మునుపటి నా మాట
వెన్న ముద్దలు తిన్నంత మెత్తని గాత్రం , ఆ బాల గోపాలం మెచ్చే గళం - అది మీకు సరస్వతీ కటాక్షం! అందుకో28/8/2011
0 Comments
కొందరు ఆదివారం, మరి కొందరు సోమవారం జన్మాష్టమి వేడుకలు జరుపుకున్నారు. అష్టమి నాడు అదీ అర్థరాత్రి దాటాక పుట్టిన వాడు కనుక ఉత్తరాదిని ఆ తిథి ప్రారంభమై కొన సాగిన ఆదివారం రాత్రి ఆ వేడుక జరుపుకున్నారు. ఏ రోజు సూర్యోదయం వేళకి తిథి-మిగులు ఉంటుందో ఆ రోజు అ తిథికి సంబంధించిన వేడుక జరుపుకోవడం మన ఆచారం. ఆ రకంగా సోమవారం కృష్టాష్టమి అయింది మనకి. కృష్ణాష్టమి వేడుక మహారాష్ట్రలో ఘనంగా జరుగుతుంది. 'దహీ-హండీ' (పెరుగు-కుండ) పేరిట జరిగే ఈ వేడుకలో ఉట్టి పడగొట్టే పిల్లల్ని 'గోవిందా'లంటారు. వీరంతా ఒక 'పిరమిడ్' ఆకారంలో చెట్టపట్టాల్ వేసుకునీ ఒక గుంపు మీంచి మరో గుంపు అధిరోహిస్తూ చివరకి ఒక్కణ్ణి మాత్రమె పైకెత్తుతారు. ఈ లోగా వీళ్ళ మీద సహజంగా వాన పడినా పడక పోయినా నీళ్ళు గుమ్మరిస్తూ ఉంటారు. ఇంత తడుస్తున్నా ఈ గోవిందా గుంపులు పడుతూ లేస్తూనే విజయం సాధిస్తాయి. చివరి బాలుడు ఉట్టి కొట్టడం చూడగానే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. ఈ వేడుక లో లక్ష రూపాయల వరకూ బహుమానాలు ప్రకటిస్తారు. ముంబై నుంచి ఇతర ముంబై ప్రాంతాలకీ, పుణే కి; పుణే నుంచి ఇతర ప్రాంతాలకి ఈ 'గోవిందా'ల్ని బస్సుల్లోనూ,లారీల్లోనూ తరలిస్తూ ఉంటారు. ఇటీవల కొన్ని సంవత్సరాలనుంచి అమ్మాయిలు కూడా ఈ పోటీల్లో పాల్గొంటూ తామేమీ తీసికట్టు కాదని నిరూపించుకుంటున్నారు. కృష్ణుడు వెన్న కోసమో పెరుగు కోసమో ఇలాంటి నిర్మాణం ప్రకటించినా అంతకు ముందే లంకలో రావణాసురుడి ఎదుట ఆంజనేయుడు తోకని చుట్లు తిప్పి పైకి లంఘించడం మనకి తెలిసిన విషయమే. లీలా మానుష వేష ధారి ఏది చేసినా అంతో ఇంతో జ్ఞానదీపం వెలిగించి ఏదో పరమార్థం చూపిస్తూనే ఉంటాడు. ఎంతమందితో ఎందరు కలిసి ఉన్నా చివరికి తనలో ఐక్య మయ్యేది ఒక్కడేనంటాడా? అనంతంగా నేల మీద పరచుకున్న కాగితపు సొమ్ము చివరికి గాలిలో ఒక ముక్కగా తేలుతూ పోతుందంటాడా? ఏ సంస్థలో నైనా పది మంది కలిసికట్టుగా ఒక లక్ష్య సిద్ధి కోసం పని చేస్తే అంచెలంచెలు దాటుతూ గమ్యం చేరవచ్చు అని అంటాడా? ఇటీవల అవినీతి పైన యువత స్పందించిన తీరు అమోఘం. అహింస అనే పధ్ధతి ఒకటుంది సుమా అని నిరూపించిన ఈ యువ సేన వెనుక 'వేయి' వేణువులు మ్రోగించిన కృష్ణుడిలా నిలబడిన 'అన్నా' మనముందు కొత్త గోకులాష్టమి నెలకొల్పాడు. జనలోక్పాల్ అనే చిన్న బెడ్డతో అందంగా కనిపించే 'భ్రస్టాచార్' పులిసిన పెరుగు కుండని పగులగొట్టడం ---కలయో నిజమో వైష్ణవ మాయో? ఎటొచ్చీ తేడా ఏమిటంటే- ఇది తినేందుకు కాదు, విసిరి పారేసేటందుకు. కృష్ణుడికి అర్జునుడు సన్నిహితుడూ,స్నేహితుడూ కావొచ్చు. కానీ బంధుత్వముంది. కుచేలుడు అలా కాదు, ఒక చిన్ననాటి పేద స్నేహితుడు. పైగా అధిక సంతానం భారంగా మోస్తున్న వాడు. కృష్ణుడికి అటుకులే బహుమానంగా ఇచ్చుకున్నవాడు. కృష్ణుడు వాటిని హాయిగా ఆరగించాడు. వెన్న తిని తిని ఒళ్ళు పెంచుకోవడమో అటుకులు ఆరగించి ఒళ్ళు తగ్గించుకోవడమో మీ ఇష్టం అని కృష్ణుడు ఆనాడే మనకి జిం-ఖానా సూత్రం చెప్పాడు. రామావతారంలోనూ అంతే. శ్రీ రాముడు శబరి ఆప్యాయంగా అందించిన ఎంగిలి పళ్ళను ఆనందంగా స్వీకరించాడు. భుజ, బుద్ధి బలంలో దీటైన ఆంజనేయుణ్ణి భక్తుడిగా పొందాడు. ఆంజనేయుడికి శ్రీ రామ నామమే ఎంతో రుచి. అలా ఉండడం ఈ కలియుగంలో సాధ్యమా? ప్రయత్నిస్తే ఎందుకు కాదూ? ఈ ప్రశ్నకి సమాధానం దొరికినా దొరక్క పోయినా మన చిలకలపూడి సీతారామాంజనేయులు ఉరఫ్ సి.ఎస్.ఆర్. కుచేలుడిగా నటించిన మళయాళ చిత్రం 'భక్త కుచేల (1961)' లో ఆయన స్వయంగా గాయకుడైనా నేపథ్య గాయకుడు పాడగా గళం తిప్పుతూ ఉంటే వింతగానూ ఉంటుంది. విశేషం గానూ ఉంటుంది. కనులు చూసినా పాటే- లో ఆ వింతా విశేషం మీ కోసం. ఇది యూ ట్యూబ్ ఉట్టి నుంచి దొరికిన కమ్మటి పెరుగు. పోయిన ఆదివారం సరే 'మధురానగరి' కృష్ణుడు పుట్టాడు. ఈ రాబోయే ఆదివారం 'గోపాలకృష్ణుడు నల్లన గోకులంలో పాలు తెల్లన ' అనే మధుర కంఠం, ఆ 'బాల' గోపాలం ఆనందించిన గళం పుట్టిన రోజు. విశేషం ఏమిటంటే ఆ పాట స్వర కర్త 'హనుమంత రావు'. అంటే ఇదీ శ్రీ కృష్ణాంజనేయ బంధమే. కనులు మూసినా పాటే లో వినండి ముందుగానే. ఆ రోజు మరిన్ని కానుకలు. అందాకా సరస్వతీ దేవీ ! మంచి పాటలు మా మనసుకు తీసుకు రావూ? -డా. తాతిరాజు వేణుగోపాల్ , 24 ఆగస్ట్ 2011 ‘నమో కృష్ణ నమో కృష్ణ’ ‘చిరంజీవ చిరంజీవ’ ‘కృష్ణ పరమాత్మా, జగద్గురూ వందనాలు. ఈ గోకులాష్టమి సందర్భంగా నీకు అభినందనలు’ ‘అంతా బాగానే ఉందా భారతంలో?’ ‘ఏం బాగు కృష్ణా? అంతటా ఓగే. అయినా ఎప్పటిలా పిల్లలంతా ఆనందంగా కింద పడతారు, ఎవడో ఒక్కడు ఉట్టి కొడతాడు.. బహుమానం చేపడతాడు (కనులు చూసినా పాటే- లో ఇటీవల నిన్ను చేరిన మా షమ్మీ చిన్న పిల్లాడిలా చేసిన అల్లరి చూద్దువుగానీ). మళ్ళీ అంతా కలిసి పంచుకునీ మరో ఏడాది కోసం కలలు కంటారు.’ ‘అంతే మరి పిల్లల్లాగే పెద్దలూ రాగ ద్వేషాలూ, కుల మతాలూ, భాషా భేదాలూ లాంటివాటికి దూరంగా ఉండి అంతా కలిసి కట్టుగా ఎదిగితే ‘ప్రేమ’ అనే పెరుగు ‘మమత’ అనే ఉట్టి నుంచి దొరుకుతుంది.’ ‘పిల్లలకైతే సరే- నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా. కానీ పెద్దలే-‘ ‘వారికీ గీతోపదేశం చేసాగా’ ‘కానీ గీత దాటుతున్నారే. అందుకే భక్త కవి పురందర దాసు ‘కృష్ణా నీ బేగనే బారో’ అని కొన్ని వందల ఏళ్ళ క్రితమే కన్నడంలో నిన్ను త్వరగా రమ్మని వేడుకున్నాడు. భక్త కవి అన్నమయ్య ‘ముద్దుకారే యశోద ముంగిట ముత్యము వీడు’ అన్నాడు కదా, అంతటితో ఆగక ‘చిన్నిశిశువు చిన్నిశిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు’ అని అన్నందుకైనా నువ్వు మళ్ళీ ఈ బంగారు భారత భూమిని దర్శించాల్సిందే. కనులు మూసినా పాటే - లో- ఈ మూడు కీర్తనలు వినిపిస్తాను. అది నీకు వేరే చెప్పాలా, గోపాలా?. నువ్వేమో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతరిస్తూనే ఉంటాను అన్నావు. కానీ ఇప్పటి పరిస్థితి ఇక్కడ ఏం బావులేదు. పదాలు తారు మారవుతున్నాయి. దుష్ట రక్షణ, శిష్ట శిక్షణ మాత్రమె కనిపిస్తోంది. Happy Indepence Day to YOU Dear Motherland చిన్ని శిశువు పేరు స్వతంత్రం. పుట్టినది 1947 ఆగస్ట్ 15 న– కన్నది భారత మాత. ఆ రోజుకీ ఈ రోజుకీ మధ్య అరవై పై చిలుకు ఏళ్లు దాటిపోయాయి. అయితే ఇంకా శిశువేమిటీ?. షష్టి పూర్తి చేసుకున్న వృద్ధ మాత కదా. పిచ్చిగానీ – భారతమాత ఒక దేవతా మూర్తి. ఈ శిశువూ అంతే. వీరికి వయసు పెరగదు,తరగదు. ఆ మాటకొస్తే ఒక్క భారత మాత అనే కాదు ఏ దేశమాత అయినా అంతే. వారి స్వతంత్రం కూడా నిత్య శిశువే. మన శిశువుని లాలించాలి.పాలించాలి. కాపాడాలి. లాలి పాడాలి. నవ్వితే ఎందుకు నవ్విందో అని అనుమానించకూడదు. ఆ నవ్వులో శృతి కలిపి ఆనందించాలి. ఏడిస్తే మాత్రం ఎందుకు ఏడ్చిందో తెలుసుకోవాలి. అందుకు పాటు పడాలి. పాట పాడాలి. కుప్పిగంతులు వెయ్యాలి. మంచి మాటలు వల్లె వేయించాలి. ఇదంతా నిరంతరం సాగాల్సిన ప్రక్రియ. మనం అలిసిపోయినప్పుడు మన పిల్లలు చూసుకుంటారు ఆ ఆలనా పాలనా. 