మునుపటి నా మాట
'మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే' పాట పాడుకుంటూ ఆచార్య ఆత్రేయ 'ప్రేమ నగర్' లో ప్రవేశిస్తున్నారు. అక్కడ కొంత దూరంలో 'అనురాగం' కాలనీ లో ఉంటున్న మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి చెవిని పడ్డాయి ఆ మాటలు. 'ఇక్కడి కొచ్చేశాక ఇంకా మనసు-- మనిషీ అంటూ ఏమిటోయ్ ఆత్రేయులూ?' అంటూ సిల్కు పంచె, లాల్చీ దాల్చిన మరు మల్లె పువ్వంటి శాస్త్రి గారు నవ్వేశారు. 'అయ్యా.. నేను మిమ్మల్ని అనుసరిస్తూ వచ్చి వచ్చి ఈ స్వర్గ సీమ లో పడ్డాను. అదీ ఈ సెప్టెంబర్ నెలలోనే. అదీ ఒక్క రోజు తేడాలో. ఎటొచ్చీ మరీ షష్టిపూర్తి చేసుకునీ ఇహ చాల్లే అని మీరు తనువు చాలించేరు. నేను ఇంకొన్నాళ్ళు నా మహా కాయాన్ని, తెలుగు పాట అనే మహా గాయాన్ని మోసుకొచ్చేను.' 'అవును కదూ. నేనా- సెప్టెంబర్ 12 న , నువ్వా 13 న , ప్చ్ ! అయినా తెలుగు పాట అనే మహా గాయం అంటావేం? తెలుగు వారి చేత తన్నులు తినడం ఖాయం!' 'కాకపొతే ఏమిటి చెప్పండి శాస్త్రి గారూ. మీతోనె తెలుగు పాట కదా - అది మీరు లేక ఎటూ దిక్కు తోచక జ్వరం తెచ్చుకునీ సంధి ప్రేలాపన చేస్తూ వచ్చి ఇంక లాభం లేదని కోమాలో పడిపోయింది' 'కోమా నయం కదా, కామా కన్నా' 'కామా వే, కోమా కాదు. ఎందుకంటే సంధి ప్రేలాపన మరీ హెచ్చయ్యింది' 'పోన్లేస్తూ. ఎవరి తరం వారిది.' 'మీరు రాసిన కథలు, మీ పాటలు మళ్ళీ మళ్ళీ చదివిస్తేనే గానీ తెలుగు బాగు పడదండీ' 'అన్నగారు సముద్రాల ఎంతో బిజీ గా ఉంటుంటే కొన్ని పాటలు రాశానని, నిజం చెప్పండనీ ఎందరో నిలదీసే వారు. మీ పేరెందుకు రాలేదు అని గొడవ చేసారు. పోనీ ఇద్దరి పేర్లూ చేర్చవచ్చు కదా అని గొణిగే వారు. ఇదంతా ఎందుకు. పోనీ నువ్వన్నట్టు నాదేదో వేరే తెలుగనుకుంటే దాన్ని పట్టుకునీ నా రచనలు పోల్చుకోవచ్చునే!' 'సముద్రాల వారు చక్కని ప్రాసలు వేస్తారు. మీరు కమ్మటి పదాలు రాస్తారు. ఇదే తేడా. ఇవి రెండూ కలబోసి ఆరుద్ర తన ముద్ర బయట పెట్టేడు. ఇక నేనంటారా-- నేను ఏది రాసినా 'మనసు' పెట్టి రాస్తానని ఒక నమ్మకమేర్పడి పోయింది తెలుగు ప్రజకి. నన్నేకంగా 'మనసు కవి' అన్నారు. అంటే అనననీండి కానీ నేను మాత్రం మిమ్మల్ని 'మన కవి' అంటాను. అంటేమనిషికి నచ్చిన కవి అని.'
0 Comments
అవునా కాదా? అని అడగాల్సింది పోయి ఇంకా 'ఔనా నిజమేనా?' అని ఆశ్చర్యపోయే వారున్నారంటే ఆమె ఈ భూమ్మీద లేదు కనుక సరిపోయింది. ఉంటే మాత్రం 'మట్టిలో మాణిక్యం' లో చలం వదినలా పట్టుకు 'ఝాడించేది'. అంటే 'చండీ రాణి' లా చీల్చి చెండాడేస్తుందని అనుకుంటే తప్పు తప్పు. ఆమె కోపం గబుక్కున పొంగి పడిపోయే పాలవంటిది. ఆమె మనసు వెన్న లాంటిది. ఆమె గాత్రం కమ్మని పెరుగు లాంటిది. ఆమె మాట తీయ తేనియ. ఆమె నటన సెలయేటి ధీమా. వెరసి ఆమె పంచామృత పాళి. పేరు పి. భానుమతి. సెప్టెంబర్ 7 న ఆమె జయంతి. అదేం చిత్రమో 'వర విక్రయం' ఆమె తొలి సినిమా. ఇక మూడోది- 'ధర్మపత్ని'. ఐదో సినిమా 'కృష్ణ ప్రేమ'! ఇవన్నీ ఎంత నిజమో కృష్ణ ప్రేమ టైములోనే ఆమె పడిపోయారన్నది అంతే నిజం. ఎక్కడ? ప్రేమలో! రామకృష్ణ ఆమెలోని కళా తృష్ణ కి గొడుగై నిలిచారు. గృహమే కదా 'స్వర్గసీమ' అనుకునీ సాధారణ దంపతుల్లాగే బతికారు. మధ్య తరగతి 'గృహ ప్రవేశం' వారిది. వారి సంసార 'రత్న మాల' భరణి అనే కొడుకు రూపంలో అవతరించింది. ఆ కొడుకు పేరిట స్థాపించిన 'భరణి' సంస్థ వారికి 'రక్ష రేఖ'. ఇక ఎ.ఎన్.ఆర్ , ఎన్.టీ.ఆర్. వంటి 'అపూర్వ సహోదరులు' ఆమెతో నటించి 'నటీమణులందు ఈ భా.మ వేరయా' అని తేల్చి చెప్పేరు. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|