర్తులు అంత రాజసంగా వెలిగారంటే
అదంతా ఒకరి పట్ల ఒకరికున్న ఆత్మీయతానుబంధమే, స్నేహానురాగమే.
అయితే ఈ ఏడాదితో తొంభై నాలుగేళ్ళు పూర్తి
చేసుకుని అంతే చాలనుకున్న ఈ ఆరో రాజుకి తెలియనిది ఏమిటంటే... ఇంచుమించు తన
సమవయస్కుడైన మహారాజు మండేలా తన తుంబుర నాదం
వినడం కోసం డిసెంబర్ నెలలో అంబర వీధి వెతుకుతాడని!
చోరీచోరీ, దేఖ్ కబీరా రోయా, దిల్ హి తో హై, వసంత
బహార్, పడోసన్, ఆనంద్, మేరా నామ్ జోకర్, ఉప్ కార్, జంజీర్, కాబూలీ వాలా, కాలా
బజార్, బావర్చీ, భూత్ బంగ్లా, -------ఇలాంటి చిత్ర హారం నుంచి మన్నాడే ఒక్క పాట పాడినా చాలు ఆయన జాడ యిట్టే
తెలిసిపోతుంది.
మచ్చలేని ఈ గాన చంద్రుడు ‘లాగా చునరీ మే దాగ్..చుపా(వూ కైసే’ పాడబట్టే మన మల్లికార్జునుడు సైతం కొన్నేళ్ళ క్రితం
స్పిరిట్ ఆఫ్ యూనిటీ - షిరిడీ గాన సభలో పాడి ‘హౌరా’
అని ఆశ్చర్య పరిచాడు... బహుశా అటువంటి పాటలు పాడటం ఎట్లారా? ఎలాగరా? ఏలాగురా? అని
అన్ని ప్రాంతాల వారు కలిసి నేర్చుకున్న పదం ‘హౌరా?’ అయి ఉంటుంది!
బెంగాల్ గురించి వారు కూడా రాయలేనంత చక్కగా ‘యమహా నగరి
కలకత్తా పురి...నమహో హుగిలీ హౌరా వారధీ ..చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను
మరి’ అని స్పష్టం చేసిన మన
సుందర కవి వేటూరి వారు ఇప్పుడంటే మన మధ్య లేరు గానీ, ఉంటే తప్పక చెవిలో రహస్యం
చెప్పే వారు.....ఆ చిరు త్యాగరాజు మన్నాడే
అని!
.........................................................ఇదో
లేని పాట, రాని పాట, ఈ పూట నా మాట!
( ఈ సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి స్వాగతం
చెప్పే సమయం ఆసన్న మౌతుంటే అయ్యో మన్నాడే గురించి రాయలేకపోయానే అనే సన్నని మూలుగు
నుంచి బయట పడిన నాలుగు మాటలివి, ఎనిమిది వీడియోలు, ఎనిమిది ఆడియోల మూటలివి)