4,32,000 సంవత్సరాలు కలి యుగానివి. అందులో అయిదువేల పై చిలుకు గడిచిపోయాయి. భారతంగా, భరత ఖండం గా ఎన్నో రూపాంతరాలు చెందినా తనకంటూ ఉన్న అనితర సాధ్యమైన సంస్కృతితో భారతమాత విశ్వంలో ఎప్పుడూ ముందుండేది. ఎక్కడినుంచి వచ్చిందో గాని ఒక గాలి దుమారం ‘దురాశ’ పేరుతో అడుగు పెట్టి ‘రాజ్య కాంక్ష’ అనే ప్రభంజనంలా ఎదిగి ‘పర పీడన’ అనే తుపాను లా బలపడి భారత మాతను ‘ఇండియా’ గా మలిచి మూడొందలకు పైగా ఏళ్లు భీబత్సం సృష్టించి చివరికి దాచేసుకున్న ‘స్వతంత్రం’ పేరు గల చిన్ని శిశువుని అప్ప చెప్పి తప్పుకుంది. ఆ నేపధ్యంలోనే రెండు ప్రపంచ యుద్ధాలు మానవత్వాన్ని మంట గలపడం కనులారా చూసింది మాత. ఎందరో మహానుభావులు ఫిరంగులకీ, తుపాకీ తూటాలకి, అమానుష చర్యలకీ బలి అయితేనే గాని తన ‘స్వతంత్ర’ శిశువు తిరిగి తనకు దక్కలేదు. ‘గతం నాస్తి’ అని ఆ చేదు గుర్తులు చెరిపేసుకున్నా, తన చిన్ని శిశువుతో సంబరపడుతున్నా అకారణంగా ఇరుగు పొరుగుల చేత దెబ్బలు తింది. అయినా ఓర్చుకుంది. లోకం పోకడ నేర్చుకుంది. తన ‘అస్థిత్వం’ తనకు రక్ష అనుకుంది. ప్రపంచం అంతా తన బాపు గురించి విని బాపురే అనుకుంటే చూస్తూ పొంగి పోయింది. ఇవాళ ప్రపంచం లో తన పాత్ర గొప్పదని తెలుసుకునీ గర్వ పడుతోంది. Click to Zoom ఎప్పుడో 1930ల నాటి కాలంలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం మళ్ళీ అమెరికాకి ఇప్పుడు సంభ వించిందని ఆ రంగం నిపుణుల ఆవేదన! ఎప్పుడూ విననంతగా బంగారం ధర పెరిగిందని అరకు లోయ నుంచి ఎవరెస్ట్ శిఖరం వరకు ఒకటే చర్చ! డాలర్ లోని మధ్యాక్షరం లకారం అంటే లక్ష్మీ దేవి ఆగ్రహించి బయటకు వెళ్ళిపోతే ఇంక మిగిలేదేముంది- డర్ (భయం) తప్ప. పైసా,పరక, అణా, కానీ, దమ్మిడీ లకు ఎప్పుడో కాలం చెల్లిపోతే ఇప్పుడు పావలా కూడా హరీ మంది. రేపో మాపో ‘అర్ధ రూపాయి’ కి కూడా అదే గతి పట్ట వచ్చు. ‘ఈ పిల్లంగోవి వెల ఎంత-అర్థ రూపాయి’ వంటి కొన్నేళ్ళ క్రితం నాటి పాటలు కొన్నాళ్ళకు విచిత్రంగా వినిపిస్తాయి. భూమి చిత్ర విచిత్రంగా ఏర్పడింది. భూలోక వాసులుగా పుట్టడం ఒక భాగ్యమైతే ఒక్కో చోట ఒక్కో భాగ్యాన్ని తమదిగా ఎంచుకునీ భూమిని తమ చేతులతోనే తిప్పుతున్నారు. అందుకే కాలం చాలా వేగంగా పోతోంది. చమురు నిల్వలు ఒక చోట, చెత్తా చెదారం నిల్వలు మరో చోట – శ్రీమంతులు ఒక చోట, గర్భ దారిద్ర్యం మరో చోట. ఆ మాటలు నావి కావు. మీరు ఇప్పుడిప్పుడే విన్నారే (కనులు మూసినా పాటే లో) - మన మధుర గాయని ఎస్.జానకి కల్యాణి రాగంలో మనోహరంగా ఆలపించిన పాట పల్లవి,అనుపల్లవి అవి. ఆ పాట ఎవరు వ్రాసారో – తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోండి. మూడు చరణాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అద్భుత నిర్వచనం పలికిన మహానుభావుడు. స్నేహ బంధం అనకుండా మరుమల్లెల వంతెన అన్నాడు. దానికి కలిమి-లేమి అంతరాలు ఆనబోవన్నాడు. మల్లె,జాబిల్లి,తేనె ఇవన్నీ స్నేహం తరవాతే అని బల్ల గ్రుద్ది మరీ చెప్పాడు. ‘స్నేహం’ గురించి చెప్పమంటే ఎవరికైనా గుండె స్పందిస్తుంది. మొన్న మొన్న మన సిరివెన్నెల కవి ఏమన్నారూ? ‘స్నేహం’ అనే మాటలో చెరో అక్షరం మనం!అనేగా? అంటే స్నేహం లో ఏకాకితనం లేదు. అదో జంట. అది ఆత్మీయత, ప్రేమ కలబోస్తే పెరిగిన పంట. ‘ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో’ అన్నారు ఆత్రేయ. ‘స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం’ అన్నారు సి.నా.రె, అంతకు ముందే గుల్షన్ బావ్రా రాసిన హిందీ పాట లోని మాటలు కొంచెం అటూ ఇటూగా చెబుతూ ( ఈ రెండు పాటల వీడియోలు ‘కనులు చూసినా పాటే’ లో ఉన్నాయి). ‘స్నేహం’ కి భాషాభేదం లేదు కనుక ‘దోస్త్ మేరా దోస్త్, వాస్తవంగా దోస్త్’ అనే మాటలు సిరివెన్నెల కలబోసి ఇచ్చారు. ‘స్నేహం’కి మత భేదం లేదు కనుక సినారె -స్నేహితుడు నవ్వితే అదే రంజాన్ పండుగ అని షేర్ ఖాన్ చేత పలికించారు. స్నేహానికి రంగు-రూపు అనే భేదం లేదనిచిలక-కోయిల ల అనుబంధాన్ని కథలాగ చెప్పారు సినారె (కనులు మూసినా పాటే లో వినగలరు). ‘నీవుంటే వేరే కనులెందుకు’ అని ఆరుద్ర ఒకనాడు అన్నది ఒక బధిరుడు తన ఆవేదనని తన మిత్రుడికి వెళ్ళబోసుకోవడానికే. ‘భానునివీడని ఛాయలా నీ భావములోనే చరింతునోయి సఖా’ అని శ్రీశ్రీ స్త్రీ-పురుష స్నేహ బంధాన్ని ధైర్యంగా ప్రవచించింది చూపు కోల్పోయిన వారిని ఉద్దేశించే. స్నేహానికి హెచ్చు-తగ్గులు లేవనడానికి ‘మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ’ అని ఆటపట్టిస్తూనే ఒక మిత్రుడు తన మిత్రుడితో తన అనుబంధాన్ని చెప్పుకుంటాడు (కనులు చూసినా పాటే లో చూడవచ్చు). |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|